3, సెప్టెంబర్ 2014, బుధవారం

తెల్లదొరల గడ్డపై సంస్కృత పాఠాలు


'రామః రామౌ, హే రామ హే రామౌ........' సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.
బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్  హైస్కూలు భవనం. విశాలమైన ప్రాంగణం. నడిమధ్యలో రాజసం వొలకబోసే రాతికట్టడం. దానికి ఇరువైపులా తరగతి గదులు. ప్రధాన భవనంలో మెట్లకింద,  తెల్లని పంచె, లాల్చీ కండువా  ధరించిన సంస్కృతం మాస్టారు అలా శబ్దమంజరి చదువుతుంటే,  మేము ఒక పదిమందిమి కాబోలు సంస్కృతం రెండో భాషగా తీసుకున్నవాళ్ళం,  శ్రద్ధగా వింటూ మాస్టారు చెప్పింది వల్లె వేస్తూ వుండేవాళ్ళం. ఇంగ్లీష్, తెలుగు, లెక్కలు, ఇతర సబ్జక్టులు బోధించడానికి తరగతి గదులు విడిగా ఉండేవి కాని సంస్కృతం క్లాసు మాత్రం, శబ్ధమంజరి, అమరకోశం చెప్పుకుంటూ   మెట్ల కిందే నడిచేది. ఆ భాషకు ఇచ్చిన ప్రాముఖ్యం అది.  అది ఒకప్పటి జ్ఞాపకం.
పొతే, ఈమధ్య నెట్లో ఒక ఆసక్తికర సమాచారాన్ని మిత్రులు శ్రీ పీ.వీ.వీ.జీ. స్వామిగారు అమెరికా నుంచి  పంపారు. ఆ ఇంగ్లీష్ వార్తకు నా తెలుగు అనువాదం నా సొంత బాణీలో :    
ఒకానొకకాలంలో సూర్యుడు అస్తమించని సువిశాల సామ్రాజ్యానికి అది రాజధాని. అన్ని భాషలకు మాతృభాషగా పేరొందిన సంస్కృతం పరిఢవిల్లిన  అఖండ భారతాన్ని వందల సంవత్సరాలపాటు బానిస దేశంగా పాలించిన బ్రిటిష్ ప్రభువుల రాజధాని నగరం.  అలాటి ఇంగ్లీష్ గడ్డ అయిన లండన్ నగరంలో సంస్కృతాన్ని బోధించే పాఠశాల. వినడానికే విచిత్రం అనిపించినా ఇది నిజం. లండన్ లోని సెంట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్లో సంస్కృత భాషా విభాగం అధిపతి వార్విక్ జేస్సప్ మాటల్లో మిగిలింది తెలుసుకుందాం.
"ప్రపంచం మొత్తంలో సంస్కృతంతో పోల్చచదగిన ఉత్కృష్టమైన భాష మరొకటి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మన్ ప్రజలు జర్మన్ మాట్లాడతారు. మాట్లాడే ప్రజల పేరుతోనే ఆ భాషలకు నామకరణం చేసారు. సంస్కృతం ఒక్కటే మినహాయింపు. ఆ ఒక్క భాష చక్కగా నేర్చుకుంటే చాలు, సైన్సు, గణితం వంటి ఇతర అంశాలపై పట్టు చిక్కించుకోవడం సులభం అవుతుంది'   
ఇక ఆ స్కూలు హెడ్ మాష్టర్ పాల్ మాస్ గారు సంస్కృతం గురించి మరింత గొప్ప కితాబు ఇచ్చారు.
'దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకుంటే విద్యార్ధులకు తమ చేతివేళ్ళపై గట్టి పట్టుచిక్కుతుంది. సంస్కృతంలో మాట్లాడడం  వస్తే ఇక ఆ నాలుకకు అడ్డే వుండదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది'  
పాల్ మహాశయులు అంతటితో ఆగలేది.ఇంకా ఇలా వివరించారు.
'యూరోపియన్ భాషలు మాట్లాడేవాళ్ళు నాలుకలో వుండే అన్నిభాగాలను  ఉపయోగించరు. నాలుక కొసతో మాట్లాడేస్తుంటారు. రాసేటప్పుడు కూడా వేళ్ళల్లోని అన్నికదలికలను వాడరు. అదే సంస్కృతం మాట్లాడడం అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది'
తోక టపా: ఈ ఇంగ్లీష్ స్కూల్లో సంస్కృతం సెకండ్ లాంగ్ వేజ్ గా తీసుకునేవాళ్ళు విధిగా ఆరేళ్ళపాటు ఆ భాషను అధ్యయనం చేయాల్సివుంటుంది. (మెట్ల కింద కాదు. చక్కటి తరగతి గదులు వున్నాయి) సంస్కృత విద్యార్ధులకు స్కూల్లో శాకాహార భోజనమే లభిస్తుంది.    


(సంస్కృతం నోటు పుస్తకం)


మరి ఇప్పుడు చెప్పండి. ఇంగ్లీష్ వాడు చెప్పాడు కనుక మనమూ సంస్కృతం గొప్పదని అనుకుందామా!

1, సెప్టెంబర్ 2014, సోమవారం

వంద రూపాయల రుణం కోసం నాలుగు వందల సంతకాలు


(03-09-2014 తేదీ 'సూర్య'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
ఏదో సినిమాలో లాగా కాస్త ముందూ వెనక్కీ వెళ్ళాలి.
ముందు హైదరాబాదు. ఇది జరిగి చాలా ఏళ్ళయింది. దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ బాంక్ అయిన స్టేట్ బాంక్ చైర్మన్ గా అత్యంత సమర్ధుడయిన అధికారిగా పేరుతెచ్చుకున్న తల్వార్ గారు వుండేవారు. బాంకులో పనిచేసే అన్ని శ్రేణుల  అధికారులకు శిక్షణ ఇప్పించడానికి దేశం మొత్తానికి కలిపి హైదరాబాదులోని బేగం పేటలోని విశాలమైన ఆవరణలో స్టేట్ బాంక్ స్టాఫ్ కాలేజ్ ఏర్పాటు చేసారు. దాన్ని ప్రారంభించడానికి అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ చవాన్ తో పాటు తల్వార్ గారు కూడా హైదరాబాదు వచ్చారు. ప్రారంభోత్సవం అదీ బాంక్ స్థాయికి తగ్గట్టే ఘనంగా జరిగింది. వివిధ జాతీయ దినపత్రికలు, స్థానిక దినపత్రికల్లో ఆ వార్తను ఫొటోలతో సహా మొదటి పేజీలో చాలా విపులంగా ప్రచురించారు.
ఈ విషయాన్ని ఇక్కడ వొదిలేసి కాసేపు విశాఖపట్నం జిల్లా వెళ్లోద్దాం.
స్టేట్ బాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన వ్యవసాయాభివృద్ధి బాంక్ కూడా రాష్ట్రంలో చాలా చురుగ్గా పనిచేస్తున్న రోజులవి. ఆ బాంక్ శాఖలో పనిచేస్తున్న ఎర్రంరాజుగారనే ఒక యువ అధికారి జిల్లాలోని గ్రామీణ రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వెడుతూ విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న యు.ఎన్.ఐ. వార్తా సంస్థ విలేకరిని వెంటబెట్టుకుని వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రుణ మంజూరీ తంతు కొనసాగింది. మామూలుగా అయితే విలేకరులెవ్వరు సాధారణంగా ఒక చిన్న కార్యక్రమం కోసం అంత సమయం వెచ్చించరు. కానీ ఆ అధికారి తీసుకువెళ్ళింది ఆషామాషీ జర్నలిష్టుని కాదు. తివిరి ఇసుమున తైలం తీయగల సమర్ధుడు. ఆయన ఓ చెట్టు నీడన కూర్చుని రైతులకు రుణాల మంజూరీ వ్యవహారాన్ని గమనిస్తున్నాడు. ఆయన దృష్టిని ఒక అంశం ఆకట్టుకుంది. అదేమిటంటే పేద రైతులు వాళ్ళ అవసరాల కొద్దీ, లేదా వారి వారి తాహతు కొద్దీ వంద రూపాయలనుంచి రెండు మూడు వేల రూపాయల వరకు రుణాలు తీసుకుంటున్నారు. తీసుకున్న రుణానికి బ్యాంకు అందచేసిన కాగితాలపై వేలిముద్రలు వేస్తున్నారు. ఆ విలేకరి వాళ్ళు పూర్తిచేసిన ఒక ధరఖాస్తు పత్రాన్ని తీసుకుని చూసారు. ఒక్కొక్కదానిపై నాలుగువందల వేలిముద్రలు కనిపించాయి. ఆ విషయాన్ని మరింతగా ధృవపరచుకున్న ఆ విలేకరి క్షణం ఆలస్యం చేయకుండా   పోస్ట్ ఆఫీసుకు వెళ్లి వార్తను రాసి టెలిగ్రాం ద్వారా హైదరాబాదులోని తన ఆఫీసుకు పంపారు.
మళ్ళీ ఓ మారు హైదరాబాదు వస్తే....
వందరూపాయల రుణం కోసం నాలుగు వందల సంతకాలు అంటూ యూ ఎన్ ఐ పంపిన వార్తను ఒక ఇంగ్లీష్ దినపత్రిక మరునాడు మొదటి పేజీలో ప్రచురించింది.  స్టేట్ బాంక్ చైర్మన్ తల్వార్ గారు పాల్గొన్న స్టాఫ్ కాలేజ్ ప్రారంభోత్సవం వార్త కూడా ఫోటోతో సహా మొదటి పుటలోనే ఆ పక్కనే ప్రచురించడం కాకతాళీయం కావచ్చు. కానీ ఆ వార్త స్టేట్ బ్యాంకు రుణాల మంజూరీ విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదని ఎవ్వరూ ఆరోజు ఊహించి వుండరు. ఆ వార్త తల్వార్ మహాశయుల దృష్టిలో పడింది. ఆయన వెంటనే మొత్తం వ్యవహారం గురించి ఆరా తీసారు. వంద రూపాయలకు నాలుగు వందల సంతకాలు తీసుకుంటున్న సంగతి నిజమే అని విచారణలో తేలింది. ఆయన  వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రుణ మంజూరీ పద్దతిని సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు.
ఒక జర్నలిస్ట్ తన చుట్టూ ఉన్న విషయాల్ని 'గమనించడం' అలవాటు చేసుకుంటే కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ.

ఇక మళ్ళీ వర్తమానంలోకి వద్దాం. ఒక చిన్న వార్తతో పెను మార్పులకు కారణం అయిన ఆ జర్నలిష్టు ఎవరంటే నిన్ననో మొన్ననో తొంభయ్యవ పడిలో అడుగిడిన  వృద్ధ బాలకుడు వీ. హనుమంతరావు గారు. డెబ్బయ్ ఏళ్ళుగా ఆయన కలం రాస్తూనే వుంది. రాయడం, రాస్తూవుండడం ఆయనకు వ్యసనం కావచ్చు. కానీ అది సమాజానికి మేలు చేసే విషయం. ఈనాటి నవ యువ జర్నలిష్ట్ తరానికి మార్గ నిర్దేశనం చేయగల చేవకలిగిన హనుమంతరావుగారు, తొంభయ్యవ యేట కూడా పాఠాలు నేర్పడానికి సిద్ధంగానే వున్నట్టు కానవస్తున్నారు. శతమానం భవతి అంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుకుందాం. 


(తొంభయ్ ఏళ్ళ యువకుడు హనుమంతరావు గారు) 

కపటం లేని మందహాసానికి కాపీరైట్ వైయస్సార్


(సెప్టెంబర్ రెండో తేదీ  వైయస్సార్ వర్ధంతి - ఈరోజు 'సాక్షి'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
  
దేశవ్యాప్తంగా, మీడియాలో, పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వైఎస్సార్. ఆ పేరు వినబడుతూనే వుంటుంది కానీ, ఇక ఆ రూపం కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖరరెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.

'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండోపర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండకుండానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.

'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.

అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.

1978 నుంచి ఇప్పటివరకూ ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసన సభకి ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళినవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.


(ఎనభయ్యవ దశకంలో వైయస్సార్ తో నేను)



కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడుగారు  ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్చికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం, ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.

రాజశేఖర రెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.

ఇటు హైదరాబాదులోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.

2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొత్త ముఖ్యమంత్రికి  కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.


(ముఖ్యమంత్రి వైయస్సార్ తో నేను)

వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా, ఆ తర్వాత కూడా, వార్షికంగా నిర్వహించే విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే వుండేది. రిటైర్ అయిన తర్వాత చాలా రోజులకు జరిగిన, నా  రెండో కుమారుడి వివాహానికి, ముఖ్యమంత్రిగా యెన్నో పని వొత్తిళ్ళు వున్నప్పటికీ హాజరై ఆశీర్వదించి వెళ్ళడం, నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను.

ఆయన ప్రతిపక్షనాయకుడిగా వున్నరోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ, ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు. రేడియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా, 'శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టకండయ్యా!' అని తోటి జర్నలిష్టులకి సర్దిచెప్పేవారు.

ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది.

రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా కైమోడ్పులు. (01-09-2014)



31, ఆగస్టు 2014, ఆదివారం

కుంచె కన్నీళ్లు కారుస్తోంది



బాపు ఇక లేరు. తెలుగువారి గుండెల్లో కొలువుతీరిన బాపు మరణంతో వారి  గుండెలు బరువెక్కాయి. నిజానికి రమణగారి మరణంతోనే  ఆయన సగం చనిపోయారు. మిగిలింది ఈరోజు పూర్తయింది. బాపు లేకపోయినా బాపు అనే రెండక్షరాలు ఎన్నాళ్ళకూ  చెరిగిపోవు. బాపు రాత ఏనాటికీ చెదిరిపోదు.  బాపు బొమ్మ అందాలు ఎప్పటికీ మాసిపోవు.  కాకపొతే ఇన్నేళ్ళుగా ఆయన  బొమ్మల్ని చూసి కడుపారా నవ్వుకున్న జనాలు, ఆయన మరణవార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఆదివారం తెలుగు చిత్రపరిశ్రమకు గాడాంధకారం.

డెబ్భయ్ ఏళ్ళుగా రాస్తున్న కలం


ఆయన రచనా దాహం తీరనిది. అందుకే డెబ్భయ్ ఏళ్ళనుంచి రాస్తూ నిన్నటికి నిన్న తొంభయ్యవ పడిలో ప్రవేశించిన జర్నలిష్ట్ కురువృద్ధుడు వి. హనుమంతరావుగారు హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో తనకోసం ఏర్పాటయిన ఆత్మీయ సత్కార సమావేశానికి వచ్చేముందు కూడా వీక్షణం పత్రిక్కి వ్యాసం రాసేవచ్చారు. ఇన్నేళ్ళుగా ఆయన్ని అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చిన వారి శ్రీమతి సరళ గారు, కుమారుడు జర్నలిష్ట్ డైరీ ఫేం సతీష్ బాబు, కోడలు మాధురి, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు వరదాచారి గారు, చాలా నిరాడంబరంగా, సంసార పక్షంగా సాగిపోయిన ఈ  ఈ చిరు కార్యక్రమంలో పాల్గొన్నారు.



జర్నలిజం వృత్తిని అవహేళన చేస్తూ మాట్లాడేవారు అనేకమంది ఈ వృత్తిలో అలవడే అనేకానేక వ్యసనాలను ప్రస్తావిస్తూ వుంటారు. వారి సందేహాలకు సమాధానమే  హనుమంతరావు గారు. రాస్తూ బతకొచ్చని, బతుకుతూ రాయొచ్చని నిరూపిస్తూ తొంభయ్యవ ఏట ప్రవేశించిన హనుమంతరావు గారు నిజంగా ధన్యజీవి.
ఈ చిన్ని సమావేశంలో చాలాకాలం గుర్తుంచుకోవాల్సిన అనేక గొప్ప విషయాలను వక్తలు ప్రస్తావించారు. పాత సంగతులు నెమరు వేసుకున్నారు. హనుమంతరావు గారితో తమ పరిచయం గురించి సింహావలోకనం చేసుకున్నారు. ఆయన గురించి బాగా తెలిసిన వారికి కూడా ఆయన్ని గురించి తెలియని విషయాలు బాగా తెలిసివచ్చేలా ప్రసంగాలు సాగాయి.
గొప్ప జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం  ఆ జర్నలిష్ట్ భార్యకే. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిష్టులు నాకు చాలామంది తెలుసు. జీ కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా నిన్న జరిగిన సత్కారంలో  న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగం వాటా నిస్సంశయంగా హనుమంతరావు గారి అర్ధాంగి సరళ గారిదే.  

           

30, ఆగస్టు 2014, శనివారం

ఆడ తెలివి


'ఆడవాళ్ళ మెదడు చాలా చురుగ్గా పాదరసంలా  పనిచేస్తుందోయ్' అన్నాడు ఏకాంబరం
'అల్లా అని యెల్లా చెప్పగలవు' అడిగాడు లంబోదరం.
'ఇల్లా' అంటూ మొదలెట్టాడు ఏకాంబరం
ఏకాంబరానికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా స్మశాన వైరాగ్యం కలుగుతుంది. ఒకరోజు చావుబతుకుల్లో వున్న దూరపు చుట్టాన్ని చూట్టానికి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ సాయంత్రం భార్యతో అన్నాడు.
'చావు ప్రతివాడికీ తప్పదు. అటువంటప్పుడు ఆసుపత్రిలో అన్ని రకాల గొట్టాలు తగిలించుకుని రేపోమాపో అనే ప్రాణాన్ని కాపాడుకోవడం అవసరమా? నేనయితే అలాటి లైఫ్ సపోర్టింగ్ కనెక్షన్లు తీసేసి హాయిగా ప్రశాంతంగా చనిపోవాలని కోరుకుంటాను'
ఏకాంబరం వాగుడు విని అతగాడి భార్య లేచి వెళ్లి ఇంటర్ నెట్ కనెక్షన్ తొలగించింది. 


Note: Courtesy Cartoonist 

నారు పోసినవాడే......

యేవో అనుకున్నాం కానీ మధ్య మధ్య ఈ అల్పపీడనాలు గట్రా లేకపోతే జనాలు ఏవయిపోయేవాళ్ళో ఏమో!


(Note:Courtesy Image Owner)