15, సెప్టెంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (217): భండారు శ్రీనివాసరావు

 


ఆరు రాత్రులు – ఆరు పగళ్ళు

ఇదేమీ వెనుకటి రోజుల్లోని మళయాళం డబ్బింగు సినిమా టైటిల్ కాదు. అచ్చంగా నా సొంత గొడవ. ఎవరితోనూ పెట్టుకున్న గొడవ కాదునాకై నేను, నాతో నేను  పెట్టుకున్న గొడవ. పైగా అయిదేళ్ళ కిందటిది కూడా.

మా ఆవిడ చనిపోయిన ఏడాదికి హైదరాబాదులోనే వుంటున్న మా రెండో అన్నయ్య కొడుకు, కోడలు లాల్, దీప కొంచెం మార్పుగా వుంటుందని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు.

పెద్ద ఇల్లువిశాలమైన పడక గదులుఅన్నింటికీ మించి అతి విశాలమైన మనసులు కలిగిన దంపతులు దీపలాల్ బహదూర్,  తమ మాటలతో చేతలతో ఆకట్టుకునే పిల్లలు వారి  స్పురిత, హసిత.(ఇప్పుడు అమెరికాలో వుంటున్నారు, ఒకరు ఉద్యోగం చేస్తూ, మరొకరు పై చదువులు పూర్తి చేస్తూ) నాకు తోడుగా నా మేనల్లుడు రామచంద్రంఅతడి భార్య కరుణ. ఆ దంపతుల ఏకైక కుమార్తే దీప.

అందరికీ ఎవరి పడక గదులు వారికే వున్నాయి. కరోనా రోజులు. అందరూ ఎడం ఎడంగా  కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా విశాలమైన హాలు. చుట్టూ పూలమొక్కలుకూరగాయల పాదులుఅన్ని రకాల ఫల వృక్షాలు. అన్ని రకాల వసతులతో ఒక చక్కని పల్లెటూరులో వున్నట్టు వుంటుంది. వాళ్ళు ఆ విల్లా కొనుక్కున్నప్పటినుంచీ నన్నూ మా ఆవిడనూ వారి దగ్గరికే వచ్చి కొన్నాళ్ళు గడపాలని పోరుపెట్టేవారు. కానీ మా ఆవిడ వుండగా వీలుపడలేదు.

ఓ శుక్రవారం వచ్చి నన్ను కారులో తీసుకుపోయారు. తెలిసిన ఇల్లే. తెలిసిన మనుషులే.

అక్కడ ఉండగానే నాకేమీ తెలియదనే  నిజం ఒకటి తెలిసివచ్చింది. అది తెలియగానే సెల్ ఆఫ్ చేసాను. పత్రికలు ముట్టుకోలేదు. టీవీ వార్తలు చూడలేదు. ఇన్నాళ్ళూ జీవించిన ప్రపంచానికి కొంచెం  దూరం జరిగాను.

దీనికి కారణం మా మేనల్లుడు రామచంద్రం. నాకంటే చాలా చిన్నవాడు.

మరో కారణం, నాలో మరో నేను వున్నాడు అనే సంగతి తెలియరావడం.

ఆ రెండో నేను నాలో  ఉన్నాడని తెలిసింది కానిఎవరో ఏమిటో  తెలియదు.

అది తెలియడానికే ఈ ఆరు రాత్రులుఆరు పగళ్ళు ఖర్చు చేయాల్సివచ్చింది. తెలిసిందా అంటే ఏమి చెప్పాలి,  మహామహులకే సాధ్యం కాలేదు ఆ సంగతి తెలుసుకోవడం.  నాకెలా వీలుపడుతుంది?

సత్సంగత్వే నిస్సంగత్వం

ఆధ్యాత్మికంఆముష్మికం ఈ పదాలు చిన్నతనం నుంచి అనుక్షణం వినబడే కుటుంబ నేపధ్యం అయినప్పటికీ వాటిపట్ల అభిలాష కానీ అనురక్తి కానీ ఏర్పడలేదు. అలా అని వాటిని తృణీకరించే స్వభావమూ నాకు అలవడలేదు. జీవితంలో అనేక విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. వాటిల్లో ఇవీ ఒక భాగమే అనే తత్వం.

“సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం

నిర్మోహత్వే నిశ్చలత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తి:” 

మంచి మనసున్న మనుషులతో సాంగత్యం మనసుపై మంచి సానుకూల ప్రభావం చూపుతుంది. ఆది శంకరాచార్యులు తన భజగోవింద స్త్రోత్రంలో చెప్పిన ఈ శ్లోకం అంతరార్ధం ఇదే.

ఈ ఆరు రాత్రులుఆరు పగళ్ళ కాలంలో మంచి మాటలు వినడానికీమంచి రచనలు చదవడానికీమంచి మనుషులతో గడపడానికీ ఓ మంచి అవకాశం లభించింది. సందేహాలుసమాధానాలతో కూడిన అర్థవంతమైన చర్చలకు ఆస్కారం దొరికింది. గూడుకట్టుకుని ఉన్న సందేహాలు తీరాయాదొరికిన సమాధానాలు సంతృప్తి ఇచ్చాయా అంటే చప్పున జవాబు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు  ముందు దాదాపు డెబ్బయి సంవత్సరాల నుంచీ కూడబెట్టుకున్న  సంచితం మెదడులో నిక్షిప్తమై గడ్డకట్టి వుంది. ఇలా అయిదారు రోజుల ప్రయత్నంతో దాన్ని పెకలించడం కష్టం.

వయసులో పెద్ద అయిన నావి సందేహాలు. నాకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడయిన నా మేనల్లుడు రామచంద్రం వాటిని తీర్చే ప్రయత్నం చేసేవాడు. ఇదో వైచిత్రి.

ఉదయం మొదలయిన వాదసంవాదాలు ఒక పెట్టున తేలేవి కావు. అపరాహ్నం వరకూ సాగి వాటి నడుమనే ఉపాహారాలుఅల్పాహారాలుమధ్యాన్న భోజనాలు.  ఇక సాయంసమయంలో మొదలయితే అర్ధరాత్రివరకూ అంతువుండేది కాదు.  ఇద్దరు ప్రాసంగికులే. ఇద్దరూ శ్రోతలే. జవాబుల అన్వేషణలో ప్రశ్నలు,  సందేహాల నివృత్తిలో మరిన్ని ప్రశ్నలు.

మా మేనల్లుడు రామచంద్రానికి పూర్వజన్మ వాసనలతో కూడిన ఆధ్యాత్మిక భావజాలం వుంది. అది బహుశా వారి నాన్నగారు కొమరగిరి అప్పారావు బావగారి నుంచి వారసత్వంగా లభించి వుంటుంది. చేసింది గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం అయినా రామాయణభారత భాగవతాలు నాలుకపై ఆడుతుంటాయి. చిన్నవయసులోనే ఇలాంటి అధ్యాత్మిక వాసనలు ఉన్న వారిని తోటివారు చిన్నచూపు చూడడం కద్దు. కానీ రామచంద్రం విషయం కొంత విభిన్నం. మా కుటుంబంలో  అందరికీ రామచంద్రం చెప్పే విషయాలు వినడంలో ఆసక్తి వుంది. నా ఒక్కడికీ కొంత మినహాయింపు ఇవ్వాలేమో. ఎందుకంటే నాదంతా అనుమానాలతో కూడిన ఆరాలు. దేవుడు అంటే భక్తీ లేకా కాదుదేవుడు అంటే నమ్మకం లేకా కాదు. ఏ విషయాన్ని వెంటనే నమ్మేయడం ఎందుకనే సాధారణ ప్రాపంచిక విషయ పరిజ్ఞానం  తాలూకు  ప్రభావం నామీద ప్రబలంగా ఉన్న కారణంగా వచ్చిన తిప్పలు ఇవి. మూఢ నమ్మకాల మీద అతిమూఢ౦గా పెంచుకున్న అయిష్టతఏహ్యత ఒక కారణం కావచ్చు.

ఈ నేపధ్యంలో ఈ ఆరు రాత్రులుఆరు పగళ్ళ అధ్యాయం మొదలయింది.

 

భండారు శ్రీనివాసరావు అనే నేను ...

బాగానే వుంది, నువ్వే శ్రీనివాసరావువి. మరి ఆ ఆ పేరు తీసేస్తే నీవెవరు?

నిన్ను గుర్తు పట్టేది ఎల్లా? నీ రూపం చూశా? నీ మాటలు వినా? నీ రాతలు చదివా? ఎలా?

ఈ శరీరానికి ఆ పేరు ఉందా! లేదా పేరును బట్టి శరీరానికి శ్రీనివాసరావు అనే అస్తిత్వం వచ్చిందా!

ఈ నేను కాని దాన్ని నేను, నేను అనుకోవడం అజ్ఞానం అవుతుందా!

అంటే ఈ నేను, నేను కాదని బోధపరచుకోవాలా!

సత్యం బోధ పడడానికి ఎంత దూరం దృష్టి సారించాలి. అంత దూరం దృష్టి ఆనుతుందా!

పెంజీకటి కావల అన్నాడు పోతన,

అంటే పెనుచీకటికావల వెలుగు ఉంటుందా! అసలు ఈ కటిక చీకటిని చీల్చి చూడడం ఎల్లా!

దేహంలో ఆరు కోశాలు అని అంటారు.

అన్నమయ కోశం (అన్నంతో జీవించేది), ప్రాణమయ కోశం ( శరీరంలో వున్న వ్యవస్థ), మనోమయ కోశం(ఆలోచింప చేసేది), విజ్ఞానమయ కోశం ( జ్ఞానం కలిగించేది), ఆనందమయ కోశం ( దివ్యానుభవం కలిగించేది).

మొదటి అయిదు దాటి చూస్తే చివరిదానికి చేరుకుంటాడు మానవుడు. దాన్ని కూడా దాటి చూడగలిగితే సర్వం ఆనందమయం. అక్కడ గోచరిస్తుంది ప్రకాశంతో విరాజిల్లే ఆత్మ.

అదే అసలయిన నేను అంటారు భగవాన్ రమణ మహర్షి.

గీతలో చెప్పినట్టు చంపేదెవరు? చచ్చేదెవరు?

అంతా నీ భ్రమ.

అన్నీ నేనే అనే పరమాత్మ ఒకటి వుంది. మిగిలినవన్నీ భ్రాంతులే.

నేనెవరు అని ఓమారు మనల్ని మనం ప్రశ్న వేసుకుని నిశ్చల ధ్యానంతో జవాబు వెతుక్కుంటే ..

ప్రతి మనిషి శరీరంలో మూడు భాగాలు. ఒకటి ఉపాధి (శరీరంతో కూడిన నేను), రెండోది స్థూల శరీరం (రక్తమాంసాలు కలిగినది), మూడోది సూక్ష్మ శరీరం (జీవుడు)

కంటికి కనబడే స్థూల శరీరాన్నే నేను అనే ఓ మిథ్యా భావనలో, భ్రమలో ఉంటాము.

జీవుడు అనే సూక్ష్మ శరీరము, జన్మజన్మల కర్మఫలాలను అనుభవించడానికి స్థూల శరీరాన్ని ధరిస్తుంది. ఆ కర్మ ఫలాలు కూడా మూడు.

ప్రారబ్ధం, ఆగామి, సంచితం.

ప్రస్తుత శరీరంలో జీవుడు అనుభవిస్తున్న కర్మని పుణ్యం, ప్రారబ్ధం అంటారు.

అనాదిగా తెచ్చిపెట్టుకున్న కర్మని ఆగామి అంటారు.

కర్మశేషం వుంటే అది సంచితంగా మరో జన్మలో దఖలు పడుతుంది.

కర్మశేషం తొలగిన రోజున జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. అంటే పాపపుణ్యాలు రెండింటినీ క్షయం చేసుకోవడం అన్నమాట.

ఏమి అర్ధం అయింది? అంత తేలికగా అర్ధం కానిది, అంతం లేనిది కనుకే వేదాంతం అన్నారు.

అర్ధం అయినా కాకపోయినా ఈ వయస్సులో అప్పుడప్పుడైనా కొన్ని ఆముష్మిక విషయాలు గురించి ఆలోచించడం మంచిదనిపించింది. అంతే!

 

“అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః

ప్రాణాపాన సమాయుక్తః  పచామ్యన్నం చతుర్విధం”

(శ్రీ మద్భగవద్గీత, పంచ దశాధ్యాయం,  పురుషోత్తమ ప్రాప్తి యోగము)   

తాత్పర్యం: నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని  ప్రజ్వలింప చేసే ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనే నాలుగు  విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను.

ఇప్పుడీ గీతా ప్రవచనం ఎందుకంటే నేను ఓ అరవై, డెబ్బయ్  ఏళ్ళు వెనక్కి పోవాలి.

 

నా చిన్నతనంలో మా బామ్మగారు రుక్మిణమ్మ గారు ప్రతిరోజూ అపరాహ్ణకాలంలో భోజనానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్ద చేతిలో పట్టుకుని ఈ గీతా వాక్యాన్ని చదివేది. అది ఎందుకు చదివేదో నాకు అర్ధం అయ్యేది కాదు. ఆ శ్లోకం పూర్తి పాఠం కూడా నాకు గుర్తులేదు, అక్కడక్కడ ఒకటి రెండు పదాలు మినహా.

నాకు గుర్తున్న ఆ ఒకటి  రెండు పదాలు ( ‘అహం వైశ్వా..... పచామ్యన్నం...... చతుర్విధం...) గురించి అడిగాను రామచంద్రాన్ని.  అతడు వెంటనే ఈ పదాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవని చెప్పి పైన చెప్పిన విధంగా  టీకాతాత్పర్యాలు వివరించాడు.

 

అరవై ఏళ్ళకు పైగా  నా మనసును తొలుస్తున్న సమస్యకు పరిష్కారం దొరికింది. సత్సంగం వల్ల ప్రయోజనం ఇదే!

 

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నన్ను కష్టపెట్టడానికే పుట్టారు’ అనేది ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నాకున్న ఓ నిశ్చితాభిప్రాయం.

అది చిన్నప్పుడు బలవంతాన కలరా సూదిమందు ఇచ్చిన సర్కారు మనిషి కావచ్చు, అడిగిన అప్పచ్చులు వెంటనే పెట్టలేదని నేను కోపం పెంచుకున్న మా బామ్మ కావచ్చు, హోం వర్కు చేయలేదని నా వీపు వాయగొట్టిన లెక్కల మాస్టారు కావచ్చు, దాచిపెట్టుకున్న గోలీలు కాజేసిన నా బెస్టు ఫ్రెండు కావచ్చు ఇలా ఈ డెబ్బయి ఏళ్ళ పైచిలుకు సాగిన నా ఈ జీవితంలో, ప్రతి దశలో ఎవరో ఒకరు నన్ను కష్టపెడుతూనే వచ్చారని అదేమిటో ఓ పిచ్చి నమ్మకం. ఆ నమ్మకంతోనే వాళ్ళతో పెరుగుతూ విరుగుతూ వచ్చిన మానవ సంబంధాలు.

ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏమిటో అంతా విష్ణుమాయ.

ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నన్ను సుఖపెట్టడానికే పుట్టారు’ అనేది కొత్తగా మొగ్గ తొలుస్తున్న భావన.

అది పొరుగింటివారు కావచ్చు, ఆటో డ్రైవరు కావచ్చు, ఇంట్లో పొద్దున్నే పత్రికలు వేసే పేపరు బాయి కావచ్చు, ఇలా ఎందరెందరో వాళ్ళ సుఖాల్ని వదులుకుని నన్ను సుఖపెడుతున్నారనే అభిప్రాయం నాలో నాకే ఒక కొత్త మనిషిని చూపిస్తోంది.

ఈ ఆరు రాత్రులు, ఆరు పగళ్ళ వల్ల నాకు సిద్ధించిన ఫలితం ఇదే!

ఈ ఎరుక నలభయ్ ఏళ్ళ క్రితమే కలిగివుంటే ఈనాడు నాకు ఎటు చూసినా మంచి మిత్రులే వుండేవాళ్ళు. అలాంటి విలువయిన సంపదను నేనే చేతులారా పోగొట్టుకున్నానన్నమాట.

ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం?

కింది ఫోటో:

మా బామ్మగారు భండారు రుక్మిణమ్మ గారు




(ఇంకా వుంది)

13, సెప్టెంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (216) భండారు శ్రీనివాసరావు

  నిఘానేత్రం

నా బెడ్ రూమ్ లో పిల్లలు పెట్టించిన కన్సీల్ద్ కెమెరా కనెక్షన్ తొలగించాను.
ప్రతి ఒక్కరికీ జీవితంలో చెప్పుకునే విషయాలు, చెప్పుకోలేని విషయాలు వుంటాయి.
మా ఇంటా బయటా కూడా ఇలాంటి దొంగకళ్లు వున్నాయి. నేనిక్కడ హైదరాబాదులో ఎలా వున్నానో, ఎక్కడో వున్న మా పిల్లలు తెలుసుకోవడం కోసం ఈ ఏర్పాటు.
నాకు బెడ్ రూమ్ అంటే కేవలం బెడ్ రూమ్ కాదు.
నాకదే డైనింగ్ రూమ్. నాకదే రాసుకునే ఆఫీసు రూమ్. నాకదే చదువుకునే రీడింగ్ రూమ్. బార్ రూమ్ కూడా. దీనికి అటాచ్డ్ గా బాత్ రూమ్ వుంది.
కాలు బయట పెడితే గొప్ప. లిఫ్ట్ లో ఎప్పుడైనా కనబడితే ఇరుగు పొరుగూ, ఊరెళ్ళి ఎప్పుడు వచ్చారు అన్నట్టు చూస్తారు. (ఇప్పుడా గోల లేదనుకోండి, లిఫ్ట్ చెడి కూర్చుని చాలా రోజులయింది)
ఇంట్లో మిగతా గదులు ఖాళీ, రాముడు లేని అయోధ్యలాగా దిగాలుగా వుంటాయి. పౌర్ణమికో అమావాస్యకో ఎప్పుడైనా స్నేహితులు వస్తే బయట హాలులో కూర్చొంటాము. మర్నాడు పిల్లల ఫోన్లు, ఇలాగే హాయిగా రోజూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి అని.
సమస్తమూ బెడ్ రూమ్ లోనే కాబట్టి దానికి వున్న నిఘా కెమెరా తొలగించడానికి నా కారణాలు నాకున్నాయి.
నాకున్న మతిమరపు గురించి ఎప్పుడు రాసినా, ఎన్నిసార్లు రాసినా ఎవరూ నమ్మడం లేదు. అయినా నా మతిమరపు సంగతి నేను మరచిపోలేను కదా! అందుకే నా జాగ్రత్తలో నేను వుంటాను. అందుకు తగిన ఏర్పాట్లు నేను చేసుకుంటాను. అవి ఎవరి కంటా పడకూడదు అనే కనెక్షన్ తీసేసాను.
అప్పుడెప్పుడో ఒక పెద్ద హిట్ మూవీలో హీరో ప్రతి విషయం ఎప్పటికప్పుడు మరచిపోతుంటాడు. చూసింది చూసినట్టు మెదడులో బల్క్ ఎరేజ్ అయిపోతూ వుంటుంది. అందుకే ప్రతి చిన్న సంగతి చిన్న చిన్న కాగితాలపై రాసి గోడకు అంటిస్తూ ఉంటాడు.
సరిగ్గా నేను అదే చేస్తుంటాను.
వర్క్ మెయిడ్ మమత వచ్చి పని అయిపోయింది వెడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. వలలి అంతే! మా ఆవిడ ఉన్నప్పటి నుంచి వాళ్ళే ఈ పనులు చేస్తూ వస్తున్నారు. ఎవరి వేళకు వాళ్ళు వస్తుంటారు. పోతుంటారు. వచ్చి పనులు పూర్తి చేసుకుని వెళ్ళేవరకు వాళ్లకు చెబుదామని అనుకున్న పనులు గుర్తుకు రావు. పెద్ద పనులేమీ కాదు.’ ఫ్రిడ్జ్ లో పెరుగు గిన్నెలు చాలా వున్నాయి. వాటిని పారేయండి. దేవుడి దగ్గర దీపం వెలిగించడానికి వెండి ప్రమిదను కడిగి వుంచండి, అప్పుడప్పుడూ ఎవరైనా వస్తూ తెచ్చి ఇచ్చిన స్వీట్ బాక్సులు తీసుకువెళ్ళండి, గ్యాస్ సిలిండరు ఖాళీ అయితే వెంటనే చెప్పండి’ ఇలాంటి విషయాలు అన్నమాట. మొదట్లో వీటిని ఒక కాగితం మీద రాసిపెట్టుకునే వాడిని. కాగితం ఎక్కడ పెట్టానో మరచిపోతాను. ఇవేవీ కొంపలు మునిగే సంగతులు కావు. అయినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గుర్తుకు వచ్చి అరెరే అనుకుంటాను. మర్నాడు వాళ్ళు వచ్చినప్పుడు ఇవేవీ జ్ఞాపకం రావు.
మా పిల్లల చిన్నతనంలో మా ఆవిడ ఒకసారి నాతొ అన్నది.
‘పిల్లలు చిన్నబుచ్చుకుంటున్నారు. ‘నాన్న మరీ అమ్మా! సందీప్ ని సంతోష్ అని పిలుస్తారు. నేను కనిపిస్తే సందీప్ అంటారు. మా పేర్లు కూడా ఆయనకి గుర్తుండవా’ అని అడిగాడు చిన్నవాడు. పిల్లల పేర్లు కూడా గుర్తుండకపోవడం ఇదెక్కడి విడ్డూరం’
‘విడ్డూరమే అయినా ఇది నిజమే కదా!’ అన్నాను ఏమనాలో తెలియక.
అప్పుడెప్పుడో ఒకరోజు , ఏరోజో, ఎప్పటిమాటో గుర్తులేదు, చాలా ఏళ్ళ కిందటే.
సాయంత్రం ఎటూ పోవాలని అనుకోలేదు. కానీ సాయంత్రం అవుతుండగానే ఒక ఫ్రెండ్ నుంచి ఫోను ‘ జింఖానాలో కలుద్దామా’ అని. ఇంటికి పంపేసిన డ్రైవర్ ని మళ్ళీ పిలిపించుకుని వెళ్లాను. అక్కడ కూర్చుని అవీ ఇవీ మాట్లాడుకుంటూ వుంటే ఒకాయన వచ్చి ‘నేను శేఖర్ రెడ్డినండీ’ అన్నాడు. ఎక్కడో చూసినట్టు వుంది కానీ చప్పున గుర్తుకు రాలేదు. పైకి మర్యాదకు ‘బాగున్నారా రెడ్డి గారూ’ అని అన్నానే కాని, మనిషిని పోల్చుకోలేక పోయాను. నాకున్న బలహీనతల్లో ఇదొకటి. ఎప్పటివో యాభయ్ అరవై ఏళ్ళక్రితం సంగతులు, ఊళ్లూ, పేర్లూ నా వ్యాసాల్లో రాస్తుండడం చూసి, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ అని పొరబడుతుంటారు. రాత్రి అన్నంలో ఏ కూర తిన్నానో మరునాటికి నాకు గుర్తుండదని వాళ్లకు తెలియదు. ఈ మతిమరపు పలు సందర్భాలలో నాకు తలనొప్పులు తేవడమే కాకుండా ‘గర్విష్టి’ అనే బిరుదును కూడా కట్టబెట్టింది. ఇదలా వుంచితే..... నేను గుర్తు పట్టలేదన్న సంగతి తెలిసి కూడా శేఖర రెడ్డి గారు నొచ్చుకోలేదు. అది ఆయన గొప్పతనం. తిరిగి వెళ్లి మళ్ళీ నాదగ్గరకు వచ్చారు. ఈసారి వారి చేతిలో ముద్దులు మూటగట్టే ఒక బాబు వున్నాడు. ‘నా మనుమడు. మా అమ్మాయి, అల్లుడు కాలిఫోర్నియాలో వుంటారు. ఒక సెల్ఫీ తీసుకుంటాను’ అన్నారాయన. అప్పటికి కానీ నాకు లైట్ వెలగలేదు. ఆయన వంద్యాల ఫణి శేఖర రెడ్డి గారు. పక్కా తెలంగాణావాది. ఫేస్ బుక్ లో, వాట్స్ ఆప్ లో సుపరిచితులు. ఇన్నాళ్ళుగా ఆయన అమెరికాలో వుంటారని అనుకుంటూ వచ్చాను. మా ఇంటికి దగ్గరలోనే శ్రీనగర్ కాలనీలోనే ఉంటారుట. ఎవరో అన్నట్టు వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్.
ఇవన్నీ రాసుకుంటూ, అసలు విషయం బెడ్ రూమ్ లో నిఘా కెమెరా ఎందుకు తీసేసానో చెప్పడం మరచిపోతానేమో.
ముందు చెప్పిన సినిమాలో మాదిరిగా రేపు పనివాళ్లకు చెప్పాల్సిన విషయాలు ముందుగానే ఒక గమ్ పేపరుపై రాసుకుని వుంచుకుంటాను. అది ఎక్కడ పెట్టానో గుర్తుండదు అని కూడా చెప్పాను. ఈ విషయం కోసం నిఘా కెమెరా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు కదా!
రాత్రి పూటే నిద్ర పోవాలనే నియమం నాకు లేదు. రోజులో ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడే. ఒకరకంగా నిశాచరి బాపతు. ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడే లేచి కూర్చుని రాస్తుంటాను.
నేను వేసుకోవాల్సిన మందులు నెలకోసారి తెప్పించుంటాను. రోజుకు ఎనిమిది రకాల మాత్రలు. రేపు వేసుకోవాల్సినవి ఈరోజు రాత్రే కత్తిరించి సిద్ధంగా వుంచుకుంటాను, తెల్లవారగానే పరగడుపున వేసుకునే వాటి కోసం ఒక చిన్న డబ్బా. బ్రేక్ ఫాస్ట్ ముందు, తర్వాత వాటికోసం కొంచెం పెద్ద డబ్బా, మధ్యాన్నం, సాయంత్రం వేసుకునేవి ఇంకొంచెం పెద్ద డబ్బాలో. ఇలా వేరుచేసి పెట్టుకోవడం వల్ల, మతిమరపు కారణంగా ఏ మాత్ర అన్నా వేసుకోవడం మరచిపోయిన సంగతి వెంటనే తెలిసిపోతుంది.
అర్ధరాత్రి లేచి కూర్చుని రాయడాలు, మాత్రల కత్తిరింపులు కెమెరాలో చూసిన వాళ్ళు నవ్వుకోరూ!
అందుకే, కన్సీల్ద్ కెమెరాల్లో ఇలాంటి దృశ్యాలు చూసే అవకాశం పిల్లలకు వుండకూడదని ఈ ఏర్పాటన్న మాట.
తోకటపా:
శ్రీ పరకాల ప్రభాకర్ చెప్పిన జోకు
ఈరోజు అంటే ఈరోజు అని కాదు, 2015లో ఈరోజు అని అర్ధం.
అంటే 2015, డిసెంబరు ఇరవై ఏడో తేదీ అన్నమాట.
హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో వయోధిక పాత్రికేయ సంఘం పదేండ్ల పండగ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల సమాచార సలహాదారులు శ్రీయుతులు కే.రమణాచారి, శ్రీ పరకాల ప్రభాకర్, రెండు రాష్ట్రాల ప్రెస్ అకాడమీ అధ్యక్షులు శ్రీయుతులు వాసుదేవ దీక్షితులు, అల్లం నారాయణ హాజరయి ప్రసంగించారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సందర్భోచితంగా ఒక హాస్య గుళిక వదిలారు. వయోధికుల సమావేశం కదా!
“వయస్సు పైబడిన తరువాత ప్రతి వ్యక్తి జీవితంలో మూడు బాగా పెరిగిపోతాయి. మొట్టమొదటిది, అందరికీ తెలిసిందే. మతిమరపు. మిగిలిన రెండూ .....నా మతిమండా మరచిపోయాను సుమీ!”
కింది ఫోటో:
సైజులవారీ మాత్రల డబ్బాలు:



(ఇంకావుంది)

7, సెప్టెంబర్ 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (215) : భండారు శ్రీనివాసరావు

 

గ్రహణం (పగ) పట్టింది.

ఏదో ఛానల్ లో మూడో నాలుగో జన్మల సినిమా వస్తోంది. చనిపోయిన మనుషులు అలా తారసపడే అవకాశం ఉందా?

మా అన్నయ్య రామచంద్ర రావు గారు ఫోన్ చేశారు.

‘ఎలా వున్నావు? జలుబు తగ్గిందా! జ్వరం లేదు కదా! పనివాళ్లు వస్తున్నారా? వంటమనిషి వచ్చింది కదా!’

రొటీన్ గా అనిపించే ఆ ప్రశ్నల్లో ఇతరులకు తెలియని ఆప్యాయత వుంది. ఇలాంటి అన్నయ్యలు ఎందరికి వున్నారు? నాకయితే వున్నాడు. ఏమున్నాలేకపోయినా ఈ జీవితానికి ఇది చాలు.  

‘ఇవ్వాళ చంద్రగ్రహణం. పలానా టైం లోగా భోంచేయి

మిత్రుడు అధరాపురం మురళీ కృష్ణ గారు కూడా ఇలాంటి సూచనే చేశారు ఆయన పోస్టులో.

‘ఈ రాత్రి 9.56 నుంచి  1.26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ సమయంలో వీలయితే జపం చేసుకోండి”

మా అన్నయ్య చెప్పింది విన్నాను. మురళీ కృష్ణ గారు రాసిందీ చదివాను.

నా జపం నేను చేసుకున్నాను.

గ్రహణ సమయంలో ఏమి చేయరాదో అవన్నీ, మొదటి సంతానాన్ని కడుపుతో వున్న మా ఆవిడతో చేయించిన ఘనుడిని.   

ఘోరమైన తప్పులు చేసి కూడా శిక్షలు పడకుండా తిరిగే ఘరానా నేరగాళ్ళు కొందరు మన మధ్యనే దర్జాగా తిరుగుతుంటారు. అలాంటి వారి జాబితా తీస్తే మొదటి పేరు నాదే.

కొంచెం అటూ ఇటూగా నలభయ్ రెండేళ్ల కిందటి మాట. అప్పుడూ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. మా ఆవిడ కడుపుతో వుంది. చీకటి గదిలో కదలకుండా పడుకోమని పెద్దవాళ్ళ మాట. అలా చేయకపోతే పుట్టే బిడ్డ అవకరంగా పుడుతుందని హెచ్చరిక లాంటి సలహా. ఇంటి మొత్తంలో చిన్నవాడ్ని నేనే అయినా నా మాటే చెల్లితీరాలనే మొండి వాళ్ళలో నేనే పెద్దవాడిని. ఎలా వింటాను? కానీ ఈ పంతాలు, పట్టింపుల్లో మానసికంగా నలిగిపోయేది మా ఆవిడే అనే సంగతి నేను పట్టించుకోలేదు. గదిలో పడుకోవద్దు అనే దగ్గర ఆగిపోతే నేను నేనెలా అవుతాను. పట్టుబట్టి గోధుమ పిండి కలిపించాను. రొట్టెలు చేయించాను. ఆ రోజల్లా అవసరం లేని చాకిరీ చేయించాను. అంటే బట్టలు ఉతకడం, పిండి ఆరేయడం ఇలా అన్నమాట. నిజానికి ఈ పనులు చేయడానికి ఇంట్లో పని పిల్ల వుంది. కానీ నా యుద్ధం మూఢనమ్మకాలపైన. మా ఆవిడకు అది తొలి చూలు. సొంత బిడ్డపై ప్రయోగాలను ఏ ఆడది అయినా సహిస్తుందా! కానీ ప్రేమించి పెళ్ళాడినందుకు నేను పెట్టే ఈ రకమైన క్షోభను అంతా పంటి బిగువన ఓర్చుకుంది. నేను చెప్పినట్టే నడుచుకుంది. చుట్టపక్కాలు నా దాష్టీకాన్ని తప్పుపట్టారు. కానీ నా దారి నాదే. ఆ రోజు అలా గడిచిపోయింది. మొదటి పిల్లాడు పుట్టాడు ఎలాంటి శారీరక వైకల్యం లేకుండా. సూర్య గ్రహణం ఎలాటి ప్రభావం చూపనందుకు పెద్దవాళ్ళు సంతోషపడ్డారు. కానీ నా మానసిక వైకల్యం మాటేమిటి?

పెళ్లి అనే ఒక బంధంతో ఆడదానిపై మగవాడికి సర్వహక్కులు వచ్చేస్తాయా! ఆమెకు ఒక మనసు ఉంటుందని గ్రహించలేని మగాడు మూఢాచారాలపై పోరాటం చేస్తున్నానని గొప్పలకు పోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ రకమైన మానసిక చిత్ర హింసలకు శిక్షలు ఉండవా?

వుండవు. నేనే సజీవ సాక్ష్యం.

 

బహుశా గ్రహణం అప్పుడు పగ పట్టి వుంటుంది. నా జీవన సహచరిని, ఎదిగివచ్చిన రెండో కుమారుడిని నా నుంచి వేరు చేసి పగ తీర్చుకుంది.

నాకు ఇదే కావాల్సింది. నన్నూ తీసుకుపోతే పూర్తి పగ తీరుతుంది.

కానీ పగ తీరాలి అంటే బాధను పెంచాలి కదా!

అందుకే  నా ఎనభయ్యవ ఏట కనపడని ఈ చంద్ర గ్రహణాన్ని చూస్తున్నాను.

(07-09-2025)

 

6, సెప్టెంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (214) : భండారు శ్రీనివాసరావు

 ముక్కు మాట్లాడుతుందా? ఏమో! గుర్రం ఎగరావచ్చు.  

జలుబు వెలగని బలుబు అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ.

జలుబుకు, మాడిపోయిన బలుబుకి సంబంధం ఏమిటి అనుకునేవాడిని చిన్నప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు. ప్రాస కోసం రాశారేమో అనే అనుమానం కూడా రాకపోనూలేదు.

ఇప్పుడు అర్ధం అవుతోంది గత నాలుగు రోజులుగా నన్ను పట్టుకుని పీడిస్తున్న రొంప, తుమ్ములు, దగ్గులు  చూస్తుంటే.

ఈ నెల రెండో తేదీన నేనూ, జ్వాలా కలిసి కేవీపీ గారి కార్యక్రమానికి వెళ్ళాము. వచ్చేటప్పుడు నన్ను ఇంట్లో దింపి వెళ్ళాడు. చెడిపోయిన లిఫ్ట్ కారణంగా మూడు అంతస్తులు ముక్కుతూ మూల్గుతూ ఎక్కాను. బహుశా అప్పుడే ముక్కుకు నామీద కోపం వచ్చి వుంటుంది. మర్నాడు తెల్లవారగానే తుమ్ములు మొదలయ్యాయి. అదేమిటో జర్దా కిళ్ళీ వేసుకున్నవాడి పక్కన కూర్చొంటే ఆ ఘాటు సంగతేమో కానీ ఏదో సువాసన మనల్ని అలరిస్తుంది. అలాగే ఈ తుమ్ములు తుమ్మేవాడికి తుమ్మినప్పుడల్లా ఒక రకమైన రిలీఫ్. అదే పక్కన వున్నవాడికి భరించలేని అసహ్యం. గుడ్డిలో మెల్ల ఏమిటంటే నా తుమ్ములు పక్కవారిని  ఇబ్బంది పెట్టే సమస్యలేదు. లిఫ్ట్ లేదు కనుక అతిధి, అభ్యాగతులు  అనుకోకుండా వచ్చే వీలులేదు. అంచేత నా తుమ్ములు నేనే తుమ్ముకుంటూ ఆ రాత్రి గడిపేశాను. తోడు లేని వాడికి తుమ్ములు కూడా ఒక తోడే.

మర్నాడు మూడో తారీకు. మా రెండో కోడలు పుట్టింటి బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ వుంటే, తను ఊళ్ళో లేదు, కనీసం నేనన్నా వెడితే బాగుంటుంది అని వెళ్లి వచ్చాను.   

వచ్చేసరికి కొంత పొద్దుపోయింది. తుమ్ములకు తోడు రొంప, దగ్గులు మొదలయ్యాయి. తుమ్ముతూ చీదడం, చీదుతూ తుమ్మడం, దగ్గడం  రాగం తానం పల్లవి సరిపోయాయి. అదృష్టం కొద్దీ జ్వరం లేదు. పక్కవాళ్లు నేను ఏదో పాత నాగయ్య సినిమా చూస్తున్నానని అనుకుని వుంటారు.   

అలా మూడు రోజులు, కాలు గడప బయట పెట్టకుండా, మెట్లు దిగకుండా ఇంటి పట్టునే కాలక్షేపం.

మందు వేసుకుంటే ఏడు రోజుల్లో, వేసుకోకపోతే వారం రోజుల్లో తగ్గేది జలుబు అని ఒక పాత నానుడి వుంది. చూద్దాం మరో మూడు రోజులు. బయటకువెళ్లి వెలగబెట్టే రాచకార్యాలు ఏమున్నాయి కనుక?

ఇకపోతే ఇక్కడ మా ఆవిడ జ్ఞాపకం ఒఅక్తి.  దగ్గులు, పిండారీల కధలో ఈ పిడకల వేట ఏమిటంటారా! తప్పదు.

ఒక తరానికి చెందిన  భార్యాభర్తల నడుమ, ఒక వయసు వచ్చిన తర్వాత  మాటలు తక్కువ అనే అపకీర్తి సమాజంలో వుంది. ఇందులో నిజమెంతో తెలవదు.

కొన్నేళ్ళ క్రితం ఓ పెళ్ళికి ఖమ్మం వెళ్ళి వచ్చాం. గాలి మార్పో, నీటి  మార్పో తెలియదు. తనకు ఒకటే రొంప. ‘ అది నాకు తెలియదు. ఇంటి విషయాలు, ఇల్లాలి సంగతులు పట్టించుకోకపోవడమే కదా మన స్పెషాలిటి.

ఆ రాత్రి ఓ రాత్రివేళ చూస్తే తను పక్కనలేదు. లేచి చూస్తే పూజగదిలో ఓ దుప్పటి కప్పుకుని పడుకుని వుంది.

పొద్దున్నే నేను ఓ ఛానల్ కు వెళ్ళాలి. పక్కన పడుకుంటే జలుబు అంటుకుంటుందేమో అని ఆలోచించి ఈ పని చేసి వుంటుంది.

మనసుతో మాట్లాడ్డం అంటే ఇదేనేమో!

ఇంతకీ ముక్కుతో మాట్లాడం గురించి చెప్పలేదు కదా!

నాకు వచ్చే ఫోన్లు అతితక్కువ. అయినా కొన్ని రాంగ్ కాల్స్ వస్తుంటాయి. వాటిల్లో చాలా వరకు హెచ్.పి. గ్యాస్ కస్టమర్స్.  ఇదేదో కొత్త సమస్య కాదు, చాలా కాలంగా నడుస్తున్న కధే!

 నా మానాన నేను పాత పాటలు వింటూ, పాత సినిమాలు చూస్తూ ఏదో ఉబుసుపోక రాతలు రాసుకుంటూ వుంటే ఫోన్ మోగుతుంది. హెచ్ పీ గ్యాసా అంటుంది అవతల గొంతు. మొదట్లో తెలియక అమాయకంగా అవునండీ మాది హెచ్ పీ గ్యాసే అంటాను. మా సిలిండర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది ఆ గొంతు. గొంతులో పచ్చి వెలక్కాయ పడిఅప్పుడు వెలుగుతుంది లైటు. అబ్బే ఇది గ్యాస్ ఏజెన్సీ కాదండీ పర్సనల్ నెంబరు అని పెట్టేస్తే, మళ్ళీ ఫోన్ మోగుతుంది. మళ్ళీ అదే గొంతు. ‘అలా పెట్టేస్తారేమిటి, గూగుల్ సెర్చ్ లో ఇదే నెంబరు వుంది. కాదంటారేమిటి’ అని డబాయిస్తుంది. ఇలా  రోజుకు ఒకసారి కాదుఅనేక సార్లు. కొన్నేళ్లుగా ఇదే తంతు. గొంతు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి చికాకు వచ్చి ఫోన్ చేసిన వాళ్ళ మీద చీకాకు పడతాను. తర్వాత జాలి కూడా పడతాను. గ్యాస్ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. రాంగ్ నెంబర్ కావచ్చు. అవసరంలో వుండి ఫోన్ చేస్తున్నారు.  పోనీలే అనుకుంటే పోను కదా! నాకొచ్చిన ఇబ్బంది ఏముంది. రాంగ్ నెంబర్ అని మర్యాదగా చెబితే వచ్చిన నష్టం ఏముంది. ఇలా కాసేపు పశ్చాత్తాపపర్వం  నడుస్తుంది.  ఇంతలోనే మరో ఫోన్. ‘హెచ్ పీ గ్యాసా!’ నాలోని బుద్దుడు మాయమైపోతాడు. మళ్ళీ సీను రిపీట్.

ఒక రోజు అలా అప్పటికి మూడో ఫోను. ఇక వేరే దారి లేక కౌన్సెలింగ్ మొదలు పెట్టాను.

‘చూడండి. నేను మీలాగే హెచ్ పీ గ్యాస్ కన్స్యూమర్ ని. ఏజెన్సీ నడపడం లేదు. ఈ మధ్య గ్యాస్ బుకింగ్ విధానం సులభతరం చేశారు. 96660 23456 నెంబరుకు ఫోన్ చేయండి. ఒకటి నొక్కితే...’

నా మాట పూర్తికాకమునుపే అవతల గొంతు నా గొంతుకు అడ్డం పడింది.

‘ఇవన్నీ మాకూ తెలుసు. ఇలా చేయాలి అంటే ముందు మా ఫోన్, కన్స్యూమర్ నెంబరు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ కనెక్షన్ మా పేరుతొ లేదు. గూగుల్ సెర్చ్ లో నెంబరు చూసి చేసేది ఇందుకే

నాకు కళ్ళు తెరిపిళ్ళు పడాలి. కానీ పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఆ జవాబుతో. కోపంతో కట్ చేశాను.

నాలోని తథాగతుడు మేలుకుని హితవు చెప్పడంతో మళ్ళీ కంప్యూటర్ లో తల దూర్చాను.

ఈసారి ఎక్కువ వ్యవధానం లేకుండానే ఫోన్ మోగింది. ‘హెచ్ పీ గ్యాసా!’

నేనూ ఈ సారి రూటు మార్చి నిదానంగా చెప్పాను. కాదండీ అన్నాను వినయంగా. ఒక విషయం చెప్పండి అని అడిగాను మరింత వినమ్రంగా. ఈ నెంబరు గూగుల్ సెర్చ్ లో దొరికింది అంటున్నారు. ఏమీ అనుకోకపోతే ఆ స్క్రీన్ షాట్ నా ఈ నెంబరుకు పంపిస్తారా శ్రమ అనుకోకుండా

ఇంత మన్ననగా కోరేసరికి అతడు సరే అన్నాడు. సరేతో సరిపుచ్చకుండా పంపాడు.

అది చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఒక్క అంకె తేడా లేకుండా అది,  పాతికేళ్ళుగా నా పేరు మీద బిల్లులు కడుతూ నేను  వాడుతున్న  నా పర్సనల్ నెంబరే!

ఇప్పుడు జలుబు శకం నడుస్తోంది కదా! ఏది మాట్లాడినా ముక్కుతోనే. గ్యాస్ వాళ్లకు కూడా ముక్కుతోనే జవాబు.  

 

(06-09-2025)     

3, సెప్టెంబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (213)– భండారు శ్రీనివాసరావు

 గతి తప్పిన వర్తమానం

‘ఇలా కాదు, ఒకరోజు మీ ఇంటికి వస్తాను, చాలా రోజులుగా వాయిదా పడుతోంది. ఈసారి తప్పకుండా వస్తాను’ అన్నారు నాతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
హడావిడిలో వుండి కూడా కాసేపు నిలబడి ఆప్యాయంగా మాట్లాడారు. బాధ్యతలు ఎక్కువ. ఈరోజు హైదరాబాదు, మర్నాడు ఢిల్లీ. మరో రోజు ఖమ్మం. మధ్య మధ్యలో గంటలకు గంటలు సమీక్షా సమావేశాలు. అనుకుంటారు కానీ మంత్రుల కష్టాలు మంత్రులవి.
‘మీ ఇంటికి వస్తాను’ అన్నవారిని గట్టిగా ‘అవును, రండి’ అని అనలేని పరిస్థితి నాది. ఇంట్లో కప్పు కాఫీ ఇచ్చే దక్షత లేదు. చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు, ‘రేపు కలుద్దాం’ అని. నేనే ఏదో వంక చెబుతాను. 'దాటవేస్తున్నాను' అని తెలిసిపోతూనే వుంటుంది.
పాతికేళ్ళ నాటి లిఫ్ట్ పడకేసి పక్షం రోజులు అయింది. బాగు చేయించే, బాగుపడే సూచనలు ప్రస్తుతానికి కనపడడం లేదు. మూడు అంతస్తులు ఎక్కి దిగాలంటే అదో ప్రయాస. ఎక్కిదిగమని చెప్పడానికి నామోషీ. ఇవన్నీ వెళ్ళబోసుకోవడం ఇష్టం లేక ఏదో కారణం చెబుతాను.
మిత్రుడు Ramnath Kampamalla మొన్నొకరోజు నన్ను చూద్దామని వచ్చి మూడు అంతస్తులు ఎక్కి కాలింగ్ బెల్ కొట్టి, రెస్పాన్స్ లేక పాపం మళ్ళీ అన్ని మెట్లు దిగి వెళ్లిపోయారట. ఇట్లావుంటుంది నాతోని.
అందుకే నెలకో రెండు నెలలకో ఒకసారి మిత్రులను కలిసే సందర్భం చూసుకుని ఇటువంటి సమావేశాలకు వెడుతుంటాను.
నిన్న అలాగే కేవీపీ రామచంద్రరావు గారు పిలిస్తే, జ్వాలాతో కలిసి వై.ఎస్.ఆర్. అవార్డు ప్రదానోత్సవానికి వెళ్లాను. దశపల్లా హోటలు హాలు మొత్తం వచ్చిన అతిధులతో కిటకిటలాడుతోంది.
వై.ఎస్. చనిపోయి పదహారేళ్ళు. రాజకీయాల్లో ప్రాణం కాదు, పదవి పోతేనే మొహం చాటేసే రోజుల్లో ఇంతమంది జనం. నిజంగా అబ్బురం.
అనుకున్నట్టే ఒకనాటి పాత్రికేయ మితృలు అందరూ ఒక చోటనే కలిసారు. వీరువారని లేదు. చాలామందిమి కలిశాము. ఒకానొక రోజుల్లో రోజూ కలిసేవాళ్ళం సచివాలయంలోనో, పార్టీల ఆఫీసుల్లోనో. ఒకరినొకరం పలకరించుకుని సంతోష పడ్డాము. అలాగే పాత తరం రాజకీయ నాయకులు. కొత్తతరం వాళ్ళు. పాత వారితో గట్టి పరిచయం. కొత్తవారితో ముఖ పరిచయం.
కేవీపీ గారు అమ్మాయి పెళ్లి చేసే వధువు తండ్రి మాదిరిగా అందరినీ పేరుపేరునా పలకరిస్తున్నారు. బాగా అలసిపోయినట్టు మొహం చూస్తేనే తెలుస్తోంది. కానీ వై.ఎస్. తో ఆయనకు వున్న మిత్రబంధం అలసటను అధిగమించిందని అనిపించింది.
ప్రసంగం మధ్యలో షర్మిల రాక గమనించిన ముఖ్యమంత్రి రేవంత రెడ్డి గారు, ‘వేదిక మీదకు వచ్చి కూర్చోండి, నా కుర్చీ ఖాళీగానే వుంది’ అనడం ఒక విశేషం.
గతంలో ముఖ్యమంత్రిగా వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు చేసిన అనేక మంచి పనులను గురించి వక్తలు అందరూ ఏకధాటితో ప్రసంశలు కురిపిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీదనే దాదాపు రెండు గంటలు ప్రశాంతచిత్తంతో వినడం, కేవీపీ గారు తన ప్రసంగంలో ప్రస్తావించినట్టు, ఈనాటి రాజకీయాల్లో గొప్ప విషయమే.
మాట్లాడిన వాళ్ళు, విన్న వాళ్ళు వై.ఎస్. గురించిన తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఘనమైన మనిషికి ఘనమైన నివాళి.
“బాగా తగ్గిపోయారు” అన్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు సభ ముగిసిన తర్వాత నేను కనిపిస్తే.
“అవునండీ! టీవీ చర్చలు పూర్తిగా తగ్గించుకున్నాను” అనబోయాను.
“యంగెస్ట్ జర్నలిస్ట్. ఏజ్ ఎనభై ఓన్లీ" అన్నారు పక్కనుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు.
“నిజమా! ఏమిటి రహస్యం”
“అది ఇక్కడ చెప్పేది కాదు లెండి” అని తప్పించుకున్నాను.
వై ఎస్. జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టాలతో ఫోటోగ్రాఫర్ మిత్రుడు రవీంద్ర రెడ్డి సారధ్యంలో ఏర్చి కూర్చిన ఫోటో ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
చాలా రోజుల తర్వాత ఆహ్లాదంగా, ఆనందంగా గడిచిన సాయంత్రం.
ఇంతకీ చెప్పాలి అనుకున్నది ఏమిటంటే...
నేను రేడియో విలేకరిని.
నా పరిధి మించి ఒకరిని పొగుడుతూ రాయలేను. అలాగే హద్దులు దాటి తెగడలేను.
గోడమీద పిల్లి అన్నా బాధ పడను.
ఈ విషయం నా కంటే, నాతో మంచి పరిచయం వున్న రాజకీయ నాయకులకే బాగా తెలుసు.
నేను నా స్కూటర్ కిందే పడి కాలు విరగగొట్టుకుని, ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి కోలుకుంటున్నప్పుడు అప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు గారు, అతి కీలకమైన లోకసభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా వుండి కూడా తీరిక చేసుకుని నన్ను చూడడానికి ఆసుపత్రికి వచ్చారు. యోగక్షేమాలు కనుక్కున్నారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా వున్నప్పుడు, విలేకరుల ఇష్టాగోష్టి సమయంలో నా గురించి ఒక విలేకరి, ‘శ్రీనివాసరావు పొద్దస్తమానం సీ ఎం చంద్రబాబు ఆఫీసులోనే వుంటాడు’ అని వ్యంగ్యంగా అంటే, వై.ఎస్. ఆర్. గారు ఆప్యాయంగా నా భుజం మీద చేయి వేసి, ఆ విలేకరిని వారించిన సందర్భం, నన్ను సమర్థిస్తూ మాట్లాడిన వైనం నేనెన్నడు మరచిపోలేను.
వారి హోదాలకు తగిన రీతిలో పిలవకపోయినా, ఆ ఇద్దరు, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా వుంటూ, పాత్రలు మారిన తర్వాత కూడా నా ఇద్దరు పిల్లల పెళ్లిళ్లకు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించడం వారి మంచితనం, గొప్పతనం.
2005 డిసెంబరు 31 వ తేదీన హైదరాబాదు దూరదర్సన్ నుంచి రిటైర్ అయ్యేవరకు, ఏ పత్రికకు ఏనాడు రాజకీయ వ్యాసాలు రాయలేదు. ఏ టీవీ చర్చల్లో పాల్గొనలేదు. ఒక మీడియాలో పనిచేస్తూ వేరే మీడియాలో పాల్గొనడం నాకు ఇష్టం వుండేది కాదు.
ఆ తర్వాత నేను పాల్గొనని టీవీ లేదు, రాయని పత్రిక లేదు.
అలా సంవత్సరాల తరబడి మూడు పూటలా రోజుకో టీవీ చర్చలకు వెడుతుండే నాకు వారాలబ్బాయి అని పేరు కూడా పెట్టారు. ఇక వెబ్ ఛానల్స్ అనంతం. వాళ్ళు ఏ అంశం మీద అడిగినా చప్పున వ్యాఖ్యానించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుండేవాడిని. అనేక ఛానల్స్ మా ఇంటి నుంచే ఓబీ వ్యాన్లు పంపి లైవ్ తీసుకునేవి.
రా వద్దని ఏ టీవీ అనలేదు, రాయవద్దని ఏ పత్రిక వాళ్ళు అనలేదు.
మాట్లాడడం ఎప్పుడు ఆపాలో తెలిసిన వాడే మంచి వక్త కాగలుగుతాడు. రాయడం ఎప్పుడు ఆపాలో గ్రహించిన వాడే మంచి రచయితగా మిగిలిపోతాడు. ఇలాంటి సూక్తులు అన్నీ అనేకం రాసిన నేను, ఒకరోజు శుభ ముహూర్తం చూసుకుని రాజకీయ చర్చలకు మంగళం పాడేసాను. మారిన పరిస్థితులు, మారుతున్న పరిస్థితులు, మారబోయే పరిస్థితులు కొంత కారణం అనుకోండి. ఇక చాలు అనుకున్న తరువాత, ఆశ్చర్యంగా దిగజారుతున్న నా ఆరోగ్యం బాగుపడింది. హాయిగా ఇంటిపట్టున కూర్చుని, నా మానాన నేను నా సొంత సంగతులు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను.
ఇప్పటికి నా బిగ్ జీరో అక్షరాలా రెండువందల పన్నెండు భాగాలు పూర్తయ్యాయి. తరువాత కొంత గ్యాప్ వచ్చింది. కారణం నా మనుమరాలు జీవిక.
తనని చూడడానికి గణేష్ చతుర్థికి కటక్ వెళ్ళాను. వున్నది నాలుగు రోజులే. సెలవులు కావడం వల్ల తనతోనే కాలక్షేపం. దానితో సర్వం మరచిపోయాను. తాతా తాతా అంటూ నా చుట్టూనే తిరిగేది. నా పక్కలోనే నిద్రపోయేది. నిద్ర పట్టని నాకు ఒకటే ఆలోచన. నా పిల్లలతో కూడా నేనిలా సన్నిహితంగా, ప్రేమగా మసలిన సందర్భాలు అతి తక్కువ. కాదు, కాదు, అసలు లేవనే చెప్పగలను. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు. సృష్టి చేసే మాయల్లో ఇదొకటి.
కింది ఫోటోలు పలాన పలానా అని రాయనవసరం లేనివి.
(Some photos Courtesy: Ramnath Kampamalla)















(ఇంకా వుంది)