1, మార్చి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (275) : భండారు శ్రీనివాసరావు

 పాలించడానికి కాదు, ప్రశ్నించడానికి

‘ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడుగంటలకు హైదరాబాదు ప్రెస్ క్లబ్ కు వెళ్ళాలి, అక్కడ అందరం కలవాలి, ఇది పిలుపులు లేని పేరంటం’ అని మిత్రుడు జ్వాలా చెప్పిన విషయం మొన్న శుక్రవారం నాడు పొద్దుగుంకుతున్న సమయంలో జ్ఞాపకం వచ్చింది.
తయారయి ఏడుగంటల కల్లా అక్కడ వుండాలి అనే ఉద్దేశ్యంతో ఉబెర్ యాప్ ఓపెన్ చేశాను.
నిజానికి నేను రెగ్యులర్ గా డ్రైవర్లను బుక్ చేసే షఫీకే ముందు ఫోన్ చేశాను. రంజాన్ మాసం కావడం వల్ల ఆ సమయానికి డ్రైవర్లు అందుబాటులో లేరు. మామూలుగా అయితే అరగంట ముందు చెప్పినా డ్రైవర్ వచ్చేవాడు.
ఓలా, ఉబెర్ లు అంతర్జాతీయ కంపెనీలు. కష్టమర్లను ఆకర్షిస్తూనే మరోపక్క లాభాలు ఆర్జించడం వాళ్ళ ధ్యేయం.
పదేళ్ల క్రితమో అంతకు కొంత ముందో ఈ కొత్త రకం రవాణా వ్యవస్థ హైదరాబాదులో ప్రవేశించిన నాటి నుంచి నేను వీటికి కష్టమర్ ని. సొంతానికి కారు వుందన్న మాటే కానీ, మధ్యలో ఆగితే కారు తోయడం కూడా తెలవదు. నాలాంటి వారికి ఆ రోజుల్లో ఈ ఉబెర్లు, ఓలాలు వరప్రసాదంలా దొరికాయి. ఆటో చార్జీతో సమానంగా వీటి ఛార్జీలు వుండేవి. హాయిగా ఏసీ కార్లో కాలుమీద కాలు వేసుకుని, ఎక్కడికి కావాలంటే అక్కడికి, ‘లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు’ అని చెప్పే పనిలేకుండా, గమ్యస్థానం దగ్గరే నేరుగా దిగిపోవచ్చు’ అనే సాధారణ మధ్యతరగతి మనస్తత్వం ఈ కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. చౌకగా జనాలకు అలవాటు చేసి తరువాత తరువాత రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోవడాన్ని కష్టమర్లు నిస్సహాయంగా చూస్తూనే వాటికి అలవాటు పడిపోయారు. మల్టీ నేషనల్ కంపెనీల అసలు గుట్టు ఇదే. ముందు అలవాటు చేయాలి. తరువాత తరువాత ఎంతగా రేట్లు పెంచినా, పెంచిన రేట్లకు జనమే కిమ్మనకుండా అలవాటుపడిపోతారు. ఈ సూత్రంతోనే అవి నడుస్తుంటాయి. మనల్ని నడిపిస్తుంటాయి.
వీటికి సొంతంగా ఒక్కటంటే ఒక్క కారు వుండదు. కానీ వేలాది కార్లు ఈ బ్రాండ్ తో నడుస్తుంటాయి. టెక్నాలజీతో కారు డ్రైవర్ ని, వినియోగదారుడుడిని కలపడం ఒక్కటే వీళ్ళు చేసే పని. ఒకరకంగా చెప్పాలి అంటే చిట్ ఫండ్ వ్యాపారం. అందులో నిర్వాహకులకు ఒక్క రూపాయి ఖర్చు వుండదు. డబ్బు అవసరం వున్నవాడిని, అంతగా లేని వాడిని కలపడం. అవసరం వున్నవాడు పాడుకుంటాడు, కొంత నష్టానికి. ఆ నష్టమే అవసరం లేని వాడికి లాభంగా మారుతుంది. ఆ లాభాల్లో సింహభాగం చిట్ ఫండ్ కంపెనీ వాడు వుంచుకుని మిగిలిన డబ్బుని పాట పాడని వాళ్ళకు పంచడం. ఈ రవాణా కంపెనీ వాళ్ళదీ ఇదే వరస.
ఆ శుక్రవారం అదృష్టం కొద్దీ ఉబెర్ కారు తొందరగానే వచ్చింది. డ్రైవర్ పేరు వెంకటేష్. పిన్ నెంబరు చెప్పగానే డోరు తీశాడు. యాప్ లో ప్రెస్ క్లబ్ చేరే టైము చూపిస్తోంది. పర్వాలేదు పది నిముషాలు ముందే వుంటాను అనుకున్నాను, కారులో సర్దుకుని కూర్చొంటూ.
‘మీరు జర్నలిస్టా?’ అడిగాడు, కారు మెయిన్ రోడ్డు మీదకు పోనిస్తూ.
‘ఏమీ లేదు, ప్రెస్ క్లబ్ కు వెడుతున్నారు కదా! అందుకని అడిగాను’ అన్నాడు అతడే వివరణ ఇస్తూ.
ఇలా వెళ్ళే సమయాల్లో డ్రైవర్లు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అన్యమనస్కంగానే వింటూ వుంటాను. కొంత స్వార్ధం కూడా వుంది. ఒక్కోసారి రాసుకోవడానికి మంచి విషయాలు తెలుస్తుంటాయి.
‘రాఘవ్ చద్దా రీల్స్ చూస్తుంటారా!’ అని అడిగాడు డ్రైవర్ వెంకటేష్. ఈ మధ్యనే ఎవరో మిత్రుడు చెబితే ఒకటి రెండు సార్లు రాజ్యసభలో రాఘవ్ చద్దా చేసిన కొన్ని ప్రసంగాలు విన్నాను. అతడు ఏ పార్టీ వాడో కూడా తెలియదు. సాధారణ ప్రజలు నిత్య జీవితంలో ఎదుర్కునే సమస్యలను ప్రస్తావిస్తూ వుంటాడు. ఆ రాఘవ్ చద్దా పేరు ఒక సామాన్య టాక్సీ డ్రైవర్ నోట వినడం నాకు చాలా వింతగా అనిపించింది.
రద్దీ రోడ్డుపై లాఘవంగా డ్రైవ్ చేస్తూనే వెంకటేష్ రాఘవ్ గురించి చెబుతూనే వున్నాడు.
‘నాకు ఆయన ఏ పార్టీవాడో తెలియదండీ. ఎప్పుడు మాట్లాడినా దేశంలో చిన్న మనుషుల సమస్యలే మాట్లాడుతాడు. నిజానికి అవి చిన్నవాళ్ల పెద్ద సమస్యలు. పెద్దవాళ్లకు అసలు పట్టని సంగతులు. ఆయన అవే మాట్లాడుతాడు. పెద్ద ఉపన్యాసాలు చేయడు. అయిదు కిలోల రేషన్ కోసం వేలిముద్రలు అడుగుతారు. యూరియా కొనాలి అంటే వేలి ముద్రలు తీసుకుంటారు. మరి, అతి ముఖ్యమైన ఓటు వేయడానికి వేలిముద్రలు ఎందుకు తీసుకోరు. ఓటును వేలిముద్రకు ముడిపెడితే దొంగ ఓట్ల బెడద వుండదు కదా! అని ఒకసారి చెప్పాడండీ. ఎంతచక్కని మాట! నాకు బాగా నచ్చిందండీ’ చెబుతున్నాడు వెంకటేష్.
‘ఆయన చెప్పేవన్నీ ఇలాంటివేనండీ. ఎవర్నీ ఘాటుగా విమర్శించడు. పొల్లు మాట ఆయన నోట వినపడదు. ఇలాంటి వాళ్ళు ఓ పదిమంది వుంటే దేశం పరిస్థితి ఇలా వుండదండీ’
వెంకటేష్ చెప్పుకు పోతున్నాడు. రాజ్యసభలో రాఘవ్ చద్దా చెప్పిన మరి కొన్ని సంగతులు గుర్తుచేసుకుని మరీ చెబుతున్నాడు.
‘దేశంలో ఎక్కువమంది పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్ళు తమకు కావాల్సినవి కొనుక్కుని పన్నులు చెల్లిస్తూ వుంటే, వాటిని తయారు చేసిన పెద్దోళ్లు సంపాదించి పన్నులు కడుతున్నారు. పేదవాళ్లకు సబ్సిడీలు , పధకాలు. గొప్పోళ్ళు తీసుకున్న బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫీ, మరి పన్నులు కట్టే మధ్యతరగతికి మాత్రం గుండు సున్నా. వాళ్ళు బంగారు గుడ్లు పెట్టే బాతులు మాత్రమే. బతకాలంటే పన్ను, ఆఖరికి చావాలంటే కూడా పన్నే. ఎయిర్ పోర్టుల్లో మామూలోడు ఒక కప్పు కాఫీ కొనుక్కుని తాగే పరిస్థితి ఉందా!
‘ఇలాంటి సంగతులు ఎన్ని చెబుతూ వుంటాడండీ ఆ పెద్దాయన. నాకయితే కాళ్ళకు మొక్కాలని అనిపిస్తుంది ఆ మాటలు వింటుంటే’
ఇంతలో ప్రెస్ క్లబ్ వచ్చింది.
‘అసెంబ్లీలో, పార్లమెంటులో ఎప్పుడు ఏదో ఒక విషయంపై రగడ. అనవసరమైన విషయాలపై ఏదో ఒక రభస. అందరూ రాఘవ్ గారి మాదిరిగా ప్రజా సమస్యలను ఎందుకు లేవనెత్తరో అర్ధం కాదు’ అన్నాడు రైడ్ క్లోజ్ చేస్తూ.
గూగుల్ పే చేసిన తర్వాత అడిగాను వెంకటేష్ ని, ‘నీకు సెల్ఫీ తీయడం వచ్చా! నీతో నా ఫోటో ఒకటి తీస్తావా’ అని.
వెంకటేష్ ఏమి చదువుకున్నాడో, అతడి నేపధ్యం ఏమిటో నాకు తెలియదు.
అతడి మాటల వల్ల తెలిసిందల్లా దేశంలో, సామాన్య జనంలో పాజిటివ్ థింకింగ్ క్రమంగా పెరుగుతోందని.
దీర్ఘకాలంలో జాతికి మేలు చేసే ఆలోచనా ధోరణులు పెరుగుతున్నాయని.
భయం లేదు! సమాజం మేలుకుంటోంది!



(ఇంకా వుంది)
01-03-2026

28, ఫిబ్రవరి 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (274) : భండారు శ్రీనివాసరావు

 

నగరానికి ఏమైయింది?

1975 వ సంవత్సరం.
రేడియోలో విలేకరి ఉద్యోగంలో చేరడానికి హైదరాబాదు వచ్చాను. నగరం పొలిమేరలకు చేరకముందే ఆలిండియా రేడియో ట్రాన్స్ మిటర్లు (ఇప్పుడు నడిబొడ్డుకు చేరాయి) కనబడ్డాయి. బస్సు కిటికీ కడ్డీలు ముట్టుకుంటే ఐసు కడ్డీలు తాకినట్టు చల్లగా తగిలేవి. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేర వరకు పచ్చటి అనాబ్ షాహీ ద్రాక్ష తోటలు.
నగరంలో రోడ్లు తీర్చి దిద్దినట్టు శుభ్రంగా ఉండేవి. ఇరువైపులా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా, వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.
నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను.
పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దగ్గర అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే ఒంటరిగా నిలబడి వుంది. అది దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. (పొలం అనాలా). దానికి చివర్లో పెద్ద లోయ. అందులో నిండుకుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.
ఇప్పుడా లోయాలేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల కాలనీ, లోయని పూడ్చేసి సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని ప్రభుత్వాలను, ప్రజలను శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు.
హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో చాలావరకు చెరువులన్నీ మంత్రం వేసినట్టు మాయమయిపోయాయి. వాటిల్లో చిన్న స్థాయి వాళ్ళు కట్టుకున్న చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే కలిగినవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.
గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. అలాంటి దృశ్యాలు ఇప్పుడు కేవలం పాత తెలుగు సినిమాల్లో మాత్రమే కనబడతాయి. ఇప్పుడు అదే తటాకం, ఏడాదిలో చాలా నెలలపాటు వట్టిపోయి రాళ్ళు తేలి కానవస్తోంది.
నేను రేడియోలో చేరిన తొలి రోజుల్లో స్టేట్ బ్యాక్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను హైదరాబాదు విలేకరులకు చూపించడానికి ఒక వ్యానులో కొందరు పత్రికా ప్రతినిధులను తీసుకు వెళ్ళారు. ఆ బృందంలో నేను కూడా వున్నాను. అరగంట లోపలే నగరం పొలిమేరలకు చేరాము. (ఇప్పుడది అసాధ్యం అని అందరికీ అనుభవైకవేద్యమే!
అక్కడినుంచి అడవి దారిలో మా ప్రయాణం సాగింది. బాటకు ఇరువైపులా పొడవాటి చెట్లు. ఆ వెనుక దట్టమైన అడవి. ఇప్పుడు అడవి సరే, పెద్ద పెద్ద చెట్లు కనబడడం కూడా అపురూపం. వన మహోత్సవాల పేరుతొ రహదారులకు అటూ ఇటూ నాటిన చెట్లు కనబడతాయి. నిజానికి ఈ ఉత్సవాల సమయాల్లో ఆయా ప్రభుత్వాలు ప్రకటించుకున్నట్టు, నాటిన మొక్కలు అన్నీ పెరిగి పెద్దవి అయివున్న పక్షంలో గత యాభయ్ ఏళ్ళలో నగరాలు, పట్టణాలు అన్నీ దట్టమైన అడవుల మధ్య వుండేవి.
నా చిన్నతనంలో కాలువ గట్ల మీద వరసగా అనేక చెట్లు వుండేవి. వాటిపై నెంబర్లు వేసేవాళ్ళు, ఎవరైనా దొంగతనంగా చెట్టు నరికితే కనిపెట్టడం కోసం. అక్రమంగా చట్లు నరికితే శిక్షలు కఠినంగా వుండేవి. కనుకనే చెట్టు నరకడానికి భయపడే వాళ్ళు. ఇప్పుడా భయమేదీ! ఆ భయమే వుంటే వెనుకటి అడవులు ఎలా మాయమయ్యేవి?
నేను ఖమ్మం స్కూల్లో చదువుకొనేటప్పుడు, అప్పుడు డీపీఆర్వోగా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి వెంట ఒకసారి ఆయన వ్యానులో భద్రాచలం వెళ్లాను. కొత్తగూడెం, పాల్వంచ తరువాత అన్నీ కారడవులే. రాత్రి వేళల్లో క్రూర మృగాలు సంచరిస్తాయని ప్రయాణాలు చేయడానికి సంకోచించేవాళ్లు. ఇప్పుడా అడవులు లేవు, ఆ భయాలు లేవు. పచ్చని చెట్లే కనబడకుండా పోయాయి.
ఎండలు మండుతున్నాయని, అకాల వర్షాలు కురుస్తున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడితే ఏమి లాభం? అంతా స్వయం కృతం.
తోకటపా:
కింది చిత్రాన్ని చూడండి.
ఈ పాటి ఎత్తు ఎదగడానికి నాకు 80 ఏళ్ల టైమ్ పట్టింది. నా వెనుక వున్న వృక్షం ఆకాశమంత ఎత్తు ఎదగడానికి ఎన్ని దశాబ్దాలు గడిచి పోయాయో మరి. ఇంత కాలం దానిని నరకకుండా కాపాడిన వారిని మెచ్చుకోవాలి. మనదేశం కాదు కనుక బతికిపోయింది.
గత పాతికేళ్లలో నేను అనేక సార్లు అమెరికా వెళ్లాను. అక్కడి అనేక నగరాల మాదిరిగానే మా వాడు వుంటున్న సియాటిల్ కూడా పచ్చని నగరం. ఇన్నేళ్ళలో చెట్టు కాదు కదా చెట్టు కొమ్మ కొట్టడం కూడా నేను చూడలేదు.



(ఇంకా వుంది)

27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (273) : భండారు శ్రీనివాసరావు


మంచి పుస్తకం కూడా ప్రాప్తమే!
జీవితం అంటే జ్ఞాపకాలు. ముది వయసులో జ్ఞాపకాలే ఎనర్జీ టాబ్లెట్స్!
2011. అంటే పదిహేనేళ్ల నాటి ముచ్చట.
మాజీ డీజీపీ హెచ్. జే. దొర గారు ఎంత హుందాగా ఉంటారో, ఆయన రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకావిష్కరణ కూడా అంత హుందాగా, ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.
2011 డిసెంబరు నెల 18 వ తేదీ ఆదివారం కావడంతో, హైదరాబాదు బుక్ ఎగ్జిబిషన్ కిటకిటలాడింది. అంత జనసందోహంలో కూడా ఆవిష్కరణ సభ చక్కగా నిర్వహించారు. వేదిక మీద నాటి గవర్నర్ నరసింహన్ తోపాటు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కే. రామచంద్రమూర్తి, మాజీ ఐజీ రావులపాటి సీతారామారావు, ఎమెస్కో విజయ కుమార్ వుంటే, సభకు హాజరయిన వారిలో మాజీ డీజీపీలు అరవిందరావు, ఆర్. ప్రభాకరరావు, మాజీ ఐపీఎస్ అధికారులు శివశంకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంకా అనేకమంది పోలీసు అధికారులు, జర్నలిస్టులు వున్నారు.
గవర్నర్ నరసింహన్ గారి ప్రసంగం, ఆత్మీయంగా సాగుతూ, భేషజాలు లేని మనసులోని మాటలతో సభికులను ఆసాంతం ఆకట్టుకుంది.
అనంతపురంలో దొర గారు ఎస్పీ గా పనిచేస్తున్నప్పుడు నరసింహన్ గారు ట్రైనీ ఏఎస్పీ గా జాయిన్ అయ్యారట. దొరగారి శ్రీమతి కూడా తనను ఎంతో బాగా చూసుకునేవారని చెప్పారు. ఓ సారి ఆయన తీవ్రంగా అస్వస్తులు అయినప్పుడు, పుట్టపర్తి నుంచి సత్య సాయిబాబా విభూతి తీసుకువచ్చి పెట్టారుట. ఈ మాటలు చెబుతూ గవర్నర్ నరసింహన్ గారు, సభలో వున్న దొరగారి శ్రీమతికి వేదికపై నుంచే ప్రత్యేకంగా అభివాదం చేసారు. వాళ్ళ ఆత్మీయత ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఇంటికి వెళ్తే పూత రేకులు పెట్టేవారని గుర్తు చేసుకొన్నారు. ‘దొర గారు ఎప్పుడు ‘అముల్ బేబీ’ మాదిరిగా చిరునవ్వులు నవ్వుతూ వుంటార’ని అంటూ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. అయితే అంత మాత్రాన ఆయన దగ్గర చొరవ తీసుకోలేమమని అన్నారు. పూత రేకులు పెట్టిన కొంతసేపటికే, ‘నైట్ పెట్రోలింగుకు ఎందుకు వెళ్ళలేద’ని కేకలేసేవారని చెబుతూ, డిపార్ట్ మెంటులో వున్న అప్పటి భయ భక్తులను సభికులకు, ముఖ్యంగా సభలో వున్న పోలీసు అధికారులకు జ్ఞాపకం చేసారు. రావులపాటి సీతారామారావు గారిని గురించి చెబుతూ ‘ఆయనతో పాటు పన్నెండు మంది ట్రెయినీ డీఎస్పీలు అనంతపురం పోలీసు ట్రైనింగ్ కాలేజీలో వుండేవారని, మద్రాస్ నుంచి తాను తెచ్చుకున్న తినుబండారాలన్నీ వాళ్ళే తీసేసుకునేవార’ని చురక వేసారు. తనకు తెలుగు చదవడం బాగా రాకపోయినా, పుస్తకం టైటిల్ ‘ఎన్టీఆర్ తో నేను’ అనే బదులు ‘ఎన్టీఆర్ నేనే’ అని పెడితే సరిపోయేదని చతురోక్తి విసిరారు.
గవర్నర్ స్థాయిలో వుండి కూడా వ్యక్తిగత అనుబంధాలకు, ఆత్మీయతకు నిదర్శనంగా నిలిచారు నరసింహన్ గారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరికి ఆ పుస్తకం కావాలని అనిపించింది. కొంతమందికి ఎమెస్కో విజయ్ కుమార్ గారు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. అందరికి ఇవ్వడం సాధ్యం కాదు కదా. ఆ హడావిడిలో రేడియోలో నా సీనియర్ సహచరులు ఆర్వీవీ కృష్ణారావుగారు వెంటనే బుక్ ఎగ్జిబిషన్ లో వున్న ఎమెస్కో స్టాల్ కి వెళితే, ‘లేవు’ అని చెప్పారు. అప్పటికే అందరూ వెళ్లిపోతున్నారు. దొరగారితో ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ లు తీసుకుంటూ వుండడంతో ఆయన బిజీగా వున్నారు.
ఈలోగా ఎవరో చెప్పారు ‘నవోదయ స్టాల్ లో ట్రై చెయ్యండి’ అని. అక్కడకి వెడితే కొద్ది కాపీలే వున్నాయి. ఆయన రెండు కాపీలు కొని, దొర గారి దగ్గరకి వచ్చి ‘సార్! మీ సంతకం కావాలి” అంట, వెంటనే గుర్తు పట్టి సంతకం చేసిచ్చారు. ‘‘రెండో పుస్తకం మీద కూడా కావాలి సార్! ఇది భండారు శ్రీనివాసరావుకి’ అంటే ‘శ్రీనివాసరావు ఎలా వున్నాడు?’ అని ఎంతో అభిమానంగా అడుగుతూ ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కృష్ణారావు గారికి పుస్తకాలు అంటే ప్రాణం. ఆయన ఎప్పుడు పుస్తకాలు కొన్నా మూడు కాపీలు కొనేస్తారు. ఒకటి ఆయన సొంతానికి, మరోటి నాకు, మూడోది ఎవరైనా కావాలి అంటే వారికి ఇవ్వడానికన్నమాట. పై సంగతులు అన్నీ ఆయన నోట నేను విన్నవే.
కృష్ణారావు గారు, నేను లోగడ రేడియోలో పనిచేసే రోజుల్లో దొరగారితో చాలా సన్నిహితంగా వుండేవాళ్ళం. నక్సలైట్ సమస్య ఉధృతంగా వున్న రోజుల్లో రేడియో ప్రభావం బాగా వుండేది. ఢిల్లీ నుంచి వచ్చే స్పాట్ లైట్ వంటి ముఖ్యమయిన కార్యక్రమాల్లో సయితం ఈ సమస్యకు ఎక్కువ ప్రాధాన్యం వుండేది. వృత్తి రీత్యా మేము ఆయన్ని కలిసినప్పుడు, ముఖ్యంగా కొత్త సంవత్సరం ఆరంభంలో డీజీపీ సంప్రదాయంగా ఇచ్చే పార్టీల్లో మమ్మల్ని గుర్తుంచుకుని అభినందించేవారు.
ఈ విధంగా దొరగారు రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం కొనకుండానే, ఆయన ఆటోగ్రాప్ తో సహా, నా చేతికి వచ్చింది.
ప్రతి ధాన్యపు గింజమీదా తినేవాడి పేరు రాసివుంటుందిట. అలాగే ప్రతి పుస్తకం మీదా దాన్ని చదివేవాడి పేరు ఉంటుందేమో! అలా అయాచితంగా దొరగారి పుస్తకం ఆయన సంతకంతోసహా నా ఇంటికి చేరింది.
కృష్ణారావు గారికి ధన్యవాదాలు.
తోకటపా: దొరగారు డీజీపీగా వున్నప్పటి మాట. నేను రేడియో స్టేషన్ కు వెళ్ళడానికి ఖైరతాబాదు మీదుగా వెడుతుంటే లక్ డి కా పూల్ వద్ద ట్రాఫిక్ జామ్. ముందు చూస్తే చాలా వాహనాలు ఆగిపోయి వున్నాయి. అందులో ఒకటి దొరగారిది. ఆయనా అందరిలానే ట్రాఫిక్ లో చిక్కుకుపోయి వున్నారు. కాసేపటి తర్వాత ఆఫీసుకు చేరి ఆయనకు ఫోన్ చేశాను. ‘మీరు కూడా ట్రాఫిక్ లో ఓపిగ్గా అలా ఎలా వుండగలిగారు? తలచుకుంటే నిమిషాల్లో క్లియర్ చేసేవాళ్ళు కదా!’ అని అడిగాను. ఆయన అన్నారు.
’నా ఒక్కడి సమస్య కాదు కదా! సమస్యకు పరిష్కారం వెతకాలి. ఇప్పుడు అదే పని మీద వున్నాను’ అన్నారు ప్రశాంతంగా.



(ఇంకా వుంది)

26, ఫిబ్రవరి 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (272) : భండారు శ్రీనివాసరావు

 

పలుకుబడి దుర్వినియోగంలో నేనే నెంబర్ వన్
రేడియో విలేకరిగా ఆ స్థానాన్ని నా అంతగా దుర్వినియోగం చేసిన వాళ్ళు మరొకరు వుండరు అనేది నా నమ్మకం. ఎవరు ఏది అడిగినా సరే, అదేదో నా చేతిలో పని అయినట్టు, ఆ పనిచేయాల్సిన వాళ్లకు చెప్పి చేయించేవాడిని. అయితే నా ఈ తత్వం నాకు రేడియోలో మంచి పేరు తీసుకురావడమే ఆశ్చర్యం.
ఆకాశవాణి, దూరదర్సన్ లకు కలిపి ఏర్పాటు చేసిన ప్రసార భారతి సీ ఈ ఓ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఓ. పీ. కేజరి వాల్ ఒకసారి అధికారిక సమావేశాల్లో పాల్గొనడం కోసం హైదరాబాదు వచ్చారు.
ఆయన రెండు రోజులు వుండే నిమిత్తం వస్తే, జరూరుగా ఢిల్లీ రావాలని పైనుంచి కబురు వచ్చింది. ఆయన రిజర్వ్ చేసుకున్న విమానం టిక్కెట్టు మర్నాటికి. కానీ సాయంత్రమే బయలుదేరి వెళ్ళాలి.
మా స్టేషన్ డైరెక్టర్ నన్ను పిలిపించారు. ‘నో ప్రాబ్లం’ అని బేగం పేట ఎయిర్ పోర్టుకి తీసుకు వెళ్ళాను. ఆ రోజుల్లో నా గుర్తింపు కార్డు ఎక్కడికి వెళ్ళాలన్నా బాగా పనికి వచ్చేది.
అప్పటికే బోర్డింగు పాసులు ఇచ్చేశారు. ఎయిర్ పోర్ట్ అధికారికి విషయం చెప్పి ‘ఏమైనా సాయం చేయగలరా’ అని అడిగాను. ‘మీరు వెళ్లి ఎవరిదైనా బోర్డింగు పాసు తీసుకువస్తే ప్రయత్నం చేస్తాను’ అన్నాడు. వెంటనే వెళ్లి వీ.ఐ.పీ. లాంజులో వెయిట్ చేస్తున్న వారెవ్వరని పరికించి చూసాను. బాగా పరిచయం, చనువు వున్న ఓ ఎంపీ దగ్గరికి వెళ్లి, ‘ఈ రోజే ఢిల్లీ వెళ్ళాలా, రేపు వెళ్ళినా పరవాలేదా’ అని అడిగాను. ఆయన నవ్వి ‘ఈ రాత్రి అక్కడికి పోయి చేసేదేమీ లేద’న్నాడు.
వెంటనే ఆయన బోర్డింగు పాసు తీసుకుని మా సీయీవోకు ఇచ్చాను. ‘పదండి పోదాం’ అంటూ టార్మాక్ మీద ఆగివున్న విమానం ఎక్కించాను. నేను కూడా విమానం మెట్లెక్కుతుంటే ఆయన ఆశ్చర్యంగా అడిగాడు, ‘మీరు కూడా ఢిల్లీ వస్తున్నారా!’ అని. నేను నవ్వేసి బై బై చెప్పేసి బయటకు వచ్చాను. సీఈవో విమానం ఎక్కారన్న విషయం తెలుసుకుని బయట వెయిట్ చేస్తున్న మా అధికారులు చాల సంతోష పడ్డారు.
తర్వాత నా పేర స్టేషన్ డైరెక్టర్ కు ఒక ఉత్తరం వచ్చింది.
‘హైదారాబాదు ఎయిర్ పోర్టులో మీరు చేసిన మిరకిల్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇలా కూడా జరుగుతుందా అనే ఆలోచన నుంచి ఇప్పటికీ బయటపడ లేకుండా వున్నాను’
అని రాసారు అందులో నన్ను ఉద్దేశించి.
ఆ రోజులు కాబట్టి ఇవన్నీ చెల్లాయి. ఈ కంప్యూటర్ కాలంలో ఇలా సాయాలు చేయడం అధికారులకు కూడా సాధ్యం కాని పని.
కొంత కాలం క్రితం కాబోలు, జర్నలిస్టులు ఫోను కనెక్షన్లు గురించి హిందూ సాయి శేఖర్ A. Saye Sekhar (హిందూ పేపర్ ఆయన వదిలేసినా నేను అలానే పిలుస్తాను) అద్భుతమైన, ఆసక్తికరమైన సొంత అనుభవం ఒకటి పోస్ట్ చేశారు. దుర్వినియోగం అంటారో, వినియోగం అంటారో తెలియదు కానీ ప్రతి పాత్రికేయుడూ ఎప్పుడో ఒకసారి కొన్ని పనులు ఇలాంటివి (రైలు టిక్కెట్లు, విమానం టిక్కెట్లు చివరి క్షణంలో కన్ఫర్మ్ చేయించడం వగయిరా) వృత్తిరీత్యా చేయక తప్పదు. బహుశా ఈ విషయంలో నాది ఒక రికార్డు అని చెప్పుకోవడానికి వీలైన అనుభవాలు బోలెడు బొచ్చెడు వున్నాయి.
ముందు టెలిఫోన్ సంగతి. రేడియోలో చేరినప్పుడు మా ఇంట్లో ఫోను వుండేది కాదు. వార్త ఇవ్వాలంటే మేముంటున్న చిక్కడపల్లి త్యాగరాయ గానసభ దగ్గర నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న టెలిఫోన్ (తంతి, తపాలా కార్యాలయం అనాలేమో) ఆఫీసుకో, లేదా అశోక్ నగర్ లో ఉన్న జ్వాలా ఇంటికో వెళ్ళాలి. (ఆయనకీ ఈ సౌకర్యం లేదు కాని వాళ్ళ బావగారి (మా మేనల్లుడు డాక్టర్ రంగారావు) ఫోను అక్కడ వుండేది.
కొన్నాళ్ళు అలా గడిచిన తరువాత ఫోను కావాలనే విషయం అప్పటి జనరల్ మేనేజర్ బాల సుబ్రహ్మణ్యం గారి (అప్పట్లో హోల్ మొత్తం ఇరవై మూడు జిల్లాలకు ఆయనే సర్వాధికారి) దృష్టికి తీసుకు వెడితే, ఆయన మారుమాట్లాడకుండా ఒకే ఒక్క రోజులో మా ఇంట్లో ఫోను పెట్టించారు. ఏరియా సబ్ డివిజినల్ మేనేజర్ స్వయంగా వచ్చి ఫస్ట్ కాల్ కనెక్ట్ చేసి మాట్లాడారు.
ముందు నేను కోరుకున్న నెంబర్ 65758 ఇచ్చారు. మొదటి బిల్లు కూడా కట్టక మునుపే ఆ నెంబరు మీద మొహం మొత్తింది. 66066 కావాలంటే మళ్ళీ దానికి మార్చారు. టెలిఫోన్ డైరెక్టరీలో బోల్డ్ అక్షరాల్లో నా పేరు వేసేవారు. బెజవాడ రేడియో స్టేషన్ కు కాల్ బుక్ చేస్తే లైట్నింగ్ కాల్ మాదిరిగా వెంటనే కలిపేవారు. అప్పటికీ ఎస్. టి. డి. విధానం రాలేదు.
తర్వాత రేడియో మాస్కో ఉద్యోగం కోసం హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాము.
అయిదేళ్ళ తర్వాత తిరిగొచ్చాము. పంజాగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్ లో మా అన్నయ్య ఇంట్లో ఉంటూ, అద్దె ఇంటికోసం వెతుకులాట మొదలు పెట్టాము.
ఎందుకో ఓ రోజు బేగంపేట ఎయిర్ పోర్టుకి వెడితే అక్కడ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ రంగయ్య నాయుడు కలిసారు. ‘ఎన్నాళ్ళయింది మాస్కో నుంచి వచ్చి’ అని అడిగారు. ఇంటి కోసం చూస్తున్నాను అని చెప్పాను.
మర్నాడు మధ్యాన్నం రేడియోకి వెళ్ళే సరికి ఇద్దరు ముగ్గురు టెలిఫోన్ డిపార్ట్ మెంటు వాళ్ళు కనిపించారు.
‘మీకు ఫోన్ శాంక్షన్ చేస్తూ రాత్రి ఢిల్లీ నుంచి టెలెక్స్ మెసేజ్ వచ్చింది. ఈ ఫారం పూర్తి చేసి, అడ్రసు వివరాలు ఇవ్వండి’ అన్నారు. ‘ఇల్లే ఇంకా దొరకలేదు ఫోను ఎక్కడ పెట్టుకోను’ అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. సరే ఇల్లు దొరికిన తర్వాత చెప్పండని వెళ్ళిపోయారు.
పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఇల్లు తీసుకుని పాలు పొంగించక ముందే ఫోను, లాంగ్ కార్డుతో సహా ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు మళ్ళీ నెంబరు సమస్య. నేను అడిగిన 22011 ఇచ్చారు. ఇస్తూనే చెప్పారు. ఇలా వరస నెంబర్లతో కొంత ఇబ్బంది పడతారు జాగ్రత్త అని. అయినా నేను వినలేదు.
మర్నాటి నుంచి రాంగ్ కాల్స్. పలానా వారు వున్నారా అంటే పరవాలేదు. “హిందూ స్మశానమా! రాత్రి మా బంధువు చనిపోయారు, దహనం చెయ్యాలి’ అని ఒకరు, “పోలీసు కంట్రోల్ రూమా” అని మరొకరు, “గ్యాస్ బుకింగా” అని ఇంకొకరు ... ఇలా కాల్స్ వచ్చేవి.
అయినా సాయి శేఖర్ చెప్పినట్టు, ఆ రోజుల్లో ఫోను ఒక అపురూపమైన వస్తువు. ఇంట్లో ఫోను మోగుతుంటే అదో దర్జా! అదో వైభోగం!



(ఇంకా వుంది)

24, ఫిబ్రవరి 2026, మంగళవారం

యుద్ధాలు మిగిల్చేది ఏమిటి? - భండారు శ్రీనివాసరావు

‘తాతల తండ్రుల చంపుకొనుటకా ఈ భండనంబు కృష్ణా!’
కురుక్షేత్ర రణక్షేత్రంలో మహా భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తెల్లగుర్రముల రధమును తోలే నల్లనయ్యను అప్పటికి అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు అడుగుతాడీ ప్రశ్న.
తదుపరి కృష్ణుడు గీతార్ధసారం ఎరిగించిన తరువాత ఎరుకనబడిన సవ్యసాచి అన్నదమ్ములతో కలసి సాగించిన ఆ మహా సంగ్రామం అనంతరం కూడా నివృత్తి కాని సందేహం ఇదే.
ఎందుకంటె పద్దెనిమిది రోజులపాటు జరిగిన ఈ మహాయుద్ధంలో విజయం సాధించిన యుధిష్టురుడికి మిగిలిందేమిటి? గుట్టలకొద్ది సైనికుల శవాలు. ఆనవాలు పట్టలేని ఆత్మీయుల కళేబరాలు.
కౌరవ పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్న అనేక అక్షౌహిణుల సైన్యం నిహతమయింది.
శవాల గుట్టల నడుమ, గెలిచినవారి పక్షాన బతికిబట్టగలిగింది ధర్మజ,భీమ,అర్జున,నకుల,సహదేవులు, కృష్ణుడితో కలిపి మరో ఇద్దరు మాత్రమే. ఈ ఇద్దరిలో సాత్యకిని మినహాయిస్తే యుయుత్సుడి విషయం మళ్ళీ అనుమానమే అంటారు చరిత్రకారులు.
అంటే విజయలక్ష్మి వరించిన ధర్మజుని పక్షంలో మిగిలింది కేవలం ఏడుగురు మాత్రమే. అటు ఓడిన కౌరవ పక్షంలో ప్రాణాలతో బయటపడింది నలుగురే నలుగురు. అశ్వథామ, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడి కుమారుడయిన విశ్వకేతు.
ఎవరి కారణంగా ఈ మహారణం చెలరేగిందో ఆ కురుసార్వభౌముడు, దుర్యోధనుడితో పాటు దుశ్శాసనాది అతడి సోదరులందరూ ఈ మహా యుద్ధంలో అసువులు బాశారు.
పదిహేను లక్షల యాభయ్ మూడు వేల తొమ్మిది వందల సైనికులతో కూడిన ఏడు అక్షౌహిణుల పాండవదండుకు సైన్యాధ్యక్షుడు పాంచాల రాజు ద్రుష్టద్యుమ్నుడు కాగా, ఇరవై నాలుగు లక్షల అయిదు వేల ఏడు వందల సైన్యం కలిగిన పదకొండు అక్షౌహిణుల కౌరవసేనకు తొలుదొల్త నాయకత్వం వహించింది భీష్మ పితామహుడు.
యుద్ధ పరిసమాప్తి నాటికి ఇరువైపులా మొత్తం సైనికులందరూ తుడిచిపెట్టుకుపోయారు.

తోకటపా :

పామును చూసి మనిషి భయపడినట్టే, మనిషిని చూసి పాము కూడా భయపడుతుంది. పాము కాటు వేస్తుందేమో అని మనిషి భయం. మనిషి చేతిలో కర్ర చూసి పాముకు భయం.
అణు బాంబులు ఉన్న దేశాలు తలపడ్డప్పుడు కూడా ఇదే పరిస్థితి. వాళ్లకు ఆ భయం ఉన్నంత వరకు ఇక ఎవరికీ ఏ భయం అక్కరలేదు.
ఎందుకంటే పూర్తి స్థాయి అణు యుద్ధమే సంభవిస్తే, అందులో విజేతలు వుండరు. పరాజితులు మిగలరు. సర్వ నాశనమే అనే సంగతి అణు దేశాలకే బాగా ఎరుక.

23, ఫిబ్రవరి 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (271) : భండారు శ్రీనివాసరావు


పల్లెకు పోదాం రండి!
దేశంలో అభివృద్ధి పెరుగుతోందో, దరిద్ర నారాయణుల సంఖ్య పెరుగుతుందో లెక్కలు కట్టే విషయంలో రాజకీయ అభిప్రాయ విబేధాలు వుండవచ్చేమో కానీ, సార్వత్రిక సామాన్య జనాభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా పెరుగుతున్నది మాత్రం వయోవృద్ధుల సంఖ్య. దీన్ని నిర్ధారణ చేసుకోవడానికి పెద్దగా గణాంకాల అవసరం వుండదు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కరవు భత్యం పెంచినప్పుడల్లా కానవచ్చే సంఖ్యలు చూస్తే చాలు. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య కన్నా పదవీ విరమణ చేసి పెన్షన్ తీసుకునే వారి సంఖ్య అధికంగా వుండడమే ఇందుకు ఉదాహరణ.
నేను 2005 డిసెంబరు 31వ తేదీన హైదరాబాదు దూరదర్సన్ నుంచి అరవై ఏళ్ళు నిండగానే రిటైర్ అయ్యాను. అంటే ఇప్పటికి ఇరవై ఒక్క ఏళ్ళుగా రిటైర్ మెంట్ జీవితం గడుపుతున్నాను.
1975 లో ఆలిండియా రేడియోలో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చాను. దాదాపు ముప్పయ్ ఏళ్ళ ఉద్యోగ ప్రస్థానం తర్వాత కూడా ఇంకా హైదరాబాదు లోనే వుండిపోయాను. ఏదో సొంత ఇల్లు వుంది ఇక్కడే స్థిరపడ్డాను అంటే కొంత అర్ధం వుంది.
యాభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు వచ్చినప్పుడు మాకు తెలిసిన/ బంధువుల కుటుంబాలు వేళ్ళ మీద లెక్క పెట్టేవిగా వుండేవి. ఇన్నేళ్ళలో వాటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. హైదరాబాదు కాకుండా ఇతర ఊళ్లలో వుంటున్న వారి సంఖ్య ఇప్పుడు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అంటే ఒక్క మా కుటుంబానికి చెందిన వారే ఇంతమంది హైదరాబాదు వాసులుగా మారిపోయారు. వారిలో చాలామంది రిటైర్ అయ్యారు. ఇక్కడే సెటిల్ అయ్యారు కూడా.
ఇలాగే గత అయిదు దశాబ్దాల కాలంలో ఉద్యోగాలకోసమో, ఉపాదికోసమో, వ్యాపారాల నిమిత్తమో, బతుకుతెరువు కోసమో ఈ నగరానికి వచ్చిన వారి సంఖ్య లక్షల్లో వుంటుంది. అలాగే పట్టణీకరణ ఫలితంగా ఇతర పట్టణాలు, నగరాల మీద కూడా జనాభా వత్తిడి బాగా పెరిగింది.
'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు మాత్రమే ఈ పని చేసి చూపించారు. హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తి కాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ, పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.
చదువుల కోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే నగరాల మీద ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) భారం పడదని నా వాదన.
ఇంతే కాదు, చదువుకుని చిన్నా పెద్దా ఉద్యోగాలు చేసిన వాళ్ళు,రిటైర్ అయిన తర్వాత వాళ్ళ స్వగ్రామాలకు తరలి పొతే, ఆ పల్లెలకు కూడా ప్రయోజనం.
కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.
కింది ఫోటో : మా స్వగ్రామంలో ఒకప్పటి మా పూర్వీకుల ఇల్లు. ఇప్పడు లేదు దాని స్థానంలో మా అన్నయ్య పిల్లలు ఒక చిన్న డాబా ఇల్లు కట్టించారు, నేటి అవసరాలకు తగ్గట్టుగా.



(ఇంకా వుంది)

22, ఫిబ్రవరి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (270) : భండారు శ్రీనివాసరావు

 

వామ్మో! ఓస్ ఇంతేనా!
బజార్న పోతుంటే దారి పక్కన జూగుప్స కలిగించే దృశ్యం కనబడుతుంది. వెంటనే కళ్లు తిప్పుకుంటాం. సోషల్ మీడియాలో కూడా అంతే. ఇష్టం లేని వాటి వంక కన్నెత్తి చూడకూడదు. అప్పుడు మన బీపీ కంట్రోల్ లో వుంటుంది.
నిప్పుతో వంట చేసుకోవచ్చు వళ్ళు కాల్చుకోవచ్చు. ఫలితం ఏదైనా వాడుకునే తీరులో వుంటుంది.
మనలో చాలా మందిమి మనకు తెలియని సంగతులు లేవు అనుకుంటాము. నేనూ వారిలో ఒకడినే. ఇది ఒప్పుకోవడానికి ఎలాంటి భేషజం లేదు. అందరికీ అన్నీ తెలియాలని లేదు.
పద్నాలుగు పద్నాలుగులు ఎంత అంటే ఠకీమని జవాబు చెప్పడం నాకయితే కష్టం. అదే లెక్కలు బాగా తెలిసిన వాడయితే, ఓస్ ఇంతేనా! అంటాడు. క్షణంలో జవాబు చెప్పేస్తాడు. తెలియని నావంటి వాడయితే, ఇంత గొట్టు ప్రశ్నా! వామ్మో! అంటాడు.
వర్తమాన కాలంలో వయో వృద్ధులకు అన్నీ తెలిసినా కొన్ని కొన్ని తెలవ్వు. ముఖ్యంగా సాంకేతిక విషయాలు. తరానికి తరానికి నడుమ ఈ వైరుధ్యాలు తప్పవు. జెంజీల కాలం నడుస్తున్న ఈ కాలంలో అయితే, ఈ సమస్య మరీ ఎక్కువ.
నా చిన్నప్పుడు అప్పయ్య మాస్టారు చెప్పిన నాలుగు అక్షరాలు వంటబట్టగానే, తల ఎగరేయడం మొదలయింది.
రామాయణ, భారత భాగవతాలు ఆశువుగా, ధారాళంగా చెప్పే మా బామ్మకు కానీ, మా అమ్మకు కానీ అక్షర జ్ఞానం లేదు. చదవ లేరు. వారిదంతా శృత పాండిత్యం. చెవులతో విని నేర్చుకున్నది.
ఏ అక్కయ్యో కార్డు ముక్క రాసేది. కాస్త చదివి పెట్టరా నాన్నా అని నన్ను బతిమిలాడేవాళ్ళు. ఇంత బెల్లం ముక్కో కొబ్బరి లౌజో చేతిలో పడేదాకా వాళ్ళ మాట వినకుండా చెట్టెక్కి కూర్చొనే వాడిని.
మొన్నీ మధ్య ఒక ధరకాస్తు పూరించాల్సిన పని పడింది. ఇన్నేళ్ళుగా ఫోటో అంటించడానికి అలవాటు పడ్డ ప్రాణాలకు ఫోటో అప్ లోడ్ చేయడం అనేది బొత్తిగా తెలవని విషయమే. పైగా ఫోటో ఇన్ని కేబీలు, సంతకం ఇన్ని కేబీలు వుండాలి అంటే, కేజీలు తప్ప కేబీలు తెలియని వాళ్ళు ఏమై పోవాలి. చిన్నప్పుడు మా బామ్మలు బతిమిలాడినట్టు విషయం తెలిసిన వాడిని పట్టుకుని పని చేయించుకోవాలి. తప్పదు. నాకు తెలియదు అంటే కుదరని కాలంలో జీవిస్తున్నాం.
నిన్నా మొన్నా నా మొబైల్ మొరాయింపుతో గతంలో చేసిన తప్పులకు ఈ జన్మలోనే దేవుడు బుద్ధి చెబుతాడని తెలిసి వచ్చింది.
నాకసలు ఖాతాయే లేని HDFC బ్యాంకు నుంచి నిన్న ఏవో మెసేజ్ లు వచ్చాయి. సాంకేతిక నిరక్షరాస్యుడిని కనుక కంగారు పడిన మాట నిజం.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగానే అనేకమంది స్పందించారు. సలహాలు, సూచనలు చేశారు. నిజానికి ఇదెంత గొప్ప విషయం.
సమస్యతో సంబంధం లేని వాళ్లకి ఇదో సమస్యా అనిపించవచ్చు. కానీ సోషల్ మీడియా మితృలు అలా అనుకోలేదు. ఇది తమ సమస్యే అన్నట్టుగా వారు స్పందించిన తీరు నన్ను ముగ్ధుడిని చేసింది.
చంద్రశేఖర్ కోటిపల్లి Chandra Sekhar Kotipalli గారు రాసిన వివరణతో నా ఆందోళన పూర్తిగా సమసిపోయింది. ఆయన ఇలా రాసారు.
“మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకుకి HDFC వాళ్ళు UPI పేమెంట్స్ చేసే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు కొత్త ఫోన్ ద్వారా gpay/phone pe కి రిజిస్టర్ అయినప్పుడు ఈ మెసేజెస్ వస్తాయి, మరేం ఇబ్బందిలేదు. రేపటి నుంచి యధావిధిగా మీ gpay పని చేస్తుంది”
ఆయన అన్నట్టే జరిగింది. సమస్య పరిష్కారం అయింది.
నా ఒక్క విషయమే కాదు.
ఈ మీడియాలో ఎవరో పోస్టు పెడతారు. ‘ఈరోజు నా బిడ్డ పుట్టిన రోజు, మీ ఆశీస్సులు అందివ్వండి’ అని. వెంటనే డజన్ల కొద్దీ ఆశీర్వచనాలు ఆ బిడ్డకు అందుతాయి. మరెవరో నాకు ఒంట్లో బాగాలేదు అంటారు. త్వరగా కోలుకోవాలంటూ మెసేజులు వస్తాయి, అదీ ముక్కూ మొహం తెలియని వారి నుంచి. నిజానికి ఫేస్ బుక్ అనే పేరే కానీ దీనికే ఒక మొహమంటూ లేదు. నూటికి ఎనభయ్ మంది ఒకరికొకరు ముక్కూ మొహం తెలియని వారే. అయినా సొంత మనుషుల్లా ఆప్యాయత చూపుతారు. మంచిదే కదా!
ఇందులో మంచిని చూస్తే మంచే కనబడుతుంది. బయట ఉన్నట్టే అన్ని రంగాలకు చెందిన కుళ్ళు ఇక్కడ కూడా వరదలా పారుతుంది. మురికి కాలువ దాటేటప్పుడు ముక్కు మూసున్నట్టు కళ్ళూ ముక్కూ కాసేపు మూసుకోండి. అటు వైపు చూడకండి. అంతా మంచే కనబడుతుంది.
ముందే చెప్పినట్టు మీ బీపీ మీ కంట్రోల్ లో వుంటుంది.
(ఇంకా వుంది)