20, ఫిబ్రవరి 2021, శనివారం

గజిబిజి పలుగులు - భండారు శ్రీనివాసరావు

 “అర్ధం చేసుకోగలిగితే వేదాంతం చాలా గొప్పది.

పారమార్ధికం, పారలౌకికం  ఈ రెంటినీ సరైన పాళ్ళలో కలిపితే అదే వేదాంతం అవుతుంది. గీతలో భగవానుడు బోధించింది అదే.

“నీ పని నువ్వు చెయ్యి. ఫలితం నాకు  వదిలేయ్”

ఎవరి పని వాళ్ళు చేయడం పారలౌకికం. ఫలితాన్ని పరమాత్ముడికి వదిలేసి దేనికీ తాపత్రయ పడకపోవడం పారమార్ధికం.

ఇలా చేస్తే స్వార్ధరహిత కర్తవ్యపాలన జరుగుతుంది. దాన్ని పరిపాలన అనండి, ఉద్యోగం అనండి, కుటుంబ బాధ్యతలు అనండి, ఇంకేదైనా అనండి. అన్నిటికీ ఈ సూత్రాన్ని పాటిస్తే సమాజానికి మేలు జరుగుతుంది.

కానీ జరుగుతున్నది తద్విరుద్ధం. పారమార్ధిక భావాలు బాగానే ప్రబలుతున్నాయి. అలాగే పారలౌకిక భావనల్లో స్వార్ధ తలంపులు కూడా.

భగవద్గీతను భక్తిగా తలమీద పెట్టుకుంటాం కాని, అందులో చెప్పిన దాన్ని నిబద్ధతతో తలకెక్కించుకో౦!

కలివిడిగా వున్నప్పుడు కూడా మనసును విడిగా ఉంచుకోగలగాలి. విడిగా వున్నప్పుడు సైతం నలుగురితో కలిసివున్నామన్న భావన పెంచుకోవాలి.

ఏమిటో శంకరాభరణం శంకర శాస్త్రిగారి మాటల్లాగా ఒక్కటీ అర్ధం కావడం లేదనిపిస్తోందా!

అందుకే దాన్ని వేదాంతం అన్నారు శిష్యా!”

అనుగ్రహభాషణ ముగించారు  ఏకాంతానందస్వామి.  

(20-02-2021)

Sr Journalist Bhandaru Srinivasa Rao Give's Clarity On YS Sharmila Party...

Sr Journalist Bhandaru Srinivasa Rao Give's Clarity On YS Sharmila Party...

19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

Senior Journalist Bhandaru Srinivas Exclusive Interview || మీ iDream Nag...

రష్యన్ భాషలో శంకరాభరణం సినిమా

 

1979వ సంవత్సరం లో ఒక రోజు.
మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్ వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు) సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, నాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.
ఆశ్చర్యంగా రెండో వారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.
కొన్ని రోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయనగారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.
ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!
కట్ చేస్తే.....
మళ్ళీ 2017లో...
‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకా రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ గారు మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.


(విశ్వనాద్ గారితో రచయిత)


శంకరాభరణం గురించి కూడా చెప్పారు.
“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మ ధన్యం అవడం అంటే ఇదే కాబోలు”
చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.
సీన్ కట్ చేసి కొంత వెనక్కి వెడితే....
1987- 92 మధ్య రేడియో మాస్కోలో పనిచేసిన కాలం నాటి జ్ఞాపకం. ఊలిచ్చవావిలోవాలోని మాస్కో రేడియో భవనంలో నివాసం వుండేవాళ్ళం. మా ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.
సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టిక్కెట్స్ కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా, అది మన శంకరాభరణం సినిమా.
పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమాలో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల, సోమయాజులు గారే కాకుండా, ఆ సినిమాలో నటించిన తదితర నటీనటులు అచ్చు రష్యన్ భాషలో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.
సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను. ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.

17, ఫిబ్రవరి 2021, బుధవారం

బ్రహ్మరాత - భండారు శ్రీనివాసరావు

వంద ఏళ్ళ క్రితం రూపాయే? ఇప్పుడూ రూపాయే!
ఏమిటి? వడ్డీ! అక్షరాలా అంతే! ఈరోజే అక్షరాల్లో చూశాను. కానీ ఆ వ్రాత బ్రహ్మ వ్రాత. ఒక పట్టాన అర్ధం కాదు. ఎందుకంటే అది రాసి ఇప్పటికి అక్షరాలా నూట ముప్పయి సంవత్సరాలు.
పాత కాగితాలు, దస్తావేజులు వెనక భద్రంగా దాచుకునే వారు. ఆస్తులు తరిగీ, కరిగీ కొంత, కంప్యూటర్లలో భద్రపరచుకునే వీలూ చాలూ ఏర్పడడం వల్ల కొంతా, ఏతావాతా ఏమైతేనేం పాత దస్తావేజులు, దస్త్రాలు అటకెక్కికూర్చున్నాయి.
రేడియోలో కలిసిపనిచేసిన ఆర్వీవీ కృష్ణారావు గారు ఒక పాత దస్తావేజు ప్రతి పంపారు. ఎంత పాతది అంటే దాదాపు 130 సంవత్సరాల నాటిది. వారి ముత్తాత కాలం నాటిది. ఆర్వీవీ కృష్ణారావు (పూర్తి పేరు రాయసం వీరభద్ర వెంకట కృష్ణారావు) వారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు, (వీరు నాకు కూడా తెలుసు). గంగన్న పంతులు గారి తండ్రి వీరభద్రుడు గారు. వారి తండ్రి గారు గంగన్న గారు.
గంగన్న గారికి కొంత డబ్బు అవసరం పడింది. అదీ అయిదువందల రూపాయలు. ఈనాం భూమి కొనుగోలు చేయడానికి చేసిన అప్పు తీర్చడానికి ఈ అప్పు అన్నమాట. ఈరోజు లెక్కల్లో అదేమంత పెద్ద మొత్తం కాదు. కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద భూస్వాములకు కూడా నగదు అవసరాలు వచ్చేవి. వాళ్లకు తెలిసినదల్లా భూమిని తనఖా పెట్టి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకోవడం. తీర్చడం. ఇలా అప్పు తీసుకోవడానికి పైకి కనపడని పెద్ద తతంగమే నడిచేది. గంగన్న గారు వుండేది రేలంగి. డబ్బు అప్పు ఇచ్చే ఆసామి వుండేది తణుకులో. ఈ అప్పు పత్రం రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అంచేత ఇవి రాయడానికి ప్రత్యేకంగా లేఖరులు వుండేవారు.
కృష్ణారావు గారు పంపిన దస్తావేజు పత్రాల్లో చేతిరాత బ్రహ్మ రాతను పోలివుంది. చదవడం క్లిష్టం అనిపించినా, బ్రిటిష్ రాణి గారి చిత్రంతో వున్న రూపాయి విలువచేసే స్టాంపు పేపరు మీద రాసిన విషయాలను చదివి, అర్ధం అయినంత వరకు కొంత ఇక్కడ పొందుపరుస్తున్నాను. (అర్ధం కాని చోట చుక్కలు ఉంచాను)
“.......ఆ 1891.......తన్కు (ణ కింద కు వత్తు, తణుకు కావచ్చు) గ్రామ కాపురస్తులు, కమ్మవారు, షావుకారు చిట్టూరి యి౦ద్రయ్య (ఇంద్రయ్య) కుమార్డు వెంకట కృష్ణయ్యకు, రేలంగి కాపురస్తులు , బ్రాహ్మణులు, యిన్నాందార్లు (ఇనాందారులు) రాయసం కృష్ణమ్మగారి కుమార్డు గంగన్న వ్రాయించి ఇచ్చిన అస్వాధీనపు తన్ఖా (తణఖా, ణా కింద ఖా వత్తు) పత్రము.
“.......... యిన్నాం భూమి కొనుగోలు నిమిత్తం నేను చేసిన రుణాల తీరుమానం నిమిత్తంన్ను, నా కుటుంబ .......(బహుశా ఖర్చులు కావచ్చు) నిమిత్తంన్నూ యీరోజు కృష్ణయ్య గారి వద్ద పుచ్చుకున్న రొఖం రు. 500 (అయిదువందల రూపాయీలు) యిన్ద్కు నెల / ఒక్కింటికి వందకు రు. 1 రూపాయి చొ# వడ్డీతో అయ్యే అసలుఫాయిదాలు తీరుమానం చెయ్యగలందులమని ......”
ఈ విధంగా సాగిపోయింది ఆ రుణపత్రం.
కింద గంగన్న గారు చేసిన సంతకం ఇంకా గమ్మత్తుగా వుంది.
‘రాయసం గంగ్గ౦న్న వ్రాలు’ అని దస్కత్తు చేశారు. ఆ రోజుల్లో తెలుగు అలా వుండేదేమో!
తణుకు సబ్ రిజిస్త్రార్ ఆఫీసులో రెండు రూపాయల స్టాంపుపై రిజిస్త్రార్ సంతకం చేసి వేసిన మొహర్ వుంది.
అయిదు వందల రూపాయలు అప్పు చేయాలంటే ఇంత తతంగం నడిచేది.
అప్పు పూర్తిగా అసలు ఫాయిదాలతో అనుకున్న వ్యవధికి ముందే చెల్లు వేసి తనఖా పత్రాలను వెనక్కి తీసుకున్నట్టు కూడా వాటిల్లో వుంది.
ఇప్పుడో.....
అప్పు చేయడానికి ఆలోచించనక్కరలేదు. తీర్చే విషయం గురించి అసలు బెంగ పడక్కర లేదు. (17-02-2021)


గోరంక గూటికే చేరింది చిలక

 తోకలేని పిట్ట తొంభై ఆమడ తిరిగిందని పోస్టు కార్డు మీద ఓ జాతీయం.

నాకొచ్చిన ఈ పోస్టు కార్డు అంతకంటే ఎక్కువే తిరిగిందో లేక ఏ పోస్టు డబ్బాలోనో రిప్ వాన్ వింకిల్ మాదిరిగా ఏళ్ళ తరబడి నిద్ర పోయిందో ఏమిటో తెలియదు. మొత్తం మీద చేరాల్సిన గూటికి (చిరునామాకు) నాలుగేళ్ల తర్వాత చేరింది.

2017 డిసెంబరులో నేను మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకుని ఒక వ్యాసం రాశాను. ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురించారు, యథావిధిగా నా ఫోటోను, దానికి నా మొబైల్ నెంబరును జోడించి.

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం వాస్తవ్యులు శ్రీ మంగెన గంగాధరరావు ఆ వ్యాసం చదివారు. చదివి నాకొక కార్డు ముక్క రాశారు. ‘అధికారాంతము నందు ...’  పద్య పాదం  పూర్తి పాఠం  గురించి, ఆ పద్యం రాసిన కవి గురించి తెలియచేయమని అందులో కోరారు.

నా ఫోన్ నెంబరు అంటే పత్రికలో వేశారు. కానీ నా అడ్రసు ఎలా కనుక్కున్నారో ఆశ్చర్యమే మరి.

ఆయన రాసిన  కార్డులో రెండు సెల్ నెంబర్లు వున్నాయి. ఒకటి పనిచేయడం లేదు. రెండో ఫోన్లో గంగాధరరావు గారు దొరికారు. మాట్లాడారు. ‘నాలుగేళ్ల తర్వాత మీరు  రాసిన కార్డు’ అందింది అని చెబితే సంతోషపడ్డారు.

వారికి ధన్యవాదాలు. మరి పోస్టల్  డిపార్ట్ మెంటుకు చెప్పాలి వేలవేల ధన్యవాదాలు.