4, ఆగస్టు 2012, శనివారం

నృత్య దాన కర్ణుడు


నృత్య దాన కర్ణుడు
ఇటీవల కన్నుమూసిన నృత్య దాన కర్ణుడు వెంపటి చిన సత్యం గారి గురించి ఆర్ వీ వీ కృష్ణారావు గారు కలబోసుకున్న తలపుల్లో కొన్ని.  


వెంపటి చిన్న సత్యం గారు పోయారని టీవీ చానల్స్ లో స్క్రోల్లింగ్ చూడగానే కొంత సేపు మా ఇంట్లో స్తభ్ధత ఏర్పడింది.  మా ఆవిడ నేను కొంతసేపు బాధ పడ్డాము. క్రితం ఏడాది వో ప్రోగ్రాములో
చూసినప్పుడు బాగా పండి పోయి కనిపించారు. ఎప్పుడేనా రాలి పోయేలా కనపడ్డారు. జ్ఞాపకం కూడా బాగా తగ్గినట్టు అనిపించింది.
"చిన సత్యం గారితో  సాన్నిహిత్యం నా సుకృతం. నేను బెజవాడలో పనిచేసే రోజుల్లో   వో పదిహేను  సంవత్సరాలకు పైగా చిన్న సత్యం గారితో చాలా సన్నిహితంగా  మెలిగాను. ఆయన బెజవాడ వచ్చారంటే చాలు మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళే వరకు ఆయనతోటే వుండేవాడిని, భోజనం పడకతో సహా.  ఎప్పుడు వచ్చినా  మమత హోటల్ లోనే  దిగే వారు. ఎన్నెన్నో విషయాలు,  నాకు సంబంధం లేనివి కూడా  నాతో చెబుతుండేవారు. బెజవాడలో మా కొక సభ వుండేది,   త్యాగరాజ సంగీత కళా సమితి అని.  మాస్టారు ప్రోగ్రాములన్నీ అక్కడ పెట్టేవాళ్ళం.  మొదటిసారిగా  నేను చిన్న సత్యం గారిని కలిసింది రైల్లో. 1971 లో   వుద్యోగంలో చేరిన కొత్తల్లో  వో సారి ఢిల్లీ నుంచి  జీ టీ ఎక్స్ ప్రెస్ లో  హైదరాబాద్ వస్తున్నప్పుడు కలిసాం. పొద్దుటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు  ఏదో మాట్లాడుకుంటూనే  వున్నాము.  ఆ తర్వాత రెండు మూడు రోజులకు రవీంద్ర భారతిలో హేమ మాలిని డాన్స్  ప్రోగ్రాం. మాస్టారు నట్టువాంగం.  మీరూ  రండి’ అని పిలిచారు.  ప్రోగ్రాం కి  వెళ్ళాను. చాలా మంది జనం వున్నారు.  సత్యం గారిని పట్టుకోవడం  కష్టమే.  పైగా టికెట్ కొనకుండా వూరికే చూడడానికి వచ్చిన ప్రేక్షకుడిని.  మొత్తానికి మాస్టర్ గారికి కబురు పెట్టడం ఆయన బయటకు వచ్చి నన్ను తీసుకెళ్ళి కూర్చో పెట్టడం నాకు బాగా గుర్తు.  తరవాత నాలుగేళ్ళకు మళ్ళీ కలిసాం.  అప్పుడు ఆయన,  ‘శోభ నాయుడు ప్రోగ్రాం  బెజవాడ  మీ సభలో పెట్టండి’ అని కోరారు.  అల్లాగే కానీ, మా దగ్గర డబ్బులు పెద్దగా లేవ’ని చెప్పాను.
‘డబ్బు వద్దు. మీరు మంచి పబ్లిసిటీ ఇవ్వండి. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు వుంది’ అని అన్నారు.  మద్రాస్ నుంచి పోస్టర్లు కొట్టించి పంపారు. మేము చాలా బాగా ఆర్గనైజ్ చేశామనే చెప్పాలి.   మంచి కవరేజే వచ్చింది.  తర్వాత  శోభానాయుడు చాలా గొప్ప కూచిపూడి డాన్సర్  అయ్యారు. మాస్టారుకి  చాలా ఇష్టమయిన స్టూడెంట్  శోభానాయుడనే చెప్పాలి. ఆ అమ్మాయికి తన విద్వత్ అంతా ధార  పోశారు. ఆమె చేత  ఆంధ్ర మెట్రిక్  కట్టించి బెజవాడలోనే   పరీక్ష రాయించారుతన తదనంతరం  కూచిపూడి అకాడెమికి ఆమెను వారసురాలిని చెయ్యాలనుకున్నారు కూడా.   కానీ,  శోభానాయుడు తర్వాత హైదరాబాద్ లో  వేరే అకాడెమి పెట్టుకొన్నారు.  మాస్టారుకి అదో పెద్ద షాక్.
"తదాదిగా, నేను మాస్టారుతో మమేకం  అయ్యాను. బెజవాడ  వస్తే మా ఇంటికి వచ్చేవారు. వోపూట   భోజనం చేసే వారు కూడా.  శ్రీనివాస కళ్యాణం,  రుక్మిణి కళ్యాణం,  క్షీరసాగర మధనం, హరవిలాసం, చండాలిక నృత్య రూపకాలతో పాటు, ఆయన శిష్యుల సోలో పెర్ఫార్మెన్సులు ఎన్నో పెట్ట్టించాము.   ఎప్పుడూ ఇంత ఇవ్వమని అడగలేదు. మా దగ్గర ప్రోగ్రాం  చేస్తే ఆయనకు రెండు మూడు వందల కంటే మిగిలేది కాదన్న విషయం నాకూ  తెలుసు. బెజవాడలో ప్రోగ్రాం అంటే  కూచిపూడి నుంచి ఆయన బంధు మిత్రులందరూ వచ్చేవారు.  వాళ్ళనందరినీ వూరికి  పంపించమని అడగడానికి ఎంతో మొహమాట పడేవారు. 
సభ నిర్వహించడం నాకు తెలుసు. మా వాళ్ళందరికీ నా ప్రోగ్రాం  చూడాలని వుంటుంది. ఇక్కడ కంటే ఇంకో చోట ఆవకాశం లేదు. మీరు వాళ్ళందరిని హాల్ లోకి పంపారు.  నాకు మీరు ఏమిచ్చినా  పర్వాలేదు’ అని ఎంతో వినమ్రంగా చెప్పే వారు. ప్రోగ్రాం  అయిన తర్వాత వాళ్ళంతా గ్రీన్ రూంలోకో లేదా ఆయన బస చేసిన చోటికో  వచ్చే వారు.  వాళ్ళ బాధలన్నీ ఆయనతో చెప్పుకొనే వారు.  సత్యం గారు మేము ఇచ్చిన  పారితోషికంలో చాలా మటుకు అక్కడికక్కడే  వాళ్లకు పంచి పెట్టడాన్ని నేను కళ్ళారా  చూసాను.  వాళ్ళు వెళ్లిన తర్వాత నాతో అనే వారు. ‘మా వాళ్ళు చాలా పేద వాళ్ళు.  నాకు వాళ్ళందరిని పైకి  తీసుకు రావాలని వుంది’.   అనడమే కాదు అలా చేసేవారు కూడా.
సత్యం గారికి కూచిపూడి అన్నా, కూచిపూడి వారన్నా  ప్రాణం.  మద్రాస్ వెళ్ళినా కూచిపూడి కోసం తహ తహలాడేవారు.  కూచిపూడి డాన్సు పైకి  వస్తే మా వాళ్ళంతా బాగు పడతారని ముప్ఫయి ఏళ్లుగా తపన పడుతూ వచ్చారు. ఈవేళ కూచిపూడికి  అంతర్జాతీయ ప్రాముఖ్యం వచ్చింది.  కూచిపూడి భాగవతులుగా వొకప్పుడు గర్భ దారిద్ర్యం అనుభవించిన  వారంతా ఈవేళ కూచిపూడి డాన్సు మాస్టర్లు గా పేరు పొందారు.  మాష్టారు ఎప్పుడు బెజవాడ  వచ్చినా  ఏదో టైం చూసుకొని కూచిపూడి వెళ్లి వచ్చే వారు.  అందర్నీ పలకరించి రావడం, సిద్ధేంద్రక్షేత్రాన్ని అభివృద్ధి పరచడం, వారి కుల దేవత బాల త్రిపుర సుందరి అమ్మవారి గుడి బాగు చెయ్యడం - వీటిల్లోనే   ఆయన తల మునకలు అయ్యే వాళ్ళు. ‘మా  వాళ్ళలో వొకరికి మరొకరికి పడదు. కొట్టుకు చస్తూ  వుంటారు  చెప్పినా వినడం లేదు’ అని బాధ పడే వారు. కూచిపూడి వెళ్లినప్పుడల్లా వొకరిద్దర్ని తనతో పాటు   మద్రాస్ తీసుకు వెళ్ళే వారు. చిన్న సత్యం గారు మద్రాస్ వెళ్ళే సమయానికి అక్కడ వేదాంతం రాఘవయ్య, వెంపటి పెద్ద సత్యం, పసుమర్తి కృష్ణ మూర్తి వంటి కూచిపూడి వాస్తవ్యులు సినిమా రంగంలో ఉన్నత స్థితిలో వున్నారు.  పేరుతో పాటు డబ్బుకూడా సంపాదించుకొన్నారు.  అయినా వాళ్ళెవరికీ  పట్టలేదు, కూచిపూడి గురించి కాని కూచిపూడి నృత్యం గురించి  కాని.  చిన్న సత్యం వొక్కరే  నిలబడ్డారు.  తన స్కూల్ కి ‘కూచిపూడి ఆర్ట్ అకాడెమి’ అని పేరు పెట్టుకొన్నారు. అది ఎందరికి నాట్య బిక్ష పెట్టిందంటే, ఇప్పుడు  కేవలం డాన్సు మీద ఆధార పడ్డ వాళ్ళయినా, సినిమా వాళ్లయినా సరే, ప్రతివారూ తాము  కూచిపూడి ఆర్ట్ అకాడెమి చిన్న సత్యం గారి శిష్యులమని చెప్పుకునే వారే.


కేంద్ర సంగీత నాటక అకాడెమి 1965 ప్రాంతంలో కూచిపూడి డాన్సును ప్రోత్సహించేందుకు  పాతిక వేల రూపాయిల గ్రాంట్ ఇచ్చి వో నృత్య రూపకం చెయ్యమని కోరింది.  అప్పట్లో బెజవాడ  రేడియో స్టేషన్ లో పనిచేస్తున్న బందా కనకలింగేశ్వర రావు గారి  కృషి ఫలితంగా లభించిన ఈ అవకాశాన్ని అప్పట్లో అందరిలోకి చిన్నవాడయిన చిన్న సత్యంగారికి  అప్పగించారు. దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు ఇందుకోసం క్షీర సాగర మధనం రూపొందించారు. రజని కాంతరావు  గారు సంగీతం సమకూర్చారనుకొంటా.   మహంకాళి సత్యనారాయణ, వేదాంతం సత్యనారాయణ శర్మ, చింతా కృష్ణ మూర్తి వంటి ఉద్దండులు ఇందులో పాత్రధారులు. బీసెంట్ రోడ్ లోని మోడరన్  కేఫ్ లో వీరందరికీ బస ఏర్పాటు చేసి రిహార్సల్ చేయించే వారు. రోజు వీరంతా వెళుతుంటే లక్ష్మి జనరల్ స్టోర్స్ శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు కూచిపూడి భాగవతులను  చూసి ‘ఇంత గొప్పవారు చిరిగిన శాలువాలు వేసుకోవడం ఏమిట’ని కొత్త సిల్క్ శాలువాలు ఇచ్చారుట. వీళ్ళంతా కొత్త శాలువాలు  ట్రంక్ పెట్టెల్లో పెట్టుకొని మళ్ళీ చిరిగిన  శాలువాలే వేసుకొని బీసెంట్ రోడ్లో తిరిగేవారుట. ‘అంత అమాయకులు. మావాళ్ళకి ఏమీ తెలియదు’ అంటూ వాపోయే వారు చిన్న సత్యం మాష్టారు.
ఓ సారి శ్రీనివాస కళ్యాణం ప్రోగ్రాం  పెట్టాం మొదటిసారిగా బెజవాడలో. అప్పటికే ఆ నృత్య నాటకానికి ఎంతో పేరు వచ్చింది. రేపు ప్రోగ్రాం  అనగా మాకు ఫోన్ వచ్చింది. ‘పద్మావతి పాత్ర వేసే శోభానాయుడుకి వంట్లో బాగో లేదు. ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకోవాల్సింద'ని.  మేమంతా కుదేలయిపోయాము. కొందరేమో 'ఇదో నాటకం' అని తిట్టిపోశారు కూడా.  నెల రోజులు పోయిన తర్వాత పెట్టుకోమన్నారు.  ఈ సారి ఇంకో మార్పు.  శ్రీనివాసుడు వేసే మంజు భార్గవి రావడం లేదు అని. అప్పటికే ఆవిడ సినీ  స్టార్ అని కొంత గ్లామర్  వుంది. ఆవిడా,  శోభానాయుడు అయితేనే ఆ ప్రోగ్రాం  బావుంటుంది.  కాని మాస్టర్ గారికి ఎందుకో ఓ  సినిమాలో ఆవిడ వేషం నచ్చ లేదుట. మంజు భార్గవి కాక క్షేమవతి వేస్తుంది అని చెప్పారు.  మా నిర్వాహకులలో కొందరికి ఈ మార్పు నచ్చలేదు.
‘ప్రోగ్రాం  వద్దే వద్దు’ అన్నారు. కాని ఇది చిన్న సత్యం గారి ప్రోగ్రామాయే. ఎవరు వేసారన్నది ముఖ్యం కాదని ఒప్పించాము. మొత్తం మీద  చాలా చాలా బాగా వచ్చింది.  వేదవతి ప్రభాకర రావు గారు కూడా కనకదుర్గతో కలసి పాడారు. దృశ్య కావ్యం అంటే ఏమిటో చూపించారు.  అయిన తర్వాత మాష్టారు గారికి పది వేల రూపాయిలు ఇస్తే ‘వొద్దు మీ సభకి కార్పస్  ఫండ్ గా వుంచండి’ అని తిరిగి ఇచ్చేసారు.
మళ్ళీ ఎనిమిదేళ్ళ  తర్వాత ‘మంజు భార్గవి శ్రీనివాసుడుగా కావాలన్నారు కదా ఈసారి వేద్దాం’ అన్నారు.  అయితే ఈ సారి శోభానాయుడు లేదు. అలా బెజవాడ  అభిమానులకు శోభానాయుడు మంజు భార్గవి చిన్న సత్యం కాంబినేషన్ లో శ్రీనివాస కళ్యాణం చూసే భాగ్యం కలగలేదు.”  (04-08-2012)


2, ఆగస్టు 2012, గురువారం

కదిలింది జగన్నాధ రధము


కదిలింది జగన్నాధ రధము
కలయో వైష్ణవ మాయయో అన్నట్టు ప్రభుత్వంలో ఏదో కదలిక. దాదాపు రెండేళ్ళకు పైబడి  నిర్వికారంగా, నిస్తేజంగా, నిస్సత్తువుగా,  చేష్టలుడిగి  నిష్క్రియాపరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా వున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో చిన్న కదలిక.
ఉప ఎన్నికల కదన రంగంలో వరుస పరాజయ పరంపరతో చావుదెబ్బలు తిని, కన్నులొట్టబోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ జవసత్వాలు కలిగించే సంకల్పంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  మొదలు పెట్టిన ఇందిరా పల్లె బాటకు జనాలనుంచి నీరాజనాలు లభించకపోయినా వ్యతిరేకత కూడా పెద్ద స్తాయిలో ఎదురుకాకపోవడం  చాలాకాలం తరువాత కిరణ్ సర్కారుకు దక్కిన  ఊరట.
బహుశా రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో మున్నెన్నడు కనీ వినీ ఎరుగని స్వేచ్ఛనూ, వాక్స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ వాదులు ఈనాడు  అనుభవిస్తున్నారనుకోవాలి. పార్టీకి చెందిన  సీనియర్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, పొన్నం ప్రభాకర్ లు ఇటీవల టీవీ తెరలపై చేసిన  మాటల యుద్ధం చూసిన వారికి ఈ అభిప్రాయం కలగడం సహజం.  మెడలో వేసుకున్న మువ్వన్నెల కాంగ్రెస్ కండువాలను మినహాయిస్తే, వారిద్దరెవరో  తెలియని వారికి  ఆ ఇద్దరు  ఒకే పార్టీకి చెందినవారంటే నమ్మకం కుదరడం కష్టం.
రోశయ్యను మార్చి ఆ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సివచ్చినప్పుడు అధిష్టానదేవతలు తెలిసి చేశారో, తెలియక చేశారో కాని వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన వారికెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా  వై.ఎస్. తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో పార్టీని డెబ్బతీస్తాయన్న అనుమానంతోనే  వై.ఎస్. వద్ద పనిచేసిన  మంత్రులెవ్వరికీ రోశయ్య స్తానంలో ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదని భాష్యం చెబుతున్నవాళ్ళు కూడా  వున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను – రుజువు చేసుకోవడంలో ఆయన చాలావరకు   వైఫల్యం చెందారనే చెప్పాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని  కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ  తక్షణం  హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  ఈ విషయంలో
అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం. క్యాంప్ కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతారు. 
నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయస్సులో  అధిష్టానం ఆయనకు పెద్ద పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. కిరణ్ ఈ వరాన్ని చక్కగా వినియోగించుకున్న దాఖలాలు లేవని  ఆయన సన్నిహితులే పరోక్ష సంభాషణల్లో వొప్పుకుంటూ వుంటారు.
ఏతావాతా జరిగింది అనవసర కాలయాపన. పుణ్యకాలం కాస్తా ఉపఎన్నికలతోనే గడిచిపోయింది. ఈ ఉపఎన్నికలకు మూలకారణం వై ఎస్ ఆర్ పార్టీ అయినప్పటికీ, వాటిని నివారించి, ఘోర పరాభవాన్ని పార్టీ మూటగట్టుకునే అవకాశాన్ని చేజేతులా కిరణ్ కుమార్ రెడ్డి కల్పించారని ఆయన పార్తీవాళ్ళే అపవాదు వేస్తున్నారు.
ఏ లెక్క ప్రకారం చూసినా  వైఫల్య ముఖ్యమంత్రి అనే కితాబును కిరణ్ కు ఇవ్వకతప్పదని అంటున్నారు. అధిష్టానానికీ ఈ విషయం తెలుసు. కానీ, ముఖ్యమంత్రిని మార్చడం వల్ల వచ్చే లాభం కన్నా మార్చడం వల్ల ఒనగూడే నష్టం ఎక్కువ అన్న వాస్తవం తెలుసు కనుక వాళ్ళూ కిమ్మిన్నాస్తిగా వుండిపోతున్నారు. అధిష్టానం నిస్సహాయత,  ప్రధాన  ప్రతిపక్షం అయిన తెలుగు దేశం నిష్క్రియాపరత్వం కలసి  వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని  కొందరు భాష్యం చెబుతున్నారు.      
నిజమే. ఇప్పుడు  ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, నమ్మి అధికారం వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను  దూరం చేస్తే వారు పాలకులకు దగ్గరవుతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం. 
పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి శాశ్వితంగా పనికొచ్చేపనులు పదవిని లెక్కచేయకుండా   ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.
ఇది దృష్టిలో వుంచుకుంటే  సమర్ధవంతమయిన పాలన సాగించేందుకు మార్గం సులువవుతుంది. (02-08-2012)

26, జులై 2012, గురువారం

కొత్త కుటుంబం



కొత్త కుటుంబం

‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే  నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ పనికి పూనుకుంది కూడా ఎవరో కాదు నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
కధలెలా రాయాలి అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే  పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా  అంతే  వుంటుంది.
ఆరుద్ర గారిలా కాకపోయినా నేను చెప్పబోయే  ఈ  కధ ముగింపు  బాగానే ఉంటుందనుకుంటున్నాను.
నా చిన్నతనంలో  మా ఇంటికి ఓ  కొత్త అతిధి ఒకరు వచ్చారు. వచ్చారు అనడం కంటే తీసుకు వచ్చారు అంటే బాగుంటుందేమో. ఆ రోజుల్లో మాది ఓ చిన్న బస్తీ. బజారు పనిమీద వెళ్ళినప్పుడు  కనబడిన ఈ అతిధి మా నాన్నను ఇట్టే ఆకర్షించాడు. రోజూ ఒకసారయినా పనిపెట్టుకుని బజారుకు వెళ్లి అతగాడిని  చూసివస్తుండేవాడు. అలాటిది ఒకరోజు ఏమయితే అయిందని అతడిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు.
 ఆ రోజుల్లో మాది ఓ చిన్న బస్తీ. బజారు పనిమీద వెళ్ళినప్పుడు  కనబడిన ఈ అతిధి మా నాన్నను ఇట్టే ఆకర్షించాడు. రోజూ ఒకసారయినా పనిపెట్టుకుని బజారుకు వెళ్లి అతగాడిని  చూసివస్తుండేవాడు. అలాటిది ఒకరోజు ఏమయితే అయిందని అతడిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు. అంతే! అతడి రాకతో,  ఆ రోజునుంచి  మా ఇంటి వాతావరణం  పూర్తిగా మారిపోయింది.
అతిధి అంటే ఒకటి రెండు రోజులుండి పోయేవాడు. అదేమి  చిత్రమో కాని,  వచ్చిన వాడు వచ్చినట్టే  టంకంలా మా ఇంటికి అతుక్కుపోయాడు.ఇంట్లో అడుగు పెట్టిన కొత్త అతిధి, కొత్తా పాతా తేడాలేకుండా   ఇంటిల్లిపాదినీ ఇట్టే ఆకట్టుకున్నాడు. కధ అంతటితో ఆగలేదు.  ఇరుగింటి వాళ్ళు,పొరుగింటివాళ్ళు  చిన్నా పెద్దా  అంతా కట్టగట్టుకుని  అతడి ముచ్చట్లు వినడానికి మా ఇంటి మీదికి  ఎగబడేవారు. మొదట్లో ఉదయం  ఓ గంటా సాయంత్రం ఓ రెండు గంటలు కాబోలు అందరితో కలుపుగోలుగా మసలుకునేవాడు. ఆ తరువాత మాత్రం ముంగిలా ముసుగేసుకుని తొంగునేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. కొన్ని సార్లు అతడి మాటలు అర్ధం అయ్యేవి. మరికొన్నిసార్లు అర్ధం అయినట్టు వుండేవి. ఇంకొన్ని సార్లు అతడు ఏం మాట్లాడుతున్నాడో, యే భాషలో మాట్లాడుతున్నాడో తెలిసేది కాదు. అర్ధం కాకపోయినా అతడి మాట తీరు అందరికీ  నచ్చేది. ఇది అది అని లేకుండా   చరిత్ర, లెక్కలు, పురాణాలు ఏది కదిల్చినా వాటిల్లో అతడికున్న పరిజ్ఞానం మాత్రం  అమోఘం. సినిమా కబుర్లు మొదలు పెట్టాడంటే చాలు  ఇక వాటికి అంతూపొంతూ  వుండేది కాదు.
నాకయితే అతడు మంచి స్నేహితుడిగా మారిపోయాడు.మొదట్లో మాదిరిగా ఉదయం, సాయంత్రం అన్న పద్ధతికి స్వస్తి చెప్పి  పొద్దస్తమానం కబుర్లతో కాలక్షేపం చేసేవాడు.అలా అస్తమానం  అతడితో గడుపుతూ అతడు చెప్పే కబుర్లు వింటూ వుండడం మా అమ్మానాన్నకు పోను పోను నచ్చేది కాదు. ఎందుకంటే అతడు చిన్న పిల్లల కధలు మాత్రమే కాదు ఒక్కోసారి రాత్రి పొద్దుపోయిన తరువాత వీలుచూసుకుని   కొన్ని పెద్ద పెద్ద  ముచ్చట్లు కూడా చెప్పేవాడు. ముందు ఛీ పాడు అనుకునే దాన్ని. కానీ రానురాను   అతడు చెప్పే ఆ మాటల్లో నాకు   తెలియకుండానే ఆసక్తి పెరగడం  మొదలయింది. ఇదంతా మా అమ్మనాన్నకు రుచించేది కాదు. ‘అస్తమానం అతడితో ఏమిటా కబుర్లు. బుద్దిలేకపోతే సరి’ అని మా అమ్మ కసురుకునేది కూడా.
చూస్తుండగానే యాభయ్  ఏళ్ళు గడిచిపోయాయి. అతిధిగా ఇంట్లో కాలుమోపిన అతడు రోజులు గడుస్తున్నకొద్దీ అభ్యాగతి గా మారిపోయి  ఇప్పుడు అదే ఇంట్లో ఓ మూలన పడివున్నాడు. ఇప్పటికీ కబుర్లకు కొదవ లేదు. వినేవాళ్ళకే  కొరత. విశేషం ఏమిటంటే మొదట్లో విసుక్కున్న మా అమ్మ ఇప్పుడు అతడి రంధిలో పడిపోయింది. అతడు చెప్పే అత్తాకోడళ్ళ కధలంటే చెవికోసుకునేవరకు వెళ్ళిపోయింది. మా నాన్నా అంతే. అతడిని చూస్తే చిరాకుపడే వాడల్లా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పేపరు చదవడం కూడా మానేసి అతడు చెప్పే రాజకీయాలు  వింటూ కూర్చుంటున్నాడు.  
ఇంతకీ పేరు చెప్పడం మరచిపోయినట్టున్నాను కదూ. అందరికీ తెలిసిన పేరే. అతడి  అసలు పేరు టీవీ. జాతకనామం  దూరదర్శన్. కాలం గడుస్తున్నకొద్దీ అర్జునుడి మాదిరిగానే  రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూటకో ఛానల్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు  రోజుకో పేరు.  కొద్దికాలం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య పేరు కంప్యూటర్. ముగ్గురు పిల్లలు. పెద్దాడి పేరు ఇంటర్నెట్. రెండో సంతానం సెల్ ఫోన్. కొత్తగా ఓ మనవడు వచ్చాడు వాళ్ల కుటుంబంలోకి. అతడికి ముద్దుగా ఐ పాడ్ అని నామకరణం చేశారు.
మా పాత కుటుంబంలో ప్రవేశించిన ఈ కొత్త కుటుంబం తామరతంపరగా పెరిగిపోతూనే వుంటుందేమో. 
(26-07-2012)