12, జూన్ 2021, శనివారం

పాత స్కేలు బద్దలం – భండారు శ్రీనివాసరావు

 చిన్నప్పుడు స్కూల్లో  చదువుకునే రోజుల్లో  చెక్కతో చేసిన స్కేలు వాడే వాళ్ళం. అందులో అంగుళం, అర అంగుళం,  పన్నెండు అంగుళాలు ఒక అడుగు ఇలా కొలతలు ఉండేవి. ఆ స్కేళ్ళ స్థానంలో ప్లాస్టిక్ స్కేళ్ళు వచ్చాయి. చూడముచ్చటగా వుండే వాటిని కొనుక్కోవాలని మనసు ముచ్చట పడేది. ఆ కోరిక తీరకుండానే స్కూలు చదువు ముగిసింది.

ఇప్పటి తరం పిల్లలు కూడా స్కేళ్ళు వాడుతున్నారు. కానీ వాటిల్లో కొలతలు మిల్లి మీటర్లు, సెంటి మీటర్లు. వీళ్ళకు అంగుళాల స్కేలు బద్దలు గురించి తెలియదు. అది సహజం. వాటిని వీళ్ళు ఎప్పుడూ చూసి కూడా వుండరు.

తరాల మధ్య అంతరం కూడా ఇంతే. ఈ వాస్తవాన్ని పాత తరం, అంటే నా బోటివాళ్ళు సదా గుర్తు పెట్టుకోవాలి.

‘మా కాలంలో అంటూ మొదలు పెడితే ఈ కాలంలో కుదరదు.

(12-06-2021)

రఘురామ రాజు లేఖలు


https://www.youtube.com/watch?v=jGwX3OKIKUA

బాల కృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్


సొంత పనుల కోసమా! రాష్ట్ర ప్రయోజనాల కోసమా! ఈ రచ్చ అవసరమా!


https://youtu.be/6cIGMJsKjIc

11, జూన్ 2021, శుక్రవారం

ఆర్బీఐ గవర్నరుకు అప్పిచ్చిన ఆసామి - భండారు శ్రీనివాసరావు

 ఆర్బీఐ గవర్నరుగా పనిచేసిన వ్యక్తికి అప్పివ్వడం మామూలు వ్యవహారమా!

ఆర్వీవీ గారు నేను రేడియోలో చాలాకాలం కలిసి పనిచేసాము. ఆయనిప్పుడు బహుముఖ వ్యాపకాలు పెట్టుకుని నెగ్గుకు వస్తున్నారు. వాటిల్లో చాలావరకు ఆధ్యాత్మిక కార్యకలాపాలే. ఆయన చెప్పిన కధ కాని కధ ఇది.
సీనియర్ ఐ.ఏ.ఎస్. దువ్వూరి సుబ్బారావు గారి పేరు వినని వారుండరు. రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా చాలాకాలం పనిచేసారు. కానీ ఆయన్ని కొత్తవాళ్ళు ముఖతః చప్పున గుర్తు పట్టడం కష్టం. చేతిలో ఓ మామూలు సంచి పట్టుకుని రోడ్లమీద సాదా సీదాగా నడుచుకుంటూ వెడుతుంటారు. అప్పుడెప్పుడో జ్వాలా వాళ్ళ ఇంటికి సతీ సమేతంగా కలిసివచ్చినప్పుడు చూశాను, చాలా రోజుల తర్వాత. భార్య ఊర్మిళా సుబ్బారావు కూడా ఐఏఎస్సే. బెజవాడలో పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. అంచేతే కాబోలు ఆ ఊళ్ళో పేద ప్రజలు ఊర్మిళా నగర్ కట్టుకున్నారు. సుబ్బారావు గారి గురించి చెప్పేదే లేదు. ఆలిండియా ఐఏఎస్ టాపర్. కొన్ని దశాబ్దాల తరువాత కానీ మరో తెలుగు తేజం ముత్యాల రాజు ఐఏఎస్ టాపరుగా నిలిచేంతవరకు సుబ్బారావు గారి రికార్డు పదిలంగానే వుంది. ఆ రోజుల్లో కాంపిటీషన్ సక్సెస్ మేగజైన్ వాళ్ళు సుబ్బారావు గారి ఫోటోను కవర్ పేజీగా వేస్తె విచిత్రంగా చెప్పుకున్నారు.
సరే! విషయానికి వస్తాను. సుబ్బారావు గారు, భారత్ టుడే ఛానల్ చీఫ్ ఎడిటర్ జి. వల్లీశ్వర్ బాల్య స్నేహితులు. చిన్ననాటి స్నేహం కాబట్టి ఆయన్ని చూడడానికి సుబ్బారావు గారు అప్పుడప్పుడూ ఆ టీవీ ఆఫీసుకు వెడుతుంటారు. ఆ అలవాటు చొప్పునే కొన్నేళ్ళ క్రితం భారత్ టుడే కార్యాలయానికి వెళ్ళారు. ఆ సమయంలో స్టాఫ్ మీటింగులో వున్న వల్లీశ్వర్ ఆయన్ని కాసేపు కృష్ణారావు గారి గదిలో కూర్చోబెట్టి వెళ్ళారు. వారిద్దరూ మాట్లాడుతుండగానే పని పూర్తి చేసుకుని వల్లీశ్వర్ తిరిగి వచ్చారు. సుబ్బారావు గారు వల్లీశ్వర్ ని మొహమాట పడుతూ ఏదో అడుగుతుండడం ఆర్వీవీ కంటపడింది. విచారిస్తే విషయం తెలిసింది. సుబ్బారావు గారికి అర్జంటుగా ఇరవై వేలు అవసరమయ్యాయి. ఎన్ని ఏటీఎం లు తిరిగినా ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిచ్చాయి. బ్యాంకులకు కూడా సెలవు.
వల్లీశ్వర్ దగ్గర కూడా అంత డబ్బులేదు. కృష్ణారావు గారి వైపు చూశాడు. ఆయనకి విషయం అర్ధం అయింది. మూడు రోజుల క్రితం బ్యాంకు నుంచి డ్రా చేసిన పైకం వుంది. అది సుబ్బారావు గారి అక్కరకు పనికి వచ్చింది. మరునాడో, ఆ మర్నాడో సుబ్బారావు గారు ఆ బాకీ చెల్లువేశారు. అది అప్రస్తుతం.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆయన దేశం మొత్తానికి కరెన్సీ సరఫరా చేసే ఆర్బీఐ కి అత్యున్నత అధికారిగా పనిచేసారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గురించి పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దువ్వూరి సుబ్బారావు గారు రాసిన ఆంగ్లగ్రంధం లోని కొన్ని పేరాలను ఉటంకించారు. ఈ ఉదంతం చాలు ఆయన గొప్పతనం తెలుసుకోవడానికి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణారావు గారి దగ్గర డబ్బు తీసుకుంటున్నప్పుడు సుబ్బారావు గారు ఓ కోరిక కోరారు, అన్నీ అయిదువందల నోట్లు కాకుండా కొన్ని వంద నోట్లు కావాలని. ఆర్వీవీ ఆయనకు కొన్ని వంద నోట్లు కూడా ఇచ్చారు. వాటిల్లో కొన్నింటి మీద ఆర్బీఐ గవర్నర్ గా సుబ్బారావు గారు సంతకం చేసిన నోట్లు కూడా వున్నాయి.
ఉపశ్రుతి:
“మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”
కౌంటర్ లోని ఉద్యోగి అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని ‘మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మా’ అని.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-
ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.
భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.
అయన సంతకంతో వున్న రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.
ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.
ఈ విషయం స్టేట్ బాంక్ సీ జీ ఎం గా పనిచేసిన మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి ద్వారా తెలిసింది.

అలా దేశాలు చుట్టి వద్దాం రండి! – భండారు శ్రీనివాసరావు

 నూట యాభయ్ రూపాయలతో  అన్నీ  చూపిస్తాను  రండంటున్నారు రాజేష్ వేమూరి.

నాకు సంతోషం అనిపించి ఆ ప్రయాణం ఇవ్వాళే మొదలెట్టాను. ఇంకా పోలండులోనే వున్నాను. చూడాల్సినవి ఇంకా చాలా వున్నాయి. జర్మనీ, స్వీడన్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్, ఇంకా మనకు ఆట్టే తెలియని, నోరు తిరగని మరో దేశం లిచ్టేన్ స్టెయిన్.

కాకపోతే చదువరికీ అద్భుతమైన అనుభూతిని రాజేష్ కల్పించింది తాను రాసిన ‘ నా ఐరోపా యాత్ర’ అనే 184 పేజీల పుస్తకం ద్వారా. (నాకు ఈ మాత్రం ఖర్చు కూడా లేకుండా వేమూరి రాజేష్ ఆ పుస్తకాన్ని కొరియర్ ద్వారా నాకు ఈరోజు పంపారు. వారికి కృతజ్ఞతలు)

నిజానికి వీటిల్లో చాలా దేశాలను నా కళ్ళతో చూసే బంగారు అవకాశం మూడు దశాబ్దాల క్రితమే నేను మాస్కో రేడియోలో ఉన్నప్పుడే లభించింది. కానీ ప్రతి హాలిడేకి నేను స్వదేశాన్నే ఎంచుకోవడం వల్ల దాన్ని కోల్పోయాను. సోవియట్ యూనియన్ రోజుల్లో ఈ దేశాల్లో చాలా వరకు రష్యా మిత్ర దేశాలు. విమానాల్లోనే కాకుండా రైల్లో వెళ్లి తిరిగివచ్చే దేశాలు. పలానా రోజుల్లో పలానా దేశం వెళ్లి వద్దామని అనుకుంటున్నట్టు రేడియో వాళ్లకి చెబితే చాలు యావత్తు కుటుంబానికి వాళ్ళే రైలు టిక్కెట్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అందుకు వసూలు చేసే డబ్బు కూడా నామమాత్రం. అప్పుడు చూడని ఈ దేశాల్ని ఇదిగో ఇలా చూడగలుగుతున్నాను. ఆయన ఎంత వివరంగా రాశారంటే రాజేష్ వెంట మనమూ తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది.

వెనకటి రోజుల్లో విదేశీ ప్రయాణం అంటే ఒక అపురూపం. ఇప్పుడలా కాదు, ఉద్యోగాలకోసం బయట దేశాలకు వెళ్ళేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమెరికా వంటి దేశాల సంగతి చెప్పక్కర లేదు. పొతే ఇదిగో ఇలా యూరోపియన్ దేశాలకు వెళ్ళే పర్యాటకులకు కొదవ లేదు కానీ, ఉద్యోగాలు, ఉపాధుల నిమిత్తం పోయేవారు ఇంకా అరుదే.

విదేశాలను పొగడడం అంటే మన దేశాన్ని చిన్న బుచ్చడం కాదని రచయితే ఒక చోట చెప్పారు. అయితే ఘన చరిత్ర గురించి చెప్పుకుంటే సరిపోదు. దాన్ని పదిల పరచుకోవడం కూడా తెలియాలి. ఉదాహరణకు లండన్ మ్యూజియంలో అమరావతి శిల్పాలను ఒక ఫ్లోరు నిండా ప్రదర్శనకు ఉంచారు. అలాగే, ప్యారిస్ లోని గుయ్ మెట్ మ్యూజియలో ఘంటసాల తవ్వకాల్లో బయటపడిన మూడు శిల్పాలను, ఊరి పేరు వివరాలతో సహా భద్రపరిచారు. అవన్నీ అక్కడ పదిలంగా వున్నందుకు సంతోష పడాలా, పోగొట్టుకున్నందుకు ఖేదపడాలా!

పోలండు, జర్మనీ వంటి దేశాలు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పూర్తిగా ధ్వంసం అయి, మళ్ళీ స్వయం కృషితో కోలుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యాయి. ఆ క్రమంలో అవి ఏనాడూ తమ దీన స్తితిని ప్రపంచానికి చాటుకోలేదు. ఆ తరవాత స్వాతంత్రం వచ్చిన మన దేశాన్ని వాటితో పోల్చుకోగలమా! అక్కడా రాజకీయ పార్టీలు వున్నాయి. అవీ రాజకీయం చేస్తాయి. కానీ అభివృద్ధిని పణం పెట్టికాదు.

కరోనా కాలంలో ఇలాంటి పుస్తక పఠనం అభిలషణీయం, ఆహ్లాదకరం. 

ఈ పుస్తకం రాసిన రాజేష్ వేమూరికి అభినందనలు.



(నా ఐరోపా యాత్ర, రచయిత : రాజేష్ వేమూరి, ప్రచురణ: మన ఘంటసాల ప్రచురణలు, ప్రతులకు: +919182272551)

10, జూన్ 2021, గురువారం

కలల లోకంలో కాసేపు – భండారు శ్రీనివాసరావు

 

పాడు ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాం” అని ఈసురోమనే వాళ్ళు కూడా పదవీ విరమణ ఘడియ దగ్గరపడేటప్పుడు – ‘పొడిగింపు’ కోసం నానా తంటాలు పడడం కద్దు. ఏడుపదుల వయస్సు వచ్చేవరకూ ‘ఏమి జీవితమూ దుర్భరమూ ‘ అని తత్వాలు పాడుకున్నవాళ్ళు – తరవాత్తరవాత – తత్వం మార్చుకుని - “కొద్దిగా మనుషుల్ని ఆనవాలు పట్టే చూపు దేవుడు ఇస్తే బాగుండు” అనుకుంటూ బతుకు మీద మళ్ళీ తీపి పెంచుకునేవాళ్ళు సయితం కనబడుతుంటారు. 2010లో  ఆరుపదులు దాటిన తరవాత అమెరికావచ్చి- బెల్ వ్యూ లో  మా మనుమరాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాల చూసిన తరవాత నాకూ అలాటి అభిలాషే ఒకటి కలిగింది. 

 ‘మరుసటి జన్మలో అమెరికాలో పుట్టి ఇక్కడే చదువుకుంటే యెంత బాగుంటుందో కదా!’ అన్నదే ఆ కోరిక. అలాటి స్కూల్లో చదువుకుంటున్న మా మనుమరాళ్ళని చూసి కాస్తంత అసూయ పడ్డానేమో అని కూడా అనుమానం.

మన దేశంలో కూడా ఈ మాదిరి స్కూళ్ళు లేకపోలేదు. కానీ అవి పెట్టి పుట్టిన వాళ్ళకే పరిమితం. కూలీ నాలీ చేసుకుంటూ కలో గంజో తాగి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించే పేదలు కూడా మన దగ్గరవున్నారు. కానీ – ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు స్కూళ్ళ పేరుతొ’ పల్లెటూళ్ళల్లో సయితం కాలు  పెడుతున్న అలాటి స్కూళ్ళన్నీ డబ్బు చేసుకునేందుకు, డబ్బు దోచుకునేందుకు తప్ప అసలు సిసలు చదువుకు పనికొచ్చేవి కావు.

ఇక్కడి విద్యాలయాల్లో చదువుకన్నా వ్యక్తిత్వవికాసానికి (personality Development) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించింది. గట్టిగా చదివించి- ట్యూషన్లు పెట్టించి – “ఎమ్సెట్” ఒక్కటీ గట్టెక్కితే చాలనుకునే ధోరణి ఇక్కడి పేరెంట్లలో కానరాదు. ఆ అవసరం కూడా వారికి లేదనుకోండి. మరో విశేషం ఏమిటంటే సర్కారు బళ్ళల్లో (ఇక్కడ పబ్లిక్ స్కూళ్ళు అంటారు.ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తాయి) హైస్కూలు స్థాయి వరకూ సెంట్ ఖర్చులేకుండా చదువుకునే వీలుంది.

సమాజంలో ఉన్నత స్తాయి వర్గాలవాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే - వసతుల విషయంలో, నిపుణత కలిగిన అధ్యాపకుల విషయంలో కొండొకచో సర్కారు బడులే ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా వుంటాయి.

ఫెడరల్ గవర్నమెంట్ (కేంద్ర ప్రభుత్వం), స్తానిక (రాష్ట్ర) ప్రభుత్వాలు - విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని అనుకోవచ్చు. ప్రతి స్టేట్ లోను విద్యారంగం నిర్వహణ కోసం ‘స్కూలు డిస్ట్రిక్టుల’ను ఏర్పాటు చేసారు. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. విద్యాప్రమాణాలను బట్టి ఆయా స్కూళ్లకు ఫెడరల్ గవర్నమెంట్ ప్రత్యెక నిధులను ‘ఇన్నోవేషన్ ఫండ్’ నుంచి గ్రాంట్ రూపంలో ఇస్తుంది.ఈ ఏడాది వంద మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది. ఉదాహరణకు – బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు కింద వున్న సమ్మాయిష్ హైస్కూలుకు ఈ నిధి నుంచి నలభై లక్షల డాలర్ల గ్రాంటు లభించింది. దేశ వ్యాప్తంగా పోటీ ప్రాతిపదికపై నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియకు పదిహేడు వందల ధరఖాస్తులు రాగా వాటిలో ఉత్తమంగా ఎన్నిక చేసిన 49 స్కూళ్ళలో ఇది ఒకటి. ఇలాటి పోటీల వల్ల సర్కారు బడుల్లో నాణ్యతా ప్రమాణాలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం – అమెరికా లోని వంద ఉత్తమ పాఠశాలల్లో అయిదు హైస్కూళ్ళు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు లోనే వున్నాయి.


ప్రైవేటు స్కూళ్ళలో మాదిరి గానే వసతులు, చక్కటి భవనాలు, క్రీడా మైదానాలు కలిగివుండడం వల్ల ప్రభుత్వ స్కూళ్లను చిన్న చూపు చూసే పద్దతి ఇక్కడ కానరావడం లేదు. బెల్ వ్యూ లోని వుడ్ రిడ్జ్ ఎలిమెంటరీ స్కూలు ఇందుకు ఉదాహరణ. సహజ కాంతి వుండేలా తీర్చిదిద్దిన స్కూలు భవనం, వాల్ టు వాల్ కార్పెట్లు, పొందికయిన తరగతి గదులు, లైబ్రరీ, లంచ్ రూము, ఇండోర్ జిమ్, క్రీడామైదానం, కారు పార్కింగ్ ఏది చూసినా అద్భుతం అనే మాదిరిగా వున్నాయి. టాయిలెట్లు (రెస్ట్ రూములు) అయిదు నక్షత్రాల హోటళ్ళకు దీటుగా వున్నాయి. 

 బ్లాకు బోర్డులు, చాక్ పీసులకు బదులు ‘టచ్ స్క్రీన్ కంప్యూటర్లతో‘ పాఠాలు బోధించే విధానం ప్రాధమిక తరగతి నుంచే ప్రారంభం కావడం మరో విశేషం. పనిచేసే టీచర్లకు కూడా జీతభత్యాలు దండిగా వుండడం వల్ల ‘బతకలేక బడి పంతులు’ అనే నానుడుకి దూరంగావుంటూ, తమ విద్యార్ధులతో ప్రేమపూర్వకంగా మసలుకుంటూ - ‘గురు సాక్షాత్ పరబ్రహ్మ’ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ స్కూలులో పిల్లలకు నడవడిక నేర్పే పద్ధతులు దగ్గరనుంచి గమనించిన తరవాత వారి అదృష్టాన్ని గురించి మరో సారి అసూయపడాల్సి వచ్చింది. తోటి విద్యార్ధులతో మాట్లాడడం నుంచి సభ్య సమాజంలో మెలగడం వరకు – చిన్ననాటినుంచే ఇస్తున్న తర్పీదు చూడముచ్చటగా వుంది. తమకున్న పరిమితుల్లోనే సమాజానికి ఎలా సేవ చేయవచ్చన్నది ఆచరణలో బోధిస్తారు. 

 స్కూలు మొదలయ్యేటప్పుడు, తిరిగి వొదిలేటప్పుడు టీచర్లు, కొందరు ఎంపిక చేసిన విద్యార్ధులు స్కూలు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధం చేస్తారు. అలాగే పేరెంట్స్ తోడు లేకుండా స్కూలు బస్సుల్లో ఒంటరిగా వచ్చే పిల్లలను జాగ్రత్తగా దింపుకుని వారి వారి తరగతి గదులకు చేరుస్తారు. బస్సునుంచి దిగుతున్నప్పుడే పిల్లల పేర్లను రిజిస్టర్ లో రాసుకుంటారు. ఈ బస్సులకూ, మధ్యాహ్న భోజనానికీ ఎలాటి చార్జీ వుండదు.

 విద్యా సంవత్సరం ముగిసి విద్యార్ధులు పై తరగతికి మారుతున్నప్పుడు పాత సహాధ్యాయుల ఫోటోలు, వారి వివరాలతో కూడిన ఒక చిన్న ఆల్బం ఇస్తారు. వారిలో కొందరు సొంత కారణాలపై వేరే స్కూలుకు మారినప్పటికీ, వారి జ్ఞాపకాలు భద్రంగా వుంచుకునేందుకు ఈ ఆల్బంలు పనికివస్తాయి. తరగతి గదిలో ఏటిపొడుగునా విద్యార్ధులు సృజనాత్మకతను రంగరించి చేసిన పనులను, అంటే గీసిన బొమ్మలు, వేసిన చిత్రాలు, తీసిన ఫోటోలు, రాసిన కధలు, వ్యాసాలు అన్నింటినీ జాగ్రత్తగా భద్ర పరచి ఒక చక్కని ఫోల్డర్ రూపంలో ఏడాది చివరిలో అప్పగిస్తారు. తలిదండ్రులతో తరచుగా సమావేశాలు జరిపి వారి పిల్లల పురోగతిని గురించి వివరిస్తారు.

హైదరాబాదులో వేలకొద్దీ ఫీజుల రూపంలో దండుకునే అనేక విద్యా సంస్తలు కొన్నింటిలో ఇదేమాదిరి విధానాలు,వసతులు వుండవచ్చు. కానీ ఇంతవరకు ముచ్చటించుకున్నది ఏదో కార్పొరేటు స్కూలు గురించి కాదు. అమెరికాలో ఒక సర్కారు బడిని గురించి మాత్రమె. ఈ వాస్తవం గమనంలో వుంచుకుంటే – ఈ స్కూలుని చూసి ఎందుకు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందో అర్ధం అవుతుంది.

కలాం గారు  కోరుకున్నట్టు – మనందరం ఒక కల కనాలి. కనడమే  కాదు దాన్ని  నిజం చేసుకోవాలి.

ఇలాటి స్కూళ్ళు గ్రామ గ్రామానికీ రావాలన్నదే ఆ కల. పైసా ఖర్చు లేకుండా,పేదా గొప్పా తారతమ్యం లేకుండా -  పిల్లలందరికీ ‘ఇలాటి చిన్నతనం’ వారి  సొంతం కావాలి.

భావి భారతం ‘భద్ర భారతం’ కావాలంటే, భావి తరం ‘మేధావి భారతం’ కావాలంటే – చదువు నేర్చుకోవడం అన్న ఒక్క ‘హక్కు’ ఇచ్చి వూరుకుంటే సరిపోదు- ఇంత ఆనందంగా, హాయిగా, ఆడుతూ, పాడుతూ చదువుకోగల ‘సర్కారు స్కూళ్ళు’ - చదువుకుందామనుకునే ప్రతి ఒక్కరికీ హక్కు భుక్తం కావాలి.

అయితే-

వీటన్నిటినీ ఆచరణలోకి తీసుకురావాలంటే కొన్నింటికి తప్పనిసరిగా డబ్బు కావాలి. అది ఎప్పుడూ కొరతే. మరికొన్నింటికి కేవలం చిత్త శుద్ధి వుంటే చాలు .కానీ, ఇప్పుడు బాగా కొరతగా వున్నది దీనికే. టీవీ చర్చల్లో తప్ప ఎక్కడా వినబడని ఈ "చిత్తశుద్ధి" అంత తేలిగ్గా దొరుకుతుందా?


(మా మనుమరాళ్ల స్కూలు వద్ద నేనూ, మా ఆవిడా. ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీ విద్యార్ధులు)

(2010)