(శిష్ట్లా లక్ష్మీపతి
శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"పరీక్షలు అయిన
తరువాత ఇంటికి వెళ్లాను, గుడ్లవల్లేరు. రిజల్ట్ వచ్చిన సంగతి ఆలస్యంగా తెలిసింది.
హైసెకండ్ క్లాసులో పాసయ్యాను. హైదరాబాదు వెళ్లి నిజాం కాలేజీలో అడ్మిషన్ కోసం
అప్లికేషన్ ఇచ్చాను. టర్నర్ అనే ఆయన ప్రిన్సిపాల్. ఆయన వేసవి సెలవులకు ఇంగ్లండు
వెళ్ళాడు. మహమ్మద్ సిద్దికీ అని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన్ని తాత్కాలికంగా
ప్రిన్సిపాల్ గా వేసారు. టర్నర్ వుంటే నా మార్కులు చూసి సీటు ఇచ్చేవాడే. మహమ్మద్ సిద్దికీ గారు 'నువ్వు
ఆలస్యంగా వచ్చావు. సీట్లు నిండి పోయినై. నువ్వు మద్రాసు ప్రెసిడన్సీ వాడివి. అయినా
మంచి మార్కులు వచ్చాయి కనుక ముల్కీ సర్టిఫికేట్ తెస్తే సీటు ఇస్తాన'ని అన్నారు. ముల్కీ
సర్టిఫికేట్ అంటే నిజాం రాజ్యంలో పుట్టయినా వుండాలి. లేదా పన్నెండేండ్లు నివాసం
అయినా వుండాలి. మాకు నైజాంలో భూములు వున్నాయి కాని అవి పరాధీనంలో వున్నాయి.
నైజాంలో పుట్టినట్టు సర్టిఫికేట్ కావాలంటే సాక్ష్యం వుండాలి. ఆరోజుల్లో నైజాంలో
పుట్టుకల గిట్టుకల రిజిష్టర్ వుండేది
కాదు. అంచేత అనేకమంది దొంగ సర్టిఫికేట్లతో చేరేవారు. మా బావ స్నేహితుడి తండ్రి ఆబ్కారీ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్
అయినాడు. ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మర్నాడు ఇద్దరం
అప్లికేషన్ తో తాలూక్ దార్ ఆఫీసుకు వెళ్ళాము. 'ఇతను మీకెలా తెలుసు అని తాలూక్ దార్ అడిగితె, ఆబ్కారీ
డిపార్టుమెంటులో పనిచేస్తూ వాళ్ళ వూరు
వెళ్ళేవాడిని, అల్లా పరిచయం' అనిచెబుతాను. నువ్వూ అట్లాగే చెప్పు' అని నాతొ అన్నాడాయన. ఫారం లోపలి
పోయింది. మాకన్నా ముందు వచ్చిన ఒకాయన తప్పుడు సాక్ష్యం చెప్పాడని మజరద్ గార్
నిర్ణయించి రెండువందలు ఫైను వేసాడు. అది చూసి సాక్ష్యం ఇవ్వడానికి నాతొ పాటు
వచ్చిన పెద్దమనిషి భయపడి పోయాడు. ఐనా నేను లోపలకు వెళ్లి మజరాద్ గారిని కలిసాను. చిన్నవాడు. మంచి మనిషిలా కనిపించాడు. 'నీకు నిజాం కాలేజీలో సీటు
వచ్చింది చేరడానికి ముల్కీ కావాలి. ఎవర్నన్నా సాక్ష్యం తీసుకురా ఇస్తాన'ని చెప్పాడు.
నాకు సాక్ష్యం ఎవ్వరూ లేరు. ముల్కీ రాలేదు.
సీటూ రాలేదు. అందుకే ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత బందరులో హిందూ కాలేజీలో నాలుగేళ్ళు చదివాను. (ఇంకా వుంది)
