18, జులై 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (344) : భండారు శ్రీనివాసరావు


“ఏం జ్వాలా ! హౌ ఆర్ యు? మన భండారు ఎక్కడ? “
చాలామంది రాజకీయ నాయకులు, మంత్రులు (ఇప్పటి వాళ్ళు కాదు) నేను కనబడగానే నన్ను పలకరించే తీరు ఇది. నన్ను చూసి జ్వాలా అని పిలుస్తారు. బహుశా బాగా గుర్తుండిపోయే పేరు కాబోలు. ఒకానొక రోజుల్లో మేమిద్దరం అలా మమేకం అయి తిరిగేవాళ్ళం.
జ్వాలా దగ్గర సుగుణం ఏమిటంటే చాలా సార్లు బాహాటంగా ఒక విషయం చెబుతుంటాడు, తనకున్న పాత్రికేయ, రాజకీయ పరమైన స్నేహాల (కాంటాక్ట్స్) కు నేనే మూల కారణమని. నిజానికి నేనూ అలాగే చెప్పాలి, ఆయన అనేక క్లిష్ట సమయాల్లో నాకు బాసటగా నిలబడ్డాడని. కానీ అదేమిటో నేను ఏనాడు అలా చెప్పలేదు. ఆయన తత్వం ఆయనది, నా తత్వం నాది. కృతజ్ఞతలు తెలపడం మాటల ద్వారానే సాధ్యం అనేది నేను నమ్మను. అది వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు వున్నాయి. అది నా థియరీ.
మరో విషయం ఏమిటంటే మా ఇద్దరిదీ సింహరాశి. కాబట్టి ఈ మాత్రం భేషజాలు వుండడం సహజం అని వాటిని నమ్మే వారు అంటుంటారు. నాలో ఆ రాశి లక్షణాలు బొత్తిగా లేవు. ఇదొక కారణం, నాకు ఇలాంటి వాటిపట్ల నమ్మకం కోల్పోవడానికి.
2005 డిసెంబరు ముప్పై ఒకటో తేదీన నేను దూరదర్శన్ నుంచి రిటైర్ అయ్యాను. కానీ, అదే రోజు ఓ ఏడాది సర్వీసు పొడిగించారు. అయితే దాన్ని నేను పూర్తిగా వినియోగించుకోలేదు. మధ్యలోనే బయటకు వచ్చి సత్యం రామలింగరాజు గారు ప్రారంభించిన 104 సర్వీసు గ్రామీణ ఆరోగ్య సేవల స్వచ్చంద సంస్థలో మీడియా అడ్వైజర్ గా కొన్నాళ్ళు పనిచేశాను. అలాగే రోజువారీ టీవీ చర్చలు. ఇలా జీవితం సాగిపోయింది. రిటైర్ అయ్యాను అనే ఫీల్ లేకుండా పోయింది.
2019 లో మా ఆవిడ నిర్మల ఆకస్మిక మరణంతో నా జీవితం మరో మలుపు తిరిగింది. ఇతర వ్యాపకాలు తగ్గిపోయాయి. అసలైన రిటైర్ మెంట్ జీవితం మొదలయింది. కానీ రిటైర్ మెంట్ జీవితం ఎలా గడపాలి అనే విషయంలో సరైన అవగాహన లేక మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకరకంగా చెప్పాలి అంటే రోజులు దొర్లిస్తున్నాను. సరే! ఇది నా గొడవ. అలా ఉంచుదాం.
ఇప్పుడు వనం జ్వాలా నరసింహారావు గురించి చెప్పుకుందాము.
ఆయన కృష్ణుడో, నేను అర్జునుడినో లేక నేను కృష్ణుడో ఆయన అర్జునుడో ఎవరికీ తెలియదు కానీ, మా ఇద్దర్నీ డి. వెంకట్రామయ్య గారి వంటి మితృలు అందరూ కృష్ణార్జునులు అనే వాళ్ళు. సీనియర్ జర్నలిస్ట్ బీ ఎస్ రామకృష్ణ అన్నయ్య, కృష్ణ మాకు కుటుంబ మిత్రుడు. మా ఇద్దర్నీ 'మొగుడూ పెళ్ళాలు' అనేవాడు. ‘కాసేపు కొట్టుకుంటారు, మరుక్షణం కలిసిపోతారు’ అనేది కృష్ణ తాత్పర్యం.
చిన్నప్పుడు స్కూల్లో జ్వాలా నాకు సహాధ్యాయి. లేదా నేను ఆయనకు. పెద్దయిన తర్వాత నా మేనకోడలు విజయలక్ష్మి భర్త. తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి ఎంతో పైకి వచ్చాడు. కిందపడ్డాడు. మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేచాడు.
చేయని ఉద్యోగం లేదు. బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో మొదలు పెట్టి తెలంగాణా ముఖ్యమంత్రి ప్రధాన సంబంధాల అధికారి పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో మారని ఇల్లు లేదు. అయితే, ఈ ఒక్క విషయంలో మాత్రం నాకూ ఆయనకు పోలిక. మరీ ఆయనలా అన్ని కాకపోయినా నేను సైతం హైదరాబాదు ఉద్యోగపర్వంలో అనేక అద్దె ఇళ్ళు మారాను.
మూడు దశాబ్దాల పై చిలుకు కాలంలో, హైదరాబాదులో నేను చేసింది ఒకే ఒక ఉద్యోగం, ఒకే ఒక సంస్థ ఆలిండియా రేడియోలో. కాకపోతే చరమాంకంలో కొద్ది కాలం దూరదర్సన్ లో కూడా ఇష్టం లేని కాపురం చేశాను. మధ్యలో ఓ అయిదేళ్లు మాస్కోలో రేడియో మాస్కోలో ఉద్యోగం చేశాను.
జ్వాలా అలా కాదు. అనేక ఉద్యోగాలు. అనేక తరహా ఉద్యోగాలు. కొన్ని సర్కారు కొలువులు. మరి కొన్ని అటూ ఇటూ కానివి. అందుకే రిటైర్ మెంటు అనేది ఆయనకు లేకుండా పోయింది. ఉద్యోగానికి ఉద్యోగానికి మధ్య ఖాళీ. ఖాళీకి ఖాళీకి నడుమ కొలువు. ఇలా సాగిపోయింది ఆయన జీవితం.
చివరికి జ్వాలా కూడా రిటైర్ అయ్యాడు. కానీ ఒప్పుకోడు. నో రిటైర్మెంట్ అనేది ఆయన పాలసీ. నాకూ ఆయనకు మధ్య ఒకటి రెండేళ్లే తేడా.
ఒకప్పుడు ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. ఇద్దరి మార్గాలు ఒకటే. కానీ నా భార్య మరణానంతరం నా లోకం మారిపోయింది. ఏకాంతం నా లోకం అయింది. ఇంతవరకు నా జోలికి రాని కొన్ని ఆరోగ్య సమస్యలు. మరికొన్ని హార్దిక ఇబ్బందులు. రెండో కుమారుడి మరణం వంటి తట్టుకోలేని సంఘటనలు. జీవితం పట్ల నా దృక్పథం మారిపోయింది. ఒంటరితనం. ఒంటరిగా జీవించడం. ఏదీ పట్టించుకోకపోవడం. నిర్లిప్తత. నిర్వేదం.
విల్లాల్లో జీవితం కాకపోయినా, చెప్పుకోదగిన ఆర్ధిక ఇబ్బందులు లేవు. వయసురీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎలాగు తప్పవు.
ఈ నేపధ్యంలో జ్వాలా జీవితం నాకు ఓ దిక్సూచిలా కనిపించింది. ఒప్పుకోడు కానీ ఆయనదీ రిటైర్మెంట్ జీవితమే.
కొన్నేళ్ళ క్రితం ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్లాను. గతంలో మాకిది రోజువారీ వ్యవహారమే. కానీ, చాలాకాలంగా నేను ఇల్లు వదిలి బయటకు పోవడం లేదు. నిజం చెప్పాలి అంటే ఇంట్లో నా గది వదిలి అడుగు బయట పెట్టలేదు. బెడ్ రూమ్ టు బాత్ రూమ్. తిండీ తిప్పలు అన్నీ నా గదిలోనే. అంతగా ఒంటరితనం నన్ను ఆవరించింది.
ఆయన ఇల్లు ఎప్పటిలా కళ కళ లాడుతోంది. ఒకానొక కాలంలో, అంటే మా ఆవిడ జీవించి వున్న కాలంలో అందరూ మా గురించి, మా ఇంటి గురించి ఇలాగే చెప్పుకునేవారు.
ఒకప్పటి నా రేడియో సహోద్యోగి, న్యూస్ డైరెక్టర్ శ్రీ ఆర్వీవీ కృష్ణారావు అప్పటికే అక్కడ వున్నారు. గతంలో రోజూ కలిసే మేమిద్దరం ఒకరినొకరం ఇళ్లల్లో కలవక చాలా కాలం అయింది. అలాగే ఎప్పుడో పరిచయం అయి చాలాకాలంగా కలవని మితృలు, శ్రేయోభిలాషులు వనం నర్సింగరావు గారు, వారి శ్రీమతి మాతాజీ, మా ఆవిడ ఆప్త మిత్రురాలు, బహిప్రాణం అయిన వనం గీత, భర్త వనం రంగారావు, మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు, వదిన విమలాదేవి ఇలా అనేకమందితో జ్వాలా గృహం కొలువు తీరింది.
స్నేహితులని, సన్నిహితులని, బంధువులని, మిత్రులని అప్పుడప్పుడు కలుస్తూ, పాత ముచ్చట్లు, కొత్త సంగతులు కలబోసుకోవడం ద్వారా రిటైర్ మెంటుని హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా గడపవచ్చనేది జ్వాలా థియరీ. మధ్య మధ్య కలుస్తుంటేనే చుట్టరికాలు అయినా స్నేహితాలయినా చిరకాలం నిలబడతాయని ఆయన నమ్ముతాడు.
అందుకే చిన్ననాటి స్నేహితుల నుంచి ఉద్యోగ పర్వంలో పరిచయం అయిన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందితో ఇప్పటికీ టచ్ లో ఉంటాడు. మధ్య మధ్య ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, ఏ పనీ లేకపోయినా. హ్యూమన్ రిలేషన్స్ ప్రాధాన్యతని ప్రాక్టికల్ గా నిరూపిస్తున్న జ్వాలాని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది అనిపించింది.
నా దగ్గర కూడా అంతకు మించిన ఫోన్ లిస్టు వుంది. కానీ ఏ రోజూ ఎవరితో మాట్లాడను. అనవసరంగా వారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేది నాకు నేను చెప్పుకునే సమర్ధన.
ఇంత పెద్ద వయసులో ఈ అనుకరణలు సాధ్యమా! కాదని నాకు తెలుసు.
ఎందుకంటే నా గురించి నాకు బాగా తెలుసు. నేనో సీతయ్యని.
వయసులో నా కంటే ఒక్క రోజు చిన్నవాడు, పుట్టిన రోజులు లెక్కలోకి తీసుకుంటే. నేను పుట్టింది ఆగస్టు ఏడు. జ్వాలా పుట్టినరోజు ఆగస్టు ఎనిమిది. పుట్టిన సంవత్సరం లెక్కలోకి తీసుకుంటే ఏడాది, రెండేళ్లు నేను పెద్ద. ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను, మరో రెండేళ్ల తర్వాత కూడా, జ్వాలా నేను ఇప్పుడు వున్నదానికంటే ఎక్కువ చురుకుగా, ఉత్సాహంగా వుండగలడు. ఎందుకంటే అది ఆయన స్వభావం. జన్మతః వచ్చిన ఎనర్జీ.
నిజానికి ఈ పోస్టు వచ్చేనెలలో ఆయన పుట్టిన రోజున పెడదామని సంకల్పం. అలాంటి సందర్భాలలో రాసే పోస్టులలో ఒక్క పొల్లుమాట కూడా దొర్లరాదని నా ప్రిన్సిపుల్. అందుకే ముందుగా పోస్టు చేస్తున్నాను.
ఈ ఆఖరి పేరా అదే.
నాలో ఆయనకు నచ్చని విషయాలు అనేకం వుంటాయి. అవి ఆయన నిర్మొహమాటంగా నా మొహాన చెబుతాడు. ఆయనలో నాకు నచ్చని అనేక సంగతులు లేకపోలేదు. కానీ ఆయనలా అలా చెప్పగలిగిన తత్వం నాది కాదు.
ఆయన వాదోపనిషత్ ని కాచి వడబోశాడు. తాను ఒకప్పుడు బలంగా నమ్మిన వామ పక్ష వాదాన్ని, ఇప్పుడు కొత్తగా నమ్ముతున్న ఆధ్యాత్మిక భావనను ముడి పెట్టి మాట్లాడగలగడం ఆయనకే సాధ్యం.
వాదంలో తనదే పై చేయి అనిపించుకోవడం ఇష్టమేమో. ఇందుకు ఆయన ఎంచుకున్న విధానం Rubbing on the wrong shoulder అని నాకనిపిస్తుంది. తాను ఉద్రేక పడకుండా అవతల వ్యక్తిని రెచ్చ గొట్టి, వాదాన్ని గెలవడంలో పట్టా పుచ్చుకున్నాడు. నాకెందుకో ఇది నచ్చదు. కానీ ఇది నిజం!
నా లాగే ఆయన కూడా ఓ సీతయ్య. ఎవరి మాటా ఒక పట్టాన ఒప్పుకోడు.
ADVANCE BIRTHDAY GREETINGS MY DEAR FRIEND JWALA!



(ఇంకావుంది)

17, జులై 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో: (343) : భండారు శ్రీనివాసరావు

 

వరదల్లో పులిహోర
రోశయ్య గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కృష్ణానదికి బ్రహ్మాండమైన వరదలు వచ్చాయి. కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కర్నూలు పట్టణంలోకి వరద నీరు ప్రవేశించి పెద్ద పెద్ద భవంతులు కూడా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలో రెండో అంతస్తులోకి కూడా నీళ్ళు వచ్చాయి. ఇళ్లన్నీ వరద బురదతో పేరుకుపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్తితులు చెప్పక్కర లేదు. హైదరాబాదు నుంచి చూడడానికి వెళ్లాము. ఒక అధికారి చెప్పాడు, ‘ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. ఇళ్లు వదిలిపెట్టి సహాయక శిబిరాలకు రావడానికి వాళ్ళు ఓ పట్టాన ఒప్పుకోవడం లేదు’
దీనికి సమాధానం ప్రజల దగ్గర నుంచే వచ్చింది. ఒకతను చెప్పాడు.
‘వున్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి రమ్మంటారు. ఎలా వెడతామ్. టీవీలు ఫ్రిజ్ లు చాలా ఖరీదైన వస్తువులు. మా పెద్దవాళ్ళ టైమ్ లో అయితే గోచీ పాత తప్పితే యేమీ వుండేవి కావు. ప్రతిసారీ వరదలు వచ్చినప్పుడల్లా వచ్చి ఖాళీ చేయమంటారు. మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ ఇదే తంతు. మా బతుకులు గంగమ్మ నీడలోనే గడిచిపోతాయి. నీళ్ళను చూస్తూ పెరిగాము. నీళ్లంటే మాకు భయం లేదు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఎన్ని కొంపలు వున్నాయో. ఇలా ప్రతిసారీ బోలెడు ఖర్చు పెట్టి ఖాళీ చేయించే బదులు వరద భయం లేని మెట్ట ప్రాంతాలలో మాకు ఇళ్లు కట్టించి ఇస్తే ప్రతియేడూ ఇలా తరలించే ఖర్చు ప్రభుత్వానికి కలిసి వస్తుంది కదా!’
బదులు చెప్పడానికి వీలులేని సమాధానం.
రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడు వుండడు అని సామెత. భయం కూడా అంతే! భయం అలవాటు అయిన కొద్దీ భయం పట్ల భయం పోతుంది.
కరోనా రోజులు గుర్తున్నాయా! ఒక పిట్టల్లా రాలిపోతున్నా, ప్రజలు ఏమాత్రం వెరపు లేకుండా వైన్ షాపులు తెరవగానే క్యూలు కట్టడం కళ్ళారా చూశాము కదా!
నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లో ఓ సారి గోదావరి నదికి ఉధృతంగా వరదలు వచ్చాయి. పెరుగుతున్న వరద నీటి మట్టాలను గురించి ఎప్పటికప్పుడు చెబుతూ, ప్రజలని అప్రమత్తం చేయడానికి ఆ రోజుల్లో ఉన్న ఏకైక మీడియం చిన్న చిన్న బేటరీలతో పనిచేసే ట్రాన్సిస్టర్ రేడియో ఒక్కటే. దూరదర్సన్ వున్నా, ఆ ప్రసారాలకు కరెంటు వుండాలి. మామూలుగానే కరెంటు నిలకడగా వుండని ప్రదేశాలు. ఇక వానలు, వరదలు వస్తే చెప్పాలా! రోజుల తరబడి చీకటి రాత్రులే. వరదలు ముంచెత్తి లంకలుగా తేలిన గ్రామాలకు పత్రికలు చేరే ఛాన్స్ అస్సలు లేదు. అంచేత ఏ సమాచారం వాళ్లకు చేరవేయాలన్నా పనికొచ్చేది, అందుబాటులో వుండేది రేడియో మాత్రమే.
హైదరాబాదు నుండి ఆహార పొట్లాలను ప్రతి రోజూ రెండు దఫాలుగా హెలికాప్టర్ లో తీసుకు వెళ్ళి వరద ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు పైనుంచి జారవిడిచే వాళ్ళు. సహాయ కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుతెన్నులను రేడియో వార్తల ద్వారా తెలియచెప్పడానికి రేడియో విలేకరిగా నేను కూడా ఒకసారి హెలికాప్టర్ లో భద్రాచలం ప్రాంతాలకు వెళ్లాను. అది మిలిటరీ హెలికాప్టర్. సీట్లు అవీ వుండవు. ఒక పక్కగా సీటు బెల్టులు ఉన్న ఒక చెక్క బల్ల లాంటిది వుంది. మిగిలిన జాగా అంతా పులిహోర పొట్లాలు, బిస్కెట్ల సంచులు. వాటిని కిందికి విసిరేసేటప్పుడు హెలికాప్టర్ ని బాగా కిందికి దించే వాళ్ళు. చెట్ల కొమ్మల మీదా, ఇంటి కప్పుల మీదా నిలబడిన జనం, హెలికాప్టర్ చప్పుడు వినగానే ప్రాణం లేచొచ్చినట్టు, పైకి చూస్తూ తమని గమనించమని చప్పట్లు కొట్టేవాళ్ళు. పైనుంచి సంచులను కిందికి వదిలేలోగా హెలికాప్టర్ వేగానికి బాగా ముందుకు వెళ్ళి పోయేది. ఆ సంచులు పడాల్సిన చోట పడకుండా ఎక్కడెక్కడో పడి నీళ్ళ పాలు అయ్యేవి. కానీ సైనికులది జాలిగుండె. మళ్ళీ వెనక్కి తిప్పి ఎక్కడనుంచి, ఎప్పుడు కిందికి పడేస్తే వాళ్లకు చేరుతుందో ఉజ్జాయింపుగా లెక్క వేసుకుని అనేక ప్రయత్నాలు చేసి, ఏదో ఒక విధంగా వాళ్లకు అందేటట్టు చూసే వాళ్ళు. నాచేత కూడా కొన్ని సంచులు కిందికి విసిరేయించారు.
హైదరాబాదు తిరిగి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ‘చుట్టూ నీళ్ళు వున్నా అవి తాగడానికి పనికి రాని నీళ్ళు’ అని చెప్పాను. అప్పట్లో ఈ వాటర్ బాటిళ్ళ పద్దతి లేదు. ప్లాస్టిక్ సంచుల్లో నీళ్ళు సప్లయి చేద్దామంటే అదీ కుదిరే పని కాదని తేలింది. రెండు మూడు రోజులు నిలవ వుండాలంటే పులిహోర తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదులా వుంది. కానీ పాచిపోయిన పులిహోర తింటే, డిసెంట్రి లాంటి రోగాలు వచ్చే ప్రమాదం కూడా వుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ముఖ్యంగా కావాల్సింది శుభ్రమైన నీళ్ళు అని డాక్టర్లు చెబుతారు. ఆ సంగతే నేను వాళ్ళతో చెప్పాను. ఈ ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చే లోగా గోదావరి వరదలు తగ్గుముఖం పట్టాయి.
(ఇంకా వుంది)

16, జులై 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో : (342) : భండారు శ్రీనివాసరావు


ఎవరు ముందు ? ఎవరు వెనుక?

ఈ ఇంగ్లీషు వాడున్నాడే ఎంతయినా గొప్పవాడు. పంతాలు, పట్టింపులు, అహంభావం, నేనే గొప్ప అనే రకరకాల భావనలను అన్నీ కలిపి ఎంచక్కా ఈగో అనే ఒక్క చిన్న మూడక్షరాల (EGO) పదంలో గుది గుచ్చాడు.

ఈ మధ్య ఏ పేపరు తిరగేసినా అధికారులు, అనధికారులు, నాయకులు మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరాఖరికి రాజ్యాంగ పదవుల్లో వున్నవాళ్ళు అందరూ (ఈ అందరిలో కొందరు జర్నలిస్టులు కూడా వున్నారు) ఈగో అనే విషవలయంలో చిక్కుకుని సంచలన వార్తలకు కేంద్ర బిందువులు అవుతున్నారు.

నిజానికి ఇవన్నీ కొత్తవేమీ కాదు. ‘ఎవరు ముందు, నేనే ముందు’ అనే అహానికి మహాభారతంలోనే దృష్టాంతం వుంది. పాండవోద్యోగ విజయాలు నాటకంలో ‘ముందుగ వచ్చితీవు ..’ అనే కృష్ణుడి పద్యానికి దుర్యోధనుడి ఈ ఈగోనే కారణం.

మచ్చుకు ఓ ఉదాహరణ చెప్పుకుందాం. ఇది చాలా పాత రోజుల సంగతి, ఈనాటి తరం వారికి. మరి నా అనుభవాలు అన్నీ ఎప్పటివో కదా!

అప్పుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. మోహన్ కందా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. స్వర్ణజిత్ సేన్ పోలీసు డైరెక్టర్ జనరల్. దినేష్ రెడ్డి హైదరాబాదు నగర పోలీసు కమిషనర్.

ఆ రోజుల్లో ఒకసారి రాష్ట్రపతి ఏ.పీ.జే. అబ్దుల్ కలాం హైదరాబాదు వచ్చారు. బేగం పేట విమానాశ్రయంలో స్వాగతం. ఏర్పాట్లు అన్నీ జరిగాయి. రాష్ట్రపతికి స్వాగతం చెప్పడానికి అందరూ వరసగా నిలబడ్డారు. పోలీసు కమిషనర్ దినేష్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం కొంత వెనుక నిలబడాల్సి వచ్చింది. అది ఆయనకి నచ్చలేదు. వరుస తప్పించి ముందుకు వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు.

సరే ఆ కార్యక్రమం ముగిసింది. కానీ దినేష్ రెడ్డి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రోటోకాల్ విషయంలో తనకు జరిగిన లోపాన్ని ఎత్తి చూపుతూ చీఫ్ సెక్రెటరీకి ఓ ఉత్తరం రాశారు.
“సీనియారిటీ రీత్యా నాకంటే జూనియర్ అయిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి (సీ.ఆర్. బిస్వాల్, ప్రిన్సిపాల్ సెక్రెటరి పొలిటికల్) వెనక నేను నిలబడడం కుదరదు. నగర పోలీసు కమిషనర్ గా నేను ఆయనకంటే ముందు వుండాలి” అంటూ ఆయన తన మనసులో మాట బయట పెట్టారు.

దీనికి జవాబుగా ఆయనకు చీఫ్ సెక్రెటరి నుంచి మెమో వచ్చింది. “రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో మీరు ప్రిన్సిపల్ సెక్రెటరి పొలిటికల్ ని దాటుకుని వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుంది’ అనేది ఆ మెమో తాత్పర్యం.
ఈ మెమో ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం ఇచ్చింది అని తెలియక, దినేష్ రెడ్డి చీఫ్ సెక్రెటరీకి మరో ఘాటయిన లేఖ రాశారు, “నాకు మెమో ఇవ్వడానికి మీకెంత ధైర్యం? హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ గా నా స్థాయి (హోదా) చీఫ్ సెక్రెటరీకి సమానం’ అంటూ.

ఇది చిలికి చిలికి గాలివాన అయింది. స్టేట్ ఐ.పి.ఎస్. అధికారుల సంఘం కార్యవర్గం అత్యవసర సమావేశం జరిపి ప్రోటోకాల్ విషయంలో తమను కూడా ఐ.ఏ.ఎస్. అధికారులతో సమానంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఈ సంఘానికి దినేష్ రెడ్డి కార్యదర్శి కావడం కాకతాళీయం కావచ్చు.

తాను 1977 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారినని, ప్రోటోకాల్ వ్యవహారాలు చూసే అధికారి 1981 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. కాబట్టి అతడు తనకు జూనియర్ అవుతాడు అనే ధోరణితో దినేష్ రెడ్డి ఉత్తరం రాసారు.

నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఈ వివాదం కొనసాగుతోంది కానీ ప్రభుత్వం పెదవి విప్పలేదు. కారణం నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాల్సి వుంది. ఆ కార్యక్రమం సజావుగా అలా పూర్తయిందో లేదో నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటికి ఆయన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి పది నెలలు కూడా కాలేదు. నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తున్న సమాచారం డీజీపీకి కూడా తెలియదని వార్తలు గుప్పుమన్నాయి.
ఏదో కక్ష కట్టినట్టు బదిలీ చేసినట్టు కాకుండా అదే రోజు మరో ఆరుగురు ఉన్నత పోలీసు అధికారులకు కూడా స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అప్పుడు అలా అర్ధాంతరంగా కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాల్సివచ్చిన దినేష్ రెడ్డి, ఆద్యతన కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ అయ్యారు. సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా ఆయన ఒకే ఒక్క రోజున రాష్ట్ర వ్యాప్తంగా యాభయ్ మంది డీ.ఎస్.పి. లను బదిలీ చేయడం ఓ కొసమెరుపు.

మరో కొసమెరుపు కూడా వుంది. అది ఇక్కడిది కాదు. ఇప్పటిదీ కాదు, పాతదే. (ఇప్పటి విషయాలు ఇలా స్వేచ్ఛగా రాసుకునే రోజులు ఎప్పుడో పోయాయి)

కమ్యూనిస్ట్ చైనా అధినేత అమెరికా సందర్శించినప్పుడు ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. తరువాత అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా జీ. 20 అధినాయక సదస్సులో పాల్గొనడానికి బీజింగ్ వెళ్ళారు. అక్కడ విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ మాట అటుంచి కనీస హోదా కలిగిన అధికారి కూడా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం చెప్పడానికి రాలేదు. ప్రెసిడెంట్ ఎయిర్ క్రాఫ్ట్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’ లో అమర్చిన ఒక ప్రత్యేక ద్వారం (యుద్ధ సమయాల్లో వాడే అత్యవసర ద్వారం) తెరుచుకుని చిన్న ఇనుప నిచ్చెన సాయంతో విమానం దిగి ఒబామా నడుచుకుంటూ వెళ్లి కారెక్కి బసకు వెళ్ళిపోయారు.

తరువాత విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తే, ఒబామా ‘అది చాలా చిన్న విషయం’ అన్నట్టు కొట్టి పారేశారు.
‘అనేక అంతర్జాతీయ వ్యవహారాలను చర్చించడానికి ఈ సదస్సు జరుగుతోంది. వాటి ప్రాముఖ్యతను తగ్గించే ఇటువంటి అత్యల్ప విషయాలను మాట్లాడడం నాకిష్టం లేదు’ అనే ధోరణిలో ఒబామా హుందాగా జవాబిచ్చారు.

ఇందులో ఇంకో కొస మెరుపు ఏమిటంటే ఒబామాకు తగిన రీతిలో స్వాగతం పలకని చైనా ప్రభుత్వం, ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఇతర దేశాల అధినాయకులకు సముచిత రీతిలో ఎర్ర తివాచీ పరచి మరీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసింది.

(ఇంకావుంది)

మరణం అంటే ఏమిటి? – భండారు శ్రీనివాసరావు

మహామహులే ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు. ఇది కూడా సరయిన జవాబు కాకపోవచ్చు
కానీ చాలా సంవత్సరాల క్రితం ఓ కధలోనో, నవలలోనో చదివాను.
“నువ్వు కూర్చునే కుర్చీ వుంటుంది. పక్కనే అతిధులు కూర్చునే సోఫాలు వుంటాయి. గోడమీద గడియారం వుంటుంది. టేబుల్ మీద టీవీ వుంటుంది. ఇంతెందుకు మీ ఇల్లు ఎలా వుండాలని అన్నీ అమర్చుకున్నావో అవన్నీ అలాగే వుంటాయి.
“ఒక్క నువ్వు తప్ప”
జిడ్డు కృష్ణ మూర్తి గారు మరో మాట చెప్పారు.
మరణ భయం అంటే కోరిక అని.
కోరిక తీరదేమో అనే సందేహమే భయంగా మారుతుంది అని వారి తాత్పర్యం.
ఒక విద్యార్థి పరీక్షలను లెక్కపెట్ట కుండా ఏడాది పొడుగునా అడ్డమైన తిరుగుళ్లతో కాలక్షేపం చేస్తాడు. పరీక్షలు దగ్గర పడేసరికి భయపడిపోతాడు, సరిగ్గా రాయలేనేమో అనే సందేహంతో. పరీక్ష పాసవాలి అనే కోరిక తీరదేమో అనే భయంతో. ఎందుకంటే పరీక్ష రాయడానికి అతడు సంసిద్ధంగా లేడు. అందుకు తగిన సన్నాహం చేసుకోలేదు.
అలాగే జీవితం అనే పరీక్ష రాయడానికి కూడా కొంత సంసిద్ధత కావాలి. అది లేకపోతే భయం వేస్తుంది.
ఇక్కడ పరీక్ష అంటే మరణం. మరణ కాలం దగ్గర పడుతుంటే మనసులో ఆందోళన మొదలవుతుంది. అప్పటిదాకా ఎందుకూ పనికిరాని లౌకిక విషయాలతో మమేకమై, సంపాదన యావలో మునిగిపోయి, ప్రాపంచిక ప్రలోభాలకు లోనయి అసలు జీవిత పరమార్థం ఏమిటో మరిచిపోతాడు మనిషి. అల్లరిచిల్లరగా తిరిగిన విద్యార్ధికి మల్లేనే మానవుడికి కూడా మరణం అంటే భయం వేస్తుంది. కోరికలు తీరకపోవడమే దానికి కారణం. బాగా శ్రద్ధగా చదివిన విద్యార్థి ఎలాంటి భయ సంకోచాలు లేకుండా పరీక్షకు తయారవుతాడు. కోరికలు లేని మనిషి కూడా మరణ భయానికి దూరం అవుతాడు.
కాబట్టి జీవితం అనే విలువైన సమయాన్ని మంచి పనులకు ఉపయోగిస్తే, మంచి విద్యార్ధికి పరీక్ష భయం లేనట్టే మంచి మనిషికి కూడా మరణ భయం మాయమై పోతుంది.

14, జులై 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో: (341) : భండారు శ్రీనివాసరావు

 

గుర్తింపుకో కార్డు
రోడ్డు మీద పోతుంటే పోలీసు ఆపి నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు. జేబులో నుంచి ఓ కార్డు తీసి, ‘ఇదిగో ఇది నేను’ అని చెప్పాలి. అప్పుడే అతడు నమ్మే వీలుంది, నమ్ముతాడని నమ్మకం లేకపోయినా. అంటే ఏమిటన్నమాట. మనమెవరో మన నోటితో చెప్పినా నమ్మని వాడు, మన కార్డు తీసి పలానా అంటే నమ్మే చాన్స్ వుంది. అందుకే ఈ కలియుగంలో మనుషులకన్నా కార్డులకే విలువ ఎక్కువ. అవి మనకి ఒక గుర్తింపు ఇస్తాయి.
జ్ఞానపీఠాలు, పద్మశ్రీలు, దాదా సాహెబ్ లు, స్వర్ణ నందులు ఒక రకం గుర్తింపులే. అవి పెట్టి పుట్టిన వారికి మాత్రమే సుమా!
పుట్టి కూడా పుట్టినట్టు దాఖలా కోసం కావాల్సిన గుర్తింపులు మరి కొన్ని. ఉదాహరణకు బర్త్ సర్టిఫికేట్. స్కూలు ఫైనల్ లేదా టెన్త్ క్లాస్ (పుట్టిన తేదీ నిర్ధారణ కోసం), కులం సర్టిఫికేట్ (అవసరాన్ని బట్టి), నివాస స్థలం గుర్తింపు, బ్యాంకు (ఏటీఎం) కార్డు, ఇక ఆధార్ సరే సరి. ఇవన్నీ ఓ మోస్తరు బతుకులకోసం. ఇంకొంచెం ముదిరితే పాస్ పోర్టు, వీసా, బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్లాటినం, గోల్డ్, ఎయిర్ పోర్ట్ లాంజ్ కార్డు ఎట్సెట్రా ఎట్సెట్రా.
పాతికేళ్ళు వచ్చేవరకు ఈ కార్డుల గోల పెద్దగా లేదు. పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికేట్ లోనే వుంది కాబట్టి ఉద్యోగ పర్వం వరకు దానితోనే నెట్టుకొచ్చాను.
1975 లో హైదరాబాదులో ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట అవసరం పడింది రేషన్ కార్డు. అదీ పంచదార కోసం. షుగర్ తో లింక్ లేకపోతే నేనూ ఈ కార్డు కోసం వెంపర్లాడే వాడిని కానేమో! అంచేత, అందరి లాగే ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చేస్తున్న ఉద్యోగం దుర్వినియోగం చేయక తప్ప లేదు.
వెళ్లి అప్పటి రెవెన్యూ మంత్రి పి. నరసారెడ్డి గారితో చెప్పాను. ఆయన పియ్యేను పిలిచి నాకు సంబంధించిన ఏరియా తాసీల్దారును ఆఫీసుకు పిలిపించారు. అధికార ముద్రతో సహా రమ్మని చెప్పారు. ఆయన ఆఘమేఘాల మీద సచివాలయానికి వచ్చారు. నన్ను కూర్చోబెట్టుకుని వివరాలు తీసుకుని స్టాంపు వేసి రసీదు ఇచ్చారు. సాయంత్రం కల్లా రేషన్ కార్డు నాకు ఆఫీసులో ఇచ్చి వెళ్ళారు.
తరువాత కౌలాలంపూర్ తెలుగు మహాసభలకు వెళ్ళడానికి పాస్ పోర్టు అవసరం వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య గారు. సీఎం ఆఫీసు చొరవతో అది ఇంటికే వచ్చింది, ఇరవై నాలుగ్గంటల్లో.
అమెరికా వెళ్ళడానికి పదేళ్ల వీసా కూడా చెన్నై వెళ్ళకుండా, ఇంటర్వ్యూ కు హాజరు కాకుండా చెన్నై ఎంబసీ వాళ్ళే పోస్టులో పంపారు. అలాగే మా ఆవిడ వీసా కూడా. అది నేను చేస్తున్న ఉద్యోగం చలవే. సందేహం లేదు.
బ్యాంకు కార్డు వద్దనుకున్నాను. కానీ ఒక బ్యాంకు వాళ్ళు ఆఫీసుకు వచ్చి మొహమాట పెట్టి మరీ ఇచ్చారు. ఇవ్వడం ఇచ్చారు కానీ దానితో పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఆ క్రెడిట్ కార్డు లేకపోతె బహుశా నాకు జీవితంలో బీపీ రోగం వచ్చేది కాదేమో! అది మాత్రం ఆ బ్యాంకు వాళ్ళ పుణ్యమే. బ్యాంకుల వాళ్ళు కూడా డబ్బు (బాకీ) వసూళ్ళకు ప్రైవేటు ఏజెన్సీల (గూండాల)ను నియమించుకుంటారని అప్పుడే తెలిసింది.
దాంతో క్రెడిట్ కార్డు వదుల్చుకుని డెబిట్ కార్డు తీసుకున్నాను. యూపీఐ రాకతో బ్యాంకు కార్డులు హమేషా వెంట ఉంచుకోవాల్సిన అవసరం తప్పింది. ఇప్పుడు అంతా మొబైల్ తోనే.
ఆధార్ కార్డుకు పెద్ద ప్రయాస పడలేదు. ఆధార్ కార్డుల శకం మొదలయిన కొత్తల్లోనే తీసుకున్నాను, పెద్ద ఇబ్బంది పడకుండా. ఇంటిపక్కనే ఆధార్ నమోదు కేంద్రం పెట్టారు. వెళ్లి పదిహేను నిమిషాల్లో నేనూ మా ఆవిడా వేలిముద్రలు, కనుపాప ముద్రలు ఇచ్చి కార్డులు తెచ్చేసుకున్నాం. కాకపోతే దానిమీద ఫోటో decomposed dead body లాగా వుందని నలుగురు అంటుంటే, ఇంటి నుంచి పిల్లల సాయంతో కంప్యూటర్ ద్వారా ప్రయత్నించి మరో కార్డు తీసుకున్నాము. అలాగే ఓటరు ఫోటో గుర్తింపు కార్డుకు కూడా పెద్ద ఇబ్బంది పడ్డ జ్ఞాపకం లేదు.
విధిగా తీసుకోవాల్సి వచ్చిన మరో రెండు కార్డులు వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, PAN కార్డు, స్కూటర్ కొన్న కొత్తల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు. ఈ మూడు కూడా పెద్ద కష్టపడకుండానే నా కార్డుల సంతానంలో చేరాయి. అప్పటికి రేడియో ఉద్యోగంలో వున్నా కదా!
ఇక వృత్తి రీత్యా అవసరమైన ప్రెస్ అక్రిడేషన్ కార్డు. 1975 నుంచి ఇప్పటివరకు అవిచ్చిన్నంగా కొనసాగుతోంది, గత యాభై ఏళ్లకు పైగా. దానికి అనుబంధ కార్డులు మరి కొన్ని వుంటాయి. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఉచిత సిటీ బస్సు కార్డు, రాష్ట్రంలో ఎక్కడికైనా మూడో వంతు టిక్కెట్టు ధరతో బస్సుల్లో తిరిగే మరో కార్డు. స్కూటరు యోగం పట్టిన తర్వాత సిటీ బస్సు పాసు వదిలేసాను. కారు కొన్న తర్వాత రెండో దానికీ నీళ్ళు వదిలాను.
వృత్తికి అవసరమైన మరో కార్డు వుంది. విజిటింగ్ కార్డు. ‘ఈ శ్రీనివాసరావు పలానా సుమా’ అని మన మొహం తెలియని వాళ్లకు తెలియచెప్పే కార్డు. అయితే దానితో నాకు ఎప్పుడూ అవసరం పడలేదు. నా పేరే నా విజిటింగ్ కార్డు అనుకునేవాడిని. ఎవరినైనా కలవాల్సినప్పుడు చీటీ మీద నా పేరు రాసి పంపేవాడిని. అయితే ఈ పప్పులు ఈ కాలంలో ఉడకవు అనుకోండి.
పొతే, సగం ధరతో దేశంలో ఏ తరగతిలో అయినా ప్రయాణించే రైల్వే పాసు కార్డు. అదేదో గుర్తుకోసం అన్నట్టుగా వుండేది కానీ వాడిన సందర్భాలు బహు తక్కువ. ఇప్పడు ఆ సదుపాయం రైల్వే వాళ్ళే తీసేసినట్టున్నారు.
మాస్కోలో వున్న అయిదేళ్ళూ మాస్కో రేడియో వారి గుర్తింపు కార్డు (ప్రోపుస్కా) వుండేది. రేడియోలో ప్రవేశానికే కాదు, మాస్కోలో తిరిగేటప్పుడు కూడా గుర్తింపు కోసం హమేషా అది దగ్గర ఉంచుకోవాల్సి వచ్చేది. అది వెంట లేకుండా తిరగడం అక్కడి నిబంధనల ప్రకారం నిషేధం.
విచిత్రం ఏమిటంటే నేను సుదీర్ఘ కాలం పనిచేసిన రేడియో, దూరదర్శన్ లలో కూడా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ నేను తీసుకోలేదు. ఇక ప్రెసిడెంట్, ప్రధాని వంటి వీవీఐపీల పర్యటనల సందర్భంలో ప్రత్యేకంగా జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డులు. సరే. ఇవి తాత్కాలికం అనుకోండి.
రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ కార్డు, సీ.జీ.హెచ్.ఎస్. కార్డు అదనంగా వచ్చి పర్సులో చేరాయి.
మరోటి వుంది. అది హైదరాబాదు ప్రెస్ క్లబ్ కార్డు. ఢిల్లీ, బెంగుళూరు క్లబ్బుల్లో పనికొస్తుంది కాబట్టి అదొకటి వుంటుంది ఎప్పుడూ.
జేబులు కొట్టేవాడి కన్ను నా వాలెట్ మీద పడితే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అన్ని కార్డులు కడుపులో పెట్టుకుని, నా పర్సు బలిసిన పిల్ల పందిలా వుండేది. కానీ అదేమిటో విచిత్రం చాలా ప్రాంతాలు తిరిగాను, కొన్ని దేశాలు తిరిగాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా జేబు కొట్టే జేబుదొంగ నాకు తారసపడలేదు.
ఇప్పుడు కొన్ని కాలనీల్లో నివసించేవారికి లోపలకు వచ్చేందుకు కొత్తరకం ఎలెక్ట్రానిక్ కార్డులు ఇస్తున్నారట. ఇంతవరకు ఆ కార్డు అవసరం పడలేదు.
దేశంలో మధ్యతరగతి దిగువన ఇంకా చాలా మంది జనం వున్నారు. బీ పీ ఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారు) వారి కష్టాలు ఏమిటో వారే చెప్పుకోవాలి.







(ఇంకావుంది)

12, జులై 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో : (340) : భండారు శ్రీనివాసరావు


లాయల్టీ

‘లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో’ అని వెనక ఓ సినిమాలో డైలాగ్ వుంది.

అలాగే, మూడున్నర దశాబ్దాల క్రితం రేడియో విలేకరిగా ఓ వెలుగు వెలుగుతున్న ఓ పాత భూతకాలంలో, ఘనత వహించిన ఓ ఎంపీ గారు నన్నొక పని అడిగారు. తలచుకుంటే ఆయనకది చిటికలో పని. ఆయనకు పని పడింది రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగి పని. ఆ ఉద్యోగికి జరూరుగా బదిలీ కావాలి. అదీ రాష్ట్రానికి కడగొట్టున వున్న పొరుగు రాష్ట్రపు సరిహద్దు ప్రాంతానికి.
నాకది చాలా చిన్న పని అనిపించింది. చూస్తూ చూస్తూ అంత దూరం బదిలీ కోరేవారు ఎవరుంటారు? కాబట్టి అడగాలే కాని ఎవరైనా చేస్తారు అని ఏకంగా ఆ సంబంధిత మంత్రి దగ్గరికే వెళ్లి చీటీ ఇచ్చాను. ఆయనతో నాకు చాలా కాలంగా మంచి స్నేహమే వుంది. అడగక అడగక అడిగాను కాబట్టి వెంటనే పని అవుతుంది అనుకున్నా.
నేరుగా సచివాలయానికి వెళ్లి అడిగా.

‘ఈ ఉద్యోగి నీకు తెలుసా!’ అని మంత్రి అడిగారు.
‘నాకు అతడి ముక్కూ మొగం తెలియదు. కానీ మీ వంటి సన్నిహితుడే నన్ను ఈ ఫేవర్ అడిగారు. అందుకనే వచ్చాను’
‘సరే! నీ స్కూటర్ ఇక్కడే పెట్టు. రేపు తీసుకు పోదువు కానీ. ఈరోజు నాతొ రా. మళ్ళీ నా కార్లో నిన్ను ఇంట్లో దింపుతాను’

ఆయన కార్లోనే ఆయన ఇంటికి వెళ్లాను. మంత్రిగారు లోపలకి వెళ్లి తయారై వచ్చారు. ఇద్దరం ఆయన పోర్టికో పైన వున్న బాల్కానీ వంటి దానిపై వేసిన కుర్చీల్లో కూర్చున్నాము.
అప్పుడు ఆయన నాకు చేసిన పొలిటికల్ లాయల్టీ అనే భగవద్గీత ఇది.

‘భండారూ! నీకు అర్ధం కాదు కానీ మాకు లాయల్టీ చాలా ముఖ్యం. ఏదైనా పనిచేస్తే డబ్బు తీసుకుని పనులు చేస్తామనే నింద మాపై వుంది. అది పూర్తిగా నిజం కాదు, అలాగని అబద్ధం కాదు. నువ్వు అడిగిన బదిలీకి లక్షకు తక్కువ కాదు. నీకు అతడి ముక్కూ మొహం తెలియదు. ఇతడి గురించి నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు లెటర్లు ఇచ్చారు. నువ్వు చెప్పిన ఎంపీ కూడా వారిలో వున్నాడు. ఎంక్వైరీ చేస్తే అతడు మంచి సంపాదనపరుడు అని తెలిసింది. హైదరాబాదు నుంచి ఆదిలాబాదు జిల్లా చివరకి ఎవరూ బదిలీ కోరుకోరు. బార్డర్ ఏరియాలో వారి సంపాదన రోజుకు వేలల్లో వుంటుంది. అదంతా వారికి దక్కదు. కింద నుంచి పై దాకా పంపకాలు వుంటాయి. అంచేత మా ఎమ్మెల్యేలు చెప్పినా నేను పట్టించుకోలేదు.
‘ఈ సంగతులు ఏవీ నీకు తెలియదన్నసంగతి నాకు సాయంత్రమే అర్ధం అయింది. అందుకే మాట్లాడడానికి ఇంటికి రమ్మన్నాను.
‘ఇప్పుడు అసలు విషయం చెబుతా విను. అంతమంది చెప్పినా నేను చేయలేదు కదా! అందుకే నిన్ను పట్టుకున్నాడు, అదీ వేరే వారి ద్వారా. నువ్వు ఇన్నేళ్ళ పరిచయంలో ఎన్నడూ ఏదీ అడగలేదు. అందుకే ఆ ఫైల్ కూడా తీసుకువచ్చాను. నువ్వు నేను చెప్పిన దానికి అవును అంటే అతడిని అతడు అడిగిన చోటుకు బదిలీ చేస్తూ ఇప్పుడే ఇక్కడే సంతకం చేస్తాను. రేపే ఆర్డర్ ఇస్తాను. కానీ ముందు ఒక మాట చెప్పు. నా మాట ఒకటి విను. రేపటి నుంచి అతగాడు అందరితో చెబుతాడు. మంత్రి కాదన్నా నా పని నేను చేసుకోగలిగాను. ఆయన నాకో లెక్కా అన్నట్టు తోటివారితో చెబుతాడు. డిపార్ట్ మెంటులో క్రమశిక్షణ దెబ్బతింటుంది. పోనీ నీకన్నా లాయల్ గా ఉంటాడా అంటే అదీ లేదు. అతడెవరో కూడా నీకు తెలియదు. ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం’
నాకు విషయం పూర్తిగా అర్ధం అయింది.
వెంటనే చెప్పాను.
‘ముందా ఫైల్ మీ ముందు నుంచి తీసేయండి. వేరే విషయాలు ఏవైనా మాట్లాడుకుందాం!’

కాసేపు సాయంకాలక్షేపం చేసి ఆయన కారులో ఇంటికి చేరాను.
వచ్చిన తర్వాత ఆయన అన్న ఒక మాట అర్ధం బోధ పడలేదు.
‘నీకైనా లాయల్ గా ఉంటాడా!’
లాయల్ గా వుండడం అంటే ఏమిటి!
ఏమిటైతే నాకెందుకు! నాకు అవసరం లేని వ్యవహారం.

తోకటపా:

ఇంటి పెద్ద ఇంటి ఖర్చు కోసం ఇల్లాలికి కొంత డబ్బు ఇస్తాడు. ఇల్లాలు అందులో కొంచెం డబ్బు తీసి చిన్న సరదాలు తీర్చుకోవడానికి పిల్లలకు ఇస్తుంది. అమ్మ ఇచ్చిందని పిల్లలు అనుకుంటే అనుకోవచ్చు. నిజానికి ఆ డబ్బు ఇచ్చింది తండ్రి. తనే ఇచ్చాను అని ఏ తండ్రీ చెప్పుకోడు. తనే ఇచ్చానని ఏ తల్లీ చెప్పుకోదు. టాం టాం వేసుకోరు. పిల్లల అవసరాలు తీర్చడం తమ బాధ్యత అనుకుంటారు. కానీ అలా డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేద్దామని తల్లి తండ్రులు ఎవ్వరూ అనుకోరు. కానీ పిల్లలు మాత్రం తమ తలితండ్రుల పట్ల లాయల్ గానే వుంటారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల్ని తమ పిల్లలు అనుకుంటే ఈ లాయల్టీ పేచీయే వుండదు. రాదు.

(ఇంకావుంది)

10, జులై 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో : (339) : భండారు శ్రీనివాసరావు

 

ఒకనాటి ఉద్యానవనము ఆనాటి సచివాలయము
1975 నవంబర్ లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా చేరిన నాటి నుంచి కొన్ని దశాబ్దాలపాటు ఒకటే దినచర్య. నేను వుంటున్న చిక్కడపల్లి నుంచి బయలుదేరి రెండు బస్సులు మారి రేడియో స్టేషన్ కు రెండు స్టాపుల ముందే, సరోవర్ హోటల్ దగ్గర దిగిపోయేవాడిని. నేను పనిచేసేది రేడియో స్టేషన్ అయినా నా కార్యస్థానం మాత్రం సచివాలయమే.
ఆరోజుల్లో సెక్రెటేరియట్ ప్రధాన ద్వారం, రాజసం ఒలకబోసే ఇనుపకమ్మీలతో ప్రస్తుతం ఫ్లై ఓవర్ మొదలయ్యే ప్రధాన రహదారిలో వుండేది.
దాని ఎదురుగా ఆంధ్ర జ్యోతి సిటీ బ్యూరో ఆఫీసు. ఆదిరాజు వేంకటేశ్వర రావు గారు దానికి విలేకరి. ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం బెజవాడలో అచ్చయ్యేది. ఆయన ఇక్కడనుంచే టెలిప్రింటర్ లో వార్తలు పంపేవాడు.
నేను రేడియోలో చేరకముందు ఒకసారి ఆయనతో కలిసి సచివాలయానికి వెళ్లాను. అంతకుముందు ఎప్పుడూ అందులో అడుగు పెట్టిన అనుభవం లేదు.
ఆదిరాజు పేరులోనే కాకుండా వేషభాషల్లో కూడా. ఫుల్ సూటు. నెక్ టై. చేతిలో బ్రీఫ్ కేసు. ఢిల్లీలో ఎక్కువకాలం వుండడం వల్ల అలవడ్డ అలవాట్లు కాబోలు.
సచివాలయం గేటు దగ్గర కాపలా మనిషి ఆదిరాజుని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. ఆయన వెంట వస్తున్న నన్ను చూసి కనీసం ఎవరని కూడా అడగలేదు. సిగరెట్ వెలుగుతున్న చేయిని విలాసంగా వూపుతూ ఆదిరాజు లోపలకు వెళ్లాడు. ఆయనతో పాటే నేనూ.
ఆ తరువాత రేడియో విలేకరిగా నాకు సచివాలయం మొదటి కార్యస్థానంగా మారిపోయింది. ప్రతి రోజూ ముందు హాజరు అక్కడే. ఆ తరువాతే రేడియో.
ఎందుకంటే రేడియో వార్తలకి అవసరం అయ్యే అధికారిక సమాచారం యావత్తూ అక్కడే దొరికేది. కాలక్రమంలో గేటు మనిషి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరితో ముఖపరిచయాలు. ఎక్కడికయినా గేటు (తలుపు) తోసుకుని వెళ్ళగల చనువూ, వెసులుబాటు, వీటికి తోడు రేడియో విలేకరి అన్న ట్యాగు లైను.
గతంలో ముఖ్యమంత్రుల కార్యాలయం వున్న పాత (హెరిటేజ్) భవనం వెనుకపక్కనే ప్రెస్ రూమ్. విశాలంగా వుండేది. ఒకటి రెండు సోఫాలు, కుర్చీలు. పక్కనే భోషాణం మాదిరి చిన్న చెక్క బీరువా. అందులో ఫోను. ఈ ఫోను కోసమే చాలామంది వచ్చేవాళ్ళు. ఎందుకంటే అది డైరెక్ట్ ఫోను. సచివాలయం టెలిఫోన్ ఆపరేటర్ తో సంబంధం లేకుండా నేరుగా ఫోను చేసి మాట్లాడుకోవచ్చు.
ఆరోజుల్లో చాలామంది సీనియర్ జర్నలిష్టులకు సయితం ఇళ్ళల్లో ఫోన్లు వుండేవి కావు. ఒకరిద్దరికి వున్నా ఆఫీసు బిల్లు కట్టే పద్దతి వుండేది కాదు. అంచేత వార్తా సేకరణకోసం ప్రెస్ రూమ్ ఫోను బాగా పనికి వచ్చేది. పేపర్లవాళ్ల కంటే నాకు బాగా ఉపయోగంగా వుండేది. వాళ్లు వార్త సుదీర్ఘంగా రాయాలి కనుక ఆఫీసులకి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. రేడియోకి మూడు ముక్కలాటే కనుక వార్తల టైముకు ముందుగా ఫోను చేసి చెప్పేవాడిని. ప్రెస్ రూములో రేడియో కూడా వుండేది. ఫోనులో చెప్పిన వార్త అప్పటికప్పుడే రేడియోలో రావడం కొంతమందికి ఆశ్చర్యంగా వుండేది.
ప్రెస్ రూములో టీ, కాఫీలు తెచ్చి పెట్టడానికి ఒక అటెండరు.
డెక్కన్ క్రానికల్ కరస్పాండెంట్ సింహం (నరసింహారావు, మాజీ రాష్ట్రపతి వీవీ గిరి గారి మేనల్లుడు) ఒక సోఫాలో నిద్రపోతూ వుండేవారు. కానీ ఆయనది కాకి నిద్ర. చటుక్కున లేచి కూర్చునే వారు. ప్రెస్ మీట్ లో అవతలవాడు మంత్రికానీ, ముఖ్యమంత్రి కానీ ప్రశ్నలతో సింహం మాదిరిగానే విరుచుకు పడేవాడు. ఈనాడు ఎస్. ఎన్. శాస్త్రి గారు, ఆంధ్ర పత్రిక (ముక్కు) శర్మ గారు, హిందూ రెసిడెంట్ ఎడిటర్ రాజేంద్రప్రసాద్, దాసు కేశవరావు, నగేష్ కుమార్, పీ.యస్. సుందరం (ముందు ఆంధ్ర పత్రిక విలేకరి, తరువాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్), శ్రీకాంత్ విఠల్, బీ ఎస్ రామకృష్ణ, జాగర్లమూడి రామకృష్ణ, యూఎన్ఐ పార్ధసారధి, పీటీఐ జమాల్, యెన్ ఎస్ ఎస్ లక్ష్మారెడ్డి, కల్యాణి, ఆంధ్ర జ్యోతి వెంకట రావు గారు, ఎన్.ఇన్నయ్య, దామోదరస్వామి, ఉడయవర్లు, వేమూరి రాధా కృష్ణ ( ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ ABN ) ఆంధ్ర ప్రభ నంద్యాల గోపాల్, ఇలా ఎంతో మంది జర్నలిష్టులతో పరిచయాలు బలపడడానికి ప్రెస్ రూమ్ దోహదం చేసింది. జమాల్, కల్యాణి, లక్ష్మారెడ్డి ఎప్పుడూ కలిసి తిరుగుతుండే వారు. వారి పేర్లలో మొదటి అక్షరాలతో వారిని 'జాకాల్' అని ముద్దు పేరు పెట్టి పిలిచేవాళ్ళు. వీళ్ళల్లో కొద్దిమంది మినహా మిగిలిన వాళ్ళు కాలం చేశారు. చాలా కాలం అయింది కాబట్టి కాస్త మతిమరపు సహజం. ఎవరి పేర్లు అయినా మరచిపోతే క్షంతవ్యుణ్ణి. తదనంతర కాలంలో మన ఫేస్ బుక్ మిత్రులు నందిరాజు రాధాకృష్ణ మొదలయిన వారికి పాత ప్రెస్ రూముతో ప్రగాఢ సంబంధం అనేక సంవత్సరాలుగా వుంటూ వస్తోంది. వాళ్ల అనుభవాలు మరింత సుసంపన్నంగా వుంటాయని నా అభిప్రాయం.
అంతా ఒక కుటుంబం మాదిరిగా మధ్యాహ్నం దాకా సచివాలయంలో గడిపి, వార్తలు సేకరించుకుని, తోటి వారితో పంచుకుని, అనుమానాలు వుంటే తీర్చుకుని ఎవరి ఆఫీసులకు వాళ్ళం వెళ్ళేవాళ్ళం.
ఈరోజున చాలామంది అడుగుతుంటారు, 'మీరు యెందుకు మార్నింగ్ వాక్ చేయరు' అని. ఎందుకంటే ఒక జీవితానికి సరిపడా నడక ఆ రోజుల్లో సచివాలయంలోనే నడిచాను కనుక. ఒక బ్లాకు నుంచి మరో బ్లాకుకు, ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి, ఎక్కే మెట్లు, దిగే మెట్లు, నడకే, నడక, పరుగే పరుగు. ఆ రోజుల్లో అన్ని బ్లాకుల్లో తగిన సంఖ్యలో లిఫ్ట్ లు వుండేవి కావు.
పాత సచివాలయం లోని ఓ పాత భవనం మొదటి అంతస్తులో సీఎం పేషీ వుండేది. ఆ భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. పక్కనే ఆల్విన్ కంపెనీ తయారుచేసిన విశాలమైన లిఫ్ట్ వుండేది. మొదటి అంతస్తు చేరుకోవడానికి వున్న చెక్క మెట్ల వరుస, ఎర్ర తివాచీ కూడా రాజభవనాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో తయారైనదే.
ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు. ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ తెలిసినట్టు లేదు' అని వాపోయాడు.
ఇప్పుడా ప్రెస్ రూమే లేదు. మేము నడయాడిన పాత భవనాలు లేవు. సచివాలయంతో మూడు దశాబ్దాల పైచిలుకు అనుబంధం ఇరవై ఏళ్ళ క్రితం పదవీ విరమణ చేసినప్పుడే తెగిపోయింది.
జీతభత్యాల విషయంలో ఈనాటి జర్నలిష్టులకు సాటి రాకున్నా, పోలిక లేకున్నా ఆ రోజుల్లో జర్నలిష్టులుగా పొందిన గౌరవాభిమానాలు మాత్రం వెలకట్టలేనివి. అవే మరపురాని, మరవలేని జ్ఞాపకాలుగా మిగిలాయి.
మేము ఆ రోజుల్లో తిరుగాడిన పాత భవనాలు కూల్చి కొత్తవి నిర్మించారు. మళ్ళీ ఆ మొత్తం సచివాలయం స్థానంలో కేసీఆర్ సరికొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఒకప్పుడు పాత కాలపు జర్నలిస్టులకు సెకండ్ హోం గా వున్న అలనాటి సచివాలయం, కొత్త హంగులు సమకూర్చుకుని, ఇప్పుడు దూరం నుంచి చూసే ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
యాభై ఏళ్లలో ఇన్ని మార్పులు కళ్ళారా చూడగలగడమే జీవితం.
కింది ఫోటోలు:
ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మొదటి సారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన కార్యాలయం వున్న భవనం, పాడుబడి పోయి, కాలక్రమంలో కూల్చివేతకు గురయింది. రెండో ఫోటో: పాత సచివాలయం స్థానంలో ఆధునీకరించిన ఉమ్మడి రాష్ట్ర సచివాలయం
మూడోది ముఖ్యమంత్రి కేసీ ఆర్ హయాములో నిర్మించిన ఈనాటి తెలంగాణా నూతన సచివాలయ భవనం.










(ఇంకా వుంది)