2, సెప్టెంబర్ 2010, గురువారం

రేడియో రోజులు -1 -భండారు శ్రీనివాసరావు

2004 జనవరి చివరి వారం లో ఒక రోజు.

ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

బేగం పేట్ ఎయిర్ పోర్ట్ నుంచి అప్పుడే ఇంటికి చేరాను, మా ఆవిడను అమెరికాలోనే వొదిలేసి.

శ్రీ దేవులపల్లి అమర్


పేపర్లు వచ్చే సమయం కాలేదు కనుక టీవీ స్విచ్ ఆన్ చేసాను. హఠాత్తుగా టీవీ తెరపై వార్తలు చదువుతూ అమర్ కనిపించాడు. నాకు తెలిసినంతవరకు అతడికి ప్రింట్ మీడియా తప్ప విజువల్ మీడియాలో పనిచేసిన అనుభవం లేదు. అప్పుడెప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఒకసారి రేడియోలో ప్రాంతీయ వార్తలు చదివే కాజువల్ న్యూస్ రీడర్ పోస్ట్ కోసం వచ్చాడు. అదీ మా రిక్వెస్ట్ మీదనే. జర్నలిస్టులు అయితే భాష మీద పట్టు వుంటుందనిమా వాళ్ళు వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. నిజానికి ఇది రెగ్యులర్ ఉద్యోగం కాదు. వార్తలు చదివేవాళ్ళు సెలవుపెట్టినప్పుడు వీళ్ళని బుక్ చేసి ఆ రోజు వార్తలు చదివిస్తారు. అప్పట్లో రేడియోకు వున్న గ్లామర్ మూలాన చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఆసక్తి చూపేవారు. కాజువల్ న్యూస్ రీడర్ని సెలక్ట్ చేయడానికి చిన్న పరీక్ష వుండేది. ఇంగ్లీష్ నుంచి వార్తలను తెలుగులోకి అనువాదం చేయడం, ఒక నమూనా న్యూస్ బులెటిన్ చదివించి రికార్డ్ చేయడం అన్నమాట. వార్తాపత్రికల్లో పుష్కలంగా అనుభవం వున్న అమర్ కు అనువాదం కొట్టిన పిండి. అందువల్ల ఆ మెట్టును ఇట్టే దాటి బులెటిన్ చదివే ఘట్టానికి చేరుకున్నాడు. అది దాటితే సెలక్షన్ అయిపోయినట్టే. అయితే, అమర్ వాయిస్ లో తెలంగాణా స్లాంగ్ వుంది అని కామెంట్ చేసాడు అప్పటి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు గారు. అతడు ఆంద్ర ప్రాంతం వాడయినా ప్రాంతీయ విద్వేషాలు లేని మనిషి. రేడియో బులెటిన్ తయారు చేయడం పట్ల ఆయనకు కొన్ని నిర్దిష్ట మయిన ఆలోచనలు వున్నాయి. అన్ని ప్రాంతాలవారు వింటారు కాబట్టి ఎలాటి రీజినల్ స్లాంగ్ లేకుండా వార్తలు చదవాలన్నది కేంద్ర ప్రభుత్వ అధికారిగా అతగాడి ఉద్దేశ్యం. కానీ ఈ సంగతి తెలిసిన అమర్ నిర్ద్వందంగా ఆ సెలెక్షన్ ప్రాసెస్ ను కాదని వెళ్ళిపోయాడు. అంతవరకూ నాకు అమర్ తో వున్న పరిచయం అంతంత మాత్రమె అని చెప్పాలి. అది కూడా ప్రెస్ క్లబ్ కే పరిమితం. కాకపొతే తరవాతి రోజుల్లో మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నా విషయం వొదిలి పెడితే, అమర్ స్వతహాగా స్నేహ శీలి. అందరితో చాలా కలుపుగోలుగా మెలిగే తత్వం అమర్ సొంతం.


అప్పుడే అమెరికా నుంచి వచ్చిన నాకు అమర్ టీవీ తెరపై కనబడడం యెంత ఆశ్చర్యాన్ని కలిగించిందో, అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం మరో సంగతి గమనించిన తరవాత కలిగింది. అమెరికాలో ఇరవై నాలుగుగంటల న్యూస్ చానళ్ళకు అలవాటు పడి రావడం చేత ఆ సమయంలో వార్తలు ఎందుకు వస్తున్నాయో అన్న అనుమానం ముందు కలగలేదు. వేళ కాని వేళలో ఈ వార్తలు ఏమిటి అన్న సందేహం పొటమరించిన తరవాత నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. ఇదేమిటి ఇది ఇండియాలో సాధ్యమా అనిపించింది. ముప్పయ్యేళ్ళుగా రేడియోలో పనిచేస్తున్న నాకు ఈ పరిణామం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒకే ఒక మూసలో పోసినట్టుగా కాకుండా నాలుగు కోణాలనుంచి జనం సమాచారం తెలుసుకునే వీలు కలిగినందుకు ఒక మీడియా మనిషిగా ఆ నాడు సంతోషించాను. వెంటనే బయటకు వెళ్లి పబ్లిక్ కాల్ బూత్ నుంచి అమెరికాకు ఫోను చేసి నేను క్షేమంగా చేరిన సమాచారంతో పాటు, నేను దేశంలో లేని అయిదు మాసాల్లో సంభవించిన ఈ అద్భుతమయిన మార్పుని గురించి కూడా మా వాళ్లకు గొప్పగా వివరించాను.

ఆ రోజు టీవీలో చూసిన అమర్ ఎవరో కాదు తదనంతర కాలంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన దేవులపల్లి అమర్. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు. ఆ తెలతెలవారే సమయంలో నేను చూసిన ఆ న్యూస్ చానల్ టీవీ -9.

తెలుగు మీడియాను మలుపుతిప్పిన శ్రీ రవిప్రకాష్

ముందు అడుగు మోపినవాడే మునుముందుకు పోగలుగుతాడని ఆనతి కాలంలోనే నిరూపించిన వ్యక్తి ఆ ఛానల్ సీయీఓ శ్రీ రవి ప్రకాష్. అప్పటికే జెమినీ టీవీలో నిర్వహించిన కార్యక్రమాలు ఆయనకు ఎంతో పేరుతొ పాటు అసంఖ్యాకమయిన అభిమానులను సమకూర్చిపెట్టాయి. టీవీ ఇంటర్వ్యూ లు అంటే ఇలాగే వుండాలని అనుకున్నవాళ్ళలో నేను కూడా వున్నాను.

తరవాత జైపాల్ రెడ్డి గారు మా మంత్రిగా వున్నప్పుడు – ఆకాశవాణి , దూరదర్శన్ లను ప్రభుత్వ పెత్తనం నుంచి తప్పించి ప్రసార భారతిని ఏర్పాటు చేసినప్పుడు కూడా మరింత ముచ్చట పడ్డాను. పలురకాల న్యూస్ చానల్స్ చూసే అవకాశం జనాలకు వుండాలన్నది నా ప్రగాఢమయిన కోరిక. అప్పటికే సోవియట్ యూనియన్ లో పరిస్తితి చూసివచ్చిన అనుభవం వుండడం వల్ల అలాటి మార్పును నేను మనసారా కోరుకున్నాను. అయితే, చాలాసంవత్సరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియాలో పని చేయడం వల్లనో ఏమో వార్తలను వార్తలుగా మాత్ర మే ఇవ్వాలనే సిద్దాంతానికి అలవాటు పడ్డాను. వ్యాఖ్యను మరోరకంగా వీక్షకులకు అందచేయాలి తప్ప వార్తలో మిళితం చేసి ఏది వార్తో ఏది వ్యాఖ్యో తెలియకుండా వారిని గందరగోళపరిచే హక్కు వార్తా పత్రికలకు కానీ, మీడియాకు కానీ వుండకూడదన్నది నా నిశ్చితాభిప్రాయం.

తెలుగు మీడియాపై 'ఏపీ మీడియా' కామెంట్

 వార్తలను ఎలాటి అంటూ సొంటూ లేకుండా అందించి , సంచలనం కోసం ఇచ్చే వ్యాఖ్యలను మరోరకంగా ఇవ్వడం వల్ల ‘వార్తలపట్ల జనాలకు వుండాల్సిన నమ్మకం చెదరకుండా వుంటుంద’ని భావించే వారిలో నేనొకడిని. ఒక్కసారి కనుక మనం ఇచ్చే వార్తలపట్ల జనాలకు అపనమ్మకం కలిగిందంటే చాలు ఆతరవాత మనం ఏది చెప్పినా ఆ ఛానల్ అలానే చెబుతుందని జనంలో ఒక చెరపలేని అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఒకనాడు రేడియో, దూరదర్శన్ వార్తలకు ఇదే గతి పట్టింది. నిజాలు చెప్పినా నిర్ధారణ చేసుకోవడానికి బీబీసీ వినేవారు.

టీవీ –9 సాధించిన అపూర్వ విజయం పుణ్యమా అని తెలుగునాట మీడియా బూమ్ మొదలయింది. అనేక న్యూస్ చానళ్ళు రంగ ప్రవేశం చేసాయి. పెట్టుబడులు ప్రవహించాయి. తెలుగు మీడియాకు కనీవినీ ఎరుగని హంగులు సమకూరాయి.

జగన్నాధ రధం లాటి ఓబీ వ్యాన్

ఒకప్పుడు దూరదర్శన్ ఓబీ వ్యాన్ (ప్రత్యక్ష ప్రసారాలకోసం వుపయోగించేది) బయటకు తీయాలంటే బ్రహ్మ ప్రళయం. సందులు గొందుల్లో మలుపులు తిరగలేని పెద్ద ట్రక్కులాటి భారీ వాహనం. ఇరవై మంది సిబ్బంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందస్తు అనుమతుల జంఝాటం.

ఇప్పుడో, ఒక చిన్న వ్యాన్ లోనే ఈ పరికరాలని అమర్చుకోగల సాంకేతిక సామర్ధ్యం పెరిగింది. చిన్న సంఘటనకు కూడా వెంటనే స్పందించి టీవీ ఛానళ్ల వారు, వీటిని తక్షణం పంపి ప్రత్యక్ష ప్రసారాలు చేయగలుగుతున్నారు.

పోటీ వున్న చోట ప్రతిభ పెరిగే అవకాశం వుంది. అలాగే ప్రమాణాలు పడిపోయే ప్రమాదం కూడా వుంది. మీడియాలో వస్తున్న పరిణామాలు ఆనందంతోపాటు ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. నాకే కాదు, ఈ రంగానికి సంబంధించిన చాలామందికి.

మా అన్నయ్య భండారు పర్వతాల రావు గారు  అనేవాడు. ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసు భవనం ఎక్కి చూస్తె కళ్ళు తిరిగే ట్రాఫిక్కు. ఈ కార్లు, లారీలు, ఆటోలను దాటుకుని వెళ్ళగలమా అని భయం వేస్తుంది. వాటి నడుమ పోతూ వుంటే మాత్రం ఎలాటి జంకూ కలగదు. బహుశా – ఈ ఆందోళనలు కూడా అలాగే తొలగిపోయి ఆనందమే మిగలాలని కోరుకుందాం. ఆశ పడడం మన దేశం మనకిచ్చిన జన్మ హక్కు. (02-09-2010)

NOTE: All images in the blog are copyrighted to respective owners

1 కామెంట్‌:

ramana చెప్పారు...

bagunnayi mee abhiprayalu......itlane aanati sanghtanala meeda, vykthula meeda mee abhiprayalu spastamga cheppandi