14, ఆగస్టు 2011, ఆదివారం

చీమ చెప్పే భగవద్గీత - భండారు శ్రీనివాసరావు

చీమ చెప్పే భగవద్గీత - భండారు శ్రీనివాసరావు 




ఒకానొక మానవాధముడికి జీవితం భారమై, సమస్యలు సమాహారమై, మనశ్శాంతి దూరమై దేవుడిని గూర్చి ఘోర తపస్సు మొదలు పెట్టాడు. చివరాఖరుకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనవాడు కళ్ళు తెరిచి తనను ఎదుర్కుంటున్న కష్టనష్టాల జాబితా ఏకరువుపెట్టి విజయసాధనకు మార్గం చూపెట్టమని మోకరిల్లాడు. దేవుడు విలాసంగా ఓ చిరునవ్వు విసిరి ‘దీనికోసం నన్ను పనికట్టుకుని పిలవాలా! అటు చూడు! అదిగో. అటుగావెడుతున్న ఆ అల్పజీవిని చూడు. దాన్ని చూసి నేర్చుకో ‘ అనేసి చక్కాపోయాడు. ఇతగాడటు చూస్తే నెమ్మదిగా కదిలి వెడుతున్న ఒక చిన్న చీమ కనిపించింది.


అంత పెద్ద దేవుడు ఇంత చిన్న చీమ నుంచి జీవితం గురించిన పాఠాలు నేర్చుకోమని అంటున్నాడు ఇతడేమి దేవుడు అని అనుకోకండి.


దారీ తెన్నూ తెలియని స్తితిలో వున్న మనుషులకు ఒక మంచి మార్గాన్ని చూపించి వారిని కార్యోన్ముఖుల్ని చేయడంలో ‘మోటివేషన్ గురు’ అని విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న 'జిన్  రాన్' కూడా  చీమల నుంచే తన ‘విజయ సూత్రాలకు’ స్పూర్తిని పొంది ఏకంగా ఒక పుస్తకమే రాసాడు. దాని పేరు ‘యాం ట్స్' ఫిలాసఫి’ అంటే ‘చీమలు బోధించే తత్వశాస్త్రం’ అని దగ్గరి అర్ధం.


చీమల జీవన సరళిని బాగా అధ్యయనం చేసిన జిన్ రాన్ మహాశయులవారు  జీవితంలో విజయాలు సాధించడానికి  కొన్ని  సూత్రాలను వాటినుంచి నేర్చుకోవాల్సి వుంటుందని సెలవిచ్చారు.





ఈ సారి సమయం దొరికినప్పుడు మీ చేతివేలును చీమ వెళ్ళే దారిలో అడ్డంగా వుంచి గమనించండి. ఆ చీమ మీ వేలును దాటివెళ్ళడానికయినా ప్రయత్నిస్తుంది లేదా మీ వేలి చుట్టూ తిరిగి వెళ్ళడానికయినా చూస్తుంది. అంతేకాని అక్కడే ఆగిపోయి బిత్తర చూపులు చూడదు. ఎందుకంటె మడమ తిప్పడం వెన్ను చూపడం దాని ఇంటా వంటా లేదు. ఓటమిని అంగీకరించడం దాని రక్తంలో లేదు.(చీమ వొంట్లో రక్తం వుంటుందా? వుంటే అది ఏ గ్రూపు అని చర్చిస్తూ కాలక్షేపం చేయడం మనుషులకే చెల్లు) అంటే ఏమిటన్న మాట. జీవితం అన్నాక మనం చేసే పనులకు అవరోధాలు ఎదురవడం సహజం. అడ్డంకులను అడ్డం పెట్టుకుని కాడి కింద పారేసి ‘సారో సాంగులు సోలో సాంగులు’ మొదలు పెట్టకూడదు. ఎన్ని సవాళ్లు ఎదురయితే మనం మనస్సును అంత దృఢపరచుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు వచ్చి వొళ్ళో వాలతాయి. లేదంటే చక్కా ఎగిరిపోతాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో విన్ స్టన్ చర్చిల్ ఏమన్నాడు. ‘సాధించేదాకా సాధన మానకండి. ప్రయత్నం వొదిలిపెట్టకండి’ అని తన సైన్యాలను ఉత్తేజపరిచాడు. బహుశా చీమలనుంచే ఆయన ఈ స్పూర్తిని గ్రహించి వుంటాడు.


చీమలు వేసవి కాలంలో ఏమి చేస్తుంటాయి?


రానున్న వర్షాకాలం గురించే అస్తమానం ఆలోచిస్తుంటాయట. చిన్నప్పుడు చదువుకున్న కాకీ పిచ్చుక కధ జ్ఞాపకం వస్తోంది కదూ. చీమలకు ఒక సత్యం తెలుసు. ఎండాకాలం ఎంత మంచిదయినా అది ఎల్లకాలం అలాగే వుండిపోదు. వేసవి పోయి వర్షాలు కురుస్తాయని తెలుసు. అందుకే రానున్న కాలంకోసం, అప్పటి అవసరాలకోసం ఇప్పటినుంచే జాగ్రత్త తీసుకోవాలనీ తెలుసు. అందుకని అన్నీ సజావుగా హాయిగా జరిగిపోయే సమయంలో బద్దకించి పడుకోకుండా ముందు ముందు కావాల్సిన సంబారాలను సమకూర్చుకోవడం చీమల అలవాటు. మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే. కడుపులో చల్ల కదలకుండా, జీవితం వడ్డించిన విస్తరిలా, వర్తమానం హాయిగా జరిగిపోతున్నది కాబట్టి ఎల్లకాలం ఇలాగే సాగిపోతుందని నమ్మకంగా నమ్మకం పెంచుకుని కాళ్ళు బారజాపి కాలక్షేపం చేయడం కూడదన్నమాట.


మరో విషయం ఏమిటంటే కష్టపడడం చీమల సహజ  స్వభావం. పనిపాట్ల విషయంలో  సాటి చీమలతో పోల్చుకోకుండా తమ పని తాము చేసుకుపోవడం చీమల నైజం. నేనొక్కదాన్నే ఇంత కష్టపడాలా  అని  ఏ ఒక్క చీమా ఏఒక్క రోజూ ఆలోచించదు. తను పడ్డ కష్టానికి ఎంత గిట్టుబాటయ్యిందన్న విషయం కూడా దానికి పట్టదు. అలాటి విషయాలు గురించి పిర్యాదు చేయడం కూడా చీమలకు అలవాటు లేని పని. ‘నీ ధర్మం నువ్వు చెయ్యి. ఫలితం నాకు వొదిలి వెయ్యి.’ అనే గీతాకారుడి బోధ చీమలకు వర్తించదు. చేతనయిన వరకూ చేసుకుంటూ పోవడం అన్న కర్తవ్య పాలన ఒక్కటే వాటికి తెలిసింది. దాన్ని నూటికి నూరుపాళ్ళు నిర్వర్తించడం ద్వారా విజయాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకోవడం ఎలాగో జనం చీమలనుంచి నేర్చుకోవాలి. తమకు చేతయిన దానిని చేయడం ద్వారా మాత్రమే విజేతలు ఆ స్తానానికి చేరుకోగలుగుతారన్నది మోటివేషన్ గురు గారి ఉవాచ.

మరో విషయం.

చిన్న ఆకారాలను పోల్చడానికి చీమలను ఉదాహరణగా తీసుకోవడం మనకు తెలిసిందే. కానీ అవి తమ తూకానికి  ఇరవై రెట్లు ఎక్కువ బరువుగల ఆహారాన్ని  మోసుకు వెళ్ళ గలవన్నదే చాలామందికి తెలియని విషయం.


మనుషులు కూడా అంతే. ఒక్కోసారి వాళ్లు అలవికాని సంసార భారాలను మోస్తుంటారు. అనేకసార్లు ‘ ఈ సంసారాన్ని లాగడం, ఈ బరువు మోయడం   ఇక నా  వల్లకాదు’ అన్న నిర్వేదం వారిని ఆవహిస్తుంటుంది. అల్లాటి సమయాల్లో చీమను గుర్తుచేసుకుంటే సరి. మనసు తేలికపడుతుంది. చిన్న పాటి చీమే అంతంత బరువులు మోయగాలేనిది ఆ పాటి బరువు బాధ్యతలు మేము మొయ్యలేమా అన్న ధీమా పెరుగుతుంది.


మోటివేషన్ గురు జిన్ రాన్ చెప్పినా అదే. కంటికి కనబడని దేవుడు చెప్పినా అదే.
(14-08-2011)





13, ఆగస్టు 2011, శనివారం

అనుభవాలు – నేర్చుకోవాల్సిన పాఠాలు - భండారు శ్రీనివాసరావు

అనుభవాలు – నేర్చుకోవాల్సిన పాఠాలు - భండారు శ్రీనివాసరావు


రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు మంచి రసకందాయంలో పడుతున్న సందర్భంలోనే రెండు ప్రధానమయిన అంతర్జాతీయ వార్తలు స్తానిక పరిణామాల నేపధ్యపు వెల్లువలో కొట్టుకుపోయాయి.


అమెరికాలో ఆర్ధిక సంక్షోభం గురించి, ఆ దేశపు క్రెడిట్ రేటింగ్ గురించి అక్కడి వాళ్లు ఎంత ఆందోళనకు గురయ్యారో తెలియదుకాని అనేక దేశాలు మాత్రం అమెరికా పరిస్తితులపట్ల ఆందోళన చెందిన మాట వాస్తవం. సూర్యుని కాంతి చంద్రుని మీద పడి ప్రతిఫలించినట్టు అమెరికా ఆర్ధిక వ్యవస్థలో ఏర్పడే ఒడిదుడుకులు ఆయా దేశాలపై ప్రభావం చూపడం ఖాయమనే నిపుణుల అభిప్రాయం.

ఈ మాదిరి ఆర్ధిక మాంద్యాలు అమెరికాకు కొత్తవేమీ కాదు. గతంలో పలు పర్యాయాలు ఇలాటి విపత్కర పరిస్తితులను ఆ దేశం తట్టుకుని ఒడ్డెక్కిన ఉదంతాలు అనేకం వున్నాయి. మొన్నటికి మొన్న2008 లో అమెరికాలో అనేక బ్యాంకులు దివాళా తీసాయి. దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం తలెత్తిన సంగతి గుర్తుండే వుంటుంది. మొత్తం మీద అమెరికా ఆ స్తితినుంచి గట్టెక్కగలిగింది. కానీ లోగడ కన్నా పరిస్థితులు ఇప్పడు వేగంగా మారిపోతున్నాయి. నూతన ఆర్ధిక సంస్కరణలు, ప్రపంచీకరణ ఫలితాలు ఏదో ఒక రీతిలో అన్ని దేశాలను తాకుతున్నాయి. కొన్నింటి పాలిట ఈ సంస్కరణలు వరప్రసాదం అయితే, మరికొన్ని దేశాలు దుర్భర వైరుధ్య పరిణామాలను ఎదుర్కుంటూ వుండడం విషాదకరం. ప్రపంచ ఆర్ధిక స్తితిగతులనే సమూలంగా మార్చివేస్తున్న ఈ విధానాల దిక్కుగా వేస్తున్న అడుగు అగాధంలోకి లాగుతుందో ఆకాశానికే చేరుస్తుందో తెలియని అయోమయ పరిస్తితిలో దేశాలన్నీ ఆర్ధిక సంస్కరణల సునామీలో కొట్టుకుపోతున్నాయి. సింద్ బాద్ కధల్లో మాదిరిగా వున్నట్టుండి ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అసాధ్యం కాదనిపిస్తోంది. పరాయి ప్రాంతాలకు వెళ్లి వ్యాపార లావాదేవీల్లో అపార ధన రాశులను మూటగట్టుకుని స్వదేశానికి చేరే సమయంలో సముద్రంలో చెలరేగిన తుపాను కారణంగా సమస్తం కోల్పోయి బికారిగా మారే సింద్ బాద్ పాత్ర మాదిరిగా ఈనాడు అనేక దేశాలు అమెరికా లోని ఆర్ధిక పరిస్తితులనే తుపాను మూలంగా పతనం అంచుకుకు చేరుకునే ప్రమాదకర పరిస్తితులను ఎదుర్కుంటున్నాయి.

అమెరికా ఆర్ధికరంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకంటే ప్రస్తుతం యూరోప్ దేశాలలో ఏర్పడిన సంక్షోభం మరింత ఆందోళన కలిగిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం ఫలితంగా యూరోపులోని బడా దేశాల ఆర్దికవ్యవస్తలు కుదేలయ్యే సూచనలు కానవస్తున్నాయి. వేగంగా సంభవిస్తున్న ఈ మార్పులకు తగ్గట్టుగా విదేశీ సంస్తాగత పెట్టుబడిదారులు తమ వ్యూహాలను మార్చుకుంటున్న సంకేతాలు బలంగా అందుతున్నాయి. వారందరూ తమ పెట్టుబడులను త్వరితగతిన ఉపసంహరించుకునే పనిలో పడడం, అలా వెనక్కు తీసుకున్న వాటాల ధనాన్ని మళ్ళీ మరోచోట మదుపు చేయకుండా తమదగ్గరే భద్రపరచుకోవడం, లేదా బంగారం కొనుగోలుకు వినియోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దానా దీనా ప్రపంచవ్యాప్తంగా పుత్తడి ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. తమ పెట్టుబడుల భద్రత పట్ల విదేశీ సంస్తాగత పెట్టుబడిదారులు (ఎఫ్.ఐ.ఐ.) లు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు మన దేశంలోని దేశీయ సంస్తాగత ఇన్వెస్టర్లు (డీ.ఐ.ఐ.) లను బెంబేలెత్తిస్తున్నాయి. భారతీయ మార్కెట్లలో ఎఫ్.ఐ.ఐ.లు తమ షేర్లను తెగనమ్ముతుంటే మరోపక్క డీ.ఐ.ఐ.లు వాటిని కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు. ఎందుకంటె తమకంటే బలవంతులయిన ఎఫ్.ఐ.ఐ.లతో తలపడడం అంత క్షేమదాయకం కాదని వారికీ తెలుసు. అందుకే రానున్న కొన్ని వారాలపాటు కొనుగోళ్లకు దూరంగా వుండడం మంచిదన్న ఆలోచనలో దేశీయ ఇన్వెస్టర్లు వున్నట్టు కనబడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాల నేపధ్యంలో- భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా వుందని, దానికి వెను వెంటనే వాటిల్లే ముప్పెమీలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం భరోసా ఇస్తున్నారు. జాతి ఆర్ధిక పునాదులు బలంగా వుండడం, దిద్దుబాటు చర్యలు సకాలంలో తీసుకోగల సమర్ధవంతమయిన యంత్రాంగం కలిగివుండడం దీనికి కారణాలుగా ఆయన పేర్కొంటున్నారు. ఆర్ధిక మంత్రి ధీమా ఆహ్వానించదగ్గదే. కానీ, ముందే పేర్కొన్నట్టు, ప్రస్తుతం అన్ని దేశాలవారు అంతో ఇంతో అమలుచేస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల కారణంగా విడిగా ఏ ఒక్క దేశమూ ఒంటరిగా ఈ పరిణామాల ప్రభావం నుంచి తప్పించుకునే వీలు సహజంగానే వుండదు. ఎదుర్కోగలిగిన సత్తా మాత్రమే కాదు అందుకు తగిన సంసిద్ధత కూడా అవసరం. ఎందుకంటె ఆర్ధిక రంగంలో చోటుచేసుకునే మార్పుల విష ఫలితాలు సునామీలా విస్తరిస్తాయి. కాచుకునే వ్యవధానం వుండదు. బహుశా, ఈ ఉద్దేశ్యంతోనే పరపతి రేటింగ్ కంపెనీలపై కన్నేసివుంచాలని ‘సెబీ’ సంకల్పించింది. అమెరికా పరపతి రేటింగ్ సృష్టించిన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి పరిస్థితులు మన దేశంలో తలెత్తకుండా ఈ జాగ్రత్త తీసుకుంటున్నట్టు కనబడుతోంది.

అలాగే, దేశ విదేశాలలో మన దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన ఐ.టీ. రంగం మరోసారి అలజడికి, భారీ కుదుపులకు గురికాకుండా చూసుకోవాలి. గతంలో ఆర్ధికమాంద్యం సమయంలో మన ఐ.టీ. రంగం కుప్పకూలకపోయినా కుదేలయిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. దాని ఫలితాలను రియల్ ఎస్టేట్ వంటి ఇతర రంగాలు చవిచూశాయి. తిరిగి ఇప్పుడు తలెత్తిన సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే వ్యయాన్ని బాగా నియంత్రించే ఐ.టీ. ఉత్పత్తులపట్ల శ్రద్ధ తీసుకోగలిగితేనే భారతీయ ఐ.టీ. రంగం నిలదోక్కుకోగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, భారతీయ ఐ.టీ. సంస్తలు కేవలం తమ ఉత్పాదనల పట్లనే కాకుండా నిరంతర పరిశోధన, అభివృద్ధి గురించి కూడా దృష్టి సారించడం అవసరమని వారంటున్నారు.

పోతే, ఆర్ధిక సంక్షోభాలను గట్టిగా ఎదుర్కుని నిలబడాలంటే అందుకు తగిన రాజకీయ సుస్తిరత చాలా అవసరం. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో రాజకీయ పార్టీలు కీచులాటలకు దిగకుండా ఒకే మాటపై నిలబడడం అన్నది ఈ పరిస్థితుల్లో ఎంతో మేలు చేస్తుంది. రాజకీయ కారణాలవల్ల ఏర్పడే అనిశ్చిత పరిస్థితులు కూడా ఆర్ధిక సంక్షోభ ప్రభావాలను మరింత విషమం చేసే ప్రమాదం వుంది. తరచుగా జరిగే బందులు, సమ్మెలు పరిస్తితులను మరింత దిగజారుస్తాయి. ఉదాహరణకు మన రాష్ట్రాన్నే తీసుకుంటే వరుస బందులు, ఆందోళనలతో రోజుకు అయిదు వందల కోట్ల రూపాయల మేరకు పారిశ్రామికరంగం నష్టపోతున్నదని ‘ఫాప్సీ’ పేర్కొన్నది.
మనదేశం పాఠాలు నేర్చుకోవాల్సిన మరో అనుభవం ఒకప్పుడు మనదేశాన్ని శతాబ్దాల తరబడి పాలించిన ఇంగ్లండు నుంచి.


గత కొద్ది రోజులుగా లండన్ నగరం తగలబడిపోతున్నదంటే అతిశయోక్తికాదు. రవి అస్తమించని సామ్రాజ్యంగా ఒకనాడు పేరుగాంచిన బ్రిటిష్ పాలకుల రాజధానీ నగరం ఈనాడు భయం గుప్పిట్లో, విధ్వంస జ్వాలల్లో చిగురుటాకులా వొణికిపోతోంది
ఒక్క లండన్ మాత్రమే కాదు బర్మింగుహాం, నాటింగ్ హాం, బ్రిస్టల్, మాంఛెస్టర్, లివర్ పూల్, ఇంకా మరెన్నో నగరాలు అగ్నిజ్వాలలకు ఆహుతవుతున్నాయి. అల్లరిమూకల దౌర్జన్యాలతో అతలాకుతలం అవుతున్నాయి. “ఈ దుస్సంఘటనలు బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత దౌర్భాగ్యకరం” అని ఆ దేశ ప్రదానమంత్రి డేవిడ్ కేమరున్ పేర్కొనడాన్నిబట్టి దిగజారిన అక్కడి పరిస్తితులను వూహించుకోవడం ఏమంత కష్టం కాదు.
పోలీసు కాల్పుల్లో ఓ నల్లజాతీయుడు మరణించడం అన్న ఒక్క కారణంతో ఇంత పెనుదుమారం చెలరేగిందంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. ఆ నల్లజాతీయుని మరణానికి నిరసనగా స్థానికులు నిరసన ప్రదర్శనకు దిగటం అదికాస్తా హింసాత్మకంగా మారటం, అలా మారిన పరిస్తితులను అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకోవడం ఇవన్నీ గమనిస్తున్నవారికి ఒక చిన్న విషయం సయితం ఎంత పెద్ద గందరగోళానికి దారి తీయగలదన్న సంగతి సులభంగా అవగతమవుతుంది. ‘జరిగిందేమిటి, జరుగుతున్నదేమిటి, జరగబోయేదేమిటి’ అన్న ప్రశ్నలు మాత్రం అక్కడి సభ్య సమాజాన్ని కలవరపరుస్తున్నాయి. నిన్న మొన్నటివరకు సహజీవనానికీ, సభ్యతా సంస్కారాలకు పెద్ద పీట వేసిన బ్రిటిష్ సమాజంలో ఈ నాడు తమ తోటివారినే అనుమానంతో చూడాల్సిన విషాద పరిస్తితి నెలకొన్నది. పరిచయం ఉన్నా లేకున్నా అందరినీ చిరునవ్వుతో పలుకరించుకునే బ్రిటిష్ పౌరుల సంప్రదాయం. అలాటిది ఈ రోజున చిరునవ్వులు చెదిరిపోయి బిగుసుకున్న పెదవులు దర్శనమిస్తున్నాయని ఆ దేశంలో చిరకాలం నుంచి నివసిస్తున్న తెలుగువారు ఇంటర్నెట్లో వాపోతున్నారు. దేశాల్లో వర్ణ వివక్షను ఖచ్చితంగా పాటించే బ్రిటిష్ శ్వేత జాతీయులు తమ దేశం లో మాత్రం దీనికి మినహాయింపు ఇస్తారని అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు కితాబు ఇస్తుంటారు కూడా. వివిధ
దేశాల వారు, అన్ని జాతుల వారు తమ దేశంలో తమతో పాటు సహజీవనం చేయడానికి వీలయిన ఉదార తత్వం బ్రిటిష్ శ్వేత జాతీయుల సొంతమనీ వారు చెప్పడం కద్దు.
అయినా ఎందుకీ అల్లర్లు అక్కడ జరుగుతున్నాయి ? వీటినుంచి నేర్చుకునే పాఠాలు ఏమిటి? వాటిని తెలుసుకోవడం, అర్ధం చేసుకుని తదనుగుణంగా మారడం వర్తమాన భారత ప్రజానీకానికీ, వారిని పాలించే పాలకులకు ఎంతో అవసరం.
బ్రిటన్ జనాభాలో శ్వేత జాతీయులది అగ్రభాగం. ఆ తరువాత ఆసియా దేశస్తులు. అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి ఆ దేశానికి వెళ్లి స్తిరపడ్డవారన్న మాట. చైనా, ఆఫ్రికా దేశాలనుంచి వచ్చిన వారు కూడా బ్రిటన్ లో ఏళ్లతరబడి మనుగడ సాగిస్తున్నారు.
ఇంగ్లాండ్ దక్షిణ ప్రాంతములో జనసాంద్రత అధికం. అలాగే జాతుల వైవిధ్యం కూడా ఎక్కువే. దేశ ఆర్థిక ప్రగతిలో దక్షిణాది ప్రాంతాలదే హవా. ఆర్థికమాంద్యం కొట్టిన దెబ్బతో ఆ దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. కొత్త ఉద్యోగాలు రావటం గగన కుసుమంగా మారింది. కనీస వేతనాలకన్నా తక్కువకే పనిచేయడానికి సిద్ధపడ్డా ఉద్యోగాలు ఇచ్చే నాధులు కరువయ్యారు. సహజంగా ఈ పరిణామాలు యే సమాజంలో నయినా అసంతృప్తులకు దారితీస్తాయి. దానికితోడు అంతో ఇంతో శ్వేత జాతీయులు పాటించే వర్ణ వివక్ష. అధికారికంగా కాకపోయినా ఉద్యోగాలకు పెట్టే ధరఖాస్తు స్తాయిలోనే ఈ వివక్ష మొదలవుతుందని వలస వర్గాల్లో ప్రతీతి.

జాతుల నడుమ క్రమేణా పేరుకుపోయే ఈ రకమయిన వివక్షల ప్రభావం అప్పుడప్పుడూ ఈ మాదిరి అల్లర్ల రూపంలో బయట పడుతూ వుండడం కూడా అక్కడ కొత్తకాదు.
కనీసం చిన్నాచితకా ఉద్యోగాలను సైతం మాకు దక్కనీయటంలేదని ఓ పక్క శ్వేతజాతీయులు ఆరోపిస్తుంటే, వారు పాటించే వర్ణవివక్ష గురించి వలస జాతీయులు ఆరోపించటం మామూలయి పోయింది. ఇలాంటి నేపధ్యం లోనే పోలీసులు ఓ నల్లజాతీయుడిని కాల్చి చంపటంతో అల్లర్లు ఉవ్వెత్తున వూపందుకున్నాయి.
ఈ సందర్భంలోనే భారతీయ సమాజం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు గురించిన ప్రస్తావన అవసరమవుతోంది.

అల్లర్లు చెలరేగిన సమయములో అక్కడి పోలీసుల వ్యవహారశైలి అత్యద్భుతం. కేవలం ఘటనలు జరిగిన 48 గంటల్లో దాదాపు 1500 మంది పైచిలుకు అనుమానితులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. అల్లర్లు లేని ప్రాంతాలలో పోలీసుల పహారా ముమ్మరం చేశారు. అల్లరి మూకలను అదుపు చేయటానికి వారు అనుసరించిన పద్దతులు అనుసరణీయం. ఇంత పెద్ద స్థాయిలో ఘటనలు జరుగుతున్న సమయంలో కూడా పోలీసులు తుపాకులకు పని చెప్పలేదంటే అల్లర్లను అదుపు చేయడంలో వారు అనుసరిచే అనుసరించే పద్ధతులు ఎలాటివో మన పోలీసులు నేర్చుకోవాలి. అలాగే అక్కడి మీడియా పోషించిన నిర్మాణాత్మక, బాధ్యతాయుతమయిన పాత్ర. వాస్తవాలు మినహా, వదంతులకు ఆస్కారమిచ్చే గాలివార్తలకు బ్రిటిష్ మీడియా పూర్తిగా దూరంగా వుంది.
మనదీ ప్రజాస్వామ్య దేశమే. ఇక్కడా అధికారపక్షం, విపక్షం అన్నీ ఉన్నాయి. విషమ ఘడియల్లో పాలక, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా యెలా వ్యహరించవచ్చన్నది ఆ దేశం నుంచి నేర్చుకోవాలి. అల్లర్ల సమయంలో బ్రిటన్ లోని ప్రతిపక్షాలవారందరూ నిగ్రహం పాటించిన తీరు మెచ్చదగినది. ఒక్కరు కూడా ప్రజల భావోద్వేగాలను మరింత రెచ్చగొట్టే ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అలాగే అక్కడి పాలక పక్షం కూడా ప్రతిపక్షాలు చేసిన ఆచరణ యోగ్యమయిన సూచనలు బేషరతుగా స్వీకరించింది. మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే – ఆపత్కాలంలో సాధారణ ప్రజానీకం సయితం చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోకుండా అవసరమైనంతమేరకే ఆత్మరక్షణ చర్యలకు దిగటం, గొప్ప గుండెనిబ్బరాన్ని ప్రదర్శించి చూపడం.

బ్రిటన్ కానివ్వండి ప్రపంచములో మరే గొప్ప దేశమయినా కానివ్వండి జరిగిపోయిన చరిత్రను మార్చగలిగే శక్తి కలిగివుండడం అసాధ్యం. తమ జాతికాని ప్రజలను తమ దేశానికి అనుమతించే ముందే ముందు చూపుతో వ్యవహరిస్తే పరిస్థితులు ఇలా పరిణమించే అవకాశం వుండదు. తీరా ఇతర జాతీయులు వచ్చి స్థిరపడి కొన్ని తరాలు గడిచిపోయిన తరువాత వారిపై వివక్ష చూపడం నాగరిక సమాజానికి అసలు సిసలు వారసులమని గొప్పలు చెప్పుకునే బ్రిటిష్ శ్వేత జాతీయులకు ఎంత మాత్రం తగని పని. (12-08-2011)

కృతజ్ఞతలు:  లండన్ అల్లర్లు గురించి శ్రీ అచంగ (అరుణ్ చంద్ర గడ్డిపాటి) తమ బ్లాగ్ కృష్ణవేణీ తీరం లో రాసిన కొంత సమాచారాన్ని ఇందులో ఉపయోగించుకోవడం జరిగింది. వారికి మనఃపూర్వక  కృతజ్ఞతాభివందనాలు - భండారు శ్రీనివాసరావు  




.





12, ఆగస్టు 2011, శుక్రవారం

పండంటే పండూ కాదూ ..... – భండారు శ్రీనివాసరావు



పండంటే పండూ కాదూ ..... – భండారు శ్రీనివాసరావు


అరటి పండు అరవై ఆరు రోగాలకు అమృతంలా పనిచేస్తుందంటున్నారు డాక్టర్లు. రోజూ ఒక అరటిపండు తినిచూడండి – మీ మెదడు కదను తొక్కే గుర్రంలా పనిచేస్తుందని కూడా సెలవిస్తున్నారు. అరటి పండులోని మంచి గుణాలను గురించి అరటిపండు వొలిచిపెట్టిన చందంగా వివరిస్తున్నారు.

అరటి పండు చూడానికి చిన్నగా వుంటుంది కానీ మనిషి శరీరానికి అవసరమయిన అనేక పోషక గుణాలు అందులో పుష్కలంగా వుంటాయిట.

ఈ పండులో ప్రకృతి సిద్ధమయిన మూడు ప్రధానమయిన చక్కర పదార్ధాలు- సక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ లు తగుపాళ్ళలో వుంటాయి. వీటివల్ల శరీరానికి కావాల్సిన శక్తి అప్పటికప్పుడే తక్షణం అందుతుంది.

రెండు అరటి పండ్లు తింటే చాలు మనిషికి కావాల్సిన శక్తి తొంభయ్ నిమిషాలపాటు నిరంతరాయంగా లభిస్తుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ప్రపంచ స్తాయి క్రీడాకారులు చాలామంది తమ శరీర పాటవాన్ని కాపాడుకునేందుకు అన్నింటికంటే ముందు అరటి పండునే ఎంచుకుంటారట.

శరీరాన్ని సౌష్టవంగా వుంచుకోవడానికి మాత్రమే కాదు అరటి పండు అనేక రకాల రుగ్మతల నివారణలో కూడా మానవాళికి సాయపడుతోంది. దినసరి ఆహారంలో అరటి పండును చేర్చుకోవడం వల్ల కలిగే మేళ్ళు అన్నీ ఇన్నీ కాదన్నది పరిశోధకుల అభిప్రాయం.
డిప్రెషన్ : ‘మైండ్’ అనే ఒక పరిశోధక సంస్త డిప్రెషన్ కు గురయి దిగులుతో కుంగిపోయేవారిపై కొన్ని సర్వేలు జరిపింది. అరటిపండు తిన్నతరువాత అటువంటి వారిలో డిప్రెషన్ లక్షణాలు చాలావరకు తగ్గిపోయాయట. అరటి పండులో ట్రిప్టోఫాన్ అనే పదార్ధం వుంటుంది. అరటిపండు తిన్న తరువాత అది శరీరంలో సెరొటోనిన్ గా మారుతుంది. మనిషిని ఉల్లాసంగా వుంచడానికి ఈ సెరొటోనిన్ బాగా ఉపయోగపడుతుందిట.
రక్తహీనత : అరటి పండులో రక్త హీనతను నివారించడానికి అవసరమయ్యే హెమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేసే ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. అందువల్ల రక్తహీనతతో బాధపడే రోగులకు అరటిపండు ఆరోగ్యదాయిని అని చెప్పవచ్చు.

రక్త పోటు: అరటిపండులో పొటాషియం చాలాఎక్కువగా వుంటుంది. పైగా ఉప్పుశాతం బాగా తక్కువ. అందువల్ల రక్త పోటును అదుపులో వుంచుకోవడానికి రోజూ ఒక అరటిపండు తింటే చాలు. అమెరికా లోని ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ వారు అరటిపండులోని ఈ పోషక విలువను గ్రహించి రక్తపోటు నివారణకు అరటిపండు దివ్యంగా పనిచేస్తుందని ప్రచారం చేసుకోవడానికి ఈ మధ్యనే అరటి పళ్ళ ఉత్పత్తిదారులను అనుమతించారని భోగట్టా.

బ్రెయిన్ పవర్ : ఇంగ్లాండ్ లోని ట్వికేహాం స్కూలు వాళ్లు తమ విద్యార్ధులకు క్రమం తప్పకుండా అరటి పళ్ళు తినిపించారట. అలా అరటి పళ్ళు ముప్పూటలా తిన్న విద్యార్ధులు పరీక్షల్లో చాలా మంచి ఫలితాలు సాధించారట.
మలబద్ధకం : మలబద్ధకం పోవాలంటే రోజూ ఒక అరటి పండు తింటే చాలట. ఎందుకంటె ఈ పండులోని ఫైబర్ విరోచనం సాఫీగా కావడానికి సహకరిస్తుందట.
గుండె మంట: గుండె మంటతో బాధపడే వాళ్లకు అరటిపండు మంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి అవసరమయిన యాంటాసిడ్ ప్రభావాన్ని అరటిపండు కలిగిస్తుంది.
వేవిళ్లు : వేవిళ్ళతో బాధపడే గర్భవతులకు అరటిపండుతో చేసిన పదార్ధాలు భోజనానికీ, భోజనానికీ మధ్య తీసుకుంటే వేవిళ్ళ ఉధృతం తగ్గుతుంది.
దోమకాటు: దోమలు కుట్టి దద్దుర్లు లేచినప్పుడు అప్పుడే వొలిచిన అరటి తొక్కతో రుద్దితే దద్దుర్లు తగ్గిపోతాయి.
స్తూలకాయం : స్తూలకాయానికి చక్కని విరుగుడు అరటిపండని ఆస్ట్రేలియాలో జరిపిన పరిశోధనలు తెలుపుతున్నాయి. కార్పోరేట్ ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు సాధారణంగా ఆఫీసుల్లో దొరికే చాకోలెట్లు, చిప్స్ తెగలాగిస్తూ తెగలావెక్కి పోతున్నారట. అలా వొళ్ళు పెంచి నడుం వంచలేని అయిదు వేలమంది లంబోదరులకు అరటి పళ్ళు తినిపించి వాళ్ల కొవ్వు చాలావరకు తగ్గించగలిగారట.
శీతాఫలం : చాలా చలవ చేసే పండు కాబట్టి దీన్ని ‘శీతాఫలం’ అనవచ్చేమో. గర్భవతుల్లో కలిగే శారీరక, మానసిక ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను సరిచేయడానికి చాలా దేశాల్లో అరటిపండు వాడుతుంటారు. కడుపుతో వున్న వాళ్లు అరటిపండ్లు తరచూ తింటుంటే వాళ్లకు పుట్టే పిల్లలు కూడా సరిపడా శారీరక ఉష్ణోగ్రతతో జన్మిస్తారనే నమ్మకం థాయ్ లాండ్ లో వుంది.
మందుకు మంచి మందు : మందుబాబులకు, పొగరాయుళ్లకు కూడా అరటి పండు ఎంతో మేలు చేస్తుంది. మందు డోసు ఎక్కువై మర్నాడు హాంగ్ ఓవర్ తో కుదేలయ్యే దేవదాసులు రాత్రి పడుకోబోయేముందు అరటి పండుతో చేసిన ‘బనానా షేక్’ తీసుకుంటే తెల్లవారిన తరువాత తగులుకునే తలనొప్పులు తొలగిపోతాయట. అలాగే పొగతాగేవాళ్ళు ఉన్నట్టుండి ఆ అలవాటు మానుకోవాలని మనసులో ఎంత మధనపడ్డా ‘విత్ డ్రాయల్ సిండ్రోం వారిని పట్టి వేధిస్తూనే వుంటుంది. అలాటివాళ్ళు అరటిపళ్ళు తినడం వల్ల - శరీరంలో నికోటిన్ శాతం తగ్గిపోవడం వల్ల కలిగే విత్ డ్రాయల్ సిండ్రోం చాలావరకు మటుమాయమవుతుందట.
వొత్తిళ్లు : వొత్తిళ్లను తగ్గించుకోవడానికి కూడా అరటి పండు బాగా ఉపకరిస్తుంది. అరటిపండులో లభించే పొటాషియం దానికి కారణం. అలాగే అరటి పండులో సమృద్ధిగా లభించే విటమిన్ ‘బి’ వల్ల నాడీమండల వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.
అంతే కాదు యాపిల్ కంటే కూడా అరటి పండు ఎన్నోరకాలుగా మంచి చేస్తుందని పరిశోధకుల ఉవాచ. యాపిల్ తో పోలిస్తే అరటి పండులో నాలుగు రెట్లు ఎక్కువగా ప్రోటీన్లు, రెండు రెట్లు పిండి పదార్ధాలు, మూడు రెట్లు భాస్వరం, అయిదు రెట్లు విటమిన్ ‘ఏ’, ఐరన్ - అరటి పండులో వుంటాయి. పొటాషియం కూడా చాలా ఎక్కువ.
ఇన్నిన్ని పోషకవిలువలు వున్న అరటిపండు పేదవాడి యాపిల్ పండు అంటే అతిశయోక్తి కాదు.
మరో విషయం న్యూ ఇంగ్లాండ్ మెడిసిన్ జర్నల్లో ఇంకో విషయం రాసారు. రోజూ క్రమం తప్పకుండా ఒక అరటిపండు తింటే గుండె పోటు వచ్చే అవకాశాలు నలభై శాతం తగ్గిపోతాయిట.

ఇన్నిమంచి విషయాలు చెబుతున్న శాస్త్రవేత్తలు మరో ముఖ్య విషయం కూడా చెబుతున్నారు. అదేమిటంటే ఎట్టి పరిస్తితుల్లోను అరటి పండ్లను రిఫ్రిజిరేటర్లలో వుంచడం ఎంతమాత్రం మంచిది కాదట. (11-08-2011)



11, ఆగస్టు 2011, గురువారం

తప్పు తప్పే – భండారు శ్రీనివాసరావు

తప్పు తప్పే – భండారు శ్రీనివాసరావు



ఒక జడ్జి గారు చనిపోయి పరలోకానికి పయనమై వెడుతుంటే వెంటవుండి తీసుకువెడుతున్న యమభటులు రూటు మార్చి ఆయన్ని తమ లోకానికి పట్టుకుపోయారు. అక్కడ ఆ సమయంలో యమధర్మరాజు కొలువు తీరి చిత్రగుప్తుడి సాయంతో పాపుల్ని విచారించి దండనలు విధిస్తున్నారు. కొద్ది సేపటిలోనే మన జడ్జీ గారి వంతు వచ్చింది. భూలోకంలో ఆయనకు యముడికి వున్నంత మంచి పేరు వుంది. రాగద్వేషాలు లేకుండా, స్వపర బేధాలు చూడకుండా కేసుల్ని విచారించి తీర్పులు ఇస్తాడనీ, ఎలాటి ప్రలోభాలకు లొంగడనీ అందరూ ఆయన్ని గురించి చెప్పుకునేవాళ్ళు. లక్షలకోట్లు ప్రజాధనాన్ని దిగమింగిన బడా రాజకీయనాయకులని కూడా వొదిలిపెట్టకుండా జైలు వూచలు లెక్కబెట్టించిన ఘనకీర్తి ఆయనది. అలాటి తనను నేరుగా స్వర్గానికి తీసుకుపోకుండా ఈ నరకకూపంలోకి పట్టుకువచ్చినందుకు ఆయనకు ఒకటే గుర్రుగా వుంది. ‘ఆర్డర్ ఆర్డర్’ అని హుంకరించడానికి ఇది కోర్టు హాలు కాదని గుర్తుకువచ్చి తమాయించుకున్నాడు. ఇంతలో చిత్రగుప్తుడు చిట్టావిప్పి ఆయన నరలోకంలో వుండగా చేసిన పాపాల జాబితా చదవడం, సమవర్తి వాటికి తగ్గ శిక్షలను అక్కడికక్కడే విధించడం చూసి ఆ న్యాయమూర్తికి తల తిరిగిపోయింది. సాక్షులు లేకుండా, సాక్ష్యాలు లేకుండా కేసుల్ని విచారించి అప్పటికప్పుడే యముడు తీర్పులు వెలువరించడం, అప్పీలుకు అవకాశం లేకుండా అక్కడి సిబ్బంది వాటిని వెంటనే అమలు పరుస్తూ వుండడం ఇదంతా మన జడ్జి గారికి సుతరామూ నచ్చలేదు. పైగా సచ్చీలతకు మారుపేరని, నిజాయితీకి మరోపేరని గొప్ప పేరున్న తను తప్పులు చేసినట్టు చిత్రగుప్తుడు చెప్పడం చూసి ఆయనకు మతిపోయింది. చిత్రగుప్తుడు తాను చేసినట్టు చెబుతున్న  తప్పులకు, వాటికి యముడు విధించిన శిక్షలకు పొంతన లేకపోవడం ఆయన్ని మరింత నివ్వెరపరచింది. చిత్రగుప్తుడు తనపై మోపిన అభియోగాలు విన్న తరువాత సమవర్తిగా యమధర్మరాజుకున్న బిరుదుకు ఆయన ఏమాత్రం తగడని ఆయనకు అనిపించింది.

ఇంతకీ తను చేసిన తప్పులేమిటి?  ఒక ఉన్నత న్యాయస్తానంలో న్యాయమూర్తిగా వున్నప్పుడు అధికారిక విధులపై అనేకసార్లు అనేక నగరాల్లో అయిదు నక్షత్రాల హోటళ్ళలో విడిది చేసేవాడు. హోటల్ బిల్లులు, అన్నపానీయాల ఖర్చులు అన్నీ నిబంధనల ప్రకారమే వుండేలా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. అయితే, తనకు ఒక చిన్న బలహీనత వుండేది. హోటల్ గది ఖాళీ చేసేటప్పుడు బాత్ రూమ్ లో వుండే రకరకాల శాంపిల్ సబ్బులను, షాంపూ బాటిళ్ళను ఇంటికి పట్టుకువచ్చేవాడు. అంతంత డబ్బులుపోసి అంత పెద్ద హోటళ్ళలో బస చేసినప్పుడు వాటిని తీసుకురావడం అంత పెద్ద విషయంగా కాని, తప్పుపట్టాల్సిన విషయంగా కానీ తనకు ఎప్పుడూ తోచలేదు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఇలాటి చిన్న తప్పుల్ని ఒక హెచ్చరికతో వొదిలిపెట్టవచ్చు. కానీ ఈ నరక లోకంలో రూల్స్ వేరేగా వున్నట్టున్నాయి. చిన్న తప్పు, పెద్ద నేరం అనే బేధం లేకుండా సరి సమానంగా శిక్షలు వేస్తున్నారు. పైగా వాటికి అప్పీలు కూడా లేకపోవడం మరీ అన్యాయం.

జడ్జి మనసులో తొలుస్తున్న సందేహాలను యమధర్మరాజు అర్ధం చేసుకున్నాడు.

‘తప్పు చేయడం, వాటిని మళ్ళీ మళ్ళీ చేయడం మా శిక్షాస్మృతి ప్రకారం పూర్తిగా నిషేధం. పైగా శిక్షార్హం. చిన్న తప్పులు జరగకుండా జాగ్రత్త పడితేనే పెద్దవి జరగకుండా వుంటాయి. మా నిబంధనల ప్రకారం చిన్నదయినా పెద్దదయినా తప్పు తప్పే. నేరం నేరమే. అలాగే విధించే శిక్షలలో కూడా హెచ్చుతగ్గులుండవు. విచారణలను ఏళ్లతరబడి సాగదీయడం వల్ల కూడా దోషులు తప్పించుకునే వీలు మీ న్యాయశాస్త్రం కల్పిస్తోంది. వందమంది దోషుల్ని విడిచిపెట్టినా పరవాలేదు కాని ఒక్క నిర్దోషిని కూడా శిక్షించకూడదు అనే కాలం చెల్లిన సిద్ధాంతంతో మీ కోర్టులు అనవసర కాలయాపన చేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ నిర్వహణలో మీకూ మాకూ అదే తేడా. మీది భూలోకం – మాది యమలోకం. అందుకే మిమ్మల్ని న్యాయమూర్తి అంటారు. మమ్మల్ని సమవర్తి అంటారు.” వివరించాడు యమధర్మరాజు. (11-08-2011)

10, ఆగస్టు 2011, బుధవారం

ఓ చిట్టెలుక కధ – భండారు శ్రీనివాసరావు

ఓ చిట్టెలుక కధ – భండారు శ్రీనివాసరావు


 

అనగనగా ఒక రైతు. ఇంట్లో ఎలుకల బాధ భరించలేక ఆదివారం సంతకు వెళ్లి ఎలుకల బోను తెచ్చాడు.

అప్పుడే కన్నంలో నుంచి తలబయట పెట్టిన ఓ చిట్టెలుకకు ఆ బోనును చూడగానే ముచ్చెమటలు పట్టాయి.

వెంటనే రివ్వున పొలం వెళ్లి తను చూసిన విషయాన్ని తోటివారికి చెప్పాలనుకుంది.

‘రైతు సామాన్యుడు కాడు. మనల్ని పట్టుకోవడానికి బోను కొనుక్కుని వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త’ అని ఎలుగెత్తి అరిచింది.

ఎలుక హడావిడి చూసి కోడిపుంజుకు చిర్రెత్తుకువచ్చింది.

‘అయితే ఏమిటట. బోను తెస్తే భయపడాల్సింది నువ్వు. మాకెందుకు భయం?’ అంటూ కొక్కొరోకో అనబోయి ఇంకా తెల్లవారలేదన్న సంగతి గుర్తుకొచ్చి వూరుకుంది. ఇంత పెద్ద కబురు తెస్తే కోడి పుంజు అలా గాలి తీసినట్టు తేలిగ్గా తీసిపారేయటం చూసి చిట్టెలుక చిన్నబుచ్చుకుంది. పక్కనే పడుకున్న పంది దగ్గరకు వెళ్లి తన కడుపులోమాట చెప్పి బావురుమంది. పంది ఎలుకను ఓదార్చింది. బోను గురించి భయపడాల్సిన పని తనకు లేదని అంటూ ఎలుక క్షేమం కోసం ప్రార్ధనలు చేస్తానని హామీ ఇచ్చింది.

ఎలుక అంతటితో వూరుకోకుండా దోవలో కనబడ్డ ఎద్దుకు బోను విషయం చెప్పి ‘అందరం కలసి ఏదో చెయ్యకపోతే అందరికీ మూడుతుందని’ హెచ్చరించింది.

ఎద్దు దానికి సమాధానంగా ‘ఓసి పిచ్చిమొద్దూ . రైతు ఎలుక బోను తెచ్చాడని నేను కంగారు పడితే అర్ధం ఏమిటి. అందులో నా కాలి గిట్ట కూడా పట్టదు’ అని ఎగతాళి చేసింది.

ఇక ఎలుకకు ఏమి చేయాలో తెలియక ఇంటి దారిపట్టింది.

ఆ రాత్రి రైతు ఇంట్లో పెద్ద శబ్దం వినిపించింది. ఎలుకల బోను హటాత్తుగా మూసుకోవడంతో వచ్చిన చప్పుడు అది. రైతు భార్య లేచి బోను వద్దకు వెళ్ళింది. చీకట్లో అందులో ఏదో చిక్కుకున్న సంగతి లీలగా బోధపడింది. తీరా చూస్తే అది ఒక విష సర్పం. దాని కాటుకు రైతు భార్య స్పృహ కోల్పోయింది. వెంటనే వూళ్ళో వైద్యుడిని పిలుచుకు వచ్చారు. అతడేదో మందువేసి నీరసంగా వున్న రైతు భార్యకు ఏదయినా బలవర్ధక ఆహారం పెట్టమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.

రైతుకు పొలంలో వున్న కోడిపుంజు గుర్తుకు వచ్చి దానిని కోసి భార్యకు ఆహారంగా ఇచ్చాడు.

విషయం తెలుసుకున్న ఇరుగూ పొరుగూ చూడడానికి వచ్చారు. వారిలో కొందరు ఆమెను కనిపెట్టుకు చూడడానికి అక్కడే వుండిపోయారు. వారికోసం రైతు పందిని కోసి వండక తప్పలేదు.

కానీ, దురదృష్టం. వైద్యుడు ఇచ్చిన ఔషధం కన్నా విషం బాగా పని చేసి రైతు భార్య ఆ మరునాడు కన్నుమూసింది.

ఆమె కర్మకాండకు ఎంతో దూరం నుంచి చుట్టపక్కాలు వచ్చారు. వారికి వొండి పెట్టడానికి రైతు ఎద్దును కోయాల్సివచ్చింది.

ఈ పరిణామాలన్నింటినీ ఎలుక తన కలుగులోనుంచి గమనిస్తూ తన తోటివారు ఒక్కొక్కరే కనుమరుగు కావడం చూసి ఎంతో బాధపడింది.

ఒక విదేశీ జానపద కధాంశం ఆధారం అయిన ఈ చిట్టెలుక కధలో నీతి ఏమిటంటే –

‘ఎవరయినా ఏదయినా సమస్యలో చిక్కుకుని మన వద్దకు వచ్చినప్పుడు ఆ సమస్య మనది కాదని తప్పుకోవడం మంచిది కాదు. సంఘ జీవనంలో వున్నప్పుడు అందరి సమస్యలు అందరివీ అనుకోవాలి.’

(10-08-2011)

8, ఆగస్టు 2011, సోమవారం

కలగంటి కలగంటి

కలగంటి కలగంటి




'నిన్న కలలో ఒక పెద్ద తప్పు చేసాను"

జాక్ స్టీవన్స్ తన మిత్రుడితో బాధ పడుతూ చెప్పాడు.

'కలలో తప్పు చేసావా? అదెలా!' ఆశ్చర్యపోతూ అడిగాడు స్నేహితుడు.

'కలలో వాటికన్ వెళ్లాను. పోప్ తన చేతులతో స్వయంగా నాకు తేనీరు కలిపి తీసుకువచ్చారు. ఇలాగే తాగుతావా? వేడి చేసి తీసుకురానా అని అడిగారు. నేనలాగే తాగి ఉండవచ్చుకదా. వేడిచేసి తెమ్మన్నాను. ఆయన వెచ్చబెట్టి తెచ్చేలోగా మెలకువ వచ్చేసింది.' బాధ పడ్డాడు స్టీవన్స్.

చాలామంది ఇంతే.

కలలోకూడా తమ గుణం మార్చుకోరు.

7, ఆగస్టు 2011, ఆదివారం

గాయత్రి మంత్రం - భండారు శ్రీనివాసరావు


గాయత్రి మంత్రం - భండారు శ్రీనివాసరావు   

(గాయత్రీ మంత్ర ప్రాశస్త్యం గురించి గతంలో సేకరించి అందించిన సమాచారం పట్ల చాలామంది పాఠకులు సహృదయంతో స్పందించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరికొన్ని అదనపు వివరాలు, విశేషాలు వెల్లడించే ప్రయత్నంలో భాగమే ఇది. మరో విషయం. ఈ రోజు ఆగస్టు ఏడో తేదీ నా 66 వ పుట్టినరోజు. పుణ్యం పురుషార్ధంగా భావించి ఈ అంశం ఎన్నుకున్నాను. ఎక్కడయినా ముద్రారాక్షసాలు కనబడితే  దయచేసి నన్ను క్షమించకండి.)

గాయత్రి మంత్రము.

ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

ప్రప్రధమంగా ఋగ్వేదంలో పేర్కొన్న ఈ పవిత్ర మంత్రం ఒక్కో దేవత పేరుతొ ఒక్కోరకంగా ప్రవచించబడింది.

దేవతలు – గాయత్రీ మంత్రాలు



1. అగ్ని గాయత్రి : ఓం మహా జ్వాలాయ విద్మహే

అగ్ని దేవాయ ధీమహి తన్నో అగ్ని: ప్రచోదయాత్

2. ఇంద్ర గాయత్రి : ఓం సహస్ర నేత్రాయ విద్మహే

వజ్ర హస్తాయ ధీమహి తన్నో ఇంద్ర: ప్రచోదయాత్

3. కామ గాయత్రి: ఓం కామదేవాయ విద్మహే

పుష్పబాణాయ ధీమహి తన్నోనంగ: ప్రచోదయాత్

4. కృష్ణ గాయత్రి : ఓం దేవకీ నందనాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ: ప్రచోదయాత్

5. గణేశ గాయత్రి : ఓం ఏకదంష్ట్రాయ విద్మహే

వక్రతుండాయ ధీమహి తన్నో దంతి: ప్రచోదయాత్

6. గురు గాయత్రి : ఓం సురాచార్యాయ విద్మహే

వాచాస్పత్యాయ ధీమహి తన్నో గురు: ప్రచోదయాత్

7. చంద్ర గాయత్రి : ఓం క్షీర పుత్రాయ విద్మహే

అమృతతత్వాయ ధీమహి తన్నోశ్చంద్ర: ప్రచోదయాత్

8. తులసీ గాయత్రి : ఓం శ్రీ తులస్యై విద్మహే

విష్ణు ప్రియాయై ధీమహి తన్నో బృందా: ప్రచోదయాత్

9. దుర్గా గాయత్రి : ఓం గిరిజాయై విద్మహే

శివ ప్రియాయై ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్

10. నారాయణ గాయత్రి : ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణః ప్రచోదయాత్

11. నృసింహ గాయత్రి : ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే

వజ్ర నఖాయ ధీమహి తన్నో నృసింహ: ప్రచోదయాత్

12. పృధ్వీ గాయత్రి : ఓం పృధ్వీదేవ్యై విద్మహే

సహస్రమూర్త్యై ధీమహి తన్నో పృధ్వీ ప్రచోదయాత్

13. బ్రహ్మ గాయత్రి : ఓం చతుర్ముఖాయ విద్మహే

హంసారూడాయ ధీమహి తన్నో బ్రహ్మ: ప్రచోదయాత్

14. యమ గాయత్రి : ఓం సూర్యపుత్రాయ విద్మహే

మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్

15. రాధా గాయత్రి : ఓం వృష భానుజాయై విద్మహే

కృష్ణ ప్రియాయై ధీమహి తన్నో రాధా ప్రచోదయాత్

16. రామ గాయత్రి : ఓం దాశరధాయ విద్మహే

సీతావల్లభాయ ధీమహి తన్నో రామ: ప్రచోదయాత్

17. లక్ష్మీ గాయత్రి : ఓం మహాలక్ష్మేచ విద్మహే

విష్ణు ప్రియాయై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్

18. వరుణ గాయత్రి : ఓం జలబింబాయ విద్మహే

నీల పురుషాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్

19. విష్ణు గాయత్రి : ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు: ప్రచోదయాత్

20. శని గాయత్రి : ఓం కాకధ్వజాయ విద్మహే

ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్

21. శివ గాయత్రి : ఓం పంచవక్త్రాయ విద్మహే

మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్

22. సరస్వతీ గాయత్రి : ఓం సరస్వత్యై విద్మహే

బ్రహ్మ పుత్ర్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్

23. సీతా గాయత్రి : ఓం జనక నందిన్యై విద్మహే

భూమిజాయై ధీమహి తన్నో సీతా: ప్రచోదయాత్

24. సూర్య గాయత్రి : ఓం భాస్కరాయ విద్మహే

దివాకరాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్

25. హనుమద్గాయత్రి : ఓం అంజనీ సుతాయ విద్మహే

వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి: ప్రచోదయాత్

26. హయగ్రీవ గాయత్రి : ఓం వాగీశ్వరాయ విద్మహే

హయగ్రీవాయ ధీమహి తన్నో హయగ్రీవః ప్రచోదయాత్

27.హంస గాయత్రి : ఓం పరమహంసాయ విద్మహే

మహాహాంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్

(గాయత్రి గురించి ఋషిపుంగవుల ప్రశంసలు మరో సారి)

(07-08-2011)