జ్ఞాపకాల తవ్వితీతలో జరిగిన ఓ పొరబాటు కారణంగా ఓ అద్భుతమైన అనుభవాన్ని పంచుకోకముందే ‘ఆఖరి
భాగం’ రాసేశాను. మన్నించాలి.
ఆరోజు ముఖ్యమంత్రిగా అంజయ్య గారు పదవీ ప్రమాణ
స్వీకారం చేశారు. పగలల్లా విపరీతమనిన జనం తాకిడి. సాయంత్రానికి గ్రీన్ లాండ్స్
అతిధి గృహం చేరుకున్నారు. అప్పటివరకు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నందువల్ల గెస్ట్
హౌస్ లో దిగడం ఆనవాయితీ. సమయం గడిచిపోతోంది. అక్కడా జనమే జనం. మధ్యలో ఒకసారి
వెళ్ళి ఢిల్లీ ఫోను చేసి మాట్లాడారా అని అడిగాను. ఆయనకు కూడా ఏదో పొరబాటు
జరిగిందని అర్ధం అయింది. పార్టీ అధ్యక్షురాలికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక
పత్రికా ప్రకటన కూడా విడుదల చేయాలి. అప్పటివరకు చెన్నారెడ్డి గారికి
పీ.ఆర్.వో. గా మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు పనిచేసేవారు. ముఖ్యమంత్రి
మారగానే ఆయన తన సొంత శాఖ సమాచార శాఖకు వెళ్లిపోవాలని అనుకున్నారు. ప్రెస్ రిలీజ్
తయారు చేయడానికి ఆయన్ని రమ్మంటే ముందు
ఇష్టపడలేదు. ‘సీఎం పేషీలో మిగిలిన
అధికారుల సంగతి వేరు, పీ.ఆర్.వో. వేరు. ఈ
పోస్ట్ కు కావాల్సిన వ్యక్తిని ముఖ్యమంత్రే స్వయంగా ఎంచుకుంటారు’ అన్నది ఆయన
థియరీ. ఆయన్ని తీసుకురావడానికి జ్వాలా వెళ్లాడు. మొత్తం మీద వొప్పించి జ్వాలా ఆయన్ని తన స్కూటర్ వెనుక
కూర్చోపెట్టుకుని గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ కి వెంటబెట్టుకు వచ్చాడు. కూర్చుని
ప్రెస్ నోట్ రాస్తుంటే కరెంటు పోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. నేనూ జ్వాలా బయటకు
పరిగెత్తి ఒక వీధి బండి మీది కిరోసిన్ దీపం పట్టుకు వచ్చాము. ఆ వెలుగు లోనే మా
అన్నయ్య తన పని పూర్తి చేసాడు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే మొదటిరోజే కరెంటు పోయినా అంజయ్య గారిలో ఏమాత్రం కోపం
కానరాలేదు. అదే చెన్నారెడ్డి గారయితే ఎలక్ట్రిసిటీ బోర్డులో కనీసం రెండు మూడు పెద్ద తలకాయలు తెగిపడేవని అక్కడి
అధికారులు బహిరంగంగానే చెవులు కొరుక్కున్నారు.
దట్ ఈజ్ అంజయ్య!