(PUBLISHED IN ‘SAKSHI’ EDIT
PAGE TODAY)
పాలకులు
వస్తుంటారు, పోతుంటారు.
కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం కలకాలం నిలబడి వుంటాయి. చిరకాలం వారిని గుర్తు
చేస్తుంటాయి. ‘కారే రాజులు రాజ్యముల్’ అంటూ ‘బలి
చక్రవర్తి’ కాలంలో చెప్పిందీ అదే. ఈ కలియుగంలో సయితం వర్తించే వాస్తవం కూడా
ఇదే.
వై.ఎస్.
రాజశేఖర రెడ్డి గతించి అప్పుడే ఆరేళ్లయింది. సామాన్య జనం ఈనాటికీ ఆయన్ని ఏదో
ఒకరకంగా గుర్తు చేసుకుంటూనే వున్నారు. దానికి ప్రధాన కారణం, ఆయన అధికారంలో వుండగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి కొన్ని కొత్త పధకాలు.
ఆరోగ్యశ్రీ
పధకం రూపుదాల్చడానికి ఓ నేపధ్యం వుంది. అది తెలుసుకోవాలంటే కొన్నేళ్ళు వెనక్కు
వెళ్ళాలి.
అది
ముఖ్యమంత్రి వైఎస్సార్ క్యాంపు కార్యాలయం.
ఉదయం
వేళల్లో సీఎం సాధారణ ప్రజలను కలుసుకునే సమయం.
సీఎం, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఒక్కొక్కర్నీ కలుసుకుంటూ, వారినుంచి
విజ్ఞప్తులు స్వీకరిస్తూ,వాటికి
తగిన హామీలను ఇస్తూ, సంబంధిత
పేషీ అధికారులకు సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
సీఎంను
స్వయంగా కలసి కష్ట సుఖాలను చెప్పుకోవడానికి వచ్చిన ఆ మహాజనంలో ఒక అమ్మాయి కూడా
వుంది. అయితే వచ్చిన కష్టం ఆ అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి అమ్మది. అది కూడా మామూలు
కష్టం కాదు. తీవ్రమయిన ఆరోగ్య సమస్య. మామూలు మనుషులే కాదు బాగా కలిగిన వారిని
సయితం కుదేలు చేసే క్యాన్సర్ వ్యాధితో ఆమె బాధ
పడుతోంది.
ముఖ్యమంత్రి
ఆ అమ్మాయి చెప్పింది సావధానంగా విన్నారు. స్వయంగా డాక్టర్ అయిన ఆయన ఆమె మెడికల్
రిపోర్టులు పరిశీలించారు. విషయం వెంటనే అర్ధం అయింది. ఏం చేసినా ఆవిడ బతికే
అవకాశాలు శూన్యం.
కానీ మరోపక్క ‘మా అమ్మ
నాకు కావాలి.’ అనే
ఆ అమ్మాయి ఆవేదనతో కూడిన అభ్యర్ధన.
‘వైద్యం
చేయిస్తాను. కానీ వ్యాధి ముదిరిపోయింది. ప్రయోజనం వుండకపోవచ్చు’ అన్నారు
ముఖ్యమంత్రి.
‘ఆరు
నెలలు బతికినా చాలు, కొన్నాళ్ళపాటయినా నా
కన్నతల్లి నా కళ్ళ ముందు వుంటే అదే పదివేలు’ అన్నదా అమ్మాయి.
‘చనిపోతుందని, ఇంకా
ఎంతో కాలం బతకదనీ నాకూ తెలుసు. కానీ, చూస్తూ చూస్తూ
వైద్యం చేయించకుండా వుండలేము కదా!’ అంది
కూడా.
ఆ మాటతో
కంగుతిన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నారో యేమో తెలవదు. కాకపొతే, ఒక
నిశ్చయానికి వచ్చినట్టు ఆయన ముఖమే చెబుతోంది.
‘ఏం
చేద్దాం’ అన్నట్టు
అధికారులవైపు చూసారు, ‘ఏదయినా
చేసి తీరాలి’ అన్నట్టుగా.
ఎవరికీ ఏం
చేయాలో, ఏం జవాబు
చెప్పాలో తెలియదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో కొంత సాయం చేసినా అది అరకొరే.
ఆ
అమ్మాయిని మరునాడు రమ్మన్నారు. సీఎం అధికారులతో
మాట్లాడారు. ఇలాటి అభాగ్యులకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి ఒక పరిష్కారంతో
రమ్మన్నారు.
ఈ
ప్రశ్నకు దొరికిన సమాధానమే ‘ఆరోగ్యశ్రీ’.
ఆ విధంగా
‘ఆరోగ్య శ్రీ’ పధకం పురుడు పోసుకుంది.
అప్పటికే
-108- అంబులెన్సులు రాష్ట్రాన్ని
చుట్టబెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి
అనిపించుకుంటున్నాయి.
వైఎస్
ముఖ్యమంత్రి కాగానే సత్యం ఫౌండేషన్ అధ్వర్యంలో నడుస్తున్నఆ అంబులెన్సు సర్వీసుల నిర్వహణ బాధ్యతను
ప్రభుత్వ భుజస్కందాలకు ఎత్తుకున్నారు. ఈ సర్వీసు వచ్చేవరకు రోడ్డు ప్రమాద
బాధితులకు ఎలాటి రక్షణా లేదు. ప్రమాదాలకు గురైన వారిని సకాలంలో దగ్గరలోని
ఆసుపత్రులకు చేర్చి వైద్యం అందించగలిగితే వారి ప్రాణాలు కాపాడడానికి వీలుంటుంది.
కానీ అటువంటి వీలూచాలూ లేక అనేకమంది ప్రాణాలు నడిరోడ్డు మీదనే గాలిలో కలిసిపోతున్నాయి.
వై ఎస్సార్ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలలా రయ్యి రయ్యి మంటూ తిరిగిన ఈ అంబులెన్సు
వాహనాల పుణ్యమా అని ఎందరెందరో బతికి బట్టకట్ట కలిగారు.
అల్లాగే 104 గ్రామీణ
ఆరోగ్య సర్వీసు. 108 అంబులెన్సు
రూపకల్పనలో పాలుపంచుకున్న డాక్టర్ అయితరాజు పాండురంగారావు, డాక్టర్
ఉట్ల బాలాజీ ఒక కొత్త ఆలోచనను ముఖ్యమంత్రి ముందుకు తెచ్చారు.
అదే, ఎఫ్.డీ.హెచ్.ఎస్. అంటే -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశితదిన
వైద్య సేవలు.
ప్రభుత్వం
ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది. ఇందులో సింహభాగం నిర్వహణ
వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు
ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ
తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా
పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల
విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో
నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల
దయాదాక్షిణ్యాల పైనా, వారిచ్చే నాటు మందుల పైనా
ఆధారపడాల్సిన దీనస్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో
- అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి
తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు
సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ
వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు.
ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ
పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు
కూడా తెలియదు.
హెచ్.ఎం.ఆర్.ఐ.
వారు ఈ సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు
కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి -
వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన
చేశారు. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే-
ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య
ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
చిన్నా
చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే 104 ఉచిత
కాల్ సెంటరు. వ్యాధి
నివారణ కంటే నివారణ మేలు. అందుకోసం నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార
వాహనం. అత్యవసర వైద్య సాయం కోసం 108 అంబులెన్సు . ఇక విధి వికటించి పెద్ద రోగాల
పాలుపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం ఆరోగ్యశ్రీ.
పైగా, ఇవన్నీ
పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో.
బడుగు
ప్రజలు ఒక నాయకుడ్ని చిరకాలం గుర్తుంచుకోవడానికీ, గుండెల్లో
దాచుకోవడానికీ ఇలాటి పధకాలు చాలు.
అందుకే
వైఎస్సార్ చనిపోయి కూడా ప్రజల దృష్టిలో జీవించే వున్నారు.
