కరోనా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కరోనా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2022, గురువారం

వితండవాదం – భండారు శ్రీనివాసరావు


‘వితండవాదంలో కూడా ఓ వాదం వుంది. ముందు అది ఒప్పుకో’ అన్నాడు ఏకాంబరం, తనది వితండవాదం అని ఎద్దేవా చేసిన పీతాంబరంతో.
‘అలాగే చెప్పు’
‘ఈరోజు పేపరు చూసావా కనీసం టీవీ చూసావా’
‘ఇదే వితండవాదం అంటే! మనం మాట్లాడుతోంది కరోనా గురించి కదా!’
‘అవును. అందుకే అడుగుతున్నాను. ఏమి రాశారు. ఈ కాలేజీలో ఒమిక్రాన్ కలకలం. ఆ వూర్లో జడలు విప్పిన కరోనా. ఈరోజు కోడిగుడ్డు ధర మాదిరిగా, కొత్త కేసులు పదివేలు. కోలుకున్న కేసులు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభయి తొమ్మిది. ఊరట కలిగించే ఈ రెండో విషయం ముందు రాయవచ్చుకదా. పదివేలు పదివేలు కొత్త కేసులు అని ఊదరకొడుతూ జనాలను బెదర గొట్టడం ఎందుకు. పదివేల కేసుల్లో ఒకరే ఇంకా కోలుకోవాల్సి వుంది. ఈ సంగతి ఎందుకు హైలైట్ చేసి రాయరు? మీడియాకి ఆ మాత్రం బాధ్యత లేదా! రాజకీయాల్లో సంచలనాల వార్తలు వారిష్టం. కానీ కరోనా విషయంలో సంచలన వార్తలతో సామాన్య ప్రజలను భయబ్రాంతులను చేయడం సబబా! ఇలా అడిగితే నాది వితండవాదమా!’
‘..............’

‘భయపెట్టడం వల్ల ప్రయోజనం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ భూతాన్ని ఎలా తరిమికొట్టవచ్చు అనే విషయంలో ప్రజలను జాగృతం చేయాలి. ఈ మాట వితండవాదం అని నువ్వు అనుకుంటే అది నీ విజ్ఞతకే వదిలి వేస్తున్నాను’
‘..............’
(13-01-2022)

20, జులై 2020, సోమవారం

పెద్దగీత ముందు చిన్న గీత

సాధారణంగా భయపెట్టే, నైరాశ్యానికి గురిచేసే పోస్టులు పెట్టడం ఇష్టం వుండదు. అయితే అవగాహన కలిగిస్తుందేమో అనే ఆలోచనతో పెడుతున్నాను.

నాలుగయిదు మాసాల క్రితం వరకు కేన్సర్ పేరు చెబితే జనం హడిలిపోయేవారు. కేన్సర్ నిర్ధారణకు చేసే పరీక్ష పేరు చెబితేనే కేన్సర్ వచ్చినట్టుగా భావించి ఇంటిల్లిపాదీ భయపడిపోయేవారు. ఎందుకంటే వర్తమాన ప్రపంచంలో సామాన్యులు, అసామాన్యులు కూడా కేన్సర్ అంటే ఇక కేన్సిల్ అని ఆశలు వదులుకునే పరిస్తితుల్లో  జీవిస్తున్నాం. రోగి బతకడు అని తెలిసి కూడా చికిత్స చేయించక తప్పని పరిస్తితి. అదీ లక్షల్లో ఖరీదు చేసే వైద్యం.  

ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళలో ఒకరికి అత్యంత భయంకరమైన ఈ  కేన్సర్  వ్యాధి సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. భయపడిపోయి  పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పదహారు లక్షల ప్యాకేజీతో పలానా రోజున ఆపరేషన్ చేస్తామని చెప్పి అందుకు అవసరమైన కొన్ని పరీక్షలు చేశారు. ఆ రోగికి కరోనా పాజిటివ్ అనే సంగతి ఆ పరీక్షల్లో బయటపడింది. అంతే! డాక్టర్లు కేన్సర్ ఆపరేషన్ పక్కన పెట్టి ఆ రోగిని ఐసొలేషన్ లో పెట్టారు. పొద్దున్నే ఒక నర్సు వచ్చి బెల్లు కొట్టి తలుపు దగ్గర రెండిడ్లీలు ఉన్న ప్లేటు పెట్టి  వెళ్లిపోతుందట. వేళకు కొన్ని మందులు, భోజనం అలాగే. ఎవరూ కనబడరు. ఇంటి మనుషుల్ని రానివ్వరు. అసలే కేన్సర్ భయంతో బిక్కచచ్చి ఉన్న రోగికి ఈ పరిస్తితి మరింత భయానకంగా మారింది. బిల్లు చూస్తె  రోజుకు లక్ష.  కట్టగలిగిన స్థోమత వున్నవాళ్ళు కూడా వైద్యం ఎలా జరుగుతోందని ఆలోచిస్తారు. కానీ అక్కడ రోగికి జరుగుతున్న చికిత్స అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. కరోనా నెగెటివ్ వచ్చిన దాకా కేన్సర్ గురించి ఆలోచించరు. పెద్ద గీత ముందు చిన్న గీత మాదిరిగా అంత పెద్ద కేన్సర్ కూడా ఇంత చిన్న కరోనాముందు  చిన్నదయిపోయింది.

ఇప్పుడు కుటుంబ సభ్యుల  ఆందోళన అంతా కరోనా గురించి. కేన్సర్ విషయం మరిచిపోయారు.

(20-07-2020)