13, డిసెంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు - 41 - భండారు శ్రీనివాసరావు



సత్యలోకంలో విధాత తన పద్మాసనంపై బాసింపట్టు వేసుక్కూర్చుని సృష్టికర్తగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన సతీమణి, హాటుకగర్భురాణి అయిన చదువులతల్లి పక్కనే వుండి ఓరకంట తన భర్త చేతివేళ్లల్లో రూపుదిద్దుకుంటున్న జీవరాశుల్ని తదేకంగా గమనిస్తోంది.
సృష్టికార్యంలో నిమగ్నుడయివున్న బ్రహ్మదేవుడు పక్కన భార్య వున్న సంగతి సయితం మరచిపోయి, ఒక లావణ్యవతి రూపాన్ని రూపొందించి దానికి స్త్రీమూర్తి అని పేరుపెట్టాడు. ప్రాణం పోసి భూమిమీదకు పంపే సమయంలో సరస్వతమ్మకు కరణేషు మంత్రిఅనే సతీ ధర్మం తటాలున గుర్తుకువచ్చి ఆగండాగండి! తొందరపడి యావత్ సృష్టినే గందరగోళంలోకి నెట్టకండిఅని వేడుకుంది. వేడుకుంటూనే మరోపక్క మాటల్లో వేడిని కాస్త పెంచి -
ఇన్ని తలలున్నాయని పేరే కానీ చేస్తున్నదేమిటో, దాని పరిణామాలేమిటో ఒక్క మారయినా, కనీసం ఒక్క తలకాయతో నయినా ఆలోచించారా ?’ అని వాగ్దేవి తన వాగ్ధాటితో మొగుడ్ని అడ్డుకుంది.

ప్రతిక్షణం లక్షల కోట్ల జీవరాసులను ఒకదానితో మరొకటి పోలిక లేకుండా సృష్టించగల అపారమయిన శక్తియుక్తులున్న ఆ బ్రహ్మదేవుడు కూడా, ఎంతవారలయినా కాంతాదాసులే అన్నట్టు పెళ్ళాం మాటకు బద్ధుడే. అవటాన,

రెండో మాట లేకుండా సతీమణి సలహాకు అంగీకార సూచకంగా మూడు తలలు ఒకేమారు వూపుతూ కాసేపు చేస్తున్న పనికి విరామం ఇచ్చాడు.

అదే అనువుగా తీసుకుని, హితవచన రూపంలో ఆయన అర్ధాంగి వాణి తనదయిన బాణీలో విధాతకు భగవద్గీత బోధించడం ప్రారంభించింది.

మీరు సృష్టించిన ఆ స్త్రీ మూర్తి అందాన్ని చూసి ఆడదాన్నయిన నాకే మతిపోతున్నది. ఇక భూలోక వాసుల సంగతి వేరే చెప్పాలా! ఏమయినా సరే ఇటువంటి భూలోక సుందరిని భూలోకానికి పంపడానికి సుతరామూ వీల్లేదు. సత్యలోకంలో కూడా వుంచడానికి ఒప్పుకోను. ఇటువంటి ఆడవాళ్ళ పొడ నాకు గిట్టదు గాక గిట్టదు.అని గట్టిగా తెగేసి చెప్పింది.

భగవతి మాటలతో విధాత మూడు తలలు పట్టుకున్నాడు. సత్యలోకం నిబంధనల ప్రకారం ఒకసారి తన చేతులతో సృష్టించిన జీవిని భూలోకానికి పంపకుండా వుండేందుకు వీలులేదు. ఆ సంగతే అర్ధాంగికి అవగతమయ్యేలా చెప్పి తరుణోపాయం కూడా చెప్పి పుణ్యం కట్టుకోమని కోరాడు.

ఎంతకట్టుకున్నవాడయినా, ఎంత తన కట్టుబాట్లలో వున్న మొగుడయినా బ్రహ్మ సామాన్యుడేమీ కాదు. సాక్షాత్తు త్రిమూర్తుల్లో ఒకడు. ఆ ఎరుక ఎరిగినది కనుక సరస్వతి కొంత మెత్తబడింది.

అలా మెత్తబడ్డ వీణావాణి మనసులో ఓ కొత్త ఆలోచన పురుడు పోసుకుంది.

మొగుడు ముచ్చటపడి సృష్టించిన ఆ స్త్రీ మూర్తి అద్భుత సౌందర్య రాశి. అంతే కాదు. పరమాద్భుతమయిన తెలివితేటలూ ఆమె సొంతం. ఇంతటి ప్రతిభాశాలినీ, అసాధారణ ప్రజ్ఞాధురీణనీ అదుపులో వుంచడం మానవమాత్రులకు అసాధ్యం. దాన్ని సాధ్యం చేయాలంటే, ఆ పడతి తన ప్రతిభాపాటవాలను మరచిపోయేలా, అవి మరుగున పడిపోయేలా ఆమె దృష్టిని మళ్లించి, ఆ లలన మనసును ఆకట్టుకోగల మరికొన్నింటిని సృష్టించాలి. చదువులలో సారం తెలిసిన చదువుల తల్లికి ఆ ఆనుపానులేవిటో వెంటనే తెలిసిపోయాయి.

ఫలితం ఆ అందాల సుందరితో పాటే బ్రహ్మ దేవుడు, ఇల్లాలి సలహాపై మరో రెండింటిని సృష్టించి భూలోకానికి పంపాడు. అవే పట్టు చీరెలు, స్టీలు గిన్నెలు.

(ఉపసంహారం: డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి వారం ప్రసారం అయ్యే జీవన స్రవంతిఅనే కార్యక్రమానికి నేను కర్తా, కర్మా క్రియగా పనిచేస్తున్న రోజుల్లో ఓ వారం ఆ కార్యక్రమంలో భాగంగా పైన పేర్కొన్న ఈ పిట్ట కధ చదివాను. అంతే! ఆనాడు నేను ఆఫీసుకు వెళ్ళగానే రేడియో కార్యక్రమాలలో దిట్టలుగా పేరుగాంచిన నలుగురు మహిళా మూర్తులు, నా సీనియర్లు తురగా జానకీ రాణి, మాడపాటి సత్యవతి, వింజమూరి సీతాదేవి, సునందిని ఐప్ - నాకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నన్ను చూసిందే తడవుగా ఒక్కుమ్మడిగా నా మీద మాటల దాడికి దిగారు. స్త్రీజాతిని కించబరిచే విధంగా ఇలాటి కాకమ్మ కధలు ప్రసారం చేయడానికి ఎంత ధైర్యం!అవటాని కేకలు వేసారు. వయస్సులో, అనుభవంలో వారందరికంటే నేను చాలా చిన్నవాడిని. అంచేత ఆ పెద్దల అక్షింతలను ఆశీస్సులుగా తీసుకున్నాను. హాస్యానికి కూడా ఎవరినీ నొప్పించడం తగదన్న నీతి నాకానాడే బోధపడింది. అందుకే అప్పటినుంచి నా కార్యక్రమంలో నేను ఏనాడు ఎవరినీ కించబరిచే వ్యాఖ్యలు చేయలేదు. పొతే వీరిలో జానకీ రాణి గారిది మరింత విలక్షణమైన శైలి. ఆప్యాయత తొణికిసలాడే కాటుక దిద్దుకున్న కళ్ళు.  గుండెలో మాటనే మాట్లాడే నాలుక. భేషజాలు లేని మనిషి. నిజంగా నిండు మనంబు నవ్యనవనీత సమానము, పల్కు దారుణాశస్త్రతుల్యముఅనే పద్యపాదము జానకీరాణి గారికి అతికినట్టు సరిపోతుంది.
రేడియోలో పనిచేసిన మా బోంట్లకు జానకీరాణి గారంటే భయంతో కూడిన గౌరవం ఏం చేస్తాం? కాదనే ధైర్యం ఎక్కడిది ?
జానకీరాణి గారు అంటే గౌరవం. ఆవిడ వయస్సు కొంతా, ఆవిడ కలివిడితనం కొంతా కలిపి గౌరవం ఆవిడంటే. భయం దేనికంటే, నేనే గలగలా మాట్లాడుతానని అంతా అంటారు. జానకీరాణి గారు గలగలా మాత్రమే కాదు, దడ దడలాడిస్తూ దడదడా కూడా మాట్లాడతారు.

ముందే  చెప్పినట్టు, తురగా జానకీరాణి గారు నాకు రేడియోలో సీనియర్ సహోద్యోగి. రేడియోలో చిన్నపిల్లల  ప్రోగ్రాము నిర్వాహకురాలిగా, రచయిత్రిగా, వక్తగా ఆమె తెలుసు. నాకు తెలియని ఆమెలోని మరో పార్శ్వం , ఆవిడ స్వయంగా  రాసిన డాన్స్  మాస్టర్ సత్యం గారి జ్ఞాపకం. ఆవిడ చిన్నతనంలోనే  నాట్యం నేర్చుకున్న సంగతి  అప్పుడే  తెలిసింది. తను ముప్పయ్యేడవ ఏట కూడా  రంగస్థలంపై  నర్తించిన సంగతి కూడా ఆవిడే  చెప్పారు.
ఇక ఆవిడ స్వయంగా రాసుకున్న సంగతులు ఇవి:

(శ్రీమతి తురగా జానకీరాణి)

పంతొమ్మిదివందల నలభై ఏడు , ఎనిమిది ప్రాంతాల్లో సత్యం మాస్టారికి పంతొమ్మిది, నాకు పన్నెండు. మదరాసులో పెదసత్యంగారి దగ్గర నుంచి కూచిపూడికి తిరిగి వచ్చేసిన రోజుల్లో బందరులో నాకు నాట్యం నేర్పించారు. మహిళా సేవా మండలిలో కొందరికి నేర్పుతూ, నాకు ఉదయం పూట ఆరు గంటలకి వచ్చి స్పెషల్ క్లాసు తీసుకునేవారు.
మా అమ్మమ్మ ఆయనగారికి కంచు గ్లాసులో కాఫీ ఇచ్చేది. అది త్రాగి గోడవారగా పెట్టేవారు.

నేను అప్పటికే మదరాసులో పందనల్లూరు చొక్కలింగం పిళ్ళై గారి దగ్గర కొంతనేర్చుకొన్నాను. అందువల్ల నాకు ఒకేసారి కొన్ని అంశాలు నేర్పించారు. అలరింపు, అఠాణా స్వరజతి, భైరవి, కల్యాణి రాగాల్లో జతిస్వరాలు, కానడతిల్లానా, వసంత రాగంలో స్వరజతి, మా వల్లకాదమ్మ దేవి యశోద, కొన్ని అరవ పాటలరికార్డింగులు, ఇలా ఎన్నో. ఆయనే నట్టువాంగం, గానం చేసేవారు. తేలికగా, లైట్గా మాట్లాడేవారు.
నాచేత బుట్టాయపేట హాలులోను, గుడివాడ, వడాలి మొదలైన కొన్ని పల్లెటూళ్ళలో ప్రదర్శనలిప్పించారు. మువ్వలు కొని వాటికివెండి పూత పూయించి తోలు పట్కా మీద కుట్టించి ఇచ్చారు. బహుశ నేను ఆయనకు తొలి శిష్యురాలినేమో. ఆ తరువాత ఆయన మదరాసు వెళ్లి పోయారు. నేను మళ్ళీ చొక్కలింగం పిళ్ళై గారి దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళాను. నిజానికి ఆయన నాకు భరత నాట్యమే నేర్పారు.
ఆ తరువాత ఆయన్నిరాజసులోచన మేడ మీద క్లాసులు నడుపుతుండగా చూసి వచ్చాను. ఇంకొక సారి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాదు నుంచి  భోపాల్ వరకు చేసిన ప్రయాణంలో ఆయన ఎందరెందరి గురించో  చెప్పారు. ఆ తరువాత తెలుగు విశ్వ విద్యాలయం విశిష్టపురస్కారం ఇచ్చినప్పుడు, నేను స్టేజీ మీదకు వెళ్లి, నాకు పన్నెండు, ఆయనకు పంతొమ్మిది ఏళ్ల వయస్సులో ఎంత గొప్ప గురు భావం ఉండేదో చెప్పినప్పుడు, ఆయన అలాగాఅన్నారు.ఇంకా ఎంతో చెయ్యాలని ఉందమ్మాఅని కూడా  అన్నారు. ఎప్పుడూ అమ్మ బాగున్నారా? మామయ్య  బాగున్నారాఅని అడిగేవారు. ఆ సాన్నిహిత్యం, అభిమానం నేను కలకాలం మదిలో నిలుపుకుంటాను. నేను కొంత వరకైనా దూరదర్శన్,  రేడియోలతో పాటు, రవీంద్ర భారతి రంగస్థలం మీద అనేక నృత్య రూపకాలకి, బృంద గీతాలకు దర్శకత్వం వహించగలిగానంటే అది ఆయన పెట్టిన భిక్షే. ప్రాతః స్మరణీయులు ఆమహామనీషిఅంటూ నాట్యంలో తన తొలి గురువును స్మరించుకున్నారు శ్రీమతి  తురగా జానకీరాణి.
(ఇంకా వుంది)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Sir please see movie ' Kadapa Kids in Mummy Kingdom'.

Zilebi చెప్పారు...



చాలా బాగుందండీ భండారు గారు!

Now a days the speed with which you are writing is phenomenal. Kudos !


చీర్స్
జిలేబి