10, డిసెంబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (246) : భండారు శ్రీనివాసరావు


నందిక నా కళ్ళు తెరిపిళ్ళు పడేలా చేసింది.
ఇప్పుడు తెల్లవారుఝమున మూడు గంటలు దాటింది.
నా వయసు ఎనభయ్ సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం నా భార్య నిర్మల మరణించింది. నిరుడు మొదట్లోనే నా రెండో కుమారుడు సంతోష్ కన్ను మూశాడు.
అమెరికాలో ఉంటున్న నా పెద్దవాడు సందీప్, కోడలు భావన, చిన్న వయసులోనే జీవన సహచరుడిని పోగొట్టుకున్న చిన్నకోడలు నిషా నాకు బాసటగా నిలబడ్డారు. మా అన్నయ్య రామచంద్ర రావు గారు, ఆయన పిల్లలు సరే సరి. నా పాలిటి 108.
మల్టీ నేషనల్ సంస్థలో చిన్న కోడలుకి ఉద్యోగ బాధ్యతలు. చిన్నారి జీవిక ఆలనా పాలనా చూడడానికి మా ఆవిడ లేదు. అంచేత తప్పనిసరి పరిస్థితిలో పుట్టింట్లో, కటక్ లో వుండాల్సిన పరిస్థితి. అక్కడ జీవికకు అమ్మమ్మ, తాతతో పాటు కోడలి అన్నవదినలు, వారి పిల్లలు వుంటారు. ఒక కుటుంబ వాతావరణంలో పెరుగుతుంది. నిజానికి అంతకంటే గొప్పగానే పెరుగుతోంది. అది దాని అదృష్టం.
పగలు స్కూలు, సాయంత్రం డాన్సు స్కూలు, ఉదయం ట్యూషన్, డ్రాయింగు క్లాసు. ఇలా ఉదయం నుంచీ సాయంత్రం దాకా, వాళ్ళ అమ్మ ఓవర్ సీస్ కాల్స్ పూర్తయ్యేవరకు బిజీ, బిజీ.
ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒంటరిగా వుండడమే మంచిదని నాకూ అనిపించింది. మొబైల్స్ యుగంలో దూరాభారాల సమస్య లేదు కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్ చేసి చూస్తూ మాట్లాడ వచ్చు.
అలా సర్దుకుపోయాను.
ఒకరకంగా హైదరాబాదులో వానప్రస్తాశ్రమం.
ఒక్కడిని. వంట చేసిపెట్టడానికి వలలి. ఇంటి పనులు చేసిపెట్టడానికి ఒక హెల్పర్. బయట తిరగాలి అంటే కారు. ఎనభయ్ ఏళ్ళ మనిషికి ఇంతకంటే ఏం కావాలి?
ఏ సమస్య లేకుండా పిల్లలు చూసుకుంటున్నారు. వాళ్లకి నేను సమస్య కాకుండా చూసుకోవడం ఒక్కటే నేను చేయగలిగింది.
దాంతో నాకు నేనుగా కొన్ని నియంత్రణలు పెట్టుకున్నాను.
ముందు నేను చేయాల్సింది నా ఆరోగ్యం చూసుకోవడం. ఇదివరకు ప్రతిదీ ఒక సమస్యే. ఎప్పుడయితే నా పెద్దకోడలు భావన చెప్పినట్టు, అది సమస్య కాదు ఇబ్బంది అని అనుకోవడం మొదలు పెట్టానో అన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి.
నాకు నేనుగా ఒక ప్రపంచం నిర్మించుకున్నాను, ఇందులో రాత్రీ పగలు తేడా లేదు. రాత్రుళ్లు నిద్ర పట్టదు. పట్టకపోతే ఏమవుతుంది? రేపు పగలు నిద్రపోతాను. రేపు అనేది వుంది అనే నమ్మకం కుదరడంతో నిద్రపట్టక పొతే ఎల్లా అనే దిగులు, భయం పోయాయి. దిగులు పోవడంతో ఆరోగ్యం నా ప్రమేయం లేకుండానే కుదుట పడింది.
అదివరకు ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకునే వాడిని. ఆరు నెలలుగా డయాగ్నాస్టిక్ సెంటర్ గడప తొక్కలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు.
ఒకరకంగా ఇది మొండితనమే. ఏదన్నా ముంచుకు వస్తే! ఏమవుతుంది? ఇంతకంటే ఏమవుతుంది?
కట్టుకున్న భార్య, కన్న కొడుకు కళ్ళ ముందే పోయారు. వారిని కాపాడగలిగానా?
మిత్రుడు, మేనకోడలు మొగుడు జ్వాలా 'బయటకు వస్తుండు' అని చెప్పి చెప్పి విసుగు పుట్టి ఊరుకున్నాడు. ఆదివారం కలిసిన మిత్రుడు, తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి కూడా అదే మాట. వారానికి ఒకరోజు జీరోకు సెలవు ఇచ్చి బయటకు వస్తుండు అని. కానీ ఒకళ్ళ మాట వినేరకం అయితే నేను, నేను ఎందుకు అవుతాను.
ఇప్పుడు ఒకటే నా ధ్యేయం. మొదలు పెట్టిన జీరో కధను పూర్తి చేయడం. వీలయితే దాన్ని మా పిల్లలు చదువుకునేలా ఆంగ్లంలో అనువాదం చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో అదేమంత పెద్ద విషయం కాదు.
తెల్లవారుఝామున ఎప్పుడో నిద్ర పట్టినా ఆరుగంటలకు మెలకువ వస్తుంది. కాలకృత్యాలు తీర్చుకునేసరికి, పాలబ్బాయి ప్యాకెట్ వేస్తాడు. వాటిని కాగబెడతాను. ఒక్కోసారి పొంగిపోతాయి. అవసరం అన్నీ నేర్పిస్తుంది. సన్నటి సెగన కాగబెడతాను. గతంలో ఫిల్టర్ కాఫీ తాగేవాడిని. అదో పెద్ద హైరాణా. ఫిల్టర్ లో పొడివేసి, వేడి నీళ్ళు పోసి అది దిగిన దాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు.
మరి ఇంతమంది పనివాళ్లు దేనికి అంటారా! వంట చేసే ఆవిడ పదిహేను ఏళ్ళ నుంచి పని చేస్తోంది. ఆమెకు గంపెడు సంసారం. పొద్దున్నేరావాలి, ఈ పనులు చేయాలి అంటే. గతంలో వచ్చేది. ఒక్క మనిషికి కాఫీ కలపడం కోసం ఎందుకు, వద్దని నేనే చెప్పాను. కొన్నాళ్ళు కాఫీ ప్రహసనంతో కుస్తీ పట్టిన తర్వాత ఈ గోలకంటే కాఫీ మానేస్తే పోలా అనిపించి ఆ అలవాటుకు స్వస్తి చెప్పాను.
ఒక గ్లాసు పాలలో ఎన్స్యూర్ కలుపుకుని, డ్రాయింగ్ రూములో కూర్చుని లెగ్ మసాజర్ లో కాళ్ళు పెట్టుకుని, పాలు తాగుతూ, అలెక్సాలో వెంకటేశ్వర సుప్రభాతం పెడతాను. మిగిలిన పాలు తోడు పెడతాను. నిజానికి ఈ పనులన్నీ చాలా రోజులు మా వలలి చేసేది. అప్పటిదాకా మంచం మీద నిద్రపట్టక దొర్లుతూ వుండేవాడిని. ఈ పనులు నా భుజానికి ఎత్తుకున్న తర్వాత రోజులో ఎంతో సమయం కలిసివస్తోంది. నాకూ కొంత కాలక్షేపం.
పొతే, ఇక నందిక సంగతి. ఈ అమ్మాయి మా చిన్నకోడలు నిషా అన్నయ్య కుమార్తె. చార్టర్డ్ అక్కౌంటెన్సీ ఇంటర్ మీడియెట్ గ్రూపు రెండు పరీక్షలు ఒకే అటెంప్ట్ లో మంచి రాంక్ తో పూర్తి చేసింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఆర్టికిల్ షిప్ ఆఫర్ వచ్చింది. ఆ కంపెనీ హైదరాబాదులో వుంది. చేరడానికి ఇక్కడకు వచ్చింది. అదీ ఇండిగోలో. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు అన్నీ ఒకేమారు నేల వాలినట్టు ఇండిగో విమానాలన్నీ గాలిలో ఎగరడం మానేసి భూమి మీదనే పడి వుంటున్నాయి, కొన్నిరోజులుగా. ఆ అమ్మాయి సోమవారం నాడు జాయిన్ కావాలి. ఎలారా అని మధన పడుతుంటే ఆదివారం నాడు మాత్రం మధ్యాన్నం ఫ్లయిట్ సరయిన సమయానికి భువనేశ్వర్ లో బయలుదేరి సరయిన సమయానికి హైదరాబాదు చేరింది. లక్కీ గర్ల్.
ఇంట్లో దీపం వెలిగించేవాళ్లు లేరు అనుకునే బాధ లేకుండా ఇంటి దీపంలా నందిక వచ్చింది.
సోమవారం ఆఫీసుకు వెళ్ళింది, వచ్చింది. కొత్త ఆఫీసులో పని, ఇతర క్షేమ సమాచారాలు కనుక్కుని మళ్ళీ నా డెన్ లోకి వచ్చాను. ఏదో చెత్తా చెదారం రాసుకుంటూ వుండి పోయాను. నేను సాధారణంగా నా గది వదిలి మా ఇంట్లోనే కాలు బయట పెట్టను, ఉదయం పూట ఓ అరగంట తప్ప. తలుపు తీసి పెడతాను. వంటమనిషి, పనిమనిషి వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెడతారు. మూడు కిలోలు బియ్యం కొంటే నెల దాటినా మళ్ళీ కొనే అవసరం పడదు. నేను కంచంలో వదిలేసే అన్నం చూసి, పని మనిషి బాధ పడుతుంది. ఇంతకంటే తక్కువ వండడం కష్టం అని వలలి వాదన. ఈ వయసులో ఎంత తక్కువ తింటే అంత మంచిది అనేది నా థియరీ. మా అన్నయ్య, లేదా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్ మీల్స్ ఎలాగూ తప్పదు.
సోమవారం సాయంత్రం వంటింట్లో చప్పుడు అవుతుంటే వెళ్లి చూశాను. నందిక వంటింటి సామాగ్రి సర్దుతూ కనిపించింది. ఎందుకమ్మా ఈ చాకిరీ అన్నాను. తీరా చూస్తే ఆరు నెలల కింద కొనిపెట్టి పోయిన సరుకులు. తెలివికల అమ్మాయి కనుక స్కాన్ చేసి పనికిరాని సరుకులన్నీ పెద్ద గోతాములో పెట్టింది. గిన్నెలు, స్టీల్ డబ్బాలు అన్నీ సదిరిపెట్టింది.
ఎలా అయినా ఆడపిల్లలు ఆడపిల్లలే. నిషా పోలికే ఈ అమ్మాయికి వచ్చింది. పోలిక సంగతేమో కానీ మా ఇంటికి మళ్ళీ వెలుగు వచ్చింది.





(08-12-2025)
(ఇంకావుంది)

8, డిసెంబర్ 2025, సోమవారం

అడిగి తెచ్చుకున్న పుస్తకం – భండారు శ్రీనివాసరావు

 

“చదవాలని అనిపించిన ప్రతి పుస్తకం కొనతగ్గదే!”

ఈ కొటేషన్ నాది కాదు.

నిన్న ఆదివారం ఉదయం ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. వెళ్ళే సరికి వేదిక మీదికి అతిధులను ఆవిష్కరించే క్రతువు కొనసాగుతోంది.  బయట పుస్తకాన్ని అమ్మే ఏర్పాటు ఏమైనా చేశారా, కొనుక్కుని వెడదామని ఒకపరి పరికించి చూసి,  అలాంటిదేమీ లేదని నిర్ధారించుకుని లోపలకు వెళ్లాను.

మిత్రుడు, పాత్రికేయుడు, బహురూపి, సౌమ్యుడు ములుగు రాజేశ్వరరావు రాసిన ( నేను – బహువచనం, అధినాయక జయహే” గేయ సంపుటి) రెండు పుస్తకాలను  ఒకే వేదిక మీద,  ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ  మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ కందా ఆవిష్కరించారు. తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథి. వేదిక మీద జర్బలిస్తులే కాదు, వివిధ రంగాలకు చెందిన ఘనాపాటీలు వున్నారు.

అందరూ తమ ప్రసంగాలలో,  రాజేశ్వరరావు గురించి నేను పైన పేర్కొన్న విశేషణాలనే ప్రముఖంగా  ప్రస్తావించారు. అది సహజం.  పాతిక ముప్పయ్ ఏళ్ళకు పైగా ఆయనతో పరిచయం వున్న మాబోంట్ల అభిప్రాయం అదే. అయితే ఈ పుస్తకంలో అంటే తన ఆత్మ కధలో ఆయన రాసుకున్న రాజేశ్వరరావు వేరే. అయన లోపలి మనిషి గురించి మాలో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. తెలిసిన తర్వాత, ఇంటి పేరు ములుగు,  కానీ రాజీపడని రాజేశ్వరరావు అని పేరు పెట్టుకుని వుంటే బాగుండేది అనిపించింది.

పుస్తకానికి వేసిన ముఖచిత్రంలో ఆయన ఈ రెండో వ్యక్తిత్వం స్ఫుటంగా కనిపిస్తుంది. ఒక నిచ్చెన, దాని మూడో మెట్టు మీదనే కాటు వేయడానికి సిద్ధంగా వున్న పాము. దాని నుంచి తప్పించుకుని కిందికి జారడం.  మళ్ళీ ఎక్కే ప్రయత్నం మాత్రం మానలేదు.  చివరికి నిచ్చెన చివరి మెట్టు ఎక్కాడా అంటే అదీ లేదు. ముప్పయి ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నాడో అక్కడే వున్నాడు. నిఖార్సయిన జర్నలిస్టులు చాలా మంది పరిస్థితి ఇదే. దీనికి ప్రధాన కారణం వాళ్ళ ఎడమ కాలు గట్టిది. నచ్చకపోతే, ఎంతో నచ్చి సంపాదించుకున్న  ఆ ఉద్యోగాన్ని ఎడమకాలితో తన్ని బయటకు వస్తారు. రాజేశ్వర రావు అదే బాపతు కనుక ఎన్నో పత్రికల్లో పనిచేసినా ఎక్కడా కుదురుకున్నది లేదు. అలాగని రాజీ పడి జీవితాన్ని సరిదిద్దుకున్నదీ లేదు.

నేను ఈ పుస్తకాన్ని సమీక్షించడం లేదు. ఎందుకంటే ఎవరికి వారు చదువుకుంటే ఇందులోని థ్రిల్ అర్థమవుతుంది.

ఇది చదివిన తర్వాత ధన్యవాదాలు చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు. అతడి పేరు కూడా నాకు తెలియదు.

అతడు రాజేశ్వర రావు పెద్ద కుమారుడు.

“నాన్నా! నువ్వు జర్నలిష్టువి. ఎన్నో రాస్తుంటావు. మరి నీ ఆటో బయాగ్రఫీ రాయొచ్చు కదా!”

“నేనేంటో మీకు తెలుసు కదా! మళ్ళీ అదెందుకు”

“ మాకు తెలిసిన నాన్న గురించి కాదు. తెలియని నాన్న గురించి”

ఈ షాక్ నుంచి పుట్టిందే ఈ పుస్తకం.

“నేను”

దీనికి ఓ ట్యాగ్ లైన్ “ బహువచనం”

అంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వున్నారని కవి హృదయం కావచ్చు.

“అఖండ విజయాలు, ఘోర వైఫల్యాలు” ఏదీ దాచుకోలేదు. ముళ్ళ బాట మీద పూలు చల్లుకుంటూ నడవడానికి వెనుకాడ లేదు.

కాపీ రైట్ హక్కులు రచయితవి. సమీక్ష పేరుతొ మొత్తం రాస్తే బాగుండదు. కనుక ఇంతటితో స్వస్తి.

అందరూ, ముఖ్యంగా జర్నలిజంలో చేరాలని ఆసక్తి వున్నవారందరూ చదవాల్సిన పుస్తకం. వెల: రు. 180/- (ముచ్చటగా ముద్రించిన తీరుకు ఇవ్వొచ్చు ఈ ఖరీదు) ఆన్ లైన్ లో దొరికే చిరునామా: Active Citizens Club, Flat 3-B, Sai Savitri Apartments, SBI Officers Colony, Bagh Amberpet, Hyderabad- 500013

తోక టపా:

ఉబెర్లో పడి ఇంటికి చేరి ఆత్రంగా పుస్తకం తెరిచి చూస్తే,  మొదటి పుటలోనే కర్రు కాల్చి పెట్టిన వాత.

“చదవాలని అనిపించిన ప్రతి పుస్తకం కొనతగ్గదే”

దటీజ్ రాజేశ్వర రావ్ !

(08-12-2025)




(08-12-2025)

2, డిసెంబర్ 2025, మంగళవారం

పెనం నుంచి పొయ్యి లోకి – భండారు శ్రీనివాసరావు

 

కొండ నాలుక్కి మందేస్తే వున్న నాలుక ఊడింది అనే నానుడి చందాన అయిందేమిటి అనిపించింది కొంతసేపటి క్రితం.
మా వీధి రోడ్డు మరమ్మతుల గురించి పోస్టు పెడితే మొత్తం మీద యంత్రాంగం చురుగ్గా కదులుతోందనే భావన కలిగింది, జరుగుతున్న పనులు చూసి. ఆ సంతోషంలోనే సంబంధిత అధికారులను, నాయకులను అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ మరో పోస్టు పెట్టాను.
ఈ రోజు కిందికి వెళ్లి చూస్తే పనివాళ్లు నిర్విరామంగా పనిచేస్తూ కాన వచ్చారు. వారి పిల్లలు అక్కడే ఆడుకుంటూ కనిపించారు. నాకూ వాళ్ళతో కాసేపు ముచ్చట్లు చెప్పాలని అనిపించింది. ఇద్దరూ కవల పిల్లలు లాగా వున్నారు. వాళ్ళ ఫోటో తీసి వాళ్లకు చూపిస్తే , అదోలా చూసారు కొంత ఆశ్చర్యంతో, శ్రీశ్రీ రాసిన ‘మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసాన హరివిల్లు విరిస్తే’ గేయాన్ని గుర్తుకు తెస్తూ.
ఈ లోగా నా ఆనందం ఆవిరయింది. మా పక్క వాటాలో వుండే రవిగారు వచ్చి, రోడ్డు మరమ్మతుల కారణంగా మంచి నీళ్ళ పైపు లైన్ దెబ్బతిని, నీళ్ళు లీక్ అవుతున్నాయని చావు కబురు చల్లగా చెప్పారు.
రోడ్డు వేసేది ఒక డిపార్ట్ మెంటు. వాటర్ పైప్ లైన్ల పర్యవేక్షణ మరో శాఖది. సంబంధిత అధికారులు ఎట్టకేలకు ఫోన్ లో అందుబాటు లోకి వచ్చారు. రోడ్డు కింద మూడు అడుగుల లోపున పైప్ లైన్లు వుంటాయని, మేము అరడుగు లోపలకి కూడా తవ్వలేదని, కాబట్టి ఈ లీకేజీతో మాకు సంబంధం లేదని ఒకరు తేల్చేశారు.
ఈ రోజు నీళ్ళు చాలా తక్కువ ప్రెషర్ తో రావడం వల్ల, పైపు దెబ్బతిన్నదేమో అనే అనుమానం కలిగిందని రవి గారి కధనం. ఈ విషయం చెప్పడానికి రవి గారు లా కాలేజీ దగ్గర వున్న వాటర్ వర్క్స్ ఆఫీసుకు వెళ్ళారు. సంబంధిత ఉన్నతాధికారి లేరు, రేపు వస్తారని వాకబు చేస్తే తెలిసింది. ఆయన నెంబరు నాకిచ్చి రవి గారు ఆయన పనిమీద వెళ్ళిపోయారు.
ఆ అధికారికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. తెలియని నెంబరు నుంచి కాల్ వస్తే ఆన్సర్ చేయడానికి నా లాగా ఆయన ఖాళీగా వుండే ఉద్యోగం చేయడం లేదు కదా! రెండు మూడు సార్లు చేసి ఊరుకున్నాను.
చిత్రంగా ఆయన నుంచి ఫోన్ వచ్చింది. ధన్యవాదాలు చెప్పి, విషయం వివరించాను. రేపు వాటర్ డే కాదు అని కూడా చెప్పాను. రేపు ఉదయం ఫస్ట్ అవర్ లో మా వాళ్ళు వస్తారు. సమస్య ఏమిటో తెలుసుకుని సరి చేస్తారు అని ఒక చల్లని మాట చెప్పారు.
లోగడే చెప్పాను కదా! పై వాళ్ళు సమస్య వింటే సామాన్యుడు సగం సమస్య తీరినట్టుగా సంతోషిస్తాడు. ప్రస్తుతం నేను అదే సంతోషంలో వున్నాను.
అన్నింటికీ మించి అక్కడ ఆడుకుంటున్న పసి పిల్లల నవ్వులే నాకు మరింత సంతోషాన్ని ఇచ్చాయి.
మన సమస్యలు సరే! ఎప్పుడూ వుండేవే. ఫోన్ చేస్తే కనీసం ఎవరో ఒకరు వింటున్నారు. కానీ ఈ పసిపాపల భవిష్యత్తు సంగతేమిటి? వారి సమస్యలు అనంతం.
వినేవాళ్ళు, చూసేవాళ్ళు, తీర్చేవాళ్ళు వున్నారా!
వుంటే అంతకంటే కావాల్సింది ఏమిటి?






02-12-2025

27, నవంబర్ 2025, గురువారం

ఎమ్మెల్యే అయి పది రోజులు కూడా కాలేదు, అప్పుడే....

 

మాది పేరుకు జూబిలీ హిల్స్ నియోజకవర్గం. కానీ ఎక్కువగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు నివసించే ప్రాంతాలు ఈ నియోజక వర్గంలో అనేకం వున్నాయి.

మూడు రోజుల క్రితం, నేను నివాసం వుండే (దీనికి అనేక పేర్లు వున్నాయి, ఎల్లారెడ్డి గూడా, ఇంజినీర్స్ కాలనీ, యూసుఫ్ గూడా వగైరా వగైరా) మధుబన్ అపార్ట్ మెంట్ సమీపంలో రాత్రివేళ బుల్ డోజర్లు పనిచేస్తున్న చప్పుడు వినిపించింది. ఈ ఏరియాలో హైడ్రా రంగనాద్ గారికి ఏమవసరం వచ్చిందా అనుకున్నాను.

తెల్లారి చూస్తే, మా రోడ్డు మొత్తం తవ్వేసారు. తవ్విన కాంక్రీటు/ తారు  పెళ్లలు ఒక పక్క గుట్టలు గుట్టలుగా పడి వున్నాయి. విచారిస్తే తెలిసింది ఏమిటంటే పాత రోడ్డు స్థానంలో కొత్త రోడ్డ్డు వేస్తున్నారని. వినగానే సంతోషం వేసింది. ఇన్నాల్టికి ఈ రోడ్డుకు మోక్షం కలిగిందని.

కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన నవీన్ యాదవ్ గారు, పదవిలోకి వచ్చి పది రోజులు కూడా గడవకముందే పనులు మొదలు పెట్టడం, అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టడం చూసి స్థానికులు కూడా సంతోషించినట్టు కనిపించింది.

అయితే, రోడ్డు తవ్విపోసినంత తేలిక కాదు, కొత్త రోడ్డు నిర్మించడం. తప్పకుండా కొంత సమయం తీసుకుంటుంది. అయితే ఎంత సమయం తీసుకుంటుంది  అనే విషయంలో స్పష్టత లేదు. రోడ్డు తవ్వే కాంట్రాక్టరు  తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. రోడ్డు వేసే వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే రోడ్డు తవ్వేయడంతో అపార్ట్ మెంట్లలో నివసించే వారి వాహనాలు బయటకు పోయే వీలు లేకుండా పోయింది. అత్యవసర వైద్యం కోసం వెళ్ళాల్సి వస్తే, అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ముందుగా చెప్పివుంటే ఎవరి ముందు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవడానికి వీలుండేది.

అభివృద్ధి పనులకు ఎవ్వరూ అడ్డం రారు. కానీ పౌరుల అవసరాలు కూడా గమనించి ముందస్తు సమాచారం ఇచ్చి వుంటే బాగుండేది. విద్యుచ్ఛక్తి శాఖ వాళ్ళు కరెంటు సరఫరాలో ఆటంకాలు ఎదురయితే, వినియోగదారులకు ఫోనులో ముందస్తు సమాచారం ఇస్తున్నట్టుగానే ఇలాంటి రోడ్డు తవ్వకాల విషయంలో చేయవచ్చు.

సమాచార లోపం వల్ల పౌరుల్లో అసహనం కలిగితే దాన్ని తప్పు పట్టలేము కదా!

(25-11-2025)  

 

ఈ పోస్టు పెట్టి రెండు రోజులు కూడా కాలేదు, కానీ ఎవరో చూసారు.

 

మా వీధిలో కొత్త రోడ్డు నిర్మాణానికి వున్న పాత రోడ్డును రాత్రి రాత్రి తవ్వి పోశారని మొన్ననే ఒక పోస్టు పెట్టాను. కొండ నాలుక్కి మందేస్తే అన్న చందాన అవుతుందేమో అనే భయసందేహాలు కూడా వ్యక్తం చేశాను. గత రాత్రి పదకొండు గంటలకు కూడా పరిస్థితిలో మార్పులేదు.

చిత్రం!  మళ్ళీ అర్ధరాత్రి చప్పుళ్ళు. తెల్లారి చూస్తే చిత్రం మారిపోయింది. రోడ్డు తవ్వి  గుట్టలు గుట్టలుగా పోసిన కంకర, కాంక్రీటు పెళ్లలు అన్నీ మాయం. పాపం రాత్రంతా పని చేసి నట్టున్నారు. మొత్తం మీద రోడ్డు నడకకు అనుకూలంగా మారింది.  రెండు మూడు రోజుల్లో పని పూర్తవుతుందని అక్కడ పనులు చూస్తూ రాత్రంతా నిద్ర లేక కునికిపాట్లు పడుతున్న సూపర్ వైజర్ చెప్పాడు.  

ఫేస్ బుక్ పోస్టులను సంబంధిత అధికారులు, నాయకులు  చూస్తుంటారా! ఏమో!

చూసినా చూడకపోయినా రోడ్డు ఒక రూపానికి వస్తోంది.

సంబంధిత అధికారులకు, సిబ్బందికి మరీ ముఖ్యంగా మహిళా కూలీలకు కృతజ్ఞతలు.  చంటి పిల్లల తల్లులు తమ పిల్లల్ని అక్కడే ఆటలకు వదిలేసి రోడ్డు మరమ్మతు కూలీ పనులు చేస్తున్న వారిని చూస్తుంటే, మన బాటల రాతలు  సరిచేస్తున్న వారి బతుకు బాటలు ఎప్పుడు బాగుపడతాయో అని బాధ వేసింది. వారికి చేతులెత్తి నమస్కరించి వచ్చేశాను.

కింది ఫోటోలు:

మొన్నటి రోడ్డు పరిస్థితి, నేటి రోడ్డు స్థితి:  



మొన్న 


నేడు 



 

 

(27-11-2025)          

22, నవంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (245) : భండారు శ్రీనివాసరావు

 

ముఖే ముఖే సరస్వతి
జీవితం నేర్పే పాఠాలు బహుచిత్రంగా వుంటాయి.
ఆసక్తి వుండాలే కాని జీవితం నుంచి ప్రతిరోజూ ఓ కొత్త పాఠం నేర్చుకోవచ్చు. వయస్సు దీనికి ఎంతమాత్రం అడ్డంకి కాదు.
జీవితం అన్నాక కుటుంబం ఒక్కటే కాదు. ఎంతోమంది మనకు తారసపడుతుంటారు. కొందరి గొప్పతనం వారి హోదాలను బట్టి, వారి వారి జీవనశైలిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
అధాటున కనబడి మళ్ళీ జీవితంలో కనబడరేమో అనే గొప్పవారు మరి కొందరు వుంటారు. వారి గొప్పతనం వారి హోదానిబట్టి కాదు, ప్రవర్తనను బట్టి తెలుస్తుంది.
నా జీవితంలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఇలా తమ ప్రవర్తన ద్వారా నన్ను బాగా ఆకట్టుకున్నారు. వృత్తి రీత్యా వాళ్ళు డ్రైవర్లు. నా వద్ద పనిచేసే వాళ్ళు కాదు, క్యాబ్ డ్రైవర్లు.
ఆకాశవాణి, దూరదర్శన్ లలో పనిచేసేరోజుల్లో ప్రైవేటు టీవీ చానళ్ళ చర్చాకార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ చేసిన అనంతరం మాత్రం అనేక ఛానళ్ళు నిర్వహించే చర్చల్లో పాల్గొంటూ ఉండేవాడిని. (వారానికి ఉదయం సాయంత్రం కలిపి పద్నాలుగు టీవీ చర్చలు. అలా ఓ పదేళ్లకు పైగా జీవితం బిజీ బిజీగా గడిచిపోయింది)
వీటికోసం ప్రతిరోజూ తెల్లవారుఝామునే లేచి తయారు కావాల్సివచ్చేది. నేనయితే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెళ్ళేవాడిని. కాని, నన్ను స్టూడియోలకు తీసుకు వెళ్లడానికి వచ్చే ఛానల్ కారు డ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి అలా పొద్దున్నే వచ్చే డ్రైవర్లకు కొంత ‘టిప్పు’ ఇవ్వడం అలవాటు చేసుకున్నాను.
ఈ డ్రైవర్లలో రకరకాల వయస్సుల వాళ్ళు వుంటారు. పొరుగుజిల్లాలనుంచి హైదరాబాదు వచ్చి స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని బతుకు బండి లాగించే వాళ్ళే వీళ్ళల్లో ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీగా నేను ఏనాడు అనుకోలేదు. వాళ్లు కూడా అపార్ధం చేసుకోలేదు. కొందరు యెందుకు సార్ ‘మా డ్యూటీ మేం చేస్తున్నాం’ అంటూ మృదువుగా అనేవారు.
కొంతకాలం క్రితం ఓ టీవీ స్టూడియో నుంచి తిరిగొస్తూ ఓ కూడలివద్ద సిగ్నల్ పడ్డప్పుడు నేను పర్సు తీసి డ్రైవర్ కు ఓ నోటు తీసి ఇచ్చాను. అతగాడు ఆ నోటు తీసుకుని జేబులో పెట్టుకోకుండ, అదే చేత్తో స్టీరింగు పట్టుకుని నడుపుతూ ఒక చోట కారు వేగం తగ్గించి, రోడ్డుపక్కన ఒక ముసలి బిచ్చగత్తె చేతిలో ఆ నోటు పెట్టాడు. అతని ప్రవర్తన చిత్రంగా అనిపించి నేను నోరు తెరిచేలోగా అతడు 'మాఫ్ కీజియే సాబ్’ అంటూ తన మనసులో మాట చెప్పాడు.
‘ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచయినా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు వుంటే నీకంటే అవసరం ఎక్కువ వున్నవాళ్ళకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడం అనేదే కొద్దిగా కష్టం. అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకోకండి’ అన్నాడు.
అనుకోవడానికి ఏముంది. ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను.
ఇక నసీర్ ఆలం! అతడికి తెలుగు రాదు, అతడి భాష నాకు రాదు. కానీ ఇద్దరం ఓ రోజు అనేక సార్లు ఫోనులో మాట్లాడుకున్నాం. అవసరం అన్ని పనులు చేయిస్తుంది అంటారు. నిజానికి ఈ అవసరం నాదీ కాదు, అతడిదీ కాదు. హరి అనే ఓ అనంతపూర్ పెద్దమనిషిది. అతనెవరో తెలియదు.
ఆ రోజు ఓలా క్యాబ్ లో ఇంటికి వస్తున్నాను. డ్రైవర్ పేరు నసీర్ ఆలం. ఒక మొబైల్ చూబెడుతూ ఏదో చెబుతున్నాడు. నాకు కొంత అర్ధం అయింది. చాలా కాలేదు. ఒక్కోసారి వేరే కస్టమర్లు ఫోన్ చేసి ఎంత దూరంలో ఉన్నదీ తెలుసుకోవడానికి క్యాబ్ డ్రైవర్లకు కాల్ చేస్తుంటారు. నాది పూల్ వ్యవహారం కాదు. అప్పుడే ఎక్కాను కనుక వేరే బుకింగులు అంత త్వరగా వచ్చే వీలు లేదు. మరి ఈ క్యాబ్ డ్రైవర్ మాటిమాటికీ ఎందుకు ఆ మొబైల్ నాకు చూబెడుతున్నాడు. అర్ధం కాని విషయం మనకెందుకని నేను నా నెట్లో మునిగిపోయాను.
ఇంతలో ఆ ఫోను మోగింది. డ్రైవర్ నాకిచ్చి మాట్లాడమని సైగ చేసాడు.
అవతల నుంచి ఆదుర్దాగా పలకరింపు. 'ఎవరూ నసీరా' అని.
అమ్మయ్య. తెలుగే. కాబట్టి జవాబు చెప్పాను. ‘నేను నసీర్ ను కాను, కానీ అతడిచ్చిన ఫోన్లో మాట్లాడుతున్నాను’
‘నా పేరు హరి. మా ఊరు నుంచి వచ్చిన స్నేహితుడు అనంతపూర్ వెడుతుంటే పంపడానికి క్యాబ్ బుక్ చేసాను. లగేజి దించుకోవడంలో కార్లో నా మొబైల్ మరచిపోయాను. మీరు మాట్లాడుతున్నది నా ఫోనే. ఇప్పుడు ఎక్కడ వున్నారు. నేను నాంపల్లిలో. మీరెక్కడ వున్నారు. ఇక్కడ నుంచి ఎంత దూరం, త్వరగా చెప్పండి’
స్వరంలో ఆదుర్దా తెలుస్తూనే వుంది.
నేను దాదాపు ఎల్లారెడ్డి గూడాలోని మాఇంటి దాకా వచ్చేసాను. అతడు రావడానికి శ్రీనగర్ కాలనీ చాలా దూరం.
‘ఒక పని చేయండి. మీరు అక్కడే వుండండి. ఈ క్యాబ్ డ్రైవర్ చాలా మంచివాడులా వున్నాడు. అడిగిచూస్తాను’
నెమ్మదిగా నాకొచ్చిన హిందీలో చెప్పాను. వాళ్ళు నాంపల్లి స్టేషన్ దగ్గర వున్నారు. నన్ను దింపిన తర్వాత అక్కడికి వెళ్ళగలవా. వెడతానంటే చెప్పు వాళ్లకు చెబుతాను’
‘తప్పకుండా. మిమ్మల్ని దింపగానే క్లోజ్ చేసుకుని వెడతాను’ అన్నాడా డ్రైవర్.
నేను హరి గారితో చెప్పాను. ‘మీ అదృష్టం బాగుంది. భాష రాకపోయినా మంచి డ్రైవర్ దొరికాడు. మీరు అక్కడే వుండండి’
ఎందుకయినా మంచిదని ఇద్దరి నెంబర్లు తీసుకుని, నా నెంబరు హరికి ఇచ్చి నేను నా ఇంటి వద్ద దిగిపోయాను.
అరగంట తర్వాత హరి నుంచి ఫోను అతడు ఇంకా రాలేదని.
నేను నసీర్ ఆలంకు ఫోన్ చేసి ఎక్కడ వున్నావని అడిగాను.
‘హై టెక్ సిటీ. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి క్లోజ్ చేసే లోపలే నాకు హై టెక్ సిటీ బుకింగ్ వచ్చింది. చేసేది లేక వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను సికిందరాబాదు వెడుతున్నాను. స్టేషన్ లో మా ఓలా ఆఫీసు వుంది. అక్కడ ఈ మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. వాళ్లకు చెప్పండి, నాకు తెలుగు రాదు’
ఆమాటే మళ్ళీ హరిగారికి చెప్పాను. సికిందరాబాదు వెళ్ళమని చెప్పాను.
వీళ్ళిద్దరూ కలుస్తారా! నాకయితే అనుమానం లేదు. నాకా డ్రైవర్ నిజాయితీ మీద యెనలేని నమ్మకం అప్పటికే ఏర్పడింది.
ఓ గంట గడిచింది. మళ్ళీ హరి నుంచి ఫోను.
‘చాలా థాంక్స్ అండీ. మొబైల్ దొరికింది. మీరు చెప్పినట్టే ఆ డ్రైవర్ చాలా మంచివాడు’
‘వున్నాడా! నేనూ థాంక్స్ చెబుతాను’
‘లేడండీ! మళ్ళీ బుకింగ్ వచ్చిందని వెళ్ళిపోయాడు’
నసీర్! నీ దగ్గర నుంచి మాలాంటివాళ్ళం నేర్చుకోవాల్సింది చాలా వుందయ్యా! అని మనసులో అనుకున్నాను.
(అతడి మొబైల్ నెంబర్: 9704248652)
మరో రోజు మరో క్యాబ్ లో.
పట్టుమని పాతికేళ్ళు వున్నట్టు లేవు. చేసేది డ్రైవర్ పని. ఇంటర్ చదివాడు. మునిసిపల్ కార్పొరేషన్ లో తాత్కాలిక ఉద్యోగం కొన్నాళ్ళు చేశాడు. అదీ ఒదిలేశాడు. జీతం చాలక కాదు. ఎక్కువై. వినడానికే వింత అనిపించేలా వున్నాయి అతడి మాటలు. నెలకు ఆరువేలు ఇచ్చేవారు. అదేమంత పెద్ద జీతం కాదు, కానీ అందుకు తగ్గ పని వుండేది కాదు, రెండు గంటలు పనిచేయడం, ఆరుగంటలు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం. ఆరువేలు తీసుకుని రోజుకు రెండు గంటలే పనిచేయడం అతడికి అస్సలు నచ్చలేదు. అందుకే ఒదిలేసి ఉబెర్ డ్రైవర్ పనిలో చేరాడు. పేరు మోడరన్ గా ప్రభాత్ కుమార్. కానీ కదిలిస్తే అన్నీ ఆధ్యాత్మిక భావాలు.
తీరిక దొరికినప్పుడల్లా ఇందిరా పార్కు దగ్గర రామకృష్ణ మఠంలో గడుపుతాడు. రామకృష్ణ ప్రభకు ఏడాది చందా కట్టాడు. కానీ రెండు నెలలు గడవక ముందే ఇల్లు మారాల్సి వచ్చింది. ఆ పత్రిక చదవకపోతే అతడికి తోచదు. అందుకని మళ్ళీ వెళ్లి కొత్త చిరునామాతో మరో ఏడాది చందా కట్టాడు. నిజానికి ఆ పత్రిక తిరగేయడానికి ఎంతో టైం పట్టదు. కానీ అతడు తిరగేయడు. చదువుతాడు. అదీ మనసు పెట్టి. కొత్తా పాతా తేడా లేకుండా ఆ మాసపత్రికను నెలంతా చదువుతూనే ఉంటాడు. చదివినదే అయినా మరోసారి, మరోసారి, అలా చదువుతూనే ఉంటాడు.
బిజినెస్ మేనేజ్ మెంట్ లాగా ఫ్యామిలీ మేనేజ్ మెంట్ కోర్సులు పెట్టాలంటాడు. చిన్నాభిన్నమైపోతున్న కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలంటే అలాంటి చదువులు అవసరమంటాడు ప్రభాత్ కుమార్.
చిన్నవాడయినా మంచి మాట చెప్పాడు.
ఉబెర్ డ్రైవర్ పుణ్యమా అని ఓ కొత్త పాఠం నేర్చుకున్నాను.
కానీ పాటిస్తున్నానా! ఏమో అనుమానమే!
కింది ఫోటో
క్యాబ్ డ్రైవర్ ప్రభాత్ కుమార్





(ఇంకా వుంది)

18, నవంబర్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (244) : భండారు శ్రీనివాసరావు

 

రేడియోలో కార్యశూరులు
అంకిత భావంతో చేసే పనిలో కష్టం కనిపించదు. దానికి అనురక్తి తోడయితే అలసట అనిపించదు. ఫలితాలు అద్భుతంగా వుంటాయి. ఇలా పనిచేసే కార్యశూరులు ప్రభుత్వ శాఖల్లో చాలా తక్కువ అనే అభిప్రాయం అనేక మందిలో వున్న మాట కూడా వాస్తవం. నేను బహుకాలం పనిచేసిన ఆలిండియా రేడియో సైతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనిదే. అయినా కార్యశూరులకు అక్కడ కూడా కొరత లేదని నా అనుభవమే నాకు చెప్పింది. మాతృసంస్థ పట్ల మమకారంతో చెబుతున్న విషయం కాదిది. 26 ఏళ్ళ నాటి సంగతి.
విజయవాడ రేడియో ప్రాంతీయ వార్తావిభాగం న్యూస్ ఎడిటర్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన శ్రీ ఎం.వి.ఎస్. ప్రసాద్ స్వానుభవం ఆయన మాటల్లోనే....
"1999 అక్టోబర్ 25.
మధ్యాహ్నం 12 కావస్తూంది.
ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో
అప్పుడే మధ్యాహ్నం వార్తల కోసం టెలిప్రింటర్ చూస్తున్న నేను ఒక వార్త చూసి అదిరిపడ్డాను.
“ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎస్. రాజేశ్వరరావు గారు కన్నుమూశారు”
ముందు కంగు తిన్నా, మెదడు చురుగ్గా పనిచేసింది.
ఒక్క ఉదుటున డ్యూటీ రూం కు పరుగెత్తి అనౌన్సర్ ఎవరున్నారు? అని అడిగాను.
ఎస్బీఎస్ఎం (చాల చోట్ల సహోద్యోగులను ఇలా పొట్టి పేర్లతో పిలిచే సంప్రదాయం సాధారణ విషయమే) అన్నారు.
అమ్మయ్య! అనుకొని స్టుడియోలోకి పరుగెత్తాను.
రామం గారు రికార్డులు సర్దుకుంటున్నారు.
"సార్! రాజేశ్వరరావు గారు పోయారండి!" అని చెప్పాను.
"అయ్యో!" అన్నారు.
"అర్జెంటుగా ఆయన పాటల పల్లవులు కొన్ని టేపులో ఎక్కించాలి సార్!" అని అభ్యర్ధించాను.
మరోమాట లేకుండా "పదండి" అంటూ నన్ను లైబ్రరీలోకి తీసుకు వెళ్ళారు.
"ఏం పల్లవులు కావాలి?" అన్నారు.
ఏవని చెప్పను? అన్నీ ఆపాతమధురాలే మరి!
సరే, అటు సాంఘికాలు, ఇటు పౌరాణికాలు. ఓ పదిహేను పాటలు కాబోలు గబగబా చెప్పాను.
అంతే వేగంగా ఆయన ఆ రికార్డులు వెతికి తీశారు.
"ఒక్కోపాట పల్లవి మాత్రం చాలు సార్, గ్యాప్ లేకుండా వరసగా టేప్ పైకి ఎక్కించండి" అని కోరాను.
"ఆగండి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడెప్పుడో ప్రత్యేక జనరంజనిలో రాజేశ్వరరావు గారి గురించి చెప్పారు కదా, అది కూడా ఇస్తాన"ని దానికోసం గాలించడం మొదలుపెట్టారు.
నేను మళ్ళీ వార్తా విభాగంలోకి పరుగెత్తి న్యూస్ రీడర్ కి "ఈరోజు ఐదు నిమిషాలకు సరిపడా వార్తలు రాయండి, చాలు. మొదటి ఐదు నిమిషాలు నేను రాసిస్తాను" అని చెప్పాను.
సమయం 12-40 దాటింది.
(మా ప్రాంతీయ వార్తలు 1-20 కి మొదలవుతాయి)
గబగబా జ్ఞాపకశక్తిపై ఆధారపడి రాజేశ్వరరావు గారి గురించి, ఆయన పాటల విశిష్టత గురించి రాస్తూ పోయాను.
"సార్ మొదటి సగం వార్తలు ఏవి?" అని అడిగాడు మా న్యూస్ రీడర్.
సమయం ఒంటిగంట దాటింది.
ఇదుగో అంటూ హెడ్ లైన్స్ చెప్పాను.
1-15 అయింది. అయిదే నిమిషాలు మిగిలింది.
ఇద్దరం స్టుడియోలోకి పరుగెత్తాము..
రామం గారు అప్పుడే వచ్చారు, రెండు టేపులతో.
ఒకటి పాటల పల్లవులు, రెండోది బాలు గారి ట్రిబ్యూట్ అని చెప్పారు.
న్యూస్ రీడర్ కి అంతా అయోమయంగా ఉంది.
వార్తలు చదవడం ప్రారంభించాడు.
"ప్రఖ్యాత సంగీత దర్శకులు రాజేశ్వరరావు గారు కన్నుమూశారు" అనగానే నేపథ్యంలో మెల్లగా ఆయన పాటల పల్లవులు మొదలైనాయి, "వినిపించని రాగాలే" అంటూ.
న్యూస్ రీడర్ రాజేశ్వరరావు గారి గురించి చదువుతున్నంతసేపూ అవి కొనసాగాయి.
"రాజేశ్వరరావు గారికి SP బాలసుబ్రహ్మణ్యం నివాళి అర్పిస్తూ" అనగానే బాలు గారి గళం వినిపించాము.
ఒకే వార్త ఇలా ఐదు నిమిషాల పాటు చదవడం చాలా అరుదు.
"వార్తలు సమాప్తం" అనగానే రామం గారికి ధన్యవాదాలు చెప్పి వార్తా విభాగం లోకి వచ్చాను.
ఫోన్ ఆగకుండా మోగుతోంది.
శ్రోతలు అభినందిస్తుంటే నాకూ కన్నీరు ఆగలేదు.
ఈ ఘనత రామం గారిది!
అంత స్వల్ప వ్యవధిలో అన్ని పల్లవులు పేర్చి, వాటికి బాలుగారి నివాళి జతచేర్చి అందించడం ఆయనకు మాత్రమే సాధ్యం!
ఈ వార్తలు విన్న ఓ పత్రికా ప్రముఖుడు "అంత తక్కువ సమయంలో బాలు గారిని ఎలా పట్టుకొని, ట్రిబ్యూట్ సంపాదించారండి?" అంటూ నివ్వెర పోయాడు.
అది దేవరహస్యం అని నవ్వాను!
ఈ వార్తలు విన్న మిత్రులెవరో బాలు గారికి ఫోన్ చేసి "రాజేశ్వరరావు గారికి మీ నివాళి ఇప్పుడే రేడియోలో విన్నాము, చాలా బాగుంది" అని చెప్పేసరికి ఆయన నిర్ఘాంతపోయారు!
తర్వాత నేను కలిసినపుడు, ఈ సంగతి చెప్పి "నీ దుంపతెగ! అదెక్కడ సంపాదించావురా" అని అడిగారు. ఇప్పటిది కాదులెమ్మని చెప్పేసరికి పకాలున నవ్వారు!"
(ఈ వార్తాప్రసార కథానాయకుడు, కార్య సాధకుడు ఏమ్వీఎస్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు)
కింది ఫోటో:
కీర్తిశేషులు ఎస్. రాజేశ్వర రావు



(ఇంకావుంది)

13, నవంబర్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (243) : భండారు శ్రీనివాసరావు

సాయి గీత
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు రిటైర్ అయిన తర్వాత శేష జీవితం పుట్టపర్తిలో గడిపారు. ఆయన ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకయితే ఇప్పటికీ అర్ధం కాదు.
హైదరాబాదులో వరుసగా అయిదుగురు ముఖ్యమంత్రులకు పీఆర్వోగా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా, సమాచార శాఖ డైరెక్టర్ గా పెద్ద హోదాల్లో పనిచేసిన ఆయన, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, ఒక వయసు వచ్చిన తర్వాత వానప్రస్థాశ్రమం మాదిరిగా అన్నీ వదులుకుంటూ అక్కడికి చేరాడేమో అనిపిస్తుంది.
ఒకసారి హైదరాబాదు నుంచి పుట్టపర్తి వెళ్ళాము.
ప్రధాన వీధిలో ఆశ్రమానికి కొంచెం దూరంగా ఓ చిన్న డాబా ఇల్లు. ఇరుకు దారి. చిన్న చిన్న మెట్లెక్కి వెళ్ళాలి. ఒకటే గది. అందులోనే ఓ పక్కగా గ్యాస్ స్టవ్. వంట సామాను.
ఊరుఊరంతా ఎక్కడ చూసినా సత్య సాయిబాబా ఫోటోలు. చిత్రం! మా అన్నయ్య, వదిన వుంటున్న గదిలో ఒక్కటీ లేదు.
ఒకప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి పరమహంస గారితో సన్నిహిత పరిచయం. వారికి బాబాగారు సన్నిహితులు. ఆశ్రమం లోపల కాటేజీ సంపాదించుకోవడం పెద్ద పని కాదు. కానీ అలాంటివి అన్నయ్యకు ఇష్టం వుండవు.
ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా మా అన్నయ్యా, వదిన నడిచే తిరిగేవారు.
ఇలా అవసరాలు తగ్గించుకుంటూ, అనవసరాలను వదిలించుకుంటూ జీవితం గడపడానికి ఎంతో మానసిక పరిణితి వుండాలి.
సాయంకాలం ఆశ్రమంలో భజనకు వెళ్ళే వాళ్ళు. ముందు వరసలో కూచునే వీలు వున్నా, కావాలని వెళ్లి చిట్టచివర గోడనానుకుని కూచునేవాడు. బాబాని కలుసుకోగల అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు.
భజన సమయం మినహాయిస్తే పగలూ రాత్రీ ఆ గదిలో కింద కూచుని, కాలు మీద కాలు వేసుకుని, తొడమీద కాగితాల బొత్తి పెట్టుకుని అనేక ఆధ్యాత్మిక పత్రికలకు వ్యాసాలు రాస్తుండే వాడు. దగ్గరలోని ఓ దుకాణంలో కాగితాలు కొంటూ వుండే వాడు. ఒకసారి ఆ షాపువాడు ఎవరితోనో అంటుంటే ఆ మాటలు మా వదిన చెవిలో పడ్డాయి.
“ఎవరండీ ఈయన. ఎప్పుడు వచ్చినా దస్తాలకు దస్తాలు కొనుక్కుని వెడతారు.”
అసలు సాయిగీతతో కదా మొదలు పెట్టింది. పుట్టపర్తిలో వున్నప్పుడు అన్నయ్య రాసిన అనేక రచనల్లో ఇదొకటి. దీనికి కొంత పూర్వ రంగం వుంది.
భగవాన్ సత్య సాయి బాబా తన జీవిత కాలంలో చేసిన అనేకానేక అనుగ్రహ భాషణల్లో జాలువారిన హితోక్తులను, సూక్తులను అంశాల వారీగా వడపోసి, ఒక్క చోట గుదిగుచ్చి, భగవద్గీతలో మాదిరిగా అధ్యాయాలుగా విడగొట్టి టీకా టిప్పణి (టీక అంటే ఒక పదానికి గల అర్థం. టిప్పణి అంటే టీకకు టీక. అంటే అర్థాన్ని మరింత వివరించి సుబోధకం చేయడమన్నమాట) తో సహా తయారు చేసిన బృహత్ గ్రంధం అది. నిజానికి బృహత్తర కార్యక్రమం. బాబా గారి ప్రసంగాల టేపులు తెప్పించుకుని వినాలి. వింటూ నోట్స్ రాసుకోవాలి. వాటిని ఓ క్రమంలో అమర్చుకోవాలి. ప్రూఫులు కూడా దిద్దుకుని మేలు ప్రతి సిద్ధం చేసుకోవాలి.
ఇంత ప్రయత్నం సాగిన తర్వాత కూడా పడ్డ శ్రమ అంతా బూడిదలో పన్నీరు అయ్యే అవకాశాలు హెచ్చుగా వున్నాయి.
బాబా గురించి లేదా ఇతరులు రాసిన రచనలు సత్యసాయి ట్రస్టు ప్రచురించాలి అంటే వాటికి బాబా గారి ఆమోదం వుండి తీరాలి.
అందుకోసం పరమ హంస గారు చాలా శ్రమపడి ఆ పుస్తకాన్ని డీటీపీ చేయించి, కవర్ పేజీతో సహా డమ్మీ కాపీని తయారు చేయించి, ఒక రోజు భజన ముగించి బాబా విశ్రాంతి మందిరంలోకి వెళ్ళే సమయంలో ఆ డమ్మీ కాపీని బాబా చేతుల్లో ఉంచారు. బాబా ఆ పుస్తకంలో కొన్ని పుటలు పైపైన చూస్తూ, ఏమీ చెప్పకుండా దాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయారు. అంతే!
మళ్ళీ బాబా ఆ ప్రసక్తి తెచ్చే వరకు ఆ ప్రస్తావన ఆయన ముందుకు తెచ్చే వీలుండదు.
రోజులు గడిచిపోతున్నాయి కానీ బాబా దాన్ని గురించి మాట్లాడక పోవడంతో ఇక అది వెలుగు చూసే అవకాశం లేదు అని నిరుత్సాహ పడుతున్న సమయంలో, హఠాత్తుగా ఒక రోజు బాబా ఆ పుస్తకం డమ్మీ కాపీని పరమహంస గారికి ఇచ్చి, ‘వేరెవరో ఎందుకు మనమే దీన్ని ప్రింట్ చేద్దాం’ అన్నారు. ఆ విధంగా సాయి లీల పుస్తకాన్ని సత్యసాయి పబ్లికేషన్స్ వారే ప్రచురించారు. బాబా నోటి వెంట వెలువడిన సూక్తులు కాబట్టి అన్నయ్య ఆ పుస్తకం మీద కనీసం సంకలన కర్త అనికూడా తన పేరు వేసుకోవడానికి సమ్మతించలేదు. సాయిగీత ప్రతులన్నీ అమ్ముడు పోయాయి. ఆసక్తి కలిగినవారికోసం దాని లింక్ vedamu.org అనే వెబ్ సైట్ లో ఉంచినట్టు పరమహంస గారు చెప్పారు.
ఆధ్యాత్మిక విషయాల్లో అన్నయ్య అనురక్తిని గమనించి సత్య సాయి పబ్లికేషన్స్ వారు ప్రచురించే సనాతన సారధి బాధ్యతలు అప్పగించాలని కొన్ని ప్రయత్నాలు జరిగినా, దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. రాయడం అనే బాధ్యత తప్పిస్తే వేరే బాధ్యతలు మోసే ఆసక్తి తనకు లేదని చెప్పారు. బాబాని చూడడానికి పుట్టపర్తికి వచ్చే విదేశీయులకు తెలుగు నేర్పే బాధ్యతను అన్నయ్య స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారని, ఇంగ్లీష్ తెలిసిన తమకు ఇంగ్లీష్ లోనే తెలుగు నేర్పేందుకు ఆయన ఎంచుకున్న పద్దతులను ఒక విదేశీ మహిళ డాక్యుమెంట్ చేసింది కూడా.
విషాదం ఏమిటంటే, భౌతికపరమైన సంపదలను ఆయన కూడబెట్టలేదు, దాచుకోలేదు. అలాగే ఆధ్యాత్మిక పరమైన రచనలు ఎన్నో చేసి వాటిని కూడా దాచుకోలేదు.
నేటి భౌతిక ప్రమాణాల ప్రకారం నిర్ధనుడుగా దాటిపోవడం బాధ్యతారాహిత్యమే కావచ్చు. నైతిక విలువల కోణంలో చూస్తే అది తప్పనిపించదు. ఆయన చూపించి వెళ్ళిన దారిలో మేము కొంత దూరం నడవగలిగినా జన్మధన్యమే.
కాకతాళీయమే కావచ్చు, 480 పేజీల సాయిగీత పుస్తకంలో ఆఖరి వాక్యం ఇలా రాశాడు:
శ్రీరస్తు! శుభమస్తు! విజయోస్తు! ‘సాయి’జ్య సాయుజ్య ప్రాప్తిరస్తు!
ఒకరోజు పరమహంస గారు వాళ్ళ ఇంటికి వచ్చారని మా అన్నయ్య కొడుకు రఘు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించి పలకరించాడు. నేను సహజంగానే గుర్తు పట్టలేదు. అతడు గతంలో సీ ఎం పేషీలో పనిచేసేవాడట. ‘పర్వతాలరావు గారు ఎలా వున్నారు. పెద్దవారై వుంటారు. బాగున్నారా’ అని అడిగాడు. చనిపోయి దాదాపు ఇరవై ఏళ్ళు కావస్తున్నా, ఆయన చనిపోయిన సంగతే చాలామందికి తెలియదు. అంటే ఆయన మరణించలేదన్న మాట. అతడే ఈ వ్యాసానికి స్పూర్తి.
కింది ఫోటో :
మా ఇంటి ఇలవేలుపు మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు