26, ఫిబ్రవరి 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (272) : భండారు శ్రీనివాసరావు

 

పలుకుబడి దుర్వినియోగంలో నేనే నెంబర్ వన్
రేడియో విలేకరిగా ఆ స్థానాన్ని నా అంతగా దుర్వినియోగం చేసిన వాళ్ళు మరొకరు వుండరు అనేది నా నమ్మకం. ఎవరు ఏది అడిగినా సరే, అదేదో నా చేతిలో పని అయినట్టు, ఆ పనిచేయాల్సిన వాళ్లకు చెప్పి చేయించేవాడిని. అయితే నా ఈ తత్వం నాకు రేడియోలో మంచి పేరు తీసుకురావడమే ఆశ్చర్యం.
ఆకాశవాణి, దూరదర్సన్ లకు కలిపి ఏర్పాటు చేసిన ప్రసార భారతి సీ ఈ ఓ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఓ. పీ. కేజరి వాల్ ఒకసారి అధికారిక సమావేశాల్లో పాల్గొనడం కోసం హైదరాబాదు వచ్చారు.
ఆయన రెండు రోజులు వుండే నిమిత్తం వస్తే, జరూరుగా ఢిల్లీ రావాలని పైనుంచి కబురు వచ్చింది. ఆయన రిజర్వ్ చేసుకున్న విమానం టిక్కెట్టు మర్నాటికి. కానీ సాయంత్రమే బయలుదేరి వెళ్ళాలి.
మా స్టేషన్ డైరెక్టర్ నన్ను పిలిపించారు. ‘నో ప్రాబ్లం’ అని బేగం పేట ఎయిర్ పోర్టుకి తీసుకు వెళ్ళాను. ఆ రోజుల్లో నా గుర్తింపు కార్డు ఎక్కడికి వెళ్ళాలన్నా బాగా పనికి వచ్చేది.
అప్పటికే బోర్డింగు పాసులు ఇచ్చేశారు. ఎయిర్ పోర్ట్ అధికారికి విషయం చెప్పి ‘ఏమైనా సాయం చేయగలరా’ అని అడిగాను. ‘మీరు వెళ్లి ఎవరిదైనా బోర్డింగు పాసు తీసుకువస్తే ప్రయత్నం చేస్తాను’ అన్నాడు. వెంటనే వెళ్లి వీ.ఐ.పీ. లాంజులో వెయిట్ చేస్తున్న వారెవ్వరని పరికించి చూసాను. బాగా పరిచయం, చనువు వున్న ఓ ఎంపీ దగ్గరికి వెళ్లి, ‘ఈ రోజే ఢిల్లీ వెళ్ళాలా, రేపు వెళ్ళినా పరవాలేదా’ అని అడిగాను. ఆయన నవ్వి ‘ఈ రాత్రి అక్కడికి పోయి చేసేదేమీ లేద’న్నాడు.
వెంటనే ఆయన బోర్డింగు పాసు తీసుకుని మా సీయీవోకు ఇచ్చాను. ‘పదండి పోదాం’ అంటూ టార్మాక్ మీద ఆగివున్న విమానం ఎక్కించాను. నేను కూడా విమానం మెట్లెక్కుతుంటే ఆయన ఆశ్చర్యంగా అడిగాడు, ‘మీరు కూడా ఢిల్లీ వస్తున్నారా!’ అని. నేను నవ్వేసి బై బై చెప్పేసి బయటకు వచ్చాను. సీఈవో విమానం ఎక్కారన్న విషయం తెలుసుకుని బయట వెయిట్ చేస్తున్న మా అధికారులు చాల సంతోష పడ్డారు.
తర్వాత నా పేర స్టేషన్ డైరెక్టర్ కు ఒక ఉత్తరం వచ్చింది.
‘హైదారాబాదు ఎయిర్ పోర్టులో మీరు చేసిన మిరకిల్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇలా కూడా జరుగుతుందా అనే ఆలోచన నుంచి ఇప్పటికీ బయటపడ లేకుండా వున్నాను’
అని రాసారు అందులో నన్ను ఉద్దేశించి.
ఆ రోజులు కాబట్టి ఇవన్నీ చెల్లాయి. ఈ కంప్యూటర్ కాలంలో ఇలా సాయాలు చేయడం అధికారులకు కూడా సాధ్యం కాని పని.
కొంత కాలం క్రితం కాబోలు, జర్నలిస్టులు ఫోను కనెక్షన్లు గురించి హిందూ సాయి శేఖర్ A. Saye Sekhar (హిందూ పేపర్ ఆయన వదిలేసినా నేను అలానే పిలుస్తాను) అద్భుతమైన, ఆసక్తికరమైన సొంత అనుభవం ఒకటి పోస్ట్ చేశారు. దుర్వినియోగం అంటారో, వినియోగం అంటారో తెలియదు కానీ ప్రతి పాత్రికేయుడూ ఎప్పుడో ఒకసారి కొన్ని పనులు ఇలాంటివి (రైలు టిక్కెట్లు, విమానం టిక్కెట్లు చివరి క్షణంలో కన్ఫర్మ్ చేయించడం వగయిరా) వృత్తిరీత్యా చేయక తప్పదు. బహుశా ఈ విషయంలో నాది ఒక రికార్డు అని చెప్పుకోవడానికి వీలైన అనుభవాలు బోలెడు బొచ్చెడు వున్నాయి.
ముందు టెలిఫోన్ సంగతి. రేడియోలో చేరినప్పుడు మా ఇంట్లో ఫోను వుండేది కాదు. వార్త ఇవ్వాలంటే మేముంటున్న చిక్కడపల్లి త్యాగరాయ గానసభ దగ్గర నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న టెలిఫోన్ (తంతి, తపాలా కార్యాలయం అనాలేమో) ఆఫీసుకో, లేదా అశోక్ నగర్ లో ఉన్న జ్వాలా ఇంటికో వెళ్ళాలి. (ఆయనకీ ఈ సౌకర్యం లేదు కాని వాళ్ళ బావగారి (మా మేనల్లుడు డాక్టర్ రంగారావు) ఫోను అక్కడ వుండేది.
కొన్నాళ్ళు అలా గడిచిన తరువాత ఫోను కావాలనే విషయం అప్పటి జనరల్ మేనేజర్ బాల సుబ్రహ్మణ్యం గారి (అప్పట్లో హోల్ మొత్తం ఇరవై మూడు జిల్లాలకు ఆయనే సర్వాధికారి) దృష్టికి తీసుకు వెడితే, ఆయన మారుమాట్లాడకుండా ఒకే ఒక్క రోజులో మా ఇంట్లో ఫోను పెట్టించారు. ఏరియా సబ్ డివిజినల్ మేనేజర్ స్వయంగా వచ్చి ఫస్ట్ కాల్ కనెక్ట్ చేసి మాట్లాడారు.
ముందు నేను కోరుకున్న నెంబర్ 65758 ఇచ్చారు. మొదటి బిల్లు కూడా కట్టక మునుపే ఆ నెంబరు మీద మొహం మొత్తింది. 66066 కావాలంటే మళ్ళీ దానికి మార్చారు. టెలిఫోన్ డైరెక్టరీలో బోల్డ్ అక్షరాల్లో నా పేరు వేసేవారు. బెజవాడ రేడియో స్టేషన్ కు కాల్ బుక్ చేస్తే లైట్నింగ్ కాల్ మాదిరిగా వెంటనే కలిపేవారు. అప్పటికీ ఎస్. టి. డి. విధానం రాలేదు.
తర్వాత రేడియో మాస్కో ఉద్యోగం కోసం హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాము.
అయిదేళ్ళ తర్వాత తిరిగొచ్చాము. పంజాగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్ లో మా అన్నయ్య ఇంట్లో ఉంటూ, అద్దె ఇంటికోసం వెతుకులాట మొదలు పెట్టాము.
ఎందుకో ఓ రోజు బేగంపేట ఎయిర్ పోర్టుకి వెడితే అక్కడ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ రంగయ్య నాయుడు కలిసారు. ‘ఎన్నాళ్ళయింది మాస్కో నుంచి వచ్చి’ అని అడిగారు. ఇంటి కోసం చూస్తున్నాను అని చెప్పాను.
మర్నాడు మధ్యాన్నం రేడియోకి వెళ్ళే సరికి ఇద్దరు ముగ్గురు టెలిఫోన్ డిపార్ట్ మెంటు వాళ్ళు కనిపించారు.
‘మీకు ఫోన్ శాంక్షన్ చేస్తూ రాత్రి ఢిల్లీ నుంచి టెలెక్స్ మెసేజ్ వచ్చింది. ఈ ఫారం పూర్తి చేసి, అడ్రసు వివరాలు ఇవ్వండి’ అన్నారు. ‘ఇల్లే ఇంకా దొరకలేదు ఫోను ఎక్కడ పెట్టుకోను’ అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. సరే ఇల్లు దొరికిన తర్వాత చెప్పండని వెళ్ళిపోయారు.
పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఇల్లు తీసుకుని పాలు పొంగించక ముందే ఫోను, లాంగ్ కార్డుతో సహా ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు మళ్ళీ నెంబరు సమస్య. నేను అడిగిన 22011 ఇచ్చారు. ఇస్తూనే చెప్పారు. ఇలా వరస నెంబర్లతో కొంత ఇబ్బంది పడతారు జాగ్రత్త అని. అయినా నేను వినలేదు.
మర్నాటి నుంచి రాంగ్ కాల్స్. పలానా వారు వున్నారా అంటే పరవాలేదు. “హిందూ స్మశానమా! రాత్రి మా బంధువు చనిపోయారు, దహనం చెయ్యాలి’ అని ఒకరు, “పోలీసు కంట్రోల్ రూమా” అని మరొకరు, “గ్యాస్ బుకింగా” అని ఇంకొకరు ... ఇలా కాల్స్ వచ్చేవి.
అయినా సాయి శేఖర్ చెప్పినట్టు, ఆ రోజుల్లో ఫోను ఒక అపురూపమైన వస్తువు. ఇంట్లో ఫోను మోగుతుంటే అదో దర్జా! అదో వైభోగం!



(ఇంకా వుంది)

24, ఫిబ్రవరి 2026, మంగళవారం

యుద్ధాలు మిగిల్చేది ఏమిటి? - భండారు శ్రీనివాసరావు

‘తాతల తండ్రుల చంపుకొనుటకా ఈ భండనంబు కృష్ణా!’
కురుక్షేత్ర రణక్షేత్రంలో మహా భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తెల్లగుర్రముల రధమును తోలే నల్లనయ్యను అప్పటికి అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు అడుగుతాడీ ప్రశ్న.
తదుపరి కృష్ణుడు గీతార్ధసారం ఎరిగించిన తరువాత ఎరుకనబడిన సవ్యసాచి అన్నదమ్ములతో కలసి సాగించిన ఆ మహా సంగ్రామం అనంతరం కూడా నివృత్తి కాని సందేహం ఇదే.
ఎందుకంటె పద్దెనిమిది రోజులపాటు జరిగిన ఈ మహాయుద్ధంలో విజయం సాధించిన యుధిష్టురుడికి మిగిలిందేమిటి? గుట్టలకొద్ది సైనికుల శవాలు. ఆనవాలు పట్టలేని ఆత్మీయుల కళేబరాలు.
కౌరవ పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్న అనేక అక్షౌహిణుల సైన్యం నిహతమయింది.
శవాల గుట్టల నడుమ, గెలిచినవారి పక్షాన బతికిబట్టగలిగింది ధర్మజ,భీమ,అర్జున,నకుల,సహదేవులు, కృష్ణుడితో కలిపి మరో ఇద్దరు మాత్రమే. ఈ ఇద్దరిలో సాత్యకిని మినహాయిస్తే యుయుత్సుడి విషయం మళ్ళీ అనుమానమే అంటారు చరిత్రకారులు.
అంటే విజయలక్ష్మి వరించిన ధర్మజుని పక్షంలో మిగిలింది కేవలం ఏడుగురు మాత్రమే. అటు ఓడిన కౌరవ పక్షంలో ప్రాణాలతో బయటపడింది నలుగురే నలుగురు. అశ్వథామ, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడి కుమారుడయిన విశ్వకేతు.
ఎవరి కారణంగా ఈ మహారణం చెలరేగిందో ఆ కురుసార్వభౌముడు, దుర్యోధనుడితో పాటు దుశ్శాసనాది అతడి సోదరులందరూ ఈ మహా యుద్ధంలో అసువులు బాశారు.
పదిహేను లక్షల యాభయ్ మూడు వేల తొమ్మిది వందల సైనికులతో కూడిన ఏడు అక్షౌహిణుల పాండవదండుకు సైన్యాధ్యక్షుడు పాంచాల రాజు ద్రుష్టద్యుమ్నుడు కాగా, ఇరవై నాలుగు లక్షల అయిదు వేల ఏడు వందల సైన్యం కలిగిన పదకొండు అక్షౌహిణుల కౌరవసేనకు తొలుదొల్త నాయకత్వం వహించింది భీష్మ పితామహుడు.
యుద్ధ పరిసమాప్తి నాటికి ఇరువైపులా మొత్తం సైనికులందరూ తుడిచిపెట్టుకుపోయారు.

తోకటపా :

పామును చూసి మనిషి భయపడినట్టే, మనిషిని చూసి పాము కూడా భయపడుతుంది. పాము కాటు వేస్తుందేమో అని మనిషి భయం. మనిషి చేతిలో కర్ర చూసి పాముకు భయం.
అణు బాంబులు ఉన్న దేశాలు తలపడ్డప్పుడు కూడా ఇదే పరిస్థితి. వాళ్లకు ఆ భయం ఉన్నంత వరకు ఇక ఎవరికీ ఏ భయం అక్కరలేదు.
ఎందుకంటే పూర్తి స్థాయి అణు యుద్ధమే సంభవిస్తే, అందులో విజేతలు వుండరు. పరాజితులు మిగలరు. సర్వ నాశనమే అనే సంగతి అణు దేశాలకే బాగా ఎరుక.

23, ఫిబ్రవరి 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (271) : భండారు శ్రీనివాసరావు


పల్లెకు పోదాం రండి!
దేశంలో అభివృద్ధి పెరుగుతోందో, దరిద్ర నారాయణుల సంఖ్య పెరుగుతుందో లెక్కలు కట్టే విషయంలో రాజకీయ అభిప్రాయ విబేధాలు వుండవచ్చేమో కానీ, సార్వత్రిక సామాన్య జనాభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా పెరుగుతున్నది మాత్రం వయోవృద్ధుల సంఖ్య. దీన్ని నిర్ధారణ చేసుకోవడానికి పెద్దగా గణాంకాల అవసరం వుండదు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కరవు భత్యం పెంచినప్పుడల్లా కానవచ్చే సంఖ్యలు చూస్తే చాలు. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య కన్నా పదవీ విరమణ చేసి పెన్షన్ తీసుకునే వారి సంఖ్య అధికంగా వుండడమే ఇందుకు ఉదాహరణ.
నేను 2005 డిసెంబరు 31వ తేదీన హైదరాబాదు దూరదర్సన్ నుంచి అరవై ఏళ్ళు నిండగానే రిటైర్ అయ్యాను. అంటే ఇప్పటికి ఇరవై ఒక్క ఏళ్ళుగా రిటైర్ మెంట్ జీవితం గడుపుతున్నాను.
1975 లో ఆలిండియా రేడియోలో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చాను. దాదాపు ముప్పయ్ ఏళ్ళ ఉద్యోగ ప్రస్థానం తర్వాత కూడా ఇంకా హైదరాబాదు లోనే వుండిపోయాను. ఏదో సొంత ఇల్లు వుంది ఇక్కడే స్థిరపడ్డాను అంటే కొంత అర్ధం వుంది.
యాభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు వచ్చినప్పుడు మాకు తెలిసిన/ బంధువుల కుటుంబాలు వేళ్ళ మీద లెక్క పెట్టేవిగా వుండేవి. ఇన్నేళ్ళలో వాటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. హైదరాబాదు కాకుండా ఇతర ఊళ్లలో వుంటున్న వారి సంఖ్య ఇప్పుడు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అంటే ఒక్క మా కుటుంబానికి చెందిన వారే ఇంతమంది హైదరాబాదు వాసులుగా మారిపోయారు. వారిలో చాలామంది రిటైర్ అయ్యారు. ఇక్కడే సెటిల్ అయ్యారు కూడా.
ఇలాగే గత అయిదు దశాబ్దాల కాలంలో ఉద్యోగాలకోసమో, ఉపాదికోసమో, వ్యాపారాల నిమిత్తమో, బతుకుతెరువు కోసమో ఈ నగరానికి వచ్చిన వారి సంఖ్య లక్షల్లో వుంటుంది. అలాగే పట్టణీకరణ ఫలితంగా ఇతర పట్టణాలు, నగరాల మీద కూడా జనాభా వత్తిడి బాగా పెరిగింది.
'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు మాత్రమే ఈ పని చేసి చూపించారు. హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తి కాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ, పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.
చదువుల కోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే నగరాల మీద ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) భారం పడదని నా వాదన.
ఇంతే కాదు, చదువుకుని చిన్నా పెద్దా ఉద్యోగాలు చేసిన వాళ్ళు,రిటైర్ అయిన తర్వాత వాళ్ళ స్వగ్రామాలకు తరలి పొతే, ఆ పల్లెలకు కూడా ప్రయోజనం.
కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.
కింది ఫోటో : మా స్వగ్రామంలో ఒకప్పటి మా పూర్వీకుల ఇల్లు. ఇప్పడు లేదు దాని స్థానంలో మా అన్నయ్య పిల్లలు ఒక చిన్న డాబా ఇల్లు కట్టించారు, నేటి అవసరాలకు తగ్గట్టుగా.



(ఇంకా వుంది)

22, ఫిబ్రవరి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (270) : భండారు శ్రీనివాసరావు

 

వామ్మో! ఓస్ ఇంతేనా!
బజార్న పోతుంటే దారి పక్కన జూగుప్స కలిగించే దృశ్యం కనబడుతుంది. వెంటనే కళ్లు తిప్పుకుంటాం. సోషల్ మీడియాలో కూడా అంతే. ఇష్టం లేని వాటి వంక కన్నెత్తి చూడకూడదు. అప్పుడు మన బీపీ కంట్రోల్ లో వుంటుంది.
నిప్పుతో వంట చేసుకోవచ్చు వళ్ళు కాల్చుకోవచ్చు. ఫలితం ఏదైనా వాడుకునే తీరులో వుంటుంది.
మనలో చాలా మందిమి మనకు తెలియని సంగతులు లేవు అనుకుంటాము. నేనూ వారిలో ఒకడినే. ఇది ఒప్పుకోవడానికి ఎలాంటి భేషజం లేదు. అందరికీ అన్నీ తెలియాలని లేదు.
పద్నాలుగు పద్నాలుగులు ఎంత అంటే ఠకీమని జవాబు చెప్పడం నాకయితే కష్టం. అదే లెక్కలు బాగా తెలిసిన వాడయితే, ఓస్ ఇంతేనా! అంటాడు. క్షణంలో జవాబు చెప్పేస్తాడు. తెలియని నావంటి వాడయితే, ఇంత గొట్టు ప్రశ్నా! వామ్మో! అంటాడు.
వర్తమాన కాలంలో వయో వృద్ధులకు అన్నీ తెలిసినా కొన్ని కొన్ని తెలవ్వు. ముఖ్యంగా సాంకేతిక విషయాలు. తరానికి తరానికి నడుమ ఈ వైరుధ్యాలు తప్పవు. జెంజీల కాలం నడుస్తున్న ఈ కాలంలో అయితే, ఈ సమస్య మరీ ఎక్కువ.
నా చిన్నప్పుడు అప్పయ్య మాస్టారు చెప్పిన నాలుగు అక్షరాలు వంటబట్టగానే, తల ఎగరేయడం మొదలయింది.
రామాయణ, భారత భాగవతాలు ఆశువుగా, ధారాళంగా చెప్పే మా బామ్మకు కానీ, మా అమ్మకు కానీ అక్షర జ్ఞానం లేదు. చదవ లేరు. వారిదంతా శృత పాండిత్యం. చెవులతో విని నేర్చుకున్నది.
ఏ అక్కయ్యో కార్డు ముక్క రాసేది. కాస్త చదివి పెట్టరా నాన్నా అని నన్ను బతిమిలాడేవాళ్ళు. ఇంత బెల్లం ముక్కో కొబ్బరి లౌజో చేతిలో పడేదాకా వాళ్ళ మాట వినకుండా చెట్టెక్కి కూర్చొనే వాడిని.
మొన్నీ మధ్య ఒక ధరకాస్తు పూరించాల్సిన పని పడింది. ఇన్నేళ్ళుగా ఫోటో అంటించడానికి అలవాటు పడ్డ ప్రాణాలకు ఫోటో అప్ లోడ్ చేయడం అనేది బొత్తిగా తెలవని విషయమే. పైగా ఫోటో ఇన్ని కేబీలు, సంతకం ఇన్ని కేబీలు వుండాలి అంటే, కేజీలు తప్ప కేబీలు తెలియని వాళ్ళు ఏమై పోవాలి. చిన్నప్పుడు మా బామ్మలు బతిమిలాడినట్టు విషయం తెలిసిన వాడిని పట్టుకుని పని చేయించుకోవాలి. తప్పదు. నాకు తెలియదు అంటే కుదరని కాలంలో జీవిస్తున్నాం.
నిన్నా మొన్నా నా మొబైల్ మొరాయింపుతో గతంలో చేసిన తప్పులకు ఈ జన్మలోనే దేవుడు బుద్ధి చెబుతాడని తెలిసి వచ్చింది.
నాకసలు ఖాతాయే లేని HDFC బ్యాంకు నుంచి నిన్న ఏవో మెసేజ్ లు వచ్చాయి. సాంకేతిక నిరక్షరాస్యుడిని కనుక కంగారు పడిన మాట నిజం.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే అనేకమంది స్పందించారు. సలహాలు, సూచనలు చేశారు. నిజానికి ఇదెంత గొప్ప విషయం.
సమస్యతో సంబంధం లేని వాళ్లకి ఇదో సమస్యా అనిపించవచ్చు. కానీ సోషల్ మీడియా మితృలు అలా అనుకోలేదు. ఇది తమ సమస్యే అన్నట్టుగా వారు స్పందించిన తీరు నన్ను ముగ్ధుడిని చేసింది.
చంద్రశేఖర్ కోటిపల్లి Chandra Sekhar Kotipalli గారు రాసిన వివరణతో నా ఆందోళన పూర్తిగా సమసిపోయింది. ఆయన ఇలా రాసారు.
“మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకుకి HDFC వాళ్ళు UPI పేమెంట్స్ చేసే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు కొత్త ఫోన్ ద్వారా gpay/phone pe కి రిజిస్టర్ అయినప్పుడు ఈ మెసేజెస్ వస్తాయి, మరేం ఇబ్బందిలేదు. రేపటి నుంచి యధావిధిగా మీ gpay పని చేస్తుంది”
ఆయన అన్నట్టే జరిగింది. సమస్య పరిష్కారం అయింది.
నా ఒక్క విషయమే కాదు.
ఈ మీడియాలో ఎవరో పోస్టు పెడతారు. ‘ఈరోజు నా బిడ్డ పుట్టిన రోజు, మీ ఆశీస్సులు అందివ్వండి’ అని. వెంటనే డజన్ల కొద్దీ ఆశీర్వచనాలు ఆ బిడ్డకు అందుతాయి. మరెవరో నాకు ఒంట్లో బాగాలేదు అంటారు. త్వరగా కోలుకోవాలంటూ మెసేజులు వస్తాయి, అదీ ముక్కూ మొహం తెలియని వారి నుంచి. నిజానికి ఫేస్ బుక్ అనే పేరే కానీ దీనికే ఒక మొహమంటూ లేదు. నూటికి ఎనభయ్ మంది ఒకరికొకరు ముక్కూ మొహం తెలియని వారే. అయినా సొంత మనుషుల్లా ఆప్యాయత చూపుతారు. మంచిదే కదా!
ఇందులో మంచిని చూస్తే మంచే కనబడుతుంది. బయట ఉన్నట్టే అన్ని రంగాలకు చెందిన కుళ్ళు ఇక్కడ కూడా వరదలా పారుతుంది. మురికి కాలువ దాటేటప్పుడు ముక్కు మూసున్నట్టు కళ్ళూ ముక్కూ కాసేపు మూసుకోండి. అటు వైపు చూడకండి. అంతా మంచే కనబడుతుంది.
ముందే చెప్పినట్టు మీ బీపీ మీ కంట్రోల్ లో వుంటుంది.
(ఇంకా వుంది)

19, ఫిబ్రవరి 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో ( 268 ) : భండారు శ్రీనివాసరావు

 

ముసలితనంలో వసంతాలు
ఫోటో: 500 KB JPG
సంతకం : 500 KB JPG
ఆధార్: I MB PDF
ఏవిటో అంతా అయోమయం, ఒక్క ముక్కా అర్ధం కాదు.
యాభయ్ అయిదేళ్ళ క్రితం ఒక ఆగస్టు నెలలో నేను బెజవాడ బందరు రోడ్డు పి.డబ్ల్యు.డి. గ్రౌండ్ స్టాపులో పోరంకి వెళ్ళే ఒకటో నెంబరు సిటీ బస్సు ఎక్కి పశువుల ఆసుపత్రి వద్ద దిగి అక్కడికి దగ్గరలో వున్న ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారి ఛాంబర్ లోకి వెళ్లి కలిసి నమస్కారం పెట్టాను. పెట్టి నేను పలానా అని చెప్పాను. వారు నా వైపు తేరిపార చూస్తూ, ‘మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా!పో పైకి వెళ్ళు. అక్కడ ఉపేంద్రబాబును కలువు. కలిసి నేను పంపాను అని చెప్పు’ అన్నారు. అలా నా తొలి ఉద్యోగం ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా చేరిపోయాను.
నార్ల గారి నోటి మాటే నా నియామక పత్రం.
అయిదేళ్ళ జ్యోతి కొలువు తర్వాత, 1975 లో హైదరాబాదు ఆలిండియా రేడియో, ప్రాంతీయ వార్తావిభాగంలో అసిస్టెంట్ ఎడిటర్ (రిపోర్టింగ్) అనే డిజిగ్నేషన్ తో మరో ఉద్యోగంలో చేరాను. నిజానికి అది రిపోర్టర్ ఉద్యోగం. స్టేషన్ డైరెక్టర్ పేషీలో రిపోర్ట్ చేసి న్యూస్ యూనిట్ కి వెళ్లాను.
ఆ రోజు బాగా జ్ఞాపకం వుంది. వెళ్లేసరికి రంగనాధరావుగారు ఏదో పని చేసుకుంటూ కనిపించారు.
పరిచయాలు అయిన తర్వాత ఏం పని మీద వచ్చావన్నట్టు నా వైపు చూసారు. నా మొహంలో రంగులు మారడం చూసి, “ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేది? రోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులు చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి, తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్” అని తేల్చేసారు. అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు.
“ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడిటేషన్ కార్డు తీసుకుని ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్ పాసు తీసుకున్న తరవాతే, మిగిలిన ఏ పనులయినా! తెలిసిందా!” అన్నారు.
ఆ విధంగా ఉద్యోగంలో చేరిన రెండో రోజే నాకు రేడియో విలేకరిగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డు, దాన్నే అక్రిడిటేషన్ కార్డు అంటారు, పెద్ద శ్రమ లేకుండానే చేతికి వచ్చింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు యాభయ్ ఏళ్ళ పాటు నిరాఘాటంగా ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కార్డు నాకు అందుతూనే వుంది. కాకపోతే ఉద్యోగం చేసే రోజుల్లో రేడియో ప్రతినిధి అని, రిటైర్ అయిన తర్వాత ఇండిపెండెంట్ జర్నలిస్టు అని కార్డులో చిన్న మార్పు చేశారు.
ఈ కార్డు ద్వారా ప్రయోజనాలు కొన్ని వున్నాయి. రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మూడో వంతు చార్జీ చెల్లించి ప్రయాణాలు చేయవచ్చు. ఈ కార్డు చూపించి రైల్వే నుంచి పొందే మరో కార్డు ద్వారా రైళ్ళలో సగం చార్జి చెల్లిస్తే సరిపోతుంది. అసలు ముఖ్యమైన వృత్తిపరమైన ప్రయోజనం సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలలోకి ప్రవేశం.
ఉద్యగంలో సర్వీసు పెరుగుతున్న కొద్దీ బస్సు రాయితీని చాలామంది జర్నలిస్టులు వాడుకోవడం మానేశారు. రైల్వే వాళ్ళు తమంతట తామే రాయితీ ఇవ్వడం మానేశారు. సంఖ్య పెరగడం వల్లనో ఏమో సచివాలయం వంటి చోట్ల కొన్ని ఆంక్షలు పెట్టారు.
2005లో రిటైర్ కావడానికి ముందు నుంచే నేను ఆర్టీసీ, రైల్వే రాయితీలు తీసుకోవడం మానేశాను.
యాభయ్ ఏళ్ళ క్రితం ఉన్న కొన్ని వెసులుబాట్లు ఇప్పుడు బొత్తిగా లేవనే చెప్పాలి. మరి ఎందుకు ఈ కార్డు? కేవలం గుర్తింపు. అంతే! సీనియర్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వగల ఏకైక గౌరవం ఇదొక్కటే.
వెనుకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క ఐ ఏ ఎస్ అధికారి వుండేవారు. మరిప్పుడో. పెరుగుతున్న అవసరాలను బట్టి ఉద్యోగుల సంఖ్య పెరగడం అనివార్యం.
నేను ఆంధ్రజ్యోతిలో చేరిన కాలంలో ఒకే ఒక విలేకరి, అదీ పార్ట్ టైం విలేకరే, బెజవాడకు సంబంధించి అన్నీ చూసుకునే వారు.
ముఖ్యమైన నగరాల్లో సొంతంగా స్టాఫర్లను నియమించుకునే పద్దతులు చాలాకాలం తర్వాత అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు పేట పేటకు, వాడవాడకు విలేకర్లు.
యాభయ్ ఏళ్ళ క్రితం విలేకరుల సంఖ్య కూడా తక్కువే. ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పది కుర్చీల్లో రెండు ఖాళీ వుండేవి. ఇప్పుడో. స్టేడియంలో పెట్టినా జాగా సరిపోయేలా లేదు అని హాస్యోక్తిగా అనుకునే పరిస్థితి.
ఎలక్ట్రానికి మీడియా ఆవిర్భావం తర్వాత ఈ సమస్య బాగా పెరిగింది. పూర్వం విలేకరి, కెమెరామాన్, కెమెరా మోసే మనిషి, లైట్ బాయ్ ఇలా ఒక్కో సంస్థ నుంచి ఎందరో. న్యూస్ కవరేజ్ కి ఇంతమందీ అవసరమే ఆ రోజుల్లో.
సాంకేతికత పెరిగింది. కెమెరా సైజులు తగ్గాయి. ఓబీ వ్యాన్లు వచ్చాయి. ప్రత్యక్ష ప్రసారాలు పెరిగాయి. ఎక్కడి నుంచయినా అప్పటికప్పుడు వార్తలు, వీడియోలు పంపే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సోషల్ మీడియా ఆగమనంతో అసలు మీడియా స్వరూపమే పూర్తిగా మారిపోయింది.
ప్రతి వ్యక్తికి కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలు వుంటాయి. వ్యక్తి స్వాతంత్రం రాజ్యాంగం పౌరులకు ప్రసాదించింది. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడానికి పూర్వకాలంలో లేని అవకాశం, స్వేచ్ఛ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా లభించాయి.
ఈ మార్పు ఇప్పుడు అందరి అనుభవంలోకి వస్తోంది. చేతిలో మొబైల్ వుంటే ఒక పత్రిక చేతిలో ఉన్నట్టే. దానితో రాజకీయ పార్టీలకు ఇదొక అవకాశంగా కనబడింది. ఫలితం ప్రతి పార్టీకి సొంతంగా మీడియా విభాగాలు. తప్పేమీ లేదు. సాధారణ మీడియా కూడా ఇటువంటి వాటికి అతీతంగా ఏమీ లేదు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల మీద పరిపాలనా వ్యవస్థలకు కొన్ని కంటికి కనపడని అదుపాజ్ఞలు వుంటాయి. ఈ సోషల్ మీడియాకు అలాంటివి లేవు.
‘నేనే రాజు, నేనే మంత్రి’ తరహా జర్నలిజం. కానీ చిన్నచూపు చూడడం, నిర్లక్ష్యం చేయడం కానీ కుదరని పని. భవిష్యత్తు ఈ మీడియాదే అని స్పష్టంగా కనబడుతుంటే కాదనడం సాధ్యమా! మార్పుని అంగీకరించక తప్పదు.
స్వేచ్ఛకు సంకెళ్ళు వేయడం ఎంత గర్హనీయమో, మితిమించిన స్వేచ్ఛ కూడా అంతే ప్రమాదకరం.
ప్రభుత్వాలు పరిమితి విధించే పరిస్థితులు లేనప్పుడు మీడియానే లక్ష్మణ రేఖలు గీసుకోవాలి. సరే ఇదొక అనంతమైన విషయం ఇంతటితో వదిలేద్దాం.
తామరతంపరగా వస్తున్న ఈ కొత్త మీడియాకి కళ్ళెం వేయడం కుదరని పని. అంచేత గుర్తింపు కార్డులు ఇవ్వడం ప్రభుత్వాలకు అలవికాని పనిగా మారింది. ఫలితంగా కమిటీలు, సబ్ కమిటీలు. రిపోర్టులు. వీటి ఫలితం అక్రిడిటేషన్ల ప్రక్రియకు ఆన్ లైన్ పద్దతి అందుబాటులోకి తెచ్చారు. మంచిదే.
బస్సు, రైళ్లు, విమానాల టిక్కెట్లు, తిరుపతి దర్శనాలు, పాస్ పోర్ట్లు, వీసాలు అన్నింటికీ ఆన్ లైన్ ధరకాస్తులు. అలాగే అక్రిడిటేషన్లకు. అయితే ఇబ్బంది అల్లా ఈ ధరకాస్తుల అప్ లోడ్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా వుండాలి.
ఉదాహరణకు:
ముందే చెప్పినట్టు, ఫోటో: 500 KB JPG
సంతకం : 500 KB JPG
ఆధార్: I MB PDF
ఏవిటో అంతా అయోమయం, ఒక్క ముక్కా అర్ధం కాదు. రాయడం, పోస్టు చేయడం తప్పిస్తే నా బోంట్లకు ఇలాంటి కంప్యూటర్ పరిజ్ఞానం సున్నా.
గంటలు గంటలు కంప్యూటర్ ముందు కూర్చొన్నా ఫలితం వుండడం లేదని కొందరు వయోధిక జర్నలిస్టుల ఆవేదన.
(కింది ఫోటోలు: 1975 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నాకు మంజూరు చేసిన అక్రిడిటేషన్ కార్డులలో పోయినవి పోగా మిగిలినవి కొన్ని)



(ఇంకా వుంది )

18, ఫిబ్రవరి 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (267) : భండారు శ్రీనివాసరావు


మాధవుడు ఏక పదమా! సమాసమా!!
“దేవుడు మనిషికి రెండు చెవులు ఇచ్చింది ఎక్కువ వినడానికి, ఒక్క నోరే ఇచ్చింది తక్కువ మాట్లాడడానికి” అని వాక్రుచ్చాడు ఓ మితభాషి.
నిజమే! వినడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ చెప్పేవాడు ఓ విజ్ఞాన ఖని అయితే మన పంట పండినట్టే.
కొన్నేళ్ళు, అంటే నాలుగేళ్ల క్రితం 2022 లో ఒకరోజు ఉదయం నాకు వచ్చిన అనేకానేక ఫోన్లలో కోమండూరి (ఇంటిపేరు విని రాసింది కనుక తప్పయితే క్షంతవ్యుడను) శేషాచారి గారిది ఒకటి.
మాటల నడుమ తెలిసింది వారి వయసు తొంభయ్ అని. కొద్దిగా వణుకు వున్నా, మాట స్పుటంగా వుంది. ఉస్మానియాలో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారుట. చైతన్యపురిలో నివాసం.
ఆ రోజు నమస్తే తెలంగాణా పత్రికలో వచ్చిన నా వ్యాసం గురించి ప్రస్తావించారు. నా పట్ల వారి ప్రశంసలు ఇక్కడ అప్రస్తుతం.
ప్రతిరోజూ అనేక పత్రికలు చదివే అలవాటు వారికి వుందట. అలా నా వ్యాసం కూడా చదివారు. అందులో నెంబరు వుండడం చేత ఫోన్ చేశారు.
మాటల మధ్యలో శేషాచార్యుల వారు అనేక అంశాలు ప్రస్తావించారు. తొమ్మిది పదుల వయసులో ఆయన ధారణ శక్తి అద్భుతం అనిపించింది. వారు చెప్పిందే శీర్షికలో పేర్కొన్న ‘మాధవుడు ఏక పదమా! సమాసమా!’
మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడు. వినగానే ఏక పదం అనిపిస్తుంది. ఉత్పత్తి అర్ధం తీసుకుంటే మా అంటే అమ్మ. అమ్మ అంటే అమ్మవారు, జగజ్జనని. అంటే శ్రీ మహావిష్ణువు సతీమణి. ధవుడు అంటే భర్త. అమ్మవారి భర్త శ్రీమన్నారాయణుడు అంటారు శేషాచార్యుల వారు.
మధ్యలో ఏదో అనుమానం కలిగి అడిగారు, ‘మీరు ఫ్రీగా వున్నారా!’ అని.
‘పరవాలేదు, నేను 24 X 7 ఫ్రీ మనిషిని. పైగా మీ మాటలు వింటుంటే రాసుకోవడానికి నాకు ముడి సరుకు దొరుకుతుంది. కాబట్టి ఇందులో నా స్వార్ధం కూడా వుంది, చెప్పండి’ అన్నాను వారితో.
‘ఒకసారి అంటే ఇప్పుడు కాదులెండి చాలా దశాబ్దాలు గడిచిపోయాయి. సారస్వత పరిషత్ లో జరిగిన ఓ సభకు ప్రముఖ కవి జాషువా గారు, కవిసామ్రాట్ విశ్వనాధ గారు వచ్చారు. నేనూ వెళ్లాను.
‘జాషువా గారు సాత్వికులు. విశ్వనాధ వారి సంగతి లోక విదితం. ప్రధమ కోపం అంటారు.
‘జాషువాగారు నాలుగు పద్యాలు చదివారు. తర్వాత ఆయన ఇలా అన్నారు.
‘నా పద్యాలకు అర్ధం అడక్కండి, కానీ రాయడానికి కారణాలు అడగండి చెబుతాను’ అంటూ జాషువాగారు తన గబ్బిలం పుస్తకం గురించి చెబుతుంటే సభలో అందరూ ఆయన కవితాభినివేశానికి మ్రాన్పడి పోయారు. అంతసేపూ వేదిక మీద ఉన్న విశ్వనాధవారు తనకు వేసిన గులాబీ పూలదండను చేతితో నలుపుతున్నట్టు అనిపించి కొంత భయపడ్డారు కూడా.
ఇంతలో జాషువాగారి ప్రసంగం ముగిసింది. సభికుల హర్షధ్వానాల నడుమ విశ్వనాధ లేచి నిలబడ్డారు. అప్పటివరకు పూలదండ నుంచి తెంచిన గులాబీ రేకులను దోసిట్లోకి తీసుకుని జాషువా శిరస్సుపై అభిషేకిస్తున్నట్టు వెదజల్లారు.
రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ జాషువాను ‘పుంభావ సరస్వతి’ అని కీర్తించారు.
శేషాచార్యుల వారు ఈ వృత్తాంతం చెబుతూ కొద్ది సేపు మౌనంగా వుండి గతకాలపు జ్ఞాపకాలను తలచుకున్నారు.
తర్వాత నేనే చొరవ తీసుకుని వారి వివరాలు అడిగి తీసుకున్నాను. లోగడ అంటే నేను రేడియోలో చేరక పూర్వమే శేషాచార్యులవారు ఆకాశవాణిలో సంస్కృత కార్యక్రమాల్లో పాల్గొన్నారట. అధర్వణ వేదాన్ని విశదీకరిస్తూ అనేక ప్రసంగాలు చేశారట.
ఇటువంటి విలువకట్టలేని నిక్షేపాలు ఆకాశవాణి వద్ద అనేకం ఉండేవి. ఉండేవి అని ఎందుకు అంటున్నాను అంటే తదనంతర కాలంలో వాటి విలువ తెలియని వాళ్ళు వాటిని పదిలంగా భద్రపరచి వుంటారనే నమ్మకం లేదు కనుక.
పాదాభివందనాలు 'శేషాచార్యుల వారూ. పరగడుపునే పరమాన్నం తినిపించారు'
అనుకున్నాను ఆ ఉదయం.
కొన్ని రోజులు భారంగా గడిచినా మరి కొన్ని రోజులు మనసుకు ఉల్లాసంగా గడుస్తాయి.
జీవితం అంటే అదే.
(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో ( 266 ): భండారు శ్రీనివాసరావు

 

చెదరని జ్ఞాపకం
ఇలా కూడా జరుగుతుందా అనిపించే సందర్భాలు జర్నలిస్ట్ జీవితంలో ఎదురవుతుంటాయి.
నాలుగేళ్ల క్రితం 2022 లో సరిగ్గా ఇదే రోజు.
ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ మోగింది.
“భండారు శ్రీనివాసరావు గారా! సీఎం ఆఫీసు నుంచి. సీఎమ్ గారు మాట్లాడుతారు, లైన్లో వుండండి” అంది ఓ గొంతు.
ఓ పాతికేళ్ళ క్రితం అయితే ఇలాంటి ఫోన్లు ఆశ్చర్యం కలిగించేవి కావు. రిటైర్ అయి పదిహేడేళ్లు దాటింది కదా! అందుకే ఆశ్చర్యం.
“శ్రీనివాసరావు గారు, బాగున్నారా! ఎక్కడ వుంటున్నారు, ఒకసారి మాట్లాడుకుందాం, కారు పంపిస్తాను, ఇంటికి రండి” అంటున్నారు అవతల కేసీఆర్ గారు. అయోమయంలోనే విన్నాను.
కొద్దిసేపటికే పియ్యే ఫోన్ చేసి లొకేషన్ తీసుకున్నాడు. మరి కొద్ది సేపటికే అనిల్ అనే డ్రైవర్ ఫోన్ చేసి మీ (మా) ఇంటి దగ్గరే వున్నాను’ అన్నాడు.
రోజూ మూడున్నరకు నా మధ్యాన్న భోజనం. రెండున్నర దాటితే కానీ స్నానం సంధ్యా ప్రసక్తి వుండదు.
డ్రైవర్ ని ఉండమని చెప్పి, అప్పటికప్పుడు తయారై, గుప్పెడు మెతుకులు నోట్లో వేసుకుని కారెక్కాను. సరాసరి సీఎం ఇంటికే తీసుకు వెళ్ళాడు.
లిఫ్టులోపైకి వెళ్లేసరికి, 'రండి రండి భోజనం చేద్దాం' అని ఆహ్వానించారు కేసీఆర్.
చేసేవచ్చానని చెబితే, 'ఇలా మాతో వచ్చి కూర్చోండి' అన్నారు. భోజనం టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వున్న ఆరుగురిలో ఇద్దరే తెలుసు, ఒకరు సంతోష్, ఎంపీ. మరొకరు భాను ప్రసాద్ ఎం.ఎల్.సీ.
భోజనాల కార్యక్రమం పూర్తి కాగానే కిందికి వెళ్లాం. వరసగా వాహనాలు. నన్ను కాన్వాయ్ లో మూడో వాహనంలో కూచోబెట్టారు. కారు తలుపు ఎంత గట్టిగా వుందంటే చేత్తో తీయడం సాధ్యం కాలేదు. అది బులెట్ ప్రూఫ్ అని చెప్పి డ్రైవర్ డోర్ తీశాడు.
కాన్వాయ్ కదిలింది. నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ చేరింది. ఒక హెలికాప్టర్ దగ్గర ఆగింది. నేను దిగి ఒక పక్కన నిలబడ్డాను. ఇక్కడ నుంచి ఇంటికి చేరడం ఎల్లా అనేది నా ఆందోళన.
ఈలోగా ఎవరితోనో ముచ్చటిస్తున్న సీఎమ్ నా వైపు చూసి 'ఎక్కండి' అన్నారు. నాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టు వుంది. ఉద్యోగంలో వున్నప్పుడు ఇలాంటి ప్రయాణాలు అలవాటే. రిటైర్ అయి పదిహేడేళ్లు. అందుకే నిబిడాశ్చర్యం.
హెలికాఫ్టర్ లో పక్కన కూర్చోబెట్టుకున్నారు.
అరగంటలో నారాయణ్ ఖేడ్ చేరాము. స్టేజి మీద తన వెనకనే కూర్చోబెట్టుకున్నారు.
బహిరంగ సభలో ప్రసంగిస్తూ, 'నాతోపాటు భండారు శ్రీనివాసరావు కూడా వచ్చారు' అని ఆయన మైకులో చెబుతుంటే మతి పోయింది.
సభ ముగిసింది.
తిరిగి అరగంటలో బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి సీఎం రెసిడెన్స్.
పైకి వెళ్ళాము. వేడి వేడి ఉప్మా కాఫీ ఇచ్చారు. ఓ గంటన్నర ఏవేవో ముచ్చ్చట్లు. నన్ను ఎందుకు రమ్మన్నారో అంతు చిక్కలేదు.
ఏడున్నర కాగానే నేను లేచి నిలబడి ధన్యవాదాలు చెప్పాను.
'ఆయన్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపి రండి' అన్నారు అక్కడ ఎవరితోనో.
ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరాను.
అప్పటివరకు సెక్యూరిటీ జామర్ల వల్ల మూగనోము పట్టిన నా ఫోను మళ్ళీ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో పిలుపులు మొదలు పెట్టింది.
కలా నిజమా అనుకుందాం అంటే ‘నారాయణ్ ఖేడ్ మీటింగులో సీఎంతో పాటు నువ్వు కూడా కనిపించావు టీవీల్లో’ అని మిత్రుల ఫోన్స్.
అయితే నిజమే అన్నమాట.
ఇంతకూ ఎందుకు పిలిచినట్టు? నేను ఎందుకు వెళ్లినట్టు? ఈ భేతాళ ప్రశ్నలకు సమాధానం లేదు.
జరిగి నాలుగేళ్లు అవుతున్నా జవాబు దొరకని ప్రశ్నలుగానే మిగిలి పోయాయి.
కేసీఆర్ గారి అభిమానం ఆ స్థాయిలో ఉంటుందని సమాధానపడడం ఒక్కటే మిగిలింది.
(ఈరోజు ఫిబ్రవరి 17, కేసీఆర్ గారి పుట్టినరోజు )
కింది ఫోటో : నారాయణ్ ఖేడ్ సభలో కేసీఆర్ వెనుక నేను, టీవీ క్లిప్పింగ్ )