27, జులై 2026, సోమవారం

I Am a Big Zero (349) By Bhandaru Srinivasa Rao

 

"Daddy Is No More, Grandpa!"

 

The phone rang early in the morning. I could not answer it. Mornings in our house revolve around a water emergency. We have only half an hour to finish every chore that needs water. There is no choice. If we miss that window, we must wait until the next day.

Later, I checked my mobile and saw that the call had come from Keerthan. Years ago, his family lived in the portion next to ours. I called back and asked, "What is it, Keerthan? Why did you call so early?"

Instead of his voice, I heard his daughter's.

"Grandpa, Daddy is gone."

"Where did he go, dear? He just called me."

"No, Grandpa. I was the one who called. Daddy has gone to God."

The words stunned me.

Keerthan was about the same age as my elder  son. He had two children.

My heart ached for Lakshmi. What a cruel burden life had placed upon her.

I got up immediately and headed to their house. On the way, I stopped at an ATM and withdrew some money.

Among my seven brothers in law, I closely observed the habits of two.

My brother in law Hanumantha Rao bava  would visit anyone who fell seriously ill and quietly hand over some money to help the family.

My another  brother in law Appa Rao bava  followed a different practice. He observed the Dasara Navaratri rituals with great devotion. He rarely attended weddings or other joyful celebrations. But the moment he heard that someone had passed away, he would rush to the bereaved family. As soon as he arrived, he would offer them some financial help. Many people hesitate to give money on such occasions, but he never.  I admired both of these men for their compassion.

As the Uber carried me to Keerthan's house, my thoughts stayed with his family.

One day, after my wife passed away, I was sitting alone at home, writing something. When I looked up, I saw Keerthan, Lakshmi, and their children standing before me.

"I came to see Mother, wearing the sari she gave me," Lakshmi said.

At first, I did not understand. On the day my wife passed away, Lakshmi had been with us. So which mother had she come to see?

Lakshmi and Keerthan had married for love. After their wedding, they rented the apartment next to ours. Since it was a love marriage and inter religion , it took time for both families to accept the relationship. During that difficult period, my wife became a mother to Lakshmi. More accurately, Lakshmi accepted my wife as her own mother. She always called her "Amma."

Their bond grew stronger with time.

When Lakshmi became pregnant, my wife organized her baby shower at our home and invited relatives and friends. My second sister in law, Vimala, also joined the celebration with great affection.

Whenever Keerthan and Lakshmi went out for work, my wife cared for their children as if they were her own. She did more than that. She embraced a young woman as her daughter. Eventually, they moved to another house, but the relationship remained.

Lakshmi is highly educated and possesses every qualification needed to become a lecturer. Since opportunities did not come easily, she first joined a small elementary school near our home as a teacher. She worked hard, gained experience, and eventually secured a position as a lecturer at a corporate college.

Both of their children were born before our eyes. We watched them grow. Since they are children of a teacher, they naturally excelled in their studies.

That day happened to be a Holi holiday. Keerthan brought his wife and children to our house.

While my wife was alive, she had gifted Lakshmi a sari during a festival. Lakshmi wore that very sari when she came to visit. She also brought several tiny cotton frocks for my infant granddaughter Jeevika,  carefully searching for the smallest sizes because it was summer.

In those days, my elderly wife was Lakshmi's mother.

Now, she had begun calling my little granddaughter "Amma." She firmly believed that her beloved mother had returned in the child's form. She rejoiced in that thought.

The meanings hidden within human relationships often escape easy explanation.

 

I reached Keerthan's house.

He lay in a glass topped freezer box, asleep in a long and silent sleep.

A deep sense of helplessness filled me. Perhaps, in the end, no one escapes that final sleep inside a freezer.

Lakshmi burst into tears when she saw me. I did not know how to comfort her. I gently took her aside, placed the money I had brought into her hands, and said, "Please do not misunderstand. Think of this as something your father has given you."

After speaking to the children, I quietly left.

Postscript

May God grant wisdom and goodwill to everyone.

This happened many years ago.

Dew, the daughter of Keerthan and Lakshmi, was still in primary school.

Her mother was a teacher. Her father was an artist.

The family followed the Christian faith. Dew passed the entrance examination with the highest rank at a well known school run by a Muslim organization. Encouraged by her parents, she also joined a music school run by a Hindu religious institution.

The teachers there were captivated by the way she recited the Krishnashtakam and the Shivashtakam. They selected her to perform during the cultural programs held as part of that year's Maha Shivaratri celebrations.

"Dew" means a drop of morning dew.

Today, that little girl studies in the first year of engineering.

It was she who called me this  morning and said, "Grandpa..."








(To be continued.)

 

 

24, జులై 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (349) : భండారు శ్రీనివాసరావు

“డాడీ లేరు తాతయ్యా!”
పొద్దున్నే ఫోను మోగింది. ఎత్తలేదు. ఉదయం పూట మా ఇంట్లో వాటర్ ఎమర్జెన్సీ. అరగంటలో నీళ్ళతో కావాల్సిన పనులన్నీ ముగించేయాల్సిందే. తప్పదు. లేకపోతే మర్నాటి వరకూ ఇంతే సంగతులు.
తర్వాత మొబైల్ తీసి చూస్తే కీర్తన్ అని వుంది. ఒకప్పుడు వాళ్ళు మా ఇంటి పక్క వాటాలోనే వుండే వారు. కాల్ బ్యాక్ చేసి అడిగాను ‘ ఏమిటి కీర్తన్ పొద్దున్నే ఫోన్ చేశారు?’
బదులుగా వాళ్ళ అమ్మాయి గొంతు.
“తాతయ్యా! డాడీ లేరు”
‘ఎక్కడికి వెళ్ళారమ్మా! ఇప్పుడే ఫోన్ చేశారు’
‘అది కాదు తాతయ్యా! నేనే చేశాను. డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు’
షాక్ తిన్నాను. మా అబ్బాయి వయసు వాడు. ఇద్దరు పిల్లలు.
పాపం లక్ష్మి ! ఎంత కష్టం వచ్చిపడింది.
వెంటనే లేచి వాళ్ళ ఇంటికి బయలుదేరాను. మధ్యలో ఏటీఎం దగ్గర ఆగి కొంత డబ్బు డ్రా చేశాను.
మా ఏడుగురు బావల్లో ఇద్దరి అలవాట్లు దగ్గర వుండి గమనించేవాడిని. హనుమంత రావు బావగారు ఎవరికయినా ఒంట్లో బాగాలేదని తెలిస్తే చూడడానికి వెళ్ళినప్పుడు కొంత మొత్తం పట్టుకుని వెళ్లి ఇచ్చేవారు. మా అప్పారావు బావ గారి తరహా వేరు. దసరా నవరాత్రులు చాలా నిష్టగా చేసేవాడు. అయితే, పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలకు సాధారణంగా వెళ్ళే వాడు కాడు. ఎవరైనా చనిపోయిన కబురు తెలిస్తే మాత్రం రెక్కలు కట్టుకుని వెళ్ళేవాడు. వెళ్ళగానే వాళ్లకు ఎంతో కొంత డబ్బు ఇచ్చేవాడు. ఇలాంటి కార్యక్రమాలకు డబ్బు సాయం చేయడానికి చాలామంది జంకుతారు. కానీ ఈయన అలా కాదు. వీళ్ళ ఇద్దరి పద్దతి నాకు బాగా నచ్చేది.
ఉబెర్ లో వెడుతున్నంత సేపు నాకు కీర్తన్ వాళ్ళ ఆలోచనలే.
మా ఆవిడ చనిపోయిన తర్వాత, ఒకరోజు ఒక్కడినే ఇంటి పట్టున వుండి ఏదో రాసుకుంటున్నాను. తలెత్తి చూస్తే కీర్తన్, లక్ష్మి, వాళ్ళ పిల్లలు.
“అమ్మని చూడానికి వచ్చాను. అమ్మ పెట్టిన చీర కట్టుకుని”
లక్ష్మిగారు అంటున్నది ఏమిటో ముందు అర్ధం కాలేదు. మా ఆవిడ పోయిన రోజు వాళ్ళు మాతోనే వున్నారు. మరి చూడాలని వచ్చిన అమ్మ ఎవరు?
లక్ష్మి, కీర్తన్ లది ప్రేమ పెళ్లి. పైగా మతాంతరం. పెళ్లి చేసుకుని వచ్చి మా పక్క అపార్ట్ మెంటులో కాపురం పెట్టారు.
ప్రేమ పెళ్లి కదా! పెద్దవాళ్లు సర్దుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈ నేపధ్యంలో మా ఆవిడే ఆమెకు అమ్మగా మారింది. కాదు లక్ష్మి మా ఆవిడను అమ్మగా చేసుకుంది. ఎప్పుడూ ‘అమ్మా’ అని పిలిచేది. ఆ బంధం మరింత బలపడుతూ వచ్చింది.
లక్ష్మి కడుపుతో వున్నప్పుడు మా ఆవిడే నలుగుర్ని పిలిచి మా ఇంట్లోనే సీమంతం చేసింది. మా రెండో వదిన విమల వదిన గారు కూడా ఈ వేడుకలో సంతోషంగా పాల్గొన్నారు.
భార్యా భర్తా తమ పనులపై బయటకు వెళ్ళినప్పుడు, మా ఆవిడే వారి పిల్లల్ని తన పిల్లలుగా పెంచింది. అంతే కాదు ఓ అమ్మని తన కుమార్తెగా చేసుకుంది. తర్వాత వాళ్ళు ఇల్లు మారి వెళ్ళిపోయారు.
లక్ష్మి మంచి విద్యాధికురాలు. ఓ లెక్చరర్ కావాల్సిన అన్ని అర్హతలు వున్నాయి. కానీ అవకాశాలు దొరక్క మా ఇంటి దగ్గరలో ఓ చిన్న ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా చేరింది. అలా కష్టపడుతూ, అనుభవం పెంచుకుంటూ ఇప్పుడు ఓ కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తోంది.
ఇద్దరు పిల్లలు మా కళ్ళ ముందే పుట్టారు. నా భుజాల వరకు ఎదిగారు. తల్లి టీచర్. అంచేతనే వాళ్లు కూడా చదువులో ఫస్టు.
ఆ రోజు స్కూలుకు హోలీ సెలవు. అందుకని కీర్తన్ భార్య, పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చాడు.
మా ఆవిడ బతికి వున్నప్పుడు లక్ష్మిని ఏదో పండక్కు పిలిచి చీరె పెట్టిందట. అది కట్టుకుని వచ్చింది. నెలల పిల్ల నా మనుమరాలు జీవికకి, ఎండాకాలం కదా, సైజులు వెతికి వెతికి మరీ చిన్న చిన్న కాటన్ ఫ్రాకులు పట్టుకు వచ్చింది.
అప్పుడు వయసులో పెద్ద అయిన మా ఆవిడ, లక్ష్మికి అమ్మ. ఇప్పుడు నెలల పిల్ల నా మనుమరాలిని ‘అమ్మ’ అంటూ ఆవిడే పిలుస్తోంది. అమ్మే మళ్ళీ ఈ రూపంలో పుట్టిందని తెగ సంతోషపడింది.
అనుబంధాలకు అర్ధాలు ఒక పట్టాన అర్ధం కావు.
వెళ్లాను. మంచు పెట్టెలో సుదీర్ఘ నిద్రలో వున్న కీర్తన్ ని చూసాను.
నిర్వేదం. ఎంతటివారికయినా, మంచుపెట్టెలో చివరి నిద్ర తప్పదేమో!
నన్ను చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్న లక్ష్మి గారిని ఎలా ఓదార్చాలో తెలియదు. పక్కకు పిలిచి ‘ఏమీ అనుకోవద్దు, మీ నాన్నఇచ్చాడు అనుకోండి’ అని తెచ్చిన డబ్బు ఆవిడ చేతిలో పెట్టి, పిల్లల్ని పలకరించి వచ్చేశాను.
ఉపశృతి:
సబ్ కో సమ్మతి దే భగవాన్
చాలా ఏళ్ళ కిందటి సంగతి.
డ్యూ.
ఇంకా అప్పటికి ప్రాధమిక విద్యాస్తాయిలోనే వుంది. కీర్తన్, లక్ష్మి దంపతుల తొలి చూలు పిల్ల. తల్లి టీచరు. తండ్రి కళాకారుడు.
వాళ్ళు విశ్వాసం రీత్యా క్రైస్తవులు. ముస్లిం మతస్తులు నడుపుతున్న ఒక ప్రముఖ పాఠశాలలో ప్రవేశ పరీక్ష రాసి ఫస్టున పాసయింది. తలితండ్రుల ప్రోత్సాహంతో హిందూ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న సంగీత పాఠశాలలో చేరింది. ఆ పాప కృష్ణాష్టకం, శివాష్టకం చదివే తీరుకు ముగ్డులయిన ఆ పాఠశాల వాళ్ళు ఆ ఏడాది శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు డ్యూను ఎంపిక చేశారు.
డ్యూ అంటే మంచు బిందువు. తుషారం.
ఆ అమ్మాయి ఇప్పుడు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది.
పొద్దున్న తాతయ్యా అని ఫోన్ చేసింది ఈ అమ్మాయే!







(ఇంకా వుంది)

23, జులై 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (348) : భండారు శ్రీనివాసరావు


పేరులో ఏముంది?
బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు.
'బుడ్గూ' అంటాడు గోపాళం
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ.
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం.
'బుడుగా ఏంటి బుడుగు అసయ్యంగా. మడుగూ బుడుగూ. నాకో పేరు లేదా ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లులాగా గయ్యి మంటూ, అసలు బుడుగు.
'ఏంది గురూ! ఈ పేర్ల గోల పొద్దున పొద్దున్నే’ అంటుంది సీగానపెసూనాంబ.
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏ పేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా, ఎంచక్కా పలుకుతాడు బాపూరమణల బుడుగు లోపల కాస్త ఉడుక్కున్నా.
బుడుగుకే కాదు, పుట్టిన ప్రతివారికీ ఈ పేర్ల తిప్పలు తప్పవు. పుట్టించిన భగవంతుడికి కూడా అనేకానేక పేర్లు. సహస్ర నామాలు, శత సహస్ర నామాలు.
చిన్నప్పుడు నేను పుట్టినప్పుదు నామ నక్షత్రం ప్రకారం పెట్టిన పేరు శ్రీనివాసరావు.
కానీ ఇంట్లో ముద్దు పేరు సీనప్ప.
అలాగే ఆ పేరుతోనే పెరిగాను. పెరిగి పెరిగి పెద్దయి, ఇక పెరగడం చేతకాక ఆంధ్రజ్యోతిలో చేరాను.
చేరిన తరవాత తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు జ్యోతి శ్రీనివాస్ అన్నారు. కావమ్మ గారి మొగుడిలా కామోసు అనుకున్నా. తర్వాత రేడియోలో చేరిన తర్వాత రేడియో శ్రీనివాస్.
ఆ పిమ్మట జీవన స్రవంతి శ్రీనివాస్.
అక్కడితో ఆగిందా.
మాస్కో శ్రీనివాస్.
పెద్ద పత్రికల తాలూకు పిల్ల పత్రికల్లో నా గురించిన ఏదైనా చిన్న వార్త వేయాల్సివస్తే, కంట్రిబ్యూటర్ల పుణ్యమా అని ఇంటి పేరులో వత్తు తీసివేసి బండారు అనీ, భండారి అనీ రకరకాల చిత్ర వధలు.
కొన్నేళ్ళ క్రితం ఒక మీడియా ఫంక్షన్ కు వెళ్లాను.
ఆక్కడ అందరూ నన్ను పలానా టీవీ శ్రీనివాసరావు అనడం మొదలు పెట్టారు. నిజానికి ఒక్కొక్కరు ఓ టీవీ పేరు చెబుతున్నారు. నాకూ ఆ టీవీలకి ఏమీ సంబంధం లేదు, రోజూ పొద్దున్నా సాయంత్రం ఏదో ఒక టీవీ చర్చకు వారాలబ్బాయి మాదిరిగా చర్చలకు వెళ్లి రావడం తప్ప. ఇప్పుడు అదీ లేదు, ఫేస్ బుక్ లో తోచినవి, తోచనివి గిలకడం.
ఇలాగే ప్రతివారికి జీవితం చివరాఖర్లో, చెప్పుకోవడానికి, పిలవడానికి ఎన్నో ఇంటి పేర్లు సిద్ధిస్తాయి.
నా వయసు రేపు ఆగస్టులో ఎనభయ్ నిండుతుంది. ఉద్యోగం చేసే వయసు కాదు, ఎవరన్నా తలచుకుని ఉద్యోగం ఇచ్చే వయసు అంతకంటే కాదు.
అసలు విషయం ఇది కాదు.
జనం నన్ను గుర్తు పడుతున్నారు. గుర్తుపట్టి పలకరిస్తున్నారు ఆప్యాయంగా.
నిరుడు అమెరికా వెళ్ళినప్పుడు మా అబ్బాయి సియాటిల్ లో ఓ ఇండియన్ రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకువెళ్లాడు. ఒకతను నావైపు దీక్షగా చూసి, ‘మీరు ఫేస్ బుక్ శ్రీనివాస రావు కదా’ అని పలకరించాడు. ‘నన్నెలా గుర్తుపట్టాడు’ అని ఆశ్చర్యపోతూ వుంటే, ఆయనే సందేహ నివృత్తి చేసారు.
' లోగడ టీవీ చర్చల్లో కనపడే వారు, ఇప్పుడు రావడం లేదు. నేను ఫేస్ బుక్ లో మీరు రాసినవి ప్రతీదీ చదువుతుంటాను. మీరు సియాటిల్ వచ్చారని ఫేస్ బుక్ ద్వారానే తెలిసింది. అంచేతే తేలిగ్గా గుర్తు పట్టాను’ అన్నారాయన కరచాలనం చేస్తూ.
అంటే నా సహస్ర గృహ నామావళిలో మరో ఇంటి పేరు ఫేస్ బుక్ శ్రీనివాసరావు చేరిందన్న మాట.
ముప్పయ్యేళ్ళ రేడియో సర్వీసు ఎటు పోయిందో ఏమో, ఫేస్ బుక్ రాతలే పెద్ద పీట వేసుక్కూర్చున్నా యల్లే వుంది. కనిపించివాళ్ళ పలకరింపులన్నీ ఆ పేరు మీదే. ఆ ఖాతాలోనే.
తోక టపా:
ఒకరిని అంటే పడే రోజులు కావివి. అంచేత నామీదే వేసుకుని చెబుతున్నాను.
కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా అబ్బాయి సందీప్ వచ్చాడు. చుట్ట పక్కాలకు, స్నేహితులకు కొన్ని కానుకలు పట్టుకొచ్చాడు. వాటి మీద వున్న ప్రైస్ టాగ్స్ తీసేస్తుంటే నేనన్నాను, ‘అలా వుంచి ఇస్తే తీసుకున్న వాళ్లకు వాటి విలువ తెలుస్తుంది కదా’ అని. వాడన్నాడు, ‘ఏదో గొప్ప కోసం తేలేదు, అభిమానం కొద్దీ తెచ్చాను. అక్కడ టైము లేక తీయలేదు’
నాకేమనాలో తోచలేదు. కానీ భేషజాలకు సంబంధించిన ఒక పాఠాన్ని ఆ రోజు మా వాడి నుంచి నేర్చుకున్నాను.
అదే రోజు సాయంత్రం గుడికి వెళ్ళాము. అక్కడ తిరిగే ఫ్యాన్ల మీదా, వెలిగే ట్యూబ్ లైట్ల మీదా వాటిని విరాళంగా ఇచ్చిన దాతల పేర్లు రాసి వున్నాయి. చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడంలో తాపత్రయమే నాకు వాటిలో కనిపించింది. ఆ రోజు నేర్చుకున్న పాఠం మహిమ కాబోలు.
టీవీలో సినిమా వస్తోంది. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!’ బందీఖానాలో కొరడా దెబ్బలు తింటూ కంచెర్ల గోపన్న (భక్త రామదాసు) పాడుతున్నాడు. తాను భద్రాద్రి రాముడికి చేయించిన నగలు వాటి ఖరీదు గురించి వివరిస్తున్నాడు.
ఏవిటో ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు అనిపిస్తోంది కదూ.
ప్రాజెక్టుల మీదా, పధకాల మీదా ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు నిజానికి ఆయా పాలక పార్టీలది కాదు, పన్నులు కడుతున్న ప్రజలది. కానీ ఆ క్రెడిట్ (పేరు) మాదంటే మాదని వాదులాడుకుంటున్న తీరు సరిగా లేదనిపిస్తుంది.
ప్రజలు చూసి చూసి విసుగెత్తి ఎప్పుడో అప్పుడు, రామదాసు గారు ఎద్దేవా చేసినట్టు, ‘ఎవడబ్బసొమ్మని కులుకుతూ తిరిగేరు’ అని ప్రభుత్వాలని నిలదీయకుండా జాగ్రత్త పడడం మంచిదేమో!
(ఇంకావుంది)

22, జులై 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (347) : భండారు శ్రీనివాసరావు

ఊణషాణ మాసికం
సరిగ్గా రెండేళ్ల క్రితం, జులై 21.
ఒక మనిషి చనిపోయిన తర్వాత ముందు రోజులు, తర్వాత నెలలు, ఆ పిదప సంవత్సరాలు (దిన, మాస, వార్షికాలు) ఇలాంటి లెక్కలు. బతికి వున్న రోజుల్లో భారంగా గడిచిన కాలం, పోయిన తర్వాత జవనాశ్వం మాదిరిగా పరుగెడుతుంది.
ప్రేత సంబంధ కర్మలు అయినా, యాగ సంబంధ క్రతువులు అయినా నమ్మకం ప్రధానం అనేది నా నమ్మకం. నా తల కొరివి పెట్టాల్సిన వాడికి నేనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి 2024 ఫిబ్రవరిలో నాకు ప్రాప్తించినప్పుడు నా మనసు నా మనసులో లేదు. ఏదో కలలో జరుగుతున్న విధంగా అన్నీ సశాస్త్రీయంగా జరిగిపోయాయి, నా అన్నగారు భండారు రామచంద్ర రావు గారు, పెద్ద కుమారుడు సందీప్ పర్యవేక్షణలో.
ఆనాడు శ్రాద్ధ కర్మలకు నేతృత్వం వహించింది వసిష్టుల వారు శ్రీ సి.హెచ్. యు.ఎస్. ప్రసాద శర్మ గారు. వాటిల్లో భాగంగా నా చేత అనేక దానాలు చేయించారు. కర్మలలో భాగంగా చేసే ప్రతి విధి విధానానికి సవివరమైన విశేషాలు వివరిస్తూ నా చేత కర్మకాండ పూర్తి చేయించారు. నమ్మడం నమ్మకపోవడం నమ్మే వారి నమ్మకాలను బట్టి వుంటుంది.
మరణించిన మనిషి తాలూకు జీవి సంవత్సరం పాటు వేలాది మైళ్ళు ప్రయాణిస్తుందని, ఆ ప్రయాణంలో జీవుడు అనేక రకాల ఈతి బాధలకు గురవుతాడని, ఎర్రటి ఎండల్లో, వానల్లో, దుర్గమ మార్గాల్లో ఆ ప్రయాణం సాగుతుందని, ఉపశమనంగా ఉండడానికి గొడుగు, పాదరక్షలు, వంట దినుసులు, కాయగూరలు, వంట పాత్రలు, నీళ్ళ పాత్ర, చెంబు వగైరాలు దానాలుగా ఇప్పించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో, 45 వ రోజున (త్రిపక్షం), 171 వ రోజున జీవుడు మరింత శ్రమకు గురవుతాడు. అంచేత ఈ రోజుల్లో కూడా తప్పనిసరిగా మాసికాలు పెట్టాలి.
జీవించి వున్న వారికి ఒక మాసం మరణించినవారికి ఒక రోజుతో సమానం కనుక నెలకోసారి మాసికం పెట్టి పిండ ప్రదానం చేస్తే, వారికి ప్రతిరోజూ భోజనం పెట్టినట్టు అవుతుందని ఓ నమ్మకం. ఇలా పన్నెండు నెలలు గడిచిన తర్వాత ఏడాది చివర్లో పెట్టే హూణ మాసికం, సాంవత్సరీకం, ఆబ్దీకంతో ఈ కర్మ కాండ పూర్తవుతుంది. జీవుడి పాప పుణ్యాల ప్రాతిపదికన పునర్జన్మ, లేదా స్వర్గ, నరక లోక ప్రాప్తి నిర్ధారణ అవుతుంది.
ఈ విషయాలు అన్నీ శర్మగారు సవిస్తరంగా నాకు అప్పుడే తెలిపారు.
కానీ అప్పుడు నా గుండె, మనసు, శరీరం అన్నీ ఘనీభవించి వున్నాయి.
ముందే చెప్పినట్టు అంతా నమ్మకం.
చనిపోయింది స్వయంగా నా రెండో కుమారుడు. నా ఇహ లోక ప్రయాణం సజావుగా సాగడానికి వాడు బతికి వున్నప్పుడు ఎన్నో ఎన్నో చేశాడు. పై లోక ప్రయాణంలో వాడికి ఇబ్బందులు రావు అని నమ్మకంగా చెబుతున్నప్పుడు, నమ్మకంగా పాటించక తప్పదు. అదే చేశాను.
అసలు ఈ చెప్పులూ, గొడుగులు మనిషి జీవితంలోకి ఎలా ప్రవేశించాయి? దానికీ పురాణాల్లో సమాధానం వుంది. సావధానంగా చిత్తగించండి.
"ఇదిగో బాణం విడిచిపెడుతున్నా! " శరాన్ని సంధించి జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి వైపు చూశాడు.
"ఊ"
"చాలా దూరం వెడుతుంది సుమా!"
"ఎంత దూరం వెళ్లినా తేగలను."
"అలాగేం? సరే! చూడు మరి."
జమదగ్ని బాణం విడిచాడు. రేణుకా దేవి పరుగెత్తింది.
ఒకరోజు వాళ్లిద్దరికి సరదాగా ఆటపాటలతో గడపాలని బుద్ధి పుట్టింది. అందుకే పొద్దున్నే బాణాలూ, విల్లూ తీసుకుని బయలుదేరారు. చాలా దూరం నడిచి ఒక ఆరు బయలు ప్రదేశం చేరుకున్నారు.
జమదగ్ని బాణాలు వేయడం, ఆమె పరుగెత్తి ఆ బాణం ఎక్కడ పడిందో కనుక్కుని తెచ్చి ఇవ్వడం .. ఇదీ ఆట.
ఆ ఆట ఇద్దరికీ నచ్చింది.. కాని జమదగ్నికి జాలేసింది తన భార్య కనుక్కోగలదో లేదో అని.
"ఇదిగో బాణం తెచ్చాను!" అని నవ్వుతూ అందించింది రేణుకా దేవి.
అలా జమదగ్ని బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఆమె కనుక్కుని తెస్తూనే ఉంది. కాని ఒకసారి అలా వెళ్లిన రేణుకా దేవి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. జమదగ్ని చాలా సేపు ఎదురు చూశాడు. చివరికి నీరసంగా , మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది.
"రేణుకా! ఏమైంది ఈసారి ఆలస్యం చేసావు?"
" అదిగో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్ళు బొబ్బలెక్కి ఆయాసంగా ఉంటే కాస్సేపు ఒక చెట్టు కింద కూర్చుని వస్తున్నాను."
అలిసిపోయి ముఖం మీది చెమటను చీర చెంగుతో తుడుచుకుంటున్న రేణుకా దేవిని చూసి జమదగ్ని బాధపడి " ఈ సూర్యుడు నిన్ను ఇంతగా బాధపెట్టాడా? అతని పని చెప్తానుండు " అంటూ కోపంతో సూర్యుడివైపు అస్త్రం సంధించాడు.
ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబ గబా వచ్చి ఆయన చేతిని పట్టుకున్నాడు.
"మహర్షీ! శాంతించు. సూర్యుడు లేకుండా ముల్లోకాలు నిలుస్తాయా? ఆలోచించు."
"నాకు అదంతా తెలీదు. సూర్యుడు నా భార్యను బాధపెట్టాడు. అతను శిక్ష అనుభవించి తీరాలి" అని గర్జించాడు.
మరుక్షణమే ఆ బ్రాహ్మణుడు "అయ్యా! నన్ను క్షమించు. నేనే సూర్యున్ని. దయ చూపుము" అని ప్రార్ధించాడు.
ఆ వెంటనే చెప్పులు, గొడుగూ సృష్టించి " ఇవిగో! ఈ పాదరక్షలు ధరించి, ఈ చత్రముతో శిరస్సుకు నీడ పడితే, నా వేడి సోకదు. ఇవి తల్లి రేణుకా దేవికి ఇవ్వండి" అని జమదగ్ని మహర్షికి సమర్పించుకున్నాడు.
అది చూసి జమదగ్ని శాంతించాడు. సూర్యుడు అంతర్ధానమయ్యాడు.
ఆ గొడుగును , చెప్పులనూ చూసి ప్రజలంతా కూడా సంతోషించారు. తాపసుల కోపం కూడా లోకకళ్యాణానికే దారితీస్తుందనే నానుడిని నిజం చేస్తూ రకరకాలుగా గొడుగులూ, చెప్పులనూ తయారు చేసి వినియోగించడం ప్రారంభించారు.
సూర్యుడి చేత సృష్టించబడినవి గనుక అవి పవిత్రమైనవి. వాటిని సజ్జనులకు, బీదసాదలకు, సాధువులకు దానం చేస్తే చాలా పుణ్యం. అవి చాలా పవిత్రమైనవి కాబట్టి పెళ్ళిళ్ళలో, పితృకార్యాలలో కూడ వినియోగిస్తారు.



(ఇంకావుంది)

21, జులై 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో : (346) : భండారు శ్రీనివాసరావు

 

ప్రశ్నోపనిషత్!
ఒకానొక కాలంలో మనిషి పుట్టుకే ప్రశ్నతో మొదలయ్యేది. ‘ప్రసవం బాగా జరిగింది’ అని మంత్రసానో, ఆసుపత్రి నరసమ్మో చెప్పగానే మొదట వినవచ్చే ప్రశ్న: ‘మగపిల్లవాడా? ఆడపిల్లా?’
‘వెనుకటి రోజుల్లో ఏది రాయాల్సివచ్చినా, మనసుకు తోచింది రాసుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడాపరిస్తితి లేదు’ అన్నారు ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడు ఒకరు నాతో. ‘డోలు వచ్చి మద్దెలతో చెప్పుకున్నట్టు వుంది’ అనబోయి, నాలుక మడతేసి, ‘రాయడానికే కాదు, మాటలాడడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన రోజులివి’ అని ముక్తాయించాను.
అన్నానే కానీ, మళ్ళీ ఆలోచిస్తే, ‘ప్రశ్నోపనిషత్’ అని మొదలు పెట్టడం కూడా మంచిది కాదేమో అనిపించింది. ఎందుకంటే, ‘ప్రశ్నించడం మా జన్మ హక్కు అని కొందరు, అలాంటి హక్కు మీకీ జన్మలో లేదు, రాదు’ అని మరి కొందరూ తీవ్రాతితీవ్రంగా వాదులాడుకుంటున్న వర్తమానంలో జీవిస్తున్నాం కనుక. కానీ పుడకలతో వచ్చిన అలవాటు ఇది. ఒక పట్టాన పోతుందా!
నేను బెజవాడలో బీ కాం చదివేటప్పుడు పడమట గోరాగారి నాస్తికాశ్రమంలో జరిగే సమావేశాలకు వెడుతుండేవాడిని. ప్రశ్నించడాన్ని ప్రోత్సహించేవారు.
ఆయన దేవుడిని నమ్మరు. మహాత్మా గాంధీ అనుయాయులు అయినా, నాస్తిక ఉద్యమ ప్రచారానికే ప్రధమ ప్రాధాన్యత ఇచ్చే వారు.
ఆ రోజుల్లో అమెరికా వెళ్ళడం అనేది కలలో మాట. అదేమిటో విదేశాల్లోని నాస్తిక ఉద్యమ సంస్థలు, గోరాగారి సంతానానికే ఆహ్వానం పంపేవి. వారిలో ఇద్దరు, ముగ్గురు అలా అమెరికా వెళ్లివచ్చారు కూడా.
నేను ఒకరోజు నాస్తికాశ్రమానికి వెళ్ళిన రోజు అమెరికా వెళ్ళే గోరాగారి పుత్రుడు ఒకరికి వీడ్కోలు సమావేశం జరుగుతోంది. ప్రశ్న అడగడం మీ హక్కు అనేవారు కనుక గోరాగారు ఏమీ అనుకోరులే అని, ‘ఒక్క మీ కుటుంబానికే ఈ ఆహ్వానాలు వస్తాయి, ఇతరులకు రావెందుకు? అనే ప్రశ్నతో నేను సిద్ధంగా వున్నాను. అది అడగబోయేలోపు పట్టణ వైశ్య ప్రముఖుడు ఒకరు లేచి నిలబడ్డారు. ఆయన పెద్దవారు కనుక నేను వెనక్కి తగ్గాను. నిజానికి నేను అడగాలి అనుకున్నదే ఆయన అడిగారు. నేను క్లుప్తంగా వేయబోయిన ప్రశ్నను ఆయన కొంత హాస్యం పాలు కలిపి అడిగారు. ఆయన మాటల్లో:
“సువిశాల ప్రపంచం. అనేకానేక దేశాలు. వాటిల్లో ఒకటి భారతదేశం. భారత దేశంలో అనేక రాష్ట్రాలు. వాటిల్లో ఒకటి ఆంధ్ర ప్రదేశ్. అందులో అనేక జిల్లాలు. వాటిల్లో ఒకటి కృష్ణాజిల్లా. అందులో అనేక పట్టణాలు. వాటిల్లో ఒకటి బెజవాడ. బెజవాడలో అనేక వాడలు. వాటిల్లో ఒకటి పడమట. పడమటలో అనేక ప్రదేశాలు. వాటిల్లో ఒకటి మీ నాస్తికాశ్రమం. అందులో మళ్ళీ అందరూ కాదు. కేవలం మీ పిల్లలకే ఎందుకు అమెరికా నుంచి ఆహ్వానాలు వస్తాయి? ఇతరులకు ఎందుకు రావు? “
ఇదీ ఆయన అడిగిన ప్రశ్న.
దీనికి గోరాగారి స్పందన ఏమో కానీ, సభికుల నుంచి మాత్రం ముసిముసి నవ్వులు వినవచ్చాయి.
అప్పుడు అనిపించింది, ప్రశ్న అడగడం తేలికే, జవాబు చెప్పడమే ఇబ్బంది.
తోకటపా:
‘అమ్మా! పెరుగు ఎలా వస్తుంది’
‘ఏవిటే అర్ధంలేని ప్రశ్నలు. పాలు కాచి పెరుగు తోడు పెడితే పెరుగు వస్తుంది’
‘మరి తోడు పెట్టడానికి పెరుగు ఎక్కడినుంచి వస్తుంది?’
‘ఏవండీ నన్ను పనిచేసుకోనీకుండా చంటిది ప్రశ్నలతో చంపేస్తోంది. కాస్త దీన్ని దగ్గరకు తీసుకోండి’
చలపతి ఆలోచనలో పడ్డాడు. తన చిన్నతనంలో తనకు ఇన్ని అనుమానాలు వచ్చేవా?
వచ్చేవి. కానీ వాటిని విసుక్కోకుండా తీర్చేందుకు బామ్మా తాతయ్యా వుండేవారు.
తాతయ్య వేలు పట్టుకుని తాను బడికి వెళ్ళేవాడు. ఇప్పుడో! తన పిల్లల్ని ‘ఆటో అంకుల్’ స్కూలుకు ‘తోలుకు’ పోతున్నాడు.
బామ్మ పొద్దుగుంకుతుండగానే గోరుముద్దలు తినిపించి, వొళ్ళో పండుకోబెట్టుకుని చిచ్చెకొడుతూ ‘అనగనగా ఒక రాజు కధలు’ చెప్పేది. ఇప్పుడో! పిల్లలు తమ గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని ‘గేములు’ ఆడుకుంటున్నారు.
చిన్నప్పుడు తనకు చిన్నగా వొళ్ళు వెచ్చబడ్డా బామ్మా తాతయ్యా పెద్దగా గిలగిలలాడిపోయేవాళ్ళు. ఆడుకుంటూ కిందపడి మోకాలు చెక్కుకుపోతే అప్పుడు బామ్మ పడే ఆదుర్దా చూసితీరాలి. ఇప్పుడు అంతటి ప్రేమ పిల్లలపై తమకూ వున్నా, చూపించే తీరిక లేని జీవితాలు తమ ఇద్దరివీ. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులే. సాయంత్రం ఇంటికి చేరేసరికి వున్న కాస్త వోపిక వొండుకు తినడానికే సరిపోతుంది.
తాను తన పిల్లలకు అన్నీ అమర్చాడు. మంచి స్కూల్లో చేర్పించాడు. విడిగా వారిద్దరికీ పడక గది ఏర్పాటు చేసాడు. కొంచెం ఖర్చయినా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాడు. వారం విడిచి వారం మల్టీప్లెక్స్ సినిమాలు చూపిస్తాడు. ఖరీదయిన రెస్టారెంటు తీసుకువెడతాడు. ఇక అరుణ మాట చెప్పనక్కరలేదు. ఇంట్లో వున్న కాసేపు ఆమెకు పిల్లల తోడిదే లోకం.
అయినా ఎక్కడో ఏదో లోపం జరుగుతుందోన్న అనుమానం. తాము ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేవరకు వాళ్ళిద్దరూ పక్కింటి ఆంటీ ఇంట్లో వుంటారు. తాము కనబడగానే వాళ్ళ కళ్ళల్లో కనబడే వెలుగు చూసినప్పుడు, జరుగుతున్న ‘లోపం’ గురించిన ఆ అనుమానం పెనుభూతంగా మారి భయపెడుతుంది. కానీ, అవసరం అనుమానాలను అణచిపెడుతుంది.
అమ్మానాన్నా ఎక్కడో వుంటారు. నెలకు ఇంత అని క్రమం తప్పకుండా డబ్బు పంపుతూనే ఉంటాడు. తెచ్చి తమ దగ్గరే అట్టిపెట్టుకునే ఆలోచన వచ్చినా, ఇంకేదో ఆలోచన పట్టి ఆపుతుంది.
కానీ పిల్లలు ఏదో కోల్పోతున్నారు. బామ్మా తాతల ఆప్యాయత. అది తాము పూడ్చలేనిది.
వాళ్లకు మేధో వికాసం కలిగించే కంప్యూటర్లు ఇస్తే సరిపోతుందా? మానసిక స్వాంతన కలిగించే బామ్మా తాతల ప్రేమను అందివ్వాలా?
ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?
(ఇంకా వుంది)

20, జులై 2026, సోమవారం

అనగనగా ఒక ఇరాన్ – భండారు శ్రీనివాసరావు

 


ఇలాంటి వాళ్ళు ఉంటారా? 

 

ఇది నా రచనా కాదు, ఈ కాలం నాటిదీ కాదు. ఎప్పుడో ఓ పదమూడేళ్ల నాడు, ఈనాడు పత్రికలో  ఇది నా కంట పడింది. చదివిన తర్వాత నా మనసులో మెదిలిన ప్రశ్న ‘ఇలాంటి వాళ్ళు ఉంటారా?’ 


“ఆ దేశానికా? అక్కడేముందిరా!” అన్నాను ఠక్కున.

“ప్రపంచంలోకెల్లా చెప్పుకోదగ్గ  మంచి మనుషుల్ని, మంచి మనసుల్ని చూపిస్తాను రండి నాన్నా!” అన్నాడు మా అబ్బాయి శ్రీహర్ష.”


సురేంద్రనాథ్ మాజేటి, అనే పెద్ద మనిషి  తన  విదేశీ  పర్యటన అనుభవాలను, ఇలాటి చదివించే ఎత్తుగడతో  ప్రారంభించి  నాలుగే నాలుగు  పేజీల్లో వాళ్ల అబ్బాయి చెప్పిన మంచి మనుషుల దేశాన్నీ, మంచి మనసుల దేశాన్నీ మనకు ఎంచక్కా పరిచయం చేశారు.


మరో విషయం. వాళ్ల అబ్బాయి ఆదేశంలో  ఏదో ఉద్యోగమో, వ్యాపారమో చేస్తూ తల్లిదండ్రులను అక్కడికి ఆహ్వానించలేదు. అతగాడికో చక్కటి కోరిక వుంది. దేశాలు చుట్టిరావడం. ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు లండన్ లో వున్నాడు. ఏడాది తరువాత దానికి రాజీనామా చేసాడు. సామాన్లు ఇండియా పంపేసాడు. 


ఒక సైకిల్ కొనుక్కున్నాడు. తోడుకోసం చూసుకోకుండా, తోడెవరూ లేకుండా సైకిల్ మీద వొంటరిగా బయలుదేరి వరసగా దేశాలు చుట్ట బెట్టాడు. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీసు, టర్కీ, జార్జియా, ఆర్మీనియా, అల్లా తిరుగుతూ తిరుగుతూ ఇదిగో ఈ ‘మంచి మనుషుల దేశం – ఇరాన్’  చేరుకున్నాడు.

ఇండియా తిరిగివచ్చేముందు వెళ్ళాల్సిన దేశాల జాబితా కూడా తక్కువేమీ  కాదు.

తుర్కుమేనియా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇందులో వున్నాయి.  ఈ పర్యటనలో శ్రీహర్ష  ఎక్కడా యే దేశంలో కూడా  హోటల్లో బస చేయలేదు. అంతర్జాలంలో పరిచయం అయి, స్నేహితులుగా మారినవారి  ఆతిధ్యం స్వీకరిస్తూ ఆయా దేశాలు చుట్టబెడుతూ, స్తానిక ఆచారవ్యవహారాలు అధ్యయనం చేస్తూ, అక్కడివారితో మమేకం అయిపోతూ మధ్యలో తనకు  ఎదురయిన అద్భుత అనుభవాలను, వ్యక్తులను  తలిదండ్రులకు కూడా పరిచయం చేయాలని  ఫోను చేసి వారిని కూడా రమ్మన్నాడు.

    

తమ పిల్లవాడు దేశం కాని దేశంలో ఇల్లు కొనుక్కునో, కట్టుకునో గృహప్రవేశానికి రమ్మనలేదు. అతడే ఒక అంతర్జాల మిత్రుడి ఇంట్లో మకాం పెట్టి వారితో కలిసి వుంటున్నాడు. అలాటి పరిస్తితిలో ఏ తలిదండ్రులు కూడా అలాటి ప్రయాణం పెట్టుకోవడానికి అంత సుముఖంగా వుండరు.

కానీ సురేంద్రనాథ్ దంపతుల తీరే వేరు. తండ్రి సురేంద్రనాథ్ ది కూడా విభిన్నమైన వ్యక్తిత్వం.   అందుకే ఠక్కున ఒప్పేసుకున్నారు.


అందుకే పెద్ద మనసుతో  వారి అబ్బాయి ఆహ్వానాన్ని మన్నించి భార్యాబిడ్డల్ని తీసుకుని ప్రయాణమై ఆ దేశానికి వెళ్ళి వచ్చారు. వెళ్ళి రావడంతో సరిపెట్టుకోకుండా నాలుగంటే నాలుగు పేజీల్లో తమ అనుభవాలను రంగరించి తమ సన్నిహితులతో పంచుకున్నారు.


ఈ రచన పీడీఎఫ్ లో వుండడం వల్ల ఇలా క్లుప్తంగా పరిచయం చేసి చేతులు దులుపుకోవాల్సి వస్తోంది. పూర్తి పాఠం కావాల్సిన వారు సురేంద్రనాథ్ గారి మిత్రుడు దేవినేని మధుసూదనరావు గారిని సంప్రదిస్తే బాగుంటుంది. వారి చిరునామా -<mdevineni@gmail.com>


గమనిక: ఇది దశాబ్దానికి పూర్వం సమాచారం  

(కింది ఫోటో ఈనాడు సౌజన్యంతో )




అయాం ఎ బిగ్ జీరో : (345) : భండారు శ్రీనివాసరావు

 


 

లెట్ మి డై,  ది వే ఐ వాంట్ టు డై

 

రెండు సంఘటనలు చెప్పుకుందాం.

2018 వ సంవత్సరం ఏప్రిల్ నెల. సమయం  మధ్యాన్నం పదకొండు పన్నెండు మధ్య.

హైదరాబాదు రాజ్ భవన్ రోడ్డులో యశోదా హాస్పిటల్ లోని ఒక పేషెంటు గదిలో చిన్న సమావేశం జరుగుతోంది. నిజంగా విచిత్రమే, పేషెంటు గదిలో సమావేశం జరగడం అనేది. చాలా మంది డాక్టర్లు అక్కడ వున్నారు. రోగి పరిస్థితి గురించి చర్చించడానికి కాదు, రోగి చెప్పేది వినడానికి.

వినడానికి విచిత్రంగా వున్నా ఇది అక్షర సత్యం.

ఆ రోగి పేరు డాక్టర్ ఏపీ రంగారావు. కేన్సర్ తో పోరాడుతూ మరణ శయ్య మీద ఆక్సిజన్ మాస్కుతో, బలహీన స్వరంతో ఆయన చెబుతున్న మాటలను వారందరూ బాధతో,  మౌనంగా విన్నారు. ఇంతకీ, ఆయన వాళ్ళతో మాట్లాడింది తాను కోలుకునే అవకాశాలు ఏమేరకు వున్నాయని కాదు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువ డాక్టర్లకు, వైద్య సిబ్బందికి స్కిల్ డెవలప్ మెంటులో ఎలా శిక్షణ ఇవ్వాలి, దానికి ఏమి చేయాలి అనే అంశం గురించి.   

రాం దేవ్ హాస్పిటల్ కు చెందిన  డాక్టర్ విక్రం రావు, డాక్టర్ జయరాం పింగళి, డాక్టర్ దయాకర్ (ఇప్పుడు లేరు, చనిపోయారు), డాక్టర్ నాగభూషణం, డాక్టర్ చారి, అమరా  వెంకటేశ్వర రావు, డాక్టర్  వేణుగోపాల్  మొదలైన వారు ఆనాటి సమావేశంలో వున్నారు.

చికిత్స పేరుతో డబ్బులు పిండుతూ చేసే వైద్యాలకు డాక్టర్ రంగారావు పరమ విరోధి. అతితక్కువ ఖర్చుతో చేసే వైద్యమే పేదవారు ఎక్కువగా వుండే మన వంటి దేశాలకు ఉపయుక్తమని ఆయన ఎప్పుడూ చెబుతుండే వారు. స్వల్ప ఖర్చుతో సత్వర వైద్యం అనేది ఆయన నినాదం. చిన్న చిన్న అస్వస్థతలను శరీరమే తట్టుకుంటుందని, వీటి కోసం పెద్ద పెద్ద వైద్యాలు, పరీక్షలు అనవసరమన్నది డాక్టర్ రంగారావు నిశ్చితాభిప్రాయం. ఇలా  వచ్చిన వారికి ఆయన ఓ క్రోసిన్ గోలీ వేసుకోండని చెబుతూ వుండేవారు. ఆయన అన్నట్టే వారికి స్వాంతన చేకూరేది. దానితో ఆయనకు డాక్టర్ క్రోసిన్ అనే పేరు వచ్చింది.

ఎన్నో ఏళ్ళక్రితం వైద్య విద్యార్ధిగా తొలిపాఠం నేర్చుకున్నప్పుడు, యువ డాక్టర్లకు నేర్పే ఓ నీతిపాఠాన్ని ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.

రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

 

డాక్టర్ ఏపీ రంగారావు, మా పెద్దక్కయ్య పెద్ద కొడుకు. హైదరాబాదు గాంధీ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి, లండన్ లో పై చదువులు పూర్తి చేసుకుని

స్వదేశానికి తిరిగి వచ్చాడు. విదేశాల్లో పై చదువులు పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళు, హైదరాబాదు వంటి  పెద్ద నగరాల్లో  పోస్టింగ్ కోసం పోటీ పడుతుంటే, ఆయన మాత్రం ఏరి కోరి భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో  డాక్టరుగా పనిచేయడానికి వెళ్ళాడు. ఇదీ ఆయన నేపధ్యం.

 

నిజానికి డాక్టర్ రంగారావు ఒక మామూలు డాక్టరు. ‘నేనొక షరా మామూలు డాక్టరుని మాత్రమే ’  ఆయన అనుకున్నట్టయితే, ఆయన కధే వేరుగా వుండేది. ఎక్కడో సంపన్నుల కాలనీలో ఓ పెద్ద భవంతి కట్టుకుని ‘నాకిది చాలు’ అనుకుంటూనో, ’ఇంకా కావాలి’ అని తాపత్రయ పడుతూనో జీవితాన్ని దొర్లించి ఉండేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు. సాధారణ మనుషులు కూడా నిబద్ధతతో వ్యవహరిస్తే గొప్ప పనులు చేయడం అసాధ్యం కాదని నిరూపించాడు.

పది జీవితాల్లో చేయాల్సిన మహత్తరమైన పనులన్నింటినీ ఆయన ఒక్క జీవితంలోనే చక్కబెట్టగలిగారు.

అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కల మనిషి కనుకనే, ఇతరులకు అసాధ్యం అనుకున్న 108, 104 వంటి అనేక అపూర్వ  పధకాలను ఆయన నిజం చేసి చూపించగలిగారు.

సకల జనులు మెచ్చుకున్న ఆ గొప్ప పనుల వెనుక తానున్నానని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ వెంపర్లాడలేదు.

ఇక రెండో సంఘటన అదే రోజున కొద్ది గంటల తేడాతో అదే హాస్పిటల్ లో జరిగింది.

సమావేశం పూర్తయిన అదే రోజు సాయంత్రం ఆయనకు చికిత్స చేస్తున్న పెద్ద డాక్టరు ఆయనతో చెబుతున్నారు.

మీకు మంచి వైద్యం అందుతోంది, త్వరలో కోలుకుంటారు’

ఆయన  ఆశించిన రీతిలో కాకుండా డాక్టర్  రంగారావు నుంచి నివ్వెరపోయే సమాధానం వచ్చింది.

‘నో డాక్టర్. లెట్ మి డై,  ది వే ఐ వాంట్ టు డై. ప్లీజ్  డిశ్చార్జ్ మి’’

 

పేషెంటు అభ్యర్ధన మేరకు డిశ్చార్జ్ చేసారు. ఇంటికి చేరాడు. పన్నెండు గంటలు కూడా కాలేదు. ఆ రాత్రి గడవలేదు. తెల్లవారుజామున కన్ను మూశాడు.

అయితే ఆయన కన్న కల, ఆయన కనురెప్పల కిందే కరిగిపోలేదు.

రాం దేవ్ హాస్పిటల్ వాళ్ళు దాన్ని సాకారం చేశారు. లక్షలు ఖర్చుచేసి తమ హాస్పిటల్ లో స్కిల్ డెవలప్ మెంటు కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానికి డాక్టర్ రంగారావు పేరు పెట్టారు. విమానాలు నడిపేవారికి సిమ్యులేటర్ లో శిక్షణ ఇచ్చే తరహాలో, వైద్య సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చే అధునాతన  ఏర్పాట్లు ఈ విభాగంలో వున్నాయి.  

మొన్న శనివారం జులై 18 వ తేదీన దాన్ని నిరాడంబరంగా ప్రారంభించారు.  ఆయన స్మృతికి గొప్ప నివాళి.




(ఇంకా వుంది)