అంజయ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అంజయ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఆగస్టు 2020, ఆదివారం

అంజయ్య గారిపై రాజీవ్ గాంధీకి కోపం ఎందుకు వచ్చింది?

ఓ రోజు మధ్యాన్నం ముఖ్యమంత్రి అంజయ్య యధావిధిగా సచివాలయంలో కొలువు తీరారు. ఇలా కాలక్షేపాలు చేయడానికి కారణం ఆయనే చెప్పారు.  తెల్లారుతూనే రాష్ట్ర పోలీసు హెడ్డు సీఎం ని కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్తితి వివరిస్తారు. ఆర్ధిక శాఖకు చెందిన అత్యున్నత అధికారి ఒకరు అంతకు ముందు రోజే ముఖ్యమంత్రికి  రాష్ట్ర ఖజానా  స్తితి గతులు, అంటే  ఖర్చులూ, పన్ను వసూళ్లు వగైరా ఏరోజుకారోజే తెలియచేస్తారు. ఈ రెండూ బాగుంటే ఇక మనం  చేసేది ఏముంటుందని  రొటీన్ ఫైళ్ళు సంతకాలు చేసుకుంటూ మంత్రివర్గ సహచరులతో, పేషీ అధికారులతో, జర్నలిస్టు మిత్రులతో హాయిగా  పిచ్చాపాటీ కాలక్షేపం చేయడం ఆయనకు రివాజు.  ఆ రోజు అలా సభ సాగుతూ వుండగా మొయినుద్దీన్ (సిఎం ఆంతరంగిక  కార్యదర్శి) వచ్చి అంజయ్య గారి చెవిలో ఏదో చెప్పారు. వెంటనే ఆయన హడావిడిగా లేచి వెళ్లి యాంటీ రూములో ఫోను మాట్లాడివచ్చారు. రమణమూర్తి గారిని పక్కకు తీసుకువెళ్ళి ఏదో చెప్పారు. వూళ్ళో కట్టిన బ్యానర్లు వగైరా వెంటనే తీసేవేసే పని చూడమని చెబుతున్నట్టు అర్ధం అవుతూనే వుంది. (ఇక్కడ ఓ విషయం చెప్పాలి, అంజయ్యగారి ఆంతరంగిక బృందం గురించి వెంకయ్యనాయుడు గారు కాబోలు అసెంబ్లీలో ప్రాసయుక్తంగా ‘ఇంట్లో ఇంద్రసేనారెడ్డి, రూములో రమణమూర్తి, ముంగిట్లో మొయినుద్దీన్, ఇలా ఇంతమందిని దాటుకుని వెళ్ళాలి అంజయ్య గారి దర్శనం కావాలంటే’ అనేవారు. పూర్తి పాఠం పాశం యాదగిరి చెప్పాలి. ఇంద్రసేనారెడ్డి అంటే ఆ రోజుల్లో యువజన కాంగ్రెస్ నాయకుడు).

జరిగింది ఏమిటంటే రాజీవ్ గాంధీ మొదటిసారి హైదరాబాదు వస్తున్నారు. నగరమంతా ఆయనకు స్వాగతం చెబుతూ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేసారు. ఇలాంటి ఆర్భాటాలు రాజీవ్ కు నచ్చవు అని తెలుసుకున్న కొందరు పార్టీ నాయకులు ఆ విషయాన్ని చిలవలు, పలవలు చేర్చి ఢిల్లీకి మోశారు. ఆ రోజు వచ్చిన ఆ ఫోను పార్టీ అధిష్టాన దేవతల పూజారి నుంచి. తక్షణం అవన్నీ తొలగించాలని హుకుం.

మర్నాడు రాజీవ్ పాసింజర్ ఫ్లయిట్ లో ఒక సాధారణ ప్రయాణీకుడి మాదిరిగా బేగంపేటలోని విమానాశ్రయంలో దిగారు. విషయం తెలియని వందలాదిమంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎయిర్ పోర్ట్ వెలుపల  మేళాలు మోగిస్తూ, డప్పులు కొట్టుకుంటూ, డాన్సులు చేస్తూ, మిఠాయిలు పంచిపెడుతూ, పూలు వెదజల్లుతూ, పుష్పహారాలతో స్వాగతం చెప్పే ప్రయత్నాల్లో వున్నారు. రాజీవ్ బయటకు వచ్చి కారు ఎక్కేటప్పటికి ఇదీ పరిస్తితి. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. అదంతా అంజయ్య గారి మీదికి మళ్ళింది.

సరే! తర్వాత ఏం జరిగింది అన్నది అందరికీ తెలుసు.

ఎయిర్ పోర్టులో రాజీవ్ అకాల ఆగ్రహానికి కారణం ఏమిటన్నది తర్వాత డాక్టర్ ఏపీ. రంగారావు ఇలా విశ్లేషించారు. రాజీవ్ రాజకీయాల్లోకి రాకముందు విమానాల పైలట్. ఎయిర్ పోర్టులో  పక్షి కనిపిస్తే పైలట్లకు పడదు. ఎందుకంటే ఆకాశంలో  ఎగిరే విమానాన్ని ఒక చిన్నపక్షి దీకొట్టినా  దానికి ప్రమాదమే. కాంగ్రెస్ కార్యకర్తలు పూలు, మిఠాయిలతో హడావిడి చేయడం గమనించిన రాజీవ్, వాటికోసం పక్షులు  వచ్చే అవకాసం వుందనుకున్నారు. ఇందుకు ఆ డాక్టర్ చెప్పిన ఉదాహరణ ఏమిటంటే.

ఒక రోగి కిందపడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. ఇంటిల్లిపాదీ అతడి చుట్టూ మూగి ఆందోళన పడుతుంటారు. ఈ స్తితిలో అక్కడకు వచ్చిన ఏ డాక్టర్ అయినా బంధువులపై కసురుకుంటాడు. ముందు అక్కడి నుండి వెళ్ళిపొండి, అతడికి గాలి తగలాలి’ అని గట్టిగా కేకలు వేస్తాడు. ఆ వైద్యుడు ఆగ్రహించింది ఒక మనిషిగా కాదు, ఒక డాక్టర్ గా. అలాగే విమానాశ్రయంలో కూడా రాజీవ్ తటాలున ఆగ్రహించడానికి ఇలాంటిదే కారణం కావచ్చని డాక్టర్ రంగారావు అభిప్రాయం. (నిజానికి రాజకీయ కారణాలు కూడా దోహదం చేసిన మాట కాదనలేము)               


14, సెప్టెంబర్ 2010, మంగళవారం

రేడియో రోజులు - 6 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - 6   - భండారు శ్రీనివాసరావు

“ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.

అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికికానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.

చెన్నారెడ్డి గారి వంటి చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్తానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా ఈ మీటింగులు శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సందేశం పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.

ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. “వెడుదుగానిలే! కాసేపు కూర్చో!” అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.

అంజయ్య గారు గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో – కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.

పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ మెటర్నిటీ వార్డులో పురుళ్ళ గదికి ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం చూసి ఆయన సంతోషపడి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం ప్రత్యెక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.

ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు పుట్టివుంటాయి కానీ, అంజయ్య గారు విషయాలను యెంత నిశితంగా పరిశీలించేవారో నాకు తెలుసు.

ఒకసారి కౌలాలంపూర్ లో తెలుగు మహాసభలు జరిగాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

“పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.

‘కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య గారి వ్యవహారం. (13-09-2010)