18, జులై 2011, సోమవారం

బుడుగు (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో)

బుడుగు (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో)  
-భండారు శ్రీనివాసరావు




(ఇంగ్లీషులో TINTUMON అని మరో బుడుగ్గాయ్ వున్నాట్ట. వాడి గురించిన ఇంగ్లీష్ జోకులు ఈ మధ్య ఎవరో పంపితే వాటిని   అచ్చ తెలుగులో అనువదిస్తే యెలా వుంటుందన్న ఆలోచనకు అక్షర రూపమే ఇది.- అచ్చంగా ఇది నా సొంతం కాదని బ్లాగు గుద్ది మరీ మనవి చేసుకుంటున్నాను.- భండారు శ్రీనివాసరావు)




“ఒరేయ్ బుడుగు కన్నా. నేను నీ నాన్ననుకదా. నువ్వు అల్లరి చేస్తే నాకు కోపం రావాలి కదా. వచ్చి బెత్తంతో గాట్టిగా కొట్టాననుకో. నీకూ ఉక్రోషం రావాలి కదా. అప్పుడు ఏం చేస్తావురా?”


“నువ్వు నాన్నగాడివికదా. కొట్టేస్తావ్. నేను చిన్న పెద్దోడిని కదా.నిన్నేమీ అనలేను కదా. అందుకని లెట్రిన్ లోకి వెళ్లి కమోడ్ శుభ్రం చేస్తాను.”


“అదేమిటి? కమోడ్ కడిగితే నీ కోపం తగ్గుతుందా.యెలా?”


“యెలా ఏమిటి యెలా. అదే మీ పెద్దోళ్ళకు మా చిన్నోళ్ళకు తేడా. నేను లెట్రిన్ కడిగేది నీ టూత్ బ్రష్ తో.”



బుడుగుని తీసుకుని వాళ్ల నాన్న ఆరోజు జూ పార్క్ కు వెళ్లాడు. బోనులో వున్న పులిని చూపించి అది ఎంత భయంకరమయిన జంతువో కొడుక్కుచెప్పసాగాడు.ఓ కంటితో పులిని చూస్తూ ఓ చెవితో తండ్రి చెబుతున్నది వింటున్న బుడుగు వున్నట్టుండి ఇలా అడిగాడు. “పులి అమాంతం బయటకు వచ్చి నిన్ను తినేసింధనుకో. అప్పుడు ఇంటికి వెళ్ళడానికి నేను యే బస్సు ఎక్కాలి?”



బుడుగు స్కూలుకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు పిల్లలకు ట్రాఫిక్ పాఠాలు నేర్పిస్తున్నారు. బుడుగును పిలిచి ఏదయినా స్లోగన్ రాయమన్నారు. బుడుగు రాసిన స్లోగన్ ఇలా వుంది.


“ఇది స్కూలు జోన్. చిన్నపిల్లలు రోడ్డు దాటుతుంటారు. వాహనాలు వేగంగా నడిపి మమ్మల్ని చంపకండి. టీచర్లు వచ్చేదాకా ఆగండి”



బుడుగు స్కూల్లో అసెంబ్లీ జరుగుతోంది. పిల్లలు ఎవరిమట్టుకు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ప్రిన్సిపాల్ చెప్పేది ఎవరికీ వినబడడం లేదు. ఆయనకు చర్రున కోపం వచ్చింది.


“ఏమిటిది ? ఇది స్కూలనుకున్నారా!మీ ఇల్లనుకున్నారా! వెధవలందరూ ఒకచోట చేరినట్టుంది. ఒకరి తరవాత ఒకరు మాట్లాడలేరా? ఆయ్!” అంటూ గయ్యిమన్నాడు.


బుడుగు లేచి అన్నాడు.


“సరే!ముందు మీరు మొదలు పెట్టండి”



బుడుగుతో టీచరు చెప్పింది.


“నువ్వొక బిల్ గేట్స్ అంత ధనవంతుడివి అనుకో. అనుకుని నీ జీవిత చరిత్ర రాయి”


బుడుగు ఉలుకూ పలుకూ లేకుండా కూచోవడం చూసి ఎందుకు రాయడం లేదని అడిగింది.


“నా సెక్రెటరీ కోసం చూస్తున్నాను” బుడుగు జవాబు చెప్పాడు.



మెడిసిన్ చదువుతున్న సీగాన పెసూనాంబ అనే రెండు జెళ్ళ సీతను వాళ్ళింటి కొచ్చిన ప్రొఫెసర్ అడిగాడు.


“ఎటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఏమిటి” అని.


పక్కనున్న బుడుగు వెంటనే జవాబు చెప్పాడు.


“జంబలకడి పంబ”


ప్రొఫెసర్ అర్ధం కాలేదన్నాడు.


“మీరడిగింది నాకూ అంతే”-బుడుగు జవాబు.

(18-07-2011)

16, జులై 2011, శనివారం

నాన్న చెప్పిన మాట – భండారు శ్రీనివాసరావు

నాన్న చెప్పిన మాట – భండారు శ్రీనివాసరావు

ఇన్నేళ్ళ తరువాత కూడా నా చిన్ననాటి ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది.

ఆ రోజుల్లో ఇంటెడు చాకిరీతో అమ్మ ఎంతో కష్టపడుతుండేది. అయినా, ఎన్ని పని తొందరలు వున్నా నాకిష్టమయిన చిరుతిళ్ళు మాత్రం టంచనుగా చేసిపెడుతుండేది. చిన్నతనం వల్ల కావచ్చు, అమ్మ చేసిన గారాబం వల్ల కావచ్చు అమ్మ ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక పెట్టి సతాయించేవాడిని.

ఓ రాత్రి అమ్మ నాన్నకు భోజనం పెడుతుంటే చూశాను. అన్నం మాడిపోయివుంది. దానికి తోడు చల్లారిన చారు. కానీ నాన్న మారుమాట్లాడకుండా, మారు అడిగి మరీ భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయాను.

మర్నాడు అమ్మ నాన్నతో అంటోంది. “రాత్రి అన్నం మాడిపోయింది. మళ్ళీ చేసిపెట్టే టైం లేకపోయింది. మీరు అలానే తిని నైట్ డ్యూటీకి వెళ్లారు. నాకెంతో బాధ వేసింది.”

అప్పుడు నాన్న చెప్పిన జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.

“భలేదానివే. అన్నం మాడిపోయిందని నీవనుకుంటున్నావు. నాకు మాత్రం మాడిపోయిన అన్నం చెక్కలంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ అలా మాడిపోయిన అన్నం చెక్కలపై పేరు నెయ్యి  రాసి పెడితే ఆవురావురుమంటూ తినేవాడిని తెలుసా!”

నాన్న మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఆ రాత్రి అమ్మ వంటింట్లో పనిలో వున్నప్పుడు చూసి అడిగాను.

“ ఒరేయ్ నాన్నా”

నాన్న నన్ను ముద్దుగా ‘నాన్నా’ అని పిలుస్తాడు.

“అమ్మ వుదయం నుంచి రాత్రిదాకా ఎంత కష్టపడుతున్నదో రోజూ చూస్తున్నాం కదా. అప్పటికే బాగా అలసిపోయి వుంది. అంత రాత్రప్పుడు మళ్ళీ ఏం వొండి పెడుతుంది చెప్పు. అయినా ఒక్క రోజు మాడిన అన్నం తింటే ఏమవుతుంది ? కడుపు మాడదు కదా!

“ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో.

“జీవితంలో అన్నీ మన కిష్టమయినట్టు జరగవు. మనం ఇష్టపడ్డ మనుషులే మనకు తారసపడరు. అన్నీ సవ్యంగా సక్రమంగా జరగాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ సవ్యంగా జరగని వాటికి మనం ఇతరులను తప్పు పట్టటం పెద్ద తప్పు. ఆ తప్పు నువ్వెప్పుడు చేయకు. ఇంకో విషయం. నాకు వొంట చేయడం రాదుకదా కనీసం గ్యాస్ పొయ్యి వెలిగించడం కూడా రాదు. ఇక అమ్మ చేసే వంటకు వంక పెట్టే హక్కునాకెలా వుంటుంది చెప్పు.

“ఇన్నేళ్ళ జీవితంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఇతరుల పొరబాట్లను మంచి మనసుతో స్వీకరించగలగాలి. అప్పుడే నలుగురితో మన సంబంధాలు బాగుంటాయి. ఆ సంబంధాలే పది కాలాలపాటు చెక్కుచెదరకుండా వుండి జీవితాలకు శోభనిస్తాయి.

“మళ్ళీ చెబుతున్నా విను. ఇతరులలోని మంచితనాన్ని గ్రహించే శక్తిని భగవంతుడు నీకివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పక్కవారి తప్పులను ఎత్తిచూపే దుర్గుణం నీనుంచి దూరం కావాలన్నది కూడా నా కోరిక.

“నీ జీవితంలో ఎదురయ్యే చెడు సంఘటనలను, నీ మనసులో మెదిలే చెడు ఆలోచనలను ఆ భగవంతుడి పాదాలవద్ద వొదిలెయ్యి. నువ్వు గ్రహించిన మంచిని నీలోనే వుంచుకో. ఆ చెడ్డ విషయాల సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. నీ మంచి మాత్రం నిన్ను మంచి దోవలో నడిపిస్తుంది. అప్పుడు మాడిపోయిన అన్నం కూడా నీకు పరమాన్నంలా అనిపిస్తుంది.”

ఇదో కధ అనుకుంటే ఇందులోని నీతి:

జీవితంలో మీరు కలిసే వారెవరో, మీకు తారసపడేవారెవరో కాలమే నిర్ణయిస్తుంది.
మీరు కోరుకునే వ్యక్తులను మీ మనసే నిర్ణయిస్తుంది.
కానీ జీవితంలో మీ వెంట నడిచే వ్యక్తులెవరన్నది మీ ప్రవర్తనే నిర్ణయిస్తుంది.
ఇతరుల తప్పిదాలను తేలిగ్గా తీసుకుని, ఇతరులతో విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు నడిస్తే ఇతరులతో మీ సంబంధాలు శాశ్వితం అవుతాయి. జీవితం పూల పానుపు అవుతుంది. లేకపోతే ముళ్ళ కంపగా మారుతుంది.
 (16-07-2011)

15, జులై 2011, శుక్రవారం

అమ్మా నాన్నా ఒక అమ్మాయి - భండారు శ్రీనివాసరావు

అమ్మా నాన్నా ఒక అమ్మాయి - భండారు శ్రీనివాసరావు

‘డియర్ నాన్నా!’

ఒక్క క్షణం ఆ తండ్రికి చేతులు వొణికాయి. మనసు కీడు శంకించింది. భార్యను పిలుద్దామనుకున్నాడు. లిప్తపాటు ఆలోచించి ఆ ఆలోచన మానుకున్నాడు. మనసు కుదుట పరచుకుని కుమార్తె రాసిన ఉత్తరాన్ని చదవడం ప్రారంభించాడు.

“డియర్ నాన్నా! ఇలా నిన్ను పిలిచే అదృష్టానికి నా అంతట నేనే దూరం జరుగుతున్నాను. అల్లారుముద్దుగా, ఏలోటూ తెలియకుండా నన్ను పెంచారు. దానికి ప్రతిఫలంగా నేనిస్తున్న కానుకే ఇది.

“కారణం తెలియదు కానీ, రామూని నేను మరచిపోలేకపోతున్నాను. అందుకే అతడితో వెళ్లి పోతున్నాను. నాన్నా! ఇంత నిస్సిగ్గుగా రాస్తున్నానన్న కోపంతో ఈ ఉత్తరాన్ని చించేయకండి. దయచేసి చివరదాకా చదవండి నాన్న. దగ్గరగా లేకపోయినా మీ కంటిలోని తడిని నేను దూరంనుంచే చూడగలుగుతున్నాను. ఈ క్షణంలో భూమి బద్దలయితే బాగుండని అనుకుంటూ మనసులో పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకోగలుగుతున్నాను. ఒక్క విషయాన్ని మీరూ పెద్దమనసుతో అర్ధం చేసుకోండి నాన్నా. ఇంతవరకు నా జీవితంలో అపరిమితమయిన ప్రేమను పంచి ఇచ్చింది మీరూ అమ్మా మీరిద్దరే. అలాగే నాకో నమ్మకం, మీకంటే, అమ్మకంటే నన్ను ఇంతగా ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో మరెవరూ వుండరని. కానీ రామూ పరిచయంతో ఆ నమ్మకం కాస్తా ఆవిరై పోయింది.

“రామూ లాంటి వ్యక్తులు మీకు నచ్చరని తెలుసు. అలాగే, అతడికున్న అలవాట్లను మీరు కలలో కూడా భరించలేరని, క్షమించలేరని కూడా నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేసే సాహసం చేయలేకపోయాను. కానీ, మీరు తెలుసుకోవాల్సింది కూడా వుంది నాన్నా. రామూ అంటే నాకు పిచ్చి ప్రేమ. ఆ ప్రేమ ముందు అతడి అలవాట్లు, అతడి మొరటుతనం ఏదీ నాకు ఆనడం లేదు. అతడిమీద ప్రేమతో నా కళ్ళు మూసుకుపోయాయి. అతడి చెడ్డ అలవాట్లన్నీ ఇప్పుడు నాకు మంచిగా కనబడుతున్నాయి. అతడి సమక్షంలో నేను వేరే వ్యక్తిని అన్న భావన కూడా రాదు. అతడికేది ఇష్టమయితే దాన్నే నా ఇష్టంగా మలుచుకోవడం నాకిష్టం. ఆ ఇష్టంతోనే అతడికిష్టమని నేనూ సిగరెట్లు తాగుతున్నాను. అతడి కోసమే మందు, భంగు అలవాటు చేసుకున్నాను. రామూ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నా నాకు మరో విధంగా అనిపించడం లేదు. అంటే అతడిపై నేను ఎంతగా ప్రేమను పెంచుకున్నానో, దాని తీవ్రత ఎంతగా వుందో దయచేసి అర్ధం చేసుకోండి నాన్నా.

“నిజమే! కాదనను. వయస్సులో మా ఇద్దరి మధ్యా ఎంతో వ్యత్యాసం. కొద్ది అటూ ఇటూగా మీ వయసు అతడిది. అయితేనేం! అతడి మీద నాకున్న ప్రేమ కూడా అంతే పెద్దది. అంతే గొప్పది. అది అర్ధం చేసుకోండి నాన్నా. అన్నీ అర్ధం అయిపోతాయి.

“అల్లరి చిల్లరగా తిరుగుతాడనే రామూ వాళ్ల అమ్మా నాన్నా అతడిని వొదిలేశారట. ఇంటి నుంచి తరిమేశారట. ఈ స్తితిలో నా తోడు కూడా అతడికి దూరం అయితే ఏమయిపోతాడో అని నా బెంగ. ఇంకో విషయం కూడా ఈ మధ్యనే తెలిసింది. దానితో అతడి పట్ల నా జాలి మరింత పెరిగిపోయింది. రామూకు ఎయిడ్స్ అని డాక్టర్లు చెప్పారట. ఇన్ని రోగాలకు మందులు కనుకున్న శాస్త్ర వేత్తలు ఏదో ఒకనాడు ఎయిడ్స్ కు చికిత్స కనుక్కోలేకపోతారా నేను బాగుచేయించలేకపోతానా చెప్పండి.

“బాధ పడకండి డాడ్! ఇప్పుడు నా వయసెంతని. నిండా పదిహేనేళ్ళు కూడా నిండనే లేదు. కాకపోతే నా బాగోగులు నేనే చూసుకోగల మనస్తయిర్యాన్ని మీ పెంపకంలో అలవర్చుకున్నాను. అదే పదివేలు. ఏదో ఒక రోజు మీ మనుమడిని తీసుకుని రామూని వెంటబెట్టుకుని మిమ్మల్నీ అమ్మనీ చూడడానికి వస్తాను. అంతదాకా సెలవ్ – మీ – ముద్దుల కూతురు”

పీ ఎస్: - "డాడ్! పైన రాసినదంతా శుద్ద అబద్ధం. నేను పక్కింట్లో సుధక్కతో కూర్చుని చెస్ ఆడుతున్నాను. రామూ లేడూ సోమూ లేడూ అంతా ఉత్తిదే. నా స్కూలు ప్రోగ్రెస్ కార్డు కంటే దారుణమయిన విషయాలు లోకంలో ఇంకా చాలా వుంటాయని చెప్పడానికే ఇదంతా రాశాను. కార్డు పక్కనే సొరుగులో వుంది. చూసీ చూడనట్టుగా చూసి సంతకం పెట్టండి. పెట్టి ఫోను చేయండి. ఇంటికి వస్తాను.”

(15-07-2011)

నమ్మకం – అపనమ్మకం – భండారు శ్రీనివాసరావు

నమ్మకం – అపనమ్మకం – భండారు శ్రీనివాసరావు

ఒక పోలీసు అధికారిని డిఫెన్స్ లాయరు కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాడు.

ఆ సంభాషణ ఇలా సాగింది.

“ఘటనా స్తలం నుంచి నా క్లయింట్ పారిపోవడం మీరు చూసారా?”

“లేదు. కానీ ఘటన జరిగిన ప్రదేశం నుంచి కొద్ది దూరంలో ముద్దాయిని పోలివున్న ఒక వ్యక్తి పారిపోతుండగా చూసాను.”

“ముద్దాయి పలానా విధంగా వుంటాడని మీకు చెప్పిందెవరు?”

“నా కంటే ముందు అక్కడికి వెళ్ళిన నా కింది అధికారి చెప్పాడు.”

“ముద్దాయి అని అనుకుంటున్న వ్యక్తి పలానా విధంగా వుంటాడని మీ తోటి అధికారి చెప్పాడని అంటున్నారు. అతగాడు చెప్పినదానిని ఎంతవరకు నమ్మవచ్చు?”

“ నావద్ద చాలాకాలంగా పనిచేస్తున్నాడు కాబట్టి నాకు బాగా తెలుసు. అతడిని నమ్మకపోవడం అంటే నన్ను నేను నమ్మకపోవడమే.”

“ ఇప్పుడు అడిగే ఈ ప్రశ్న మీకు అసంబద్ధంగా అనిపించవచ్చు కానీ దయచేసి సమాధానం చెప్పండి. మీరు పనిచేసే పోలీసు స్టేషనులో మీరు, మీ సిబ్బంది యూనిఫారం మార్చుకోవడానికి విడిగా ఏదయినా గది లాంటిది వుందా?”

“వుంది. ఎవరి దుస్తులు వారు భద్రపరచుకోవడానికి అందులో లాకర్ల సౌకర్యం కూడా వుంది”

“ ఆ లాకర్లకు తాళాలు వుంటాయా? వుంటే వాటి తాళం చేతులు మీ దగ్గర వుంటాయా లేక మీరు నమ్మదగ్గ వ్యక్తి అని బల్లగుద్ది చెబుతున్న మీ సహచరుడి దగ్గర వుంటాయా?”

“ఎవరివి వాళ్ల దగ్గరే వుంటాయి. అయినా ఇది అంత సందేహపడాల్సిన సంగతేమి కాదుకదా!”

“అయితే ఇప్పుడు నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి ఆఫీసర్! అంత నమ్మదగ్గ వాడు అని మీరు అంత గట్టిగా అనుకున్నప్పుడు మీరు మీ లాకర్ కు తాళం వేసుకోవాల్సిన అగత్యం ఏమిటి?”

“అయ్యా లాయరు గారు. మీ అనుమానం సహేతుకమయినదే. మా స్టేషను కూడా కోర్టు ఆవరణలోనే వుంది. అప్పుడప్పుడు మీలాటి లాయర్లు మా స్టేషనులో తిరుగాడుతూ వుంటారు. మరి అటువంటప్పుడు, మాకు తాళాల అవసరం వుండదని అంత ఖచ్చితంగా యెలా చెప్పగలం చెప్పండి.” (15—07-2011)

14, జులై 2011, గురువారం

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు


“ ఆ రోజులే వేరు. వొంట్లో యువ రక్తం సలసలా మరుగుతుండేది. మొత్తం ప్రపంచాన్ని ఒక్కమారుగా మార్చేసి నాకు నచ్చిన లోకాన్ని సృష్టించాలని తహతహ లాడుతుండే వాడిని. కానీ ఏమయింది. ప్రపంచాన్ని మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది. పోనీ, ప్రపంచం సంగతి అక్కడితో వొదిలేసి నా దేశాన్ని సంస్కరించుకుంటే సరిపోలా అని అనుకున్నాను.

“ఆ ప్రయత్నం కూడా వృధా అని త్వరలోనే తెలిసిపోయింది. దాంతో దేశం గొడవ పక్కనబెట్టి మా వూరిని బాగుచేద్దామని పూనుకున్నాను.

“అయితే వూరును బాగుచేయడం అన్నది నా ఒక్కడివల్లా అయ్యే పని కాదని తెలిసిరావడానికి కూడా ఎక్కువ కాలం పట్టలేదు.

“ఇక అప్పుడు కానీ నాకు నా కుటుంబం గుర్తుకు రాలేదు. ముందు కుటుంబం బాగోగులు చూడాలనిపించింది. కానీ అప్పటికే వయసు మీద పడింది. వెనుకటి సత్తువా లేదు. మునుపటి ఓపికా లేదు.

“బోధి వృక్షం లేకుండానే నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ముందు నన్ను నేను మార్చుకుంటే యెలా వుంటుంది అన్న ఆలోచన మొదలయింది. మొదటే ఈ పని చేసివుంటే ఎంత బాగుండేదో కదా!

“క్రమంగా నా ఆలోచనలు కొత్త రూపం తీసుకున్నాయి.

“మార్పు అనేది ముందు నాతో మొదలయివుంటే ఆ ప్రభావం నా కుటుంబం పైన పడేది. నేనూ నా కుటుంబం కలిసి మా వూరిని మార్చేవాళ్ళం. మా వూరు బాగుపడితే దానివల్ల నా దేశం బాగుపడివుండేది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చిన్నతనంనుంచి కంటున్న నా కల ఆ క్రమంలో ఫలించి వుండేది. కానీ ఏంలాభం? శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన తరవాత కానీ తత్వం బోధపడలేదు.

“ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం లో నేను చేసిన ఈ పొరబాటు మరెవ్వరూ చేయకూడదని చెప్పడానికే ఈ నాలుగు ముక్కలు.” (పదకొండో శతాబ్దానికి చెందిన ఓ సన్యాసి చెప్పిన నీతి కధ ఆధారంగా)

(14-07-2011)

13, జులై 2011, బుధవారం

మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే!

మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే!


(నెట్ లో చక్కర్లు కొడుతున్న జోక్)


ఇంకెవ్వరు?

 
మన కనిమొళి మొగుడు జి.అరవిందన్

ఎందుకంటారా?బాంకులోనేమో 214 కోట్లు –
భార్య మాత్రం భద్రంగా బందిఖానాలో
(అనుభవించు 'రాజా' అనుభవించు)

రేడియో తాతయ్య ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

రేడియో తాతయ్య ఇక లేరు – భండారు శ్రీనివాసరావు


1938 జూన్ 16 వ తేదీ

మద్రాసులో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన రేడియో కేంద్రాన్నిప్రారంభించిన రోజది. అప్పటికి ఆలిండియా రేడియో ‘ఆకాశవాణి’ గా రూపాంతరం చెందలేదు. మద్రాసు పేరు మార్చుకుని చెన్నైగా అవతరించనూ లేదు. ప్రారంభ కార్యక్రమంగా అనుకుంటా బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయ్ కచ్చేరీ పెట్టారు. దాని గురించి అనౌన్స్ చేసే  బాధ్యత మల్లంపల్లి ఉమామహేశ్వర రావు గారిపై పడింది. మద్రాసు రేడియో కేంద్రం అధికారికంగా మొదలుకాక ముందు నుంచే ఆయన అక్కడ పనిచేస్తూ వచ్చారు. ప్రసారాలకు అవసరమయిన రచనలకు ప్రతులు రాయడం ఆయన ఉద్యోగం. రేడియో కేంద్రం పనిచేయడం మొదలు పెట్టేసరికి ఆయన్నే అనౌన్సర్ గా పనిచేయమన్నారు. ఆ విధంగా ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తొలి అనౌన్స్ మెంట్ చేసిన ఘనత మల్లంపల్లి వారి ఖాతాలో చేరిపోయింది.

తదనంతర కాలంలో రేడియో తాతయ్యగా సుప్రసిద్దులయిన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు రేడియోలో పనిచేసిన వారందరికీ ప్రాతః స్మరణీయులు. ఈ రోజు ఉదయం ఆయన్ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భం అత్యంత బాధాకరంగా మారింది. మల్లంపల్లి వారు తమ 99 వ ఏట చెన్నై లో ఈ తెల్లవారుఝామున కన్ను మూసిన సంగతిని హైదరాబాద్ రేడియో కేంద్రం డైరెక్టర్ గా పదవీ విరమణ చేసిన పీ ఎస్ గోపాల కృష్ణ గారు కన్నీళ్ళ పర్యంత మవుతూ నా చెవిన వేశారు. నిజానికి నేను ఆయన్ని గురించి వినడమే కాని చూసి ఎరుగను. 1975 లో నేను హైదరాబాదు రేడియో కేంద్రం లో చేరిన రెండు సంవత్సరాలకే మల్లంపల్లి వారు నలభై ఏళ్ళ సుదీర్ఘ రేడియో జీవితాన్ని విరమించి 1977 మే 31 వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు.

ఆకాశవాణి అనౌన్సర్లు, న్యూస్ రీడర్లు, డ్రామా వాయిస్ స్టాఫ్ ఆర్టిస్టుల సంక్షిప్త జీవన రేఖలను స్పృశిస్తూ ‘వాచస్పతి’ పేరుతొ అంబడిపూడి మురళీ కృష్ణ, మడిపల్లి దక్షిణామూర్తి కలసి సంకలనం చేసిన గ్రంధంలో మల్లంపల్లి వారు తన గురించి రాసుకున్న కొన్ని జ్ఞాపకాలు ఈ సందర్భంగా నలుగురి దృష్టికి తీసుకురావడం సముచితంగా వుంటుందని భావిస్తూ వాటిని పేర్కొంటున్నాను.

“అప్పట్లో మద్రాసు, ఆంధ్ర, తమిళ, కన్నడ ప్రాంతాలు కలగలిపి అవిభక్తంగా ఉండడం వల్ల సంగీత కార్యక్రమాలకు నేను తెలుగులోనే ప్రకటనలు చేసేవాడిని.”

“రేడియో మొదటి రోజుల్లో ఆచంట జానకిరామ్ గారు నాటకాలు రూపొందించేవారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర దాకా నాటకం ప్రసారమయితే ఆ తర్వాత నాటకంలో పాల్గొన్నవాళ్లు, తక్కిన ఉద్యోగులు అందరు ఆరుబయట ఆయన ఏర్పాటు చేసిన విందు భోజనం చేసికానీ కదిలే వీలు వుండేది కాదు. ఆ విందు ఖర్చులన్నీ ఆయనవే.”

“రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక రోజు ఉదయం సేట్ కాలనీలో వున్న మా ఇంటి నుంచి ఎగ్మూర్ మార్షల్స్ రోడ్ లోని రేడియో స్టేషన్ కు బయలుదేరి వస్తుంటే దారిలో పోలీసు ఒకాయన ఆపి ‘ఎక్కడికి’ అని అడిగాడు. చెప్పాను. ఆయన- ‘ఇట్లా వెడితే మునిగిపోతావు. పాంతియన్ రోడ్ వైపు వెళ్ళు’ అన్నాడు. తీరా వెడితే రేడియో స్టేషన్ గేటు దగ్గర గుండె లోతు నీళ్ళు పారుతున్నాయి. చెంగల్పట్ జిల్లా లోని చెరువుకట్ట తెగి ఆ నీళ్ళు నగర ప్రవేశం చేశాయన్నమాట. స్టేషన్ లోకి అడుగు పెడుతుండగానే అక్కడ డైరక్టర్ ఎస్. గోపాలన్ గారు గ్రామ ఫోన్ రికార్డులు తీసుకునిపోతూ కనిపించారు. ఆయన నన్ను చూసి చాలా సంతోషపడి వెళ్లి అనౌన్స్ చేయమన్నారు. ప్రసారానికి సంబంధించిన పరికరాలన్నీ బల్లలపైకి ఎక్కి కూచుని కనిపించాయి. రోజంతా నేనొక్కడినే అనౌన్సర్ని. నీళ్లలోనే నిల్చుని అలా అనౌన్స్ చేస్తుండగా సాయంకాలం అయ్యేసరికి కరెంట్ పోయింది. ఆ పోయిన కరెంట్ మర్నాడు పొద్దున్న కానీ సరిపడలేదు. ఈ లోగా రేడియో కార్యక్రమాలు వినబడక పోయేసరికి నగరంలో కొందరు ప్రజలు జపాన్ వాళ్లు రేడియో కేంద్రాన్ని కూల్చేసినట్టున్నారని భయపడ్డారు.”

“ఒక ప్రముఖ విద్వాంసుడు ఎప్పుడు తన గానం ప్రసారం చేయడానికి వచ్చినా సింహ స్వప్నంగా వుండేది. ఆయన పాడినంత సేపూ అందుకు తగ్గట్టు అనౌన్సర్ తల వూపకపోతే ప్రాణం మీదికి వచ్చేది.”

“బాలగురుమూర్తిగారు కార్యక్రమ నిర్వాహకులుగా వున్నప్పుడు పిల్లల కార్యక్రమానికి ఒక పాత్ర కావలసి వచ్చింది. ఆయన నన్ను గొంతు మార్చి ప్రయత్నించమని చెప్పారు. అట్లా నేను తాతయ్య అవతారం ఎత్తాను. తాతయ్యగా చాలా ప్రఖ్యాతి సంపాదించాను. రేడియో స్టేషన్ కు వచ్చిన వాళ్లు తాతయ్యను చూపమని నన్నే కోరేవాళ్ళు. మరికొందరు నేనే తాతయ్యను అంటే నమ్మలేక పోయేవాళ్ళు.”

“ఒకసారి ఒక తెలుగు పత్రికా సంపాదకులు ప్రసంగం చేయడానికి వచ్చారు. అప్పటికి రికార్డింగ్ సౌకర్యం లేదు. ఆయన ప్రసంగిస్తారని నేను అనౌన్స్ చేసి చూస్తే ఆయన చెమటలు కక్కుతూ,వణుకుతూ కనిపించారు. ఎంత ప్రయత్నించినా ఆయన నోరు విప్పక పోయేసరికి నెమ్మదిగా ఆయన చేతుల్లోనుంచి ప్రసంగం ప్రతి తీసుకుని నేనే చదివేశాను.”

నిండు జీవితం జీవించిన ఆ పూర్ణ పురుషుడికి ముకుళిత హస్తాలతో శ్రద్ధాంజలి ఘటిద్దాం. (13-07-2011)