2, మార్చి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో ( 100) – భండారు శ్రీనివాసరావు

 ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి. వెంకట్రామయ్య  

నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు డి. వెంకట్రామయ్య.

ప్రముఖ పాత్రికేయులు , కలం కూలీ జీ. కృష్ణగారు అన్నారు ఒకసారి, వెంకట్రామయ్య వార్తలు చదువుతుంటే చదువుతున్నట్టుగా వుండదు, వార్తలు మనకు చెబుతున్నంత సహజంగా వుండేవని.  ఆయన అలా అన్నారు అంటే అది ఆస్కార్ అవార్డుతో సమానం. 

అయితే, ఆయన రేడియోలో ఉద్యోగం చేయడం వల్ల రేడియోకు లాభం చేకూరిన మాట నిజమే కానీ, వెంకట్రామయ్య గారు రేడియోలో చేరి కధలు రాయడం మానేసినందువల్ల తెలుగు పాఠకలోకం ఒక మంచి రచయితను కోల్పోయిందని నా నమ్మకం.

'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే ఆయన రాయడం బాగా తగ్గించారు. తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో!  

వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి,  ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి,  'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం.

1975 నవంబర్లో అనుకుంటాను,  తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను. ప్రాచుర్యం పొందిన రచయితతో ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం అరుదు. వృత్తిరీత్యా కలసి పనిచేస్తున్నప్పటికీ, ప్రవృత్తిరీత్యా ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.

ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని కోరుకునేవారు. ఇందుకు నేను పూర్తిగా విరుద్ధం. నలుగురితో బాతాఖానీ వేస్తూ, గలగలా నవ్వుతూ, నవ్విస్తూ పని చేస్తూ పోవడం నా పధ్ధతి.

టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు. చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా,  నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.


ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే,  అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాదాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనూ, పరిచయస్తులనూ, మొహమాటపడి వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని ఆబ్లి గేషన్స్ ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి మాది.

పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో,  వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! ఆ కొద్దిమందిలో వెంకట్రామయ్యగారు మొదటివరుసలో వుంటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం తగ్గించారు. పత్రికల్లో, మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది. నిజమేనేమో!
అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని, వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదిల్చుకుని చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని,  పాపపుణ్యాల పైనా, దేవుళ్ళూ దెయ్యాల పైనా ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.


అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన పేరుపెట్టు కోకుండానో, 'గళం'పేరుతోనో,  రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ, ఒక ఏడాది ఆ పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించడం ముదావహం. పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ.

సాధారణంగా పొగడ్తలకు, పొడిగించుకోవడానికి ఇష్టపడని వెంకట్రామయ్య గారు, రచన మాస పత్రికలో రాసిన తన రేడియో రోజుల సీరియల్ లో  నా గురించి కొన్ని మంచి మాటలు రాయడం నాకొక కితాబు. ఆయన రాతల్లోనే ఆ మాటలు:  

“హైదరాబాదు ఆకాశ వాణి వార్తావిభాగంలో మిగతా అందరికంటే నాతొ ఎక్కువ కాలం పనిచేసిన సహోద్యోగి, మిగతా అందరి కంటే నాకు అత్యంత ఆప్తుడు భండారు శ్రీనివాసరావు. 1975  లో ఆయన చేరినప్పటినుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు నలభయ్ ఏళ్ళు మా స్నేహం చెక్కుచెదరకుండా వుంది. ...ఎన్నో విషయాల్లో ఏ మాత్రం పోలికా పొంతనా లేని మేమిద్దరం స్నేహితులుగా అన్నేళ్ళు అంత దగ్గరగా వుండడమే విచిత్రం.

“ఎప్పుడు నవ్వుతు, తుళ్ళుతూ గలగలా మాట్లాడుతూ వుండడం, తన వాక్చాతుర్యంతో,చమత్కారాలతో, చలోక్తులతో, వ్యంగోక్తులతో చుట్టూ వున్నవాళ్లనందరినీ కవ్విస్తూ నవ్విస్తూ వుండడం ఆయన సహజ లక్షణాలు. అసలీ మనిషి జీవితంలో ఎన్నడయినా  విచారం, విషాదంలాంటివేమైనా వుంటాయా, ఎప్పుడయినా ఏ సందర్భంలో నయినా ఈయన సీరియస్ గా వుంటాడా అనిపిస్తుంది ఆయన్ని చూసిన వాళ్ళందరికీ. (వెంకట్రామయ్య గారికి నా గురించి ఈ ఆలోచన వచ్చినప్పుడు, ఆయన నమ్మని తథాస్తు దేవతలు ‘తధాస్తు అని వుంటారు. అందుకే నా జీవిత చరమాంకంలో  పెను విషాదాలు, విచారాలు నన్ను చుట్టుముట్టాయి)

“ న్యూస్ రూమ్ అంటేనే వాతావరణం ఎప్పుడు ఎంతో కొంత ఉద్విగ్నంగా వుంటుంది. కాని శ్రీనివాసరావు అక్కడ వుంటే చాలు వేడి తగ్గిపోయేది. ఆయన మాటలతో, చలోక్తులతో అందరూ కాసేపు హాయిగా నవ్వుకునే వారు. కాస్త విశ్రాంతి దొరికినట్టుగా, వూరట లభించినట్టుగా అనిపించేది పనిచేసేవాళ్లకి.

“సరే! కొత్తగా వచ్చి చేరిన ఈ శ్రీనివాసరావు అనే ఆయన అసలు స్వరూపం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన  పనితీరు యెలా వుంటుంది అని మొదట్లో అన్నీ సందేహాలే. ఇలాటివన్నీ తెలుసుకోవడానికీ, ఆయన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికీ అధమ పక్షం ఆరు మాసాలు పట్టింది. (పూర్తిగా అన్నమాట వాడకూడదేమో. ఎందుకంటే అప్పుడే కాదు.. ఇన్నేళ్ళ తరువాత కూడా నా మిత్రుడు భండారు శ్రీనివాసరావు లీలలూ, మాటలూ నాకు పూర్తిగా అర్ధం కావు)

“ నాకిప్పటికీ బాగా గుర్తుంది. సందర్భం ఏమిటో జ్ఞాపకం లేదు. ఒకనాటి సాయంత్రం డ్యూటీ ముగించుకుని నేనూ భండారు శ్రీనివాసరావు గారూ (ఇకనుంచి ఈ గౌరవ వాచకం తీసివేసి రాస్తాను) న్యూస్ రూమ్ నుంచి బయటకు నడుస్తుండగా ఆయనో మాట అన్నారు.

“మీరు కుండలు బద్దలు కొట్టండి.  కాని కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొడతానంటే యెలా “ అని. అంతకుముందు ఆఫీసులో ఏదో జరిగింది. ఎవరితోనో నేను ఘర్షణకు దిగడమో, తీవ్రస్థాయిలో వాదించడమో జరిగింది.  అలాటి సందర్భాలలో అవసరానికి మించి ఆవేశపడడం, అవతలి వ్యక్తి ఎవరయినా సరే, ఏమాత్రం సంకోచించకుండా వున్న మాట మొహాన  అనేయడంవంటి నా సహజ స్వభావం గురించి , శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య ఇది. ‘కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొట్టడం’ అన్న ఆయన చమత్కారానికి నేనూ నవ్వుకున్నాను. ఆ చమత్కారపు మాటల వెనక నా బోటివారు ఆలోచించవలసిన, చేతనయితే అనుసరించవలసిన మంచి సలహా వున్నట్టు నాకనిపించింది.

“ అప్పుడే కాదు,  అంతకి ముందు ఆ తరువాతా కూడా ఎన్నో సందర్భాలలో, తన చమత్కారాలు, చతురోక్తులు  జోడించి  ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ  నాకెన్నో సలహాలు అందించేవారాయన. కాని నేను వింటేగా. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు నా మొండితనం నాదే. ఎన్నిమార్లు, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన నన్నెంత మాత్రం మార్చలేకపోయారు, ముఖ్యంగా ఆఫీసు విషయాల్లో. శ్రీనివాసరావులాటి మిత్రుల  సుదీర్ఘ సహవాసంవల్ల ఆఫీసునుంచి బయటకు వచ్చిన తరువాతైనా  కాస్త నవ్వడం నేర్చుకున్నాను. నలుగురిలో మసలడం నేర్చుకున్నాను. నాలుగు మాటలు నేర్చుకున్నాను”

“నా ఉద్యోగం న్యూస్ రీడర్ అయినప్పటికీ ఓసారి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు గారు నన్ను పిలిచి,  ‘మాస్టారూ ఎన్నాళ్ళని ఇక్కడ కూర్చుని న్యూస్ బులెటిన్లతో కుస్తీ పడతారు. మధ్యమధ్య  రిపోర్టింగ్ కు వెళ్ళి వస్తుండండి. రేపు ఉదయం అసెంబ్లీకి వెళ్ళండి’ అన్నారు. అవి శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నరోజులు. నేను ఉదయం వెళ్ళే సరికే అసెంబ్లీలో ‘QUESTION HOUR’  నడుస్తోంది. అప్పట్నించి భోజన విరామానికి సభ వాయిదా పడేవరకు మూడు నాలుగు గంటలపాటు అక్కడే కూర్చున్నాను. ఛాతీలో కాస్త నొప్పిగా వున్నట్టు అనిపించింది కాని పట్టించుకోలేదు. ఆఫీసుకు వచ్చి రిపోర్ట్ రాస్తుండగా నొప్పి మరికాస్త పెరిగింది. ఛాతీ ఎడమ వైపు నుంచి భుజానికి ఏదో సర్రున పాకినట్టనిపించింది. వొళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా వుంది. ఇక నా వల్ల కాదని అర్ధమై పోయింది. ‘వొంట్లో బాగాలేదు. ఇంటికి పోతున్నాన’ని రామారావు గారికి చెప్పేసి వెళ్ళిపోయాను. ఆ వేళలో అంత  త్వరగా వచ్చిన నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యపోయింది. ‘ఏమిటిలా వచ్చారు. ఏమైంది మీకు వొంట్లో ఎలావుంది’ అని కంగారు పడడం మొదలు పెట్టింది. విషయం చెబితే డాక్టరు దగ్గరకు వెడదామని హడావిడి చేస్తుందని పొడి పొడిగా నాలుగుముక్కలు చెప్పి ‘ఏమీ వద్ద’ని కసరి అలాగే పడుకున్నాను.

“ఎన్నడూ లేనిది ఆవిధంగా పని మధ్యలో వొదిలేసి వెళ్ళిపోయానని తెలిసి శ్రీనివాసరావు, జ్వాలా నరసింహారావూ (వీరిద్దరినీ జంట కవులనేవారు. నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ కలిసేవుండేవారు) ఆ సాయంత్రం మా ఇంటికి విషయం కనుక్కుందామని  వచ్చారు. నేను చెప్పేది  వినిపించుకోకుండా డాక్టర్ మనోహరరావు (శ్రీనివాసరావు మేనల్లుడు) దగ్గరకు తీసుకువెళ్ళారు. తరువాత డాక్టర్ గారిని కూడా వెంటబెట్టుకుని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అందులో చేర్పించారు. ‘ANGINA PECTORIS’  అనే హృదయ సంబంధమైన రుగ్మత వల్ల నాకలా అయిందని నిర్ధారించిన వైద్యులు రెండు రోజులపాటు ఐ సీ యూ లోనే వుంచి ఆ తరువాత ఇంటికి పంపారు. మరునాడు కాబోలు జ్వాలా నరసింహారావూ. శ్రీనివాసరావు సతీ సమేతంగా మా ఇంటికి వచ్చారు.

మాటల మధ్య మా ఆవిడ శ్రీనివాసరావుతో,  ‘ ఆరోజు మీరు దేవుడల్లే వచ్చి ఆసుపత్రిలో చేర్పించార’ని  ఏదో  చెప్పబోతుంటే, శ్రీనివాసరావు తన మామూలు తరహాలోనే ‘ఈ ఇంట్లో దేవుడు అనే మాట వినడం విచిత్రంగా వుంది’ అన్నారు చిరునవ్వుతో.

నా నాస్తికత్వం మీద ఆయన విసిరిన వ్యంగ బాణం అది.

ఇలా అన్ని సందర్భాలలో నవ్వుతూ నవ్విస్తూ వుండే ఈ మనిషి ఎప్పుడయినా కంట నీరు పెట్టుకుంటాడా అనిపించేది. అదీ చూశాను. నేను రిటైర్ అయినప్పుడు జరిగిన వీడ్కోలు సభలో నా గురించి మాట్లాడబోయి, మాటలు పెగలక కంట తడిపెట్టారు.”

వెంకట్రామయ్య గారికి పుస్తకాలన్నా, సినిమాలన్నా ప్రాణం. కొంచెం ఖాళీ దొరికితే చాలు మంచి సినిమాహాలు చూసుకుని ఏదో ఒక సినిమా చూసేవారు. మొదట్లో నన్నూ వెంట తీసుకు వెళ్ళేవాళ్ళు. మూడు గంటలు కాలు కదపకుండా ఒక చోట కూర్చోవడం అలవాటు లేని నేను నెమ్మదిగా ఏదో కారణం చెప్పి తప్పించుకునేవాడిని.  ఆరోజు ఉదయం ఇంట్లో  వెంకట్రామయ్య గారు పడుకున్నవాడల్లా  లేచి,   మనమడ్ని వెంట తీసుకుని వరసగా రెండు సినిమాలు, సరిలేరు నీకెవ్వరూ, అలవైకుంఠపురం చూడాలని కూకట్పల్లి  పీవీఆర్ ఫోరం మాల్ కి వెళ్ళారు. ఒక ఆట చూసి రెండో సినిమాకు వెడుతూ మధ్యలోనే  కుప్పకూలిపోయారు. మనుమడు పక్కన వుండడం వుండడం వల్ల, దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఫలితం లేకపోయింది.

హాయిగా సినిమాకని వెళ్ళిన మనిషి విగతజీవుడిగా ఇంటికి రావడం వెంకట్రామయ్య గారు నమ్మని విధి విచిత్రం కాకపోతే మరేమిటి?

 

కింది ఫోటో:

రేడియో న్యూస్ రీడర్ గా వెంకట్రామయ్య గారు రిటైర్ అయినప్పుడు సహోద్యోగి షుజాత్ ఆలీ సూఫీ Shujath Ali Sufi  ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో  వెంకట్రామయ్య గారు, నేనూ.



(ఇంకావుంది)

1, మార్చి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో ( 99 ) : భండారు శ్రీనివాసరావు

 ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాడపాటి సత్యవతి

మూడు దశాబ్దాల క్రితం దాదాపు ప్రతి సాయంత్రం ఆరుగంటల పదిహేను నిమిషాలకల్లా తెలుగునాట లోగిళ్ళలో ఈ మధుర స్వరం వినబడేది. మెల్లగా, సౌకుమార్యంగా వినవచ్చే ఆ  కంఠస్వరం చాలామందికి సుపరిచితం.

ఒకప్పుడు ఇంట్లో కూర్చుని ఆవిడ చదివే వార్తలు విన్న నేను,  ఆ తర్వాత ఆవిడతో కలిసి రేడియోలో ఒకే విభాగంలో  దశాబ్దాల పాటు కలిసి  పనిచేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం.

‘శ్రీనివాసరావు గారు ఎలావున్నారు బాగున్నారా!’

పాతికేళ్ళ సుదీర్ఘ పరిచయ కాలంలో ఆవిడ  నోటి నుంచి  నేను విన్న అతి  పెద్ద వాక్యం ఇదే.

మాడపాటి సత్యవతి గారు ఎంతో  క్లుప్తంగా మాట్లాడుతారు. మాటలు తూచినట్టే వచ్చేవి ఆవిడ గారి నోటినుంచి. అంతటి మితభాషి. మరి  పది నిమిషాలు విడవకుండా ఏకబిగిన వార్తలు యెలా చదివేవారో అనిపించేది. కానీ ఆవిడ  స్వరం భగవంతుడు కేవలం రేడియో కోసమే తయారుచేసాడేమో అనిపిస్తుంది.  ఒక రకమైన మార్ధవంతో, సంగీతం వినిపిస్తున్నట్టుగా మాడపాటి సత్యవతిగారు వార్తలు చదువుతుంటే మరీ మరీ వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు బోలెడుమంది. ఒకరు అనువాదం చేసిన వార్తలు చదవడం కన్నా తాను సొంతంగా అనువదించి చదవడానికి ఆవిడ ఇష్టపడేవారు. నిజానికి ఆవిడ న్యూస్ రీడర్ కాదు. న్యూస్ ఎడిటర్. కానీ వారంలో కొన్ని రోజులు విధిగా వార్తలు చదివేవారు. వీటికి తోడు వారానికి ఒకమారో రెండు సార్లో వీలునుబట్టి ‘వార్తావాహిని’ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పించేవారు.

వార్తావిభాగం పనితీరు గురించి ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి. హిందీలో చెప్పాలంటే (నిజానికి నాకూ ఆ భాషకు చుక్కెదురు) అక్కడ వాతావరణం ‘బహుత్  బహుత్ గంభీర్.’  నేను అడుగుపెట్టేంత వరకు పరిస్తితి అదే. పని అయిపోయేంతవరకు అందరూ ముక్తసరిగా మాట్లాడుకునేవారు. అంతా రొటీన్ గా  ‘స్క్రీన్ ప్లే’  పుస్తకంలో రాసివున్నట్టు జరిగిపోయేది. వార్తల్లో ఎలాటి తభావతు  రాకుండా  బులెటిన్ల తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక వార్త ఇవ్వాలా వద్దా  ఇస్తే ఎన్ని వాక్యాలు ఇవ్వాలి  యెంత ప్రాధాన్యం ఇవ్వాలి ఒకటి రెండు సార్లు ఆలోచించే వాళ్లు. మరీ  ముఖ్యంగా సత్యవతిగారికీ, వెంకట్రామయ్య గారికీ ఈ విషయంలో పట్టింపులు మెండు. అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకునే నా తత్వం వారికి అంతగా రుచించకపోయినా ఇంట్లో చిన్నవాడిని ముద్దు చేసినట్టు నన్ను చూసీ చూడనట్టు వొదిలేసేవారు. ఎడిటర్లు అంతే!  దానితో నాది ఆడింది ఆట పాడింది పాట. అంతకు ముందు దినపత్రికలో పనిచేసిరావడం వల్ల, వార్తలు ఇవ్వడంలో కొంత స్వేచ్చను ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడిని. బహుశా నాతో పడ్డన్ని తలనొప్పులు వాళ్లు ఎవరితోనూ పడి వుండరేమో కూడా.

నేను చేరిన కొత్తల్లో అనుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జట్ గురించి వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన ప్రత్యేక వార్తావాహిని తయారు చేస్తున్నారు. అభిప్రాయాలు రికార్డ్ చేసుకొచ్చే బాధ్యత నా మీద పడింది. అన్నీ తీసుకొచ్చి, ఆ టేపులన్నీ సత్యవతిగారికి వొప్పచేప్పేసి చక్కాపోయాను.  రాత్రి ఏడుగంటల నలభై అయిదు నిమిషాలకు  ప్రసారం. లోపల డబ్బింగు స్టూడియోలో సత్యవతి గారు నానా అవస్థ పడుతున్నారు. గొంతులు వినబడుతున్నాయి.  ఎవరి గొంతు ఎవరిదో తెలియచెప్పే ‘క్యూ షీట్’ సత్యవతి గారికి ఇవ్వడం మరచిపోయాను. ఓపక్క  టైం దగ్గర పడుతోంది. ఆవిడకి నరాలు తెగిపోయే టెన్షన్. నేనెక్కడో ఎవరితోనో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఇప్పట్లా  సెల్ ఫోనులు లేని రోజులాయె.   ఆవిడ అనుభవమే ఆవిడకు  అక్కరకు వచ్చింది. కాని ఆరోజు,  డబ్బింగు పని  పూర్తిచేసి టేపు స్టూడియోలో వొప్పగించేసరికి ఆవిడ తల ప్రాణం తోకకు వచ్చివుంటుంది.

మరునాడు ఆఫీసుకు వెళ్ళిన తరువాత కాని నాకు విషయం తెలియలేదు. కనబడగానే బాగా కోప్పడాలి. కోపడ్డారు కూడా.  యెలా అనుకున్నారు? నోరు తెరిచి ‘ఇదేంటి శ్రీనివాసరావు గారూ’ అన్నారు. అంతే!  

రేడియోలో పనిచేసేవారికి ముందుగా ఓ నీతి పాఠం బోధిస్తారు.  యెంత క్లుప్తంగా (వార్త) చెబితే  భావం అంత ఖచ్చితంగా అర్ధం అవుతుంది అని. (Brevity is sole of expression).

సత్యవతి గారి భావం నాకు చాలా బాగా అర్ధం అయింది.  తీరు పూర్తిగా మార్చుకోకపోయినా  కొంత గాడిలో పడ్డాను. (అని అనుకున్నాను)

అలా,  మధ్యలో నేను మాస్కో రేడియోలో పనిచేసిన అయిదేళ్ళు మినహాయిస్తే ఆవిడ రిటైర్ అయ్యేవరకు కలిసే పనిచేశాం. 

వయసులో పెద్దావిడ కనుక మా అందరికంటే ముందుగానే రిటైర్ అయ్యారు. అప్పుడు ఆవిడ వయసు యాభయ్  ఎనిమిది.

ఇప్పుడు ఎనభయ్ ఎనిమిది. ఈ మూడు దశాబ్దాల కాలంలో అడపాదడపా కలుస్తూనే వున్నాం. అప్పుడప్పుడూ  ఫోన్ చేసి మాట్లాడేవారు.  

2019 డిసెంబరు చివర్లో  ఒకసారి నేనే ఫోన్ చేశాను. సత్యవతి గారూ. ఈ సాయంత్రం వెంకట్రామయ్య గారిని తీసుకునే నేనే మీ ఇంటికి వస్తాను”.
అంతకంటేనా! తప్పకుండా రండిఅన్నారావిడ ఎంతో సంబరంగా. మొహం కనిపించకపోయినా ఆ స్వరంలోనే తెలుస్తోంది ఆ ఆనందం.
అనుకున్న సమయానికి కారులో వివేకానంద నగర్, ఈనాడు కాలనీకి వెళ్లాను. అక్కడ ఉంటున్న డి.వెంకట్రామయ్య గారిని ఎక్కించుకుని సికింద్రాబాదు బయలుదేరాము.
దారిలో వెంకట్రామయ్య గారన్నారు. ఖార్ఖానాలో చంద్ర ఉంటాడుచూసి వెడదామని.
మదర్ తెరిస్సా వృద్ధాశ్రమంలో ఉంటున్న చంద్రను చూసాము. తన వేలికొనలతో కుంచె పట్టుకుని వేలాది అందమైన చిత్రాలను గీసిన ప్రసిద్ధ చిత్రకారుడాయన. ఎప్పుడో దశాబ్దాల క్రితం హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయచలన చిత్రోత్సవంలో ప్రతిరోజూ కలుసుకునే వాళ్ళం. వృద్ధాప్యం కారణంగా  ఆకారంలో వచ్చిన తేడా తప్ప మనిషిలో మార్పు లేదు. పొతే, వెంకట్రామయ్య గారూ చంద్రా ఏనాటి నుంచో ప్రాణ స్నేహితులు. నన్నాయన గుర్తుపట్టి పలకరించడమే నాకు వింత అనిపించింది. ఆయన మొహంలో ఆనందం చూస్తుంటే కోరుకున్న బొమ్మ చేతికి ఇస్తే ఓ చిన్న పిల్లాడు ఎలా కేరింతలు కొడతాడో ఆ దృశ్యం గుర్తుకువచ్చింది. కాసేపు కూర్చుని వచ్చేసాము. తరువాత సత్యవతి గారింటికి వెళ్ళాము.
మా ఇద్దర్నీ చూడగానే ఆవిడ మొహం వెలిగి పోయింది. మళ్ళీ ఏమి గుర్తుకువచ్చిందో ఏమిటో వదనంలో విచారం తొంగి చూసింది.
మనం లోగడ వెంకట్రామయ్య గారింట్లో కలిసాము. అప్పుడు మీ వెంట నిర్మల వచ్చారుఅన్నారు. తర్వాత ఏమీ మాట్లాడలేకపోయారు. నా సంగతి సరే.
వెంకట్రామయ్యగారు కల్పించుకుని సంభాషణ మార్చారు. పాత రేడియో రోజులు నెమరేసుకున్నాం.
చాలా సేపు కూర్చున్నాం. చాలా విషయాలు మాట్లాడారు.

 వారి చిన్నతనంలో సంగతులు చెప్పారు. మాడపాటి హనుమంతరావు గారు హైదరాబాదు నగర మొదటి మేయరు. వారి సోదరుడి కుమారుడు మాడపాటి రామచంద్రరావు. వారి కుమార్తెలలో ఒకరు మాడపాటి సత్యవతి. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు హనుమంతరావు స్త్రీ విద్య ఉద్యమాన్ని ప్రారంభించి అందులో భాగంగా నిజాం సంస్థానంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను హైదరాబాదులోని ఇసామియా బజారులో ఓ చిన్న గదిలో ఏర్పాటుచేశారు. ఆడపిల్లలను చదువులకోసం బడులకు పంపడం ఆ రోజుల్లో అంత తేలికకాదు. ఎంతగానో శ్రమిస్తే నలుగురు ఆడపిల్లలు చేరారు. అందులో ఒకరు మాణిక్యాంబ గారు. ఆవిడ హనుమంతరావు భార్య. ఇప్పుడా పాఠశాల హైదరాబాదు నగరంలో చాలా ప్రాముఖ్యం కలిగిన మహిళా విద్యాలయంగా రూపుదిద్దుకున్నది. హనుమంతరావు చనిపోయిన తర్వాత దానికి వారి పేరు పెట్టారని మాడపాటి సత్యవతి చెప్పారు.

 మాటలో అదే నెమ్మదితనం. ఎనభయ్ ఎనిమిదేళ్ళ వృద్ధాప్యపు ఛాయలు శరీరంలో కానవస్తున్నా ఆవిడ కంఠం మాత్రం అలాగే మునుపటి మాదిరిగానే శ్రావ్యంగా వుంది.

మార్దవస్వరమాలతి  మాడపాటి సత్యవతి అంటారు అందుకే కాబోలు.

తర్వాత నాలుగు మాసాలకే  ఆ శ్రావ్యమైన రేడియో స్వరం శాశ్వతంగా మూగపోయింది.

కింది ఫోటో:

మాడపాటి సత్యవతి గారితో డి. వెంకట్రామయ్య గారు,  నేను


 

(ఇంకా వుంది)

 

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో ( 98 ) : భండారు శ్రీనివాసరావు

 

ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనం.
ఇదే ఎల్వీ సుబ్రహ్మణ్యం గారిపై ఒకనాడు నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. అదీ ఎప్పుడు? దాదాపు పుష్కర కాలం క్రితం. అదీ ఎక్కడా? తిరుమల కొండపై అర్ధరాత్రి సమయంలో. ఎవరూ దీనికి సాక్షి? సాక్షాత్తు మా ఆవిడ నిర్మల.
ఎంత కోపం వచ్చింది అంటే పట్టరానంత, చెప్పలేనంత. శిఖరసమానుడైన ఆయన ముందు నేనో పిపీలికాన్ని. ఆ సంగతి తెలుసు. అయినా కోపం వచ్చింది.
చిన్నప్పటి నుంచే నాకు ముక్కు మీద కోపం. ‘కోపం వచ్చినప్పుడు వంద వొంట్లు చదవరా తగ్గిపోతుంది’ అని మా బామ్మ రుక్మిణమ్మ గారు ఒకటే పోరుపెట్టేది. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు అది వెళ్ళగక్కాలని అనుకుంటారు కానీ వొంట్లు, ఎక్కాలు లెక్కబెడుతూ కూర్చుంటారా ఎవ్వరయినా. అందులో కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా బోటివారు.
కోపం వచ్చినప్పుడు అవతల మనిషి ఎవరు? ఎంత గొప్పవాడు అన్నది ఆలోచించే విచక్షణ వుండదు. అది వుంటే కోపమే రాదు కదా!
ఇంతకీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారి మీద నాకు కోపం ఎందుకు వచ్చిందో చెప్పే ముందు, ఆయన్ని గారి గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పాలి. చెడ్డ ముక్కలు చెప్పడానికి కడిగి గాలించినా ఏమీ దొరకదు. అంతటి పరిశుద్ధుడు ఆయన.
నాకు బాగా పరిచయం వున్న సీనియర్ అధికారుల్లో ఎల్.వీ. సుబ్రహ్మణ్యం గారొకరు. ఆయన నోటి వెంట పరుషమైన మాట రావడం నేను వినలేదు. మృదుస్వభావి. నిబంధనలు అనుకూలంగా వుంటే చేతనైన మాట సాయం చేసే సహృదయులు.
ఉమ్మడి రాష్ట్రంలో సుబ్రహ్మణ్యం గారు స్పోర్ట్స్ అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో నేను హైదరాబాదు ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా వున్నాను. ఒకనాడు మా కార్యవర్గ సమావేశం జరుగుతున్నప్పుడు టేబుల్ టెన్నిస్ పరికరాల విషయం ప్రస్తావనకు వచ్చింది. నేను వెంటనే ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. మా క్లబ్ సభ్యుల కోసం మీ సంస్థ నుంచి టేబుల్ టెన్నిస్ పరికరాలను విరాళంగా ఇవ్వడానికి వీలుపడుతుందా అని అడిగాను. దానికి జవాబుగా ఆయన ‘అక్కడ (క్లబ్ లో) మీరు ఎంతసేపు వుంటారు’ అని అడిగారు. బహుశా తనిఖీ చేయడానికి ఎవరినైనా పంపిస్తున్నారేమో అనుకున్నాము. కానీ ఆయన ఉద్దేశ్యం వేరు. మేము అడిగినవన్నీ, మా మీటింగ్ పూర్తయ్యేలోగా పంపాలని అనుకున్నట్టున్నారు. అలాగే అదే రోజు పంపారు కూడా.
మరి అలాంటి మనిషిపై కోపం ఎందుకు వచ్చినట్టు? మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఆయన పాదాలపై పడాలని అనుకోవడం ఎందుకు? ఏమిటీ విరోధాభాస ?
నిన్న రాత్రి నా హితైషి ఆర్వీవీ కృష్ణారావు గారు ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారి నెంబరు అడిగారు. అడగకుండానే కారణం చెప్పారు. టీవీ ఇంటర్వ్యూ నో, వెబ్ ఛానల్ ఇంటర్యూనో తెలియదు యూ ట్యూబ్ లో చూశారట. అది చూసిన తర్వాత ఆయన దృష్టిలో సుబ్రహ్మణ్యం గారు భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ప్రదర్శించిన విశ్వరూపం సైజుకు ఎదిగారట. దానికి కారణం కూడా కృష్ణారావు గారే ఆ ఇంటర్వ్యూలో విన్న విశేషాల రూపంలో చెప్పారు.
ఇటీవలనే, అంటే తిరుమలలో తొక్కిసలాట జరిగిన తర్వాత, సుబ్రహ్మణ్యం గారు తన స్నేహితుడితో కలిసి తిరుపతి వెళ్ళారు. ఒకప్పుడు టీటీడీకి సర్వాధికారిగా పనిచేశారు. పైగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. ఆయనకు సకల లాంఛనాలతో దైవ దర్శనం లభించి వుంటుంది. కానీ ఆయన ఎల్వీ సుబ్రహ్మణ్యం. నిఖార్సైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. అందుకే కధ వేరే విధంగా నడిచింది.
టీటీడీలో ఎవరికీ చెప్పకుండా తన స్నేహితుడితో కలిసి సర్వదర్శనం వైకుంఠం కాంప్లెక్స్ క్యూలో ప్రవేశించారు. లోపల కాలక్షేపానికి ఇద్దరూ కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు దగ్గర ఉంచుకున్నారు. మిగిలిన భక్తులు అందరితో పాటు కంపార్టు మెంట్లలో వెయిట్ చేస్తూ, దేవస్థానం వారు అందించే అన్న ప్రసాదాలు తింటూ, ఇచ్చిన పాలు తాగుతూ సుమారు పన్నెండు గంటలకు పైగా గడిపి, సామాన్య భక్తుల మాదిరిగానే జయవిజయుల దగ్గర నుంచే స్వామి దర్శనం చేసుకుని, ప్రసాదం స్వీకరించి వచ్చినట్టు ఆ ఇంటర్వ్యూలో ఎల్వీ గారు మాటవరసకు వెల్లడించిన ఈ విషయాలు తనకు దిగ్భ్రాంతి కలిగించాయని కృష్ణారావు గారు చెప్పారు. కాకపోతే, క్యూ కాంప్లెక్స్ లో టాయిలెట్ల పరిస్థితి ఇంకా మెరుగు పరచాల్సిన అవసరం వున్నట్టు ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తనకు రాజాజీ రామాయణంలోని ఒక ఘట్టం గుర్తుకు వచ్చిందన్నారు. అంత్య సమయంలో రావణ బ్రహ్మ, రాజు అనేవారు ఎలా పరిపాలించాలో ఆ ధర్మ సూక్ష్మాలు వివరిస్తూ, ‘మంచి అనుకున్న పనిని వాయిదా వేయకుండా వెంటనే చేయాల’ని చెబుతాడు. లంక చుట్టూ వున్న ఉప్పు సముద్రాన్ని పాల సముద్రంగా మార్చాలనే కోరిక రావణాసురుడికి వుండేదట. అటువంటి మంచి పనులు చేయగలిగిన సర్వశక్తి సంపన్నుడు అయివుండి కూడా చేయలేక పోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతారు. క్యూ కాంప్లెక్స్ టాయిలెట్లే కాదు, ఏ మార్పు చేయలన్నా చేయగలిగే అధికారం ఉన్న పదవిని రెండేళ్ల పైచిలుకు నిర్వహించిన తాను కూడా ఎన్నో చేయాలని అనుకున్నప్పటికీ, అన్నీ చేయలేకపోయాను అని ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారట.
ఇది విన్న తర్వాత సుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనం చేయాలని ఎవరికి అనిపించదు? నాకూ అలానే అనిపించింది.
ఇక నా కోపం సంగతి.
2012 లో కాబోలు, ప్రెస్ అకాడమి వాళ్ళు వయోధిక పాత్రికేయులను కొందర్ని తిరుపతి తీసుకువెళ్ళారు. పద్మావతి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక సదస్సు కోసం. శ్రీయుతులు వరదాచారి గారు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ శ్రీనివాసన్ గారు, మాఢభూషి శ్రీధర్ గారు ఇలా కొంతమందిమి ఆ బృందంలో వున్నాము. వెడుతున్నది తిరుమల పుణ్యక్షేత్రం కాబట్టి, తోడుగా భార్యను వెంట తీసుకువెళ్ళే వెసులుబాటు కల్పించారు. మొత్తం ఇరవై మందికి పైగా వున్నాము.
వెళ్ళిన పని పూర్తి చేసుకున్న తరువాత దర్శనం కోసం కొండపైకి వెళ్ళాము. ప్రెస్ అకాడమి చైర్మన్, ఈవో, టీటీడీ చైర్మన్ బాపిరాజులకు ఒక్కొక్కరికి ఆరుగురికి చొప్పున మాత్రమే స్పెషల్ దర్శనం ఇప్పించగల వీలుంది. ఇద్దరో ముగ్గురో మిగిలిపోయారు. అప్పుడు వున్న ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు. ఆయన తనకున్న విశేష అధికారాన్ని ఉపయోగించి వారికి కూడా దర్శనం ఇప్పిస్తే ఆయన్ని అడిగేవారు లేరు. కానీ ఆయన అలాంటి వాడయితే ఇంత ఘనంగా రాయాల్సిన అవసరం పడేది కాదు. ఎంత మృదుస్వభావో, అంతటి నిక్కచ్చి మనిషి. మొత్తం మీద బాపిరాజు గారు ఎవరికీ చెప్పారో ఏమిటో తెలియదు. అందరికి చక్కటి దర్శన భాగ్యం కలిగింది.
అసలు కధ ఇక్కడే మొదలైంది. ఆడవారికి తిరుపతిలో రెండో దర్శనం లేకుండా తిరిగి వస్తే తృప్తిగా వుండదు. అదే కోరిక మా ఆవిడ వ్యక్తపరచింది. వెంట వచ్చిన బృందం యావత్తు కిందికి వెళ్ళిపోయింది. అక్కడి పీఆర్వో, రంగారావు గారు అనుకుంటా, మరో దర్శనం ఏర్పాటు చేశారు. కొంచెం ఇబ్బందిగానే జరిగినా, రెండో దర్శనం చేసుకుని బయటకి వచ్చేసరికి బాగా పొద్దు పోయింది. కిందికి ఏ వాహనాలను ఆ సమయంలో అనుమతించరట. దాంతో ఎలాంటి వసతి, భోజన ఏర్పాట్లు లేకుండా కొండ మీద ఇరుక్కుపోయాము.
ఎల్వీ గారికి, బాపిరాజు గారికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. వాళ్ళ ఆఫీసులో కూడా అదే పరిస్థితి. చాలా పొద్దు పోయిన తర్వాత ఎల్వీ గారు ఫోన్ చేశారు. అప్పటికప్పుడు వసతి ఏర్పాటు చేయడం కుదరదని నిష్కర్షగానే చెప్పారు. నాతో నా భార్య కూడా వుందని, ఈ అర్ధరాత్రి తిరుమలలో ఎలా వుండాలని అని అడిగిన తర్వాత మెత్తపడి, తన ఆఫీసులో వున్న గదిలో ఈ రాత్రికి పడుకోమని మమ్మల్ని అక్కడికి పంపించారు. ఆ రాత్రి వేళ ఏమీ దొరకవని అక్కడ ఉన్న మనిషి ఎవరో పుణ్యాత్ముడు, నాలుగు అరటి పండ్లు ఇచ్చాడు. అవి తిని పడుకుని తెలతెలవారకమునుపే కొండదిగి వచ్చాము. అప్పుడు సుబ్రహ్మణ్యం గారి మీద నాకు వచ్చిన కోపం ఇంతా అంతా కాదు. ఇంత తెలిసిన మనిషి, అన్ని అధికారాలు చేతిలో ఉంచుకుని ఇసుమంత సాయం చేయలేదే అన్నదే ఆ కోపం.
ఒకానొక కాలంలో తిరుమలలో సర్వాధికారాలు కలిగిన అదే వ్యక్తి, రిటైర్ అయిన తర్వాత తన మిత్రుడితో కలిసి సామాన్య భక్తుడి మాదిరిగా తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చిన సంగతి కృష్ణారావు గారి ద్వారా తెలిసి ఆయన మీద నాకున్న గౌరవాభిమానాలు వేలరెట్లు పెరిగాయి. అప్పటివరకు లోలోపల గూడుకట్టి వున్న కోపం మంచులా కరిగిపోయింది. ఇంతటి ఉదాత్తమైన మంచి మనిషిని అనవసరంగా అపార్థం చేసుకున్నానే అనే అంతర్మధనం మొదలయింది. ఆ నాటి నా ప్రవర్తనకు నిష్కృతి లభించాలి అంటే మిగిలిన దారి ఒక్కటే.
అందుకే సుబ్రహ్మణ్యం గారూ! స్వీకరించండి నా పాదాభివందనం.
(ఆ ఇంటర్వ్యూ లింక్ కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ దొరకలేదు)
కింది ఫోటోలు:
హైదరాబాదు మసాబ్ ట్యాంక్ ప్రాంతంలో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు, ఆనాటి మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గారితో నేను
(ఇంకా వుంది)
Like
Comment
Send

27, ఫిబ్రవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (97) – భండారు శ్రీనివాసరావు

 వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ

 

కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ, జ్యోత్స్నాదేవి వీరంతా విజయవాడ నుంచి  రేడియోలో వార్తలు చదివినవారు.  తమ స్వరమాధుర్యంతో శ్రోతలని మెప్పించిన వాళ్ళు. వీరిలో సుబ్బారావు, ప్రయాగలతో కలిసి  బెజవాడలో తాత్కాలికంగా పనిచేసిన అనుభవం వుంది. అక్కడ న్యూస్ ఎడిటర్లు సుదీర్ఘకాలం సెలవులో వెళ్ళినప్పుడు నేను హైదరాబాదు నుండి వెళ్ళి అక్కడ మూడు నాలుగు వారాలపాటు  బులెటిన్ వ్యవహారాలు చూసేవాడిని. ఆ విధంగా సుబ్బారావు, ప్రయాగలతో నాకు చక్కని సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరిదీ వొకే వూరు. మంచి స్నేహితులు కూడా. పాపం సుబ్బారావు రిటైర్ అయిన కొన్నేళ్లకే కన్ను మూసాడు. ప్రయాగ హైదరాబాదు వచ్చి సుజనా కంపెనీలో మంచి పొజిషన్ లో చేరి సమాజానికి పనికివచ్చే మంచి కార్యక్రమాలు చేస్తున్నాడని విన్నాను. ప్రయాగ భార్య  నిర్మల గారు మంచి రచయిత్రి.  ప్రయాగ ఎంత బిజీగా వున్నా తనకు ఇష్టమైన రచనా వ్యాసంగానికి దూరం కాలేదు. చక్కటి సుబోధకమైన ఆధ్యాత్మిక రచనలు  చేస్తుంటాడు. అది ఇంకా మంచి విషయం.

పోతే, బెజవాడ వెళ్ళినప్పుడల్లా వీరిద్దరూ ప్రాంతీయ వార్తల ప్రసారం విషయంలో నాకు చక్కని సహకారం అందించేవారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. రాత్రి బస్సెక్కి పొద్దున్నే బెజవాడ చేరేవాడిని. రేడియో కేంద్రానికి నేరుగా వెళ్ళి ఆ రోజు ఉదయం  ప్రాంతీయ వార్తలు నేనే చదివేవాడిని, అది నా డ్యూటీ కాకపోయినా. దానికి ఒక కారణం వుంది. పొద్దున్న నేను చదివిన వార్తలు హైదరాబాదులో వున్న మా ఆవిడ రేడియోలో  విని, నేను బెజవాడ క్షేమంగా చేరిన సంగతి తెలుసుకునేది. ఇవన్నీ వినడానికి విచిత్రంగా అనిపించినా నిజంగా జరిగిన విషయాలే. రేడియోలో నేను అనుభవించిన స్వేచ్ఛకు నిలువెత్తు ఉదాహరణలే.

 

సుస్వరం, వాక్సుద్ధి, విషయ పరిజ్ఞానం, పాండిత్యప్రకర్ష,  అసాధారణ ధారణ శక్తి ఇవన్నీ ప్రయాగకు న్యూస్ రీడర్ గా మంచి పేరు సంపాదించుకోవడానికి పనికొచ్చాయి.

కార్యక్రమాల ప్రసారం విషయంలో ఒక్క ఆలిండియా రేడియోలోనే సమయపాలన అనేది పాటిస్తూ రావడం దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఒక మంచి సాంప్రదాయం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్సన్ లో కూడా ఈ విధానం లేదు. అందుకే రేడియో టైం ని బట్టి ప్రజలు తమ గడియారాల్లో టైం సరిచేసుకోవడం ఆనవాయితీ. ఢిల్లీ నుంచి మొదలు పెట్టి కన్యాకుమారి వరకు అన్ని రేడియో కేంద్రాల్లో వార్తల  ప్రసారం ఒక క్రమపద్ధతి ప్రకారం ఒకే సమయానికి మొదలవుతుంది, ఒకే సమయానికి ముగుస్తుంది. పావు నిమిషం కూడా తేడా రాదు. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే:    

బెజవాడ న్యూస్ యూనిట్ లో ప్రాంతీయ వార్తల  బులెటిన్ మొత్తం తెలుగులోనే తయారు అవుతుంది. హైదరాబాదులో అలా కాదు. ఉర్దూ బులెటిన్ కూడా వుంది కాబట్టి  మెయిన్ బులెటిన్ ఇంగ్లీష్ లో తయారు చేసి తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్లకు చెరొక కాపీ ఇస్తే, ఎవరి భాషలో వాళ్ళు అనువాదం చేసుకునేవాళ్ళు. పైగా ఎడిటర్లకు  మరో సులువు ఏమిటంటే,  ఇంగ్లీష్ టైపులో వంద వాక్యాలు వుంటే,  వాటిని తెలుగులోకి అనువాదం చేసుకుంటే పది నిమిషాలు వార్తలు చదవడానికి సరిగ్గా  సరిపోతాయి అనే ఒక అంచనా వుండేది. అంచేత  స్టెనోకి డిక్టేట్ చేసేటప్పుడే ఆ వార్త ఎన్ని వాక్యాలు వచ్చిందో ఎడిటర్ కి ముందే తెలుస్తుంది. ఆ పద్దతి విజయవాడలో లేదు కాబట్టి, వార్తలను తెలుగులో రాసి ఇస్తాము కాబట్టి, ఒక్కోసారి బులెటిన్ నిడివి  అంచనా తప్పి కొద్ది నిమిషాలు తక్కువయ్యేది. వాటిని రాసి  స్టూడియోకి తీసుకు వెళ్ళి అందించేలోగానే,  రామకృష్ణ ఆశువుగా కొన్ని వార్తలు చదివి సమయాన్ని సరిపెట్టడం నాకు బాగా గుర్తుంది. శ్రీరామనవమి, శివరాత్రి సందర్భాల్లో రాత ప్రతి అవసరం లేకుండా ఏ ఏ క్షేత్రాలలో, ఏఏ దేవాలయాల్లో ఏం జరుగుతున్నదో ఆ విశేషాలన్నీ తాను అక్కడే వుండి చూసి చెబుతున్నట్టుగా,  అనర్ఘళంగా, ఆశువుగా  చెప్పేవాడు. ప్రయాగ గురించి నేను ముందు చెప్పిన  విశేషణాలు, సుస్వరం, వాక్సుద్ధి, విషయ పరిజ్ఞానం, పాండిత్యప్రకర్ష,  అసాధారణ ధారణ శక్తి ఇవన్నీ అలాంటి సమయాల్లో అతడికి, మాకూ కూడా  అక్కరకు వచ్చేవి. వినే శ్రోతలకు సయితం అతడు అలా ఆశువుగా చదువుతున్నాడు అనే భావన కలిగేది కాదు.

బెజవాడనుంచి మరో న్యూస్ రీడర్ కొప్పుల సుబ్బారావు.

మిన్ను విరిగి మీదపడుతోందన్నా చలించని తత్వం. వార్తల టైం దగ్గరపడుతున్నా, బులెటిన్ పూర్తిగా తయారు కాకపోయినా, వున్నంతవరకు కాగితాలు తీసుకుని వెళ్ళి, అందుకు అనువుగా సమయం సర్దుబాటు చేసుకుంటూ   వార్తలు చదివే వాడు తప్ప, తను కంగారు పడడం కానీ, ఇతరులను కంగారు పెట్టడం కానీ నేను చూడలేదు.

ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావులది మంచి జోడీ. రేడియోలో చేరకముందు నుంచి కూడా స్నేహితులు. వీరిద్దరికీ రేడియో స్టేషన్ దేవాలయం. వార్తలు చదివే స్టూడియో గర్భగుడి. అందులోకి ప్రవేశించే ముందు కాలి జోళ్లు బయటే వదిలి లోపలకు వెళ్ళేవాళ్ళు. ఎదురుగా వున్న మైక్రోఫోన్ కి  రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టి వార్తలు చదవడం మొదలుపెట్టేవాళ్ళు.  రిటైర్ అయిన తర్వాత కూడా ఆ ఇద్దరి పేర్లూ జనం గుర్తు పెట్టుకుంటున్నారు అంటే ఈ నిబద్ధతే ప్రధాన కారణం.

తలలో నాలుక’ అంటే సుబ్బారావే అని అతడి సహోద్యోగులు చెబుతుంటారు. సాధారణంగా ఉద్యోగంలో హోదాలు పెరుగుతున్నకొద్దీ, అంతకు ముందు చేసిన ఉద్యోగం పట్ల చిన్న చూపు కలిగివుండడం కద్దు. కానీ, కొప్పుల సుబ్బారావు తరహానే వేరు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆయన అడ్డా ఆకాశవాణే! వార్తా విభాగంలో పనిలేకపోతే, మరో విభాగంలో ప్రత్యక్షం. అక్కడి వారికి, అడగకుండానే, డబ్బింగులో సాయపడడం అతడి నైజం. డబ్బింగు ప్రస్తావన వచ్చింది కాబట్టి సుబ్బారావు గురించి మరో కోణాన్ని గుర్తు చేసుకోవాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించిన అనేక కార్యక్రమాలకు జాతీయ స్తాయిలో పురస్కారాలు లభించాయి. వాటిల్లో చాలా వాటికి డబ్బింగు బాధ్యత నిర్వహించింది సుబ్బారావే అన్న సంగతి చాలామందికి తెలియదు. ఎందుకంటే అతడు పేరు కోసం ఎప్పుడూ చూసుకోలేదు. పని మీదనే దృష్టి.

కొప్పుల సుబ్బారావుతో కలసి విజయవాడ ఆకాశ వాణి కేంద్రంలో న్యూస్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆర్వీవీ కృష్ణారావు గారు సుబ్బారావుతో తన సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.

‘విజయవాడలో దాదాపు పదకొండేళ్లపాటు కలసి పనిచేశాము. సుబ్బారావుకు ఆఫీసే సర్వస్వం. స్టుడియోలో అడుగుపెట్టేముందు బయటనే చెప్పులు వొదిలేసి వెళ్ళేవాడు. ఒక్కరోజు కూడా ఈ నియమాన్ని దాటలేదు. వార్తలు చదివే గదే అతడికి గుడి. వృత్తిపట్ల అంతటి నిబద్ధతత వున్న ప్రభుత్వ ఉద్యోగిని నేను చూడలేదు. అలాగే, తనకు సాయం చేసిన వారిని ఎన్నడూ మరచిపోయేవాడు కాదు. అతడు ఆకాశవాణిలో ప్రవేశించడానికి అప్పటి డైరెక్టర్ బాలాంత్రపు రజనీకాంత రావు గారు మాట సాయం చేశారన్నది అతగాడి నమ్మకం. అందుకు కృతజ్ఞతగా తన కుమార్తెకు ‘రజని’ అని పేరు పెట్టుకున్నాడు.’

పదమూడేళ్ల కిందటి ఆ రోజు నాకు బాగా గుర్తుంది.    

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రతిరోజూ ఉదయం ఆరూ నలభయ్ అయిదు కల్లా ఠంచనుగా వినిపిస్తూ వచ్చిన ఆ స్వరం 2012 జులై ఐదో తేదీ రాత్రి  శాశ్వతంగా మూగబోయింది.

విజయవాడ కేంద్రంలో న్యూస్ రీడర్ ఉద్యోగంలో చేరకముందు కూడా సుబ్బారావు న్యూస్ రీడరే. చేరిన తరువాత న్యూస్ రీడరే. ఉద్యోగ విరమణ అనంతరం కూడా న్యూస్ రీడరే. తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివినప్పుడూ అదే నిబద్ధత. ఉద్యోగం శాశ్వతమై, చకచకా మెట్లెక్కి,  పైమెట్టు చేరుకున్న తరువాత కూడా వార్తలు చదవడం అంటేనే అతడికి ఇష్టం. అరవైయేళ్ళు నిండి ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా వార్తలు చదవడానికే అతడిష్టపడ్డాడు. బహుశా, గుండె జబ్బు రాకుండా వుంటే, అతడలా వార్తలు చదువుతూనే వుండేవాడేమో.

తను పనిచేసేది విజయవాడలో. నేనేమో  హైదరాబాదు రేడియోలో. ఉదయం, మధ్యాహ్నం వార్తలకోసం ఫోను చేసేవాడు. అడిగినప్పుడల్లా ఏదో ఒక వార్త లేదనకుండా చెప్పేవాడిని. అంతే! దాన్ని యధాతధంగా రాసుకుని ముక్కునపట్టి ఒప్పచెప్పినట్టు వెంటనే వార్తల్లో చదివేసేవాడు.  

హైదరాబాదు ఎప్పుడు వచ్చినా వెంటనే నాకు ఫోను చేసేవాడు. ఏమాత్రం వీలున్నా వచ్చి కలిసి వెళ్ళేవాడు. పాతికేళ్ళుగా మా నడుమ ఈ సంబంధం కొనసాగుతూ వచ్చింది.

అదేమిటో ఆ రోజు అంటే 2012 జులై ఐదో తేదీన హైదరాబాదు వచ్చాడట. ఫోను చేయలేదు. వచ్చి కలవలేదు.

ఎందుకంటే అతడు హైదరాబాదు రాలేదు. తీసుకువచ్చారు.

నన్ను కలవలేదు. ఎందుకంటే ఆసుపత్రిలో చేర్చారు.

ఇక కలవడు కూడా. ఎందుకంటే కలవలేనంత దూరతీరాలకు తరలిపోయాడు.

అతడు రాలేడు.  నేనే వెళ్ళాలి.

కింది ఫోటోలు:

ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు








(ఇంకా వుంది)