2018 ఎన్నికలు. ఒక పక్క టీఆర్ఎస్. మరో పక్క మహాకూటమి. రాజకీయంగా ఉత్తర దక్షిణ ధృవాలయిన కాంగ్రెస్, టీడీపీ ఈ ఎన్నికల్లో చేతులు కలపడం ఓ విశేషం. ప్రచారాలు తారా స్థాయిలో సాగుతున్నాయి. ఫలితాలు గురించి అనేకరకాల ఊహాగానాలు.
కొందరు విలేకరులు ఒక పోలీసు ఉన్నతాధికారితో చిట్ చాట్ చేస్తున్నారు.
“మీ అంచనా ఏమిటి” ఓ విలేకరి ఆరా.
ప్రభుత్వ ఉద్యోగి. తెలిసిన సమాచారం అయినా, అలా బాహాటంగా ఎలా పంచుకుంటాడు? అదీ విలేకరులతో.
అందుకే చిన్నగా నవ్వాడు. నవ్వి చెప్పాడు.
“రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది అవేవీ నేను చెప్పను కానీ, ఆన్ రికార్డ్ ఒక విషయం నిర్ధారణగా చెప్పగలను. పాత బస్తీలో ఆ ఏడు సీట్లు వాళ్ళవే”
అలాగే జరిగింది.
రెండేళ్ల గడిచాయి.
తాజాగా, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు గురించి వెలువడిన సర్వేలు అన్నీ మటాష్ అయ్యాయి. కాకపొతే, ఒక్క ఎం.ఐ.ఎం. పార్టీ గురించి ఆ సర్వేల్లో వచ్చిన ఫలితాలు మాత్రం వాస్తవ ఫలితాలకు దగ్గరగా వున్నాయి.
ఆ అధికారి చెప్పినట్టుగా, ఆ పార్టీ విజయావకాశాలు గురించి అంచనా వేయడానికి ఏ సర్వేలు అక్కరలేదేమో!
(05-12-2020)