2, జులై 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (188) : భండారు శ్రీనివాసరావు

 నదీనాం సాగరో గతి

జులై నాలుగు.
అమెరికా స్వాతంత్ర దినోత్సవం. అతి పెద్ద పండుగ. ప్రధానమైన వేడుక జరిగేది దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ లో అయినా, దేశంలోని అన్ని రిపబ్లిక్ లలో కన్నుల పండుగగా ఈ సంబరం జరుపుకుంటారు.
తీరిక సమయాల్లో మీరేం చేస్తారు అని ఏ అమెరికన్ ని అయినా వచ్చే జవాబు ఒకటే అని నాకనిపిస్తుంది. తీరిక సమయంలో కాదు, తీరిక చేసుకుని మరీ తిరుగుతుంటామనేది వారి సమాధానం. శుక్రవారం సాయంత్రం నుంచి కార్లలో బయలుదేరి ఏదో ఒక పర్యాటక ప్రాంతంలో కాలక్షేపం చేసి మళ్ళీ సోమవారం పని వేళలకు ఇళ్లకు చేరుకుంటారు కాబోలు అనిపించేలా దేశంలోని ప్రధాన రహదారులన్నీ కార్లతో బారులు తీరతాయి. సముద్ర తీరాలు ఉన్న ప్రాంతాలు అయితే, చిన్నదో పెద్దదో ఒక మోటారు బోటును తమ కారుకు తగిలించుకుని వారాంతాలు సముద్రయానాల్లోనో, ఫారెస్ట్ క్యాంపుల్లోనో గడుపుతారు. ఆ సమయంలో వాళ్లకు వయసు గుర్తుకు రాదు.
నాలుగో తేదీ అమెరికన్ ఇండిపెండెన్స్ డే కారణంగా లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి నాలుగు రోజులు పోర్ట్ లాండ్ లో గడపాలని సందీప్ తలపెట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చాలా రోజులు ముందుగానే చేశాడు. ఒక స్నేహితుడి కుటుంబం కూడా జాయిన్ అవుతుంది కాబట్టి అన్ని వసతులు వున్నఒక పెద్ద బంగళాను అద్దెకు తీసుకున్నాడు. అక్కడ బస అయిదు పగళ్ళు, నాలుగు రాత్రులు. రేపు మూడో తేదీన రోడ్డు మార్గంలో బయలుదేరి పోర్ట్ లాండ్ ప్రయాణం.
గతంలో ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం అమెరికా వచ్చినప్పుడు ఆ ఏడాది మా పెళ్లి రోజును పురస్కరించుకుని పసిఫిక్ సముద్రపు ఒడ్డున డిపో బే అనే టూరిస్టు పట్టణంలో ఇలాగే మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు గడిపేలా చేసిన ఏర్పాట్లు గుర్తుకు వచ్చాయి. ఆ ప్రయాణంలోనే మేము అనేక వింతలు చూశాము.
పసిఫిక్ సముద్ర తీరం పొడవునా కొన్ని వందల మైళ్ల దూరం నిర్మించిన విశాలమయిన రహదారి వెంట కారులో వెడుతుంటే ఎత్తైన చెట్ల నడుమనుంచి అతి పెద్ద ఆ మహాసముద్రం దోబూచులాడుతున్నట్టు దోవపొడుగునా కానవస్తూనే వుంటుంది.
వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్ నుంచి ఆరెగన్ రాష్ట్రంలోని డీపోబే టూరిస్ట్ రిసార్ట్ కు చేరడానికి ఆరేడు గంటలు పట్టింది.
మధ్యలో ఒక పార్కులో ఆగి ఓ చెట్టు కింద కూర్చుని ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర లాగించాము. డీపోబే లో అయిదు గదులు వున్న ఒక ఇంటి మొత్తాన్ని నెట్లో బుక్ చేయడం వల్ల, కార్లో వున్న జీ పీ ఎస్ సిస్టం సాయంతో ఆ ఇంటిని తేలిగ్గానే పట్టుకోగలిగాము.(అప్పటికి ఈ టెక్నాలజీ కొత్త) మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో వున్నట్టు ఆ ఇంటి తాళం చెవిని ఇంటి ముందువున్న ఒక చిన్న లాకరులో భద్రపరిచారు. ఒక కోడ్ నెంబరు ద్వారా దాన్ని తెరిచి తాళం చెవి తీసుకుని లోపల ప్రవేశించాము.
మూడంతస్తుల భవనం. కింద రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి షెడ్డు వుంది. పైన విశాలమయిన డ్రాయింగ్ రూముతో పాటు గ్యాస్, డిష్ వాషర్, వంట సామాగ్రి, ప్లేట్లు గ్లాసులతో సహా అన్ని వసతులతో కూడిన కిచెన్ వుంది. పదిమంది భోజనం చేయడానికి వీలయిన డైనింగ్ టేబుల్, అతి పెద్ద ప్లాస్మా టీవీ, ఫైర్ ప్లేస్, సోఫాలు వున్నాయి. పైన పడక గదులు, ఒక పక్కన బాల్కానీలో ‘హాట్ టబ్’ ఏర్పాటు చేసారు. అయిదారుగురు కలసికట్టుగా అందులో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. వెచ్చటి నీటి ధారలు అతి వేగంగా చిమ్ముతూ అన్నివైపులనుంచి శరీరాలను తాకుతూ మసాజ్ చేస్తుంటాయి. అందులోకి దిగిన తరవాత పిల్లలకూ పెద్దలకూ కాలం తెలియదు. చల్లని సముద్రతీరంలో వెచ్చగా జలకాలాడడం అదో అనుభూతి.
స్నానపానాదులు ముగించుకుని, డీపోబే టూరిస్ట్ రిసార్ట్లో వింతలూ విశేషాలు చూస్తూ, అతి దగ్గరలో అలలతో తీరాన్ని తాకుకుతున్న అతి పెద్ద మహాసముద్రాన్ని తిలకిస్తూ కలయ తిరిగాము.
పసిఫిక్ మహా సముద్రం అంటే శాంతిసముద్రమని చదువుకున్నట్టు గుర్తు. కానీ, ‘ఈ పాయింట్ దాటి వెళ్ళవద్దు. అతి పెద్ద అలలు హఠాత్తుగా విరుచుకు పడే ప్రమాదం వుంది.’ అనే హెచ్చరిక బోర్డు కనిపించింది. సునామీలు సృష్టిస్తున్న ప్రమాదాల నేపధ్యంలో ఇలాటి హెచ్చరిక బోర్డులు పెడుతున్నారని తెలిసింది. మేమున్న చోటికి కొన్ని మైళ్ల పరిధిలో ఫ్లారెన్స్, న్యూ పోర్ట్, లింకన్ సిటీ వంటి పట్టణాలు వున్నాయి. ఇవన్నీ టూరిస్ట్ రిసార్టులే. వారికి కావాల్సిన అన్ని వసతులూ పుష్కలంగా వున్నాయి. దేనికోసం వెదుక్కోవాల్సిన అవసరం వుండదు.
ప్రతిచోట ఏదో ఒక ప్రత్యేక ఎట్రాక్షన్ . ఒకచోట సముద్ర గర్భంలో జలచరాల జీవనం ఎలా వుంటుందో తెలియచెప్పే ఆరెగన్ స్టేట్ ఆక్వేరియం చూసాము.
షార్కులు, డాల్ఫిన్ లు, ఆక్టోపస్ లు, ఆనకొండల మధ్య తిరుగుతూ పొద్దు తెలియకుండా గడిపాము.
జీ పీ ఎస్ సిస్టం పుణ్యమా అని దారి కోసం ఎవరినీ దేవులాడాల్సిన పని అంతకన్నాలేదు. అందువల్ల యెంత తెలియని ప్రదేశానికి వెళ్ళినా ‘దారి తప్పే ప్రమాదం’ ఎంతమాత్రం వుండదు.
అతి చిన్న నది
లింకన్ సిటీ సముద్ర తీరంలో ఒక ‘బుల్లి’ అద్భుతాన్ని కూడా చూసాము. నిజానికి అది అద్భుతమేమీ కాదు. దేన్నయినా టూరిస్ట్ ఎట్రాక్షన్ గా అమెరికన్లు ఎలా మార్చుకుంటారనడానికి ఇది మరో ఉదాహరణ.
‘ప్రపంచంలో అతి ’పొట్టి’ నదిని ఇక్కడ చూడవచ్చు’ - అన్న బోర్డు చూసి దాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహపడ్డాము. తీరా చూస్తే అదొక పిల్ల కాలువలా వుంది. తీరం పక్కన రోడ్డుకు ఆవల వున్న కొండల్లో పుట్టి సముద్రంలో కలుస్తున్న నది అని తెలిసింది. దాని పొడవు కేవలం 440 అడుగులు. దాన్ని దొరకబుచ్చుకుని టూరిస్ట్ ఆకర్షణగా మార్చివేసారు. ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే, ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కలుస్తున్న చోట కాలు పెడితే, గడ్డ కట్టేంత చల్లగా వుంటాయి.
సియాటిల్ తిరిగి వచ్చేటప్పుడు మార్గం మార్చుకుని పసిఫిక్ తీరంలో వున్న మరో పెద్ద టూరిస్ట్ రిసార్ట్ కానన్ బీచ్ కి వెళ్లి ప్రపంచ ప్రసిద్ది పొందిన ‘హేస్టాక్ రాక్’ ని చూసాము. సముద్రంలో వుండే ఈ కొండ, సముద్రాన్ని చీల్చుకు పైకి వచ్చిందా అన్నట్టుగా వుంటుంది. దాన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేసారు. మేము వెళ్ళిన రోజు సముద్రం ఎందుకో లోపలకు వెళ్ళిపోయి ఆ కొండ వరకూ వెళ్ళడానికి వీలుచిక్కింది.
అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఇది అరుదైన విషయమే. వేలమంది ఆ వింతను చూడడానికి రావడంతో ఆ బీచ్ అంతా ఎంతో కోలాహలంగా కానవచ్చింది. మనవైపు ఏటి వొడ్డున ఇసకలో గుజ్జన గూళ్ళు కట్టినట్టు అక్కడ పిల్లలందరూ ఆ తీరంలో ఇసుకతో పెద్ద పెద్ద ప్రాకారాలు నిర్మించి ఆడుకోవడం గమనించాము. ఇందుకు అవసరమయిన పరికరాలన్నీ వారు వెంట తెచ్చుకున్నట్టున్నారు. ఇవికాక అనేక రకాల ఆకారాలతో పెద్ద పెద్ద పతంగులు (గాలిపటాలు) ఎగురవేస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు వందల సంఖ్యలో కనిపించారు.
చూసినవాటిని మనస్సులో భద్రపరచుకుంటూ సియాటిల్ రోడ్డు ఎక్కాము.
కింది ఫోటోలు: (పదిహేను ఏళ్ల నాటివి)
పసిఫిక్ సముద్ర తీరంలో విహార యాత్ర.














(ఇంకా వుంది)

1, జులై 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (187) : భండారు శ్రీనివాసరావు

మీ పేరు త్రినాధ్ కదూ!

అన్ని రోజులకు ఒకటికి మించిన పేర్లు ఉన్నట్టే ఒకరోజు స్టేట్ బ్యాంక్ డే.
రిటైర్ అయి పుష్కరం దాటింది. ఆ కాలంనాటి రాతలు, కోతలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్. అన్నీ కంప్యూటర్ల మీదే. అయినా ప్రతిదానికీ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు మాత్రం తప్పడం లేదు. అదృష్టం! ఎవరూ దక్షిణలు అడగడం లేదు.
పెన్షన్ స్లిప్ మెయిల్ లో పంపారు. వివరాలు అన్నీ సరిగానే వున్నాయి. కానీ పెన్షన్ నామినీ కాలంలో మా ఆవిడ పేరు లేదు. పెళ్లి నాడు కూడా ఇద్దరం కలిసి ఫోటో దిగలేదు కానీ, రిటైర్ అయ్యేముందు పెన్షన్ పుణ్యమా అని ఇద్దరం పొలోమని స్టూడియోకి వెళ్లి మరీ ఫోటో తీయించుకుని ఆఫీసులో ఇచ్చాము. తీరా ఇప్పుడు చూస్తే నామినీ పేరు గల్లంతు.
ఇలాటి విషయాల్లో కాలయాపన పనికిరాదు అనే మా మాజీ స్టేషన్ డైరెక్టర్ శాస్త్రి గారి మాట విని కోటీలోని స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. 1975లో రేడియోలో చేరినప్పటి నుంచి ఈనాటి వరకు నా అక్కౌంటు అక్కడే, ఎన్. మధుర బాబు గారు సీనియర్ బ్రాంచ్ మేనేజర్. అప్పట్లో అన్నీ మానవ సంబంధాలు. స్లిప్పు రాయడం, టోకెన్ తీసుకోవడం, మన నెంబరు పిలిచినదాకా ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెబుతూ కాలక్షేపం చేయడం, లేదా బ్రాంచి మేనేజర్ దగ్గర భేటీ వేయడం అలా కాస్త కాలక్షేపం, కాస్త స్వకార్యం. ఇప్పడు అలా లేదు. ఒక పెద్ద అధునాతన ఎయిర్ పోర్ట్ మాదిరిగా వుంది.
అన్నీ కంప్యూటర్లు, వాటి వెనక కనీకనపడక సిబ్బంది తలకాయలు. పనిచేస్తున్నారో, సెల్ ఫోన్లు చేస్తున్నారో తెలవదు. అంతా హడావిడి. బయట కస్టమర్లది కూడా అదే తంతు. ఒకరికొకరు తెలవదు, ఎవరికి వారికి తమ పని ముందు చక్కబెట్టుకుని చక్కా పోవాలనే ఆత్రుత.
‘చివరికి ఇక్కడ కాదు, పెన్షనర్ల విభాగం మరో పక్కన ఇదే ఆవరణలో వుంది, అక్కడికి వెళ్లండని చల్లగా కబురు. ఆ బిల్డింగు పెద్ద పెద్ద పొడవాటి మెట్ల వరుసతో చాలా అందంగా, అధునాతనంగా వుంది. మొదటి అంతస్తులో వుంది ఈ విభాగం. మా ఆవిడను తీసుకుని వెళ్ళిన రోజు జనం లేరు, ఖాళీగా వుంది. బయట రిసెప్షన్ లో ఎవరూ లేరు. గాజు తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లి అక్కడ ఒకర్ని వాకబు చేసాను. అతడు ఆశ్చర్యంగా నా వంక చూసి, ‘ఇక్కడి దాకా ఎలా వచ్చారు. లోపలకు ఎవరూ రాకూడదు, బయట రిసెప్షన్ వరకే మీకు అనుమతి’ అంటూ నాకు ఓ క్లాసు పీకాడు. బయటకు వచ్చి చూస్తే రిసెప్షన్ సీటు ఖాళీగా వుంది. కాసేపటికి ఒకావిడ వచ్చి అక్కడ నిల్చుంది. ఆవిడ ఉద్యోగా, నాలాగా వచ్చిన మనిషా అని తేరిపార చూస్తుంటే, ఆవిడ కళ్ళు విప్పార్చి ‘ఏం కావాలి’ అని అడిగింది. వెళ్లి చెప్పాను. పేరు, అక్కౌంట్ నెంబరు వివరాలు అడిగి తెలుసుకుంది. నేను, ‘మా ఆవిడ మా ఆవిడే’ అనడానికి నాదగ్గర ఉన్న అన్ని ఆధారాలు అంటే ఆధార్ కార్డు, పెన్షనర్ కార్డు, ఏళ్ళతరబడి అదే బ్యాంకులో ఉన్న బ్యాంకు జాయింటు అక్కౌంట్ వివరాలు, పాసుపోర్టు ఇలా అన్నీ ఆవిడ ముందు పెట్టాను. ‘పెన్షన్ పేమెంటు ఆర్డరు ఏదీ’ అని అడిగింది.
రిటైర్ అయిన తరువాత నాలుగిళ్ళు మారాను. ఈ సంధి కాలంలో ఏటీఎంలు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు వగైరాలు వచ్చిపడి కొన్ని పాత కాగితాలకు కాలం చెల్లిపోయిందని నిర్లక్ష్యం చేసిన జాబితాలో ఈ కాగితం కూడా చేరి పోయివుంటుంది. కానీ ఆ కాగితం లేనిదే పని జరగదు అనే తెలివి తెచ్చుకుని ఇంటికి చేరి ఇంటిల్లిపాదీ ఆ కాగితాన్వేషణ కార్యక్రమంలో తలమునకలు అయ్యాము. ఇల్లంతా చిందర వందర కావడం తప్పిస్తే కాగితం జాడ లేదు. అతి ముఖ్యమైన వాటిని అతి జాగ్రత్తగా దాచే నైపుణ్యం కలిగిన మా ఆవిడే వాటి పత్తా కనుక్కుంది. మహా భారతం విరాట పర్వం అజ్ఞాత వాసంలో పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మల్లో దాచినట్టు, పెన్షన్ పత్రాలను ఒక సీనా రేకుల పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భద్రంగా అటక ఎక్కించింది.దాన్ని దింపి చూస్తే ఎప్ప్పుడో పుష్కరం నాడు దిగిన మా దంపతుల ఫోటో ఉన్న పెన్షన్ పేమెంటు ఆర్డరు బుక్కు కనిపించింది. తెల్లారగానే దాన్ని పట్టుకుని, దారి మధ్యలో జిరాక్స్ కాపీలు తీయించి, అక్కడికి పడుతూ లేస్తూ వెళ్లాను.
పోయి చూస్తె, ఆ రిసెప్షన్ హాలు మొత్తం పెన్షనర్లతో కిటకిట లాడుతోంది. నా మొహం చూసి నాలాగే పనిమీద వచ్చిన ఒకాయన, ‘సోమవారం మాస్టారు, సోమవారం రష్ ఇలాగే వుంటుంది’ అన్నాడు. కాసేపటి తరవాత ఆయనే కలిగించుకుని ‘అలా నిలుచుండి పొతే అలాగే వుంటారు. ముందు ఆ రిసెప్షన్ బల్ల మీద ఉన్న రిజిస్టర్ లో మీ వివరాలు రాయండి’ అన్నాడు. “ఇక్కడ నిఘా కెమెరాలు వున్నాయి, కాస్త నవ్వు మొహం పెట్టండి’ అనే సెన్సాఫ్ హ్యూమర్ కలిగిన బోర్డులు వున్నాయి కానీ, ఇటువంటి ముఖ్యమైన సంగతి తెలిపే సమాచార సూచిక అక్కడ ఏమీ కనబడలేదు.
రిజిస్టర్ లో వివరాలు రాసి ఓ పక్కన నిలుచున్నాను. ఈసారి సీట్లో మరో అమ్మాయి కూర్చుని వుంది. ప్రతి ఒక్కరి కేసు తన కేసే అన్నంత శ్రద్ధగా వచ్చిన వారికి విసుక్కోకుండా పని చేసి పెడుతోంది. లైన్లో ఉన్న వాళ్లకు ఈ ఆలస్యం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ పని తీరు నాకు బాగా నచ్చింది. ఇంతలో ఒక వృద్ధుడు వచ్చాడు. అప్పుడే నా వంతు వచ్చింది. ఆ అమ్మాయి నాతో అన్నది, ‘చూడండి. నిజానికి వరసలో మీరే వున్నారు. ఈయన రిజిస్టర్ లో రాయలేదు. కానీ పెద్దాయన కదా! మీరు ఒప్పుకుంటే ముందీ పెద్దమనిషి విషయం కనుక్కుంటాను’
ఈ రకంగా వృత్తి ధర్మం నెరవేరుస్తున్న ఒక ఉద్యోగిని చూడడం చాలా అరుదు. ఆ పెద్ద మనిషి పని పూర్తి చేసిన తరువాత నన్ను పిలిచింది. వివరాలు అన్నీ మరో మారు పరిశీలించింది. నేను రిటైర్ అయినప్పుడు నామినీ విషయంలో పుట్టిన తేదీ పట్టింపు లేదు. కానీ అదిప్పుడు తప్పనిసరి. నేను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఒక వైద్యుడు రోగికి చెప్పినంత వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి పనిచేసే విధానం చూసిన తరువాత నాకు నా పని కాలేదన్న విచారం కలగలేదు. ధన్యవాదాలు చెప్పి వచ్చేసాను.
నిజానికి ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఇలాంటి ఉద్యోగులే.
మొత్తం మీద మా ఆవిడను నామినీగా చేర్చాను కానీ, ఆ అవసరం పడకుండా మరుసటి సంవత్సరమే నన్ను వదిలి వేరే లోకానికి తరలి వెళ్ళింది.
తోకటపా: (కొంచెం పెద్ద తోక సుమా!)
“మీ పేరు త్రినాథ్ కదూ’
అడిగాను నేను బ్యాంకుకు వెళ్ళిన అరగంట తర్వాత వచ్చి కౌంటర్ లో కూర్చున్న కూర్చొన్న ఉద్యోగిని.
“అవును మీకు ఎలా తెలుసు?” అడిగాడు ఆశ్చర్యంగా.
సెల్ ఫోన్ అతడి ముందుకు తోసి, “మీకు అభ్యంతరం లేకపోతే ఒక నిమిషం ఇది చదువుతారా” అని అడిగాను సాధ్యమైనంత వినమ్రతతో కూడిన స్వరంతో. నా గొంతులోని మార్దవాన్ని గమనించి అతడు చదవడం మొదలు పెట్టాడు.
అది నిరుటి సంవత్సరం అంటే 2020 నవంబర్ ఇరవై ఒకటిన పోస్టు చేసిన కధనం.
అదే ఇది:
21-11-2020 నాటికి భండారు శ్రీనివాసరావు అనే వ్యక్తి బతికి వున్నట్టు మా కళ్ళారా చూశాము అని స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ శ్రమ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఓ సర్టిఫికేట్ ఇచ్చారివాళ.
మా ఇంటికి ఓ కిలోమీటరు దూరంలో కాబోలు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ వుంది. శనివారం ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో అని అనుమాన పడుతూనే బ్యాంకు వైపు అడుగులు వేసాను. మా ఆయన ఇన్నాల్టికి అడుగులు వేసాడు అని సంబరపడి అరిసెలు వండి పెట్టేదేమో, మా ఆవిడ బతికి ఉన్నట్టయితే. ప్రధాన మంత్రి మోడీ కరోనా వున్నది జాగ్రత్త! ఇంటిపట్టునే మూతి (కట్టుకు) మూసుకు వుండండి అని గత మార్చిలో హుకుం జారీ చేసినప్పటినుంచి బుద్దిగా ఇంట్లోనే పడి ఉంటున్నాను.
స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కార్పొరేట్ తరహాలో తీర్చి దిద్ది వుంది. ఫ్రంట్ డెస్క్ లో ఓ అమ్మాయి కూర్చుని వచ్చిన వాళ్ళను కనుక్కుంటూ వుంది. నాది జీవన్ ప్రమాణ్ అని చెప్పగానే రెండో నెంబరు కౌంటరు చూపించింది. అప్పటికే అక్కడ నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు వున్నారు. కరోనా కాలం అని గుర్తుకు వచ్చి కాసేపు ఎడంగానే నిల్చున్నాను. కౌంటర్ లోని వ్యక్తి తలెత్తి నా వైపు చూసి ఆధార్ జిరాక్స్ తెచ్చారా లేకపోతే అదిగో ఆ గదిలో జిరాక్స్ మిషిన్ వుంది వెళ్లి తెచ్చుకోండి అన్నాడు. ఈ మర్యాదకు ఆశ్చర్యపోతూనే అక్కడికి వెడితే నోట్ల కట్టల వెనుక నగదు అధికారి ఒకరు తదేక దీక్షగా డబ్బు కట్టలు లెక్కపెట్టే పనిలో వున్నాడు. అంత సొమ్ము వున్న చోట మసలడం క్షేమం కాదనుకుని గుమ్మం బయటే ఆగిపోయాను. ఈలోగా రెండో నెంబరు కౌంటరులో ఉద్యోగి ఓ నాలుగో తరగతి అధికారిని పిలిచి, నా పనిచేసిపెట్టమని గొంతెత్తి మరీ చెప్పాడు. కానీ అతగాడు మాత్రం తన తీరిక సమయంలోనే, అంటే తోటి సిబ్బందితో ముచ్చట్లు చెప్పడం, తేనీరు సేవించడం వంటి పనులు తీరిగ్గా కానిచ్చిన తరవాతనే నా పని చేసిపెట్టాడు. అయినా షరా మామూలుగా థాంక్స్ చెప్పి మళ్ళీ రెండో నెంబరు వద్దకు వచ్చాను. ఈసారి అతడు ఓ ఫారం ఇచ్చి పూర్తి చేసుకుని రమ్మన్నాడు. నామినీగా నా భార్య పుట్టిన తేదీని ధ్రువపత్రంతో పూరించాల్సిన ఖాళీని డాష్ డాష్ లతో నింపి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని సెల్ఫ్ సర్టి ఫై చేసి ఇచ్చాను. అతడు నా వేలి ముద్రలు తీసుకుని LIFE CERTIFICATE నా చేతిలో పెట్టాడు.
వయసు మళ్ళిన పెన్షనర్లతో ఓపికగా డీల్ చేస్తున్న ఆ కుర్రాడి పేరు తెలుసుకుని, థాంక్స్ త్రినాద్ అని చెప్పి వచ్చేశాను.
ఏమైతేనేం , నా ఖాతా వున్న స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కోటీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ఏడాది పని పూర్తి అయింది.”
ఇదంతా ఓపిగ్గా చదివిన త్రినాధ్ అన్నాడు నాతో మన్నింపుగా.
“సారీ అండీ మిమ్మల్ని బాగా వెయిట్ చేయించాను, మేనేజర్ దగ్గర పనిలో వుండి”
అంటూనే నా పని నిమిషాల్లో పూర్తి చేసి జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ నా చేతిలో పెట్టాడు.
థాంక్స్ త్రినాధ్! (హోప్ టు సీ యు నెక్స్ట్ ఇయర్)
బ్రాకెట్లోది పైకి అనలేదు.

కింది ఫొటో: రిటైర్ మెంట్ కోసం 2005 డిసెంబరులో ఒకరోజు కనపడ్డ స్టూడియోకి వెళ్లి ఆదరాబాదరాగా తీయించుకున్న ఫోటో







30, జూన్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (186) : భండారు శ్రీనివాసరావు

 శత వసంత పాత్రికేయస్ఫూర్తి దాసు కృష్ణమూర్తి

హాయిగా, ఎంచక్కా రాసుకుంటూ, చదువుకుంటూ నిండు నూరేళ్లు జీవించగలిగిన అదృష్టవంతులు అరుదుగా వుంటారు. వారిలో ఒకరు దాసు కృష్ణమూర్తి గారు. వందేళ్ళ చరిత్ర వారి వెనక వుందని అర్ధం.  

పదమూడేళ్ల క్రితం నాకు అమెరికా నుంచి ఒక మెయిల్ వచ్చింది. అప్పటికి నేను బెజవాడ గురించి నా బ్లాగులో రాసిన పోస్టు విస్తృత ప్రచారంలో వుంది. ఆ మెయిల్లో ఇలా వుంది.

శ్రీనివాసరావు గారు

నమస్కారం

నేను నా జీవిత జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసే పనిలో వున్నాను. పెరుగుతున్న దశలో బెజవాడకు సంబంధించి ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు వున్నాయి. మీ బ్లాగులో వాటిని కొంతవరకు చేర్చగలిగితే సంతోషం.

ధన్యవాదాలు

కృష్ణమూర్తి.

అప్పటికి కృష్ణమూర్తి గారు అంటే ఎవరో తెలియదు. ఆ మాటకు వస్తే ఇప్పటికీ వారితో వ్యక్తిగత పరిచయం లేదు. ఆ మెయిల్లో వారు రాసిన మొదటి వాక్యమే నన్ను ఆకట్టుకుంది.

“ఈ లోకంలో మిగిలిన అందరి మాదిరిగానే నా తలితండ్రులను కానీ, పుట్టే ప్రదేశాన్ని కానీ ఎంపిక చేసుకునే అవకాశం నాకు కూడా లేదు. నా పుట్టుక సమయంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమై, ‘ఇదిగో ఈ వీసా ఇస్తున్నా, తీసుకో, తీసుకుని వెళ్లి అదిగో ఆ భూప్రపంచంలో జీవించు అన్నాడు. అన్నాడే కానీ ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు  అని నాకు చెప్పలేదు. ఆయన మాట ప్రకారం, జులై మాసంలో ఒక రోజు సాయంత్రం వర్షం కురుస్తున్న వేళ, మా తాతగారి ఇరవై ఒక్క గదుల విశాలమైన భవంతిలో మా అమ్మ కడుపున జన్మించి, ఈ పుడమిపై పడ్డాను”

ఇటువంటి రచనా చమత్కారాలతో కృష్ణమూర్తిగారు నాకు ఇంగ్లీష్ లో పంపిన మెయిల్లో బెజవాడ గురించిన అనేక విశేషాలు వున్నాయి. నేను క్షణం ఆలస్యం చేయకుండా వాటిని తెనుగు చేసి నా బ్లాగులో పోస్టు చేయడం మొదలుపెట్టాను. వాటి ద్వారానే వారెవరన్నదీ, వారి వయసు ఎంతన్నదీ మొదలైన వివరాలు తెలిశాయి.  ఇంత గౌరవంగా నాకు ఉత్తరం రాసిన పెద్దమనిషి గొప్పతనం అవగతమైన తర్వాత  జర్నలిస్టు అనే వాడు ఎంత వినమ్రంగా వుండాలో బోధపడింది.

2025 జులై ఒకటిన దాసు కృష్ణ మూర్తిగారు వందో ఏట అడుగుపెడుతున్నారు. నూరు వసంతాల పండుగ జరుపుకుంటున్న శుభ సమయంలో వారిని గురించి ఏమని రాయను. అందుకే ఆయన బెజవాడ గురించి నాకు ఏమి చెప్పారో, ఏమి రాశారో వాటి తెలుగు అనువాదాన్ని వారికి తిరిగి పుట్టిన రోజు  కానుకగా ఇస్తున్నాను. స్వేచ్ఛగా అనువాదం చేసే అవకాశం ఇచ్చిన దాసు కృష్ణమూర్తి గారికి శతసహస్ర ధన్యవాదాలు.

నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ, ‘నేను అమెరికాలో ఉంటున్నాను. వలస పక్షిని. ఒకచోట కాదు, మూడు ప్రదేశాలకు వలస వెళ్లాను. ముందు బెజవాడ నుంచి హైదరాబాదు. బెజవాడలో 27 ఏళ్ళు. హైదరాబాదులో 29 ఏళ్ళు. రెండోది ఢిల్లీ. అక్కడ 20 ఏళ్ళు.   ఇక ముచ్చటగా మూడోది అమెరికా. అదీ ఎప్పుడు. నా డెబ్బయి ఐదో ఏట. నా భార్య గతించిన తర్వాత నా కూతురు తామ్రపర్ణి దగ్గరకు వెళ్ళాను. అప్పటి నుంచి అమెరికాలోనే. ఆ దేశం వెళ్ళడానికి ముందు ఇండియన్ ఎక్స్ ప్రెస్, పేట్రియాట్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ ఇలా అనేక ఆంగ్ల పత్రికల్లో, మీదు మిక్కిలి  సోవియట్ యూనియన్ వున్న కాలంలో అత్యంత భారీ సర్క్యులేషన్ కలిగిన ప్రావ్డా పత్రికలో కూడా సుదీర్ఘ కాలం పనిచేశాను’  అని రాశారు. దీనిని బట్టి ఇక వారి వయస్సునుఅనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు.

పొతే,  బెజవాడ గురించి దాసు కృష్ణ మూర్తి గారి ఇంగ్లీష్ మాటలు నా తెలుగులో:  

“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము.

అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే  కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.

 

“సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి  బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ  చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.

 

1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత -  కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.    

“సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.

 

“అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు  రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు  అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో  తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం  బెజవాడలోనే.

 

“ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.

        

“నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.

 

“బుకింగ్ కౌంటర్ల దగ్గర ఒక వరుసలో నిలబడి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం వుండేది కాదు. కౌంటర్ తెరవగానే అంతా ఒక్కసారిగా మీదపడేవారు. సినిమా టిక్కెట్టు కొనడం అంటే దాదాపు ఒక యుద్ధం చేసినట్టు వుండేది. టిక్కెట్టు తీసుకుని బయటపడేసరికి చొక్కాలు చినిగి పోయేవి. వొళ్ళంతా చెమటలు  పట్టి బట్టలు తడిసిపోయేవి.

 

“సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక  తరగతి వుండేది. ఆ క్లాసులో  పైన నేల మీద  కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. “ఇంటర్వెల్  కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.

 

1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో  లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో  సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను.

     

“ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే-

 

“వూళ్ళో దాదాపు అన్నీ శాఖాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు.  చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి – అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.      

 

”గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే!  మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని  ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి  బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు  శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల  ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్  రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి  గుంటూరుకూ, ,తెనాలికీ  బస్సు సర్వీసు వుండేది కాదు. 

అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.

“మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం  గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. 

 

“బెజవాడ గురించి చెప్పుకునే ముందు ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి. ఎందుకంటె అనేక విషయాల్లో దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషను లోకి ప్రవేశించే  గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి.

“జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజను ఆవిర్లు చిమ్ముతూబిగ్గరగా  కూతపెడుతూ ప్లాటుఫారం మీదకు వేగంగా వస్తుంటే ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడడానికి వందలమంది  స్టేషను ఫుట్ బ్రిడ్జ్  మీద గుమికూడేవారని చెబితే ఈనాటి వారు నమ్మడం కష్టమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ పేరుకు తగ్గట్టే దాని కూత కూడా ప్రత్యేకంగా వుండేది. దూరం నుంచి కూడా కూత విని ఆ రైలును గుర్తుపట్టేవారు.

“ఇక స్టేషను విషయానికి వస్తే అది యెంత పెద్దదంటే బెర్లిన్ గోడ మాదిరిగా బెజవాడ పట్టణాన్ని తూర్పుపడమర దిక్కులుగా విభజిస్తూ వుంటుంది. రెండు పక్కలా రెండు విభిన్న సంస్కృతులు పరిఢవిల్లుతుండేవి. 1941 లో కాబోలు గానన్  డంకర్లీ అండ్ కంపెనీ,  రైలు పట్టాల కిందుగా అండర్ పాస్ వంతెన నిర్మించేంతవరకు బెజవాడ రెండు  భాగాలుగా వుండేది. ఇక ఆ స్టేషనులో రద్దీ గురించి చెప్పాల్సిన పని లేదు.  ఆ రోజుల్లోనే పది నిమిషాలకు ఒక రైలు రావడమోపోవడమో జరిగేది. రైలు గేటు  వేసినప్పుడల్లా అటునుంచి ఇటు రాకపోకలు సాగించేందుకు జనం నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ఈ చిక్కులు తొలగిపోయాయి.  

“ఆ రోజుల్లో  నిజాం పాలనలో వున్న హైదరాబాదు స్టేట్ నుంచి రైళ్ళు బెజవాడ వచ్చేవి. నిజాం రైళ్ళను గురించి జనం గొప్పగా చెప్పుకునే వారు. సమయపాలనకు అవి పెట్టింది పేరు. అలాగే శుభ్రత. మూడో తరగతి బోగీల్లో కూడా పంకాలుస్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్లు వుండేవి.

“బెజవాడ రైల్వే స్టేషన్ చూస్తే ఏకత్వంలో భిన్నత్వం అంటే ఏమిటో బోధ పడుతుంది. దేశం నలుమూలలకు  చెందిన  విభిన్న భాషలవాళ్ళు బెజవాడ ప్లాటుఫారం పై కానవస్తారు. కొత్తవాళ్ళకు కృష్ణా పుష్కరం మాదిరిగా గుంపులు గుంపులుగా వున్న ఆ జనసందోహం కనబడేది.

“దుర్గ గుడిలో ఈ రోజుల్లో కనబడుతున్న భక్తుల రద్దీ అప్పట్లో లేదు. నలభయ్యవ  దశకంలో ఎప్పుడు చూసినాఒక్క నవరాత్రులను మినహాయిస్తేగుళ్ళో  పది పన్నెండు మంది కంటే ఎక్కువ కానవచ్చేవారు కారు. బెజవాడకు లాండ్ మార్క్ లాటి దుర్గ గుడి వల్లే విజయవాడ అనే పేరు వచ్చిందని చెబుతారు. కాళి మాత  రాక్షసుల మీద సాగించిన పోరులో విజయం సాధించిన కారణంగా ఆ విజయానికి సంకేతంగా విజయవాడ అన్న పేరు వచ్చిందని స్తల పురాణం  చెబుతుంది.  అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసింది  దుర్గ గుడి  కొలువైవున్న ఇంద్రకీలాద్రి అనే పర్వతంపైనే అనే మరో ఐతిహాసం వుంది. బంగాళాఖాతంలో సంగమించడానికి ఉరుకులు పరుగులు పెడుతూ కృష్ణమ్మ ఈ కొండ పక్కగా  బిరా బిరా పారుతూ వుంటుంది.

“వేసవి కాలంలో బందరు కాలువరైవస్ కాలువఏలూరు కాలువల లాకులు కట్టేసేవారు. నీళ్ళు లేకపోవడంతో ఆ కాలువలన్నీ ఇసుక మేటలుగా కానవచ్చేవి. మళ్ళీ సీజనులో కాలువలకు నీళ్ళు  వొదిలేటప్పుడు చూడాలివందలాదిమంది ఆ కాలువల  వంతెనల మీద చేరేవారు. సుళ్ళు తిరుగుతూ కృష్ణ నీళ్ళు కాలువల్లోకి ఒక్కమారుగా నురుగులు కక్కుతూ  జారిపోయే దృశ్యం చూస్తూ పరవశించి పోయేవారు. ఇలాటివి మరపురాని దృశ్యాలయితే,  మరచిపోవాలనుకునేవి  మరికొన్ని లేకపోలేదు. ఆ రోజుల్లో చాలామంది కాలవ గట్లనే కాలకృత్యాలకు వాడేవారు. పరిస్తితి  ఇప్పుడెలావుందో తెలవదు.

“గవర్నర్ పేటలో వున్నప్పుడు ఇంద్రకీలాద్రి ఎక్కే ప్రయత్నం చేయలేదు కానిఏడెనిమిదేళ్ళ వయస్సులో వర్జిన్ మేరీ హిల్ అనే కొండ ఎక్కుతూ వుండేవాళ్ళం. అలా ఎక్కేటప్పుడు కాలు జారితే ఇంతే సంగతులు. పడిపోకుండా పట్టుకోవడానికి చిన్న చిన్న పొదలు తప్ప వేరే ఏ ఆధారం వుండేది కాదు.

“ఒక జీవ నదిమూడు కాలువలుఅనేక కొండలు ఇవన్నీ బెజవాడకు సహజ సిద్ధంగా వున్న అలంకారాలు. సక్రమంగా అభివృద్ధి చేసివుంటే,  జార్జియాలోని అందమయిన  తిబ్లిసీ నగరానికి ఏమాత్రం తీసిపోయేది కాదన్నది వాస్తవం.”

కొండంత దేవుడికి గోరంత పత్రి మాదిరిగా శత వసంత పాత్రికేయ దిగ్గజం దాసు కృష్ణ మూర్తి గారికి వారి  పుట్టినరోజున సమర్పించుకుంటున్న నా చిరుకానుక ఇది.

తోకటపా: నా నడిచివచ్చిన దారి, బిగ్ జీరో సీరియల్ లో ఇది 187 వ భాగం. విశేషం ఏమిటంటే ఇది మొదలు పెట్టినప్పుడు, నా బ్లాగు,   వ్యూయర్స్ సంఖ్య పద్నాలుగు లక్షలు. ఇప్పుడు అది పదహారు లక్షలు దాటింది. ఇదంతా పాఠక మిత్రుల పుణ్యం. ధన్యవాదాలు.  

కింది ఫోటో:

అమెరికా, న్యూ జెర్సీలో కుమార్తె తామ్రపర్ణి గారింట, తన వందో ఏట  హాయిగా పుస్తక పఠనంతో కాలక్షేపం చేస్తున్న దాసు కృష్ణ మూర్తిగారు.

నా బ్లాగు వ్యూయర్స్ సంఖ్య










(ఇంకావుంది)

(01-07-2025, Camp: Seattle, USA)