హోదా గోదాలో రాజకీయ వస్తాదులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హోదా గోదాలో రాజకీయ వస్తాదులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

హోదా గోదాలో రాజకీయ వస్తాదులు

(Published by "SURYA" telugu daily in it's edit page on 26-02-2015, THURSDAY)
రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, ఒక్క ఏడాదిలోనే  పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు చెదిరిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు  పండిత, పామరులనే  తేడా లేకుండా జనాలు ఉచిత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఏడాది ముందు ఏం జరిగిందో మరపున పడిందన్న నమ్మకంతో కాబోలు,  పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటలు గుర్తులేనట్టు ఈనాడు నాయకులు మాట్లాడుతున్నారు. 'మీరలా  అన్నార'ని  ఒకళ్ళు అంటుంటే 'తామలా అన'నే లేదని మరొకళ్ళు బుకాయిస్తున్నారు. చట్టసభల రికార్డుల్లో మొత్తం వ్యవహారం పదిలంగా వుందని తెలిసికూడా మొండిగా వాదిస్తున్నారు.   రాజకీయ అభినయకళ ముందు, చతుష్టష్టి  కళల్లో మిగిలిన అరవై మూడూ వెలవెలబోతున్నాయి.
నిరుడు కేంద్రంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్లమెంట్ ఉభయసభల సమావేశాల తుది ఘడియల్లో ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లును తెర మీదకు తెచ్చింది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు అయిదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించబోతున్నట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక సభ సాక్షిగా హామీ ఇచ్చారు. బిల్లు సానుకూలంగా నెగ్గే విధంగా చూడాలని కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులను అభ్యర్ధించారు. ఎందుకంటే బిల్లు  ఆమోదం పొందాలంటే  ప్రతిపక్ష బీజేపీ సహకారం కావాలి. 'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం' లాంటి ఆ బిల్లును అన్ని రాజకీయపార్టీలు ఇష్టం వున్నా లేకపోయినా తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసం 'మమ' అనిపించి బిల్లును అప్పటికి గట్టెక్కించాయి. బిల్లు తెచ్చిన కాంగ్రెస్ సర్కారును ఒడ్డెక్కించాయి. లోపల ఏమున్నా బయటకు మాత్రం ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల పూర్తి ఆమోదంతోనో, పాక్షిక ఆమోదంతోనో జరిగిందనడం వాస్తవం.
నిరుడు ఫిబ్రవరి నెలలో ఏం జరిగిందో ఓసారి సింహావలోకనం చేసుకుందాం.
పార్లమెంటు సమావేశాలు ముగియనున్న తరుణంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లోకసభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టింది. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, తెలుగు దేశం సభ్యులు నిరసన తెలుపుతున్న నేపధ్యంలో,  ప్రత్యక్ష ప్రసారాలు నిలుపుచేసి, మూజువాణీ ఓటుతో  బిల్లును ఆమోదింప చేశారు.  హైదరాబాదు నగరాన్ని రెండు రాష్ట్రాలకు పదేళ్ళపాటు రాజధానిగా వుంచుతూ బిల్లులో పొందుపరచిన అంశంతో విభేదిస్తూ ఎంఐఎం ప్రవేశపెట్టిన సవరణ తిరస్కరణకు గురయింది. 'ఒక అనారోగ్య సంప్రదాయానికి తెర తీసినట్టయింద'ని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదం పొందిన సంబరంలో టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ అజాద్  ఆనందోత్సాహాలు వెలిబుచ్చుతున్న సమయంలోనే, 'భారత దేశ చరిత్రలోనే ఇది చీకటి అధ్యాయం అంటూ,  'పట్టపగలే ప్రజాస్వామ్యం  ఖూనీ అవడం కళ్ళారా చూస్తున్నామ'ని  వై.యస్.ఆర్.సీ.పీ.  నాయకుడు వై.యస్. జగన్ మోహన రెడ్డి అభివర్ణించారు.    
'సీమాంధ్రకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంద'ని నాటి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సభలో ప్రకటించారు.
మరునాడే రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించింది. విభజనకు వ్యతిరేకం కాదంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పించాలని బీజేపీ కోరడం, అయిదు సంవత్సరాలకు మాత్రమే కాంగ్రెస్ అంగీకరించడం చచకా జరిగిపోయాయి. బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణా ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ పరిణామాలకు నిరసనగా రాష్ట్ర  కాంగ్రెస్ లో నిరసనలు మొదలయ్యాయి.  సీమాంధ్ర కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు తమ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడదే నాయకుడు నవజాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖ్యాతి దక్కించుకున్న  శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ నుంచి తప్పుకుని సొంత పార్టీ పెట్టుకున్నారు. దరిమిలా ఉమ్మడి రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో పార్టీల తలరాతల్ని ప్రజలు మార్చేసారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పుణ్యమే అని బలంగా నమ్మిన సీమాంధ్ర ఓటర్లు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఇటు తెలంగాణాలో కూడా దాదాపు అదే పరిస్తితి. తెలంగాణా తెచ్చిన పార్టీగా టీ.ఆర్.యస్. పేరు దక్కించుకుంది.  కానీ తెలంగాణా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ప్రజలు గుర్తించకపోవడంతో ఆ పార్టీ పని రెంటికీ చెడ్డ రేవడి చందం అయింది. కాంగ్రెస్ చేసిన రాజకీయం సీమాంధ్రలో తెలుగుదేశానికి కలిసివచ్చింది. విభజన తరువాత రాష్ట్రాన్ని పునర్నిర్మించగల చేవ  చంద్రబాబుకు వున్నదని గట్టిగా నమ్మడంతో అంతవరకూ అన్ని సర్వేల్లో అజేయంగా ముందుకు దూసుకువెడుతున్న వై.యస్.ఆర్.సీ.పీ.  ఆఖరు పరీక్షలో కుదేలయింది. ఆఖరి క్షణం వరకు చేతికందే దూరంలో వూరిస్తూ వచ్చిన అధికారానికి  దూరం అయింది.   
'రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా' అన్నట్టు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు తలచుకోవలే కానీ ఎలాటి బిల్లులయినా చిటికెలో చట్టసభల ఆమోదం పొంది చట్టాలుగా మారతాయని అనడానికి, ఇన్ని పరిణామాలకు కారణం అయిన  ఆంధ్ర ప్రదేశ్ విభజన  తీరే  ఒక ఉదాహరణ.
నిరుడు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన ఈ బిల్లును లోక్ సభ ఆమోదించింది. మూడో రోజునే అంటే ఇరవయ్యో తేదీన  రాజ్యసభ ఆమోదం పొందింది. మార్చి ఒకటో తేదీన  రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. వెంటనే దాన్ని అధికారిక రాజపత్రం (గెజిట్)లో ప్రచురించారు. జూన్ రెండో తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి రావడం, ఆ తేదీనుంచే సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలుగా వేరుపడడం ఆఘమేఘాలమీద జరిగిపోయాయి. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా ఇవన్నీ జరిగాయి. సరిగ్గా ఏడాది తరువాత తెరలేచిన తాజా పరిణామాలకు కూడా ఆ మహాత్ముడే సాక్షి కావడం కాకతాళీయం కావచ్చేమో!
ఈ విషయాలన్నీ గుర్తు చేసుకోవడానికి కారణం వుంది. విభజన అనంతరం ఏర్పడే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రస్తుతం పాత్ర మారిపోయిన  కాంగ్రెస్, కొత్తగా  ప్రభుత్వంలోకి వచ్చిన బీజేపీని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం ఎదుట బడ్జెట్ సమావేశాల తొలిరోజునే కాంగ్రెస్ దీక్షా కార్యక్రమం నిర్వహించింది. ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతూ, ఏపీ కాంగ్రెస్ కమిటీ కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. అయిదేళ్ళు కాదు, పదేళ్ళ ప్యాకేజీ కోసం ఆనాడు పట్టుబట్టిన బీజేపీ ఈనాడు పాలకపక్షం పాత్ర ధరించి, ఆ హామీ విషయంలో పాత్రోచితంగా  మీనమేషాలు లెక్కబెడుతోంది. పాత్రలు తారుమారు కావడం అంటే ఇదే కాబోలు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల లభించే ప్రయోజనాలేమిటి? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  1969లో తొలిసారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది.   ఐదు అంశాల ఆధారంగా ప్రత్యేక హోదా కల్పించాలని నాటి ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది.  మొదటిది ఈ హోదా కోరుతున్న రాష్ట్రం పర్వత ప్రాంతం అయివుండాలి. జన సాంద్రత తక్కువగా వుండడమే కాకుండా వున్న జనాభాలో గిరిజనుల సంఖ్య అధికంగా వుండాలి. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దులు కలిగిన రాష్ట్రం అయివుండాలి. ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబడి వుండడం, ఆర్ధిక పరిస్తితి నిరాశాజనకంగా ఉండడం అనేవి కూడా ఈ హోదా పొందడానికి ఉపకరిస్తాయి. పోతే ప్రధాన మంత్రి, ఆయా  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.  
చివరి రెండు అంశాలు మినహా ఈ హోదా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చే  నిబంధనలు ఏవీ లేవు.
మొదట అసోం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. తరువాత అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ప్రత్యేక హోదా రాష్ట్రాల జాబితాలో చేర్చారు.
ఈ హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు నిధులు లభిస్తాయి. మొత్తం కేంద్ర సాయంలో ముప్పయి శాతం నిధులు ఈ పదకొండు రాష్ట్రాలకు కేటాయిస్తారు. మిగిలిన డెబ్బయి శాతం నిధులను తతిమ్మా రాష్ట్రాలు అన్నీ కలిసి పంచుకోవాలి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు,  ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు పొందుతాయి. ఎక్సైజ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి.
ఇన్ని వెసులుబాట్లు వున్నాయి కనుకనే బీహారు మొదలయిన రాష్ట్రాలు ఈ ప్రత్యేక హోదా సాధన కోసం పట్టుబడుతున్నాయి. రెండేళ్ళ క్రితం బీహారు ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ ఏకంగా ఢిల్లీలోనే అధికారికంగా ఆందోళన నిర్వహించారు. అయినా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సుతరామూ అంగీకరించలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎన్నో ఇబ్బందులు వున్నాయని బాగా తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ఆ హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా ఆందోళనలకు దిగడం విడ్డూరం. అలాగే ఈ వాస్తవం ఎరిగుండీ ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపీ నాయకులు  కూడా అదేవిధమైన హామీలు ఇస్తూ పోతుండడం మరో విడ్డూరం. అన్నీ తెలిసినవాళ్ళే ఈ విషయంతో రాజకీయ క్రీడ ఆడుతుంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సయితం ప్రత్యేక హోదా సంగతి ప్రస్తావిస్తూ, అన్యాపదేశంగా బీజేపీ,  టీడీపీలకు హెచ్చరికలు చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం వీటిని మించిన విడ్డూరం. ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది మరింత విచిత్రమైన పరిస్తితి. ఆయన పాలనలో వున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం అనేది అందరికంటే ఆయనకే ఎక్కువ అవసరం. అందుకే ఆయన అనేకసార్లు హస్తిన ప్రయాణాలు కట్టారు. ఎక్కిన గడప దిగిన గడప చందంగా కలుసుకోవాల్సిన వాళ్ళను కలుసుకున్నారు. శాయంగల విన్నపాలు చేశారు.  కానీ ఫలితం పూజ్యం. కనీసం రాష్ట్రపతి ప్రసంగంలో అన్నా ప్రత్యేక హోదా ప్రస్తావన వుంటుందని అనుకుంటే అదీ నిరాశే అయింది. పార్లమెంటు సమావేశాలముందు ఆనవాయితీగా నిర్వహించే పార్టీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో కూడా ఆయన ఈ విషయంలో గట్టి ప్రయత్నం చేయమని కోరినట్టు పత్రికల్లో వచ్చింది. స్వయంగా అధినాయకుడి ప్రయత్నాలకే దిక్కు లేకపోయినప్పుడు పార్టీ ఎంపీలు మాత్రం ఏం చెయ్యగలుగుతారు? మామూలుగా అయితే, ఆత్మ గౌరవం నినాదం కలిగిన తెలుగు దేశం పార్టీకి ఇది చక్కని అదును. కానీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నది మిత్ర పక్షం కావడంతో ఏమీ పాలుపోని స్తితి. మింగలేని కక్కలేని పరిస్తితి. 

       


ఉపశ్రుతి: నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి అన్నారో ఏవిటో తెలియదు కాని, సీమాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్  రాజ్యసభలో ప్రకటించారు. ఈ హోదాకింద బుందేల్‌ఖండ్‌కు దక్కిందెంతో తెలుసా? ప్రకటించింది 7,266 కోట్ల రూపాయలయితే,  వాస్తవంగా ఇచ్చింది కేవలం 3,450 కోట్లే. (25-02-2015)
NOTE: Courtesy Image Owner