15, నవంబర్ 2014, శనివారం

చరిత్రలో నెహ్రూ స్థానం

(Published by 'SURYA' telugu daily in its Edit page on 16-11-2014, SUNDAY)
నూటపాతికేళ్ళ క్రితం జన్మించి యాభయ్ ఏళ్ళ కిందట మరణించిన జవహర్ లాల్ నెహ్రూ గురించి  ఈనాడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటే ఆయనలో ఎన్నో గొప్ప లక్షణాలు వుండి తీరాలి. గొప్ప చరిత్రకారుడు అయినప్పుడే ఇది సాధ్యం. అయితే ఇందులో విడ్డూరంగా కానవచ్చే ఒక విషయం ఏమిటంటే, నెహ్రూను ప్రత్యర్ధి కాంగ్రెస్ ఆస్తిగా పరిగణించి ఆయన్ని చరిత్రపుటల్లో నుంచి సమూలంగా తొలగించాలని పావులు కదుపుతున్న మోడీ సర్కారు కూడా ఇన్నేళ్ళ తరువాత జనం నెహ్రూను సంస్మరించుకోవడంలో పరోక్షంగా సహకరించడం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏళ్ళతరబడి ప్రధానమంత్రిగా పనిచేసి తన అసాధారణ వ్యక్తిత్వంతో ప్రపంచ దేశాల్లో భారత దేశానికి ఒక సముచిత స్థానం కల్పించడంలో నెహ్రూ చేసిన కృషి జాతి స్మృతి పేటికలో ఈనాటికీ పదిలంగా వుంది. నెహ్రూ పొరబాట్లు చేసివుండవచ్చు కానీ తప్పులు చేయలేదు అని విశ్వసించే జనానికి ఈనాటికీ  కొదవలేదు.  ఆయన నూటపాతిక జయంతిని ప్రభుత్వమే స్వయంగా పూనుకుని నిర్వహించి వుంటే మోడీ సర్కారుకు మరింత వన్నె వచ్చి వుండేది అని వారు నమ్ముతున్నారు. నెహ్రూ మా పార్టీ ఆస్తి అని కాంగ్రెస్ నమ్ముతున్నట్టే మోడీ ప్రభుత్వం కూడా ఆయన్ని కాంగ్రెస్ మూల పురుషుడిగానే భావిస్తూ ఆయన స్మృతిని పరిహరించడం ద్వారా కాంగ్రెస్ మూలాలను పెళ్లగించవచ్చుననే ఉద్దేశ్యంతోనే, ఏటా నవంబర్ పదునాలుగో తేదీన సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్న చాచా నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా అధికారికంగా జరిపే పద్దతికి స్వస్తిచెప్పినట్టు భావిస్తున్నారు. ఈ అభిప్రాయానికి బలం చేకూర్చే విధంగానే  మోడీ సర్కారు అడుగులు పడుతున్నాయి. గతంలో వాజ్ పాయ్ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిన రోజుల్లో కూడా పండిత నెహ్రూ జయంతిని  యధారీతిగా సర్కారే నిర్వహించిన ఉదంతాలను వారు ఉదహరిస్తున్నారు. అలాగే,  కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో మహా నాయకుడు, నెహ్రూ సమకాలికుడు, అన్నింటికీ మించి మోడీ స్వరాష్ట్రం అయిన గుజరాత్ కు చెందిన ఉక్కుమనిషి -  సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తిరిగి  తెర మీదకు తీసుకువస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.
కాంగ్రెస్ కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. నెహ్రూను తమ సొంత ఆస్తిగా పరిగణించే విధానం ఇంకా ఆ పార్టీలో కొనసాగుతోంది. నెహ్రూ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని  ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సుకు దేశదేశాల వారిని ఆహ్వానించిన ఆ పార్టీ,  సొంత దేశపు ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీని పిలవకపోవడం దీనికి దృష్టాంతం. ఏతావాతా, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ల నడుమ ఇప్పటికే వున్న అనేక విభేదాంశాల జాబితాలోకి నెహ్రూ పేరు కూడా చేరింది.
నెహ్రూ ప్రధానిగా పాలించిన తొలి ఏళ్ళలో, కాంగ్రెస్ పార్టీకే చెందిన అనేకమంది నాయకుల ప్రాధాన్యతను ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో ఒక పధకం ప్రకారం తగ్గిస్తూ వచ్చారనీ, తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే క్రమంలో ఇది జరుగుతూ వచ్చిందనీ నమ్మేవారు ఆ పార్టీలోనే అప్పుడూ వున్నారు, ఇప్పుడూ వున్నారు.  స్వతంత్ర భారతావనికి ప్రధమ ప్రధానమంత్రి కావాల్సిన అన్ని అర్హతలు నెహ్రూను మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఉన్నప్పటికీ జవహర్ మీద గాంధీ పెంచుకున్న అవ్యాజానురాగం, పటేల్ అవకాశాలకు గండి కొట్టిందని వారి నమ్మకం. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, నెహ్రూ నేతృత్వంలో పనిచేయడానికి సర్దార్ పటేల్ ఎన్నడూ విముఖత చూపలేదు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెసువాది అయిన సర్దార్  పటేల్, ఉప ప్రధానిగా, హోమ్  మంత్రిగా తన బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తించారు. ఆనాటికి  ఇంకా సజీవంగా వున్న ప్రజాస్వామిక లక్షణాల దృష్ట్యా కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లో లేదా ఇతర సందర్భాల్లో నెహ్రూ, పటేల్ ల నడుమ సాగిన వాదోపవాదాలు ఇరువురి మధ్యా సఖ్యత తక్కువ అనే సంకేతాలను ఇచ్చివుండవచ్చు. కానీ, ప్రజాస్వామిక  విధానాల్లో నెహ్రూకు వున్న విశ్వాసం యెంత బలవత్తరమైనదో తెలియచెప్పే సంఘటనలు కూడా అనేకం వున్నాయి. పటేల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తన అభీస్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ వాటిని నెహ్రూ ఆమోదించిన తీరే ఇందుకు ఉదాహరణ.
జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన  సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి శ్రీ కె.పీ.ఎస్. మీనన్ ఏదో సందర్భంలో చెప్పిన ఒక ఉదంతం ఇది.


భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  అనేక సంస్థానాలను  ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను  హైదరాబాదు పంపే విషయంలో  సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా  ఇలా అన్నారట.
ఇండియన్  ఆర్మీ  ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.
పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.  ప్రధాని నెహ్రూ పరిస్తితి కూడా అదే. అలా ఉండేదిట సర్దార్ పటేల్ వ్యవహార శైలి.

నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి.  స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు  రాస్తున్నారని అనుకునేవారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనేక దశాబ్దాల తరువాత ప్రపంచవ్యాప్తంగా  నూతన ఆర్దిక విధానాలు అమలుకావడం మొదలైన దరిమిలా, అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం చూసాం. ధరల పెరుగుదల వంటి  రుగ్మతలు మినహా ఆర్ధిక సంస్కరణలవల్ల ఆదిలో తలెత్తిన అనేక ఆటుపోట్లను మన దేశ ఆర్ధిక వ్యవస్థ తట్టుకోగలగడానికి ప్రధాన కారణం - ప్రభుత్వ రంగ వ్యవస్థలకు శ్రీకారం చుడుతూ, మరో పక్క ప్రైవేటు రంగానికి పరిమిత ఊతం ఇస్తూ నెహ్రూ అలనాడు అనుసరించిన మిశ్రమ ఆర్ధిక విధానం. ఈ వాస్తవాన్ని ఈనాటి ఆర్ధిక నిపుణులు సయితం అంగీకరిస్తున్నారు.
కాశ్మీర్ సమస్య, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలలో నెహ్రూ తనకుతానుగా తీసుకున్న నిర్ణయాలు దేశ శ్రేయస్సుకు విఘాతంగా పరిణమిస్తాయని నెహ్రూ రోజుల్లో కూడా బహిరంగ విమర్శలు చెలరేగాయి. అయితే జాతి జనులలో నెహ్రూకు వున్న అపార ఆకర్షణ ముందు ఈ విమర్శలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. నెహ్రూ మరణించిన వెంటనే ఆసేతుహిమాచలం స్పందించిన తీరు నెహ్రూకు ప్రజల్లో వున్న ఆదరణకు అద్దం పడుతుంది.
నెహ్రూ  అనంతరం ఆయన వారసురాలయిన శ్రీమతి ఇందిర అనుసరించిన కొన్ని విధానాలు కాంగ్రెస్ పార్టీ పట్ల  ప్రజల్లో విరక్తిని  కలిగించిన మాట కూడా నిజం. అయితే అదేసమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన యుద్ధంలో  పాకిస్తాన్ పై,  పై చేయి సాధించిన నాయకురాలిగా శ్రీమతి ఇందిరా గాంధి,  చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న విషయం కూడా వాస్తవం. రాజకీయ ప్రత్యర్దులనే కాకుండా సొంత పార్టీలో ప్రత్యర్దులను సయితం ఆవిడ విడిచిపెట్టలేదు. సర్వం సహా నాయకురాలిగా రూపొందాలనే కాంక్ష చివరికి శ్రీమతి ఇందిరాగాంధీ జీవితాన్నే బలితీసుకుంది. విచిత్రం ఏమిటంటే శ్రీమతి ఇందిరను, ఆమె విధానాలను తూర్పారబట్టిన వారు కూడా అధికార అందలం ఎక్కిన తరువాత దాన్ని నిలుపుకునే క్రమంలో వాటినే అనుసరించడం.
ప్రత్యర్ధి పార్టీలను సమూలంగా నిర్మూలించాలనే ఆలోచనలు ఇప్పుడు మరింత వూపందుకున్నట్టుగా కానవస్తోంది. నిజంగా ఇది విచారకరం. ప్రజాస్వామ్య ప్రియులను ప్రధానంగా కలవరపరుస్తున్న  అంశం ఇదే.
రాజకీయ నేతలు రాజకీయులుగా మిగిలిపోకూడదు. రాజనీతిజ్ఞులుగా పరిణతి చెందే ప్రయత్నం చేయాలి. చరిత్ర సృష్టించే ప్రయత్నం చేయాలి కానీ, ఎవరినో చరిత్ర గర్భంలో కలిపే యోచనలు మంచి చేయవు. చరిత్రను  తిరగరాయాలని గతంలో ఎందరో పూనుకున్నారు. శ్రీమతి ఇందిరా గాంధీ హయాంలో తలపెట్టిన  'టైం కాప్స్యూల్' వ్యవహారం ఇంకా కొందరికి గుర్తుండేవుంటుంది. కాబట్టి గమనంలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, చరిత్రకారులను ఎవ్వరూ తయారు చేయలేరు. చారిత్రిక పురుషులకు  చరిత్ర తనకుతానుగా తనలో స్థానం కల్పిస్తుంది. అలాగే, చరిత్ర హీనులను పనికట్టుకుని చరిత్ర నుంచి తొలగించాల్సిన అక్కర కూడా లేదు. అలాటివారు ఎవరికివారే చరిత్ర పేజీలనుంచి కనుమరుగయి పోతారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. (15 - 11 - 2014)

NOTE: Courtesy Image Owner 

14, నవంబర్ 2014, శుక్రవారం

సారీ! గుర్తు పట్టలేకపోయాను!


అరవయ్యవ పడిలో పడ్డ సూర్యాకాంతానికి గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆపరేషన్ బల్ల మీద పడుకోబెట్టగానే ఇక తనకు చావు తధ్యం అనుకుంది. ఆ సమయంలో ఆమెకు  దేవుడు కనబడ్డాడు. 'నాకిక భూమ్మీద  నూకలు చెల్లినట్టేనా సామీ' అని అడిగింది.
'నీకేమయింది, నిక్షేపంలా  ఇంకా నలభయ్ ఏళ్ళు బతుకుతావు' అంటూ దేవుడు మాయమై పోయాడు.
ఆయనన్నట్టే ఆమెకు నూకలు మిగిలే వున్నాయి. బతికిబట్టకట్టింది. ఆపరేషన్ అవసరం లేదన్నారు డాక్టర్లు. ఇంటికి పంపేముందు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండమన్నారు.
మరో నలభయ్ ఏళ్ళు  బతుకుతావని దేవుడు చెప్పిన విషయం బాగా గుర్తుండి పోయింది. అంత ఆయుస్సు పెట్టుకుని ఈ ముసలి అవతారం ఎందుకనిపించిందో ఏమో, చీరె కట్టు నుంచి  పంజాబీ సూట్ లోకి  దూరిపోయింది. జుట్టుకు నల్ల రంగు వేయించింది. మొహంలో ముడతలు కనబడకుండా  ట్రీట్ మెంట్ తీసుకుంది. ఆసుపత్రిలో అందరూ నోళ్ళు వెళ్ళబట్టి చూస్తుండగానే  అరవై నుంచి ఇరవై వయసు పిల్ల మాదిరిగా మారిపోయింది. ఆసుపత్రి నుంచి డిస్  చార్జ్ అయి ఇంటికి వస్తుంటే వేగంగా వస్తున్న కారు డీకొట్టి అక్కడికక్కడే కన్ను మూసింది. కళ్ళు తెరిచి చూస్తే, 'ఇంకా నలభయ్ ఏళ్ళు బతుకుతావు' అన్న భగవంతుడు తన కళ్ళల్లోకి చూస్తూ కనిపించాడు. 'ఇదేమిటయ్యా ఇలా చేసావు. బోలెడు ఆయుస్సు వుందని గొప్పలు చెప్పావు. ఆ మాత్రం కారు కింద పడకుండా తప్పించలేకపోయావా' అని గదమాయించింది.
దేవుడు మందహాసం చేస్తూ చెప్పాడు. 'ఆ కారుకింద పడింది నువ్వా! నేనసలు గుర్తే పట్టలేకపోయాను సుమా!'  
      

(శ్రీ కొల్లూరు సురేష్ బాబు గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

13, నవంబర్ 2014, గురువారం

మా బావగారు చెప్పిన నెహ్రూ గారి కధ

  
మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. కొద్దికాలం అస్వస్థులుగా వుండి కన్ను మూశారు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే -
ఓరోజు బంధువుల ఇంట్లో జరిగిన  కార్యక్రమంలో మా మేనల్లుడు అంటే రామచంద్ర రావుగారి కుమారుడు కొలిపాక రాంబాబు  ఓ వృత్తాంతం చెప్పాడు. మా బావగారు సుస్తీ చేసి ఆసుపత్రిలో వున్నప్పుడు ఆయన్ని అడిగాడట. 'నాన్నా! మీలాటివాళ్ళు లక్షల మంది నానా కష్టాలు పడితే ఈ స్వాతంత్రం వచ్చింది. మీరు నిజంగా కోరుకున్నది ఇలాటి దేశాన్నేనా'
ఆయన ఇలా జవాబు చెప్పారట.
'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో  నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి  బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో!  ఫ్రీ ఇండియా అంటే  జనాలకు  అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని లాభనష్టాలన్నీ  మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో  మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'



(ఫోటోలో మా బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు)

నెహ్రూ - ఓ జ్ఞాపకం



నెహ్రూ గారు నారాయణ దొరగారిని అమాంతం ఎత్తి సోఫాలో కుదేశారు.
ఎవరీ నారాయణ దొర గారు ? ఆయనకూ నెహ్రూ గారికీ ఏమిటి సంబంధం?
అప్పట్లో కలం కూలీ జీ. కృష్ణ గారు ఢిల్లీ లో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నివాసానికి ఈ నారాయణ దొరగారు వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది.
అప్పటి సంగతులను గురించి శ్రీ జీ. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’లో ఇలా గుర్తు చేసుకున్నారు.
“దొరకు ఇంగ్లీష్ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్ లాల్ నెహ్రు గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.
“దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ గారు అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటిదాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత  నేపధ్యం  వుంది.
1936 లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూ పై  జస్టిస్ పార్టీవాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను  ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్ లాల్ యెంత గింజుకున్నా దొర వొదలలేదు.
మళ్ళీ 1953 లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.
(చిత్రంలో శ్రీ జి.కృష్ణ గారు)

చావుతో ఆటలంటే మాటలా!

  

సుబ్బారావుకు అందర్నీ ఆటలు పట్టించడం ఓ సరదా.
అతనో రోజు కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్ బుక్ లో ఎవర్నో ఆట పట్టిస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా యమపాశంతో ఇద్దరు యమభటులు  కనిపించారు. ముందు గతుక్కుమన్నా తేరుకుని వాళ్ళని లోపలకు రమ్మన్నాడు. ఏవిటి విషయం అని అడిగాడు. వారిలో ఒకడు ఆ రోజు చావు మూడిన వాళ్ళ జాబితా ఒకటి తీసాడు. సుబ్బారావు పేరు అందరికంటే మొదట్లో వుంది. పద పద అని తొందర చేసారు.
సుబ్బారావు తరహా తెలుసుకదా.
రాకరాక వచ్చారు. మళ్ళీ మళ్ళీ వచ్చే ఉద్యోగాలు కావాయె మీవి.  ఒక్క నిమిషం  అలా  కూర్చోండి. ఒక కప్పు కాఫీ ఇస్తానుఅంటూ  వొంటింట్లోకి వెళ్ళాడు.  చెరో కప్పులో కాఫీ కలిపి తెచ్చి అందులో తెలివిగా నిద్ర మాత్రలు వేసాడు.
కాఫీ తాగి యమభటులిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోయారు.      
ఈలోగా సుబ్బారావు  చావు రాసిపెట్టివున్న వాళ్ళ జాబితా తీసి అందులో మొదట్లో వున్న తన పేరు కొట్టేసి దాన్ని చిట్టా చివర్లో రాసేసి యేవీ తెలియని నంగనాచిలా  కూర్చున్నాడు.
మొత్తానికి యమ భటులు నిద్ర లేచారు. వారికి సుబ్బారావు ఇచ్చిన కాఫీ ఎంతో నచ్చింది.
చూడు సుబ్బారావూ చూడబోతే నువ్వు చాలా మంచాడిలా వున్నావు. అందుకని నీకో మేలు చేస్తాం. ఈరోజు మా డ్యూటీని జాబితా చివరి నుంచి మొదలు పెడతాం . ఏవంటావ్?’
ఏవంటాడు. అప్పటికే కుక్కిన పేనాయె.


(ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)
NOTE: Courtesy Image Owner 

అణుబాంబు : భగవద్గీత



ప్రపంచ అద్భుత సంఘటనల్లో ఒకదానిగా ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి అణు బాంబు పరీక్ష జరిగి ఇప్పటికి కాస్త అటూ ఇటూగా డెబ్బయ్ ఏళ్ళు. న్యూ మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ల దూరంలో 1945 జులై 16 వ తేదీన  ట్రినిటీఅనే గుప్త నామంతో అమెరికా అణు పరీక్ష జయప్రదంగా నిర్వహించింది. అప్పటినుంచి లోకంలో  అణు శకం మొదలయిందని చెప్పుకోవచ్చు.
అప్పట్లో అమెరికా జరిపిన అణు పరీక్షకూ, భగవద్గీతకూ సంబంధమేమిటన్న అనుమానం రావచ్చు.  దాన్ని నివృత్తి చేసుకోవాలంటే గతాన్ని కొంత నెమరు వేసుకోవాలి.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన పేరు ట్రినిటీఅయితే పరీక్షించిన అణుబాంబు కు నిర్దేశించిన నామం ది గాడ్జెట్’ . తొలి అణు పరీక్షను విజయవంతంగా  జరిపిన విజయోత్సాహంతో  అమెరికా కొద్ది వ్యవధిలోనే   రెండు అణు బాంబులను జపాను పై ప్రయోగించి అణు బాంబు శక్తిసామర్ధ్యాలను లోకానికి ఎత్తిచూపింది.
1945  ఆరోతేదీన తొలి బాంబు ప్రయోగం జపాను లోని హిరోషిమాపై జరిగింది. మరో మూడురోజులకే తొమ్మిదో తేదీన రెండో అణు బాంబును నాగాసాకీపై అమెరికా ప్రయోగించింది.
హిరోషిమాపై  జారవిడిచిన అణుబాంబు  గుప్తనామం లిటిల్ బాయ్’  కాగా,  నాగాసాకీని మట్టుబెట్టిన  బాంబుకు పెట్టిన పేరు ఫ్యాట్ మ్యాన్
నిజానికి హిరోషిమాపై  ప్రయోగించిన తొలి బాంబు  పరీక్ష చేసి ప్రయోగించినది కాదు. అయినా విజయవంతం అయింది. ఈ బాంబును  ముందుగా  పరీక్షించకపోవడానికి కూడా ఒక కారణం వుంది. ఒకే ఒక్క బాంబుకు కావాల్సిన  యురేనియం -235 నిల్వలు మాత్రమే అమెరికా వద్ద మిగిలివుండడంతో ఆ బాంబును  ముందుగా పరీక్షించి చూసే  వీలు లేకుండా పోయింది. పోతే నాగాసాకీపై ప్రయోగించిన బాంబు ట్రినిటీ మాదిరి తయారు చేసిన అణు బాంబు.
ఈ రెండు బాంబులు కలసి సృష్టించిన మారణ హోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభై ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. ఆ  బాంబులు కలిగించిన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ తరువాత అయిదేళ్ళలోమరణించిన వారి సంఖ్య  లక్షలకు చేరింది. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచివున్న ముప్పు యెంతటిదో   అర్ధం చేసుకోవచ్చు. 

పోతే, ట్రినిటీ పరీక్షకు అంతా సిద్ధం చేసుకున్న  అమెరికా శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణు విస్పోటన  పరీక్షకు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ముహూర్తం నిర్ణయించారు. కానీ వాతావరణం  ఉరుములు, మెరుపులు వర్షంతో అనుకూలించలేదు. ఆ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా వుంటాయని అధికారులు భావించి కొద్ది సేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్ ట్రూమన్ తో సహా అంతా  ఎదురు చూస్తున్న వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభై అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు  అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా  చూపారు.  సరిగ్గా 5-10 కి  20 నిమిషాల కౌంట్ డౌన్ మొదలయింది. అక్కడికి  16 మైళ్ల దూరంలో  నిర్మించిన  ఎత్తయిన టవర్ నుంచి  ఉన్నతాధికారులు  ప్రయోగ ప్రక్రియని  పరిశీలిస్తున్నారు. స్తానిక కాల మానం ప్రకారం ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభై అయిదు సెకన్లకు మానవాళి  భవిష్యత్తును  ప్రశ్నార్ధకం చేస్తూ తొలి  అణు విస్పోటనం తన భీషణ రూపాన్ని ప్రదర్శిస్తూ లోక భీకరంగా ఆవిష్కృతమయింది.   పేలుడుకు  ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి.  క్షణంలో వందోవంతులో   20 కిలో టన్నుల టి.ఎం.టి. శక్తికి సరిసమానమైన ఎనర్జీవిడుదలయింది. ఒకటి రెండు క్షణాలపాటు ఆ ప్రదేశం,  చుట్టుపక్కల కొండలు పట్టపగలు వెలుతురును తలదన్నే విధంగా  వేయి సూర్యుల కాంతితో (దివి సూర్య సహస్రస్య భగవద్గీత 11 వ అధ్యాయం 12 వ శ్లోకం ప్రధమ పాదం)  వెలిగిపోయాయి.  బాంబు పేలిన చోట పది అడుగుల లోతు  వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి   ఏర్పడింది.  ఆ ప్రదేశం యావత్తు నిప్పుల కొలిమిలా మారింది. నీలంనుంచి ఎరుపు, ఎరుపు  నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు -  ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో దర్శనమిచ్చాయి. పెద్ద పుట్టగొడుగు మాదిరిగా  నల్లటి నలుపు రంగుతో మిశ్రితమయిన ఎర్రటి పొగ మేఘాలు  గగన తలంలో ఏడున్నర మైళ్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి.
ట్రినిటీ పరీక్ష డైరెక్టర్ కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్  బాంబు పేలుడు సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. ప్రపంచ వినాశనానికి దోహదం చేసే దారుణ  ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి పలుకుల్లో ధ్వనించింది. ఛీ! జరగరానిది జరిగి పోయింది ‘Now we all sons of bitches’- అదీ ఆయన వ్యాఖ్య.
ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్ర వేత్త , ఈ నాటి ఈ వ్యాసానికి ప్రేరకుడు అయిన జె.రాబర్ట్  ఓపెన్ హీమర్    (J.Robert Oppenheimer) వేయి సూర్యుల కాంతి అన్న భగవద్గీత లోని సంస్కృతపాదం ఆధారంగా ఆనాటి దృశ్యాన్ని వర్ణించారు.   ఆ తరువాత  చాలా ఏళ్ళకు అణు పరీక్షను గురించి మాట్లాడుతూ మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు  ఎందుకంటె అది సంస్కృతంలో వుంది.  భగవద్గీతలోని వాక్యం అది. కాలోస్మి  లోకక్షయకృత్ ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
("kālo'smi lokakṣayakṛtpravṛddho lokānsamāhartumiha pravṛttaḥ"  which he translated as "I am become Death, the destroyer of worlds)[
అంటే-
నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వంసహా శక్తిని


NOTE: Courtesy Image Owner 


12, నవంబర్ 2014, బుధవారం

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ?



మా తాత గారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా - కరెంట్‌  బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ - రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు - మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మా వూరి మొత్తం జనాభాలో- ఆరోజుల్లో - యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప- రైలుని చూసిన  వాళ్ళు  కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు  మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్ళు . ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వారు.  మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టే వారు.  రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈపనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు  కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌  రాళ్ళు  రోడ్లపై  వెలిసాయి.  ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు  నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు.  ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే - జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పని వాళ్ళు  వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-
కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు  నమ్ముతారా?? కళ్లతో చూసిందే  నమ్ముతాం  అని వాళ్లంటే మీరేం చేస్తారు?




16 -7-2008 (Note: Courtesy Image Owner)