21, అక్టోబర్ 2011, శుక్రవారం

కలకంఠి కన్నీరు – భండారు శ్రీనివాసరావు

కలకంఠి కన్నీరు – భండారు శ్రీనివాసరావు



 
గోపాలానిది అటూ ఇటూ కాని వయసు. ప్రతిదీ అర్ధం చేసుకోవాలనిపిస్తుంది. ఏదీ సరిగా అర్ధం కాదు.

అమ్మ వొంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు కానీ ఎందుకో అర్ధం కాలేదు. అదే అడిగాడు.

“ఇలా ఏడిస్తేకానీ నా గుండెల్లో భారం తగ్గదు” అంది భారంగా.

“అర్ధం కాలేదు. భారం అంటే?”

“నీకర్ధం కాదులే! ఇప్పడే కాదు ఎప్పటికీ అర్ధం కాదు” కొడుకును దగ్గరికి తీసుకుంటూ అంది తల్లి.

గోపాలం తండ్రి దగ్గరకు వెళ్లి అమ్మ ఏడుస్తున్న సంగతి చెప్పి కారణం అడిగాడు.

“మీ అమ్మే కాదు ఆడాళ్లందరూ కారణం లేకుండానే ఏడుస్తుంటారు” తేలిగ్గా తీసేశాడు తండ్రి.

కానీ ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు అన్న అనుమానం తీరలేదు చిన్న గోపాలానికి.

స్కూలుకు వెళ్ళినప్పుడు టీచరు వొంటరిగా వున్నప్పుడు చూసి తన అనుమానం బయట పెట్టాడు.

ఆ టీచరు బాగా చదువుకున్నది. లోకజ్ఞానం బాగా వున్నది.

ఆమె ఇలా చెప్పింది.

“బ్రహ్మ దేవుడు సృష్టి కార్యం నిర్వర్తిస్తూ ఒక స్త్రీ మూర్తిని తయారు చేశాడు. ఆ బొమ్మకు ప్రాణం పోసేముందు స్త్రీ జాతికి కొన్ని ప్రత్యేకతలు కల్పించాలనుకున్నాడు.

“సంసార భారాన్ని తేలిగ్గా మోయగల శక్తిని ఆమె చేతులకు ఇచ్చాడు. అదే సమయంలో కుటుంబ సభ్యులకు ఎలాటి ఇబ్బంది లేకుండా చూడగల మానసిక మృదుత్వాన్ని ప్రసాదించాడు.

“నవమాసాలు మోసి, ప్రాణాలనే పణంగా పెట్టి మరో జీవిని ఈ లోకంలోకి తీసుకురాగల ఆత్మ స్తైర్యాన్ని అనుగ్రహించాడు.

“అంతేకాదు, అంత కష్టపడి కన్న, కన్న పిల్లలే పెరిగి పెద్దయిన తరువాత వారి నుంచి ఎదురయ్యే దూషణ భూషణ తిరస్కారాలను భరించగల హృదయ వైశాల్యాన్ని వరంగా ఇచ్చాడు.

“కుటుంబంలో సమస్యలు ఎదురయినప్పుడు అందరూ పట్టనట్టు వొదిలేసి వెడుతున్నా అన్నీ తన నెత్తిన వేసుకుని సంసార నావను ఓ దరిచేర్చగల నిగ్రహాన్ని అనుగ్రహించాడు.

“ఇంట్లో ఏఒక్కరికి వొంట్లో బాగా లేకపోయినా ఏమాత్రం విసుక్కోకుండా రేయింబవళ్ళు సేవ చేసే మంచి మనసును ఆమె పరం చేసాడు.

“పిల్లలు విసుక్కున్నా, మాటలతో చేతలతో మనసును గాయపరచినా వారిని ప్రేమించి లాలించే హృదయాన్ని ఇచ్చాడు.

“కట్టుకున్నవాడు ఎన్ని తప్పులు చేసినా ఉదారంగా మన్నించి మరచిపోగల మనసును ఇచ్చాడు.

“సంసారంలో ఎన్ని వొడిదుడుకులు ఎదురయినా ఎదుర్కుంటూ భర్త వెంట నడవగల ధీమంతాన్ని ఆమె సొంతం చేశాడు.

“ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడు, ‘కన్నీరు’ ను కూడా వరంగా అనుగ్రహించాడు.

“కన్నీరు ఆడవారి సొంతం. తమకు అవసరమయినప్పుడల్లా కన్నీరు పెట్టుకుని తమ మనసులోని భారాన్ని దింపుకుంటారు. కష్టాలతో, క్లేశాలతో కల్మషమయిన మనసును శుభ్రం చేసుకోవడానికి వారికి ఉపయోగపడే నీరే ఈ కన్నీరు. కన్నీరు పెట్టుకోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం కానీ హేతువులు చూపించాల్సిన అగత్యం కానీ ఆడవారికి లేదు.

“చూడు గోపాలం. ప్రేమను నింపుకున్న వారి హృదయానికి ప్రధాన కవాటాలు వారి కంటిలోని ఈ కన్నీటి చుక్కలే.”

టీచరు చెప్పింది గోపాలానికి కొంత అర్ధం అయింది. కొంత కాలేదు.

కానీ, ప్రపంచంలోని మగవాళ్లకు మాత్రం ఎప్పటికీ అర్ధం కాదు. ఆ అవసరం కూడా వారికి లేదు. (21-10- 2011)





1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా రాసారు సర్!