ఏడాది క్రితం వరకు ఇలా జరగొచ్చేమో అని
అనుకున్నవారు వున్నారు కానీ ఇలానే జరుగుతుందని ఇదమిద్ధంగా వూహించిన వారు లేరు.
ఏదయితేనేం, ఎవ్వరు కారణం అయితేనేం రాష్ట్ర
విభజన జరిగిపోయింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా అనే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కొత్త ప్రభుత్వాలు కూడా కొలువు తీరాయి. వాటితోపాటే
కొత్త సమస్యలు, సరికొత్త వివాదాలు పురుడు
పోసుకుంటున్నాయి. ఒకరిది వడ్డించిన విస్తరి అని మరొకరు అంటుంటే, పీత కస్టాలు పీతవి అన్న ధోరణిలో మరోపక్కనుంచి వేరే
మాట వినబడుతోంది. ఒకటి మాత్రం నిజం. కొత్త
రాష్ట్రం అన్నాక సమస్యలు తప్పనిసరి. రెండు రాస్త్రాలవి ఒకే మోస్తరు సమస్యలు
కాకపోవచ్చు కానీ రెండింటికీ ఎవరి సమస్యలు వారికి వున్నాయి. ఎవరికి వారు తీర్చుకునేవి
కొన్ని. పొరుగువారి సాయంతోనో సహకారంతోనో పరిష్కరించుకోగలిగినవి మరికొన్ని. ఇవికాక
సొంతంగా సృష్టించుకుని హైరానపడేవి ఇంకొన్ని. ప్రస్తుతం ఈ మూడో తరగతి సమస్యలే ప్రముఖంగా
వెలుగు చూస్తున్నాయి. మీడియాలో ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిపై ఎడతెగని చర్చలు
సాగుతున్నాయి. అనవసర ఘర్షణలకు, ప్రజల నడుమ
అనుమానాలకు కారణం అవుతున్నాయి. అంతటితో ఆగకుండా అసలు ప్రభుత్వాల చిత్తశుద్ధి పట్లనే
లేనిపోని సందేహాలు తలెత్తేలా చేస్తున్నాయి.
ఈ కొత్త సమస్యలను అద్దంలో చూపిస్తూ తాము చేసిన ఎన్నికల వాగ్దానాలను అటక ఎక్కిస్తారేమో అనే సందేహం
కలగకుండా చూసుకోవడం ఇద్దరు ముఖ్యమంత్రులకు ఎదురవుతున్నమొదటి సవాలు.
ఒక్క రాజధాని, కొద్దో గొప్పో మిగులు బడ్జెట్ అనే
రెండు మినహాయిస్తే కొత్త తెలంగాణా
రాష్ట్రంలో చెప్పుకోదగిన లేదా సంతోషపడతగ్గ
విషయం ఏవీ లేదు. ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతొ ఏర్పడ్డ కొత్త రాష్ట్రం
సంగతి సరే సరి. దానికి ఆ రాజధాని కూడా
లేదు. చెట్లకింద నిలబడి పాలించాల్సిన పరిస్తితి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడే పదేపదే
చెబుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి ఇతర మంత్రులు హైదరాబాదు రాజభవన్ లో
పదవీ స్వీకార ప్రమాణాలు చేసిన తరువాత
కొత్త మంత్రులకు ప్రభుత్వ వాహనాలను వెంటనే సమకూర్చడం ఆనవాయితీ. కానీ ఈసారి
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని గుంటూరు సమీపంలో పెట్టడంతో ప్రమాణ
స్వీకార కార్యక్రమం ముగిసిన తరువాత వాహనాలకోసం కొత్త మంత్రులు నానా హైరానా
పడ్డట్టు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్లు చెబుతున్నారు. సచివాలయంలో కార్యాలయాల కేటాయింపు
మొదలుకుని ప్రతి విషయంలో ఈ విభజన అనేది ఒక అడ్డంకిగా తయారయింది. కాకపొతే ఇవన్నీ
చిన్న చిన్న సమస్యలు. కాలక్రమంలో సర్దుకునే సమస్యలు. కానీ, నీళ్ళూ, నిప్పూ వంటి
అసలు సమస్యలు పొంచుకుని చూస్తున్నాయి. సేద్యపు నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ అంత
తేలిగ్గా ముడిపడేలా కానరావడం లేదు. వీటిపై, ప్రధానంగా విద్యుత్ పంపిణీ విషయంలో మంత్రుల స్థాయిలోనే రగడ మొదలయింది. ఇది చిలికి
చిలికి గాలివాన కాకుండా చూసుకోవాలి. అలాగే, పేద విద్యార్ధులకు ఫీజు రీఇంబర్స్
మెంటు విషయం. నిజానికి ఎన్నికల్లో ఇంకా
పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినప్పుడు రాష్ట్రం విడిపోతుందని తెలుసుకాని, ఇలాటి
సమస్యలు ముందుగా ఎదురవుతాయని బహుశా
వూహించి వుండరు. ఎందుకంటే కొత్త కాపురం
అంటేనే అన్నీ కొత్తగా సమకూర్చుకోవడం. అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తులు
పంచుకున్నా వారి అవసరాల్లో సింహభాగం
స్వశక్తితో ఏర్పాటు చేసుకోవాల్సిందే. అది కాపురం పెట్టేవారి శక్తి సామర్ధ్యాలు,
దక్షత మీద ఆధారపడివుంటుంది. ఈ విషయంలో రెండు కొత్త ప్రభుత్వాలకి ఓ సారూప్యం వుంది.
అదేమిటంటే వాటికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు, ఈ
ఇద్దరికీ పరిపాలనలో పూర్వ అనుభవం వుంది. సామర్ధ్యం విషయంలో ప్రజల్లో కొంత నమ్మకం వుంది. రెండు రాష్ట్రాలలో వారి పార్టీల
విజయావకాశాలను మెరుగు పడేలా చేయడంలో ఈ రెండు అంశాలు కూడా సాయపడ్డాయన్నది సత్య
దూరమేమీ కాదు.
కాబట్టి, ఇప్పుడు ప్రజలు వారి నుంచి
కోరుకుంటున్నది ఒక్కటే. పరస్పర సంఘర్షణలకు తావివ్వకుండా సహకారానికి పెద్ద పీట
వేస్తూ సమస్యల ముళ్ళను ఒకదానివెంట మరొకటి జాగ్రత్తగా ఓపికగా విప్పుకుంటూ పోవాలి. వారి సమర్ధత, దక్షతల పట్ల ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము
చేయకూడదు. అవసరం అయితే కలిసి కూర్చుని పరిష్కార మార్గాలను అన్వేషించాలి. రాజకీయాలు
చేయడానికి ఇంకా చాలా వ్యవధానం వుంది. ఈ లోగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉభయ
రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగించాలి. వారి సామర్ధ్యం ఈ దిశగా ఉపయోగపడాలి. అంతే కాని ఒకరిపై మరొకరు నెపాలు మోపుకుంటూ కాలహరణం
చేయడం మంచిది కాదు.
(23-06-2014)