24, నవంబర్ 2011, గురువారం

ప్లస్ లూ - మైనస్ లూ


ప్లస్ లూ -  మైనస్ లూ  - భండారు శ్రీనివాసరావు


(ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి నేటికి (25-11-2011)  సరిగ్గా ఏడాది.)





కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో  కిరణ్ కుమార్ రెడ్డి సరయిన తరుణంలో ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి.

కలసివచ్చిన అంశాలు.
1.)  ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించేనాటికి  మరో  మూడున్నరేళ్ల పాలనా  సమయం మిగిలి వుండడం
2.)  అంతకు ముందు పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు తన పార్టీకి చెందినవారే కావడం
3.)  సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏవిధమయిన మరకలు లేకపోవడం
4.) యువకుడు, విద్యాధికుడు కావడం
5.)  అధిష్టానం ఆశీస్సులు  
ఇక కలసిరాని అంశాలు :
1.)  తెలంగాణా సమస్య తీవ్రం కావడం
2.) జగన్ ప్రాబల్యం గురించిన ప్రచారం పెరిగిపోవడం
3.)  సీనియర్లు మొరాయించడం
4.)  జూనియర్లు ఠలాయించడం
5.) పరిష్కారం తన చేతిలో లేని తెలంగాణా వంటి సమస్యలు చుట్టుముట్టడం
6.) అధికారులమీదనే ఎక్కువ ఆధారపడుతూ క్యాంప్ ఆఫీసుకే పరిమితమై ఓ సీనియర్ బ్యూరోక్రాట్ మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్న వదంతులను గట్టిగా ఖండించలేకపోవడం
సాఫల్యాలు :
1.)  శాసనసభ నియోజకవర్గంనుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో చతురత చూపి పార్టీకి వున్న బలాన్ని మించి  అదనంగా ఒక సీటు గెల్చుకోవడం 
 2.)  సకలజనుల సమ్మె సందర్భంగా రైల్  రోఖో కార్యక్రమాన్ని నీరుకారుస్తూ పోలీసులతో కలసి వ్యూహ రచన చేయడం
 3.)  ప్రభుత్వం పడకేసిందన్న నిందను సైతం లెక్కచేయకుండా అనవసరమయిన నిర్ణయాలతో లేనిపోని ఆరోపణలకు గురికాకుండా జాగ్రత్త పడడం
4.) మూడున్నరేళ్లు వ్యవధానం వున్న ముఖ్యమంత్రికి కావాల్సింది ప్రభుత్వం నిలుపుకోవడం కానీ ప్రజా సంక్షేమ పధకాలు కాదన్న రాజకీయ కౌశల్యాన్ని ప్రదర్శించి ‘నెంబర్ గేమ్ ‘ కు ప్రాధాన్యం ఇవ్వడం.
5.) ఏడాది పుణ్యకాలం హారతి కర్పూరంలా కరిగిపోయినా ముందు కుర్చీ పదిలం చేసుకున్న తరువాతనే సంక్షేమ పధకాలను వరుసగా ప్రకటించడం
6.) ముఖ్యమంత్రిని మార్చే అవకాశం లేకుండా వచ్చే ఎన్నికలవరకు తననే కొనసాగించేలా అధిష్టానం వద్ద మార్కులు సంపాదించడం
7.) సొంతపార్టీలో అసమ్మతి గళాలు విప్పిన నోళ్లతోనే భజన గీతాలు పాడించడం
ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి సొంత ప్రతిభకు తార్కాణాలయితే అయాచితంగా  కలసివచ్చిన అంశాలు మరికొన్ని వున్నాయి.
 1.) కోర్టు నిర్ణయాలవల్ల మారిన రాజకీయ వాతావరణం
2.) సీ బీ ఐ దర్యాప్తులతో రెండు ప్రధాన ప్రత్యర్ధి వర్గాలు మల్లగుల్లాలు పడుతుండడం
౩.) గత కాలపు చేదు అనుభవాల నేపధ్యంలో పార్టీ హై కమాండ్ ముఖ్యమంత్రి మార్పు గురించి ఆలోచించే పరిస్తితి లేకపోవడం
4.) ప్రత్యర్ధుల బలహీనతలు ముఖ్యమంత్రికి బలంగా మారడం
ఇవన్నీ వున్నా  ఇంకా పొంచే వున్న రాజకీయ కారు మేఘాలు.
1.) సొంతగూటికి చేరుతున్నట్టు  ప్రకటనలు గుప్పిస్తున్న అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతవరకు నమ్మొచ్చన్న అనుమానాలు
2.) ఇంతవరకు కిరణ్ ప్రభుత్వాన్ని చూసీ చూడనట్టు వొదిలేస్తున్న తెలుగుదేశం పార్టీ -   సీ.బీ.ఐ. దర్యాప్తు ముదిరిన తరువాత కూడా అదే దారిలో వెడుతుందా లేదా అన్న విషయంలో అస్పష్టత
౩.) ముదిరి పాకాన పడుతున్న దర్యాప్తుల నేపధ్యంలో పధకాల రూపకల్పనలోనూ, వాటి అమల్లోను , అధికారుల సహకారం మంత్రులకు, ముఖ్యమంత్రికి  ఏమేరకు వుంటుంది అన్న సందేహాలు
కాబట్టి రాజకీయాల్లో ఇవ్వాళ గడిచినట్టే రేపు గడుస్తుంది అన్న భరోసా లేదు. ఇవ్వాళ స్త్రోత్ర పాఠాలు వల్లిస్తున్న భజన బృందాలు అధికారం వున్నంతవరకే వెనకవుంటాయనీ, వెన్నంటి వుంటాయనీ తెలుసుకోవడానికి చరిత్ర తిరగేయనక్కరలేదు. నిన్నమొన్నటి వరకు ఆ గళాలు ఎవరిని వేనోళ్ళ స్తుతించాయో, ఎవరివెంట తిరిగాయో  తెలుసుకోవడానికి రిసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
కాకపొతే, ఈ నగ్న సత్యం ఈనాటి నాయకులకు తెలియందేమీ కాదు. తెలియనట్టు కానవస్తారంతే! ఎందుకంటె రాజకీయాల్లో ఈ భజనపరుల అవసరం కొండంత. పైపెచ్చు పరస్పరాధీనంగా నడిచే వ్యవహారాలు కావడం మరో కారణం. (25-11-2011)

కామెంట్‌లు లేవు: