11, ఫిబ్రవరి 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (262 ): భండారు శ్రీనివాసరావు

 

'రామః రామౌ, రామాః, హే రామ హే రామౌ, హే రామాః ........' సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.
బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ స్కూలు (చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్ హైస్కూలు) భవనం చాలా విశాలమైన ప్రాంగణంలో వుంది. (వుండేది)
దాని నట్టనడుమ రాజసం వొలకబోసే రాతికట్టడం. దానికి ఇరువైపులా తరగతి గదులు.
ప్రధాన భవనంలో మెట్లకింద, తెల్లని పంచె, లాల్చీ కండువా ధరించిన సంస్కృతం మాస్టారు అలా శబ్దమంజరి చదువుతుంటే, మేము ఒక పది మందిమి కాబోలు సంస్కృతం రెండో భాషగా తీసుకున్నవాళ్ళం, శ్రద్ధగా వింటూ మాస్టారు చెప్పింది వల్లె వేస్తూ వుండేవాళ్ళం.
‘రామ శబ్దం ఆకారంత పుంలింగం. రామః రాముడు ఏకవచనం. రామౌ ఇద్దరు రాములు, ద్వి వచనం, రామాః అనేకమంది రాములు, బహువచనం
అలాగే రామః, ప్రధమా విభక్తి, హే రామః, సంబోధన ప్రధమా విభక్తి’
ఇలా సాగిపోయేవి మాస్టారి నోటి వెంట సంస్కృతం పాఠాలు. అంతా భట్టీయమే. ఎంత వంట బట్టిందన్నది ఆ దేవుడికే ఎరుక.
ఇంగ్లీష్, తెలుగు, లెక్కలు, ఇతర సబ్జక్టులు బోధించడానికి తరగతి గదులు విడిగా, ఉండేవి కాని సంస్కృతం క్లాసు మాత్రం, శబ్ధమంజరి, అమరకోశం చెప్పుకుంటూ మేడ మెట్ల కిందే నడిచేది. అది ఒకప్పటి జ్ఞాపకం.
మరొకప్పటి మరో జ్ఞాపకం . చాలా కాలం క్రితం, నెట్లో ఒక ఆసక్తికర సమాచారాన్ని మిత్రులు శ్రీ పీ.వీ.వీ.జీ. స్వామిగారు అమెరికా నుంచి పంపారు. ఆ ఇంగ్లీష్ వార్తకు నా తెలుగు అనువాదం నా సొంత బాణీలో :
ఒకానొకకాలంలో సూర్యుడు అస్తమించని సువిశాల సామ్రాజ్యానికి అది రాజధాని. అన్ని భాషలకు మాతృభాషగా పేరొందిన సంస్కృతం పరిఢవిల్లిన అఖండ భారతాన్ని వందల సంవత్సరాలపాటు బానిస దేశంగా పాలించిన బ్రిటిష్ ప్రభువుల రాజధాని నగరం. అలాటి ఇంగ్లీష్ గడ్డ అయిన లండన్ నగరంలో సంస్కృతాన్ని బోధించే పాఠశాల. వినడానికే విచిత్రం అనిపించినా ఇది నిజం.
లండన్ లోని సెంట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్లో సంస్కృత భాషా విభాగం అధిపతి వార్విక్ జేస్సప్ మాటల్లో మిగిలింది తెలుసుకుందాం.
"ప్రపంచం మొత్తంలో సంస్కృతంతో పోల్చచదగిన ఉత్కృష్టమైన భాష మరొకటి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మన్ ప్రజలు జర్మన్ మాట్లాడతారు. మాట్లాడే ప్రజల పేరుతోనే ఆ భాషలకు నామకరణం చేసారు. సంస్కృతం ఒక్కటే మినహాయింపు. ఆ ఒక్క భాష చక్కగా నేర్చుకుంటే చాలు, సైన్సు, గణితం వంటి ఇతర అంశాలపై పట్టు చిక్కించుకోవడం సులభం అవుతుంది'
ఇక ఆ స్కూలు హెడ్ మాష్టర్ పాల్ మాస్ గారు సంస్కృతం గురించి మరింత గొప్ప కితాబు ఇచ్చారు.
'దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకుంటే విద్యార్ధులకు తమ చేతి వేళ్ళపై గట్టి పట్టు చిక్కుతుంది. సంస్కృతంలో మాట్లాడడం వస్తే ఇక ఆ నాలుకకు అడ్డే వుండదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది'
పాల్ మహాశయులు అంతటితో ఆగలేది. ఇంకా ఇలా వివరించారు.
'యూరోపియన్ భాషలు మాట్లాడేవాళ్ళు నాలుకలో వుండే అన్ని భాగాలను ఉపయోగించరు. నాలుక కొసతో మాట్లాడేస్తుంటారు. రాసేటప్పుడు కూడా వేళ్ళల్లోని అన్నికదలికలను వాడరు. అదే సంస్కృతం మాట్లాడడం అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది'
లండన్ లోని ఈ ఇంగ్లీష్ స్కూల్లో సంస్కృతం సెకండ్ లాంగ్ వేజ్ గా తీసుకునే వాళ్ళు విధిగా ఆరేళ్ళపాటు ఆ భాషను అధ్యయనం చేయాల్సివుంటుంది. (మెట్ల కింద కాదు. చక్కటి తరగతి గదులు వున్నాయి) సంస్కృత విద్యార్ధులకు స్కూల్లో శాకాహార భోజనమే లభిస్తుంది.
మరి ఇప్పుడు చెప్పండి. ఇంగ్లీష్ వాడు చెప్పాడు కనుక మనమూ సంస్కృతం గొప్పదని అనుకుందామా!
అన్నట్టు గతంలో ఆకాశవాణిలో సంస్కృతం పాఠాలు బోధించేవాళ్లు. మరిప్పుడు పరిస్థితి ఏమిటో Sivaramaprasad Kappagantu శివరామ ప్రసాద్ కప్పగంతు వారు చెప్పాలి.
తోకటపా: మొన్న సంక్రాంతికి మా ఊరు కంభంపాడు వెళ్ళాము. కంచిలో ఒక సంస్కృత విద్యాలయంలో వేదం అభ్యసిస్తున్న ఒక కుర్రవాడు మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ తాతగారు ఇంగువ పురుషోత్తమ శర్మగారు, సంస్కృతం మీద తనకున్న భక్తి గౌరవాలతో మనుమడు చిరంజీవి విజయ కృష్ణ శర్మను అక్కడ చేర్పించాడు.
చదువు, బస, భోజనం అన్నీ ఉచితం. కాకపోతే మెడిసిన్ లాగా చాలా ఏళ్ళు చదవాలి. కష్టపడి చదవాలి. తెల్లవారుఝామున నిద్ర లేవాలి. బావి దగ్గర చేదతో నీళ్ళు తోడుకుని తల స్నానం చేయాలి. గోవులకు మేత వేసి పాలు పితకాలి. అక్కడ చదువుకునే పిల్లలు అందరూ ఆవు పాలే తాగాలి. గోక్షీరంతో తయారైన పెరుగుతో భోజనం చేయాలి. మొత్తం సాత్వికాహారం. అంత చిన్నతనంలో అంత దూరం వెళ్లి సంస్కృతం నేర్చుకుంటున్న ఆ పిల్లవాడిని చూస్తే చాలా ముచ్చటేసింది.
కింది వీడియోలో తాను నేర్చుకున్న సంస్కృత పనసలను మాకు వినిపించాడు.



https://www.facebook.com/reel/1468401071626669


(ఇంకా వుంది)

9, ఫిబ్రవరి 2026, సోమవారం

“ హలో! హ్యాపీ బర్త్ డే”

 " మీరు మాట్లాడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరి పిలుపుకు అందనంత దూరంలో వున్నారు. వచ్చే జన్మలో ప్రయత్నం చేయండి" 

ఈరోజు, ఫిబ్రవరి తొమ్మిది మా ఆవిడ పుట్టినరోజు. 

చనిపోయిన వారికి పుట్టినరోజులు ఉంటాయా!

పుట్టిన తర్వాతనే కదా వాళ్ళు చనిపోయింది.













పుట్టిన తర్వాతనే కదా వారు చనిపోయింది!

7, ఫిబ్రవరి 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (261): భండారు శ్రీనివాస రావు

నైహికాముష్మిక సుఖం
మహాత్ములు, స్వాములు తమ అనుగ్రహ భాషణల్లో సాధారణంగా ఆ సర్వేశ్వరుడిని తప్ప మనుష్యమాత్రుల్ని ప్రశంసించడం జరగదని నా విశ్వాసం. అయితే, తమ ధార్మిక సేవా కార్యక్రమాలకు అండదండలకోసం కొండొకచో రాజుల్ని, పాలకుల్ని పొగడడం కొత్తేమీ కాదు.
అలాంటిది చనిపోయిన ఒక వ్యక్తిని, అందునా కేవలం వివేకసంపద మినహా ఏవిధమైన లౌకిక బాహ్య సంపదలను కూడబెట్టుకోకుండా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్న వ్యక్తిని బహిరంగ సమావేశంలో బాహాటంగా ఒక ఆధ్యాత్మిక గురువు అదేపనిగా ప్రశంసించిన సందర్భాన్ని నేనెరుగను.
ఆ వ్యక్తి మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు కావడం మా కుటుంబం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఇంకేమీ కాదు.
దీనికి ముందు ఒక విషయం గురించి చెప్పుకోవాలి. మా అన్నయ్య తాను జీవించి ఉన్నకాలంలో ఎంతో శ్రమకోర్చి, అనేక ప్రాంతాలు తిరిగి, కొండలు కోనల్లో ఉన్న అనేక నారసింహ క్షేత్రాలను సందర్శించి, ఆ క్షేత్రాల ప్రాశస్త్యాన్ని స్వయంగా అధ్యయనం చేసి కంప్యూటర్ల సాయం లేకుండా కేవలం చేతి రాతతో ఏడు సంపుటాలను ‘ఓం నమో శ్రీ నారసింహాయ’ అనే పేరుతో రచించారు. వాటిల్లో మొదటి మూడు ప్రచురణకు నోచుకున్నాయి. మిగిలిన ఏడింటిని సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి శ్రీ కే.ఆర్. పరమహంస గారు, మిత్రవాత్యల్యంతో డిజిటలైజ్ చేయించి నెట్లో భద్రపరిచారు. ఆ నాలుగు సంపుటాలను మా అన్నయ్య కుమార్తె కొలిపాక కృష్ణ వేణి పుస్తక రూపంలోకి తీసుకు వచ్చింది. వాటిని ఎలాటి లాభాపేక్ష లేకుండా, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారికి, ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా అందచేయాలని సంకల్పించింది. ఆమె సంకల్పానికి భర్త కొలిపాక రమేష్ కుమార్ సహకారం తోడవడంతో అనుకున్న కొద్దిరోజుల్లోనే నిర్విఘ్నంగా ప్రచురణ కార్యక్రమం పూర్తయింది.
ఈలోగా అనుకోని ఒక విశేషం జరిగింది. మా అన్నగారి కుటుంబానికి పూజ్యులు అయిన శ్రీధర్ గురూజీ హైదరాబాదు వస్తున్నట్టు తెలిసి వారి శిష్యులను సంప్రదించారు. గురూజీ కూడా నరసింహోపాసకులు. ఆయన పాల్గొనే ఆ కార్యక్రమానికి నరసింహ భక్తులు అనేక మంది వస్తారు కాబట్టి గ్రంధావిష్కరణ అక్కడే చేయడం సముచితంగా ఉంటుందని అప్పుడు ముంబైలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు రాఘవరావు అందుకు తగిన ఏర్పాట్లు చేసాడు. గురూజీ శిష్యులలో ఒకరయిన వడ్డాది సత్యనారాయణ మూర్తి గారి సహకారంతో గ్రంధావిష్కరణకు గురూజీ అంగీకరించారు.
హైదరాబాదులోని ఆర్టీసీ కళా మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మేమెవరం ఊహించని విధంగా గురూజీ గ్రంధావిష్కరణకి పెద్ద పీట వేసి ఆ సాయంత్రం యావత్ కార్యక్రమాన్ని దానితోనే ప్రారంభించారు.
సభికులతో కిక్కిరిసిన ఆడిటోరియంలో గురూజీ ఇంగ్లీష్ లో చేసిన, ఉపన్యాసాన్ని మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు సంగ్రహంగా ఇలా పేర్కొన్నారు.
“For full 20 minutes, Sridhar Guruji, spoke about Annayya (BHANDARU PARVATALA RAO) in a largely attended meeting. He started his speech like this.....
‘Normally we will start any pravachanam by invoking Lord Ganesha. Today I will start with mentioning about a great, good, knowledgeable and highly simple and dear friend Parvatalarao’
Like this Guruji spoke for 20 minutes, paying glorious tributes to Annayya. We were all deeply touched.” -
B.Ramachandra Rao
మా అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్రబోస్ అన్నట్టు “ ఆయన పుట్టిన కుటుంబంలో పుట్టిన మేము కూడా అదృష్ట వంతులం అయ్యాము”
భర్తృహరి సుభాషితాల్లో ఒకదాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఇలా అనువదిస్తారు:
“విద్య యొసగును వినయంబు వినయంబునను
బడయు పాత్రత పాత్రత వలన ధనము
ధనము వలనను ధర్మంబు దాని వలన
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు”
బాగా చదివే విద్యార్ధిని ఒక క్లాసు చదవకుండానే పై క్లాసులోకి ప్రమోట్ చేసేవిధంగా, మా అన్నయ్య కూడా ‘పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు’ అనే పద్య పాదాన్ని తాకకుండానే (నిర్ధనుడు గానే) ‘నైహికాముష్మిక’ సుఖ ప్రాప్తి పొందాడు. ఇది సత్యం.
కింది ఫోటో:
మా పెద్దన్నయ్య గారితో నేను





(ఇంకావుంది)


(ఇంకా వుంది)

6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (260) : భండారు శ్రీనివాసరావు

 

సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్
జీవితంలో చాలా విషయాలు కనురెప్పల కిందే కరిగిపోతున్నాయి.
ఒకానొక రోజుల్లో రిక్షాలు, గూడు రిక్షాలు జన జీవనంలో భాగంగా వుండేవి. ఆ రోజుల్లో రోడ్డు మీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతి సంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగా వుండే వుంటారు.
రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు.
ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునే వారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాత నీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?
2010లో అమెరికా నుంచి బయలుదేరుతూ ఆఖరి వారంలో చూసిన రెండు విశేషాలు పాతలోని మధురిమను మరోసారి అనుభవంలోకి తెచ్చాయి.
పాతను ‘ఉప్పు పాతర’ వేయకుండా ఇక్కడ ఈ పరాయి దేశం వాళ్ళు యెంత జాగ్రత్త పడుతున్నారో కూడా అర్ధం అయింది.
1889లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సియాటిల్ డౌన్ టౌన్ లో చాలా భాగం తగులబడిపోయింది. తరవాత దాని స్తానంలో కొత్త నగరం నిర్మితమయింది. కానీ పాతనగరం జ్ఞాపకాలను అతి పదిలంగా దాచుకుంటున్న తీరే అద్భుతం. ఆదర్శప్రాయం.
దాదాపు నూట ముప్పయ్ ఆరేళ్ల నాటి సియాటిల్ పాత బస్తీలోని కొన్ని ప్రదేశాలను ఎంపికచేసి, బేస్ మెంట్ లో పాత వాటిని మ్యూజియంలో మాదిరిగా జాగ్రత్త చేసి, పైన పలు అంతస్తుల ఆధునిక సుందర భవనాలను నిర్మించుకున్నారు. అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న పాత గృహాలను, గృహోపకరణాలను రూపు చెడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, భద్రపరచి, - ‘సియాటిల్ అండర్ గ్రౌండ్ టూర్’ పేరుతొ టూరిస్టులకు చూపిస్తున్నారు.
దాదాపు రెండు గంటలపాటు సాగే ఈ టూరులో ఒక గైడ్ వెంట వుండి పాతరోజుల సంగతులను కొత్త కొత్తగా చెబుతుంటాడు. ఆ కాలంలో వాడిన టైపు రైటర్లు, గోడ గడియారాలు, సోఫాలు, బాయిలర్లు, ఇంటి పైకప్పులు, దర్వాజాలు, చివరాఖరుకు బాత్ రూమ్ కమోడ్లు ఇలా అన్నిటినీ చూడవచ్చు. పదిహేను డాలర్ల టిక్కెట్టు కొనుక్కుని ఈ టూర్ లో పాల్గొనడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ఆ రాజుల్లోనే ప్రతిరోజూ వందల్లో వుంటుందంటే, పాత రోజులపట్ల ఇక్కడి ప్రజలకు వున్న కొత్త మోజు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు.
అలాగే. ఇస్సక్క్వా (Issaquah).
సులభంగా నోరు తిరగని ఈ ఊరు సియాటిల్లోని శివారు ప్రాంతం. మైనింగ్ అవసరాలకోసం ఈ పట్టణాన్ని కలుపుతూ లోగడ ఒక రైలు మార్గం వుండేది. దాన్ని తరవాత మూసి వేశారు. ఇస్సక్క్వా హిస్టారికల్ సొసైటీ వారు ఈ పట్టణం డౌన్ టౌన్ ను ఒక చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేసి, అప్పటి రైల్వే స్టేషన్ ను, రైలు పట్టాలను అలాగే వుంచేసి పాత జ్ఞాపకాలకు గుర్తుగా మిగుల్చుకున్నారు. (విజయవాడ లో సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ ఎత్తేసిన తరువాత దాన్ని ఒక రహదారిగా మార్చేసిన సంగతి ఇక్కడ గమనార్హం)
ఆ రోజుల్లో వుండే పెట్రోల్ (గ్యాస్) బంకులను, సినిమాహాళ్ళను యధాతధంగా వుంచేసారు. ఆధునిక నగరం సియాటిల్ నుంచి వచ్చి ఆ పాత పట్టణంలో కలయ తిరుగుతూ వుంటే, ఒక్కసారిగా ‘టైం మెషిన్’ లో గతకాలంలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.
పోతే, గూడు రిక్షాలేకాదు, కలికానికి కూడా కనబడకుండా పోతున్న, అంతరించి పోతున్న వస్తువుల జాబితా మన దగ్గర తక్కువేమీ లేదు. తిరగళ్లు, రోకళ్లు, రుబ్బురోళ్లు, ఎడ్లబళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అన్నట్టు చాంతాడు కూడా ఇక ఇలాటి సామెతలకే పరిమితం.
కింది ఫోటో :
2010 లో ఇస్సక్వా పట్టణంలో అలనాటి పాత పెట్రోల్ బంకులో నేను.



(ఇంకా వుంది)

రాజ్యం లేని భోజరాజు – భండారు శ్రీనివాసరావు

ఆయనకు, కవులు, రచయితలు, పాత్రికేయులు, సమాజంలోని వివిధ రంగాల వాళ్ళు బహు ఇష్టులు. ఒక్కముక్కలో చెప్పాలి అంటే ఆయనకు మనుషులంటే ఇష్టం. ఎప్పుడూ నలుగురిలో వుండడానికి అంతగా ఇష్టపడే మనిషిని మరొకర్ని చూడలేదు. ఆయన నిజమైన హ్యూమనిస్ట్. మానవతావాది.
అందుకే నిన్న హైదరాబాదులో జరిగిన ఆయన సంస్మరణ సమావేశానికి అంతమంది తరలి వచ్చారు. వారిలో పెక్కురు ఆయనతో తమకున్న అనుబంధాన్ని నలుగురితో పంచుకున్నారు.
ఇంతకీ ఆయన ఎవరంటే, మొన్నీమధ్య కన్ను మూసిన వెనిగళ్ళ వెంకట రత్నం గారు.
‘మంచి పనులు చేయడానికి వనరులు అక్కరలేదు, మంచి మనసు వుంటే చాలు అని నిరూపించి నిశ్శబ్దంగా మన మధ్యనుంచి నిష్క్రమించిన వ్యక్తి వెంకట రత్నం’ అని ఈ సమావేశంలో ప్రసంగించిన పలువురు వక్తలు పేర్కొన్నారు.
మంచి మనసే కాదు, అవసరంలో వున్నవారికి సాయపాడాలి అనే తపన కూడా ఆయనకు వుంది. ఆ తపన ఎంతవరకూ అంటే తాను చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్ధులకు ఉపయోగపడడానికి దానం చేయాలని కుటుంబసభ్యులకు నచ్చచెప్పే వరకూ వెళ్ళింది. వారూ ఆయన అంతిమ కోర్కెను తీర్చి, వెంకటరత్నం గారి భౌతిక దేహాన్ని ఒక వైద్య కళాశాలకు అప్పగించారు.
ఈ సమావేశానికి హాజరైన వారిలో కూడా కొందరిలో దేహ దానం చేయాలనే స్పూర్తి రగిలింది అంటే, మరణానంతరం కూడా ఆయన జీవిస్తున్నట్టే లెక్క.
అక్కడికి వచ్చిన వారిలో చాలామంది ఒక మాట చెప్పుకోవడం వినపడింది. నిజానికి మంచి ఆలోచనే.
డెబ్బయి దాటిన బంధు మిత్రులను చూడాలని అనిపించినప్పుడు, వాయిదా వేయకుండా వెంటనే వెళ్లి చూడాలి. ‘మొన్న ఆ పెద్దమనిషిని కలిసాను, నిన్ను గుర్తు చేసుకున్నారు’ అని ఎవరైనా చెబితే, ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్లి, ఆయన్ని చూసి రావడం మరీ మంచిది అనేది ఈ మాటల సారాంశం.



(05-02-2026)

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (259) : భండారు శ్రీనివాసరావు

 

ఇంటికే వచ్చిన బుక్ ఎగ్జిబిషన్

గత కొద్ది రోజులుగా పోస్టు ద్వారా, కొరియర్ ద్వారా అనేక పుస్తకాలు మా ఇంటికి చేరాయి. 

ఈ రోజు ఏకంగా విశ్వనాధ వారి వేయి పడగలు నవల పోస్టులో అందింది. ఫేస్ బుక్ మితృలు, పెద్దలు జేవీపీఎస్ సోమయాజులు గారు శ్రమ తీసుకుని పంపారు. కొద్ది రోజుల ముందే మా గురువుగారు పురాణం సుబ్రమణ్య శర్మ గారు రాసిన విశ్వనాధ ఒక కల్పవృక్షం అనే పుస్తకం మా ఇంటికి చేరడం కూడా సోమయాజులు గారి పుణ్యమే.  వేయి పడగలు నవల ముప్పది ఏడవ ముద్రణ. హార్డ్ బౌండ్. 999 పేజీలు,  ధర : 888 రూపాయలు.

ఇక మిగిలిన పుస్తకాల వివరాలు: వార్తాప్రస్థానం : రచన: గద్దె దుర్గారావు, నేను బహువచనం: ములుగు రాజేశ్వర రావు,  యం.యస్, ఆచార్య : మాఢభూషి శ్రీధర్,  అక్షరాయుధుడు ఏబీకే, పేపర్ బాయ్ టు ఎడిటర్: ఎస్, వినయ్ కుమార్, అప్పుడు – ఇప్పుడు : జి.కృష్ణ, పాములపర్తి వెంకట నరసింహారావు: అప్పరసు కృష్ణారావు, అనుభవాలు- జ్ఞాపకాలు, మౌన సాక్ష్యాలు: ప్రముఖ పత్రికా ఫోటోగ్రాఫర్ కేశవులు, సత్యవోలు సుందర సాయి, అధినాయక జయహే : చిం వ్యాసుడి ఖడ్గాలు, అమృత దర్శనం : విశ్వపతి, అమృత వర్షిణి: కొలిపాక శారద శతజయంతి సంచిక.

మొన్న సాయంత్రం సోమయాజులు గారు ఫోన్ చేసి వేయిపడగలు పుస్తకం వుందా? చదివారా?  అని అడిగారు.

అవును, కాదు అని  చెప్పలేకపోయాను. వేయిపడగలు పుస్తకం స్వయంగా విశ్వనాధ గారి కరకమలాల  నుంచే స్వీకరించిన వృత్తాంతం గుర్తుకు వచ్చింది.

అరవై ఏళ్ళ కిందటి సంగతి.

సుమారు ఆరు దశాబ్దాల క్రితం ఇద్దరు బెజవాడ ఎస్సారార్  కాలేజి కుర్రాళ్ళకు,  వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో నెగ్గినందుకు గాను  నూట యాభయ్ రూపాయలు పారితోషికంగా వచ్చాయి. అంత డబ్బుతో ఏం కొనుక్కోవాలి అనేది పెద్ద సమస్యగా మారింది. చివరికి వారిలో ఒకడన్నాడు, పుస్తకాలు కొనుక్కుందాం అని. పుస్తకాలు అంటే క్లాసు పుస్తకాలు కాదు, పెద్ద రచయితలు రాసిన గొప్ప పుస్తకాలు.

విశ్వనాధవారి వేయి పడగలయితే అన్నాడు ఇద్దరిలో ఒకడు. ఈ డబ్బుకు రెండు పుస్తకాలు వస్తాయంటావా అన్నాడు ఆ ఇద్దరిలో మరొకడు.

ఇద్దరూ కలిసి బెజవాడ మాచవరంలో ఉంటున్న కవిసామ్రాట్ ఇంటికి వెళ్ళారు. ఇంటి ముందు విశాలమైన ఆవరణ. వరండాలో ఓ వాలు కుర్చీలో  పై పంచ లేకుండా దోవతీలో ఒకాయన, ఆయనకు దగ్గరగా  తెల్లటి వస్త్రాల్లో మరొకాయన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరిలో విశ్వనాధ ఎవరై వుంటారు?

తెల్ల ఉడుపుల పెద్దమనిషి వారిద్దరినీ గుర్తు పట్టాడు. పట్టి, పై ఆచ్ఛాదన లేని వ్యక్తికి పరిచయం చేశారు.

‘ఇదిగో ఈ పొడుగబ్బాయి, సన్నగా వున్నాడే వీడు ప్లీడరు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారి పెద్దబ్బాయి సాంబశివరావు. ఇంట్లో శాయిబాబు అంటారు. ఈ రెండోవాడు శ్రీనివాసరావు. మా అక్కయ్య కోడలి తమ్ముడు. హనుమంతరావు పంతులుగారికి కూడా స్వయానా బావమరది’

అప్పుడు ఇద్దరిలో సన్నవాడికి లైటు వెలిగింది. ఓహో వీరు పేరాల భరత శర్మ గారు, విశ్వనాధవారి శిష్యులు అని రెండోవాడి చెవిలో ఊదాడు.

ఏం పని మీద వచ్చారు అని అడగకుండానే చెప్పాము, పోటీల్లో బహుమతి కింద ఇద్దరికీ కలిపి నూట యాభయ్ వచ్చాయని, ఆ డబ్బుతో మీ వేయి పడగలు పుస్తకం కొనుక్కుందామనే  కోరిక కలిగిందని.

‘నా పుస్తకాలు మీకు అర్ధం అవుతాయా’ అనేది విశ్వనాధ వారి మొదటి ప్రశ్న.

‘ఏమోనండీ అర్ధం కాకపోవచ్చు. కానీ అర్ధం చేసుకోవడానికే చదవాలని అనుకుంటున్నాం’ మా జవాబు.

విశ్వనాధవారి మొహంలో కనీ కనపడని నవ్వు.

‘అదిగో ఆ మూల వున్నాయి. పోయి చెరి రెండూ తెచ్చుకోండి’ అన్నారు.

పోయి చూస్తే విశ్వనాధ వారు రాసిన పుస్తకాలు  ప్యాకెట్లుగా కట్టి వున్నాయి.

ఆయన చెప్పినట్టే చేసి చెప్పాము.

‘ఇందులో చాలా పుస్తకాలు ఉన్నట్టున్నాయి. మా దగ్గర నూట యాభయ్ మాత్రమే వున్నాయి’ అన్నాడు సాంబశివరావు అనే నా సహాధ్యాయి,  మేనల్లుడు కూడా.

అప్పుడు విశ్వనాధవారు పెద్దగా నవ్వారు.

‘అర్ధం చేసుకుంటాం అన్నారు కదా! పోయి చదవండి. చదివేవారికి పుస్తకం చేరాలి. మిగిలిన పుస్తకాల డబ్బు మీ ఇద్దరికీ నా గిఫ్ట్’ అనేశారు.

మహదానందంతో రెక్కలు కట్టుకుని ఇంటికి వచ్చి ప్యాకెట్ విప్పితే :

‘వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, దిండు కింద పోకచెక్క, స్వర్గానికి నిచ్చెనలు, చెలియలి కట్ట, ఏకవీర, తెఱచిరాజు, మాబాబు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, చిట్లీచిట్లని గాజులు....’

కవిసామ్రాట్ అయ్యే. ఎంత పెద్ద చేయి అయివుండాలి మరి.




(ఇంకా వుంది)          

1, ఫిబ్రవరి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (258) : భండారు శ్రీనివాసరావు


ఎవరు ముందు ? ఎవరు వెనుక?
ఈ ఇంగ్లీషు వాడున్నాడే, ఎంతయినా గొప్పవాడు.
పంతాలు, పట్టింపులు, అహంభావం, అహంకారం, నేనే గొప్ప అనే, అనేక రకాల భావనలను అన్నీ కలిపి, ఎంచక్కా ఈగో (Ego) అనే ఒక్క చిన్న మూడక్షరాల పదంలో గుదిగుచ్చాడు.
(నిజం చెప్పాలి అంటే ఈ ఈగోకి నేను అతీతుడిని ఏమీ కాదు. ఈ తలపొగరు వల్ల జీవితంలో పోగొట్టుకున్నవే ఎక్కువ అని జీవిత చరమాంకంలో జ్ఞానోదయం అయింది. గతజల సేతు భంజనం)
ఈ మధ్య ఏ పేపరు తిరగేసినా, ఏ ఛానల్ పెట్టినా, అధికారులు, అనధికారులు, చోటా నాయకులు, బడా నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరాఖరికి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో వున్నవాళ్ళు సయితం ఈ ఈగో అనే విషవలయంలో చిక్కుకుని సంచలన వార్తలకు కేంద్ర బిందువులు అవుతున్న విషయం బోధపడుతుంది.
నిజానికి ఇవన్నీ కొత్తవేమీ కాదు. కాకపోతే గతంలో కంటే మీడియా విస్తృతి ఈనాడు ఎక్కువ కనుక, వీటికి మరింత ఎక్కువ ప్రాచుర్యం లభిస్తోంది.
మచ్చుకు ఓ ఉదాహరణ చెప్పుకుందాం.
అప్పుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. మోహన్ కందా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. స్వర్ణజిత్ సేన్ పోలీసు డైరెక్టర్ జనరల్. దినేష్ రెడ్డి హైదరాబాదు నగర పోలీసు కమిషనర్.
ఆ రోజుల్లో ఒకసారి రాష్ట్రపతి ఏ.పీ.జే. అబ్దుల్ కలాం హైదరాబాదు వచ్చారు. బేగం పేట విమానాశ్రయంలో స్వాగతం. ఏర్పాట్లు అన్నీ జరిగాయి. రాష్ట్రపతికి స్వాగతం చెప్పడానికి అందరూ వరసగా నిలబడ్డారు.
పోలీసు కమిషనర్ దినేష్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం కొంత వెనుక నిలబడాల్సి వచ్చింది. అది ఆయనకి నచ్చలేదు. వరుస తప్పించి ముందుకు వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు.
సరే ఆ కార్యక్రమం ముగిసింది. కానీ దినేష్ రెడ్డి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రోటోకాల్ విషయంలో తనకు జరిగిన లోపాన్ని ఎత్తి చూపుతూ చీఫ్ సెక్రెటరీకి ఓ ఉత్తరం రాశారు.
“సీనియారిటీ రీత్యా నాకంటే జూనియర్ అయిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి (సీ.ఆర్. బిస్వాల్, ప్రిన్సిపాల్ సెక్రెటరి పొలిటికల్) వెనక నేను నిలబడడం కుదరదు. నగర పోలీసు కమిషనర్ గా నేను ఆయనకంటే ముందు వుండాలి” అంటూ ఆయన తన మనసులో మాట బయట పెట్టారు.
దీనికి జవాబుగా ఆయనకు చీఫ్ సెక్రెటరి నుంచి మెమో వచ్చింది.
“రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో మీరు ప్రిన్సిపల్ సెక్రెటరి పొలిటికల్ ని దాటుకుని వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుంది’ అనేది ఆ మెమో తాత్పర్యం.
ఈ మెమో ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం ఇచ్చింది అని తెలియక దినేష్ రెడ్డి చీఫ్ సెక్రెటరీకి మరో ఘాటయిన లేఖ రాశారు, “నాకు మెమో ఇవ్వడానికి మీకెంత ధైర్యం? హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ గా నా స్థాయి (హోదా) చీఫ్ సెక్రెటరీకి సమానం’ అంటూ.
ఇది చిలికి చిలికి గాలివాన అయింది. స్టేట్ ఐ.పి.ఎస్. అధికారుల సంఘం కార్యవర్గం అత్యవసర సమావేశం జరిపి ప్రోటోకాల్ విషయంలో తమను కూడా ఐ.ఏ.ఎస్. అధికారులతో సమానంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఈ సంఘానికి దినేష్ రెడ్డి కార్యదర్శి కావడం కాకతాళీయం కావచ్చు.
తాను 1977 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారినని, ప్రోటోకాల్ వ్యవహారాలు చూసే అధికారి 1981 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. కాబట్టి అతడు తనకు జూనియర్ అవుతాడు అనే ధోరణితో దినేష్ రెడ్డి ఉత్తరం రాసారు.
నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఈ వివాదం కొనసాగుతోంది కానీ ప్రభుత్వం పెదవి విప్పలేదు. కారణం నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాల్సి వుంది. ఆ కార్యక్రమం సజావుగా అలా పూర్తయిందో లేదో నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అప్పటికి ఆయన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి పది నెలలు కూడా కాలేదు. నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తున్న సమాచారం డీజీపీకి కూడా తెలియదని వార్తలు గుప్పుమన్నాయి.
ఏదో కక్ష కట్టినట్టు బదిలీ చేసినట్టు కాకుండా అదే రోజు మరో ఆరుగురు ఉన్నత పోలీసు అధికారులకు కూడా స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అప్పుడు అలా అర్ధాంతరంగా కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాల్సివచ్చిన దినేష్ రెడ్డి, ఆద్యతన కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ అయ్యారు.
సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా ఆయన ఒకే ఒక్క రోజున రాష్ట్ర వ్యాప్తంగా యాభయ్ మంది డీ.ఎస్.పి. లను బదిలీ చేయడం ఓ కొసమెరుపు.
(ఇంకా వుంది)