4, జులై 2013, గురువారం

ఆర్తితో కూడిన ఆప్తుడి ఉత్తరం



గయ నుంచి శర్మ రాసిన ఉత్తరం
వనం జ్వాలా నరసింహారావు
శర్మ గురించి కిందటి అధ్యాయంలో ఉపోద్ఘాతం ఇచ్చాను. వాడు (గయ) కత్రి సరాయ్ లోని నాథ్ ఆయుర్వేదాశ్రమంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక నాడు అనుకోకుండా "అన్వేషణ" అనే వారపత్రిక చూడడం జరిగింది. అందులో మిత్రుడు భండారు శ్రీనివాసరావు (హెచ్.ఎస్.సీ వరకు మా క్లాస్ మేట్) రాసిన ఒక వ్యాసం చదివాడు. వెంటనే స్పందిస్తూ, 22-01-1996 తేదీన ఒక ఉత్తరం రాశాడు. అందులోని విషయాలు చాలావరకు మా ముగ్గురికీ...ఆ మాటకొస్తే...మా సమకాలీనులందరికీ వర్తించేవిగా వున్నాయి. ఆ విషయాలను పదిమందితో పంచుకోవాలన్న ఉద్దేశంతో యధాతథంగా రాస్తున్నాను.

Dear Friend Jwala,
నేను కొన్నాళ్లుగా ఇక్కడ గయ దగ్గర ఒక ఆయుర్వేద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంగతి నీవెరిగినదే కదా. నీవు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటావో లేదో గాని, నేను నిన్ను, మన స్నేహితులందర్నీ ఏదో ఒక సందర్భంలో తలుస్తూనే ఉంటాను. 10 రోజుల క్రితం 9-01-96 అన్వేషణ అనే వారపత్రిక తిరగవేస్తుండగా, పేజీ 45 లో, శ్రీ భండారు శ్రీనివాసరావు వ్రాసిన ఒక వ్యాసం ప్రచురితమయింది నా కంట పడింది. క్రింద రచయిత పేరు చూసి వ్యాసం పూర్తిగా చదివాను. అలా మన చిన్ననాటి జ్ఞాపకాలు... పాత రిక్కా బజారు హైస్కూల్, మామిళ్లగూడెం మన ఇల్లు, పక్క మురికి కాలువ, మనం భోజనం చేసే మైసూర్ కేఫ్, "భోజనం తయార్" బోర్డు, "చలిగా ఉన్నది..చలి చలి వేస్తున్నది" అని కవిత రాసిన మీ స్నేహితుడు, మన నర్సింగరావు గారు, భండారు శ్రీనివాసరావు గారు, బాల మౌళి, నోముల వారు, గుర్రం వారు, బూర్లె వారు, దోసపాటి వారు, మొదలైన స్నేహితులు గుర్తుకొచ్చాయి. Pulse Polio కార్యక్రమం నిర్వహించబడుతున్నది కాబట్టి, మీ ఇంటి ఎదురుగా ఉండే Polio Friend మన క్లాసే కాని  History Student పేరు గుర్తు లేదు, Syed Rehman, Abdul Rehman, Shukur, వారి SC Hostel Friends, "గొట్టం పాపయ్య-పానుగంటి పిచ్చయ్య" అంటూ వుండే శ్రీ కొండలరావు సారు, మనకి మాత్రమే విడమర్చి చెప్పి మిగతా వాళ్లను కసురుకునే Venkat Ram Reddy సారు, "వనజ భవుండు నిన్నొసట..." అంటూ చెప్పే తెలుగు సారు అయ్యదేవర రామచంద్రరావు, బాగా కొట్టి చెప్పే సర్వ శ్రీ చిన్ని రామారావు, వీరభద్రం (Science), అవధాని, రసూల్ మొదలైన వారు, డ్రామాలు వేయించే సత్యం, Sitaramaiah మాస్టార్లు, కాలేజీకి వెళ్లేటప్పుడు నీవు సైకిలు తొక్కడం-నేను కూర్చోవడం, గుట్టల బజారు చడావ్ దగ్గర దిగడం-సైకిల్ తోయడం, లిటరేచర్ అనే పేకాట ఆడడం, Self Service Day, మన స్కూల్ ఒంటికన్ను చప్రాసి, పక్కనే జిలేబి అమ్మే హిందీ తాత, J H Prasad, Late M V K H Prasad,...ఇట్లా అందరూ జ్ఞాపకం వస్తూ ఎన్నో విషయాలు మదిలో మెలిగాయి. గయోపాఖ్యానం, దేవుని లాలూచీ, అనే స్కూల్ డ్రామాలు గుర్తుకొచ్చాయి. చిక్కడపల్లిలో నీ రూమ్మేట్స్ అయిన Late రంగారావు గారు (M A Public Administration), రమణ (రెబ్బారం), A Muslim Friend, Tajmahal Hotel Tracer ఉద్యోగం, "Buy and Cry" Pant, నా పురోహితుడి Duty, ఖమ్మంలోని సుందర్, ప్రభాత్, నవాబ్ మొదలైన సినిమా హాళ్లు,  Janveera, Navab, Cheena, Dharma లాంటి పెద్ద age గల మన Friends, ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్లేటప్పుడు బస్సులో నీకు వినిపించిన హరికధా కాలక్షేపం...మొదలైనవి మనసులో మెదిలాయి. ఇలా వ్రాస్తూ పోతూ ఉంటే అంతం ఉండదు. ఈ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు మన చిన్ననాటి సంగతులు అన్నీ ఏకరవు పెట్టి ముచ్చటించాలని ఉన్నది. మా అమ్మాయి వాళ్లు కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మొన్న ఈ మధ్య ఒకసారి మా అమ్మాయిని గురించి హైదరాబాద్ వచ్చాను. కాని నీ Phone నెంబరుకి Phone చేసినా ఫోన్ మారిందా ఏమో నెంబరు పలక లేదు. సమయం లేనందున కలవలేకపోయాను.    

ఇలా ఈ పత్రిక తిరగేస్తూ శ్రీ భండారు శ్రీనివాసరావు గారి వ్యాసం చదువుతూంటే, వారిని గురించిన జ్ఞాపకాలు కూడా వచ్చాయి. AIR లో వింతలు-విశేషాలు అనే వారి వార్తలు లోగడ ప్రసారమవుతూ ఉండేవి. తర్వాత ఆయన రష్యా వెళ్లినట్లుగా నీవు చెప్పావు. ఇలాంటివే మరెన్నో వ్యాసాలు, ప్రజలకి, ఈనాటి యువతకి పనికి వచ్చే ట్లుగా వ్రాయాలని శ్రీ భండారు వారిని మరీ మరీ కోరుతున్నాను. ఈ విషయాలలో వారితో Personal గా ఒకసారి Discuss చేయాలని అనుకుంటున్నాను. మన భారత దేశం ఒక పుణ్యభూమి. ఎంతో మంది మేధావులకు, మహానుభావులకు జన్మనిచ్చిన మాతృ భూమి. మన వేదాలు, పురాణాలు, మన సాంఘిక ఆచార వ్యవహారాలు, మొదలైనవన్నీ మన ఉనికి, మనుగడలకై ఎంతో ఉపయోగపడేవిగా నిర్ణయించబడి, ఆచరించబడుతున్నవి. ఈ ఆచారాలన్నీ మన శీతోష్ణ స్థితి, Environment పై ఆధారపడి ఉన్నాయి. వాటిని వదిలేసి, పాశ్చాత్య నాగరికతలో ఈనాటి భారతీయుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఆరోగ్య దృష్ట్యా, తోలు చెప్పులు, నూలు దుస్తులు, తాజా ఆహారం, సాత్విక మితాహారం తీసుకోవాల్సి వుండగా Plastic చెప్పులు, బూట్లు, Synthetic దుస్తులు, ఫ్రిజ్ లో నిలవ వుంచిన Tinned Foods తీసుకుంటున్నారు. Christianity లో లాగా మన మతానికి ఒక క్రమశిక్షణ లేదు. మన తాత-ముత్తాతలు శివుడు, విష్ణువులను, మనం వెంకటేశ్వరుడు మొదలైన వారిని దేవుడిలాగా పూజించాం. ఈ నాటివారు బాబాలను, జిల్లెడమూడి అమ్మలను, తాంత్రిక స్వాములను, ఇలా వెలిసిన వూరికొక దేవ దూతలను పూజిస్తున్నారు. వేలు ఖర్చు చేసి దేవుడికి కళ్యాణం చేయిస్తాం కాని మన పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. మన చరిత్రలోని మంచిని తీసుకోం. ధర్మరాజు అబద్ధం చెప్పలేదా?, కృష్ణుడు మాయ చేసి యుద్ధంలో పాండవులను గెలిపించలేదా? అని విమర్శిస్తూ ఉంటాం. ఉన్న గుళ్లు చాలన్నట్లు ప్రతి రోజూ, ప్రతి వూళ్లో గుడి కట్టడానికి చందాలు వసూలు చేస్తుంటారు. ప్రజలు నడిచే రోడ్లను ఆక్రమించి చిన్న-చిన్న గుళ్లను కట్టారు. అంతేగాని, మదర్ థెరిస్సాలాగా బీదవారికంటూ మన వాళ్లు నడిపే Poor Homes ఏమీ లేవు. ఒకడు నిజాయితీగా వ్యాపారం చేస్తూ తృప్తిగా జీవిస్తుంటే, పక్కవాడు ఏదో మతలబులు చేసి, బాగా సంపాదిస్తూ మేడలు-కార్లు కొంటుంటే, మొదటి వాడిని శుంఠ-చేతకానివాడి కింద లెక్క కడతారు. రెండవ వాడిని తెలివి తేటలు కలవాడంటారు. అందరూ వాడినే గౌరవిస్తారు. మన ప్రభుత్వం కూడా Reservations కల్పించి ప్రజలకు మంచే చేస్తున్నప్పటికీ, కనీసం విద్య-వైద్య-సాంకేతిక-ఇంజనీరింగ్ రంగాల్లోనైనా Merit ఉన్నవాళ్లకు(Irrespective of the Caste) అవకాశాలు ఇవ్వకుండా, మార్కుల రాయితీలు ప్రకటించి నందువల్ల, ఈనాటి స్కూలు మాస్టార్లు "శ్రీ రఘురామ చారు తులసీ దళ ధామ" అంటే, "శ్రీరాములవారు తులసి ఆకులతో చారు కాచి" అని చెప్పే వారిగా మారిపోతున్నారు. అదే మన రోజుల్లో...మన చదువు తీసుకుంటే....మన చిన్నతనంలో మనం చదువుకున్న మన పాఠం, మను చరిత్రలోని పద్యం ఇంకా నాకు గుర్తున్నది. ఆ పద్యాన్ని నేను ఏమాత్రం చదవలేదు. కంఠస్థం అంతకన్నా చేయలేదు. లెక్చర్ విని, మాస్టారు విడమర్చి చదవగా విని గుర్తు పెట్టుకున్నాను. వాటిలో కొన్ని...."అచటి విప్రులు మెచ్చరఖిల విద్యా ప్రౌఢి, ముదిమది తప్పిన మొదటి వేల్పు.....అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ"; ధర్మరాజు రాజసూయ యాగం సందర్భంలో నన్నయగారి భారతంలోది..."చనపేడికి తారక్రియయును......కృష్ణు పూజించుటిలన్"; ఏనుగు లక్ష్మణ కవి సుభాషితం, "ఆకాశంబున నుండి, శంభుని శిరంబందుండి.....వివేక భ్రష్ట సంపాతముల్"; "జలమున నగ్ని, చాత్రమున జండ మయూఖుని.....మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే"; "అవనీనాధులనేకులుండగ విశిష్టారాధ్యుల్. ఆర్యుల్ పూజ్యులు పల్వురుండగ....దాశార్హుండు పూజార్హుండే"; "ఈతనికి ధనమిత్తురేని అభీష్టములైన కార్యముల్....అనర్హుడర్హుడని అత్యుతునచ్యుత చేయపాడియేధర్మవు ధర్మ నందనా"; 8th Class English లో "Her arms across her breast she laid she was more fair than words can say"; Waste Not Want Not Proverb లో శ్రీ గెంటాల రంగారావు గారు చెప్పిన మాటలు "Economy does not mean stringency. One must enjoy life according to his status and earnings. If he goes beyond it he may be called Spend Thrift".

పై విషయాలన్నీ నీకు Bore కలిగించవచ్చునేమో కాని, ఇక్కడ ఖాళీగా ఉన్న నాకు (ఈ రోజు ఆదివారం...ఒంటరిగా ఆఫీసులో ఉన్నాను) ఏదో రాయాలనిపించి, నీవు కూడా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఆనందించుతావని వ్రాస్తున్నాను.

ఇంకో విషయం. మనకు ముఖం తెలియని వాడెవడో బాబా గురించి ఉత్తరం వ్రాస్తూ, ఇలాంటి ఉత్తరం 100 ప్రింట్ చేయించి Mr. Ex లక్ష రూపాయలు లాటరీ కొట్టాడు, Mr. Y నిర్లక్ష్యం చేసి తలపగిలి లేదా పాము కాటుకు గురై చచ్చాడని అంటూ, ఇలాంటివే 100 ప్రింట్ చేసి బట్వాడా చేయాలని వ్రాస్తూ వుంటారు. హిందూ మతం దిగజారడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? మన రోజుల్లో మనకు తెలిసింది, తెలియని వాళ్లకి విడమర్చి చెప్పే వాళ్లం. ఈ రోజుల్లో చెప్పడం చేత కాదు కొందరికి. చెప్పితే ఎక్కడ నేర్చుకుంటాడో అని ఈర్ష్య కూడా. ఆ రోజుల్లో Cricket గురించి, Sixer, Four, Wide, Wicket అంటూ చెప్పింది నీవే. ఈ రోజుల్లో ప్రతి పిల్లాడికి తెల్సుననుకో. ఇంత భారతం వ్రాయడానికి, ఇన్ని విషయాలు మననం చేసుకోవడానికి ధనస్సు రాశిలో వ్రాసిన వార ఫలాలు కూడా కాకతాళీయంగా ఏకీభవిస్తున్నాయి! (ఒక పేపర్ క్లిప్పింగ్‌ను వాడి వుత్తరానికి జత పర్చాడు. అందులో వార ఫలాలలో ధనస్సు రాశివారికి " చిన్ననాటి జ్ఞాపకాలు రాగలవు" అని వుంది. బహుశా వాడి జన్మ రాశి ధనస్సు కావచ్చు).

More details in my next letter. I request you to please reply for this letter at least because this is my second letter to you from Gaya. My kind enquiries to one and all of your family members and also to Mr. B. Srinivasa Rao and his family members. Please show this letter to Mr. Bhandaru Srinivasa Rao  also.

Yours Loving Friend,
L. V. R. S. Mvr Sharma

మరో జ్ఞాపకం



జర్నలిస్టులకు బాంకు రుణాలు గురించి కృష్ణమోహన్ గారు రాసింది చదివినప్పుడు గతం గుర్తుకు వచ్చింది. కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను హైదరాబాదు వచ్చి అప్పటి బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని పత్రికా రచయితలు ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవదానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర)వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు  వాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన  ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు.  ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఆయన వెంటనే స్పందించి  అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి  లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం  తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం. రెండు రోజుల తరువాత కోటీ లోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను.  బాంకు అధికారి స్కూటరు  లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ  మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు. ఆ రోజుల్లోనే,  గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఎక్స్ ప్రెస్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. మా వైభోగం  ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు. కాకపొతే, చివరికి ఆ స్కూటరే నన్ను వార్తల్లోకి ఎక్కించింది. ఆ ఉదంతం పోలీసులు పట్టుకుని అరెస్టు చేసేవరకు వెళ్ళింది.( ఆ సమాచారం మరోమారు)


(1987 లో గిర్నార్ స్కూటర్ పై నేనూ నా పిల్లలు సందీప్, సంతోష్ )

2, జులై 2013, మంగళవారం

జర్నలిస్టుల జీవితాల్లో పైకి కనిపించని ఓ విషాద కోణం


జర్నలిస్టు వృత్తి జీవితం తొలినాళ్ళలో నేను కలిసి తిరిగిన అనేకమంది మిత్రులు-తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి వాళ్ళు పనిచేస్తున్న పత్రికలకే ఎడిటర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉచ్చస్తితిలో వున్నప్పుడు వాళ్ళని కలుసుకోవాలంటే మహామహులకే దుర్లభంగా వుండేది. విజిటింగ్ కార్డు పంపి అనేకమంది వెయిట్ చేస్తున్న సమయాల్లో కూడా వాళ్ళు- నాతో గతకాలంలో గడిపిన రోజులు మరచిపోకుండా -నన్ను తమ సన్నిహిత వర్గంలోని వాడిగానే పరిగణించి ఆదరించేవారు. అది వారి గొప్పతనంగా నేను భావిస్తాను.
 విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించి విలేకరిగానే పదవీ విరమణ చేసినవాడిని నేను. నా బోటి వాళ్ళే  ఈ వృత్తిలో ఎక్కువగా వుంటారు. అతికొద్దిమంది మాత్రమె తమ ప్రతిభతో పైమెట్లు  ఎక్కగలుగుతారు. నాది ఒక రకంగా సర్కారు ఉద్యోగం కనుక ఎక్కవలసిన మెట్లు తక్కువే. ఎక్కగలిగిందీ తక్కువే. గోదావరిలో ఎన్ని నీళ్ళున్నా మనం బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు మన ప్రాప్తాన్నిబట్టి తెచ్చుకోగలుగుతామని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు చెప్పిన విషయం గుర్తుంచుకోవడం వల్ల ఈ మెట్లెక్కే గొడవ నా మనసుకు ఎక్కలేదు. అయినా ఈనాటి లోకం పోకడ ఇందుకు విరుద్దం. పొజిషన్ ను బట్టి పలకరింపులు, స్తాయిని బట్టి సాన్నిహిత్యాలు, హోదాని బట్టి ఆహావోహోలు. కానీ నా అదృష్టం నా మిత్రులెవ్వరు ఈ కోవలోకి రారు. అందుకే ఇన్నేళ్ళ తరవాత కూడా వారు నాతో  ప్రవర్తించే తీరులో ఇసుమంత తేడా లేదు.
కీర్తి శేషులు, శ్రీయుతులు జి కృష్ణ, నండూరి రామమోహన రావు, పీటీఐ కృష్ణ, హిందూ రాజేంద్రప్రసాద్,  ఆంధ్రపత్రిక ముక్కు శర్మ, ఈనాడు శాస్త్రి, యుఎన్ఐ డి సీతారాం, పార్ధసారధి, ఎక్స్ ప్రెస్ సుందరం, నీలంరాజు మురళీధర్, శ్రీకాంత్ విఠల్, ఆలిండియా రేడియో పన్యాల రంగనాధ రావు, నర్రావుల సుబ్బారావు, గోవాడ సత్యారావు, తిరుమలసెట్టి శ్రీరాములు, జ్యోతి దామోదరస్వామి, ప్రభ నంద్యాల గోపాల్, పీటీఐ జమాల్ వంటివారితో  కలిసిమెలిసి తిరగగలిగే అదృష్టం నాకు దక్కింది. అలాగే, శ్రీయుతులు ఆంద్ర జ్యోతి  ఆదిరాజు వెంకటేశ్వర రావు,  ఈనాడు ఏబీకే ప్రసాద్, ఆంద్రజ్యోతి తుర్లపాటి కుటుంబరావు, ఐ. వెంకట్రావు, ఎన్.ఇన్నయ్య, వేమూరి రాధాకృష్ణ, హిందూ కేశవరావు, ఎస్.నగేష్ కుమార్, కె. శ్రీనివాస రెడ్డి,  ప్రభ పొత్తూరి వెంకటేశ్వరరావు, దేవులపల్లి అమర్, నందిరాజు రాధాకృష్ణ, జ్యోతి రామచంద్రమూర్తి, ఆంధ్రభూమి ఎంవీఆర్ శాస్త్రి, క్రానికల్ రబీంద్రనాధ్, పెద్ద బాబాయి కృష్ణారావు, విశాలాంధ్ర శ్రీనివాసరెడ్డి, ఆంధ్రపత్రిక శాస్త్రి, విద్యారణ్య, ప్రజాశక్తి వినయకుమార్, ఎన్ఎస్ఎస్ కొండా లక్ష్మారెడ్డి, ఈనాడు యాదగిరి, వేణుగోపాల్, నందిరాజు రాధాకృష్ణ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ నందిరాజు రాధాకృష్ణ, ఆలిండియా  రేడియో ఎంఎస్ఆర్ కృష్ణారావు,  ఆకిరి రామకృష్ణారావు, ఆర్వీవీ కృష్ణారావు, డి.వెంకట్రామయ్య, మాడపాటి సత్యవతి   ఒకరా ఇద్దరా జర్నలిజంలో కాకలు తీరిన అనేకమందితో చనువుగా మసలగలిగే అవకాశాన్ని నా రేడియో విలేకరిత్వం నాకు అందించింది. నిజానికి వీరిలో చాలామందితో నా సాన్నిహిత్యం గారు వంటి గౌరవ పద ప్రయోగాలతో ముడిపడివుండలేదు. చాలా చనువుగా పలకరించుకోగల సంబంధ బాంధవ్యాలు వుండేవి. దాదాపు ప్రతి రోజు సెక్రెటేరియేట్  లోని ప్రెస్ రూం లో కలుసుకునేవాళ్ళం. పత్రికా సమావేశాలు లేనప్పుడు కొన్ని గంటలపాటు మా నడుమ ముచ్చట్లు సాగేవి. పెద్దా చిన్నా తేడా లేకుండా ఒక కుటుంబంలోని సభ్యులమాదిరిగా గడిపేవాళ్ళం. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్   సుందరం  కనపడగానే సుందరం మనమందరం అని ఏదో కవిత్వ ధోరణిలో పలకరించినా ఆయన  ఏమీ అనుకునేవాడుకాదు. పైగా నవ్వి వూరుకునేవాడు. మా ఇద్దరి నడుమా మరో బాదరాయణ సంబంధం వుండేది. గుజరాత్ గవర్నమెంటు వారి గిర్నార్ స్కూటర్ ను మేమిద్దరం ఒకేరోజు, ఒకే డీలర్ దగ్గర కొన్నాము.  హైదరాబాదులో అమ్ముడుపోయిన గిర్నార్ స్కూటర్లే బహు తక్కువ. వాటిల్లో రెండింటికి మేమిద్దరమే  ఓనర్లం. ఆ రోజుల్లో వెస్పా స్కూట ర్లకు పెద్ద గిరాకీ వుండేది. కొనుక్కోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వుండేవి. అందుకే మరో మాట లేకుండా మేమిద్దరం గిర్నార్ స్కూటర్లు కొనుక్కున్నాము. అదీ ఏదో బ్యాంకు అధికారి జర్నలిష్టులమని అప్పివ్వబట్టి.
‘ఐ నో సీఎం. ఐ నో పీఎం’ అనుకునే  జర్నలిస్టుల జీవితాలు పైకి కనిపించినంత గొప్ప కరెన్సీ కాగితాలేమీ కావు.  వారికి వృత్తి రీత్యా  సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో  పరిచయాలకు ఆస్కారం చాలా తక్కువ. అందుకే, కొందరు సాటి జర్నలిస్టులు  చనిపోయినప్పుడు  విషయం  తెలిసికూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్లి పరామర్శించలేకపోవడానికి ఇదే కారణం. చనిపోయిన వ్యక్తీ తప్ప వేరే ఎవ్వరు తెలవదు. తెలిసిన ఒక్కరికి మనం  వచ్చిన విషయం తెలియదు. ఇది పైకి చెప్పుకోలేని ఓ  పెను విషాదం.

1, జులై 2013, సోమవారం

డాక్టర్స్ డే


ఆరేళ్లక్రితం డిసెంబర్ నెలలో ఓ మంగళవారం.
వైద్యుడనేవాడు ఎలావుండాలో అలాగే యెలా వుండకూడదో ఆనాడు  హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన రెండు సంఘటనలు అద్దం పట్టి చూపించాయి.
ఆ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లు (జూడాలు అని సంక్షిప్త నామం ఎవరు పెట్టారో కాని బాగా ఆలోచించి పెట్టినట్టున్నారు) హమ్ ఏక్ హై’  అంటూ ఆస్పత్రి వెలుపల చేరి నినాదాలు చేస్తున్న సమయంలో
నిలోఫర్ లో  మరో పసి కందు మృతి,సకాలంలో  వైద్య సాయం అందక  మరణించిన శిశువుల సంఖ్య పదికి పెరిగింది, పదిహేనుకు  పెరిగిందంటూ క్రికెట్ స్కోరు మాదిరిగా టీవీ ఛానళ్లలో అదేపనిగా స్క్రోలింగులు వస్తున్న సమయంలో-
ఒక మృత శిశువును  వొడిలో పెట్టుకుని (నాటి) తల్లి తెలంగాణాఅధినేత్రి రాములమ్మఅదే ఆసుపత్రి ఆవరణలో టీవీ కెమెరాల ముందు వీరంగం వేస్తున్న సమయంలో-
అదే  ఆసుపత్రిలో అదే ఆసుపత్రికి చెందిన కొందరు సీనియర్ డాక్టర్లు  మూడు కాళ్లు, నాలుగు పాదాలు కలిగిన ఆరేళ్ళ అనాకారి బాలుడికి తొలి దశ శస్త్రచికిత్సను  విజయవంతంగా  పూర్తిచేసి, ‘వైద్యో నారాయణో హరిఅనే సూక్తిని నిజం చేశారు.
అంతకుముందు ఆదివారం రాత్రి అదే  ఆసుపత్రిలో ఒక మజ్లిస్ శాసన  సభ్యుడికీ, జూడాలకూ నడుమ మొదలయిన  సంవాదం సాగి, సాగి, చిలికి చికి  గాలివానగా మారింది. ఆ శాసన సభ్యుడు  తమపై దాడికి దిగారని ఆరోపిస్తూ, అతడిని అరెస్టు చేయాలనీ, అతడి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలనీ డిమాండు చేస్తూ జూడాలు ఆకస్మికంగా మెరుపు సమ్మెకు దిగి విధులను బహిష్కరించారు. విధి నిర్వహణలో  వున్న వైద్యులపై దాడులను ఎవ్వరూ సమర్ధించరు. కానీ, వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన పసిప్రాణాలతో చెలగాటమాడే వైఖరిని కూడా ఎవరూ హర్షించరు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న అవాంచనీయ ధోరణులు, అసహన వైఖరులు పవిత్రమయిన వైద్య వృత్తిని కూడా వొదిలిపెట్టకపోవడమే ఆందోళన కలిగించే విషయం. ఆలోచించాల్సిన విషయం.
ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి ఆందోళనలూ, సమ్మెలూ అవసరమని అందరూ ముక్త కంఠంతో చెబుతుంటారు. కానీ అవే ఆందోళనలు ప్రజలకు మరికొన్ని కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయన్న  వాస్తవాన్ని మరచిపోతుంటారు. నిజమే, ఆనాటి సంఘటనవల్ల  జూడాలలో ఒకరిద్దరి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు  సమ్మెకు దిగారు సరే, కానీ వారి ఆందోళలన వల్ల వైద్యం సమయానికి అందక  అనేక నిండు ప్రాణాలే పోయాయి. వాటి సంగతేమిటి?  ఇలాటి వాస్తవాలను గుర్తించనంతవరకూ, అలా ఆందోళనలకు దిగే వారికి ప్రజల మద్దతు లభించదు. సరిగ్గా అదే జరిగింది కూడా.

మొత్తమ్మీద జూడాల సమ్మె ముగిసింది. అన్ని సమ్మెలు యెలా ముగుస్తాయో దీనికీ అలాటి ముగింపే లభించింది.
కానీ, వైద్యుల ప్రవర్తనపై మీడియాలో మాత్రం విస్తృత చర్చే జరిగింది.
వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును డాక్టరు గారుఅని గౌరవంగా
సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో  తెచ్చుకున్న తోలుపటకా సంచీనుంచి మందు  గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. పంటలు  చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి  ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. సైకిల్ డాక్టరుగారని పిలవడం మినహా ఆయన అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. నాడి  పట్టుకుని చూసి ఇప్పుడెలావుందయ్యా రాముడూఅని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మోహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యంగా వుండేది.
మరి ఇప్పుడో. ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ  పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి.  పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!
మా చిన్న తనం రోజులు కానీ, ఆరేళ్ళ క్రితం సంఘటన కానీ గుర్తుచేసుకున్నప్పుడు, మార్పేమయినా కానవస్తున్నదంటారా!

కనీసం ఈనాడు డాక్టర్స్ డేజరుపుకుంటున్న సమయంలోనయినా మంచి మార్పు వస్తుందని ఆశించవచ్చంటారా!!  (01-07-2013)