27, నవంబర్ 2022, ఆదివారం

బుధజన దర్శనం

 నిన్న శనివారం అంతా బంధుజన, బుధజన దర్సనాలతో గడిచిపోయింది.

జ్వాలాతో కలిసి మా కుటుంబపు 108 (పిలిస్తే పలకడమే కాదు, వచ్చే పిల్లల డాక్టరు, మేనల్లుడు) డాక్టర్ ఏవీ మనోహర్ రావును అశోక్ నగర్ లోని వాళ్ల ఇంటికి వెళ్లి కలుసుకున్నాము.  పిచ్చాపాటి అనంతరం అక్కడే భోజనం చేసి, గాంధీ నగర్ లో ఉంటున్న డాక్టర్  మాడభూషి శ్రీధర్ ఇంటికి  ఫోన్ చేసి వెళ్ళాము. మా కోసం వరండాలో ఎదురుచూస్తూ వున్న శ్రీధర్ ని చూడగానే ప్రాణం లేచొచ్చింది. నన్నూ, జ్వాలాను, జ్వాలా శ్రీమతి విజయలక్ష్మిని చూడగానే శ్రీధర్ మొహం వెలిగిపోయింది. శ్రీధర్  శ్రీమతి కల్యాణి గారు చాలా ఆపేక్షగా పలకరించారు. శ్రీధర్, కల్యాణి కబుర్లు చెబుతుంటే అలా వింటూ పోయాము. ఇన్నాళ్లుగా పెదాలు దాటకుండా, కడుపులో దాచుకున్న మాటలన్నీ శ్రీధర్ నోట వెంట ధారాపాతంగా వెలువడుతుంటే చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా తన తల్లిగారు గురించి చెబుతుంటే కంటి వెంట నీళ్ళు తిరిగాయి.  కొడుకుని గుర్తు పట్టలేని అమ్మ, అమ్మ ఏమంటున్నదో అర్ధం కాని కొడుకు, వీళ్ళ పరిస్థితి ఏమిటో అర్ధం కాని కోడలు. నిజంగా సినిమా కధను తలదన్నేలా జరిగిపోయాయి వారి జీవితాల్లో సంఘటనలు. కల్యాణి గారు తమ జీవితంలో అత్యంత దురదృష్టపు ఘడియలను గుర్తు తెచ్చుకుని చెప్పారు. మొత్తం మీద శ్రీధర్ ఆధ్యాత్మిక భావాలు, కల్యాణి గారి మనో ధైర్యం శ్రీధర్ ని మళ్ళీ మామూలు మనిషిని చేసాయి.

(ఇదంతా ఏమిటి అయోమయంగా వుంది అనుకునే వాళ్ళు ఈమధ్య శ్రీధర్ రాసిన పెదవి దాటని మాటలు వ్యాసం చదవండి)

దంపతులిద్దరూ  నాకంటే వయసులో చిన్నవాళ్లు. లేకుంటే కల్యాణి గారి పాదాలకు నమస్కారం చేసేవాడిని.

అదే రోజు సాయంత్రం ఒక మిత్రుని కుమారుడి పెళ్లి రిసెప్షన్. ప్రముఖ సీ పీ ఎం నాయకుడు శ్రీ సీతారాం ఏచూరి కలిశారు.


(శ్రీ సీతారాం ఏచూరితో నేను, జ్వాల)

(శ్రీ మాడభూషి శ్రీధర్ తో నేను, జ్వాలా) 




(26-11-2022)

   

కామెంట్‌లు లేవు: