26, ఫిబ్రవరి 2012, ఆదివారం

దేహమేరా వైద్యాలయం



దేహమేరా వైద్యాలయం

సీనియర్ పాత్రికేయులు, ‘కలం కూలీ’, కీర్తిశేషులు జి.కృష్ణ గారు తనకు తెలిసిన దేనినీ, జర్నలిజంతో సహా, తనకోసం వాడుకోని అభినవ పోతన. ఆయనకు  పుట్టుమచ్చల శాస్త్రం అంటే మక్కువ ఎక్కువ. దేహంలో బయటకు కనిపించే పుట్టుమచ్చకు తోడుగా మరోచోట అదే శరీరంలో ఇతరులకు కాని రాని చోట మరో జోడు పుట్టుమచ్చ వుంటుందని ఆయన సిద్ధాంతం. నిజంగా నమ్మి చెప్పేవారో లేక నవ్వులాటకు చెప్పేవారో తెలియదు కాని ఆయన చెప్పిన చోట పుట్టుమచ్చ వుండడాన్ని నేను అనేక మార్లు గమనించాను. ‘పాడు దేహమిది తూటులు తొమ్మిది తుస్సుమనుట  ఖాయం’ అనే పాత సినిమా పాట ఈ మధ్య రేడియోలో విన్న రోజునే ఈ పాడు దేహంతో చేయగల అనేక ట్రిక్కులు గురించి చదవడం కాకతాళీయమే కావచ్చు కానీ అప్పుడు కృష్ణ గారు గుర్తుకొచ్చారు. ఆ చిట్కాల కధా కమామిషును   నలుగురితో పంచుకోవడానికే ఈ ప్రయత్నం.

మానవ దేహం  అత్యంత సంక్లిష్టమైనది. తల వెంట్రుక కంటే తక్కువ మందం కలిగిన అనేక నాడులు, గ్రంధులు, రక్త నాళాలు శరీరంలో పెనవేసుకుని వున్న తీరు తెన్నులు గమనిస్తే సూపర్ కంప్యూటర్ లు కూడా ఓ లెక్క లోకి రావు. దేహంలో దాగున్న అనేక రహస్యాలు ఇంకా అనేకం వెల్లడి కావాల్సివుంది. తెలిసిన వాటిల్లో కొన్నింటిని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది.

·        గొంతులో గరగర అని టీవీల్లో ప్రకటనలు వస్తుంటాయి. అలాటి గరగర సమస్య తలెత్తినప్పుడు చెవిపై రుద్ది చూసుకోండి. అంతే! టీవీ ప్రకటనలో మాదిరిగా గరగర మాయం. చెవిలో నరాలు ఉత్తేజితమయినప్పుడు  గొంతులో కండరాలు బిగదీసుకుంటాయట. ఫలితం గొంతులో ఉపశమనం.

·        ఫోనులో మాట్లాడుతున్నప్పుడో, లేక నలుగురిలో వున్నప్పుడో అవతల వ్యక్తి చెప్పేది సరిగా వినబడడం లేదనిపిస్తే, వెంటనే కుడి చెవికి పని చెప్పండి. త్వరత్వరగా ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు త్వరిత గతిన దాన్ని గ్రహించగల శక్తి  రెండు చెవుల్లో కుడి చెవికి ఎక్కువగా వుండడమే దీనికి కారణం. అలా అని  ఎడమ చెవి తక్కువదేమీ కాదు. మంచి సంగీతాన్ని ఆస్వాదించడం దానికే సాధ్యం సుమా!.

·        చిన్నప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ చేసేటప్పుడు నొప్పి తెలియకుండా వుండడానికి పచ్చని చెట్టు వంక చూస్తూ వుండమని చెప్పడం చాలామందికి స్వానుభవమే. ఇప్పుడు మరో కొత్త ట్రిక్కు నేర్చుకోండి. సూది శరీరంలోకి దిగుతున్నప్పుడు చిన్నగా దగ్గండి. సూది దిగడం వల్ల కలిగే చురుక్కుమనే భావన వెన్నుపూస ద్వారా మెదడుకు చేరే సమయంలో వెన్నుపాములో దగ్గు వల్ల కలిగే వొత్తిడి, ఆ  నొప్పి తీవ్రత తెలియకుండా చేస్తుంది.(ట)

·        ముక్కు దిబ్బడ వేసినప్పుడు నాలుకను నోటి పైభాగానికి వొత్తి పెట్టి వుంచి, రెండు కనుబొమల నడుమ చూపుడు వేలిని నొక్కి పెట్టి వుంచితే మంచి ఉపశమనం కలుగుతుంది.
·        భుక్తాయాసం కలిగినప్పుడు ఎడమవైపు తిరిగి కాసేపు పడుకోవాలి.  శ్వాసకోశనాళం కంటే ఉదరం దిగువన వుండడం వల్ల భుక్తాయాసం అధికం కావడం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గిపోతాయి.
·        పంటి నొప్పి ఎక్కువగా  వుంటే కొద్దిగా ఐస్ తీసుకుని అరచేతి వెనుక వైపున రుద్దాలి. అలాగే బొటన వేలుకు, చూపుడు వేలుకు నడుమ భాగంపై ఐస్ మర్ధనా చేయాలి. మెదడునుంచి పంటికి నొప్పి గురించిన  సంకేతాలు అందించే నాడీ మార్గం దీనివల్ల ఉత్ప్రేరితం కావడం దీనికి కారణం.
·        ఒక్కోసారి డోసు ఎక్కువయినప్పుడు మందు బాబులకు తామువున్న ప్రదేశం గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ స్తితిలో చేతిని  బల్లకు ఆనించి కాసేపు నిలబడితే ఆ తీవ్రత తగ్గుతుంది. మనిషి స్తిరంగా నిలబడడానికి చెవిలో వుండే ఒక రకమయిన ద్రవం తోడ్పడుతుంది. మద్యం సేవించడం వల్ల ఆ ద్రవం పలచబడి మనిషి స్తిరంగా నిలబడే శక్తిని కోల్పోవడం వల్ల కళ్ళు తిరుగుతాయి. అలాంటప్పుడు  చేతిని బల్లకు ఆనించి నిలబడడం వల్ల మెదడుకు మరో రకమయిన సంకేతం వెళ్లి ప్రపంచం  గిర్రున తిరుగుతున్న భావనను అరికడుతుంది.  
·        వెక్కిళ్ళు వస్తున్నాయా? బొటన వేలిని, రెండో వేలిని కనుబొమలమీద వొత్తి పెట్టి వుంచండి. వెక్కిళ్ల సంగతి అవే చూసుకుంటాయి.

·        నీతి: ఉచిత సలహాలు కొండొకచో పనిచేయకపోవచ్చు.
·        ఉపసంహారం: తలలో పేల బాధ అధికంగా వున్న ఓ శాల్తీ కి ముళ్లపూడి వెంకటరమణ గారు ఓ జోకు ద్వారా ఇచ్చిన సలహా.  “ బ్రాందీలో ఇసక కలిపి తలకు పట్టించండి. బ్రాందీ సేవించిన పేలు ఆ మత్తులో చెలరేగిపోయి ఇసుకరేణువులతో ఒకదానినొకటి మోదుకుని చచ్చివూరుకుంటాయి.” 
     

(26-02-2012)

23, ఫిబ్రవరి 2012, గురువారం

నవ్వుల పువ్వుల ముళ్ళపూడి


నవ్వుల పువ్వుల ముళ్ళపూడి






(June, 28,1931 - Feb. 23, 2011)





తెలుగు నేలపై పుట్టి తెలుగులోనే రాసి ఆయన దురదృష్టవంతుడయ్యాడు.
ఆయన తెలుగులోనే రాయడం వల్ల తెలుగు నేలపై పుట్టిన  తెలుగు పాఠకులు అదృష్టవంతులయ్యారు.
నవ్వించే సినిమాలకు, కవ్వించే సినీ రివ్యూలకు ముళ్ళపూడి ట్రేడ్ మార్క్.
రాజకీయ భేతాళ పంచవింశతిక – నేటికీ, ఏనాటికీ వర్తించే బుక్ మార్క్
తెలుగులో హాస్యరసం ముళ్లపూడి వారితోనే పుట్టింది.
నవ్వడం రానివారికి, నవ్వడం మరచిపోయిన వారికి ఆయన కాణీ ఖర్చు లేకుండా నవ్వడం నేర్పారు.
ముఖచిత్రానికి ‘అట్ట’హాసం అని పేరు పెట్టినా,
అప్పులు చేయడంలో ‘ఇంత’ ఆనందం వున్నదని చెప్పినా-
ఆ వెంకటరమణుడికే చెల్లు.
‘నిన్న రాసింది ఈ రోజు చదివితే మొన్నటి అప్పడంలా వుంటుంది’ అని రాసిన  ముళ్లపూడి వెంకటరమణ –
అక్షరాలా అక్షర బ్రహ్మ.
ఆయనకిదే నా సాక్షర నివాళి.
(ఫిబ్రవరి 23 – ముళ్లపూడి ప్రధమ వర్ధంతి సందర్భంగా)

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

అసెంబ్లీ అప్పుడూ ఇప్పుడూ


అసెంబ్లీ అప్పుడూ ఇప్పుడూ



శాసన సభ సమావేశాలు రిపోర్ట్ చేయడానికి రేడియో విలేకరిగా తొలిసారి అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలోకి అడుగుపెట్టి 37 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు అసెంబ్లీ పాత భవనంలో వుండేది. అందులోని  ప్రెస్ గ్యాలరీ చాలా చిన్నది. చెక్క మెట్లెక్కి అందులోకి వెళ్ళే వాళ్ళం. సర్దుకుని కూర్చుంటే ఓ పాతిక మందికి సరిపోతుంది. సభా భవనంలో సభ్యుల సీట్లు సినిమా హాళ్ళలో మాదిరిగా కింద నుంచి పైకి అంచెలంచెలుగా వుండేవి కాబట్టి వారు కూర్చునే చివరి వరుసకూ, మా గ్యాలరీకి నడుమ ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా వుండేది. కొండొకచో – వెనుక వరుస సభ్యులు తలలు వెనక్కి తిప్పి జర్నలిష్టులతో గుసగుసలాడడం – సభాపతి గమనిస్తున్నారని తెలియగానే బుద్దిమంతుల మాదిరిగా సర్దుకోవడం- నిజంగా అవో తమాషా రోజులు.
ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో పేజీల సంఖ్య తక్కువ. ఒకటి రెండు మినహాయిస్తే – మిగిలిన అన్ని దిన పత్రికలు విజయవాడ నుంచే వెలువడేవి. తెలుగు పత్రికల రాజధానిగా బెజవాడకు పేరుండేది.
అసెంబ్లీ వార్తలయినా, మరో వార్త అయినా హైదరాబాదు నుంచి బెజవాడ పంపాలంటే టెలెక్స్, టెలి ప్రింటర్ లే శరణ్యం. డెడ్ లైన్ దాటిన తరువాత వార్త   పంపాలంటే విలేకరులు ట్రంకాల్ బుక్ చేసి చెప్పాల్సిందే. అంతకు కొన్నేళ్ళ క్రితం నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్  ఎడిటర్ గా పనిచేసేటప్పుడు హైదరాబాదు నుంచి జ్యోతి విలేకరులు శ్రీ జి. రామారావు, శ్రీ ఆదిరాజు వేంకటేశ్వరరావు, శ్రీ ఎన్. ఇన్నయ్య ప్రభ్రుతులు ఫోనులో చెప్పే వార్తలు రాసుకున్న అనుభవం నాకుంది. ఎడిషన్ గడువు లోగా వార్త పంపితేనే మర్నాడు పేపర్లో వచ్చేది. లేకపోతే మరో రోజు వరకు దానికి మోక్షం దొరికేది కాదు. అలాగే రేడియో వార్తలకు కూడా సమయ పరిమితులు వుండేవి.
సభలో ఏం జరిగిందో సవివరంగా అదేరోజు తెలుసుకోవాలంటే వున్న ఏకైక వెసులుబాటు రేడియోలో ప్రసారం అయ్యే అసెంబ్లీ సమీక్ష. సమావేశాలు జరిగే రోజుల్లో రాత్రి 7.45 గంటలకు ఈ కార్యక్రమం పదిహేను  నిమిషాల పాటు సాగేది. పల్లెటూళ్ళలో పంచాయతీ రేడియోల ద్వారా వినడానికి జనాలు గుమికూడేవారు. హైదరాబాదు లోని న్యూ ఎం.ఎల్. యే. క్వార్టర్స్ లో మైకులు ఏర్పాటుచేసి వినిపించేవారు. ఆ సమీక్షలు రాసే బాధ్యతను కూడా పత్రికల్లో పనిచేసే సీనియర్ జర్నలిష్టులకు ఒప్పగించేవారు. ఇప్పుడు ప్రధాన పత్రికలకు ఎడిటర్లుగా వున్న వారిలో చాలా మంది ఆ రోజుల్లో రేడియోకోసం అసెంబ్లీ సమీక్షలు రాసేవారు. ఏమాత్రం తభావతు వచ్చినా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వచ్చే ప్రమాదం వున్నందున – ఆ  సమీక్షలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి కానీ రికార్డింగు కు  అనుమతించడం జరిగేది కాదు.  సభలో చర్చల సందర్భంలో వాడిన వ్యంగాస్త్రాలు రేడియో సమీక్షలో వచ్చాయో లేదో తెలుసుకోవడానికి సీనియర్ శాసన సభ్యులు అనేకమంది ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేవారు.
మరునాడు కలిసినప్పుడు చెప్పేవారు. శాసన సభ వ్యవహారాలను గురించి వార్తలు రాసే పత్రికల వారు కూడా ముందు తమలో తాము చర్చించుకుని కానీ వార్త రాసేవారు కాదు. యేది రాయాలో యేది రాయకూడదో ఆలోచించుకుని రాసేవారు. అసెంబ్లీ  రిపోర్టింగ్ ను విలేకరులు గొప్ప విషయంగా భావించేవారు. సహజంగా ఇలాటి భావన బాధ్యతని పెంచుతుంది. వక్రీకరణలకు అవకాశం తగ్గుతుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పత్రికా రంగంలో ‘కదలిక’ మొదలయింది. విజయవాడ కేంద్రంగా వెలువడుతున్న పత్రికలన్నీ క్రమేపీ  తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదుకు మార్చుకున్నాయి. అప్పట్లో చిన్న చిన్న గదుల్లో న్యూస్ బ్యూరోలు నిర్వహించిన పత్రికలు రాజధానిలో ఏకంగా సొంత భవనాలనే ఏర్పాటు చేసుకున్నాయి. ఆంధ్ర జ్యోతి బ్యూరో సచివాలయం పాత గేటుకు ఎదురుగా వున్న మేడ మీద వుండేది. హిందూ పత్రిక బ్యూరో హిమాయత్ నగర్ లో చిన్న వాటాలో పనిచేసేది. అలాగే  మిగిలిన పత్రికల వాళ్లు.
కొన్నాళ్ళకు ఆంధ్రపత్రిక కార్యాలయాన్ని బషీర్ బాగ్ లో ప్రస్తుతం  లోకాయుక్త కార్యాలయం వున్న పెద్ద  భవనానికి తరలించారు. పత్రిక బ్యూరోలో శ్రీయుతులు ముక్కు శర్మ, ఎం ఎస్.శర్మ, పాపయ్య శాస్త్రి, రత్నం, కె.వేణుగోపాల్, విద్యారణ్య ప్రభ్రుతులు పనిచేసేవారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడు లో ఆయన్ని సమర్ధిస్తూ వార్తలు రాసారన్న అనుమానంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ భవనం నుంచి ఆంధ్ర పత్రిక కార్యాలయాన్ని ఖాళీ చేయించిందని ఆ రోజుల్లో చెప్పుకునే వారు. కారణాలు ఏమయినా ఆ తరువాతి కాలంలో యాజమాన్యాలు మారి ఒకప్పుడు తెలుగు పత్రికల్లో తలమానికంగా వెలుగొందిన ఆంధ్ర పత్రిక కాలగర్భంలో కలిసిపోయింది.
ఇక శాసన సభ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో అనేక కొత్త పత్రికలు పురుడుపోసుకున్నాయి. పాతపత్రికల యాజమాన్యాలు మారిపోయాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసాయి. అసెంబ్లీ ప్రత్యక్ష  ప్రసారాలు మొదలయ్యాయి. దానితో రికార్డులనుంచి తొలగించడం అన్న నిబంధన కాగితాలకే పరిమితమయిపోయింది. హక్కుల ఉల్లంఘన గురించి  పట్టించుకునే వ్యవధానం లేకుండా పోయింది. సభలో కంటే సభ బయట అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద సభ్యుల హడావిడి పెరిగింది. అర్ధవంతమయిన చర్చలు సరే అసలు సభ సజావుగా కొద్ది గంటల పాటు నడిచినా ఒక వార్తగా చెప్పుకునే రోజులు వచ్చాయి.
అసెంబ్లీ పాత భవనం నుంచి కొత్త భవనానికి మారింది. ఆ కొత్త భవనానికి కూడా కొత్తగా మరిన్ని రంగులు హంగులు సమకూర్చారు. కొత్త కుర్చీలు, కొత్త తివాసీలు, పూలకుండీలతో భవనం రూపురేఖావిలాసాలు మారాయి. కానీ, సభ జరిగే తీరులో మార్పులేదు. మరోసారి వాయిదా వేయడం కోసం సభ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతోంది. ఈ వాయిదాల సమావేశాలు చూసేవారికి విరక్తి పుడుతోంది. ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి తగ్గుతోంది. ఇది నిష్టుర నిజం. శాసనకర్తలే ఈ మంచి చెడులకు కర్తలుగా మిగులుతారు. (21-02-2012)

20, ఫిబ్రవరి 2012, సోమవారం

నవ్వడం మరచిపోతున్నామా!


నవ్వడం మరచిపోతున్నామా!



మా పక్కింటి పాపాయి – పది నెలల పాప – నన్ను చూడగానే నోరంతా తెరిచి పలకరింపుగా నవ్వుతుంది. పుట్టెడు దిగుళ్లను సయితం మటుమాయం చేయగల మహత్తరమయిన నవ్వది. అలా హాయిగా నవ్వుకుని ఎన్నాళ్లయిందన్న బెంగ  వెంటనే మనస్సుని తొలిచివేస్తుంది.
‘మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి’
ఈ వాక్యం రాసిపెట్టుకున్న కాగితాన్ని  ముప్పయ్ అయిదేళ్ళ క్రితం నేను రేడియోలో ఉద్యోగం మొదలు పెట్టిన కొత్తల్లో నా ఆఫీసు బల్ల మీది అద్దం కింద హమేషా కనబడేలా పెట్టుకునేవాడిని. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే – ‘చనిపోయినప్పుడు నా మొహం మీద చిరునవ్వు చెరగకుండా  వుందో లేదో చూసి చెబుతావా స్వామీ!’ అని చెప్పుకున్న రోజులవి.
‘నవ్వగలగడం ఒక భోగం -  నవ్వలేకపోవడం ఒక రోగం’ అని నవ్వు గురించి నవ్వుల రేడు, కాలేజీలో నా క్లాసుమేటు ఆ తరువాత గ్లాసుమేటు అయిన జంధ్యాల చెప్పిన ఈ సూక్తి సూర్యచంద్రులున్నంతవరకు జనం నోళ్ళలో నానుతూనే వుంటుంది. ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో, ఉరుకులు పరుగులమీద సాగుతున్న జీవితాల్లో నవ్వనేది మరింత అపురూపం కాగలదన్న భయం కూడా పట్టుకుంటోంది.
నిజం. హాయిగా నవ్వలేకపోవడం ఒక రోగం. పైగా ఇది అంటు  రోగంలా అందర్నీ అంటుకుంటోంది.
విశ్వనాథవారు అన్నట్టు ఇదొక విషాదం. (20-02-2012)

19, ఫిబ్రవరి 2012, ఆదివారం

పిల్ల పిడుగులు





పిల్ల పిడుగులు



బాపు గారికి కృతజ్ఞతలతో 


టీచర్:  ఏకాంబరం ఈ ప్రపంచ పఠంలో అమెరికా ఎక్కడ వుందో కనుక్కో.
ఏకాంబరం:  ఇదిగో ఇక్కడ టీచర్.
టీచర్: సరే నువ్వు జవాబు చెప్పు లంబోదరం. అమెరికాని కనుక్కున్నది ఎవరు?
లంబోదరం:  ఏకాంబరం టీచర్.  

టీచర్: శంకరం నీరు ఈ పదానికి రసాయనిక ఫార్ములా ఏమిటి?
శంకరం: హెచ్ ఐ జె కె ఎల్ ఎం ఎన్ ఓ
టీచర్ : ఏమిటా జవాబు ? ఎవరు చెప్పారలా !
శంకరం : నిన్న మీరే అన్నారు కదా టీచర్  నీటికి కెమికల్ ఫార్ములా ‘హెచ్ టూ ఓ’ అని.

టీచర్  : స్వప్నా ఇవ్వాళ మన మధ్య వుండి పదేళ్ళ క్రితం లేనిదేమిటి?
స్వప్న : నేనే టీచర్  

టీచర్: కోటయ్య కొడుకు గొడ్డలితో ఇంటి పెరట్లో వున్న బాదం చెట్టును అడ్డంగా నరికేశాడు. సుందరం నువ్వు చెప్పు కోటయ్య తండ్రి తన కొడుకును ఎందుకు దండించలేదు?
సుందరం: ఎందుకంటె ఇంకా కొడుకు చేతిలో గొడ్డలి వుండడం చూసి.

టీచర్ : ఒరే రాఘవా! భోజనానికి ముందు దేవుడిని ప్రార్దిస్తావా? నిజం చెప్పరా!
రాఘవ: ఆ అవసరం లేదు టీచర్. మా అమ్మ బాగా వంట చేస్తుంది.
టీచర్: గీతా నువ్వు కుక్క మీద రాసుకొచ్చిన వ్యాసం అచ్చం మీ అన్నయ్య రాసిన దానికి నకలుగా వుంది. కాపీ కొట్టావా!
గీత: లేదు టీచర్. ఇద్దరం ఒకే కుక్క మీద రాసాం.  

టీచర్: శేఖర్ ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. వినే వాళ్లకు ఇష్టం లేదని తెలిసి కూడా అదేపనిగా మాట్లాడే వ్యక్తిని ఏమంటారు?
శేఖర్: టీచర్! 
(19-02-2012)

18, ఫిబ్రవరి 2012, శనివారం

పది నోటు ఎటు పోయింది చెప్మా!



పది నోటు ఎటు పోయింది చెప్మా!







ముగ్గురు వెంగళప్పలు పట్నం వెళ్లి హోటల్లో ఓ గది తీసుకున్నారు.
ముగ్గురికీ కలిపి రోజుకు మూడువందల రూపాయలు అవుతుందని హోటల్ క్లర్కు చెప్పిన మీదట తలా ఒక వంద వేసుకుని ఆ మొత్తాన్ని అతడికి చెల్లించారు.
అయితే హోటల్లో వేడి నీరు రాకపోవడంతో హోటల్  యజమాని వారినుంచి రెండువందల యాభయ్ రూపాయలు మాత్రమే తీసుకుని మిగిలిన యాభయ్ వారికి వాపసు చేయమని క్లర్కుకు చెప్పాడు. అతగాడు అందులో ఇరవై నొక్కేసి మిగిలిన ముప్పై ఆ ముగ్గురికీ తలా  పది చొప్పున  తిరిగిచ్చేశాడు.
అంటే ఏమిటన్న మాట.  ముందు ఇచ్చిన వందలో పది రూపాయలు వెనక్కి వచ్చాయి.  వందలో పది పోతే తొంబై చొప్పున  ముగ్గురూ హోటల్ కు రెండువందల డెబ్బై రూపాయలు చెల్లించినట్టయింది.  క్లర్కు కొట్టేసిన ఇరవైతో కలిపితే ఆ మొత్తం రెండువందల తొంబై. మరి  మిగిలిన పది రూపాయలు ఏమయిపోయినట్టు చెప్మా!
జవాబు చెప్పగలిగినవారికే ఆ పది రూపాయలు.  (18-02-2012)

16, ఫిబ్రవరి 2012, గురువారం

గాభరా



గాభరా



భార్య వంట చేస్తుంటే మొగుడు హడావిడిగా వొంటి౦ట్లోకి వచ్చాడు.
‘అదేమిటి పోపులో అన్ని మిరపకాయలు వేశావు. జాగ్రత్త! పేలి మొహం మీద పడేను సుమా!
‘అదిగో ఓ పక్క నేను చెబుతున్నా నువ్వు  వినడం లేదు.  ఒక్కసారి అంత నూనె పోశావు. పోపు మాడి వూరుకుంటుంది.  స్టవ్ తగ్గించు. బాగా తగ్గించు. వాటిని కలయ తిప్పు. గరిటేది? కనబడి చావదేమి? నేను చెబుతుంటే  అసలు నీకు వినబడుతోందా లేదా?
‘నువ్వెప్పుడూ ఇంతే. వంట చేస్తుంటే నా మాట చెవిన పెట్టవు కదా!
‘సరే కొద్దిగా ఉప్పు తగిలించు. అదెప్పుడూ మరచిపోతూనే వుంటావు. ఇంతకీ ఉప్పెక్కడ? కొద్దిగా వెయ్యి. వేసి గరిటతో తిప్పు. తిప్పు. తిప్పమన్నానా!. తిప్పమంటే అలా చూస్తావేమిటి?’
మొగుడి అఘాయిత్యం చూసి భార్యకు వొళ్ళు మండింది. అతగాడి వంక  తీక్షణంగా చూసింది.
‘ఏమంటున్నారు మీరు. ఈ మాత్రం వంట చేయడం నాకు రాదా. కాపురానికి వచ్చినప్పటినుంచి చేస్తున్న వంటే కదా. పక్కన నిలుచుని  ఏమిటీ సతాయింపు?’
‘ఇదిగో ఈ మాట అనాలనే  ఇలా చేసింది. నేను కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చుని నువ్వు చేసే సతాయింపు కంటే ఇదేమన్నా ఎక్కువా చెప్పు.’
(15-02-2012)  
(Note: Courtesy cartoonist).