11, ఫిబ్రవరి 2021, గురువారం

ఏం సాధించినట్టు? – భండారు శ్రీనివాసరావు

 ఇప్పుడు తలచుకుంటే అనిపిస్తుంది, ఇంతోటి దానికి ఇన్ని వాయిదాలు ఎందుకో అని. గత మార్చిలోనో, లేదా ఆ తరవాతనో ఎవరో ఒకరు అనుకున్నప్పుడే ఎన్నికలు జరిపి వుంటే, కోట్లల్లో పెట్టిన కోర్టు ఖర్చులు, భారీ మొత్తాల్లో లాయర్ల ఫీజులు ఆదా అయ్యేవి. పంతాలకు పోయి పెళ్ళాం ఖర్చు చేసినా, పట్టుదలకు పోయి మొగుడు తగలేసినా పడే బొక్క ఇంటి ఖజానాకే కదా!

హాయిగా ఇప్పటికల్లా ఎన్నికల క్రతువు పూర్తయి ఎంచక్కా గ్రామాలు, మండలాలు, జిల్లాలు కూడా రాష్ట్రంతో పోటీ పడి రాజకీయాలు నడుపుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవి.
(11-02-2021)

సర్కారు కొలువులు – భండారు శ్రీనివాసరావు

 


సర్కారు కొలువులు – భండారు శ్రీనివాసరావు
(Published in Andhra Prabha daily on 13-02-2021, Saturday)
ఉద్యోగం వుండదు కానీ ఉద్యోగం చేసే ఉద్యోగి ఉంటాడు. ఇదెక్కడి విరోధాభాసం అంటారా!
ఇదేదో సరదాగా అంటున్నది కాదు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ స్వయంగా పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాట.
ప్రతి ఉద్యోగానికి దానికి తగ్గట్టు ఓ పేరు వుంటుంది, గుమాస్తో అనో, అధికారి అనో. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాతికేళ్ళవరకు ఒక ఉద్యోగి ఉండేవాడు. ముందే చెప్పినట్టు అతడు చేయాల్సిన ఉద్యోగం మాత్రం లేదు. అదేదో బ్రిటిష్ కాలంలో (1940) అవసరార్థం ఏర్పాటు చేసిన ఉద్యోగం. బ్రిటిష్ ప్రధానమంత్రి చర్చిల్ కు పొగతాగే అలవాటు వుండేది. గుప్పుగుప్పున రోజూ డజన్ల కొద్దీ సిగార్లు (నాణ్యమైన దొరపొగాకు చుట్టాలు) తగలేయడం ఆయన హాబీ. అందుకని చర్చిల్ దొరవారికి ఆయన బాగా ఇష్టపడే "ట్రిచినోపోలీ" వెరైటీ సిగార్‌ను చర్చల్ కి సరఫరా చేయడానికి ఒక ఉద్యోగాన్ని సృష్టించారుట. దాని పేరే సీ.సీ.ఏ. అంటే చర్చిల్ సిగార్ అసిస్టెంట్. 1945 లో చర్చిల్ ఓడిపోయినా, 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ ఈ పదవి మాత్రం 1970 వరకూ కొనసాగుతూనే ఉందిట.
పరిపాలనలో మార్పు అవసరం గురించి చెప్పడానికి ఈ ఉదంతం ఒక అతిపెద్ద ఉదాహరణ అని ప్రధాని మోడీ అన్నారు.
ఈ విషయం మీడియా వెల్లడించినప్పుడు ఇటువంటివే మరికొన్ని సంగతులు మస్తిష్కంలో మెదిలాయి.
హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రం సింహద్వారం పక్కనే ఓ స్తంభానికి వేలాడుతూ తళతళ మెరుస్తూ వుండే ఓ ఇత్తడి గంట కనిపిస్తుంది.
రేడియో స్టేషన్ లో ఈ ధర్మగంట అవసరం ఏమిటి? అనే ఆలోచన నన్ను వేధిస్తూ వుండేది.(అక్కడ పనిచేసే రోజుల్లో)
విచారించగా తెలిసింది ఏమిటంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినప్పుడు, అదే సమయంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అందరినీ అప్రమత్తం చేయడానికి ఆ గంటను మోగిస్తారని తెలిసింది. మూడు దశాబ్దాల నా ఉద్యోగపర్వంలో ఒక్కసారి కూడా ఆ గంట మోగించిన దాఖలా లేదు. ఆ గంటను శుభ్రంగా తుడిచి పదిలంగా కాపాడడానికి ప్రత్యేకంగా ఓ ఉద్యోగి వుండేవాడేమో కూడా తెలియదు.
ఒకానొక కాలంలో, బహుశా స్వాతంత్రానికి పూర్వం అనుకుంటాను, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ వైద్యులకు రవాణా సదుపాయాలు సరిగా ఉండేవి కావు. రహదారులు అధ్వానంగా ఉండేవి. ఎటు పోవాలన్నా ఎడ్ల బండ్లే శరణ్యం. ఆ రోజుల్లో ప్రభుత్వ వైద్యులకు జీపు బదులు ఎడ్ల బండి ఏర్పాటు వుండేది. ఒక బండి, అది సర్కారు వాహనం కాబట్టి జత ఎడ్లు, వాటికి గ్రాసం, బండిని నడపడానికి జీపు డ్రైవర్ మాదిరిగా ఒక పనివాడు, ఈ తతంగం నడవడానికి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల చెల్లింపు ఇలా సాగిపోయేది.
కొన్నేళ్ళ తరువాత ఆ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కొద్దో గొప్పో మెరుగు పడడం వల్ల సర్కారీ విల్స్ జీపులు రంగ ప్రవేశం చేయడంతో, ఎడ్ల బండ్ల అవసరం లేకుండాపోయింది. అయినా కూడా చాలా కాలంపాటు ఆ వ్యవస్థ రికార్డుల్లో కొనసాగేది అని చెప్పుకునేవారు. 1970 ప్రాంతాల్లో అక్కడ పనిచేయడానికి వెళ్ళిన ఒక డాక్టరు గారెకి మనుషులకు వైద్యం చేసే దవాఖానాలో ఈ పశుగ్రాసం బిల్లులేమిటి అని అనుమానం వచ్చి ఆరా తీస్తే ఈ అసలు విషయం బయట పడింది.
మనలో చాలామంది పూర్వపు తహసీల్ కచేరీలు చూసి వుంటారు. పంకాలు లేని ఆ కాలంలో తహసీల్ దొరగారు కూర్చొనే సీటు మీద ఒక పెద్ద గుడ్డ పంకా వుండేది. ఒక బంట్రోతు దొరవారు దాన్ని అటూఇటూ తాడుతో లాగుతూ వుంటే అయ్యవారు మెల్లగా వీచే ఆ చల్లగాలిలో సేద తీరుతూ రాచకార్యాలు చక్కబెడుతూ వుండేవారు.
తరవాత్తరవాత విద్యుత్ పంకాలు వచ్చాయి కానీ గుడ్డ పంకాలు లాగే కొలువు మాత్రం చాలాకాలం కొనసాగింది.
ఐ.ఏ.ఎస్. అధికారిగా అనేక ఉన్నత పదవులు నిర్వహించిన శ్రీ ప్రభాకరరెడ్డి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. 1977లో ఆయన సర్వీసులో చేరిన కొత్తల్లో ‘మసాల్చి’ అనే ఉద్యోగం ఉండేదట. వెనుకటి రోజుల్లో కలెక్టర్లు గుర్రాల మీద తిరిగేవారు. ఆ గుర్రం ముందుగా వెడుతూ దారి చూపించడానికి ఈ మస్తాల్చి ఉండేవాడు. కాలక్రమంలో గుర్రాలు పోయి మోటారు వాహనాలు వచ్చినా ఆ ఉద్యోగం మాత్రం అలాగే చాలా కాలం కొనసాగుతూ వచ్చిందట.
మన దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని అన్ని స్థాయిల్లో రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు పుట్టుకు వచ్చాయి. మా చిన్నతనంలో మా ఊరికి వి.ఎల్.డబ్ల్యు. అనే ఉద్యిగి కొత్తగా వచ్చాడు. అప్పటిదాకా కరణం, మునసబు మాత్రమే ప్రభుత్వం అనుకునేవారు. అలాగే బ్లాకు డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీవో) ఉద్యోగం కూడా కొత్తగా వచ్చిందే. ఇప్పుడు అవే ఉద్యోగాలకు పేర్లు మారిపోయి వుంటాయి.

‘ఒక గుంతను తవ్వు. ఆ గుంతను పూడ్చు. గుంత తవ్విన వాడికి ఓ ఉద్యోగం, దాన్ని పూడ్చిన వాడికి మరో ఉద్యోగం” ఈ పద్దతిలో అనేక ఉద్యోగాలు. అయినా దేశంలో నిరుద్యోగ సమస్య అలాగే వుంది.(EOM)





(11-02-2021)

          

9, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఉన్న జన్మ ఈడ్వడమే కష్టం అవుతుంటే పునర్జన్మ అవసరమా

Bhandaru Srinivasa Rao Gave Clarity On Ganta Srinivasa Rao Resignation |...

Senior Journalist Bhandaru Srinivasa Rao Clarity On Vizag Steel Plant | ...

Senior Journalist Bhandaru Srinivasa Rao About Vizag Steel Plant Privati...

మరవలేని మనిషి

 జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే.”

ఈ రోజు (9th Feb) మా ఆవిడ నిర్మల పుట్టిన రోజు. ఈ రోజును మరచిపోకపోవడమే ఆమెకు నేనిచ్చే బర్త్ డే గిఫ్ట్ అని అనుకునేవాడిని.

‘చూసావా నువ్వు గుర్తు చేయకుండానే నేనెలా గుర్తుంచుకున్నానో’ అని చెప్పాలని వుంది. కానీ వినడానికి ఆవిడ లేదు.

నా ప్రతి పుట్టిన రోజుకూ నన్ను బలవంత పెట్టి ఇంటికి దగ్గరలో వున్న ఓ చిన్న గుడికి తీసుకుని వెళ్ళేది. (దూరంగా వుండే పెద్ద గుళ్ళకు  వెళ్ళడానికి  బద్దకిస్తాననే  సందేహంతో)

పెళ్ళయిన కొత్తల్లో  నాకు దేవుడు అంటే భయం, భక్తీ అంతా ఇంతా కాదు. ఆమెకు పూజా పునస్కారాలు అంతగా లేవు. కానీ కొన్నేళ్ళ తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఆమె వుంటే ఇక నాకు దేముడితో పనేమిటి అనే భరోసా నాలో పెరిగితే, ఇల్లూ వాకిలీ  పట్టని నాలాంటి మొగుడు దొరికాక,  దేవుడి అవసరం ఆమెకు బాగా పెరిగింది.

2019 ఆగస్టు ఏడోతేదీ. ఆరోజు నా పుట్టిన రోజు. పొద్దున్నే టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్లి వచ్చాను. తాను తయారుగా వుంది. జూబిలీ హిల్స్ లోని టీటీడీ బాలాజీ దేవాలయానికి వెడదాం అన్నది. నేనూ అంతవరకూ ఆ గుడి చూడలేదు. సరే పదమని బయలుదేరి వెళ్లాం. కొండ మీద గుడి. మంచి దర్శనం అయింది. అర్చన  చేయించి, పులిహోర ప్రసాదం తీసుకుని తిరిగి కిందికి వస్తుంటే ఓ పూజారి గారు నన్ను గుర్తు పట్టి పక్కనే ఉన్న మరో గుడి, వినాయకుడి గుడికి తీసుకు వెళ్ళారు. ఈ గుడికీ, ఆ గుడికీ నడుమ ఓ ప్రహరీ గోడ వుండడం వల్ల  కాస్త చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. పూజారి గారు ఏదో చెబుతున్నారు, ఒకరిది వైఖానస సాంప్రదాయం, మరొకరిది శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుకుంటా. ఒకదానికి మరొకటి చుక్కెదురుట. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి వైఖానసులు తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారుట. ఇవన్నీ .నాకు అర్ధం కాని విషయాలే కాదు, అవసరం లేని విషయాలు కూడా. ఎప్పుడైనా  గుడికి  వెడితే దేముడికి దండం పెట్టి బయటకు రావడమే తప్ప  మిగిలిన విషయాలు  పట్టించుకోను.

గుడి మహా ద్వారం దగ్గర ఫోటో తీసుకుందామని అనిపించింది. సెల్ఫీ తీయడం రాదు, తీసేవాడు కనిపించలేదు. కనపడిన వాడిని అడగడానికి మొహమాటం. లేకపోతే ఆ ఫోటో మా జీవితంలో ఆఖరిసారి  కలిసి దిగిన ఒక అపూర్వమైన జ్ఞాపకంగా మిగిలిపోయేది.

ఇంటికి వచ్చేముందు జూబిలీ హిల్స్ లోనే ఉంటున్న  మా రెండో అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాము, మా కుటుంబానికి పెద్దలు అయిన రామచంద్రరావు గారు, విమల వదినల ఆశీస్సులు తీసుకుందామని. భోజనం చేసిన తర్వాత ఏదో సినిమాకి వెళ్ళిన గుర్తు.  ఆ తర్వాత పదంటే పది రోజులకే మాసివ్  హార్ట్ అటాక్ వచ్చి మా ఆవిడ మరణించడంతో ఆ  జ్ఞాపకాలన్నీ అలికినట్టు గజిబిజిగా అయిపోయాయి.       

ఈరోజు  నేను ఒక్కడినే వెళ్లి దేవుడి గుడిలో కాసేపు కూర్చుని వచ్చాను. శరీరాన్ని ఏదో కట్టడి చేసి భగవత్ సన్నిధానంలో కూర్చోవడమయితే కూర్చున్నా కానీ, మనసు నా స్వాధీనంలో వుండదు కదా!

చెత్త ఆలోచనలు చుట్టుముడుతూనే వుంటాయి.

“మా ఆవిడ చనిపోయి అప్పుడే  ఏడాదిన్నర అవుతోందా! అయినా ఇంకా ప్రాణాలతోనే వున్నాను అంటే నా గుండె గట్టిది అయినా అయివుండాలి. లేదా ఆమె మీద నా ప్రేమ వట్టిది అయినా అయివుండాలి”

ఎంతయినా మగవాడిని కదా! ఇదే నిజమై వుంటుంది.

(09-02-2021)

కింది ఫోటో: పెళ్ళికాని కొత్తలో మేమిద్దరం (1968)