9, జనవరి 2015, శుక్రవారం

బుడగలు పగిలిపోతాయి జాగ్రత్త!

(Published by 'SURYA' telugu daily on 11-01-2015, SUNDAY)
అర్ధం అయినట్టు అనిపిస్తూ  అర్ధం కానిది అర్ధ శాస్త్రం అన్నాడొక అర్ధ శాస్త్రవేత్త.
చిన్నప్పుడు చందమామ పత్రికలో  సిందుబాద్ యాత్రలు అనే సీరియల్ కధలు వచ్చేవి. వ్యాపారం నిమిత్తం ఆయన పడవలనిండా సరుకులు నింపుకుని విదేశాలకు వెళ్ళి, బోలెడు బోలెడు  లాభాలు గడించి స్వదేశానికి తిరిగి వస్తుండగా సముద్రంలో చెలరేగిన తుపాను కారణంగా వోడ మునిగిపోయి సర్వస్వం కోల్పోవడం,  అతగాడు మాత్రం పట్టు వదలని  విక్రమార్కుడి మాదిరిగా  మొక్కవోని ధైర్యంతో మళ్ళీ మళ్ళీ ప్రయాణాలు చేసి, మళ్ళీ మళ్ళీ వ్యాపారాలు చేసి  పోయిన సిరిసంపదలనన్నింటినీ తిరిగి  కూడగట్టుకోవడం, తిరిగి వోడలు మునిగిపోయో, సముద్రపు దొంగల పాలయ్యో సంపాదించిన సంపాదననంతా పోగొట్టుకుంటూ,  తిరిగి కూడగట్టుకుంటూ -    ఇలా వొళ్ళు గగుర్పొడిచే సంఘటనలతో ఆ కధలు సాగిపోయేవి. చదవడానికి ఎంతో  బాగుండేవి కాని, ఎక్కడో సముద్రంలో తుపానులు వస్తే సిందుబాదు అనే పెద్ద వ్యాపారి వున్నట్టుండి బికారి కావడం ఎందుకో ఏమిటో  చిన్న బుర్రలకు అర్ధం అయ్యేవి కావు.
గత  మంగళవారం. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి అమంగళవారం.  సుమారు మూడులక్షల కోట్ల రూపాయల మదుపర్ల  సొమ్ము  ఒక్క రోజులో ఆవిరి అయిపోయిందని  తెల్లారి పత్రికల్లో కధనాలు. ఇంత డబ్బు ఒకే ఒక్క రోజులో పోగొట్టుకోవడానికి వాళ్లు ధర్మరాజులా పాచికల జూదం ఆడలేదు. గుర్రప్పందాల జోలికి పోలేదు.  మరి యెందుకు పోయినట్టు అంత డబ్బు.
కారణం విన్నప్పుడు  సిందుబాదు కధ జ్ఞాపకం వచ్చింది.
ఎక్కడో యూరోపు ఖండంలోని గ్రీసు దేశంలో చెలరేగిన  రాజకీయ సంక్షోభం, మనదేశంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి దారితీసింది (ట). మన దేశంతో పోలిస్తే చాలా చాలా చిన్న దేశం అది.  మొత్తం గ్రీసు దేశపు జనాభా   కోటీ పదిలక్షలు అంటే అర్ధం చేసుకోవచ్చు అదెంత చిన్నదో. సరే.  దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గడం కూడా మన దేశంలో మార్కెట్ ప్రతికూలతలకు దోహదపడ్డాయి. ఏమైతేనేం, లక్షలాదిమంది సిందుబాదులు షేర్ మార్కెట్లో 'బేర్ల' చెలగాటంతో బావురుమన్నారు.
మన దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యేంత వరకు జనంలో షేర్లు గురించి తెలిసిన వాళ్ళు తక్కువ. పత్రికల్లో కూడా వాటికి ప్రాధాన్యం అంతగా వుండేది కాదు. తెలుగు పత్రికలయితే కేవలం మొక్కుబడిగా తప్పదు అన్నట్టు షేర్ల హెచ్చుతగ్గులకు సంబంధించిన సమాచారం అరకొరగా ఇచ్చేవి. ప్రజలు కూడా అవి తమకు సంబంధించినవి కావు, ఎవరో కలిగినవాళ్ళ వ్యవహారమని అసలు పట్టించుకునే వారు కాదు. కానీ క్రమంగా జనంలో అవగాహన పెరిగింది. పల్లెటూళ్ళలో సయితం 'షేర్ బ్రోకర్లు' పుట్టుకొచ్చారు. తక్కువ మదుపు సమయంలో ఎక్కువ  ఆదాయం ఇచ్చే కల్పవృక్షంగా షేర్ మార్కెట్ జనం దృష్టిలో కనబడసాగింది. ఈ క్రమంలో కొందరేమో  కోట్లకు పడగలెత్తారు. చాలామంది వున్నది పోగొట్టుకుని బజారున పడ్డారు.  

షేర్ మార్కెట్లు కుప్పకూలడం ఇది మొదటి సారీ కాదు. అల్లా అని ఆఖరుసారి కాదు. బాగా అభివృద్ధిచెందిన దేశాల్లో కూడా షేర్ మార్కెట్లు ఢమాల్ అన్న సందర్భాలు చాలా చాలా వున్నాయి.
షేర్ మార్కెట్ అంటేనే ఒక రకంగా పెట్టుబళ్ళ మార్కెట్. పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టక్కరలేదు. మన దగ్గర డబ్బుంటే పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లు కొని పెట్టుబళ్ళు పెట్టొచ్చు. ధర పెరిగినప్పుడు వాటిని అమ్ముకోవచ్చు. ఇలా కొంటూ, అమ్ముతూ లాభాలు కళ్ళ చూడవచ్చు. ఈ ఆశే జనాలను షేర్ మార్కెట్ వైపు పరుగులు తీయిస్తుంటుంది. ఒక్క షేర్లే కాదు రియల్ ఎస్టేట్ కూడా పెట్టుబళ్ళకు పెద్ద  కార్య క్షేత్రంగా  మారింది.
గత రెండు దశాబ్దాలుగా  జనాలను ఇంతగా వెర్రెత్తె౦చిన రంగం మరోటిలేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి ముందు హైదరాబాదు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విస్తరించింది. వేలల్లో వున్న భూముల ధరలు లక్షల్లోకి, ఆ తరువాత కోట్లల్లోకి ఎగబాకి 'మట్టే బంగారం' అనే మాట  నిజమై కూర్చుంది. ఆర్ధిక సంస్కరణల ప్రభావం, ఐ.టీ. రంగం విస్తరణ ఇందుకు దోహదం చేసాయి. చిన్న చిన్నగా  ఈ రంగంలోకి దిగినవాళ్ళలో అనేకులు చూస్తుండగానే కోటీశ్వరులు కావడంతో అందరి కళ్ళు రియల్ ఎస్టేట్ పై పడ్డాయి. లాభాలు ఇబ్బడిముబ్బడిగా వస్తుండడంతో వాటితో పాటే సకల అవలక్షణాలు సమాజంలోకి వచ్చిపడ్డాయి. రియల్ ఎస్టేట్ దందాలు పెరిగాయి. నేర ప్రవృత్తి కొత్త మొగ్గలు వేసింది. యెంత సంపాదించారు అన్న దానికే కాని ఎలా సంపాదించారు అన్నదానికి విలువ లేకుండా పోయింది.  వ్యాపారం పెరిగిన స్థాయిలోనే, అంతే  వేగంగా నైతిక విలువల పతనం కూడా అదే జోరులో సాగింది.
రాష్ట్ర విభజన అనంతరం  రియల్ ఎస్టేట్ రంగానికి కాస్త కళ్ళెం పడుతుందని ఆశించారు కాని, మనిషి నెత్తురు మరిగిన పులి మల్లే వ్యాపారులు ఒక ముఠా మాదిరిగా మారి చిన్నదో పెద్దదో ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలనే సామాన్యుల ఆశలపై నీళ్ళు చల్లారు. ఇప్పుడీ వ్యాపారం ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంగా ప్రకటించిన తుళ్ళూరు ప్రాంతం  వైపు మళ్ళింది. పలానా చోట అని స్థల నిర్ధారణ  ఇంకా జరగలేదు కాని ఆ ప్రాంతంలో  భూముల వ్యాపారం మాత్రం తారాస్థాయికి చేరింది. భూయజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నడుమ లావాదేవీలు జరిపే దళారులు పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చారు. మొన్నమొన్నటివరకు బయట వ్యక్తులు ఎవరూ తొంగి చూడని ఆ ప్రాంతంలో ఇప్పుడు ఖరీదయిన కార్లు  సంచారం చేస్తున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాలలోని హోటళ్ళు ఈ బేహారులతో నిండిపోతున్నాయి. ఎక్కడ నలుగురు  కలిసినా, ఎక్కడ విన్నా భూముల ధరవరలు గురించిన ముచ్చట్లే. కోట్లకు పెరిగిన భూముల ధరలు గురించిన కబుర్లే.
'పచ్చని పొలాలను అమ్ముకుని నెలవారీ ఆదాయం కోసం ఎదురుచూస్తున్నారా? ప్రతినెలా పదివేలనుంచి పది లక్షల రూపాయల అద్దె వచ్చే బిల్డింగులు అమ్మకానికి వున్నా'యంటూ  ఊరించే ప్రకటనలు ఫ్లెక్సీల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే, ఈ వార్తా కధనాలు చదువుతుంటే ఎప్పుడో తాతలనాడు  అమెరికాలో సంభవించిన 'పేలిన బుడగ' వృత్తాంతం స్పురణకు వస్తోంది.
దాదాపు వందేళ్ళ నాటి  చరిత్ర. అమెరికా అప్పటికే సంపన్న దేశం. తూర్పున వున్న న్యూ యార్క్ వంటి ప్రాంతాలు అభివృద్ధిపధంలో  తులతూగుతున్న రోజులు.. పౌరుల ఆదాయం బాగా పెరగడంతో వారికి ఉల్లాస జీవితం మీద మక్కువ పెరిగింది. మిగులు డబ్బులతో విహార యాత్రలు మొదలు పెట్టారు. అలాటివారికి  వాతావరణ రీత్యా ఫ్లారిడా ప్రాంతం చాలా అనువయినదిగా కనబడింది. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడంతో ఒకప్పుడు నిద్రాణంగా వున్న ప్రాంతం కళకళలాడసాగింది. పర్యాటకులకు కావాల్సిన హోటళ్ళు, ఇతర సదుపాయాలు కల్పించడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడికి ఎగబడ్డారు. చౌకగా భూములు దొరకడం వారికి మొదట్లో కలిసివచ్చింది. క్రమంగా డిమాండు పెరగడం, డానికి తగ్గట్టుగా వ్యాపారుల్లో పోటీ పెరగడం, దానాదీనా భూముల రేట్లకు రెక్కలు రావడం స్వాభావికంగా జరిగిపోయింది.


ఆ ప్రాంతంలో వున్న మియామీ బీచ్ పర్యాటకులకు స్వర్గధామం అనే పేరు తెచ్చుకుంది. దేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను ఆ ప్రాంతంపై  పడింది. న్యూ యార్క్ లోని టైం స్క్వేర్ లో కళ్ళు మిరుమిట్లు కొలిపే విద్యుత్ కాంతులతో ఒక పెద్ద ప్రకటన  బోర్డు వెలిసింది. 'జూన్ నెలలో మియామీ చూడనివాళ్ళ  జీవితం వ్యర్ధం' అని అర్ధం వచ్చే భారీ  ప్రకటనలతో ఆకర్షితులయిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్ళడం మొదలయింది. కేవలం ఊహాగానాల ప్రాతిపదికగా అక్కడ  భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పర్యాటకులకు అవసరమయ్యే సకల  సంబారాలు సరఫరా  చేయడానికి దేశం నలుమూలలనుంచి రైలు రోడ్డు మార్గాల ద్వారా  సరుకులను అక్కడికి తరలించేవారు. ఒకానొక సమయంలో ఈ రద్దీ  ఎంతగా పెరిగిపోయిందంటే,  రైళ్ళ రాకపోకలు స్తంభించిపోయే పరిస్తితి ఏర్పడింది. అయిదేళ్ళలో మొత్తం  పూర్తిగా తిరగబడింది. ఊహాగానాలు గాలికి ఎగిరిపోయాయి, అంచనాలు  తప్పిపోయాయి. ఫోర్బెస్ మ్యాగజిన్  ముందుగానే హెచ్చరించింది కానీ,  అప్పటికే  పరిస్తితులు చేయి దాటిపోయాయి. భూముల వాస్తవ ధరలు గురించి ఆలోచించకుండా కేవలం వ్యాపారుల అంచనాలను బట్టి ధరలను పెంచుకుంటూ పోవడం వల్ల మార్కెట్ తలకిందయిపోయింది. మియామీలో భూముల్ని కొని ఒక్క రోజులోనే  పదిరెట్ల లాభానికి అమ్ముకోవచ్చనే ఆశలు అడుగంటాయి. వీటికి తోడు,  ఆ ప్రాంతంలో వచ్చిన హరికేన్ తో పరిస్తితులు పెనం  మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా తయారయాయి. పులిమీద పుట్ర మాదిరిగా  వాల్ స్ట్రీట్ షేర్ మార్కెట్  కుప్పకూలడంతో ఫ్లారిడా ఆర్ధిక పతనం సంపూర్ణమయింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఫ్లారిడాకు కొన్ని దశాబ్దాలు పట్టింది.
ఇది చరిత్ర.  పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. అంతే చెప్పేది.

(09-01-2015)

బొమ్మను చేసీ ప్రాణము పోసీ....


బ్రహ్మగారు సత్యలోకంలో బాసింపట్టు వేసుకుని,  రేడియో వింటూ చేసే వంట లాగా, అర్ధాంగి వీణావాణి చెబుతున్నవిదంగా సృష్టి కార్యం పూర్తి చేస్తున్నారు.
'అందం అరవై దోసిళ్ళు' అన్నది సరస్వతి.
అక్షరాలా అరవై దోసిళ్ళు  అందం కొలిచి పోశాడు విధాత.
'సౌకుమార్యం పాతిక గుప్పిళ్ళు' అన్నది సరస్వతమ్మ.
'తధాస్తు' అన్నాడు బ్రహ్మలుంగారు.
'అమ్మతనం అరవై,  ఆత్మబలం ఆరు, అహంకారం మరో ఆరు. వినయం అయిదు, అణకువ ఆరు, మేధస్సు ముప్పై , మానసిక బలహీనతలు నలభై దోసిళ్ళు,  శారీరకబలం కూరలో లవణం మాదిరిగా తగినంత.' చెప్పుకుంటూ పోతోంది చదువుల తల్లి. విధాత వింటూ మరో చేత్తో  ఆ బొమ్మకు మెరుగులు దిద్దుతున్నాడు.


బొమ్మ పూర్తయింది. దాని అందం చందం చూసి హాటకగర్భురాణికే మతిపోయింది. ఇంత సౌందర్యం,  ఇన్ని తెలివితేటలు, అమ్మో ఇంకేమైనా వుందా అని గాభరా పడిపోయింది.
భార్య కంగారు చూసి బ్రహ్మ తన బోసి నోళ్ళతో ముసి ముసి నవ్వులు  నవ్వాడు. నవ్వి చెప్పాడు.
"నువ్వు పాళ్ళు చెబుతున్నప్పుడే అనుమానం వచ్చింది. కొన్ని శృతిమించుతున్నాయేమో అనికూడా అనిపించింది. అదీ మంచిదేలే,  సరే పోనీలే అనుకున్నాను. ఎందుకంటావా? శారీరక బలం వంటలో లవణం మాదిరిగా తగినంత అన్నావు. దానికి ఇన్ని పాళ్ళు అని చెప్పలేదు. ఉజ్జాయింపుగా కొలిచివేసేటప్పుడు కొంత తభావతు తధ్యం. ఇక మానసిక బలహీనతలు ఏకంగా ఎక్కువే పెట్టావు. పాళ్ళు ఎక్కువైనా కష్టమే అన్న సూత్రం నువ్వు పట్టించుకోలేదు. వంటకం పూర్తయింది. ఇక రుచి అంటావా. వేసే దినుసుల పాళ్ళని బట్టి వుంటుంది. అలాగే,  ఈ బొమ్మ బతుకూ అంతే.   తెలివితేటలు, బలాబలాలు, మేధస్సు యేది తీసుకున్నా ఎవరికీ తీసిపోని మాట నిజమే. కానీ పాళ్ళలోనే తేడా. అందువల్లే ఈ విషయాల్లో ఒక   స్త్రీకి మరో స్త్రీకీ ఎంతో తేడా. దండలో దారంలాగా అమ్మతనం ఒక్కటే ఆడవారందరికీ ఉమ్మడి ఆభరణం. అదొక్కటే ప్రపంచానికి కూడా  పెద్దదిక్కు, ఆ గౌరవంతోనే సరిపుచ్చుకుని మిగిలిన అన్నింటినీ తేలిగ్గా మరచిపోతుంది.  ఈ పుత్తడి  బొమ్మకు నేనిస్తున్న అదనపు వరం ఇదొక్కటే!'   

NOTE : Courtesy Image Owner

8, జనవరి 2015, గురువారం

ఫుడ్ సెక్యూరిటీ


క్లాసు జరుగుతోంది. ప్రొఫెసర్ అడిగాడు, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏమిటో తెలుసా అని.
ఠక్కున జవాబు వచ్చింది.
‘తెలియకేం. అందరికీ ఆహారం. ఈ దేశంలో ఎవ్వరూ ఆకలితో కడుపులో కాళ్ళు పెట్టుకుని నిద్రించే పరిస్తితి లేకుండా చేయడం'   
సమాధానం విన్న ప్రొఫెసర్ గారు విద్యార్ధులకు ఓ పరీక్ష పెట్టాడు. దానితో పాటు ఒక నిబంధన కూడా.
అదేమిటంటే – అందరూ పరీక్ష రాస్తారు. కానీ అందరికీ వచ్చిన మార్కులను కూడి సగటు తీసి విద్యార్ధులకు  గ్రేడ్లు ఇస్తారు.
సరే. అంతా పరీక్ష రాశారు. బాగా చదివిన  వాళ్లు బాగా రాశారు. చదవని వాళ్లు అందుకు తగ్గట్టే జవాబులు రాశారు. ప్రొఫెసర్ గారు వాళ్ల మార్కుల సగటు తీసి అందరికీ ‘బీ’ గ్రేడ్ ఇచ్చారు. చదవని వాళ్లు సంతోషించారు. బాగా చదివే వాళ్లు  చిన్నబుచ్చుకున్నారు.
కొన్నాళ్ళు జరిగాయి. మళ్ళీ పరీక్ష పెట్టారు. ఈ సారి బాగా చదివేవాళ్ళు కూడా చదువుపై శ్రద్ధ పెట్టలేదు. వాళ్లను  నిర్వేదం అవహించింది, ‘చదివేం లాభం. యెట్లాగు వచ్చేవి సగటు మార్కులే’ కదా అని.
కాస్తో కూస్తో చదివేవాళ్ళు, అస్సలు చదవని వాళ్లు ఆ కాస్త కూడా చదవడం మానేశారు. ఎందుకంటే చదవకపోయినా మంచి గ్రేడే వస్తోంది. ఇక కష్టపడాల్సిన పనేముంది.
ఈసారీ  అందరికి  తక్కువ గ్రేడే వచ్చింది.
తరువాత తరువాత ఏం జరిగిందో చెప్పనక్కర లేదు. బాగా కష్టపడి చదివేవాళ్లు చదవడం పూర్తిగా మానేశారు.
చదవని వాళ్లకు ఏం పట్టలేదు. ఎందుకంటే వాళ్లకు పోయేదేమీ లేదు.
ఎంతో మంచి కాలేజీ అని పేరుపడ్డ ఆ కాలేజీలో ఎన్నడూ కనీవినీ ఎరుగని  విధంగా క్లాసు మొత్తం పరీక్షలో తప్పింది.


ప్రతి కధకు ఒక నీతి వుండాలి కదా!
అదే ఇది.
‘కొందరికే అన్నీ కాకుండా అందరికీ అన్నీ’ అనే విధానం మెచ్చతగిందే.
కాలే కడుపుకి ఇంత అన్నం పెట్టడాన్ని మించిన ధర్మం ఏముంటుంది ?
కానీ,
మళ్ళీ ఈ కాణీలు అర్ధణాలు ఏమిటంటారా ? 
అందరికీ పంచడం అంటే  కొందరి నుంచి తీసుకోవడం కాదు.
సోమరితనాన్ని పెంచడం అంతకంటే కాదు.
అన్ని అవతారాలు ఎత్తిన భగవంతుడు కూడా అవతారానికి తగ్గట్టే నడుచుకున్నాడు.
ఆర్ధికవేత్తలు రాజకీయ సలహాదారుల అవతారాలు ఎత్తినప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
అంచేత చెప్పేదేమిటంటే,  ప్రతిదీ శాస్త్రంతో ముడిపెట్టి చూడకూడదు.

NOTE: Courtesy Image Owner 

7, జనవరి 2015, బుధవారం

అర్ధం కానిది అర్ధశాస్త్రం


అర్ధం అయినట్టు అనిపిస్తూ  అర్ధం కానిది అర్ధ శాస్త్రం అన్నాడొక 'అర్ధ' శాస్త్రవేత్త.
చిన్నప్పుడు చందమామ పత్రికలో  సిందుబాద్ యాత్రలు అనే సీరియల్ కధలు వచ్చేవి. వ్యాపారం నిమిత్తం ఆయన పడవలనిండా సరుకులు నింపుకుని విదేశాలకు వెళ్ళి, వాటిని  అమ్మి బోలెడు లాభాలు గడించి స్వదేశానికి తిరిగి వస్తుండగా సముద్రంలో చెలరేగిన తుపాను కారణంగా ఓడ మునిగిపోయి  సర్వస్వం కోల్పోవడం, అతగాడు మాత్రం మొక్కవోని ధైర్యంతో మళ్ళీ మళ్ళీ ప్రయాణాలు చేసి, మళ్ళీ మళ్ళీ వ్యాపారాలు చేసి  పోయిన సిరిసంపదలన్నింటినీ తిరిగి  కూడగట్టుకోవడం, తిరిగి ఓడలు మునిగిపోయో, సముద్రపు దొంగల పాలయ్యో సంపాదించిన సంపాదనంతా పోగొట్టుకుంటూ, తిరిగి కూడగట్టుకుంటూ  ఇలా ఇలా  వొళ్ళు గగుర్పొడిచే సంఘటనలతో ఆ కధలు అలా అలా  సాగిపోయేవి. చదవడానికి బాగుండేవి కాని, ఎక్కడో సముద్రంలో తుపానులు వస్తే సిందుబాదు బికారి కావడం ఎందుకో చిన్న బుర్రలకు అర్ధం అయ్యేవి కావు.
నిన్న మంగళవారం. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి అమంగళవారం. సుమారు మూడులక్షల కోట్ల రూపాయల మదుపర్ల డబ్బు  ఒక్క రోజులో ఆవిరి అయిపోయిందని  తెల్లారి పత్రికల్లో కధనాలు. ఇంత డబ్బు ఒకేఒక్క రోజులో పోగొట్టుకోవడానికి వాళ్లు ధర్మరాజు మాదిరిగా  పాచికల జూదం ఆడలేదు. గుర్రప్పందాలు ఆడలేదు. మరి యెందుకు పోయినట్టు అంత డబ్బు.
కారణం వింటే సిందుబాదు కధ జ్ఞాపకం వచ్చింది.
ఎక్కడో యూరోపు ఖండంలోని గ్రీసు దేశంలో చెలరేగిన  రాజకీయ సంక్షోభం, మనదేశంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి దారితీసింది (ట). మన దేశంతో పోలిస్తే చాలా చాలా చిన్న దేశం అది.  మొత్తం గ్రీసు దేశపు జనాభా   కోటీ పదిలక్షలు అంటే అర్ధం చేసుకోవచ్చు అదెంత చిన్నదో. సరే.  దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గడం కూడా మన దేశంలో మార్కెట్ ప్రతికూలతలకు దోహదపడ్డాయి. ఏమైతేనేం, లక్షలాదిమంది సిందుబాదులు షేర్ మార్కెట్లో 'బేర్ల' చెలగాటంతో అతలాకుతలం అయిపోయారు.


ఈ షేర్లేమిటో, బేర్లేమిటో తెలియని మాబోంట్లు ఆ వార్తలు చదువుతూ పాత చందమామ కధలు జ్ఞాపకం చేసుకున్నారు.
నీతి: డబ్బుతో ఆటలు ఆడరాదు

కార్టూన్ 'ఈనాడు' సౌజన్యంతో 

దిల్ మాంగే మోర్



రాజుగారు ఉద్యానవనంలో వాహ్యాళి ముగించుకుని తిరిగి రాజప్రాసాదంలో అడుగిడే ముందు అతడు వున్నట్టుండి ఎదురుపడ్డాడు. చూడబోతే బిక్షగాడి మాదిరిగా వున్నాడు. బాగా  ఉల్లాసంగా వున్న రాజుగారికి ఆ క్షణంలో అతగాడికి ఏదయినా  సాయం చేయాలని అనిపించింది.
ఏం కావాలి నీకు ? కోరుకో! ఏదయినా సరే ఇస్తాను అన్నాడు రాజుగారు రాజసం వొలక బోస్తూ.
రాజా! తొందరపడి అలా అనకు. అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో
అలా ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. కానీ, అతడు అల్లాటప్పా రాజు కాదు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాడు. అరివీరభయంకరులయిన శత్రురాజులను మట్టికరిపించి సువిశాల సామ్రాజ్యం నిర్మించుకున్న మహా చక్రవర్తి. అలాటి వాడు,  ‘కోరుకో ఇస్తాను అంటే ఆలోచించుకో అనే మనిషి మామూలువాడు అయివుండడు
అలా ఆలోచించుకున్న రాజు అన్నాడు అతడితో.
పరవాలేదు అడుగు. సంశయించాల్సిన పనిలేదు. ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటావంటా లేదు.
సరే! రాజా! చూసారుగా నా చేతిలోని ఈ బిక్షాపాత్ర. ఇందులో ఏం వేస్తారో వేయండి. దీన్ని నింపండి. నాకంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి
రాజు విలాసంగా నవ్వాడు. నవ్వి అన్నాడు.
ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం వుందనుకోను
రాజు అతడిని వెంటబెట్టుకుని రాజ ప్రాసాదంలోకి తీసుకువెళ్ళాడు. పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు.   
కృష్ణ తులాభారం  మాదిరిగా సన్నివేశం  మారిపోయింది. ఒకటికి రెండుసార్లు యెందుకు ఆలోచించుకోమన్నాడో రాజుకు క్రమంగా అవగతమవుతోంది. ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని వేసినా ఇట్టే అదృశ్యం అయిపోతున్నాయి. ఆ బిక్షాపాత్ర తిరిగి ఖాళీ అవుతూనే వుంది.
రాజదర్బారులో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
ఖజానాలోని సమస్త ధనరాసులు, స్వర్ణాభరణాలను  భటులు గంపలకొద్దీ  తెచ్చి ఆ బిక్షాపాత్రలో వేస్తున్నారు. చిత్రం! వేసినవి వేసినట్టే మాయం అవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే వుంది.
రాజుగారిలో పట్టుదల పెరిగింది. ముందూ వెనకా చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశాడు. ఫలితం శూన్యం.
చివరకి జరిగినదేమిటంటే సాయంత్రానికల్లా రాజ దర్బారులో ఇద్దరు బిక్షగాళ్ళు మిగిలారు.
ఒకడు ఆ వచ్చినవాడు. రెండోవాడు రాజుగారు.
సర్వం పోగొట్టుకున్న తరువాతగాని రాజుకు గర్వం దిగిరాలేదు. ఆగంతకుడి ముందు సాగిలపడి అన్నాడు.
మహానుభావా! నా అహంకారాన్ని మన్నించండి. నేను మీమాట పెడచెవిన పెట్టాను. ఇంతకీ ఈ బిక్షాపాత్ర సంగతి చెప్పండి. ఇందులోని మర్మం ఏమిటో సెలవివ్వండి
ఆగంతకుడు రాజును మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేసాడు.
రాజా! నిజానికి ఇది బిక్షాపాత్ర కాదు. మానవ కపాలం. నేను దాన్ని మెరుగు పెట్టి పాత్ర మాదిరిగా కనబడేట్టు చేసాను. ఇందులో ఎన్ని వేసినా, ఏం వేసినా అంతే! ఏమీ మిగలదు.  అధికారం, సిరి సంపదలు ఎన్ని వున్నా ఇది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. దీని ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు. యెంత ఇచ్చినా కాదనదు. మనుషులకు, ఈ ఆశ అనండి, అత్యాశ అనండి, దురాశ అనండి -  కాటికి పోయినదాకా అది వాళ్ల వెంటే వుంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికే ఇదంతా
రాజుకు తత్వం బోధపడగానే మాయమయిన ధనరాసులు, సిరి సంపదలు ఆయనకు  మళ్ళీ దక్కాయి. అంతేకాదు, వాటికి అదనంగా ఒక  జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది.
దిల్ మాంగే మోర్’ 



(ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం & Courtesy Image Owner)

6, జనవరి 2015, మంగళవారం

డస్ట్ బిన్


ఖరీదయిన మద్యం సీసాకు ఓ కరెన్సీ నోటు తారసపడింది.మద్యం సీసా కరెన్సీ నోటుతో అంది.
‘ఏం చూసుకుని నీకా మిడిసిపాటు? నువ్వొక కాగితం ముక్కవి. ఇంకా చెప్పాలంటే  నాతో  పోలిస్తే  ఎందుకూ పనికిరాని  చిత్తు కాగితానివి.’
కరెన్సీ నోటు తాపీగా జవాబిచ్చింది.
‘నువ్వన్నది నిజమే. నేనొక కాగితాన్నే. కానీ నా జన్మలో నేనెప్పుడూ నీలా ‘చెత్త బుట్ట’ని చూడలేదు’


NOTE: Courtesy Image Owner

కధకు మరణం లేదు


(అంతేకాదు, చక్కని కధకు 'పాతా కొత్తా' తేడాలేదు. అలాటికధలు ఎన్నిసార్లు చదువుకున్నా తృప్తి తీరదు. అందుకే కధా ప్రియులు దేవినేని మధుసూదన రావు గారు ఈ కధను మరోమారు నెమరు వేసుకొవడానికి నెట్లో పంపారు.
వండడం ఓ కళ. వండి వార్చడం మరో కళ. వండినదాన్ని వడ్డించడం ఇంకో అపురూప కళ. అదేమిటో శంకరమంచి సత్యం గారు తన 'అమరావతి కధ'ల్లో ఒకదానిలో చెప్పారు. ఆరగించండి.)




తృప్తి
పూర్ణయ్యని బావగాడంటారు అందరూ.
బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరమూ లేదు. పెళ్ళి గాని, పేరంటం గాని, వంట హంగంతా బావగాడే. వంటవాళ్ళని కూర్చోనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు.
ఒకసారి వనసంతర్పణం పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు కొందరు. పేకాటలో మునిగిన వారు కొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రాఅని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు, పేకాట మూయించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నానుఅంటూ లిస్టు చదివాడు.
వంకాయ మెంతికారం పెట్టిన కూర
అరటికాయ నిమ్మకాయ పిండిన కూర
పెసరపప్పుతో చుక్కకూర
వాక్కాయ కొబ్బరి పచ్చడి
పొట్లకాయ పెరుగు పచ్చడి
అల్లం, ధనియాల చారు
మసాలా పప్పుచారు
అయ్యా! జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం
మామిడి కోరుతో పులిహోర
గుమ్మడి వడియాలు, వూరమిరపకాయలు.
అందరికీ సమ్మతమేనా?” అని అరిచాడు.
సమ్మతమేమిటి నామొహం - అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది.
అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకూ ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూశారా! లేత వంకాయలునవనవలాడుతున్నాయిమెంతికారం పెట్టి మరీ వండిస్తున్నానుదగ్గరుండి కోయించుకు వచ్చాను. …” అని అందరికీ చూపించి వెళ్ళి పోయాడు. ఆ తరవాత జనానికి వేరే ఆలోచనలు పోయినాయి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు. కాయ కాయ పళంగా వండితే రుచా? తరిగి వండితే రుచా? అసలు రుచి వంకాయలో వుందా? వంకాయ తొడిమలో వుందా? ఇలా చర్చలు సాగాయి.
మరో అరగంటకి — –
నిగనిగలాడే వాక్కాయల బుట్టతో, లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి,” అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది.అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడ్డారు. బావగాడు ఇలా ప్రదర్శన లిస్తుంటే ఆకలి రెప రెప పెరుగుతోంది.
ఇక అక్కడ గాడిపొయ్యి దగ్గర వంటవాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు.
ఓ పక్క పులిహోర తిరగమాత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరికి పరిగెత్తుకు వొచ్చి, “ఆ వాసన చూశారా? పులిహోర తిరగమోతసన్న బియ్యంతో చేయిస్తున్నాను,” అని మాయమయ్యాడు.
మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది. తాటి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురు మంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు, శుభ్రంగా కడుక్కోండి.అని వరుసల మధ్య కొచ్చి హెచ్చరించాడు.
సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం? రెండు ఆకులు కలిపి వేయించుఅంటున్నాడు.
వడ్డనలు మొదలయ్యాయి.
నేతి జారీ పుచ్చుకొని పేరు పేరునా అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ అలా వదిలేయకూడదు. నిమ్మకాయ పిండిన అరిటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు.అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు.
చుక్కకూర పప్పులో వూరమిరపకాయలు మిళాయించండి.
పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి.
వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు. తప్పు లేదు.
ఇంకా విస్తట్లో మిగిల్చావేం. పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో.
అప్పుడే మంచినీళ్ళు తాగకు. మీగడ పెరుగుంది.” ….
ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందు నుండి లేవడమే కష్టమయింది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరవాత వంటవాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా?” అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపొయ్యి పక్కన ఒక చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు.
అప్పటికి కూరలు మిగల్లేదు.
ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంతా హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురూ హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారన్న సంతోషమే బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు. 

(అమరావతి కథలు - సత్యం శంకరమంచి. నవోదయ పబ్లిషర్స్, విజయవాడ. 1978. రూ. 150/-)
Cover Page Courtesy Shri 'BAPU'