12, ఆగస్టు 2012, ఆదివారం

దరిద్రం యెలా వుంటుంది?


దరిద్రం యెలా వుంటుంది?
చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ  కష్టం మరోటి వుండదంటారు.
కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు  ఇద్దరు కుర్రాళ్ళు.
తుషార్  హర్యానా లో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు ఉద్యోగాలు చేసాడు. డబ్బుకు లోటులేని జీవితం గడిపాడు.
మరో కుర్రాడి పేరు మట్. పేరు చూసి వేరే దేశం వాడని పొరబడేవీలుంది. కానీ మన తోటి భారతీయుడే. తలిదండ్రులతో కలసి చిన్నతనంలోనే అమెరికా వెళ్లాడు. అక్కడే చదువుసంధ్యలు గట్రా పూర్తిచేసుకున్నాడు.
ఈ ఇద్దరికీ ఇండియా దటీజ్ భారత్కు తిరిగిరావాలని చిరకాల  కోరిక. చివరికి ఎలాగయితేనేం మాతృదేశానికి వచ్చేసారు. బెంగళూరులో ఓ ప్రాజెక్టులో చేరారు. ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఒకే కంచం ఒకే మంచం’ అనే తీరుగా కలగలసిపోయి  ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఇద్దరి ఆశలు ఒకటే. ఆశయాలు ఒకటే. ఇది మరో కారణం.
హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. అలా గడవడం, గడపడం వారికి సుతరామూ ఇష్టం లేదు. అలా అయితే వారిని గురించి ఇంతగా  రాయాల్సిన పనే లేదు.
ఒక ఐడియా జీవితాన్నిమారుస్తుందంటారు.
దేశంలో దారిద్యం గురించిన ఒక గణాంకం వారని ఆకర్షించింది. అదేమిటంటే భారతదేశంలో పేదవారు చాలామంది రోజుకు అక్షరాలా ఇరవై ఆరు రూపాయల ఆదాయంతో బతుకు బండి లాగిస్తున్నారని. అదెలా సాధ్యం ?’ అన్నది వారి మదిలో మెదిలిన మొదటి ప్రశ్న. అదెలా సాధ్యమో తెలుసుకోవాలన్నదికలిగిన కుటుంబంలో పుట్టిన  వారికి కలిగిన మరో  ఆలోచన.
అసలే మార్పు కోరే తత్వం. ఆలోచనలను అమలు చేయడంలో ఇద్దరిదీ ఏకత్వం. ఇక అడ్డేముంది. రాజభోగాలు వొదులుకుని సన్యసించిన బుద్ధుడిలా ఇద్దరూ కలసి సగటు భారతీయుడు యెలా బతుకుతున్నాడో అలా బతకాలని  బయలుదేరారు. చదువుకున్నవారు కనుక ఈ ప్రయోగానికి ముందు అన్ని లెక్కలు వేసి చూసుకున్నారు.
సగటు భారతీయుడి సగటు ఆదాయం నెలకు 4,500  రూపాయలు. అంటే రోజుకు  నూట యాభయ్ రూపాయలు. ప్రపంచ వ్యాప్తంగా జనం వారి నెలసరి ఆదాయంలో మూడో వంతు ఇంటి అద్దెకు ఖర్చు పెడతారు. ఆ లెక్కన రోజు రాబడి నూట యాభయ్ లో మూడో వంతు తీసేసి వందరూపాయలతో రోజు గడపాలనే ప్రయోగానికి పూనుకున్నారు.  దేశ జనాభాలో 75  శాతం మంది ఇంతకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న విషయం  వారికి తెలియంది కాదు.
ఖరీదయిన అపార్టుమెంటును వొదిలేసారు. ఇంట్లో పనిచేసే పనిమనిషిని వొప్పించి ఆమె వుంటున్న ఇరుకు గదిలోకి  మారిపోయారు. మొదట ఈ ఇద్దరి తరహా చూసి పిచ్చివాళ్లనుకుంది. కానీ, వారి దీక్ష, పట్టుదల చూసి చలించి పోయింది. 


ఆ  ఇద్దరే  ఈ ఇద్దరు
కొత్త జీవితంలో వారికి ఎదురయిన ప్రధాన సమస్య చౌకగా తిండి సంపాదించు కోవడం ఎలాగా అన్నది. అంత తక్కువ ఆదాయంలో బయట భోజనం చేయడం అన్నది అసాధ్యం. దాబాల్లో తినాలన్నా కుదరని పని. పాలూ, పెరుగు, నెయ్యి,వెన్న అన్నింటికీ స్వస్తి చెప్పారు. విదేశాల్లో చదువుకున్నారు కనుక స్వయం పాకం వారికి వెన్నతో పెట్టిన విద్య. కానీ వంట వండడం వచ్చుకాని, వండడానికి వనరు లేదు. అందుకని చౌకకు చౌక, మంచి పోషక విలువలు వుండే గింజలను ఉడకబెట్టి ఆహారంగా తీసుకునే  పద్దతికి శ్రీకారం చుట్టారు. అలాగే పార్లే బిస్కెట్లు. కేవలం ఇరవై అయిదు పైసలు పెడితే ఇరవై ఏడు కేలరీలు. అరటి పండు ముక్కల్ని వేయించి బిస్కెట్లతో కలిపి తింటే ఆరోజు విందు భోజనం చేసినట్టు.
రోజుకు వందలో బతకాలి కాబట్టి వారికి వారే కొన్ని బంధనాలు, పరిమితులు విధించుకున్నారు.  అయిదు కిలోమీటర్లకు  మించి బస్సులో ప్రయాణం భారం అని తెలుసు.  అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పరిస్తితి వుంటే నటరాజా సర్వీసే గతి. నెలవారీ విద్యుత్ వాడకాన్ని బాగా తగ్గించుకున్నారు. రోజుకు అయిదారు గంటలే లైట్లు, ఫాన్ వాడేవారు. కొంత విద్యుత్ ను కంప్యూటర్లు, మొబైల్ ఫోనులు చార్జ్ చేసుకోవడానికి వీలుగా పొదుపు చేసుకునే వారు. ఒక్క లైఫ్ బాయ్ సబ్బు కొని దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరు వాడుకోవాల్సిన పరిస్తితి. కోరి తెచ్చుకున్న కష్టాలే కనుక చింతించాల్సిన పరిస్తితి ఎదురు కాలేదు.
రోడ్డు వెంట  వెడుతున్నప్పుడు అద్దాల అరమరాల్లోనుంచి అనేక రకాల వస్తువులను, దుస్తులను చూస్తూ వెళ్ళేవారు. వాటిని కొనగల తాహతు తమకు లేదని తెలుసు కనుక వాటిల్లో అడుగుపెట్టేవారు కాదు. ఇక సినిమాలు చూడడం అనేది స్తితికి మించిన పని. వారు కోరుకున్నది ఒక్కటే. అనారోగ్యం పాలు కాకుండా వుంటే  చాలని.
వారు ఎదుర్కోవాల్సిన మరో పెద్ద సవాలు అలాగే వుండి పోయింది. అధికారికంగా ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకు తెలియచెప్పిన వివరాల ప్రకారం దార్రిద్య్ర రేఖకు దిగువన వుండేవారి ఆదాయం పట్టణాల్లో రోజుకు 32 రూపాయలు అయితే, గ్రామాల్లో 26 రూపాయలు.
ఇదేదో తేల్చుకోవాలని  ఇద్దరూ కలసి మట్ పూర్వీకుల గ్రామానికి వెళ్లారు. అది కేరళలో వుంది. రోజుకు 26  రూపాయలతో గడిపే జీవితాన్ని కరుకాచల్ అనే ఆ వూర్లో మొదలు పెట్టారు. చౌకగా దొరికే ఉప్పుడు బియ్యం, అరటి పండ్లు, పాలు కలపని బ్లాక్ టీ - ఇవే ఆహారం.
కానీ అంత తక్కువ డబ్బుతో జీవించడం చాలా కష్టమని వారికి తేలిపోయింది. అసలే అరకొరగా వున్న కొన్ని సౌకర్యాలను కూడా  వొదిలేసుకున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవడానికి బట్టల సబ్బు కొనడం మానేశారు. మొబైల్, కంప్యూటర్ పక్కన పడేసారు. జబ్బున పడితే ఎలా అనే భయం ఒక్కటే  వారిని అహరహం వేధించేది. సంపన్న కుటుంబంలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఇరవై ఆరేళ్ళ యువకులకి దరిద్రంలో బతకడంఅన్న ఈ అనుభవం భరించలేనిదిగా బాధించేది.                   

అయినా పట్టిన పట్టు విడవకుండా వారు తాము అనుకున్నది సాధించారు. దీపావళి నాడు వారి ప్రయోగం ముగిసింది. ఆ రోజున వారు తమ స్నేహితులకు ఉత్తరాలు రాశారు.
మేము మళ్ళీ మా మామూలు జీవితాల్లోకి అడుగు పెడుతున్నాం. మా ప్రయోగం ముగియడానికి ముందు రోజు, ఇన్నాళ్ళుగా మేము ఎవరితోనయితే కలసి మెలసి జీవించామో వారంతా కలసి మాకు వారి స్తాయిలో విందు భోజనంఏర్పాటు చేశారు. ఆ భోజనంలో ఎన్ని పదార్ధాలు వున్నాయో తెలియదు కాని ప్రతిదాంట్లో ప్రేమ.అభిమానం,ఆప్యాయతా కూరిపెట్టారని మాత్రం చెప్పగలం. ఇంతవరకు అలాటి భోజనం చేయలేదని కూడా చెప్పగలం.
కానీ, ప్రతి ముద్దా నోట్లో పెట్టుకుంటున్నప్పుడు  ఒక వాస్తవం కనుల ముందు కదలాడేది. ఈ మాత్రం భోజనం అన్నది కలగా మిగిలిన మరో నలభయ్ కోట్ల  మంది భారతీయులు ఈ దేశంలో మనతో పాటే జీవిస్తున్నారు. వారి కల నెరవేరడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలియదు.
మేము మళ్ళీ మా విలాస జీవితాల్లోకి అడుగుపెడుతున్నాము. కానీ వాళ్లు మాత్రం ఆ గర్భ దారిద్ర్యంలోనే వుండిపోతున్నారు. రేపు గడవడం కాదు ఈ క్షణం గడవడం యెలా అన్న బతుకులు వాళ్లవి. తీరని కోరికలు, అపరిమితమయిన పరిమితులనడుమ వారు తమ జీవన పోరాటాన్ని కొనసాగిస్తూనే వుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వారి ఆకలి పెద్దది. తీరే మార్గం అతి చిన్నది.     
ఈ ప్రయోగం తరువాత మా ఆలోచనల్లో మరింత మార్పు వచ్చింది.
ఇన్నేళ్ళుగా అనేక వస్తువులు జీవితావసరాలుగా భావించి వాడుతూ వచ్చాము.
మనిషి బతకడానికి ఇన్నిన్ని సబ్బులూ, షాంపూలు అవసరమా? వారాంతపు సెలవు దినాల్లో బయటకు వెళ్లి ఖరీదయిన హోటళ్ళలో అతి ఖరీదయిన విందు భోజనాలు చేయకపోతే బతుక్కి అర్ధం మారిపోతుందా? బ్రాండెడ్ దుస్తులు ధరించక పోతే జనం మనల్ని గుర్తించరా?
స్తూలంగా ఆలోచిస్తే మనం ఇంత సంపన్న జీవితాలకు అర్హులమా? ఇన్నిన్ని వైభోగాలు అనుభవించి ఆనందించే అర్హత వుందా? కొందరు గర్భ దరిద్రులుగా, మరికొందరు ఆగర్భ శ్రీమంతులుగా జన్మించడానికి కేవలం వారి వారి అదృష్టాలే కారణమా?
సౌకర్యాలు, సదుపాయాలూ నిత్యావసరాలుగా పరిగణించే జనం ఒక పక్కా, పూటగడవడం యెలా అని అనుక్షణం  మధన పడే ప్రజలు మరో పక్కా వుండడం సృష్టి విచిత్రమా? ప్రకృతి వైపరీత్యమా?
ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగల వయస్సు మాకు లేదు. కానీ వున్న పరిస్తితిని అవగాహన చేసుకోవాలనే తాపత్రయం మాత్రం మాకుంది.
చివరగా మరొక్క మాట. ఈ ప్రయోగం ద్వారా సాధించింది ఏముంది అంటే వుంది. ఒక కఠోర వాస్తవం మాకు బోధపడింది.
ఇన్నాళ్ళుగా, ఇన్నేళ్ళుగా మేము పేదవారిని పరాయివారిగా చూసాము. కానీ మేము వారితో గడిపిన రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వారు  మమ్మల్ని అలా చూడలేదు సరికదా అక్కున చేర్చుకుని ఆదరించారు. నిజానికి పేదలం మనమే. అన్నింటికన్నా  ముందు చేయాల్సిన పని ఏమిటంటే మనలో వున్న  ఈ పేదరికాన్నిరూపుమాపుకోవడం. (12-08-2012)

(PHOTO AND CONTENT  COURTESY - HINDU)



6, ఆగస్టు 2012, సోమవారం

సంగీత ధృవ నక్షత్రం – డాక్టర్ శ్రీపాద పినాకపాణి


సంగీత ధృవ నక్షత్రం – డాక్టర్ శ్రీపాద పినాకపాణి 



డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్. వెయిట్ లిఫ్టర్. ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ పుణికి పుచ్చుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడుపుతున్న  అరుదయిన వ్యక్తే  డాక్టర్ శ్రీపాద పినాకపాణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుగడ్డ గర్వించదగిన  పదహారణాల తెలుగుబిడ్డ.
ఆగస్టు మూడోతేదీ శుక్రవారం నాడు కర్నూలు పట్టణంలో ఈ శతవసంత సంగీతకారుడి సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్తానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎల్ వీ సుబ్రహ్మణ్యం  అక్షరాలా పదిలక్షల వెయ్యినూటపదహార్ల చెక్కును పినాకపాణి గారికి అందించారు. ‘గాన విద్యా వారధి’ అనే బిరుదుతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయశాఖ  మంత్రి శ్రీ ఏరాసు ప్రతాపరెడ్డి, సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ – శ్రీ పినాక పాణికి స్వర్ణ కంకణం బహుకరించారు.  శ్రీయుతులు నేదునూరి కృష్ణ మూర్తి, మల్లాది సూరిబాబు వంటి సంగీత విద్వాంసులు అనేకమంది శ్రీ పాద పినాకపాణి శత వసంత ఉత్సవంలో పాల్గొన్నారు. కొంత ఆలస్యంగా అయినా సంగీత ధృవ నక్షత్రాన్ని గుర్తించి గౌరవించిన  సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ పినాకపాణితో తన అనుభూతులను శ్రీ ఆర్ వీ వీ కృష్ణారావుగారు మననం చేసుకుంటున్నారిలా.            
“మీకు సంగీతం బాగా ఇష్టం కదా.  తెలుగు నాట మీకు ఏ విద్వాంసులు ఇష్టం అని వో సారి వొకాయన నన్ను అడిగారు. వెంటనే డాక్టర్ శ్రీపాద పినాక పాణి అని చెప్పాను.  పాణి గారు ఎంత గొప్పవారో మాటల్లో చెప్పడం కష్టం. నేను మొదటి సారి పాణి గారిని చూసింది 1968  లో.
“రాజధానీ నగరంలో  రెండు సంగీత కళాశాలలు వున్నాయి. ఒకటి సికింద్రాబాద్ లో, రెండోది హైదరాబాద్ లో. సికింద్రాబాద్ కాలేజీకి నూకల చిన్న సత్యనారాయణ గారు ప్రిన్సిపాల్ అయితే, హైదరాబాద్ కాలేజీకి హిందుస్తానీ విద్వాంసులు దంతాలే గారు ప్రిన్సిపాల్. అప్పట్లో రెండు  కాలేజీలు కలసి రవీంద్రభారతిలో  త్యాగరాజ స్వామి ఉత్సవాలు చేసేవారు.  ఉదయం నుంచి ప్రసిద్ధ విద్వాంసుల కచేరీలు మొదలయ్యేవి. ఇక రోజంతా అక్కడే గడపడం. పక్కనే వున్న  గోపి హోటల్లో టిఫినూ, భోజనమున్నూ. 
“ఈ ఉత్సవాల్లో ఓ  రోజు సంక్రాంతి వచ్చింది.  ఆవేళ  ఉదయం పదకొండు గంటలకు కోటి శ్రీ కృష్ణదేవరాయ ఆడిటోరియం లో పినాకపాణి గారి సోదాహరణ ప్రసంగం,  కర్ణాటక సంగీతంలో  నెరవు (అరవంలో నెరవల్) స్వరకల్పన  ఈ రెండింటిపై . ఆ రోజు హాజరు కాని సంగీత అభిమానులది దురదృష్టమనే చెప్పాలి.  నాలుగు గంటలకు పైగా పాణి గారు అద్భుతమైన  ప్రసంగం చేసారు.  కళ్యాణి రాగంలో ‘మది దేహి’ అనే కీర్తనలో ‘పతిత పావన’ అనే చోట  నెరవు, స్వరకల్పన గురించి.  నిజంగా అమ్మవారు ప్రత్యక్షమైన  అనుభూతి కలిగింది అందరికి.  పండగ విందు అక్కడే దొరికింది.  ఇల్లస్ట్రేటెడ్  వీక్లీ  పినాక పాణి మీద కవర్ పేజి స్టొరీ ఇచ్చింది.  జి ఎన్ ఎస్ రాఘవన్ గారు రాసారు. తదనంతర కాలంలో  ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసులో చేరిన నాకు రాఘవన్  దగ్గర పని చేసే అవకాశం లభించింది.  ఆయన ఆకాశవాణి  వార్తా విభాగానికి డైరెక్టర్ గా పని చేసారు.  ఆయనకు పినాకపాణి సంగీతం అంటే అమిత ఇష్టం.  టూర్ వేసుకొని ఆంధ్రకు వచ్చి కర్నూలు  వెళ్లి ఆయనతో గడిపే వారు.
“మ్యూజిక్ అకాడెమి పాణి గారిని  ‘సంగీత కళానిధి’ బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.   పినాక పాణి గారికి రావలసిన సత్కారాలన్నీ వచ్చాయి. దీనితో పాటు  భగవదనుగ్రహం కూడా.   నూరేళ్ళు పూర్ణాయుర్దాయం  లభించింది.  నేదునూరి, నూకల, వోలేటి, గోపాలరత్నం వంటి శిష్యులు, మల్లాది సూరిబాబు, శ్రీరామ్, రవి కుమార్ వంటి ప్రశిష్యులు ఆయన బాణీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకన్న  కావల్సినదేముంటుంది ?  1990 లో ఆయనకు  తొంభయి ఏళ్ళు పూర్తయిన సందర్భంలో కర్నూలులో  కొంత మంది విద్వాంసులు వెళ్లి ఆయనకు పాద పూజ చేసారు. ఆయన పాడిన ఓ  కచేరి సీడీగా తెచ్చారు.
“పినాకపాణి గారికి కొన్ని నిర్దిష్టమయిన  ప్రమాణాలు వున్నాయి. వాటితో రాజీపడే వారు కారు.  బెజవాడలో  మా సభ త్యాగరాజ సంగీత కళా సమితి  తరఫున ఆయన్ని  1986 లో ఘనంగా సత్కరించాము.  అప్పుడు ఆయన ధర్మపురి రామమూర్తి తో కలసి కర్నూలు  నుంచి బస్సులో వచ్చారు. సన్మానం అయిన తర్వాత  సుధారఘునాథన్ కచేరి పెట్టాము.  చివరి దాక కూర్చున్నారు.  మర్నాడు కూడా వున్నారు.  ఆ రోజు మరో ప్రసిద్ధ విద్వాంసులు మహారాజపురం సంతానం కచేరి. కచేరీకి  రమ్మనమని పిలిచాం. రానని మొండి కేసారు. ఎందుకని అడుగుతే ‘వాడు డబ్బు మనిషి. విద్వత్తుని  నిర్మొహమాటం గా అమ్ముకుంటున్నాడు. వాడు ఎంత గొప్పగా పాడినా అనవసరం’ అని అన్నారు. ఇక సంగీతానికి వస్తే ‘అసలయిన సంగీతం   కావేరి నది వొడ్డున వుంది’ అని చెప్పారు.  అందుకనే కాబోలు  ‘పాణి  గారిది తంజావూరు బాణీ’ అంటారు. ‘మీ గురువు ఎవర’ని అడిగితే ‘నా తల్లి’ అని చెపుతూ వుంటారు.  చిన్నప్పుడు తల్లి పాడే తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలే,   డాక్టర్ అయిన తనని సంగీతం వయిపు లాక్కుని వెళ్లాయని పాణి గారు చెపుతూ వుంటారు. సంగీతం ఆంధ్ర దేశంలో వ్యాప్తి చెందాలంటే వొకే వొక సూత్రం ఉందంటారు పాణి గారు. ప్రతి వూళ్ళో దేవాలయంలో ప్రాతః కాలంలో నాదస్వరం వాయిద్యం విని పించాలన్నది ఆయన కోరిక. నాదస్వరానికి మించింది మరోటి లేదన్నది ఆయన విశ్వాసం. ఉదయం పూట నాదస్వరం వింటే సంగీతంపై  అభిమానం కలుగుతుందని,  అప్పుడే తెలుగు నాట కర్నాటక సంగీతం వైభవంగా పరిఢవిల్లుతుందని అనే వారు. 
‘శతాయుష్మాన్ భవ’ అని దీవిస్తారు. కోటికి వొకరి కూడా లభ్యం కాని ఆ అదృష్టం పినాకి పాణి గారికి భగవంతుడు ప్రసాదించాడు. దానితో పాటే మనందరికీ మరో వరం అనుగ్రహించాడు. అదేమిటంటే ఆయనకు సమకాలికులుగా మనగలిగిన మహద్భాగ్యం. (06-08-2012)

5, ఆగస్టు 2012, ఆదివారం

వెంపటి చిన సత్యం గారి గురించిన మరి కొన్ని విశేషాలు


వెంపటి చిన సత్యం గారి గురించిన మరి కొన్ని విశేషాలు


వెంపటి చిన్న సత్యం గారు చాలా బాగా పాడతారు. మంచి చిత్రకారుడు కూడా. మాస్టర్ గారికి వో బలమైన కోరిక వుండేది, కూచిపూడి నాట్యం మీద  ప్రామాణికమయిన ఓ మంచి  పుస్తకం రాయాలని.  కూచిపూడి నృత్య భంగిమలు, ముద్రలు అన్నీ చాలా బాగా వేసి  నేర్చుకొనే వారికి అర్ధమయ్యేలా ఓ క్రమంలో  పెట్టారు. వాటి ఆధారంగా కూచిపూడి చరిత్ర, నృత్యంపై  పుస్తకం రాయాలని చాలా తపన పడ్డారు.  నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్తాను, దాన్ని ఇంగ్లీష్ లో రాయించాలి’ అని నాతో చెప్పారు. ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో మా గురువు గారు అండవల్లి సత్యనారాయణ  గారు ఇంగ్లీష్ లో గొప్పగా రాస్తారు కాబట్టి ఆయనే ఇందుకు సమర్ధులని చిన్న సత్యం గారు అనుకొన్నారు. అండవల్లి మాస్టర్ కు సంగీతం డాన్సులో కూడా ఆసక్తి  వుండడంతో ఆయన కూడా ముందుకు వచ్చారు. మరో వ్యక్తి పెమ్మరాజు సూర్యారావు గారు.  బెజావాడ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయ్యారు.హిందూ పత్రికకు మ్యూజిక్ రివ్యూ లు రాస్తారు . అలాగే చెన్నై నుంచి వచ్చే శృతి ఇంగ్లీష్ మాస పత్రికకు సీనియర్ కరస్పాండెంట్  కూడా.  అండవల్లి గారు, సూర్యారావు గారు మంచి మిత్రులు.  ఇద్దరు నాకు సన్నిహితులే. సూర్యారావు గారు  వెంపటి వారి టీమ్ లో ‘వోకల్’  పాడే వారు. ఇద్దరు కలసి చిన్న సత్యం గారితో రోజుల తరబడి చర్చలు జరిపే వారు. మద్రాసు బీచ్ లో  కూర్చొని పుస్తకం ఎలా రాయాలా అని తర్జన భర్జనలు పడ్డారు.  మాస్టర్ కోరిక తీరక పోయినప్పటికీ,  అండవల్లి గారు, సూర్య రావు గారు కలసి  చిన్న సత్యం గారి పై ఓ అద్భుతమయిన పుస్తకం ఇంగ్లీష్ లో రాసారు. అదే Mastero with a mission. మాస్టర్ అభిమతానికి అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో పుస్తకం వచ్చింది.
చిన్న సత్యం గారు నట్టువాంగంతో పాటు అప్పుడప్పుడు మిగతా వారితో కలసి పాడే వారు. ఆయన స్వరం ఎంతో శ్రావ్యంగా వుండేది.   సారి హైదరబాద్  కేశవ్ మెమోరియల్ స్కూల్లో ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రోగ్రాం కి పాడవలసిన గోపాలంగారు రాలేదు.  చిన్న సత్యం గారే మొత్తం పాడేసారు,   అప్పుడప్పుడు నట్టువాంగం బాధ్యతని మహంకాళి  మోహన్ కి అప్పచెప్పి. ఏ వెలితి కనపడలేదు. చిన్న సత్యం గారు స్వతహాగా శాంతస్వభావులయినా ప్రోగ్రాం విషయం లో చాలా కఠినంగా వుండేవారు. ఆయన్ని చూస్తే  మొత్తం ఆర్టిస్టులంతా భయభక్తులతో మెలిగే వారు. నలభయిమంది టీంలో ఇరవయి మంది ఆడపిల్లలు వుండేవారు. చాలా మంది పెద్ద ఇంటి పిల్లలే.  మాస్టర్ మీద భరోసాతో ఆడ పిల్లల్ని పంపించే వారు. ఎక్కడా  క్రమశిక్షణకు భంగం కలిగేది కాదు. ఏదయినా  పొరపాటు ఆయన దృష్టికి వస్తే వెంటనే పంపించేసేవారు. ఎవరయినా సరే.  మల్లిక్బి గోపాలం, లోకనాథశర్మ, సూర్యారావు  ఆయన టీంలో పాడేవారు. ఓసారి లోకనాథ శర్మ శ్రద్ధగా పాడలేదని వదిలేసుకొన్నారు. భుజంగరాయ శర్మ పట్రాయని సంగీత రావుగారు, చిన్న సత్యంగారితో చివరిదాక వున్నారు. నృత్యనాటకాలన్నిటికీ  భుజంగరాయ శర్మ స్క్రిప్ట్ అయితే సంగీత రావు గారు మ్యూజిక్ సమకూర్చే వారు. స్క్రిప్ట్ , సంగీతం ఇంటికి వచ్చిన వారందరికీ వినిపించి వారి సలహాలు తీసుకొనే వారు. కనకదుర్గతో పాటు అప్పడప్పుడు వేదవతి ప్రభాకర రావు గారు కూడా పాడే వారు. ఫ్లూట్  నాగరాజన్,  మృదంగం గోవిందరాజన్, సంగీతరావు వీణతో  ఆర్కెస్ట్రా నిర్వహిస్తూ  ప్రోగ్రాంకి ప్రాణం పోసేవారు.  అలాగే మేకప్, లైటింగ్  విషయంలో కూడా రాజీపడేవారు కాదు. చిన్న సత్యం గారు వచ్చేంత  వరకు కూచిపూడి నృత్యాలు చాలా క్రూడ్ గా  ఉండేవి. ఆహార్యం, లైటింగ్, సంగీతం ఇవన్నీ పాత కాలం నాటి పధ్ధతి లోనే. ఎవరికీ పట్టేది కాదు. చిన్న సత్యం గారు కూచిపూడి తుప్పు వదలగొట్టారు.  భరతనాట్యం, ఒదేస్సి, మణిపురి నృత్యాల కంటే  పైమెట్టులో ఉంచారు.  ఆయన చేసిన ప్రయోగాలన్నీ కూచిపూడి గౌరవాన్ని, ఖ్యాతిని పెంచినవే.  మొదట్లో ఆయన్ని విమర్శించిన వారంతా ఇప్పుడు ఆ పద్ధతులే ఫాలో అవుతున్నారు. కూచిపూడి మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి ఆయినా చిన్న సత్యం పేరే భావి తరాలకు గుర్తుండి పోతుంది. (శ్రీ ఆర్ వీ వీ కృష్ణారావు గారు.)