20, జులై 2015, సోమవారం

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అన్నారు మనసు కవి ఆత్రేయ.
నిజమే, పుష్కర స్నానం కోసం వచ్చి నిండు ప్రాణాలు బలి ఇచ్చి వెళ్లారు. పుష్కర పుణ్యం సంగతి యేమో కానీ వారి పుణ్యమా అని మొద్దు నిద్దర పోతున్న ప్రభుత్వాలు నిద్రలేచాయి. జనాలు రావడం గురించే తాపత్రయ పడి ప్రచారం చేసుకున్న నేతలు, ఏర్పాట్లు అంటే ఘాట్లు, లైట్లు అనుకుని 'క్రౌడ్ మేనేజ్ మెంటు' గాలికి ఒదిలేసిన అధికారులు, మొదటి రోజు దుర్ఘటనతో మేలుకుని తమ పని తీరు మార్చుకోబట్టే మిగిలిన పుష్కర దినాలు ప్రశాంతంగా సాగిపోతున్నాయి.
వాళ్లు చనిపోయి ఇతరులని బతికిస్తున్నారు. ఆ పోయినోళ్ళు మంచోళ్ళే కాదు ధన్య జీవులు, పుణ్య జీవులు.
వారికి మరోసారి హాట్స్ ఆఫ్.


19, జులై 2015, ఆదివారం

అదిగో నవలోకం


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 23-07-2015, THURSDAY)

ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని 'అమరావతి' రూపురేఖలు గురించి సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన 'సీడ్ క్యాపిటల్' ప్రణాళిక  రాష్ట్ర ప్రభుత్వానికి  అందింది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నాయకత్వంలో హైదరాబాదు వచ్చిన అధికారుల బృందం, ప్రత్యేక విమానంలో రాజమండ్రి  వెళ్ళి,  గోదావరి పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం గత కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసివున్న  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుని ఈ ప్రణాళికను  అందచేసింది. అంతకుముందే 'సీడ్ క్యాపిటల్' గురించిన  ఊహా చిత్రాలను కొన్నింటిని  ఆ రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు విడుదలచేసింది. ఇటువంటి అద్భుతమైన  రాజధానిని సొంతం చేసుకోబోతున్న ఆ రాష్ట్ర ప్రజలు ఎంతటి అదృష్టవంతులో కదా అని ఇతరులకు కన్నుకుట్టే  రీతిలో ఊహలకు రూపకల్పన చేశారు. ఈ ఊహల్ని వాస్తవం చేయగలిగితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లోనే కాకుండా చరిత్ర పుటల్లో కూడా  శాశ్వితంగా మిగిలిపోతారు. రాజధానిని నిర్మించగలగడం అనే  అపూర్వ సువర్ణావకాశం ఒక్క  చంద్రబాబుకే  లభించింది. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదన్న సంగతి గమనార్హం. ఈ రకంగా చూస్తే, ఈ కలని నిజం చేయగలిగితే  ప్రజలే కాదు ఆయన కూడా అదృష్టవంతుడే.   
'కలలు కనండి. ఆ కనే కలలు కూడా  గొప్పగా కనండి. కన్న  ఆ గొప్ప కలల్ని నిజం చేసుకోండి' అంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  యువతీ యువకులకు సలహా ఇస్తుండడం అందరికీ తెలిసిందే.  ఈ ఊహా చిత్రాలు చూసిన వారికి చంద్రబాబు కూడా కలాం గారు చెప్పినట్టే గొప్ప కలలే కంటున్నారు అనిపిస్తుంది.  కాకపోతే వాటిని వాస్తవం చేసి చూపడం అన్న బాధ్యత ఒక్కటే ఆయన భుజ స్కంధాల మీద మిగిలివుంది. మరో రకంగా కూడా ఆయన అదృష్టవంతుడు.  ఆయన సమర్ధత మీద ఆయనకు వున్న నమ్మకాన్ని మించి ఆయన అభిమానులు మరింత నమ్మకం పెంచుకున్నారు. ఆయన ఒక్కరే రాజధాని నిర్మాణం పూర్తిచేయగలరన్న విశ్వాసంతో వున్నారు. ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో ఈ విషయం ప్రస్పుటంగా కానవస్తుంది.   
ఈ ఊహా చిత్రాలతో పాటు విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం భవిష్యత్తులో నిర్మించబోయే ఆంధ్ర రాజధాని నగరం ఇలా వుంటుంది.




"కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లా పరిధిలో ప్రధాన రాజధాని నగర నిర్మాణం జరుగుతుంది. దీని విస్తీర్ణం సుమారు పదిహేడు చదరపు కిలోమీటర్లు. (ఇది మరికొంత పెరిగిందని తాజా సమాచారం వల్ల తెలుస్తోంది) ఇందులో కొంత భాగంలో ప్రధానమైన ప్రభుత్వ పరిపాలనా భవన సముదాయాలు వుంటాయి. మిగిలిన ప్రదేశంలో ఐటీ సంబంధిత కార్యాలయాలు, కార్పోరేట్ సంస్థల ఆఫీసులు ఏర్పాటు అవుతాయి. రాజధాని నగరంలోని ప్రధాన రహదారులకు సమాంతరంగా కాలువలు  నిర్మిస్తారు. కృష్ణా నది నుంచి ఇందుకోసం నీటిని వాటిలోకి మళ్లిస్తారు. ఈ నీళ్ళు మళ్ళీ వెళ్ళి మరో వైపు కృష్ణా నదిలోనే కలుస్తాయి. కాలువలు, రహదారులకు ఇరువైపులా ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తారు. భవన పరిసరాలను మాత్రమే కాకుండా వాటిపైన కూడా ఆకు పచ్చని తివాచీ పరిచినట్టు పచ్చదనం తొణికిసలాడేలా పధకాలు సిద్ధం చేశారు. విహంగ వీక్షణం చేసేవారికి పైనుంచి కిందికి చూస్తే యావత్తు రాజధానీ  నగరం హరితవనం మాదిరిగా కానవస్తుంది. భవిష్యత్తులో సయితం భవననిర్మాణాలు, ఇతర నిర్మాణాలు     ప్రణాళికాబద్ధంగా  జరిగేందుకోసం మొత్తం ప్రధాన రాజధాని ప్రాంతాన్ని సెక్టార్లుగా విభజిస్తారు. ఆరు వరసల రహదారులు, వాటి పక్కనే నడక దారులు,  సర్వీసు రోడ్లు వుంటాయి. నగరం మధ్య నుంచి మెట్రో రైలు నిర్మాణం జరిగేలా రూపకల్పన చేశారు. మెట్రో స్టేషన్లు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా వుంటాయి.  రాజధాని నగరం మధ్యలో స్వచ్చమైన నీరు పారే కాలువలు, అక్కడక్కడా జలాశయాలు, వాటిని దాటి వెళ్ళడానికి వీలుగా ఊయల వంతెనలు ఓహ్! అమరావతి అంటే 'దేవతల  నగరం' అన్న పేరు సార్ధకం అయ్యేలా అనేక సుందర నిర్మాణాలకు ఈ కొత్త రాజధాని ఆవాసం కాబోతోంది. కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై ఎత్తయిన వంతెన నిర్మాణం  కూడా ఈ పధకంలో భాగం. ఇంతేనా అంటే ఇంకా చాలా వుంది. ఈ సీడ్ క్యాపిటల్ కు అభిముఖంగా గుంటూరు జిల్లా వైపు నది మధ్యలో ఒక  ద్వీపాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తారు. ఈ మొత్తం ప్రణాళికను రూపొందించింది సింగపూరు ప్రభుత్వం కాబట్టి ఆ దేశపు పొరుగున వున్న మలేసియాలోని జంట టవర్లను పోలిన రెండు ఎత్తయిన ఆకాశహర్మ్యాలు కూడా నూతన రాజధానికి అంతర్జాతీయ సొగసులను అద్దబోతున్నాయి."           
భారీగా నిర్మించిన సినిమాలను  విడుదల చేసే  ముందు 'టీజర్' పేరుతొ లఘు చిత్ర ప్రకటనలు  టీవీల్లో చూపించడం ఈరోజుల్లో అలవాటు. ఈ ఊహా చిత్రాలు చూస్తుంటే ఆ  విధానాన్ని  ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు కూడా వర్తింపచేస్తున్నారేమో అనిపించేలా వున్నాయి.
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ఆస్థానంలో పనిచేసే గురువు, ఆయన శిష్యులు కలిసి నిమిషాల్లో ఓ మాయానగర్ నిర్మిస్తారు. ఆరోజుల్లో ప్రేక్షకులకు  ఆ దృశ్యాలు పరమాద్భుతంగా తోచాయి. ఇప్పుడీ ఊహా చిత్రాలు టీవీల్లో చూసిన వారికి అవి స్పురణకు వస్తే తప్పు ఎంచడానికి లేదు. అంత గొప్పగా వున్నాయి. అంతే కాదు  వీటిని నిజం చేయడం మానవ మాత్రుడుకి సాధ్యమా అనిపించేలా అపూర్వంగా అపురూపంగా వున్నాయి.
తెలుగుదేశం పార్టీ  అభిమానులనే కాదు, ప్రజలందరినీ అలరించేలా వున్నాయి ఈ ఊహా చిత్రాలు. ముందే చెప్పినట్టు ఈ విధంగా కాకపోయినా ఇందులో కొంతయినా నిజం చేస్తూ రాజధాని నిర్మాణం త్వరలో పూర్తి చేయగలిగితే 'ఆంధ్రులు యెంత అదృష్ట వంతులు' అని దేశవిదేశాల్లో గొప్పగా చెప్పుకోవడం ఖాయం. సమర్ధుడయిన ముఖ్యమంత్రి అన్న పేరు ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబుకు, అమరావతి  రాజధాని నిర్మాణం సకాలంలో పూర్తిచేయగలిగితే ఆయనకు అంతకన్నా గొప్ప కీర్తి మరొకటి వుండదు.
కానీ, ఇది సామాన్యమైన వ్యవహారం కాదు. ప్రతిదీ డబ్బుతో ముడిపడి వుంటుంది. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంతో చూస్తారు. ప్రతి స్వల్ప విషయాన్ని భూతద్దంతో శోధిస్తారు. ప్రతిపక్షాల సంగతి సరే సరి. కాలం గడిచే కొద్దీ వీలును బట్టి  పుట్టుకొచ్చే 'విభీషణుల'తోనే అసలు చిక్కు.  పడగ నీడల్లో కొత్త రాజధాని నిర్మాణం సాగాల్సి వుంటుంది. నిజానికి ఇదంతా కత్తి మీద సాము.
సమర్ధుడన్న ఒక్క పేరు మినహా రాజధాని నిర్మాణంలో చంద్రబాబుకు కలిసి వచ్చే అంశాలు అంతగా లేవు. రాష్ట్ర ఖజానా బోసిపోయి వుంది. రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చిందేమీ లేదు. ఇలాటి భారీ ఆలోచనలు సకాలంలో ఆచరణలోకి రావాలంటే ప్రధానంగా కావాల్సింది  కేంద్ర సాయం . కేంద్రంలో అధికారంలో  వున్నది టీడీపీ  మిత్ర పక్షమే అయినప్పటికీ, గత ఏడాది అనుభవాల నేపధ్యంలో  ఆ దిక్కుగా చూస్తే అంతగా కలిసివచ్చే అవకాశాలు కానరావడం లేదు. అధవా ఏదయినా చేసినా ఆ అరకొర సాయం ఇంతటి  భారీ ప్రణాళికలకు అక్కరకు రాకపోవచ్చు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుడికి రాజధాని విషయంలో సలహా ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చింది. సింగపూరుతో పాటు ఈ మధ్య ఆయన పర్యటించి వచ్చిన కజకిస్తాన్, కీర్గిస్తాన్,  తుర్కుమిస్తాన్ మొదలయిన దేశాల రాజధానీ నగరాలను కూడా పరిశీలించడం మంచిదని ప్రధాని తనకు సూచించినట్టు చంద్రబాబే స్వయంగా తమ పార్టీ ఎంపీ లతో చెప్పినట్టు ఆ వార్త సారాంశం. పైగా  ప్రధాని సలహా మేరకు ఆ నగరాల పర్యటనకు ఏర్పాట్లు చేయాల్సిందని ఆదేశించినట్టు ఆ వార్త తెలుపుతోంది.
ఇప్పటికే అమరావతి రాజధాని విషయంలో అనేక విదేశాల పేర్లు వినబడుతూ వస్తున్నాయి. ఇప్పుడు అదనంగా మరికొన్ని దేశాలు అంటే,  మరికొంత కాలయాపన తప్పనిసరి అవుతుంది. అమరావతి అని పేరు పెట్టి తెలుగుతనం లేని మరో విదేశీ నగరాన్ని నిర్మించ బోతున్నారని ఇప్పటికే కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.   
ప్రభుత్వం చెబుతున్నట్టు  రాజధాని నిర్మాణం కోసం సమీకరణ పేరుతొ ప్రజలనుంచి సేకరించిన కొన్ని వేల  ఎకరాల  భూమి సిద్ధంగా వుంది. ఆ విషయంలో తలెత్తిన  రాజకీయ వివాదాలు యెలా వున్నా చివరికి ప్రభుత్వాల మాటే చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక కావాల్సింది నిధులు. ఇక్కడే అసలు చిక్కు ఎదురవుతుంది.
గారెలు వండాలంటే నూనె, మూకుడు, పిండి వంటి సంబారాలు అనేకం కావాలి. గారెకు చిల్లి పెట్టడానికి 'వేలు' తప్ప వేరే ఏమీ లేదన్న చందంగా 'చంద్రబాబు సమర్ధత' తప్ప రాజధాని నిర్మాణానికి అవసరమైనవి ఏమీ ఆయనకు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది వాస్తవం. ఇన్నిన్ని నిర్మాణాలు ఇంత అధునాతనంగా రూపుదిద్దుకోవాలంటే ఆషామాషీ  విషయం కాదు.
రాజమండ్రిలో ముఖ్యమంత్రిని కలవడానికి సింగపూరు బృందం వచ్చిన సందర్భంలో రాష్ట్ర సమాచార సలహాదారుడు పరకాల ప్రభాకర్ ఈ విషయంలో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్టోబరు నెలలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముందుగానే 'మాస్టర్ డెవలపర్' ని ప్రభుత్వం ఎంపిక చేస్తుందని చప్పారు. జపాన్ తో సహా కొన్ని దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. దీనిని బట్టి రాజధాని నిర్మాణం డెవలపర్ల చేతిలో వుంటుందని అర్ధం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత భూమి చూపించడం వరకు పరిమితం కావచ్చు. ప్రభుత్వానికి నిధుల భారం తగ్గిపోవచ్చు. స్విస్  ఛాలెంజ్ పద్ధతిలో అయితే రూపాయి ఖర్చు కూడా లేకపోవచ్చు. కానీ, ప్రజలనుంచి  సేకరించిన భూమిని మాస్టర్ డెవలపర్ చేతిలో పెట్టడం వల్ల  కొత్త వివాదాలు ఉత్పన్నం కావచ్చు. అందుకే కీడెంచి, అన్ని అంశాలను  అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా, వివాద రహితంగా చేయడం మంచిది. నిధుల లేమి కారణంగానే ప్రభుత్వం, ఇప్పటికే 'రియల్ ఎస్టేట్' రంగంలో చలామణిలో వున్న 'డెవలప్ మెంటు'  విధానాన్ని 'స్విస్ ఛాలంజ్' అనే కొత్త పేరుతొ  ఎంచుకుని వుండవచ్చు. కానీ అవతల నిర్మాణ భాగస్వామి 'విదేశీ సంస్థ' అయినప్పుడు మరిన్ని జాగ్రత్తలు అవసరం.        
ప్రభుత్వం ఇవ్వచూపే భూమికి ఆకర్షితులై రాజధాని నిర్మాణానికి పెట్టుబళ్ళు పెట్టేవాళ్లు గొంతెమ్మ కోర్కెలు కోరడం సహజం. నిజంగానే చంద్రబాబు  నిజాయితీగా    ప్రయత్నాలు చేసినా సరే, ఈనాటి రాజకీయాల వరస చూస్తుంటే,   నిప్పులేకుండానే  పొగ రాజుకోవడం అంతే  సహజం. రాజకీయాల్లో కాకలు తీరిన చంద్రబాబుకు ఈ విషయం తెలియదనుకోలేము. అయినా సరే ఆయన ముందడుగు వేసే ధోరణిలోనే ముందుకు సాగుతున్నారు. అన్ని సందేహాలకు   ప్రభుత్వం దగ్గర, ఆయన దగ్గర  సమాధానాలు వుండి వుండవచ్చు. కానీ  సంతృప్తి కరమైన వివరణ మాత్రం ఇంతవరకు బయటకు రాని  మాట కూడా నిజమే. ఈ లావాదేవీల్లో ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని వ్యవహారాలు చక్కబెట్టి వుంటే అనవసరమైన రాద్ధాంతాలు కొన్ని తప్పేవి అన్న వాదన వుంది. అలా చేసివుంటే  భవిష్యత్తులో ఎదురయ్యే మంచి చెడులకు చంద్రబాబును ఒక్కరినే బాధ్యులను చేసే పరిస్తితి ఉత్పన్నం అవ్వదు కూడా.   
రాజధాని లేకుండా వేరు పడిన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చక్కని, భేషయిన రాజధాని నిర్మిస్తానని అంటుంటే అభ్యంతర పెట్టడం, విమర్శలు చేయడం  కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఇలాటి ప్రయత్నాలను  మనఃస్పూర్తిగా స్వాగతించాలి. అయితే ముఖ్యమంత్రి కూడా, రాజధాని యెలా వుంటుందో ప్రజలకు ముందుగానే  చూపెట్టినట్టే, వారిని విశ్వాసంలోకి తీసుకుని ఆ  రాజధాని నిర్మాణం యెలా జరుగుతుందో వెల్లడిస్తే అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. కానిపక్షంలో,  ఇప్పుడున్న సందేహాలు ముదిరి అనుమానాలుగా మారతాయి. ఆ అనుమానాలు కాలక్రమంలో ఆరోపణలుగా రూపాంతరం చెందే అవకాశం కూడా వుంటుంది. ముఖ్య మంత్రి సమర్ధత మీద లేశ మాత్రం అనుమానం లేదని చెబుతున్నవారు కూడా ఈ మొత్తం వ్యవహారంలో తమకు ఎలాటి అనుమానాలు లేవని  గట్టిగా చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన సలహాదారులు ఈ విషయం గమనంలో పెట్టుకోవాలి.
ముందే చెప్పినట్టు,  రాజధాని నిర్మాణం ఆయనకు ఒక్కరికే సాధ్యం అని నమ్మే వాళ్లకు ఈరోజుల్లో  కొదవ లేదు.ఈ రకంగా ఆయన అదృష్టవంతులు.   హైదరాబాదులో ఆయన హయాములో నిర్మితమైన హై టెక్ సిటీ గురించి ఇప్పటికీ జనాలు గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. ఇంత నమ్మకం ప్రజల్లో  వున్నప్పుడు మరింత పారదర్శకంగా వ్యవహరిస్తే ఆయనకే మేలు జరుగుతుంది.          
రాజధాని అమరావతి ఊహా చిత్రాలు, ఇవన్నీ  ఉత్తుత్తి ప్రచారార్భాటం కింద ప్రత్యర్ధులు కొట్టివేస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపించడంలో చంద్రబాబుకు  సాటి రాగలవారు లేరని చెప్పడానికి కూడా ఈ ఊహా చిత్రాలను వారు ఉదహరిస్తున్నారు. ఆయన అభిమానులు సయితం అదే అంటున్నారు. సమర్ధత విషయంలో చంద్రబాబుకి ఎంతటి మంచి పేరు వుందో, ప్రచారం విషయలో ఆయనకు అంతటి బలహీనత వుందన్న విషయం రహస్యమేమీ కాదన్నది వారి ముక్తాయింపు.
రాజధాని విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎవరివి యెలా వున్నా, సామాన్య జనం అందరూ ముక్త కంఠంతో కోరుకునేది మాత్రం, వేరుపడ్డ  రాష్ట్రానికి ఏదో ఒక రాజధాని తక్షణం కావాలనే. ఇక ఆ రాజధాని చంద్రబాబు ఊహల్లో వున్న అపురూప నగరం అయితే అంతకంటే కావాల్సింది వారికి మరోటి వుండదు.    
సమర్ధుడైన వాడికి లక్ష్యం ఒక్కటే ముఖ్యం. లక్ష్యశుద్ధి వుంటే గమ్యం చేరడం సులభం కాకపోయినా అసాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణం తీరుతెన్నులు చూస్తుంటే ఇదొక్కటే సరిపోకపోవచ్చు. వచ్చే ఎన్నికలదాకా ఈ ఊహల ప్రచారం రాజకీయంగా కొంత వూపు ఇవ్వొచ్చు. సాధారణ రాజకీయ నాయకులు ఇలాగే ఆలోచిస్తారు. వారికి ఈరోజు గడిస్తే చాలు.
మరి చంద్రబాబు ఈ కేటగిరీ కిందికి రావాలని అనుకుంటున్నారా? తనదయిన తరహాలో మరో మార్గాన్ని కోరుకుంటున్నారా?
కాలమే సమాధానం చెప్పాలి.
(21-07-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595



Image Courtesy Culte.com


17, జులై 2015, శుక్రవారం

వినదగునెవ్వరు చెప్పిన.... (Hindu paper editorial on Rajahmundry tragedy)





AN AVOIDABLE TRAGEDY

"Several factors appear to have contributed to the Godavari tragedy. These include lack of proper barricading to enable pilgrims to move in single file towards the river, the failure of the authorities to guide devotees, especially those unfamiliar with the town, to more spacious ghats elsewhere, and the absence of planning for crowd management. All this indicate that even a good deal of advance preparation and elaborate security arrangements are not enough to guarantee safety at mass events unless some elementary safeguards are in place. After the Maha Kumbh Mela tragedy in 1954, Jawahar Lal Nehru asked the VIPs to stay away from such events. It was recognised  even then that the presence of VIPs puts needless pressure and strain on the administrative machinery and severely compromises optimal measures to control milling crowds. While VIPs do have a right to participate in such events, it should be ensured that their presence does not compromise the safety of the public" (17-07-2015)      

16, జులై 2015, గురువారం

'ఆకాశంలో సగం'

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 19-07-2015, SUNDAY)  

స్త్రీ జాతిని 'ఆకాశంలో సగం' అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తే వాళ్లు నేటి సమాజంలో ఎక్కువగానే కానవస్తారు. చేతల దగ్గరికి వచ్చేసరికి ఈ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోవడం కద్దు. ఈ నేపధ్యంలో ఒక వార్త కొన్ని పత్రికల్లో చాలా చిన్నగా వచ్చింది. ఆ వార్తకు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యం ఇవ్వలేదేమో, ఆ అంశానికి దొరకాల్సినంత ప్రాచుర్యం లభించలేదేమో అనిపించింది. ఆ వార్త ఏమిటంటే-
ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఫ్లిప్ కార్ట్ అనే ఒక సంస్థ యాజమాన్యం, తమ దగ్గర పనిచేసే మహిళా సిబ్బందికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఉద్యోగినులకు ఇచ్చే ప్రసూతి సెలవులను ఇరవై నాలుగు వారాలకు పెంచింది. అంటే సుమారు ఆరుమాసాలపాటు జీతంతో కూడిన సెలవు. అంతే కాదు, ప్రసూతి సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరే ఉద్యోగినులకు నాలుగు నెలలపాటు  పనివేళల్లో, వారికి వీలయిన సమయాల్లో పనిచేసుకునే  వెసులుబాటు కల్పించింది..
చట్టం ప్రకారం  ఉద్యోగినులకు ఇవ్వాల్సిన సెలవుల్ని మించి ఈ కంపెనీ తమ మహిళా సిబ్బందికి ఈ సదుపాయాలను కల్పించడం విశేషం.
సరే. షరా మామూలుగానే ఈ రాయితీలకు వక్ర భాష్యాలు వెలువడ్డాయి. తమ సంస్థలో పనిచేసేందుకు అధిక సంఖ్యలో ఆడవారిని ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ కంపెనీ ఈ నిర్ణయాలు తీసుకుందని వాటి తాత్పర్యం.
వెనుక కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న సోవియట్ యూనియన్ లో ఆడవారికి ఈ రకమైన రాయితీలు ఇవ్వడం నేను చూసాను. గర్భవతులయిన ఉద్యోగినులకు, గర్భం ధరించిన సమాచారం తెలియచేసినప్పటి నుంచి, సుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు నడిచే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా కనిపెట్టి చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు.    
నిజానికి గత రెండు దశాబ్దాల కాలంలో మనదేశంలో మహిళలు  గణనీయమైన పురోగతి సాధించడం కళ్ళారా చూస్తున్నాం. ఓ అరవై ఏళ్ళక్రితం  ఆడపిల్ల ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టడం కనాకష్టం. 'ఆడపిల్లకు చదువెందుకు, ఇంట్లో ఏవో పద్దులు రాసుకునే అక్షర జ్ఞానం వుంటే చాలు' అని పెద్దవాళ్ళు అంటూ వుండడం నాకెరుక. నూటికో కోటికో చదువుకున్న ఆడవాళ్లు కనిపిస్తే విడ్డూరంగా చూసే కాలం గడిచిపోయి ఎన్నో ఏళ్ళు కాలేదు. సైకిల్ తొక్కే ఆడపిల్లల్ని రౌడీ పిల్లలు అనేవాళ్ళు. లంగా ఓణీ కాకుండా చుడిదార్ వేసుకుంటే నోటితో కాకపోయినా  నొసటితో వెక్కిరించేవాళ్ళు.
మారడం కాల ధర్మం. అందుకే కాలం మారింది. ఇంకా మారుతోంది. మగా ఆడా తేడా చదువుల్లో లేకుండా పోయింది. కాకపొతే,  చదువుకున్న ఒక తరం ఆడవాళ్ళు, చదివిన చదువుకు సార్ధక్యం లేకుండా మళ్ళీ గృహిణులుగానే ఇంటి పనులకు పరిమితం అయిపోయారు. దానితో, 'చదువుకుని  ఏం చేస్తారు ఉద్యోగాలు చేస్తారా, వూళ్ళు ఏలాలా?' అనే కొత్త వ్యంగ్యాస్త్రాలు వ్యవహారంలోకి వచ్చాయి.
ముందే చెప్పినట్టు మారుతూ పోవడం కాల ధర్మం. తరువాతి తరం ఆడపిల్లలు మగ పిల్లలతో పోటీలు పడి చదువుల్లో రాణిస్తూ వస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వేడి నీళ్ళకు చన్నీళ్ళ మాదిరిగా వారి సంపాదనలు కుటుంబ ఖర్చులకు అవసరం కావడంతో మగవాళ్ళే సర్దుకుపోయి, ఉద్యోగం చేసే ఆడపిల్లలకి  పెళ్లి చూపుల్లో ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. అంతటితో మార్పు ఆగలేదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని రాత్రింబవళ్ళు పనిచేయాల్సిన కొత్త కొలువులు వచ్చి పడ్డాయి. వాటికి తగ్గట్టే మంచి మంచి జీత భత్యాలు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఆ జీతాలు కూడా తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. ఈ ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు ఈనాడు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. మగ పిల్లల మాదిరిగానే కన్న తలితండ్రులను, వున్న వూరినీ విడిచి వెళ్ళి పరాయి వూళ్లల్లోనే కాదు పరాయి దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రీత్యా  ఆర్దిక స్వాతంత్రం అయితే ఆడవారికి కొంత వరకు వచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఆ మేరకు వారికి లభిస్తోందా అంటే చప్పున జవాబు చెప్పలేని పరిస్తితి.
ఉదాహరణకు సినీ రంగంలో రాణిస్తున్న తారల సంగతే తీసుకుందాం. ఆదాయం బాగానే వున్నా మగ తారల మాదిరిగా సంపాదించుకున్న ఆస్తిపాస్తులను  కాపాడుకోలేని పరిస్తితి ఆ రంగంలో ఎక్కువ. అన్నింటికీ ఎవరిమీదనో ఆధారపడాల్సిన స్తితే.
సరే! ఇవన్నీ బాగా చదువుకుని, బాగా సంపాదిస్తూ వున్న మహిళల సంగతి. కుటుంబ అర్దిక స్తితి గతులు మెరుగు పరచడంలోనే కాదు,  దేశ ఆర్ధిక వ్యవస్థ  పురోగమనంలో కూడా వీరి పాత్ర తక్కువేమీ కాదు. ఆ మేరకు వారికి జాతి రుణపడి వుండాలి.


మరో రకం ఆడవారు వున్నారు. నిజానికి వీరి జనాభానే అధికం. వీరు చదువు సంధ్యలు లేనివాళ్ళు. అధవా చదువుకున్నా ఏదో నాలుగు అక్షరం ముక్కలే. చిన్న  చిన్న పనిపాట్లు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న వారు. తమ కుటుంబాలకు ఆర్ధికంగా సాయపడుతున్నవారు. సంపాదన వుందన్న మాటే కాని దానిపై పెత్తనం బొత్తిగా లేనివాళ్ళు. గ్రామాల్లో పొలం కూలీలుగా పనిచేసుకుంటూ, బస్తీల్లో అయితే  నాలుగిళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ, నాలుగు రాళ్ళు పోగేసి మొగుడి చేతిలో పోసి చేతులు దులుపుకునే వాళ్లు. తమ చెమటతో తడిసిన ఆ సొమ్మును వాళ్లు తాగుడు కోసం తగలేస్తున్నా నోరు తెరిచి అడగలేని మూగవాళ్ళు.  వీరికి బొత్తిగా ఆర్ధిక స్వాతంత్రం లేదు, పోనీ వ్యక్తిగత స్వేచ్చ వుందా అంటే అదీ లేదు. మరబొమ్మల్లా కాయకష్టం చేసి నాలుగు డబ్బులు సంపాదించడం తప్ప.
మరో వివక్షకు కూడా వీరు గురవుతున్నారు. చేసేది ఒకే పని అయినా దినసరి కూలీ డబ్బులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. ఆడవాళ్లు చేసే ఇంటి పనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, బయట పనిపాటుల్లో వారికి ముడుతున్నది నామమాత్రమే.   
ఇలాటివారు నేటి సమాజంలో ఎల్లెడలా కనిపిస్తారు. పనికి తగ్గ వేతనాలు వుండవు. పని వేళలూ వుండవు. రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేస్తారు. పనిచేసిన రోజున బాగా చేసావు అనేవాళ్ళూ వుండరు, పనికి రాని రోజున 'మా నాగాల రాణి ఇవ్వాళ రాలేదు, ఎగనామం పెట్టింది' అనే సన్నాయి నొక్కులకు మాత్రం తక్కువ వుండదు. మరి వీరి జీవితాలు మారేదెన్నడో!   
యాభయ్ ఏళ్ళ క్రితం గడప దాటని ఆడవాళ్ళను చూసాను. అదే కళ్ళతో చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళను చూస్తూ వున్నాను.
కాల ధర్మం మీద నమ్మకం వున్నవాడ్ని. చివర చెప్పిన బడుగు బలహీనవర్గాల  ఆడవారికి కూడా మంచి కాలం రాకపోతుందా? నేను చూడక పోతానా?  (16-07-2015)                
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE : Courtesy Image Owner

15, జులై 2015, బుధవారం

ఒక విషాదం - రెండు జ్ఞాపకాలు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 16-07-2015, THURSDAY)

విషాదం ఎందుకో ఏమిటో విడిగా చెప్పనక్కర లేదు. రెండు రోజులుగా అన్ని  టీవీల్లో అవే దృశ్యాలు.



రాజమండ్రిలో గోదావరి 'మహా' పుష్కరాల కోసం ఏర్పాటుచేసిన స్నానఘట్టం ఒకదానిలో  జరిగిన దుర్ఘటన అందరి మనసులను కలచివేసింది. కారణం ఎవరయినా, మూల కారణం ఏదయినా అనేక నిండు ప్రాణాలు గోదావరి నదీమ తల్లి సాక్షిగా గాలిలో కలిసిపోయాయి. సరే. షరా మామూలుగా రాజకీయ పక్షాల నాయకులు తమ కోణాల్లో, తమదయిన బాణీల్లో ఆరోపణలు, ప్రత్యారోపణల  బాణాలు విసురుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని టీడీపీ ప్రత్యర్ధులు డిమాండు చేస్తే, కృష్ణా పుష్కరాల దుర్ఘటనకు బాధ్యత తీసుకుని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి  యెందుకు రాజీనామా చేయలేదని అధికార టీడీపీ వారు ప్రతి విమర్శలు చేశారు. ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం అనేది నిజానికి  గత కాలపు ముచ్చట. ఈ కాలపు రాజకీయ నాయకులకు కానీ, నేటి యువతకు కానీ తెలియని విషయం. 'నైతిక విలువలు' అనేవి ప్రస్తుత కాలంలో వారి నుంచి ఆశించడం వృధా ప్రయాస. తినే అన్నం  గొంగట్లో అయినప్పుడు వెంట్రుకలు గురించి చింతించడం యెంత విజ్ఞతో ఇదీ అంతే.
జనాలు పెద్ద సంఖ్యలో ఒక చోట గుమికూడిన సందర్భాలలో ఇలాటి దుర్ఘటనలు జరగడానికి అవకాశాలు ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే. దీనికి పలు దృష్ట్యాంతాలు వున్నాయి. అయ్యప్ప దర్శనానికి శబరిమలై వెళ్ళిన భక్తులు అనేకమంది తొక్కిసలాటలో మరణించిన విషయం ప్రజల మనస్సుల్లో ఇంకా పచ్చిగానే వుంది.  పలు ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో హఠాత్తుగా సంభవించిన ఇటువంటి దుర్ఘటనలు  అనేక కుటుంబాల్లో కడుపుకోతను మిగిల్చాయి.
రాజమండ్రి దుర్ఘటన కూడా వీటిల్లో ఒకటిగా కొంతకాలం తరువాత జనం చెప్పుకుంటారు. పుష్కరాల మొదటి రోజునే ఇది జరగడం పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామమే. సమర్ధింపు కోసం ఎన్ని కారణాలు చెప్పినా, ఎన్ని రకాల వాదనలు చేసినా జనం నమ్మడం కష్టం. నిజానికి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లను శక్తికి మించి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కర నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సొంత పర్యవేక్షణలో అన్ని  పనులు జరిపించారు. అన్ని చోట్లా తానయి నిలిచారు. ఇది కూడా ఆయన్ని ఆత్మరక్షణలో పడేసింది.  పర్యవేక్షణ పేరుతొ ఆయన అధికారులను పనిచేయనీయలేదని, అందుకే పుష్కర ఏర్పాట్లన్నీ అరకొరగా జరిగాయని ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ నాయకులు ఆరోపణల గళం పెంచారు.  
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన కీర్తి చంద్రబాబు నాయుడు  ఖాతాలో పదిలంగా  వుంది. ఈసారి 'మహా పుష్కరాల'ను  దానికి మించి నిర్వహించి, తన మంచి పేరును మరింత సార్ధకం చేసుకోవాలని తలపోయడం సహజమే. ఈ 'ప్రచార' బలహీనతే  గోదావరి పుష్కరాలను ఉత్తరాది 'కుంభమేళా' ను మించి నిర్వహించాలనే ఆలోచన చేసేలా ఆయన్ని పురికొల్పి వుంటుందని, అదే ఇప్పుడు కొంప ముంచిందని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రి అభీష్టానికి  కొందరు పండితులు చెప్పిన 'మహా పుష్కరాలు' అనే కొత్త కోణం ఆజ్యం  పోసింది. ప్రచారకర్తలు ఎవరో కాని, 'నూట నలభయ్ నాలుగేళ్ల' తరువాత వస్తున్న 'మహా పుష్కరాలు ' అనే ప్రచారం మాత్రం నేల నాలుగు చెరగులా చరచరా పొక్కిపోయింది. ఈ 'సూత్రీకరణ'కు  ప్రాతిపదిక ఏమిటో ఎవ్వరికీ తెలవదు. 'ఎవరో. ఎప్పుడో  అన్నారు, అంతే! అది కార్చిచ్చులా  జనంలో అది పాకిపోయింది.
పన్నెండేళ్ళకోసారి వచ్చే పుష్కర స్నానం చేయాలనే ఉద్దేశ్యంతో   వయస్సు మళ్ళిన వాళ్లు కూడా చేతయినా కాకపోయినా పుష్కర యాత్రకు బయలుదేరుతారు. ఇక 'మహా పుష్కరాలు' అంటూ సాగిన ఉధృత ప్రచారంతో,  అన్ని వయస్సుల వాళ్లు పుష్కర స్నానాల కోసం ఎగబడ్డారు. జీవిత కాలంలో ఒకే ఒక్కసారి దొరికే అవకాశం అంటూ వూదరగోట్టారు.  పుష్కర యాత్రీకులకు రాష్ట్ర ప్రభుత్వం కనీ వినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందనీ, వసతులు కల్పిస్తోందని సాగిన  ప్రచారం భక్తులను లక్షల సంఖ్యలో ఆకర్షించింది. దానితో భారీగా చేసిన ఏర్పాట్లన్నీ వెల్లువెత్తిన భక్తజనంతో గాలికి కొట్టుకుపోయాయి. ప్రచారం పాలు  ఎక్కువయితే వాటిల్లే పర్యవసానాలు  ఇలాగే వుంటాయి.
వీటన్నిటికీ అదనంగా, ఈసారి గోదావరి పుష్కరాలను వాణిజ్య ధోరణులు కమ్మివేసాయి. ఇన్ని లక్షల  ఒక్కచోట జనాలు చేరే చోట,  'కాసుల పంట' పండించుకోవాలని కొన్ని వ్యాపార వర్గాలు పుష్కర యాత్రీకులకు అరచేతిలో స్వర్గం చూపించాయి. ఆధ్యాత్మికతను వినోదంతో ముడిపెట్టి పుష్కర యాత్రను ఒక విహార యాత్రగా మార్చివేశాయి.  ఎన్ని కష్టాలు పడయినా సరే, పుష్కర స్నానం చేసి తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు పెట్టి తరిద్దామని అనేక వ్యయప్రయాసలకి ఓర్చి వచ్చే పుష్కర యాత్రీకులకు ఈ కొత్త  'విహార యాత్రీకులు ఈసారి జత కలిసారు. ఏతావాతా పుష్కరాలకోసం గోదావరి బాట పట్టే వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. పుష్కర ముహూర్తం అంటూ సాగిన ప్రచారంతో  తొలిరోజునే పుణ్య స్నానాలు చేసి పుణ్యం మూటకట్టుకోవాలనే కాంక్షతో పుష్కరాల మొదటి రోజుకే లక్షలాదిమంది రాజమండ్రి చేరుకోవడం జరిగింది. పుష్కర ఘాట్ అని ఒక స్నాన ఘట్టానికి పేరు వుండడంతో, నడిచి వెళ్ళడానికి అది  అనువుగా వుండడంతో అందరూ ఆ ఘట్టం వైపే మొగ్గు చూపడం, ముఖ్యమంత్రితో సహా కొందరు ముఖ్యుల కోసం ఆ ఘాట్ ని చాలాసేపు మూసివుంచడం, వీఐపీలు తమ పనులు చక్కబెట్టుకుని వెళ్ళగానే సర్దుబాటు చేసే పోలీసులు తగిన సంఖ్యలో లేకపోవడంతో తొక్కిసలాట జరిగి ఇరవై ఏడుమంది వూపిరి ఆడక చనిపోయారని, ఇంకా చాలామంది గాయాల పాలయ్యారని తొలి వార్తలు తెలిపాయి.
పుష్కర పుణ్యకాలంలో జరగరానిది జరిగిన మాట వాస్తవం. కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాద స్థాయి కొంత అదుపులో వుండి వుండేదన్న వాదన కూడా  కొట్టిపారేయలేనిది. ఈ దుర్ఘటన ఇదొక గుణపాఠం వంటిది.  పునరావృతం కాకుండా చూసుకున్నప్పుడే ఆ పాఠం నేర్చుకున్నట్టు అవుతుంది. లేకపోతే, అది షరా మామూలుగా నాయకుల నోటి నుంచి జాలువారే 'ఊతపదం' గా మారుతుంది.                                
ఇక ఈ సందర్భంలో గుర్తుకొచ్చిన జ్ఞాపకాలు ఏమిటంటే......
పాతికేళ్ళ పైచిలుకు మాట
మాస్కోలో భూగర్భ రైలుమార్గం (మెట్రో)లో ప్రయాణించి రేడియో మాస్కో  దగ్గర్లోని  స్టేషన్ లో దిగి,  ఎస్కలేటర్ ద్వారా రోడ్డుమీదకు చేరుకున్నాను. అంతకుముందు ఎప్పుడూ చూడని ఒక దృశ్యం అక్కడ నాకు కనబడింది. స్టేషన్ వెలుపల కొందరు మిలీషియా (పోలీసులు) వాళ్లు, చేతుల్లో పొడవాటి తాళ్ళు పట్టుకుని వున్నారు. అక్కడికి దగ్గర్లో వున్న ఒక పెద్ద స్టేడియం వరకు పోలీసులు అలా తాళ్ళు పట్టుకుని కనిపించారు. నాతొ పాటు వున్న నా సహచర ఉద్యోగి, మలయాళీ న్యూస్ రీడర్ దాసన్,  నా మొహం చూసి అడక్కుండానే వివరాలు చెప్పాడు. ఆ స్టేడియంలో స్కూలు పిల్లలకు   ఆటలపోటీలు జరుగుతున్నాయి. అవి ముగియగానే ఆ స్టేడియంలో వున్న వందలాదిమంది పిల్లలు ఒకేసారి బయటకు వచ్చి  ఇళ్లకు వెళ్ళడానికి మెట్రో వైపు వస్తారు. 'ఆ విషయం ముందుగానే పోలీసులకు తెలియచేస్తారు కాబట్టి, రద్దీ కారణంగా తొక్కిసలాట జరగకుండా, దారిన పోయేవారికి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు' అని చెప్పాడు. అతనన్నట్టుగానే పిల్లలు, అటూ ఇటూ పోలీసులు పట్టుకున్న తాళ్ళ నడుమ ఒక వరుసలో నడుచుకుంటూ హాయిగా స్టేషన్ లోకి వెళ్ళిపోయారు. 'ఇలా కూడా చేస్తారా పోలీసులు' అనిపించింది, అప్పుడే కొత్తగా హైదరాబాదు నుంచి మాస్కో వెళ్ళిన నాకు.



రెండో జ్ఞాపకం కూడా చాలా పాతది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. హైదరాబాదు  ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను.  అసెంబ్లీ సమావేశాలకు ముందు  స్పీకర్ సంప్రదాయంగా అక్కడ  ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి.  రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా 'సనత్ నగర్ అయితే తీసుకుపోతా' అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను  డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్  రావడం, పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. నేను చొరవతీసుకుని వెళ్ళి సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ తో అన్నాను, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడే వుండి సర్దుబాటు చేసివుంటే కొంపలు మునగవు కదా' అని. ఆయన నవ్వుతూ, 'అవును, కాన్వాయి లో వస్తూ డివైడర్ మీద నిలబడి వున్న మిమ్మల్ని చూసాను. మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నాడు మర్యాదగా.
సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు నాకయితే అనిపించడం లేదు.
రాజమండ్రి సంఘటనకీ, నా పాత జ్ఞాపకాలకీ సంబంధం అర్ధం అయిందనుకుంటాను.
(15-07-2015)
NOTE : Courtesy Images Owners              


14, జులై 2015, మంగళవారం

ఒక విషాదం రెండు జ్ఞాపకాలు


విషాదం ఏమిటో విడిగా చెప్పనక్కర లేదు. ఈరోజు టీవీల్లో అంతా అవే దృశ్యాలు.
ఇక జ్ఞాపకాలు ఏమిటంటే......
పాతికేళ్ళ పైచిలుకు మాట
మాస్కోలో భూగర్భ రైలుమార్గం (మెట్రో)లో ప్రయాణించి రేడియో మాస్కో  దగ్గర్లోని  స్టేషన్ లో దిగి,  ఎస్కలేటర్ ద్వారా రోడ్డుమీదకు చేరుకున్నాను. అంతకుముందు ఎప్పుడూ చూడని ఒక దృశ్యం అక్కడ నాకు కనబడింది. స్టేషన్ వెలుపల కొందరు మిలీషియా (పోలీసులు) వాళ్లు, చేతుల్లో పొడవాటి తాళ్ళు పట్టుకుని వున్నారు. అక్కడికి దగ్గర్లో వున్న ఒక పెద్ద స్టేడియం వరకు పోలీసులు అలా తాళ్ళు పట్టుకుని కనిపించారు. నాతొ పాటు వున్న నా సహచర ఉద్యోగి, మలయాళీ న్యూస్ రీడర్ దాసన్,  నా మొహం చూసి అడక్కుండానే వివరాలు చెప్పాడు. ఆ స్టేడియంలో స్కూలు పిల్లలకు   ఆటలపోటీలు జరుగుతున్నాయి. అవి ముగియగానే ఆ స్టేడియంలో వున్న వందలాదిమంది పిల్లలు ఒకేసారి బయటకు వచ్చి  ఇళ్లకు వెళ్ళడానికి మెట్రో వైపు వస్తారు. 'ఆ విషయం ముందుగానే పోలీసులకు తెలియచేస్తారు కాబట్టి, ఆ సమయంలో రద్దీ కారణంగా తొక్కిసలాట జరగకుండా, దారిన పోయేవారికి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు' అని చెప్పాడు. అతనన్నట్టుగానే పిల్లలు అందరూ ఒక వరుసలో నడుచుకుంటూ వచ్చి హాయిగా స్టేషన్ లోకి వెళ్ళిపోయారు. 'ఇలా కూడా చేస్తారా పోలీసులు' అనిపించింది, అప్పుడే కొత్తగా హైదరాబాదు నుంచి మాస్కో వెళ్ళిన నాకు.


మరోసారి హైదరాబాదులో  ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అక్కడ అసెంబ్లీ సమావేశాలకు ముందు  స్పీకర్ సంప్రదాయంగా  ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి.  రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను  డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్  రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. నేను చొరవతీసుకుని వెళ్ళి సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ తో అన్నాను, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అని. ఆయన నవ్వుతూ,'అవును కాన్వాయి లో వస్తూ డివైడర్ మీద నిలబడి వున్న మిమ్మల్ని చూసాను. మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నాడు మర్యాదగా.
సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు నాకయితే అనిపించడం లేదు. (14-07-2015)

13, జులై 2015, సోమవారం

వినదగునెవ్వరు చెప్పిన ........



"తెలివికలవాడు తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు. అంతేకాదు, మళ్ళీ ఆ తప్పులు చేయకపోవడమే అతడి తెలివికి నిదర్శనం.
"ఇక మేధావులు ఇతరుల తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేయకపోవడం కూడా వారి మేధస్సుకు గీటురాయి.

"ఇంతకీ చెప్పేదేమిటంటే, మనం తెలివికలవాళ్ళం అయినా కాకపోయినా ఒక విషయం తెలుసుకోవడం అవసరం. అదేమిటంటే తప్పులు లేదా పొరబాట్లు అనేవి మన అనుభవాన్ని పెంచుతూపోతాయి. ఆ అనుభవమే మనం చేసే  తప్పులు తగ్గించుకోడానికి ఉపయోగపడుతుంది"