31, జనవరి 2012, మంగళవారం

‘శ్రీరామ’భగవద్గీత



‘శ్రీరామ’భగవద్గీత


అనగనగా ఓ రాముడు. ఆయనకో బంటుపేరు హనుమంతు. ఆ రాముడికో కోరిక కలిగింది. నాడు లంకలో  రావణుడి చెరలో వున్న సీతను తిరిగి తెచ్చుకునే నిమిత్తం   సముద్రం దాటేందుకు వీలుగా వానర సేన సాయంతో నిర్మించిన వారధి – రామసేతు – ఎలావుందో చూద్దామని  యుగాలు, మన్వంతరాలు గడిచిపోయిన తరువాత రామ బంటును  వెంటబెట్టుకుని రాముడు  భూలోకానికి  వచ్చాడు. తాము  వనవాసంలో వుండగా  రావణుడు అపహరించుకు పోయిన సీతను   మళ్ళీ తన  కళ్లబడేలా చేసిన ఆ వారధి అంటే ఆయనకు ఎంతో మక్కువ. దాన్ని చూడగానే దానిపట్ల  ఆయన పెంచుకున్న ఇష్టం ఆయన  మాటల్లో మరో సారి బయట పడింది.

‘హనుమా! ఈ వారధి నిర్మాణానికి నువ్వూ, నీ  సహచర వానరులు పడ్డ శ్రమను నేనారోజుల్లో కళ్ళారా చూసాను. మొబిలైజేషన్ అడ్వాన్సులు సరే కనీసం హీనపక్షం రోజు కూలీ కూడా అడగకుండా ఇంత బ్రహ్మాండమయిన వంతెనను నాకోసం ఎంతో కష్టపడి కట్టారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నో యుగాలు  గడిచిపోయాయి. ఎన్నెన్నో  ప్రకృతి ఉత్పాతాలు ఏర్పడ్డాయి.  మరెన్నో  సునామీలు సంభవించాయి. అయినా కానీ, ఆనాటి  రామసేతు ఆనవాళ్ళు మాత్రం  వీటన్నిటినీ తట్టుకుని నిలిచాయి. అంటే ఈ వంతెన నిర్మాణంలో  మీరు ఉపయోగించిన ఇంజినీరింగ్ పనితనం అంత గొప్పదన్న మాట. నిన్న గాక మొన్న హైదరాబాదులో గామన్ కంపెనీ  అధునాతన టెక్నాలజీ సాయంతో  కట్టిన ఫ్లై వోవర్ కధ ఏమయిందో  తెలుసుకదా. ‘కాళ్ళ పారాణి కూడా ఆరకముందే’ అన్న సామెతను నిజం చేస్తూ  ఆ వంతెన ఫిల్లర్లపై సినిమా పోస్టర్లు   అంటించేంతవరకయినా ఆగిందా అంటే  ఆగలేదు. సరికదా ఓపక్క  కడుతుండగానే మరో పక్క  డమాలున  కూలిపోయింది’ అంటూ  రాముడు కాసేపు  ఆగాడు.
సమయం కోసం ఎదురు చూస్తున్న హనుమ వెంటనే అందుకున్నాడు.

‘జై శ్రీరాం!  రామ సేతు నిర్మాణంలో మాగొప్పదనం ఇసుమంత కూడా లేదు. మేము చేసిందల్లా ఆ రాళ్ళపై  నీ పేరు రాయడం వరకే. వంతెనకోసం టిస్కో కంపెనీ  ఉక్కు దిమ్మలు  వాడలేదు. అంబుజా సిమెంటో, ఏసీసీ సిమెంటో ఉపయోగించలేదు. అయినా కానీ,  నీ దయవల్ల అది గట్టిగా నిలబడింది. అయినా రామయ్యా! ఆ పాత సంగతి ఇప్పుడెందుకయ్యా!’

రాముడన్నాడు.
‘కలియుగం వచ్చేసింది ఆంజనేయా! మన రోజులు కావివి. ఇప్పుడు రామసేతును పడగొట్టి దాని  స్తానంలో కాలువ లాటిదేదో  నిర్మించాలని కొందరు అనుకుంటున్నట్టు ఈ మధ్య టీవీ స్క్రోలింగులలో చూసాను. కాలువ నిర్మిస్తారో లేదో  కానీ మనం కట్టిన సేతువుని తొలగించడం ఖచ్చితమనిపిస్తోంది. ఎందుకంటె,  ఈ కాలువ కాంట్రాక్ట్ లో కోట్ల డబ్బు కొందరి చేతుల్లోకి  చేరుతుంది.  వాళ్లు మరికొందరి చేతులు తడిపయినా సరే ఆ  కాంట్రాక్ట్ ను దక్కించుకోవడం ఖాయంగా కనబడుతోంది. మాల్తూసియన్ అనే ఒక ఆర్ధిక వేత్త  ఏనాడో చెప్పాడు కదా. జనాలకు ఉపాధి కల్పించాలంటే  ‘Dig a pit and cover it’ అని. అంటే ఏమిటి?  ముందు ఒక గొయ్యి తవ్వించు. మళ్ళీ దానిని పూడ్పించు.   గొయ్యి తవ్విన వాడికో పని. దాన్ని పూడ్చినవాడికి మరో  మరో పని. అసలా గొయ్యి ఎందుకు తవ్వాలో ఎందుకు పూడ్చాలో అడిగే నాధుడు వుండడు. అలాగే ఇప్పుడు రామసేతు వ్యవహారం. పడగొట్టినందుకు డబ్బులు. మళ్ళీ కాలవ నిర్మించినందుకు  డబ్బులే డబ్బులు.’

ఆ మాటలు వింటూనే  హనుమంతుడిలా అన్నాడు.
‘ఆ రోజుల్లో వంతెన నిర్మాణానికి మేము కూలీ డబ్బులు తీసుకోకుండా పని చేసిన  మాట వాస్తవమే. అటు రాజ్యలక్ష్మిని,ఇటు  గృహలక్ష్మిని పోగొట్టుకుని వుసూరుమంటూ అడవుల్లో తిరుగుతూ వున్న  మీనుంచి  డబ్బు డిమాండ్ చేయడం కూడా మాకు  సబబు అనిపించలేదు. అదీకాక పళ్ళూ కాయలు తిని పొట్ట నింపుకునే మా వానరులకు విత్తముతో పని ఏముంటుంది?   కాకపొతే,  ఈ మానవులున్నారే వాళ్లు మామూలు వాళ్లు కాదు. క్షమించాలి తొందర్లో మీదీ అదే జాతి అని మరచిపోయి మాట తూలాను. అయినా కానీ,  ఈ కలియుగం మానవులకూ, మన కాలం నాటి మానవులకూ పోలికెక్కడ ప్రభూ. మీరు మీరే వాళ్లు వాళ్ళే. వాళ్లు  బాగా వొళ్ళు బలిసి పోయి  వ్యవహరిస్తున్నారు. అలాటి వారినుంచి డబ్బు పిండినా తప్పులేదు. ఆ విషయం ఆలోచిద్దాం. అసలా  వంతెన కట్టింది మేము. దాని ఆనుపానులన్నీ తెలిసింది మాకు. అలాటప్పుడు దాన్ని  కూలగొట్టడం ఎలాగో మాకు తెలిసినంతగా వేరేవారెవ్వరికీ  తెలిసే వీలు లేదు. కాబట్టి  మనమే వెళ్లి మన  సంగతి ఆ మూఢ మానవులతో చెప్పుకుని  ఆ పనేదో నెత్తికెత్తుకోవడం మంచిదేమో ప్రభూ’

‘హనుమా! నీకు శారీరక  బలం తప్ప మేధోపరమయిన తెలివితేటలు పూజ్యం. ఆ బలం కూడా ఎవరయినా గుర్తుచేస్తేనే నీకు గుర్తుకొచ్చి అక్కరకొస్తుంది. అదీ నీ పరిస్తితి. ఒక విషయం తెలుసుకో. మన  రోజులు కావివి. అప్పుడంటే నేను టెండర్లు పిలవకుండా నామినేషన్ మీద మీకు పని వొప్ప చెప్పాను. మీరూ ఏమీ ఆశించకుండా పని పూర్తిచేశారు. అందుకే  మన మీద ఏ ఆరోపణలు రాలేదు. గిట్టనివారెవరూ  సీబీఐ  దర్యాప్తు డిమాండ్ చేయలేదు. కాని ఇప్పుడలా కాదు. ప్రతిదీ ఓ పద్దతి ప్రకారం జరగాలి. లెక్కలన్నీ పక్కాగా వుండాలి. లేకపోతే ఏ ‘కాగో’ పట్టుకుని విచారణ పేరుతొ మనల్ని కాగులో వేసి మరగ పెడుతుంది. దర్యాప్తుల పేరుతొ నిద్ర పట్టకుండా చేస్తారు. జైళ్ళంటారు. నార్కో పరీక్షలంటారు. ముందు ఏసీ కారులో  దిల్ కుశా గెస్ట్ హౌస్ కు పోదాం  అంటారు. అక్కడికెళ్ళాక అరెస్ట్ అంటారు. ఆ తరువాత  సీబీఐ కోర్టుకంటారు. ఆ కోర్టు న్యాయమూర్తి వున్నాడే నాగ మారుతీ శర్మ. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే  మన  రోజుల్లో కూడా ఇలాటి ఖరాఖండీ  న్యాయమూర్తిని చూడలేదు. నిజానికి  వాళ్ల నాన్న నా భక్తుడు. అసలు పేరు సుందర లాల్. నా పేరు అనుక్షణం ఆయన నాలుక మీద ఆడుతూ వుండేది. ఖమ్మంలోవుండగా  ఆయన పేరు ‘రామాయణం మునసబు’.  రోజూ రామాయణ పారాయణం చేస్తేకాని ఆయనకు నిద్రపట్టేది కాదు. ఖమ్మంలోవుండగా  ఆయన్ని అందరూ  ‘రామాయణం మునసబు’ గారనేవారు. మామిళ్లగూడెంలో ఆయన  అద్దెకు వున్న ఇంట్లో క్రమం తప్పకుండ  సుందరాకాండ పారాయణం జరిగేది.   నా పేరు కలవరిస్తూనే ఆయన కళ్ళు మూశాడని చెప్పుకుంటారు. కాని ఆయన కొడుక్కు మన సంగతి తెలుసో లేదో తెలవదు. బెయిల్ ఇవ్వనన్నాడో చెంచల్ గూడా జెయిలే గతి. ఇక అన్నిటికంటే ఘోరం  టీవీల్లో మన గురించి జరిగే ప్రచారం. నామీద ఈ మానవులు గతంలో  ఎన్నో సినిమాలు తీసి డబ్బు చేసుకున్నారు. అదంతా మరచి,  మనల్ని జెయిల్లో తోయించే దృశ్యాలను వాటికి  లక్ష రెట్లు ఎక్కువ సార్లు చూపిస్తారు. రాముడు మంచి బాలుడన్న సంగతి మట్టిలో కలిసిపోతుంది. నన్ను నమ్ముకున్న రామదాసు లాటివాళ్ళు  బందిఖానాలో పడ్డ మాట నిజమే.  కాని, నాకు మాత్రం  జెయిళ్లు, బెయిళ్లు తెలియదు.  వనవాసంలో లక్ష్మణుడు తెచ్చిపెట్టిన కందమూలాలు తప్ప   జెయిల్లో పెట్టే చిప్ప కూడు ఏనాడూ తిని ఎరుగను. ఇప్పుడు పోయిపోయి సీబీఐ చేతుల్లో పడితే ఇక మన చేతిలో ఏమీ వుండదు. ఇంత బతుకూ బతికి మళ్ళీ ఆ చేతి పార్టీ చేతులే పట్టుకోవాలి. వాళ్లు ఓ పట్టాన తేల్చరు. అయిదు రాష్ట్రాల ఎన్నికలంటారు. తిధులంటారు. పండగలంటారు. ఈ లోపల మనం మళ్ళీ అవతారం ఎత్తాల్సిన త్రేతా యుగం  రానే వస్తుంది. అది తప్పిపోయిందంటే మళ్ళీ మరో నాలుగు యుగాలు ఆగాలి.    రామరాజ్యంలో ఏదయినా కూడబెట్టుకున్నది వున్నదంటే అది లాయర్లకు చదివించు కోవడానికే సర్వం సరిపోతుంది. ఈ లోగా యుగాలు, మన్వంతరాల తరబడి కష్టపడి మనం  సంపాదించుకున్న మంచి తనం కాస్తా టీవీ చర్చల్లో మంట కలిసిపోతుంది. కలియుగం మనుషులంటావా తింటారు తినిపిస్తారు. దర్యాప్తులు, విచారణలు ఏళ్లతరబడి సాగిస్తారు. సాగదీస్తారు. ఈ లోపల వాళ్లకు వాళ్లకు లెక్కలు డొక్కలు కుదిరితే కేసులన్నీ  అటకెక్కుతాయి. ఆ టక్కుటమార విద్యలు నా గురువులు నాకు నేర్పలేదు. పోనీ నేర్చుకుందామనుకున్నా  ఈ వయస్సులో వంటపట్టవు. ఏదో  నువ్వు చెబుతున్నావు కదా, పోతే పోయింది ఒక రాయి విసిరి చూద్దాం   అని వెళ్ళామే అనుకో. నిలబెట్టి   వెయ్యి ప్రశ్నలు అడుగుతారు. వంద సర్టిఫికెట్లు తెమ్మంటారు. వయస్సు సర్టిఫికేట్  ఏదంటే ఏం చెబుతాం. ఏం చదివారంటే మన దగ్గర  ఏం జవాబుంది? చదువు  చెప్పిన విశ్వామిత్రుడు తన దగ్గర నేను చదివినట్టు నాకు ఏ  సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇటు భూలోకానికి అటు స్వర్గలోకానికి కాకుండా మధ్యలో వేళ్ళాడుతూ త్రిశంకు స్వర్గంలో  వుండిపోయాడు. ఆయన్ని ఇప్పుడు యెక్కడని వెతికి పట్టుకుంటాం. రోజులు బాగున్న రోజుల్లో  రధాల మీద తిరిగాము. కాలం ఖర్మం కలసిరానప్పుడు  కాలినడకన అడవుల్లో సంచరించాము. అలాగని ఆ   రధానికి  డ్రైవింగ్ లైసెన్సు తెమ్మంటే ఎక్కడ తెస్తాము చెప్పు. యెలా తెస్తాము చెప్పు.      
          
“అంతటితో అయిపోతుందా. అడ్రసు ప్రూఫ్ అడిగారనుకో  అదీ లేదు. నేను జన్మించిన  అయోధ్యనే ఈ  మానవులు ఏళ్లతరబడి కోర్టు  లిటిగేషనులో పెట్టి తమాషా చూస్తున్నారు. మనిద్దరం విల్లంబులు పట్టుకుని టెండర్ వేయడానికి వెడితే, పని ఇవ్వకపోగా ఎస్ టీ కోటా కింద  ఏదయినా ఆశ్రమ  పాఠశాలలో చేర్పించి చేతులు దులుపుకుంటారేమో కూడా. అంతటి ఘనులు వీళ్ళు. ఇంకో సమస్య ఏమిటంటే మనం భగవంతుడి అవతారం అన్న ట్యా గ్ లైన్ ఒకటి వుంది. అది పెట్టుకుని ఇప్పుడు కాలినడకన వెడితే ఏం బాగుంటుంది చెప్పు. మిగిలిన కాంట్రాక్టర్ల మాదిరిగా త్రీ పీస్ సూట్ వేసుకువెళ్ళామంటే ఇంతే సంగతులు. మన భక్తులు కూడా మనల్ని  అనుమానిస్తారు. అదింకా ప్రమాదం. టెండరు దక్కక పోగా మనకే టెండరు పడుతుంది.’
రాముడు చెప్పిన భగవద్గీత అంజనీకుమారుడి చెవికేక్కినట్టులేదు. అతడు తోకతో  ఓమారు వీపు గోక్కుని  దాంతోనే మరోమారు  తల  తడుముకుని ఇలా అన్నాడు.
‘ రామసేతు వంతెనను నేనూ నా సహచర వానరులు స్వయంగా కట్టామని ఆ మానవాధములకు స్టాంపు పేపరు మీద రాసి ఇస్తాను. అదీ నమ్మరా. అలాటప్పుడు ఆ పేపర్లు ఎందుకు, డూప్లికేట్ స్టాంపు కాగితాలు తయారు చేసే తెల్గీ లాటి వాళ్లు బాగు పడడం కోసమా?’

‘ఓరి అమాయక వానర చక్రవర్తీ!’ రాముడు మళ్ళీ చెప్పాడు.   

“అలాటి కాగితాలు వాళ్లకు చిత్తు  కాగితాలతో సమానం. వాళ్ళు ముందు నిన్ను రామసేతువు  లేఅవుట్ సబ్మిట్ చేయమంటారు. ప్రాజెక్ట్ వివరాలు అడుగుతారు. ఇన్ కం టాక్స్ రిటర్న్లు తెమ్మంటారు. అప్రూవ్  చేసిన ప్లాను అడుగుతారు. మునిసిపల్ పర్మిట్లు, ఎస్కవేషన్  పర్మిట్టు,  రామసేతు కట్టిన కంట్రాక్టర్ పేరు వివరాలు, అతడికి యెంత ఖర్చయింది, ఎన్నాళ్లలో కట్టాడు, దాన్ని సకాలంలో పూర్తిచేసిన సర్టిఫికేటు వుందా ఇలా   రకరకాల పత్రాలు అడుగుతారు.ప్రశ్నలు వేస్తారు. రామసేతు పూర్తయిన తరువాత దాన్ని ఎవరు ప్రారంభించారు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్పింగులు గట్రా పట్రా అంటారు. ఎందుకంటె ఈ కలియుగంలో మనిషి మాటకన్నా సర్టిఫికేట్లకే విలువెక్కువ. ప్రత్యేకించి పవిత్ర బారతంలో ఈ పత్రాల గోల మరీ ఎక్కువ. పెన్షన్  తీసుకునే వాడు స్వయంగా వెళ్ళినా అతడు బతికే వున్నట్టు సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా అధికారులు ఏదీ ఒప్పుకోరు. నువ్వు ఖల్లు ఖల్లున దగ్గుతున్నా సరే డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర వుంటేనే నీకు దగ్గు జబ్బు వున్నట్టు లెక్క.”

శ్రీ రామ గీత వింటున్న పవన సుతుడుడికి మతి పోయినంత పనయింది.

‘స్వామీ ఇదెక్కడి మాయ లోకం. నువ్వు ప్రతి వందేళ్లకీ ఓ మాటు  సూరదాసు, తులసీదాసు, త్యాగరాజు, జయదేవుడు, భద్రాచల రామదాసు,  భక్త తుకారాం లాటివారికి నీ ఉనికినీ, మహిమలనూ  ప్రదర్శిస్తూనే వున్నావు. అయినా సరే ఇప్పటికీ  నువ్వున్నావా అసలున్నావా   అని సినిమా పాటలు రాస్తూనే వున్నారు. ఇక నీ ఉనికి గురించిన చర్చోప చర్చలు టీవీ తెరలపై అనంతంగా సాగి పోతూనే  వున్నాయి. రామాయణం పుక్కిటి పురాణమని, రామసేతు నిర్మాణం అసలు జరగనేలేదనీ వాదించేవారు లెక్కకు మిక్కిలిగా వున్నారు. ఈ స్తితిలో నాకు ఒకే దారి కనబడుతోంది. ఏమయినా సరే నువ్వు రాముడిగా మరో సారి అవతారం ఎత్తాలి. రామాయణం నిజంగా జరిగిందేనని నిరూపిస్తూ దాన్ని మరోసారి ఈ మానవులకు ప్రదర్శించి చూపాలి.’అన్నాడు ఆంజనేయుడు ఆవేశంగా.

రాముడు తనదయిన రీతిలో మందహాసం చేసి  చెప్పాడు.

‘అదంత సులభం కాదు అంజనీ పుత్రా. ఈనాటి రాజకీయ నాయకులతో పోలిస్తే  రావణుడు లాటి విలన్  కూడా జనాలకు ఒక హీరో లాగానే అనిపిస్తాడు. కనిపిస్తాడు. ఈ మధ్య మారీచుడు నాకు తారస పడితే అడిగాను. మారీచుడు ఎవరో  గుర్తున్నాడు కదా. ఈనాటి మిమిక్రీ కళాకారులందరికీ ఆదిగురువు. అరణ్యంలో బంగారు లేడిని వేటాడుతూ  వెడుతున్నప్పుడు అచ్చు  నా స్వరాన్ని అనుకరిస్తూ ‘హా లక్ష్మణా’ అంటూ   లక్ష్మణుడిని ఎలుగెత్తి  పిలిచాడు చూడూ  ఆ మారీచుడే. ఏమన్నాడో తెలుసా! సల్మాన్ ఖాన్ వున్నంతవరకు మళ్ళీ భూమి మీద కాలు మోపే ఛాన్స్ తీసుకునేది  లేదని తెగేసి చెప్పాడు.’

శ్రీరాముడు బోధించిన ఈ భగవద్గీతతో ఆంజనేయుడికి జ్ఞానోదయం అయింది.
స్వస్తి. (31-01-2012)

-- 
Bhandaru Srinivas Rao (I.I.S.)
Cell: 98491 30595 Res: 040 2373 1056.
Please click on below URL to visit my Blog:
http://bhandarusrinivasarao.blogspot.com

11 కామెంట్‌లు:

rajachandra చెప్పారు...

సార్ ..చాలబాగుంది అండి. సూపరో.. సూపర్..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@rajachandra akkireddi - ధన్యవాదాలు -భండారు శ్రీనివాసరావు

శ్యామలీయం చెప్పారు...

బాగుందండోయ్

అజ్ఞాత చెప్పారు...

very intersting.

voleti చెప్పారు...

అసలు రాముడంటూ జనాలకి కనిపిస్తే బోల్డు యాక్ట్ ల కింద అరెస్ట్ చేయించడానికి మహిళా సమాజాలు రడీగా వున్నాయి.. సీతమ్మకి అగ్నిపరీక్ష (శీల పరీక్ష) పెట్టడమేమిటని.. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించినందుకు బహుశా *** నాయకులు కూడా కేసులు పెట్టించవచ్చు.. తస్మాత్ జాగ్రత్త...

సుజాత వేల్పూరి చెప్పారు...

భలే ఉందండీ రామ గీత!

మారీచుడు ఎవరో గుర్తున్నాడు కదా. ఈనాటి మిమిక్రీ కళాకారులందరికీ ఆదిగురువు___________________అవును కదూ! :-)))

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం,సుజాత,kastephale,voleti - అందరి స్పందనలకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

confused చెప్పారు...

చాలా బాగా రాసారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@confused - Thanks - Bhandaru Srinivas Rao

Sri Annapragada చెప్పారు...

రాముని రామాయణం కాదు ఇది.... మనుషుల గోలాయణం.... కానీ రామునితో చేయించిన మన మనుషుల చేష్టల విశ్లేషణ భలే ఆకట్టుకుంది.... మరిన్ని రామ విశేషాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం....

--
శ్రీ జ్యోతి స్వరూప్ అన్నాప్రగడ.

అజ్ఞాత చెప్పారు...

సర్ దయచేసి ప్రస్తుత టాంప్లెట్ మార్చి...పాత పోస్ట్లు కనబడే టాంప్లెట్ ను ఏర్పాటు చేయగలరు..