25, ఏప్రిల్ 2015, శనివారం

కళ్ళు తెరిస్తే అదే పదివేలు

  
(Published by 'SURYA' telugu daily in it's edit page on 26-04-2015, SUNDAY)

రాజకీయ దిగజారుడుతనానికి పతాక సన్నివేశాన్ని గత బుధవారం నాడు  జాతి యావత్తూ మౌనంగా వీక్షించింది. టీవీ ఛానళ్ళ ద్వారా ప్రసారం అయిన  ఒక రైతు ఆత్మహత్యా దృశ్యానికి సమస్త ప్రజానీకం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ విషాద సంఘటన రైతుల సమస్యలపై సాగుతున్న చర్చను మరో మలుపు 
తిప్పింది.

 
అసామాన్యులు అధిక సంఖ్యలో నివసించే ఢిల్లీ రాష్ట్రాన్ని  పాలిస్తున్న సామాన్యుడి పార్టీ 'ఆప్' నేతృత్వంలో  రైతు సమస్యలపై నిర్వహించిన ర్యాలీలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం మరో విషాదం. ఈ ర్యాలీకి ఢిల్లీ చుట్టుపక్కలనుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో ఓ పక్క నేతల ప్రసంగాలు సాగిపోతూ ఉండగానే,  ఆ సమస్య తీవ్రతను మరింత సుష్పష్టం చేసే రీతిలో   రాజస్తాన్ కు చెందిన గజేంద్ర సింగ్ అనే రైతు మరో పక్క ఓ చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని వేదికమీద వున్న నాయకుల సాక్షిగా తన ఉసురు తీసుకున్నాడు. వ్యవసాయంలో వచ్చిన వరుస నష్టాల కారణంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు గజిబిజిగా గిలికికినట్టు రాసిన ఓ చిన్న ఉత్తరం మృతుడి వద్ద పోలీసులకు లభించింది.
దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ సంఘటనకు విశేష ప్రాచుర్యం లభించడం ఆశ్చర్యమేమీ కాదు. జాతీయ టీవీ ఛానళ్ళు ఈ సంఘటనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చి వరుస కధనాలతో హోరెత్తించాయి. ప్రధాన మంత్రి మోడీ తక్షణం స్పందించారు. రాజస్తాన్  రైతు మరణం తన మనసును  కలచివేసిందని ఆయన ట్వీట్ చేసారు. తాము ఒంటరివారమని రైతులెవ్వరూ ఏ దశలోనూ భావించరాదని ఆయన అన్నారు. రైతులకు ఉజ్వల భవితవ్యం కోసమే తామంతా ఉన్నామని భరోసా ఇచ్చారు.
దాదాపు రెండుమాసాల అజ్ఞాతం నుంచి ఇటీవలే బయటకు వచ్చి, వచ్చీ రావడంతోనే మోడీ ప్రభుత్వంపై బాణాలు సంధిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అందివచ్చిన ఈ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు భౌతిక కాయం వుంచిన ఆసుపత్రికి హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు. జరిగిన సంఘటనకు కేంద్ర ప్రభుత్వం, కేజ్రీ వాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు బాధ్యత వహించాలని అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగానే రైతుల ఆత్మ హత్యలు పెరిగిపోతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతుల ఉసురు తీసే భూసేకరణ చట్టం సవరణకు చేస్తున్న మొండి  ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని పనిలో పనిగా ఓ  సలహా ఇచ్చారు.  ఇక ఢిల్లీలో 'ఆప్', బీజేపీల నడుమ రగులుతున్న రాజకీయ వైరం ఈ సంఘటనతో కొత్త రంగు పులుముకుంది. ఢిల్లీ పీఠం పోగొట్టుకున్న బాధలో  వున్న బీజేపీ నాయకులకు, 'ఆప్' తమకు అంటిస్తున్న రైతు వ్యతిరేక ముద్ర సుతారమూ నచ్చడం లేదు. దాంతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు రైతు ఆత్మహత్యకు 'ఆప్' దే బాధ్యత అంటూ ఎదురుదాడికి దిగాయి. ఇక 'ఆప్' బృందం కూడా ఆలస్యం చేయకుండా  ప్రతిదాడి మొదలు పెట్టింది. ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింగ్ అంత్యక్రియలు స్వగ్రామంలో ముగియడమే తరువాయి రాజకీయ సెగలు పొగలు కమ్ముతూ మిన్నంటాయి. ఢిల్లీ సంఘటన నుంచి ఏమేరకు రాజకీయ లబ్ది పొందాలి అన్న దిశగా విమర్శలు, ప్రతి విమర్శలు రాజుకుంటున్నాయి.
సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ చేసిన ప్రకటన 'ఆప్' నాయకులను మరింత ఆత్మరక్షణలో పడవేసింది. 'ఆత్మహత్య చేసుకున్న గజేంద్ర సింగ్  ను ఆ ప్రయత్నం నుంచి ఆపకుండా పైపెచ్చు చప్పట్లు చరుస్తూ అతడ్ని రెచ్చగొట్టి ఆత్నహత్యకు ప్రేరేపించార'ని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు కూడా అవే పలుకులు 'ఎఫ్.ఐ.ఆర్.' లో నమోదు చేసారు. కేంద్ర హోం మంత్రి ప్రకటన తప్పుదోవపట్టించేదిగా వుందని, తమ  ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వుందని 'ఆప్' నాయకుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. అటు బీజేపీ ఇటు 'ఆప్'  ఈ రెండింటినీ సంఘటనకు బాధ్యుల్ని చేస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యానాలు సాగాయి. కేంద్రం కనుసన్నల్లో  పనిచేసే ఢిల్లీ పోలీసులు చేసే దర్యాప్తుపై 'ఆప్' ప్రభుత్వానికి ఎటూ నమ్మకం వుండదు కనుక, ఈ సంఘటనపై  హైకోర్టు న్యాయమూర్తితో విచారణ  జరిపించడం సముచితంగా ఉంటుందని ఆ పార్టీ నాయకుడు అజయ్ మాకెన్ సూచించారు. ఇవి కొంతవరకు రాజకీయ పరమైన వ్యాఖ్యలుగా తీసుకున్నప్పటికీ  మరికొందరు 'ఆప్' నాయకులు స్పందించిన తీరు విమర్సలకు గురయింది. మొత్తం ఉదంతాన్ని ఎద్దేవా చేసే రీతిలో మాట్లాడడానికి ప్రయత్నించి వారు  అభాసుపాలయ్యారు.
ఒక విషాద సంఘటన దరిమిలా సాగిన ఈ విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి చూసి జనం ముక్కు మీద వెళ్ళేసుకోవాల్సి వచ్చింది.  నోళ్ళు జారిన నాయకులు చివరికి నాలుకలు కరుచుకోవాల్సివచ్చింది.        
ఒక వ్యక్తి  మరణం, అందులోనూ ఇలాటి ఆత్మ హననం గురించి ఒక్క  ఢిల్లీ లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చలు జరిగాయి. గాలిలో కలిసి పోయిన ప్రాణానికి ధర కట్టినట్టు  ప్రభుత్వాలు, పార్టీలు  ఎంతో కొంత సాయం ప్రకటించి చేతులు దులుపుకున్నాయి.
ఢిల్లీ సంఘటన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ, దేశంలో సాగిన చర్చల సరళి రైతాంగం పరిస్తితులపై  దృష్టి సారించేందుకు   దోహదపడ్డాయి. ఎన్నోనాళ్ళుగా జనాల మెదళ్లలో సుళ్ళు తిరుగుతున్న పలు సందేహాలను తెరపైకి తీసుకువచ్చాయి.
'భారత దేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం' అంటూ  బొడ్డూడని  ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాటలు వినీ  వినీ,  జనాల చెవులకు తుప్పుపట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా ఏ రాజకీయ నాయకుడయినా చెప్పే ఇంకో మాట ఒకటుంది. 'తానూ రైతు కుటుంబం నుంచి వచ్చాననీ, వాళ్ళు పడే ఇబ్బందులన్నీ తనకు కరతలామలకమని'. అయితే ఇవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి కాని చేతల వరకు రావడం లేదని అందరికీ తెలిసిన విషయమే. 'అందరికీ తెలిసిన విషయమే'  అని తెలిసికూడా వాళ్ళు ఆ మాట పదే పదే  చెప్పడానికి మాత్రం  ఏమాత్రం నామోషీ పడరు.
నిజానికి రైతుల సమస్యలు వారి స్వయంకృతం కాదు. పొలం దున్ని విత్తునాటిన నుంచీ ఫలితంకోసం ప్రకృతి మీదనో, ప్రభుత్వాల మీదనో ఆధార పడాల్సిన దుస్తితి వారిది. ఒకరకంగా చూస్తె వారివి తీర్చలేని పెద్ద సమస్యలు ఏవీ కావు. తరుణం మించి పోకుండా నేలలో విత్తనం పడాలి. తరుణంలో ఎరువులు దొరకాలి. పండించిన పంటకు తరుణం మించి పోకుండా గిట్టుబాటు ధర లభించాలి. ప్రభుత్వాలు తలచుకుంటే ఈ సమస్యలను తీర్చడం వాటికో లెక్క కాదు.
పొతే, అటు రైతుల చేతులో, ఇటు ప్రభుత్వాల చేతుల్లో లేని మరో సమస్య వుంది. సమయానికి వానలు పడకపోయినా, పడిన వానలు అవసరానికి మించి పడ్డా రైతుకు ఇబ్బందే. అతివృష్టి, అనావృష్టి వల్ల కలిగే నష్టాలను ఏ ప్రభుత్వం భర్తీ చేయలేని మాటా నిజమే. అయితే, 'అందిస్తాం' అన్న సాయాన్ని ఆలస్యం లేకుండా అందించకలిగితే, అరకొర సాయం అయినా రైతులు అదే పదివేలని తృప్తి పడతారు. కాకపోతే నిబంధనల పేరుతొ సాగే కాలయాపన వల్ల ప్రభుత్వాలు అందించే సాయం కూడా వారికి  అక్కరకు రాకుండా పోతోంది. అతివృష్టితో కోతకు వచ్చిన పంట వరదల్లో కొట్టుకు పోయి రైతుకు కడుపుకోత మిగిలిస్తుంది. అనావృష్టితో విత్తిన గింజ నేలలోనే నిదురపోయి రైతు కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. సరే! అన్నీ సమకూరాయి. పంటలు దండిగా పండాయి. రైతుల ఇంట్లో గాదెలు నిండాయి అనుకుందాం.  అదేం చిత్రమో, అప్పటివరకు ఆకాశంలో వున్న పంటల ధరలు అమాంతం నేలచూపులు చూస్తాయి. పంటలు బాగా పండాయన్న రైతు సంతోషం ఆవిరి అయిపోతుంది. మరో చిత్రం. చేసిన అప్పులు తీర్చడానికి పండిన పంటను అయినకాడికి అమ్ముకున్న మరుసటి రోజునుంచే ధరలు ఆకాశంలోకి మళ్ళీ  ఎగబాకుతాయి. అవసరార్ధం తక్కువ ధరలకు అమ్ముకున్న తిండి గింజల్నే తిరిగి అధిక ధరలకు రైతులు కొనుక్కోవాల్సి రావడం మరో విషాదం.
ఏటేటా ఎదురవుతున్న ఈ సమస్యలకు ఒక నిర్దిష్టమైన పరిష్కార విధానం రూపొందించి సక్రమంగా అమలుచేయగలిగితే, ఆత్మహత్యలకు రైతులను ప్రేరేపిస్తున్న కొన్ని కారణాలకు సమాధానం దొరుకుతుంది.
 దీనికి కావాల్సింది కోట్ల రూపాయల నిధులు కాదు, కాసింత చిత్తశుద్ధి.
అదేమిటో, ప్రకృతి వైపరీత్యాల వంటి కారణాలు ఏవీ లేకుండానే దేశంలో చిత్తశుద్ధికి తీవ్రమైన  కొరత ఏర్పడుతోంది.
ఎవరయినా విదేశాలవాళ్ళు వచ్చి 'చిత్తశుద్ది' కర్మాగారాలు ఏర్పాటు చేయాలేమో!
 (25-04-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595

23, ఏప్రిల్ 2015, గురువారం

పాయింట్ బ్లాంక్ - బ్లాంకు పాయింట్


మగవాళ్ళు  ఏ పాయింటు మీద అయినా రెండు గంటలు ఏకధాటిగా మాట్లాడగలరు.  జన్మతః అది వారికి  అబ్బిన నైపుణ్యం.

ఆడవాళ్ళు ఏ పాయింటూ లేకుండానే రెండుగంటలు గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలరు. అది వారికి దేవుడిచ్చిన వరం.  

(NOTE: Courtesy Image Owner)

షాపింగ్ సిండ్రోం

'భోంచేసి వచ్చారా ..'
'నువ్వు భోంచేశావా?'
'నేను అడుగుతున్నాను. భోంచేసివచ్చారా అని'
'నేనూ అడుగుతున్నాను, భోంచేశావా అని'
'అంటే ఏమిటర్ధం నేనన్నమాటే మళ్ళీ అంటారా!'
'నేననేది అదే. నేను ఏది చెబితే అదే చెబుతావా'
'ఓహో అలాగా నేను ఏది చెబితే మీరు అదే అంటారా అలా అయితే అడుగుతాను చెప్పండి. చీరెల  షాపింగుకి వెడదామా ?'
కాసేపు నిశ్శబ్దం తరువాత మొగుడి జవాబు

'నేను భోంచేసే వచ్చాను' 

(Note: Courtesy Image Owner)

చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు


'యాభయ్ ఏళ్ళక్రితానికి - ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి?' అని అడిగితే - 'ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట - బీడీ సిగరెట్లు తాగేవారు - ఇప్పుడది లేద'ని - ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు.
అప్పటికీ - ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. 'సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామ'ని బెదిరించారా అంటే అదీ లేదు, 'పొగ తాగరాదు' అంటూ ఏదో మొక్కుబడిగా ఓ స్లయిడ్ వేయడం తప్ప.  'అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా' అని ప్రశ్నించుకుంటే 'లేద'నే సమాధానం వస్తుంది. 'పొగరాయుళ్ళను వెతికి  పట్టుకుని కౌన్సిలింగులూ గట్రా నిర్వహించారా' అంటే అదీ లేదు. 'ప్రేక్షకులతో ప్రత్యెక సమావేశాలు ఏర్పాటు చేసి పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా' అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు సిగరెట్ల జోలికి పోకుండా థియేటర్లలో కూర్చుని సినిమాలు ఎలా చూస్తున్నారు?

ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అది చూసి నేర్చుకోవడం. డేరా టాకీసులూ, టూరింగ్ హాళ్ళు, రేకుల సినిమా షెడ్ల  కాలం ముగిసి ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే 'సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాద'ని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు.
జనంలో వున్న ఈ సుగుణాన్ని జనంతో సంబంధం వుండి వారిపై పెత్తనం చేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గమనించి నడుచుకుంటే ఈనాడు మనం ఎదుర్కుంటున్న అనేక చిక్కు సమస్యలకి చిరు పరిష్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయనడానికి ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చెప్పడం జరిగింది.
ముఖ్యంగా నగరాల్లో పెచ్చు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకి పరిష్కారం కోసం నానా మార్గాలు వెతుకుతున్న అధికారులు  ఈ సూత్రాన్నే అమలు చేస్తే  అనేక సమస్యలకు కనీసం సగం పరిష్కారం అయినా లభిస్తుంది. లేని పక్షంలో - ఒక దినపత్రికలో  పేర్కొన్నట్టు -" సమస్యమీదే - పరిష్కారం మీదే మేం నిమిత్త మాత్రులం - ఇదీ ట్రాఫిక్ పోలీసుల వరుస" అనే విమర్శల తాకిడిని తట్టుకోక తప్పదు. 

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ని  చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. కాకపోతే , అందుకోసం తీసుకుంటున్న చర్యలేమిటన్నదే జవాబు లేని-  రాని ప్రశ్న.  

 
ట్రాఫిక్ అంశాలపై ఏర్పాటు చేసిన సదస్సులు - సమావేశాల్లో పౌరులు ఏదయినా చెప్పబోతే `సమస్యలు చెప్పమంటే, సలహాలు చెబుతున్నారని' కొందరు అధికారులు విరుచుకు పడిన తీరు గమనిస్తే వారి అసహన వైఖరి తేటతెల్లమవుతుంది. అవగాహన కల్పించే తీరు సరిగా లేదేమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదని వారు గ్రహించాలి. అన్నింటికంటే ముందు చేయాల్సింది - ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని - కొంతకాలం పాటయినా - ట్రాఫిక్ చిక్కుముళ్ళని చక్కదిద్దే దిశగా  మరల్చాలి. ఎక్కడ - ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని - ఆయా కూడళ్ళలో - అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేయాలి.

రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. వాణిజ్య  ప్రకటనలకు మినహా - వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు, ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి.
       
అలాగే, ప్రైవేటు విద్యా సంస్థల వద్ద నిర్మించిన వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్దభారం కాబోదు.

ఇలాటి  ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక  రద్దీ కూడళ్ల వద్ద రోడ్డు దాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం ఈదడం  కంటే రోడ్డు దాటడం కష్టంగా భావిస్తుంటారు. ఇలాటి వారి సంగతి పట్టించుకునే నాధుడు కనబడడు. 


(చేతిలో జెండా పట్టుకుని అమెరికాలోని సియాటిల్ లో రోడ్డు దాటుతున్న దృశ్యం) 


బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో  రోడ్డుదాటడానికి  పుష్ బటన్ వ్యవస్తలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా పచ్చ దీపం వెలుగుతుంది. వారు రోడ్డుదాటి వెళ్ళేవరకు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.

విద్యుత్ దీపాలతో  కూడా పని లేకుండా - జండాలను ఉపయోగించే ఒక విధానం కొన్ని విదేశాల్లో అమల్లోవుంది. అదేమిటంటే- రోడ్డుకు ఇరువైపులా బాస్కేట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డు దాటాలనుకునేవారు ఆ జండాను తీసుకుని చేతిలో పట్టుకుని  ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డుదాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కేట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు.

పొతే, థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడం వీలుపడుతుంది. 

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా   పార్కింగ్ కి  అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.
ప్రయివేటు బస్సులని ఎలాగూ  అదుపు చేయలేరు కనుక - రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్తలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను  ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్తలకే ఇవ్వాలి. ఇలాచేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.      

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే బిజీ సమయాల్లో చెకింగులు  జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. అసలు ఇలాటి వాహనదారుల వల్లె ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
అలాగే,  రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో   'వీ..పీ. ' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో  మార్పులు  చేయాలి. 'ప్రజలకోసమే మేము, ప్రజాసేవలో మేము' అంటూ నిత్య జపం చేసే నాయకులు ఇందుకు ఏమాత్రం సహకరిస్తారో చూడాలి.   

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు  పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి. (22-04-2015)

రచయిత మొబైల్: 98491 30595, ఈ మయిల్:  bhandarusr@gmail.com

NOTE: Courtesy Image Owner

22, ఏప్రిల్ 2015, బుధవారం

ఆడ లవణం


కూరలో ఉప్పు తగినంత పడ్డప్పుడు దాన్ని ఎవ్వరూ తలుచుకోరు.అదే,  ఉప్పులేని కూర వడ్డించారు అనుకోండి. నోట్లో పెట్టుకోగానే తెలిసిపోతుంది, అందులో ఉప్పు లేదని.
అలాగే ఆడవాళ్ళు. ఎదురుగా వున్నప్పుడు ఇంట్లో వాళ్ళెవ్వరు వాళ్ళు ఉన్నట్టే  గమనించరు, వాళ్ళ వూసే ఎత్తరు. అదే వాళ్ళు పుట్టింటికి వెళ్ళారనుకోండి, అప్పుడు తెలిసివస్తుంది వాళ్ళు లేని సంగతి.



NOTE: Courtesy Image Owner