జర్నలిజం విద్యార్థి దశలో NEWS అంటే North (ఉత్తరం), East (తూర్పు), West (పశ్చిమం), South (దక్షిణం) ఇలా నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమాచారం అని చెప్పేవారు. మా చిన్నప్పుడు ఆంధ్రపత్రిక దినపత్రికలో అనేక వార్తలు వచ్చేవి. నిజంగా నాలుగు దిక్కుల నుంచి అందే వార్తలు ఆ పత్రికలో కనబడేవి. పాట్రిస్ లుముంబా, డాగ్ హామేర్షేల్ద్, ఐసన్ హోవర్, స్టాలిన్, కృశ్చెవ్, నాసర్, మార్షల్ టిటో, చౌ ఎన్ లై, అరాఫత్ వంటి విదేశీ నాయకుల పేర్లు, లియోపాల్డ్ విల్లీ, కాంగో వంటి ప్రాంతాల పేర్లు చిన్న పిల్లలకు కూడా తెలిసేంతగా ఆ వార్తలు ప్రముఖంగా ప్రచురించేవారు. కాలక్రమంలో మనం ఉంటున్న ప్రాంతాలకు సంబంధించిన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలయింది. ఇది ఎంతగా రెక్కలు విచ్చుకుంది అంటే హైదరాబాదు వంటి నగరాల్లో చిక్కడపల్లిలో అర్ధరాత్రి ఏదైనా సంఘటన జరిగితే పొరుగున వున్న అశోక్ నగర్ లో పంపిణీ అయ్యే పత్రికల్లో ఆ వార్త ప్రచురణకు నోచుకోనంతగా. అంతగా పత్రికల్లో వార్తలు ప్రాంతాల వారీగా పరిమితం అయిపోతున్నాయి. కాబట్టి NEWSకి వేరే భాష్యం చెప్పుకోవాలి ముందు ముందు.
ఇంత ఉపాధ్ఘాతం ఎందుకంటే మన పొరుగున ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఈ రోజు (సోమవారం) గవర్నర్ చేసిన ప్రసంగంపై పాలక పక్షం తీవ్ర అభ్యంతరం చెప్పినట్టు కొన్ని టీవీల్లో స్క్రోలింగులు గిరగిర తిరిగాయి. గవర్నర్ వాకవుట్ చేసినట్టు, పాలక పక్షం వాకవుట్ చేసినట్టు ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు స్క్రోలింగులు నడిపారు. రేపు తెల్లారి పత్రికలు చూడాలి ఏది వాస్తవమూ తెలుసుకోవడానికి.
అర్ధం అయినంతవరకు తెలియవచ్చింది ఏమిటంటే, తమిళనాడు మంత్రివర్గం ఆమోదించి పంపిన ప్రసంగం ప్రతిని యధాతధంగా చదవడం సాంప్రదాయం (Convention). అయితే గవర్నర్ , రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఆ ప్రసంగంలోని కొన్ని పేరాలు చదవకుండా, కొత్తగా కొన్ని వాక్యాలు చేర్చి చదివారు అన్నది స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె ప్రభుత్వం అభ్యంతరం, అభియోగం కూడా. అసెంబ్లీలో గవర్నర్ చేసే ప్రసంగం సాంప్రదాయానికి (క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగానికి) అనుగుణంగా వుండాలి, అసెంబ్లీ వెలుపల చేసేవి, (రిపబ్లిక్ డే రోజున చేసే ప్రసంగాలు) కొంత మూల ప్రతిని దాటి చదివినా పర్వాలేదన్నది మరో సాంప్రదాయం.
నిజంగా ఇది రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య తలెత్తిన ఓ వివాదం. సాంప్రదాయం (Convention) నిబంధన (Rule) కాదన్నది ఒక వాదన. సాంప్రదాయాలను పాటించడం ప్రజాస్వామ్య స్పూర్తి అనేది మరో పక్షం వాదన. ఈ రెండు వాదనలు చేసే వాళ్ళు వేర్వేరు రాజకీయ పార్టీల వాళ్ళు కావడం వల్ల చిక్కుముడి విడివడడం అంత సులభం కాదు.
ఇలాంటి సంఘటనలు మరీ కొత్తవి ఏమీ కాదు.
పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో వున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మవీర అనే పెద్దమనిషిని గవర్నర్ గా పంపింది. ఆయన కూడా నేటి తమిళనాడు గవర్నర్ రవి గారి లాగానే క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగం ప్రతిని పక్కన పెట్టి, అసెంబ్లీలో సొంత ప్రసంగం చేయడంతో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభువులు భగ్గుమన్నారు.
ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగిన భారత ప్రజాస్వామ్యంలో అన్ని చోట్ల ఒకే పార్టీ పాలించే రోజులు చెల్లిపోయాయి.
కాబట్టి అరుదుగా చోటు చేసుకునే ఇటువంటి సంఘటనలు ముందు ముందు తరచుగా తలెత్తే అవకాశాలు మెండుగా వుంటాయి కనుక, వీటికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఎంత త్వరగా కనుక్కుంటే అంత శ్రేయస్కరం.
(09-01-2023)