19, జనవరి 2019, శనివారం

ఏపీలో రాజకీయ భోగిమంటలు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily on 20-01-2019, SUNDAY)
రాజకీయ నాయకులు ఒకరినొకరు కలుసుకోవడం విడ్డూరమేమీ కాదు. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం వంటి నేతలు కలుసుకున్నా, ఎదురుపడ్డా, పలకరించుకున్నా మీడియాకు అది వార్తే. అదే వారిద్దరూ  ఒకటవుతున్నారు, కలిసిపోవాలని అనుకుంటున్నారు అన్నప్పుడు అది సంచలన వార్త కూడా అవుతుంది.
ఎక్కడి ఉదాహరణలో ఎందుకు? తెలుగు రాష్ట్రాల సంగతే చూద్దాం.
తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్నేళ్ళ క్రితం రాజ భవన్ లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. ఇదే వార్త సంచలనం అయికూర్చుంది. రోజల్లా మీడియాలో గిరికీలు కొట్టింది. ముందు ఎవరు ఎవర్ని పలకరించారు? కరచాలనం చేయడానికి ముందు ఎవరు చేయి చాపారు? ఏమి మాట్లాడుకున్నారు? ఇలా సాగిపోయాయి వార్తాకధనాలు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు, వాళ్ళు సినిమా రంగానికి చెందినవాళ్ళు కావచ్చు, రాజకీయ రంగానికి చెందినవాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రతి కదలిక మీదా మీడియా కన్ను వుంటుంది. అందుకు సంబంధించిన మీడియా కధనాలపై ప్రజలకు ఆసక్తి వుంటుంది. ఈ కధనాలను వండి వార్చడంలో కొన్ని ఉత్ప్రేక్షాలంకారాలు దొర్లినా అవి ఆ వార్తలకు కొత్త సొగసు అద్దుతాయి తప్పిస్తే సమాజానికి జరిగే హాని ఏమీ వుండదు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరు అనే సామెతను రాజకీయ నాయకులే పదేపదే ప్రస్తావిస్తూ పార్టీల కలయికలు, విడిపోవడాలు అత్యంత సహజం అనే  నిర్ధారణకు జనం వచ్చేలా వారివంతు వారి ప్రయత్నం చేస్తూనే వున్నారు. అంచేత రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు అంటూ విడిగా వుండరు, రాజకీయాలు చేసే వాళ్ళే రాజకీయాల్లో వుంటారనే అభిప్రాయం ప్రజల్లో కూడా బలపడి పోయి పార్టీల కలయికలు, విడిపోవడాలు ఇవన్నీ ఆటలో అరటిపండు అనే రీతిలో  తేలిగ్గా తీసుకునే పరిస్తితి ఏర్పడింది.
ఈ నేపధ్యంలో, మొన్నీమధ్య తెలంగాణా రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షులు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కే. తారకరామారావు కొందరు పార్టీ ముఖ్యులను వెంటబెట్టుకుని హైదరాబాదులోని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి నివాసానికి వెళ్లి గంటల తరబడి చర్చలు జరిపారు. ఇదేమీ రహస్యంగా జరిగింది కాదు. ఈ భేటీ గురించి అంతకు ముందు రోజు నుంచీ మీడియాలో వార్తలు వస్తూనే వున్నాయి. ఈ పార్టీల నేపధ్యం గమనంలో పెట్టుకుని చూస్తే ఖచ్చితంగా  ఈ సమావేశం మీడియా దృష్టిలో ఒక సంచలన సమాచారమే. ఈ రెండు పార్టీలు తమ ఆవిర్భావం నుంచి విభిన్న ద్రువాలే. తెలంగాణా సాధన కోసం టీఆర్ఎస్  పుష్కర కాలంగా సాగించిన  ఉద్యమం తుది దశకు చేరుకున్న సమయంలో పురుడు పోసుకున్న వై.ఎస్.ఆర్.సి.పీ. సమైక్య రాష్ట్ర నినాదాన్నే ఆదినుంచీ అందుకుంది. ఆ రకంగా ఈ రెండు పార్టీలకు పొసగడం అనేది గగన కుసుమం అని తీర్మానించుకున్న రోజులు కూడా వున్నాయి.
ఇదిగో ఈ నేపధ్యంలో జరిగిన భేటీ కాబట్టే అటు మీడియా కన్ను, రాజకీయుల దృష్టి దీనివైపు మళ్ళింది.
ఈ ఇద్దరూ రహస్య సమాలోచనలు చేసినట్టు లేదు. ఈ సమావేశంలో రెండు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. భేటీ ముగిసిన తర్వాత ఇద్దరు నాయకులు మీడియాను కలిసి చర్చల సారాంశం చెప్పారు.
జగన్ సమక్షంలోనే విలేకరులతో ముందు కేటీఆర్ మాట్లాడారు. ఉన్న విషయం చెప్పారు. టీఆర్ఎస్ అధినేత ఆదేశాల ప్రకారం తానూ జగన్ మోహన రెడ్డిని కలుసుకున్నానని వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి  చాలారోజులుగా కేసీఆర్ ఆలోచిస్తూవస్తున్నారని, దానికి మద్దతు కోరడానికి జగన్ మోహన రెడ్డిని కలుసుకోవడం జరిగిందని  మదిలో కదలాడుతున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించామని వివరించారు. భావసారూప్యత కలిగిన  ప్రాంతీయ పార్టీల నడుమ సఖ్యతను పెంపొందించి వాటి బలాన్ని పెంచేలా చేయడం, తద్వారా ఆయా ప్రాంతీయ ప్రయోజనాలను సాధించుకోవడం అనేది ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశ్యమని అన్నారు. కేంద్ర రాజకీయాల్లో ఈ ఫ్రంట్ అటు బీజేపీకి, ఇటుకాంగ్రెస్ కు దూరంగా ఉంటుందని చెప్పారు. ఈనాటి చర్చల్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి తమ అధినాయకుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఆంద్రప్రదేశ్ వెళ్లి వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ అంశంపై మరింత లోతుగా చర్చలు జరుపుతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ ను తమ పార్టీ బలపరుస్తుందని కేటీ ఆర్ స్పష్టం చేశారు.
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో ఎవరు కలిసివచ్చినా కలుపుకుపోవడానికి తమ పార్టీ ఎల్లప్పుడు సిద్ధమేనని చెబుతూ, ఇరుగు పొరుగు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన మొత్తం నలభయ్ రెండుమంది ఎంపీలు ముక్త కంఠంతో పట్టుబడితే కేంద్రం పై ఒత్తిడి పెంచడం సాధ్యం కాగలదని జగన్ మోహన రెడ్డి అన్నారు. కేసీఆర్  ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనని ఎలా ముందుకు తీసుకుపోవాలి అనే విషయాన్ని  గురించి తమ పార్టీ వారితో చర్చిస్తానని  ఆయన  చెప్పారు.
ఒకప్పుడు రాజకీయంగా, సైద్ధాంతికంగా విబేధించిన ఈ రెండు పార్టీల నాయకులు కేంద్ర రాజకీయాల్లో తీసుకుకురావాల్సిన మార్పులు గురించి ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేయడం ఆహ్వానించదగ్గ విషయమే. కొత్తగా విడిపోయిన రాష్ట్రాల నడుమ పరిష్కరించుకోవాల్సిన అనేక అంశాలు వుంటాయి. తెలంగాణా వైపు నుంచి అధికార పక్షమే ముందు చొరవ తీసుకుంది. పైగా మరో అయిదేళ్ళు అధికారంలో వుండే పార్టీ. మరో వైపు వైసీపీ ఆ రాష్ట్రంలో పాలక పక్షం కాకపోయినా ప్రధాన ప్రతిపక్షం. అక్కడి అధికార పార్టీ టీడీపీ మరో ఫ్రంటు యూపీఏతో కొత్త బంధం ఏర్పరచుకుంది. కాబట్టి ప్రధాన  ప్రతిపక్షాన్ని  ఫెడరల్ ఫ్రంట్ దిశగా ఆకర్షించే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోందని అనుకోవాలి.   ఇందులో రాజకీయం లేకపోలేదు, కానీ అది జాతీయ రాజకీయాలకు పరిమితం అని భేటీలో పాల్గొన్న నాయకులు చెప్పారు.
కానీ అసలు రాజకీయం అక్కడే, అప్పుడే మొదలయింది.
నాయకులు ఇరువురూ మీడియా ఎదుట మాట్లాడి వెనుతిరిగారో లేదో, వెనువెంటనే ఈ భేటీ భేరీలు అటు అమరావతిలో మోగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కేటీఆర్, జగన్ భేటీని తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా అడ్డుకుంటున్న టీఆర్ఎస్ తో జగన్ మోహన రెడ్డి దోస్తీ చేయడం ద్వారా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక అడుగు ముందుకు వేసి గతంలో కేసీఆర్ ఏయే సందర్భాలలో ఆంధ్రప్రజలను, వారి ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను, వంటకాలను సయితం వదలకుండా ఎలా కించపరుస్తూ వ్యాఖ్యలు చేసారో వాటినన్నిటినీ గుదిగుచ్చి ఒక పెద్ద జాబితా చదివారు. అంటే జగన్ తో కేటీఆర్ సమావేశం ముగియగానే ఎదురుదాడికి టీడీపీ శ్రేణులు సర్వ సంసిద్ధంగా ఉన్నాయనుకోవాలి. ఈ ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యలు వీటన్నిటి టీకా తాత్పర్యం ఒక్కటే.
‘ఆంద్ర ప్రదేశ్ ప్రయోజనాలకు టీఆర్ఎస్ ఆగర్భ శత్రువు. ఆ శత్రువుతో కలిసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు ప్రప్రధమ  శత్రువు’
అంటే ఏమన్నమాట. వై ఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగేలా వైరి పక్షంతో చేతులు కలుపుతున్నారు అని.
కొద్దికాలం క్రితం చంద్రబాబునాయుడు కేసీఆర్ కు స్నేహ హస్తం అందించాలని కోరుకున్నారు. కానీ ఆయన తిరస్కరించారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా వెల్లడించేదాకా బయట ప్రపంచానికి తెలియదు.
ఒకవేళ చంద్రబాబు కోరుకున్నట్టే టీడీపీ, టీఆర్ఎస్ కలయిక సాధ్యం అయిన పక్షంలో ఇప్పుడు మంత్రి ఉమామహేశ్వరరావు వాక్రుచ్చిన జాబితా యావత్తూ వైసీపీ వాళ్ళు పఠించేవారేమో! ఇక్కడ అన్ని పార్టీలు ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి. మీమీ ప్రయోజనాలకోసం మీకెలాగూ రాజకీయాలు చేయక తప్పదు. చేసుకోండి నిరభ్యంతరంగా. కానీ అందులో అటూ ఇటూ వున్న అమాయక ప్రజలని భాగం చేయకండి. వారి వేష భాషలను, ఆహార వ్యవహారాలను చిన్నబుచ్చే పద్దతిలో మాటల తూటాలు విసరకండి.
నిజానికి  కేటీఆర్, జగన్మోహనరెడ్డిని  కలిసింది జాతీయ స్థాయిలో ఎన్డీయే, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ అనే తృతీయ రాజకీయ కూటమి అవకాశాలు గురించి చర్చించడానికి. గతంలో ఇదే పనిమీద కేసీఆర్ పలు రాష్ట్రాలకు వెళ్లి వచ్చారు కూడా. అలాగే చంద్రబాబునాయుడు కూడా ఎన్డీయే కు వ్యతిరేకంగా, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే ప్రధాని మోడీని గద్దె దించే ధ్యేయంతో వివిధ రాష్ట్రాలకు వెళ్లి అనేక రాజకీయ పార్టీల అధినాయకులతో సంప్రదింపులు జరిపారు కూడా.  నిజానికి, కేటీఆర్, జగన్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటూ ఏమీ లేవు. కానీ  ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ. ప్రత్యర్ధులు ఒకచోట చేరితే అలక్ష్యం చేయరాదు అనే రాజ(కీయ)నీతి వారిచేత అలా మాట్లాడించి ఉండవచ్చు.  
టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు అన్నీ కొట్టివేయదగ్గవి కావు. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో వున్నప్పుడు ఆంధ్రులు, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజల మనసులు గాయపడిన మాట కూడా వాస్తవం. ఆ రకంగా వారికి టీఆర్ఎస్ అంటే ద్వేష భావం వుండిఉండొచ్చన్న భావన ఒకటుంది. అయితే హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు,  నిరుడు చివరాఖర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం చూసిన తర్వాత తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రుల మనసులు తేలికపడినట్టే భావించాలి.
అయితే, అటు ఆంధ్రప్రదేశ్ లో విభజన జరిగిన తీరు బాగాలేదని బాధపడేవారు, బాధ పడుతున్నవారు ఇప్పటికీ కానవస్తారు. అయితే వారి కోపం అల్లా అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మీద. ఆ కోపాన్ని గత ఎన్నికల్లోనే  వాళ్ళు తీర్చుకుని బేబాకీ చేసుకున్నారు.
కాకపొతే ఇప్పుడు కొత్తగా తెరమీదకు వచ్చిన అంశం ప్రత్యేక హోదా. ఒక్క బీజేపీని మినహాయిస్తే ఈ హోదా అంశాన్ని ఏ ఒక్క పార్టీ కూడా వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాగానే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదనే అని కాంగ్రెస్ అధినాయకులతో సహా బల్ల గుద్ది చెబుతున్నారు. కాంగ్రెస్ తో కొత్తగా చెలిమి చేస్తున్న టీడీపీ కూడా వారి హామీనే సమర్ధిస్తోంది. బీజేపీనా, కాంగ్రెసా అనేదానితో తమకు నిమిత్తం లేదనీ, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికే తమ మద్దతు అని వై.ఎస్.ఆర్.సి.పీ. అంటోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ధ్యేయం కూడా ప్రత్యేక హోదా సాధనే. రాష్ట్రంలోని అన్ని పార్టీలకి ఇదొకటే  లక్ష్యం. కానీ వాటన్నిటికీ  మరో ధ్యేయం వుంది. అది అధికారం. దానికోసం తాము గట్టిగా కోరుకుంటున్న ప్రత్యేకహోదా కోసం గట్టిగా గొంతులు కలపలేకపోతున్నాయి.
అందుకే ఇన్ని పిల్లిమొగ్గలు. ఇన్ని కొత్త స్నేహాలు. ఇన్నికొత్త  వ్యూహాలు. ఇన్ని ఎత్తులు, ఇన్ని పై ఎత్తులు.  
          

Discussion | KCR's Return Gift | Mamata Banerjee’s mega Kolkata rally t...





ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్   ఆంధ్రజ్యోతి  ఛానల్ 'పబ్లిక్ పాయింట్' ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్

Discussion | Home Minister Rajnath Singh AP Tour, Comments over AP Speci...





ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్   ఆంధ్రజ్యోతి  ఛానల్ 'పబ్లిక్ పాయింట్' ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్

18, జనవరి 2019, శుక్రవారం

కేటీఆర్ జగన్ కలవటం పవన్,బాబు లకు ప్లస్సా?-Bhandaru About YS Jagan Meets ...

పవన్ మద్దతుకై పార్టీ ల పాకులాట- Bhandaru Comments On Political Parties |...

స్మృతిపధంలో నందమూరి తారక రామారావు – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు జనవరి పద్దెనిమిది. ఎన్టీఆర్ వర్ధంతి. ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితం)
1984 సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. కొద్దిసేపు గడిచిందో లేదో వార్తలు చదివే వ్యక్తి "ఇప్పుడే అందిన వార్త" అంటూ ఒక సంచలన వార్తను వినిపించారు.
"గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ ఎన్టీ రామారావును ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించారు" ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాధించిన విజయ సమాచారం ఆనాటి రేడియో వార్త ద్వారా రాష్ట్రం నలుమూలలకు చేరిపోయింది. ఆరోజు హైదరాబాదు రాజభవన్ సెంట్రీ రూములోని ఫోనుద్వారా బెజవాడ రేడియో కేంద్రానికి ఈ వార్తను అందించింది నేనే. ఆ రోజు నావెంట నేటి తెలంగాణా సిఎంసీపీఆర్వో శ్రీ జ్వాలా నరసింహారావు కూడా వున్నారు.

అలాగే మరో జ్ఞాపకం.


ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.
ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.
ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు కూడా వచ్చారు.
లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి, ఖమ్మం సీపీఎం  ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా.  ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి కబురు వచ్చినట్టు వుంది.
ఆయన మాతో చెప్పారు.
రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. రాం కిషన్ రావు గారు,  మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని కాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త  అర్ధం చేసుకోండిఅని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?”

గండిపేటలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను గోడకు ఆనుకుని  నిలబడి వున్నాను. మరి కొద్ది నిమిషాల్లో సాయంత్రం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. నాకు టెన్షన్ పెరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ప్రసంగం అనర్ఘలంగా సాగుతోంది. పార్టీ  ప్రధాన కార్యదర్శి ఎవరన్నది  ఆరోజు  ప్రకటిస్తారు. సాయంత్రం వార్తల సమయం అయిపోయిందంటే ఇక  మరునాడు  ఉదయం విజయవాడ నుంచి వెలువడే వార్తల వరకు వేచి వుండాలి. పత్రికలు కూడా తెల్లవారినదాకా రావు. అందుకే రేడియో వార్తలకు, ముఖ్యంగా ఇప్పుడే అందిన వార్తలకుఅంత గిరాకీ.   ఆ రోజుల్లో గండిపేట నుంచి హైదరాబాదుకు డైరెక్టు టెలిఫోను సదుపాయం లేదు. ట్రంకాల్ బుక్ చేయాలి. అంత  వ్యవధానం లేదు. నేను నిలబడ్డ కాంపౌండ్ వాల్ వెనుక ఎన్టీఆర్ కుటీరం వుంది. ముఖ్యమంత్రి కాబట్టి  అందులో ఎస్టీడీ  సౌకర్యం వున్న ఫోను ఏర్పాటు చేసారు. అది ముందుగానే తెలుసుకుని, విలేకరుల వరుసలో కాకుండా ఆ గోడ దగ్గర కాచుకుని వున్నాను. ఇంతలో ఎన్టీఆర్ నోటినుంచి మన పార్టీ ప్రధాన కార్యదర్శిగా చం.....’  అనే మాట వినబడింది.  అంతే! నేను ఒక్క క్షణం వృధా చేయకుండా ఆ గోడ దూకేసాను. సెంట్రీ ఎవరు ఎవరని వెంటపడ్డాడు. లెక్కచేయకుండా లోపలకు దూరి వెళ్లి ఫోను తీసుకుని రేడియోకు ఫోను చేసాను. అవతల మా న్యూస్ ఎడిటర్ ఆకిరి రామకృష్ణా రావు, నా గొంతు విని ఎవరు?’ అని క్లుప్తంగా అడిగారు. నేను చంద్రబాబుఅని అంతే క్లుప్తంగా వగరుస్తూ చెప్పాను. మరునిమిషంలో టీడీపీ నూతన  ప్రధాన కార్యదర్శిగా శ్రీ చంద్రబాబునాయుడ్ని నియమించిన సమాచారం, ‘ఇప్పుడే అందిన వార్తగారాష్ట్రం నలుచెరగులకూ రేడియో ద్వారా చేరిపోయింది.
ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపివుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది కాదు. అదృష్టవశాత్తు దర్శన భాగ్యం లభించిన వాళ్ళు ఆయన కాళ్ళకు సాష్టాంగనమస్కారం చేసేవాళ్ళు. ఆయనకు ఓ అలవాటు ఉండేదని చెప్పుకునేవారు,  కాళ్ళమీద మీద పడిన వాళ్ళు తమంతట తాము లేవాలే కానీ ఆయన  లెమ్మని చెప్పేవాళ్ళు కాదని. పైగా కాళ్ళ మీద పడుతున్నవారిని వారించేవారు కాదు.
తెలుగు దేశం పార్టీ పెట్టి, తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, అఖండ విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఈ పాద నమస్కారాల ప్రహసనం కొనసాగింది. తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాళ్ళు పదిమంది  చూస్తున్నారని కూడా చూడకుండా బహిరంగంగానే ఆయనకు పాద నమస్కారాలు చేసేవాళ్ళు. ఇది ఎంతవరకు ముదిరింది అంటే బేగం పేట విమానాశ్రయంలో ఎన్టీఆర్ విమానం దిగివస్తున్నప్పుడు టార్ మాక్ మీదనే వాళ్ళు పోటీలు పడి ఆయన  కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుని మరీ పాద నమస్కారాలు చేయడం ఆ రోజుల్లో ఒక సంచలన వార్తగా మారింది. అది  ఇంతింతై, అంతింతై దేశం నలుమూలలకు పాకింది.
ఢిల్లీ నుంచి ఇల్లస్ట్రెటెడ్  వీక్లీ ఆఫ్ ఇండియా విలేకరి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేయడానికి హైదరాబాదు వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి ప్రధాన పౌరసంబంధాల అధికారిగా మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాల రావు పనిచేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన విలేకరికి తెల్లవారుఝామున నాలుగు గంటలకు టైం ఇచ్చారు. కొద్ది ముందుగానే ఆ విలేకరి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సరిగ్గా ఇచ్చిన టైముకల్లా,  కిర్రు చెప్పులు చప్పుడు చేస్తుండగా ఎన్టీఆర్ కిందికి దిగివచ్చారు. ఢిల్లీ విలేకరి కుర్చీ నుంచి లేచి ఎన్టీఆర్  పాదాలకు సాష్టాంగనమస్కారం చేసారు. చేసిన మనిషి లేవకుండా అలాగే కాసేపు వుండిపోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి కూర్చుని  నేను విన్నది నిజమే!అని అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం యధావిధిగా కొనసాగింది. అది వేరే సంగతి.
కొసమెరుపు ఏమిటంటే తరువాత చాలా రోజులకు ఆ పత్రిక ప్రచురించిన కధనం, ఈ పాద నమస్కారం ప్రహసనంతోనే మొదలవుతుంది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన గండిపేట నివాసంలో శవపూజలుచేస్తున్నారన్న వదంతులు వ్యాపించాయి. వాటిని తిప్పి కొట్టడానికి హైదరాబాదు నుంచి కొందరు విలేకరులను (అప్పుడు గండిపేట దూరమే అనిపించేలా వుండేది) అక్కడికి తీసుకు వెళ్ళారు. రామారావు గారు స్వయంగా విలేకరులను వెంటబెట్టుకుని ఆశ్రమంలో ఆణువణువూ చూపించారు. ఆ సందర్భంలో నేను అడిగితే రెడియోకోసం కాసేపు మాట్లాడారు. ఆశ్రమం వెలుపల ఒక చప్టా లాంటి దానిమీద ఎన్టీఆర్ బాసింపట్టు వేసుకు కూర్చున్నారు. ఆయన ముందు టేప్ రికార్డర్ వుంచి నేను పక్కగా ఆ చప్టా మీదనే కూర్చున్నాను. ఈ సన్నివేశాన్ని మిత్రుడు జీఎస్ రాధాకృష్ణ (అప్పుడు వీక్ఇంగ్లీష్ వార పత్రిక కరస్పాండెంటు) ఫోటో తీసి ఇచ్చాడు. నేను మాస్కో వెళ్లి వచ్చేవరకు అది భద్రంగానే వుంది. కానీ ఆ తరవాత అనేక అద్దె ఇళ్ళు మారే క్రమంలో ఆ విలువైన ఫోటో పోగొట్టుకున్నాను.
ఇక రేడియోకి, రామారావు గారికీ నడుమ సాగిన ఒక వివాదం చెప్పి ముగిస్తాను.
ముప్పయి అయిదేళ్ళ క్రితంసంగతి
టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల దరిమిలా రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ పాలన మొదలయింది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వుండడంతో రాజకీయ క్రీనీడలు అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియో, దూరదర్శన్ ల మీద కూడా పడ్డాయి. ఆ రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని అనావృష్టి ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు, ప్రెస్ మీట్ పెట్టి రేడియో, దూరదర్శన్ లకు కూడా కబురు పంపారు. కరవు ప్రాంతాలలో ప్రభుత్వం తీసుకునే చర్యలు గురించి ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని రికార్డ్ చేసి సందేశం రూపంలో ప్రసారం చేయాలని కోరారు.
ఆబిడ్స్ లోని ముఖ్యమంత్రి నివాసాన్ని చేరుకున్న మా సిబ్బంది రికార్డింగ్ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగివచ్చారు. ముఖ్యమంత్రి  ప్రధాన పౌర సంబంధ అధికారిగా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు తయారు చేసిన సందేశం ప్రతిని ఆమూలాగ్రం ఓ మారు తిరగేసి, తాము సిద్ధం అన్నట్టు తలపంకించారు. రికార్డింగు మొదలయింది.
"ప్రియమైన రాష్ట్ర ప్రజలారా!..." అని ప్రసంగం ప్రారంభించారు. అదే స్పీడులో కొనసాగుతుందని అంతా అనుకున్నాం. కానీ ఆయన హఠాత్తుగా ఆపి, 'కట్ వన్ - టేక్ టు' అన్నారు. మా వాళ్ళు రికార్డింగు ఆపేశారు. వందల సినిమాల్లో అనర్ఘళంగా డైలాగులు చెప్పిన అనుభవం ఆయనది. ఏ పదాన్ని ఎక్కడ వొత్తి పలకాలో, ఏ వాక్యాన్ని ఎక్కడ విరిచి చెప్పాలో ఆయనకు కొట్టిన పిండి. కానీ, ఇక్కడే ఎదురయింది మాకు వూహించని, ఆ మాటకు వస్తే అంతవరకూ అనుభవంలో లేని ఇబ్బంది. ఈ కట్లు, టేకుల విషయం తెలియకుండా రికార్దింగుకు రావడం వల్ల, తెచ్చిన టేపులు సరిపోలేదు. ఆఘమేఘాల మీద పంపించి స్టూడియో నుంచి అదనపు టేపులు తెప్పించి రికార్డింగు ముగించామనిపించారు.
అసలు కధ స్టూడియోకు చేరిన తర్వాత మొదలయింది. ఏ టేపు విన్నా కట్లూ, టేకులూ అన్న రామారావుగారి స్వరమే. ఆరాత్రే ప్రసారం కావాల్సి వుండడంతో సిబ్బంది అంతా టెన్షన్ కు గురయ్యారు. సీ ఎం గారి మొదటి ప్రసంగం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమీషనర్ (పూర్వాశ్రమంలో తపాలా శాఖ డైరెక్టర్) సైదులు గారు, డైరెక్టర్ సీ,వీ, నరసింహారెడ్డి గారు అంతసేపూ మాతోపాటే రేడియో డబ్బింగు గదిలోనే వుండిపోయారు. కట్లూ టేకుల మధ్య వున్న ముఖ్యమంత్రిగారి సందేశాన్ని మా వాళ్లు కష్టపడి మాస్టర్ టేపు మీదకు ఎక్కించి డబ్బింగు పని పూర్తి చేసి ప్రసారం నిమిత్తం అనౌన్సర్ కి అప్పగించి వూపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, డబ్బింగు పూర్తయిన తరువాత చూసుకుంటే మాకెంత నిడివి అవసరమో ముఖ్యమంత్రి సందేశం అంతే వ్యవధికి అతికినట్టు ఖచ్చితంగా సరిపోయింది.
దటీజ్ ఎన్టీఆర్.
అయితే ఈ ఉదంతం ఎంతగా చిలవలు పలవలు వేసిందంటే ఒక దశలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన వివాద స్థాయికి చేరుకుని ఆ పిదప అలాగే చల్లారిపోయింది.
LINK:

http://epaper.prabhanews.com/c/35869697?fbclid=IwAR3EP9Ygq91VVKfmaE3kgmZbv3CBnfKvrrM-3UASR41PZfmBAzgivFMLZDw


17, జనవరి 2019, గురువారం

The Fourth Estate | జగన్ ను చూసి వణికిపోతున్న చంద్రబాబు - 17th January 2019





ప్రతి గురువారం మాదిరిగానే ఈ రాత్రి సాక్షి టీవీ  అమర్స్  ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ జీవన్ రెడ్డి (టీఆర్ ఎస్), శ్రీ రామ శర్మ (కాంగ్రెస్), శ్రీ విష్ణు (వైసీపీ), శ్రీ రమేష్ నాయుడు (బీజేపీ)