2, మార్చి 2021, మంగళవారం

కన్నీరు తెప్పించిన కదిలే ఫోటో

మా మూడో అన్నయ్య మనుమడు శైలేష్, చనిపోయిన మా ఆవిడ ఫోటోకు జీవం పోసి అమెరికా నుంచి నాకు గిఫ్ట్ గా పంపాడు. థాంక్స్ రా శైలేష్! 



blob:https://web.whatsapp.com/42775b27-1064-4ed5-bee8-be0e07f7ced5


రాజకీయాల్లో ఇంత డబ్బు ఉందా?

 

“మీరు మహా టీవీకి వెడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ బాబు గారికి అనుకూలంగా కొన్ని మాటలు చెబుతారు. నాకు బాగా తెలుసు. మిమ్మల్ని చాలా రోజులుగా టీవీల్లో చూస్తున్నాను. ఈ మధ్య రావడం లేదు. అది వేరే సంగతి”
నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం ఆ ఓలా క్యాబ్ డ్రైవర్ పేరు కరుణాకర్.
మూతి గుడ్డ పెట్టుకుని మాట్లాడడం వల్ల ముందు అతనేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు. నేను కల్పించుకునే చెప్పేలోగా అతడే ఇంకా ఇలా అన్నాడు.
“మొన్న మిమ్మల్ని సాక్షిలో చూశాను. అక్కడా ఇంతే. జగన్ గారికి కొంత అనుకూలంగా మాట్లాడారు. నేను తప్పు పట్టను. మీలో నాకో సుగుణం కనిపించింది. బాబు అనుకూల ఛానల్లో బాబు వైపు మొగ్గు చూపినా జగన్ గారికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా నోరు తెరిచి చెప్పరు. అలాగే సాక్షిలో జగన్ గారికి అనుకూలంగా మాట్లాడుతారు కాని బాబు గారికి వ్యతిరేకంగా ఎవరు రెచ్చగొట్టినా మాట్లాడరు. అయినా మీరు నాకు ఎందుకు నచ్చుతారంటే, ఏ టీవీలో మాట్లాడినా మధ్యలో ఎక్కడో వీలు చేసుకుని ఆ ఛానల్ వాళ్లకు ఇష్టం వున్నా లేకపోయినా మీ మనసులో మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అందుకే ఏ ఛానల్లో కనపడ్డా, యూ ట్యూబ్ లో కనపడ్డా నేను తప్పకుండా చూస్తాను”
అన్నాడు కరుణాకర్.
ఇంతకీ పొగుడుతున్నట్టా, తెగుడుతున్నట్టా! ఏదైనా దాచుకోకుండా మనసులో మాట చెబుతున్నాడు. జనం నాడి తెలుసుకోవడానికి ఇలాంటివాళ్ళే బెటరు.
“రాజకీయాలు అంటే ఇంట్రస్టా” అని అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలని.
“నాకొకటి చెప్పండి. వీళ్ళకు ఇంత డబ్బు ఎలా వస్తుందండీ. నాకొక దోస్త్ వున్నాడు. వాడూ ఒకప్పుడు నాలాగే డ్రైవర్. ఒక నాయకుడి దగ్గర చేరి ఎక్కువ కాలం కాలేదు. ఏదో ఎన్నికల్లో మా వాడిని మా ఊరి వార్డు మెంబరు చేశారు. ఇప్పుడు అతడి వైభోగం వేరు. సొంత కారుంది. చిన్న ఇల్లు కట్టాడు. చాలా ఖరీదు చేసే సెల్ ఫోన్లు తరచూ మారుస్తుంటాడు. ఒక వార్డు మెంబరు అయితే ఇంత సంపాదన ఉంటుందా! ఈ లెక్కన బడా బడా నాయకుల రాబడి ఎంత వుంటుందో మరి”
జవాబు చెప్పే వ్యవధానం లేకుండా చేరాల్సిన గమ్యం చేరుకోవడం వల్ల అతడి ప్రశ్నకు బదులు ఇవ్వలేదు. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు.
(OLACAB : KARNAKAR TS 15UB 3347)

మేకు జోకు - జోకు మేకు - భండారు శ్రీనివాసరావు

 

కొన్ని సందర్భాలలో జోకు మేకయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొన్ని జోకులు ఆడవారి మీద పేలిస్తే అవి రివర్స్ లో తగిలే ప్రమాదం వుంది. కాకపోతే ఇలాటి జోకులన్నీ స్త్రీ స్వాతంత్రం ఎక్కువగా వున్న దేశాల్లోనే ఎక్కువగా పుట్టి మన దగ్గరికి దిగుమతి అయ్యాయి. ఆ పరాయి జోకుల్ని సొంత భాషలోకి అనువదించాలనే ఉత్సాహపరులకి కొండొకచో కొన్ని పాట్లు (కామెంట్లు) తప్పవు. అయినా సరే, కామెంట్లే కదా సర్దిపుచ్చుకుందాం అని అనువాదం చేస్తే ఇదిగో ఆ జోకులు ఇల్లా వుంటాయి.

అమెరికా తండ్రికి కూతురు ఫోను చేసి చెప్పింది.'సారీ డాడ్. నిన్న అనుకోకుండా నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేసి చెప్పే టైం లేకపోయింది'

తండ్రి: పర్వాలేదులే. మళ్ళీ ఇలాటి సందర్భం రాకపోదులే. అప్పుడు మాత్రం గుర్తుంచుకుని కబురు చెయ్యి'

ఇండియా పిల్లాడు తన అమెరికన్ స్నేహితుడితో చెప్పాడు, ' నాకు నలుగురు అక్కయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు మరి నీ సంగతేమిటి?'

'నాకా! నాకు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. కాకపోతే నా మొదటి అమ్మద్వారా నలుగురు నాన్నలు, మొదటి నాన్న ద్వారా ముగ్గురు అమ్మలు'

"ఆడవాళ్ళు ముగ్గురి మాటే చెవిపెట్టి వింటారు. అంతే కాదు, వారు చెప్పిన మాటలు అక్షరాలా ఆచరిస్తారు. అని ఓ మగ పిశాచి ఉవాచ.

ఆ ముగ్గురు ఎవ్వరంటే ఒకడు టైలర్, రెండోవాడు ఫోటోగ్రాఫర్, మూడో వ్యక్తి బ్యుటీషియన్. వీళ్ళు ముగ్గురు కాకుండా తలకిందుగా తపస్సు చేసినా సరే, ఆడంగులు ఈ భూప్రపంచంలో ఎవ్వరి మాట వినరుగాక వినరు. కాకపోతే కొందరు విన్నట్టు నటిస్తారుట"

1, మార్చి 2021, సోమవారం

ఇది నా జీవితం. కధకాదు.

 


అంచేత సాఫీగా ఎలాంటి ముడులు, ఎత్తుగడలు లేకుండా చెబుతాను.

అసలు ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకోవాలి. కాగితం మీద పెట్టేవి కావనే స్పృహ లేనివాడిని కాదు. కానీ  పంచుకునే మనిషి మాయమై పోయింది.  మంచీ చెడూ చెప్పే  తోడు లేకుండా పోయింది. పిల్లలు, కోడళ్ళ పుణ్యమా అని కరోనా కాలంలో కూడా జీవితం సాఫీగా గడిచిపోతోంది. దేనికీ లోటు లేదు, ఎవరూ తీర్చలేని ఆ ఒక్క లోటుతప్ప. ఆదివారం సామాను సదిరే కార్యక్రమంలో ఓ కపిలకట్ట బయట పడింది. అందులో ఏముంటాయో నాకు తెలుసు కాని మా అబ్బాయికి, కోడలికి తెలియదు. దాన్ని నేను పదిలంగా తీసుకుని భద్రపరచుకున్నాను. మా ఆవిడకు అదంటే ప్రాణ సమానం. మేము మాస్కో వెళ్ళినా మాతోటే వచ్చింది. తిరిగి మాతోటే ఇండియా వచ్చింది. హైదరాబాదులో ఎన్నో ఇళ్ళు మారినా అది మాత్రం తను మరచిపోకుండా వెంట తెచ్చుకునేది. అందులో బంగారం ఏమీ లేదు. బంగారం లాంటి ఉత్తరాలు ఉన్నాయి. మా పెళ్ళికి పూర్వం, యాభయ్ మూడేళ్ల క్రితం, రెండు మూడేళ్ళ పాటు మా మధ్య ఉత్తరాయణం నడిచింది. నేను రాసినవన్నీ ఆవిడ దగ్గర భద్రంగా వున్నాయి. తను రాసిన వాటిలో కొన్నే నా దగ్గర మిగిలాయి.

మిమ్మల్ని ఇలాంటి వ్యక్తిగత విషయాలతో విసిగించడం నా ఉద్దేశ్యం కాదు. ప్రేమించిన ఆడదాని హృదయం ఎంత గొప్పదో, అది ఎంతటి ఉదాత్త ప్రేమో చెప్పడం కోసమే ఈ ప్రయత్నం.

ఆమె రాసిన వాటిల్లో అణువణువూ ప్రేమమయం. నా ఉత్తరాలు అన్నీ డాబుదర్పం. పెళ్ళయిన తర్వాత ఎలా మెలగాలి, అత్తగారు, ఆడబిడ్డలతో ఎలా వుండాలి ఇలా అన్నమాట. నిజానికి అలా నిర్బంధించే అధికారం నాకేమి వుంది. ఆమె నన్ను ప్రేమిస్తోంది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. అంతే! అలాంటప్పుడు నా ఈ పేను పెత్తనం ఏమిటి? అవి చదివి ఎంత నొచ్చుకుని వుంటుంది. అయినా నన్ను పెళ్ళాడింది అంటే అది ఆమె గొప్పతనమే. ఇప్పుడు తలచుకుంటే చాలా చిన్నతనం అనిపిస్తుంది.

నన్ను మన్నించు! నన్ను క్షమించు ! అని ఎంతగా గొంతు చించుకున్నా నా మాటలు వినబడనంత దూరానికి వెళ్ళిపోయింది.



28, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఓ కప్ప కధ

 అనగనగా ఓ కప్ప. ఆ కప్పకు ఓ రోజు చెట్టెక్కాలని బుద్దిపుట్టింది. అనిపించిందే తడవు, నున్నగా సన్నగా వున్న ఓ చెట్టు చూసుకుని ఎక్కడం మొదలెట్టింది. మిగిలిన కప్పలు చుట్టూచేరి, 'వద్దు వద్దు, చెట్లెక్కడం మన ఇంటా వంటా లేదు. అందులోను అంత పొడుగు చెట్టు అసలెక్కలేవు. అక్కడినుంచి పడ్డావంటే జనాభా లెక్కల్లో లేకుండా పోతావు, దిగిరా దిగిరా' అని నిరుత్సాహపరుస్తూ బావురుమంటూ వెంటపడ్డాయి. అయినా లెక్కచేయకుండా ఆ కప్ప అమాంతం ఆ చెట్టెక్కి కూర్చుంది.

యెలా?

యెల్లా అంటే, ఆ కప్ప చెవిటిది. ఒక్క ముక్కా వినబడదు. అందుకే తోటికప్పలు బావురు బావురుమంటూ, 'వద్దు వద్దం'టూ ఇచ్చే ప్రతికూల సలహాలు దాని చెవికెక్కలేదు. అందుకే హాయిగా చెట్టెక్కగలిగింది.

ఈ కప్ప కధలోని నీతి ఏమిటంటే ఏ పనిచేయబోయినా 'వద్దు వద్దు ఆ పని నువ్వు చెయ్యలేవు' అని నిరుత్సాహపరిచే వాళ్ళే ఎక్కువ వుంటారు. సాహసాలు చేసేవాళ్ళు అలాటి మాటలు చెవిన పెట్టకూడదు. ఎవరేమన్నా ముందు అనుకున్న రీతిలోనే ముందుకు సాగిపోవాలి.

 

పి.శివశంకర్ – ఓ జ్ఞాపకం

 

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియో మాస్కోలో పనిచేయడానికి నిర్ణయం జరిగింది కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు రావడంలో జాప్యం జరుగుతోంది. విషయం తెలుసుకుందామని నేనూ, అప్పుడు రేడియో న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఆకిరి రామకృష్ణారావు గారు కలిసి ఢిల్లీ వెళ్లాం. ఏపీ భవన్ లో దిగి బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసుకుని ఆఫీసు పని వేళలకి ఇంకా కొంత సమయం ఉండడంతో అప్పుడు కేంద్ర మంత్రిగా వున్న శివశంకర్ ఇంటికి ఫోను చేసి వస్తున్నట్టు ఆకిరి చెప్పారు. ముందే కబురు చేయడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు వెంటనే లోపలకు పంపారు. ముందు గదిలో శివశంకర్ కూర్చుని వున్నారు. మమ్మల్ని సాదరంగా పలకరించి వచ్చిన పని ఏమిటని వాకబు చేసారు. ఆకిరి సంకోచించకుండా నా మాస్కో ఆర్డర్లు లేటవుతున్నాయని చెప్పారు. ఆయన వెంటనే రాక్స్ ఫోనులో (మాట్లాడే విషయాలు ఇతరులకు తెలిసే అవకాశం లేని ఫోన్లు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమైన సీనియర్ అధికారుల ఇళ్ళల్లో మాత్రమే వుంటాయి) సమాచార శాఖ కార్యదర్శితో మాట్లాడి నా విషయం చెప్పారు. ఆయన పదిగంటలకు ఆఫీసుకు పంపించమని చెప్పారు. ఢిల్లీ వచ్చిన పని అనుకోకుండా శివశంకర్ గారిని కలవడంతో పూర్తయింది. దాంతో ఆయనతో కాసేపు అవీఇవీ మాట్లాడి, ఆయన ఇచ్చిన కాఫీ తాగి బయట పడ్డాము. పది గంటలకల్లా శాస్త్రి భవన్ (సమాచార మంత్రిత్వశాఖ కార్యాలయం వుండే సదనం) చేరుకున్నాము. అక్కడ చాలా హడావిడిగా వుంది. హైదరాబాదు స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసి ఢిల్లీలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న జీ. రఘురాంని (మా పెద్దన్నయ్య పర్వతాలరావుకి మంచి స్నేహితులు) కలుసుకున్నాము. ఆయన మమ్మల్ని చూస్తూనే ‘రండి రండి మీకోసమే చూస్తున్నాను, మీ ఆర్డరు రెడీగా ఉందంటూ చేతికి అందించారు.

ఆ రోజుల్లో ఢిల్లీ అధికార కారిడార్లలో శివశంకర్ గారి హవా అలా వుండేది.


జీవితం చీకటి వెలుగుల రంగేళి - భండారు శ్రీనివాసరావు

 ఆనందం, విచారం ఒకేసారి పెనవేసుకుని వచ్చిన సమాచారం వస్తే దాన్ని మించిన విషాదం ఏముంటుంది?

అరుణ్ మొహంతి.

ముప్పయ్యేళ్ళ క్రితం రేడియో మాస్కోలో సహోద్యోగి. ఒరిస్సా (అప్పుడు అదే పేరు) నుంచి చదువుకోవడానికి మాస్కో వెళ్ళాడు. చదువుకుంటూనే మాస్కో రేడియోలో అప్పుడప్పుడూ ఒరియాలో వార్తలు చదివేవాడు. చివరికి అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు. నేను తెలుగులో వార్తలు చదవడానికి కుటుంబంతో సహా మాస్కో వెళ్ళినప్పుడు పరిచయం. మృదుస్వభావి. మార్క్సిజాన్ని ఆపోసన పట్టాడు. పుస్తకాల పురుగు. ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకంతోనే కానవచ్చేవాడు. సాయంకాలక్షేపాల్లో సయితం మాటలు తూకం వేసుకుని మాట్లాడేవాడు. నేను సరదాగా ప్రొఫెసర్ అని పిలిచేవాడిని. మేము అక్కడికి వెళ్ళిన రెండేళ్లకు కాబోలు పెళ్లయింది. వధువు నమిత. ఒరియా అమ్మాయి. బాగా చదువుకున్నది. కొత్త సంసారం. అప్పటికి మా ఆవిడే ఆమెకు పెద్ద దిక్కు. ఎక్కడికి వెళ్ళినా కలిసే తిరిగే వాళ్ళు.

పంజాబీ, హిందీ, బెంగాలి, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడంతో సహా పద్నాలుగు భారతీయ భాషల్లో మాస్కో రేడియో వార్తలు ప్రసారం అయ్యేవి. అందరం కుటుంబాలతో కలిసి రేడియో మాస్కో వారు ఏర్పాటు చేసిన పలు అంతస్తుల భవనంలో కాపురాలు వుండేవాళ్ళం. కమ్యూనిస్ట్ శకం ముగిసి సోవియట్ యూనియన్ అంగ,వంగ కళింగ దేశాల మాదిరిగా విడివడ్డ తరువాత మేము మాస్కో నుంచి హైదరాబాదు వచ్చేసాము. అరుణ్ దంపతులు మాస్కోలోనే వుండిపోయారు. తరవాత మా నడుమ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవీ లేవు. చూస్తుండగానే ముప్పయ్యేళ్లు గడిచిపోయాయి.

పీ. ఎస్. మూర్తి. ఒకప్పుడు రాష్ట్రపతి సంజీవరెడ్డి గారి దగ్గర అయిదేళ్ళపాటు ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన కూచి సూర్యనారాయణ గారి అల్లుడు. వ్యాపారపనుల నిమిత్తం మాస్కోలో మేమున్న రోజుల్లో అక్కడికి వచ్చి వెడుతుండేవారు. సూర్యనారాయణ గారు మా ఆవిడకు వరసకు బాబాయి అవుతారు. అంచేత మూర్తిగారు కూడా మాస్కో వచ్చినప్పుడల్లా మాఇంటికి వచ్చేవారు. అక్కడే మూర్తి గారికీ, అరుణ్ మొహంతితో పరిచయం అయింది. మేము ఇండియా తిరిగి వచ్చిన తరువాత కూడా అనేక ఏళ్ళపాటు ఆ స్నేహం కొనసాగింది. మాస్కో వెళ్ళినప్పుడల్లా మొహంతిని కలిసేవారు. వ్యాపార విషయాల్లో తనకు తోచిన సలహాలు మూర్తికి చెబుతుండేవాడు అరుణ్.

తరువాత మూర్తి కుటుంబంతో సహా ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాదులో సెటిల్ అయ్యారు. ఆయన ద్వారానే అరుణ్ చనిపోయాడనే ఓ విషాద వార్త తెలిసింది.  ఆయన ఇచ్చిన నెంబరుకు ఒక మెసేజ్ పెట్టాను, నేను పలానా అని పరిచయం చేసుకుంటూ.

నమిత నుంచి వెంటనే జవాబు వచ్చింది.

మాస్కో రేడియోలో భారతీయ ప్రసారాలు నిలిపివేసిన తర్వాత కూడా పద్నాలుగేళ్ళు అరుణ్ దంపతులు అక్కడే వుండిపోయారట. తరువాత ఢిల్లీ వచ్చేశారు. అరుణ్ మొహంతికి జేఎన్యూలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. భార్య నమిత కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరుగా చేరారు. బాగా సెటిల్ అయ్యామని అనుకుంటున్న తరుణంలో అరుణ్ కిడ్నీవ్యాధిబారిన పడి కన్నుమూశాడు. అతడి తలితండ్రులు ఇద్దరూ ఏడాదిలోపలే మరణించారు.

అరుణ్ కుటుంబంతో మూడు దశాబ్దాల తరువాత సంబంధాలు ఏర్పడ్డాయని సంతోషించాలో, అరుణ్ ఇక లేడని తెలిసి బాధపడాలో ఏమీ తెలియని స్థితి.