11, మే 2019, శనివారం

మీడియా ఆత్మశోధన – భండారు శ్రీనివాసరావు

సూటిగా....సుతిమెత్తగా....

అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పత్రికలవారిపట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించేవారనేది బహిరంగ సత్యం. పత్రికల యజమానులే కాకుండా అనుదినం వార్తలు సేకరించే సాధారణ విలేకరులతో కూడా ఆయన సంబంధాలు ఆదరణ పూర్వకంగా ఉండేవి. చక్కటి తెలంగాణా పలుకుబడితో కూడిన ఆయన మాటలు వినసొంపుగా ఉండేవి. సునిశితమయిన హాస్యంతో అంజయ్యగారు చేసే వ్యాఖ్యలు, విలేకరులకు వండివార్చిన 'సిద్దాన్నం' మాదిరిగా వార్తల ముడిసరుకుగా మారిపోయేవి. మరునాడు పత్రికల్లో తను చెప్పిన విషయాలను చదువుకుని 'ఇంత చక్కగా మాట్లాడానా' అని అమాయకంగా మురిసిపోయేవారు. ఆ రోజుల్లో తెలుగు పత్రికారంగంలోకి దూసుకువచ్చిన ఒక దినపత్రిక మాత్రం, కొత్త బాణీ కనిపెట్టి అంజయ్యగారి భాషను యధాతధంగా ప్రచురించడం మొదలుపెట్టింది. అందుకు ఆయన నొచ్చుకున్న దాఖలాలు లేవు కానీ, ఆ పత్రిక తీరు ముఖ్య మంత్రి స్తాయికి తగినట్టుగా లేదని జర్నలిష్టు వర్గాలలోనే కొందరు గుస గుసలాడుకున్న మాట నిజం. వున్నది వున్నట్టు రాయడంతోపాటు, అన్నది అన్నట్టు రాసే పత్రికా సంప్రదాయానికి అప్పుడే బీజం పడినట్టువుంది.
రాష్ట్ర రాజకీయ యవనికపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో, అప్పటివరకు వార్తలకోసం కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలపై ఆధారపడిన పత్రికలకు కొత్త వనరు దొరికినట్టయింది.
ఏరోజుకారోజు పత్రికలలో వచ్చిన వార్తలను పరిశీలించి అదే రోజు మధ్యాన్నం ఒక పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, రెండో పార్టీ అదే రోజు సాయంత్రం పెట్టేది. ఒకరి కామెంట్లు మరొకరికి చేరవేసే బాధ్యతను అత్యుత్సాహం కలిగిన కొందరు విలేకరులు భుజానికి ఎత్తుకునేవారు. ఇందులో వారికి ఏవో స్వార్ధ ప్రయోజనాలు వున్నాయని సందేహించనక్కర లేదు. వార్తకు వార్త తెగులు అన్నట్టు ఏదో కొత్త వార్త పట్టుకెళ్లాలన్నదే వాళ్ళ ఆరాటం. దీన్ని ఆయా రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకునేవి. ఈ క్రమంలో సంబంధ అనుబంధాలు క్రమేపీ బలపడేవి. తాము చెప్పదలచుకున్న మాటలను తమనోటితో కాకుండా, తాము బయటపడకుండా, తమ చేతికి మసి అంటకుండా పత్రికలలో ప్రచురింపచేసుకునే విధానం రూపుదిద్దుకుంది. ఒక వార్త పత్రికల్లో వచ్చేలా చేసి, అదే వార్తను మర్నాడు తామే ఖండించేలా వీలుకల్పించే ఈ నూతన వొరవడి, రాజకీయ ప్రత్యర్ధుల పీచమణచడానికి కొందరికి బాగా ఉపయోగపడుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమమే తదనంతరకాలంలో వార్తల స్తానంలో వార్తా కధనాల ఆవిర్భావానికి మార్గం వేసింది.
నూతన ఆర్ధిక సంస్కరణల అమలుతో అన్ని రంగాలలోమాదిరిగానే పత్రికారంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పత్రికల ముద్రణలో రంగు, హంగులు పెరిగిపోయాయి. పెద్ద స్తాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రవేశంతో జర్నలిజం రంగానికి 'గ్లామరు' తోడయింది. సిబ్బంది జీతభత్యాలు కలలో ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఆహ్వానించదగిన ఈ పరిణామాలన్నీ పవిత్రమయిన పత్రికా రంగంలో స్వార్ధశక్తులు చొరబడడానికి కొంతమేరకు తోడ్పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల అమోఘమయిన శక్తి యుక్తులున్న ఈ రంగంపై రాజకీయుల కన్ను పడడంలో ఆశ్చర్య పడాల్సినది ఏమీ లేదు. అలాగే, రాజకీయ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బడా పారిశ్రామికవేత్తలు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడంలో వింతేమీ లేదు. ఈ రెండు బలవత్తర శక్తులూ మీడియాను తమ కనుసన్నల్లో ఉంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల పర్యవసానంగానే నిప్పుకు చెదలంటుకున్నాయని చెప్పాలి.
మీడియా విశ్వసనీయతపై ఇన్నాళ్ళుగా కదలాడుతున్న నీలినీడలు ఇటీవలి కాలంలో కారుమబ్బులుగా మారి ఒక పెద్ద ప్రశ్నను మీడియా ముందుకు తెచ్చాయి.
మంచికో చెడుకో మీడియాపై ఒక చర్చ మొదలయింది. పత్రికలంటే పన్నెత్తి మాట్లాడడానికి జంకే వాళ్ళందరూ ఈ నాడు మీడియా నీతీ నిజాయితీలను గురించి నిలదీస్తున్నారు. నిరాధార వార్తలను ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నిగ్గుతేల్చాలని నిగ్గదీస్తున్నారు. బాధ్యతతో మెలగాలనీ, నిజానిజాలను ప్రసారానికి ముందే నిర్దారించుకోవాలనీ నీతి బోధలు చేస్తున్నారు. ఒకరికి దిశానిర్దేశనం చేయాల్సిన మీడియా, ఒకరితో చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడిపోయింది.
వీటికి తోడు అవినీతి ఆరోపణలు, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలూ వెలుగులోకి వచ్చి అసలే మసకబారుతున్న మీడియా విశ్వసనీయతను మరింత ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
అందుకే, మీడియా ఆత్మ శోధన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇతరుల తప్పులు ఎన్నడంతో సరిపుచ్చుకోక, తమ దగ్గర తప్పు ఎక్కడ జరుగుతున్నదో, ఎలా జరుగుతున్నదో తెలుసుకుని దిద్దుబాటు చర్యలు మొదలుబెట్టుకోవాలి. పత్రికల్లో, మీడియాలో వస్తున్న వార్తలపై, వార్తాకధనాలపై చదువరులనుంచి, వీక్షకులనుంచి విమర్శలు, అభిప్రాయాలు స్వీకరించి సరయినవాటిపై స్పందించి భేషజాలకు పోకుండా తగు మార్పులు చేసుకోవాలి. రేటింగులలో పోటీ తగ్గించుకుని నవ్యత్వంతో కూడిన కార్యక్రమాల రూపకల్పనలో పోటీ పెంచుకోవాలి. సొంత కట్టుబాట్లు, స్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్తలో మిగిలిన అన్ని స్తంభాలు శిధిలమవుతున్నప్పుడు సరిదిద్దడానికి నేనున్నానంటూ మీడియా సన్నద్ధంగా నిలబడాలి. పూర్వ వైభవాన్నీ, వెనుకటి ఔన్నత్యాన్నీ, విలువలతో కూడిన పత్రికా సంప్రదాయాలనూ పునరుద్ధరించుకోవాలి.


కానీ, ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో ఇది నెరవేరే కలేనా?

6 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

తెలుగు మీడియా పతనం రామోజీరావు ఈనాడు పెట్టడంతో మొదలయింది. రామారావు పార్టీ పెట్టినప్పుడు మొదటి పేజీలో అతగాడి తానాల ఫోటోలు ముద్రించి మురిసిపోవడం జర్నలిజం "విలువలకు" మాయని మచ్చ. జర్నలిస్టులతో టీడీపీ జండా మోయించిన రామోజీ ఇప్పుడు పతివ్రత పోజులు కొడుతున్నాడు.

అజ్ఞాత చెప్పారు...

ఆంధ్ర ప్రజలకు పచ్చ పైశాచికం నుంచి విముక్తి 23 వ తేదీని దొరుకుతుంది అని ఎదురుచూస్తున్నాను. ధూ మీ బతుకులు చెడ. కులపిచ్చితో తెలుగు సమాజాన్ని నాశనం చేశారు గదంట్రా.

sistla చెప్పారు...

వ్యాఖ్యాతల కు ఇంత కులద్వేషం పనికిరాదు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆ సామాజికవర్గపు వారి కులపిచ్చి రాజకీయాలు, సినిమా రంగం, మీడియా, విద్యారంగం, వైద్యరంగం, ఇంకా కొన్ని రంగాల్లోనే కాదు, బ్లాగుల్లో కూడా కనబడుతూనే ఉంటుంది. “Kammas World” అనే పేరుతో నడుస్తున్న బ్లాగ్ ను చూసే వుంటారు కదా? ఎక్కడెక్కడి కమ్మవారి సమాచారం సేకరించి ఈ బ్లాగులో పెడుతుంటారు. ఇదే పని ఇతర కులాల వారు - ముఖ్యంగా బ్రాహ్యణులు - చేస్తే వెంటనే వారికి కులపిచ్చి అంటగడుతూ విమర్శలకు దిగరా?

సూర్య చెప్పారు...

ఈ వ్యాఖ్య మీ వ్యక్తిగత ద్వేషాన్ని తెలియజేస్తుంది. కరెక్ట్ గా మీలాంటివాళ్లే మీడియాలో చేరటం వల్ల వచ్చిన పరిణామమే నేటి తప్పుడు వార్తలు.

సూర్య చెప్పారు...

ఎవరో ఎదో విమర్శిస్తారని వీళ్లేందుకు భయపడటం! తప్పుడు పనులకు విద్వేషాలకు ఉపయోగించనంత కాలం ఎవరు ఏ గ్రూపు అయినా పెట్టుకోవచ్చు. క్షత్రియులు ఏమైనా అనుకుంటారేమోనని భయపడితే పరశురాముడు గొడ్డలి పట్టుకునేవాడా?!