2, మే 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో ( 155 ) – భండారు శ్రీనివాసరావు

నా మీద నాకే అసూయ

"ఏమిటి మీ ఆరోగ్య రహస్యం?" అడిగాడు ఓ మిత్రుడు.
"ఏమీ లేదు, జ్ఞాపకాలను నమిలి తింటుంటాను"
2019 లో కంటికి రెప్పలా చూసుకున్న మా ఆవిడ నిర్మల హఠాత్తుగా కన్నుమూసింది.
అయిదేళ్లు గడవకముందే 2024 ఫిబ్రవరి నాలుగున, నాకు కుడి భుజంగా వున్న నా రెండో కుమారుడు సంతోష్, తల్లి మీద ప్రేమతో ఆమె దగ్గరికే వెళ్ళిపోయాడు. వాడికి తల్లి అమ్మ ప్రాణం. ఆమె చనిపోయినప్పుడు, ఎవరో పెద్దగా బాడీని తీసుకు రండి అంటుంటే వాడు కోపం ఆపుకోలేక పోయాడు. ' బాడీ ఏమిటి బాడీ. బుద్ది వుందా! ఆమె మా అమ్మ. అమ్మ.' అంటూ విరుచుకుపడ్డాడు. అంత ప్రేమ తల్లి అంటే.
అయిదేళ్ల వ్యవధిలో ఈ ఇద్దరూ నాకు కాకుండా పోయారు. అయినా దుక్కలా వున్నానంటే జ్ఞాపకాలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ వుంటే చెప్పరాని ఆనందం, చెప్పుకోలేని బాధ రెండూ పడుగుపేకలుగా మనసును ముప్పిరిగొంటాయి. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియని స్థితి.
కొన్ని జ్ఞాపకాలు అంతే. తలచుకున్నప్పుడల్లా వయసును మురిపిస్తాయి. మనసుని వేధిస్తాయి.
దాదాపు ఓ అర్ధ శతాబ్దం నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి, కరోనా అంటే ఏమిటో తెలియకుండానే, ఆ పదం వినకుండానే, ఆ మహమ్మారి ఆగమనానికి ముందుగానే నేను పుట్టిన ఆగస్టులోనే, నా పుట్టినరోజున ప్రేమతో కేకు తినిపించిన పదో రోజునే 2019లో కన్ను మూసింది. వచ్చే పెన్షన్ తప్ప వేరే ఆధారం లేదు. కూడబెట్టుకున్నవీ లేవు. ఇవేవీ నా మనసుకు తాకలేదు. కారణం నా ఇద్దరు పిల్లలు, నా కోడళ్ళు. తోడులేని మనిషికి తోడుగా నిలబడ్డారు. నా చుట్టపక్కాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు రోజూ నా యోగక్షేమాలు కనుక్కోకుండా నిద్రపోడు.
సాధారణ మనుషులకి నిజంగా ఇవన్నీ అసాధారణ విషయాలే. అందుకే నా మీద నాకు అసూయ. కానీ ఇంతటి ఆదరణకి నేను అర్హుడిని కాదు అన్న సంగతి నాకు తెలుసు.
ఏడుగురు అక్కయ్యలు. అది ఒక కారణం కావచ్చు, నాకు ఆడవాళ్లంటే గౌరవం. మా కోడళ్ళను చూసిన తరువాత అది రెట్టింపు అయింది.
పెద్ద కోడలు భావన అమెరికానుంచి ఫోన్ చేసి నా వెల్ఫేర్ కనుక్కుంటుంది. వాళ్ళు అక్కడ సిటిజన్లు. ఆమెకు విద్యార్హతలు చాలా వున్నా, పిల్లల కోసం ఇన్నేళ్ళు ఉద్యోగం చేయకుండా ఇల్లు చూసుకుంది. నా మనుమరాళ్లు ఇద్దరూ యూనివర్సిటీ చదువుల కోసం బయటి రాష్ట్రాలకు వెళ్ళారు. దాంతో ఖాళీగా వుండడం ఇష్టంలేక వున్న ఊళ్లోనే క్వాలిఫికేషన్ కు తగిన ఉద్యోగానికి అప్లయి చేస్తే, ఇన్నేళ్ళు ఏ ఉద్యోగం చేశావు అని మాట మాత్రం అడగకుండా అర్హతను చూసి మంచి ఉద్యోగం ఇచ్చారు.
నా రెండో కోడలు నిషా. ఆమెకు ఏదో పెద్ద కార్పొరేట్ సంస్థలో, దేశ దేశాల్లోని సిబ్బంది మీద అజమాయిషీ చేసే బాధ్యత కలిగిన పెద్ద ఉద్యోగం. అయినా ఇంటినీ, నన్నూ, నా అవసరాలను కనిపెట్టి చూస్తుంటుంది. ఎందుకమ్మా ఇలా అవస్థ పడతావు అంటే నవ్వి ఊరుకుంటుంది.
ఇప్పుడు ఇంట్లో నాకు ఏకైక కాలక్షేపం నా మనుమరాలు జీవిక. సమ్మర్ స్కూలు, సమ్మర్ క్యాంపులు అంటూ దాదాపు పగలల్లా బయటే. మూడేళ్ల ఆ చిన్నదాన్ని కనిపెట్టి చూడడానికి మరో చిన్న కేర్ టేకర్ అంకిత. కోడలు పనిచేసుకునేటప్పుడు (వర్క్ ఫ్రం హోం), నేను రాసుకొనేటప్పుడు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటుంది. వలలి వనిత సరే. దాదాపు పన్నెండేళ్ళుగా మా ఇంట్లో వంటపని చూస్తోంది. చిన్నపని, పెద్దపని, బజారు పని చేయడానికి మా వాచ్ మన్ సమ్మయ్య ఎలాగు వున్నాడు.
మా ఆవిడ వుండివుంటే, ఈ వైభోగాలు చూస్తూ వుంటే, నా కొడుకు బతికి వుంటే నన్ను పట్టడానికి పగ్గాలు వుండేవి కావు. దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కానీ ఏదీ మన చేతిలో పెట్టలేదు.
దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర వేసిన సావిత్రితో, ముసలి భర్త సీ.ఎస్.ఆర్. అంటాడు, 'చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఈ మచ్చ ఏమిట'ని.
చంద్రుడికే తప్పలేదు. మనమెంత?
భయంకరమైన కరోనా రోజుల్లో కూడా బంధు మిత్రుల కుటుంబ సభ్యుల ఆత్మీయతానురాగాలే నాకు బాసటగా నిలిచాయి. ఒంటరితనాన్ని దూరం చేశాయి.
‘మాతరం అన్ని విషయాలను పట్టించుకుంటుంది’
ఒక రాత్రి బీబీసీ తెలుగు న్యూస్ లో ఓ ఆఫ్రో అమెరికన్ అమ్మాయి కాబోలు చెబుతోంది. ఆ చిన్నారి కళ్ళల్లో ఎనలేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
ఏపని చేయాలన్నా కాస్త ముందు వెనుకలు చూసుకోవాలి అనే తరం పెంపకంలో పెరిగిన తరం మాది. ఈ ముందు వెనుకల శషభిషలు ఏమాత్రం పట్టించుకోని నేటి తరాన్ని చూస్తూ ఒకింత భయపడే తత్వం కలిగిన నా వంటి వారికి ఆ అమ్మాయి ఓ స్పూర్తి. దీనికి ఓ సొంత నేపధ్యం వుంది.
కరోనా గురించి తెలిసిన తొలి రోజుల్లో ముఖ్యంగా ఇళ్ళల్లో, ఆసుపత్రుల్లో ఐసొలేషన్ గురించీ, మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది అనే ఉద్దేశ్యంతో కరోనా కేసులు వచ్చిన వాడల్లో కంటైన్ మెంటు ఆంక్షలు గురించీ మొదటిసారి విన్నప్పుడు ఒకింత భయంతో కూడిన సందేహాలు మొలకెత్తిన మాట వాస్తవం.
‘భయపడే పనే లేదు’ అనేవారు మా అబ్బాయి సంతోష్, కోడలు నిష.
అనడమే కాదు అన్ని రకాల ఏర్పాట్లు మొదట్లోనే చేశారు. ఆక్సిజన్ సిలిండర్, ఆక్సీమీటర్, లంగ్ ఎక్సర్ సైజ్ చేసే పరికరాలు, అవసరం పడతాయి అనుకున్న మందులు, శానిటైజర్లు అన్నీ తెచ్చి పెట్టారు. లిఫ్టులో ఆక్సిజన్ సిలిండర్ తెస్తున్నప్పుడు మా ఇంట్లో ఎవరికో ఈ కరోనా వచ్చిందని మా ఫ్లాట్లో కొందరు అనుమాన పడ్డారు కూడా. వంటమనిషి, పనిమనిషి రాకపోతే ఏమి చేయాలి అనే విషయాలు కూడా ముందుగానే ఆలోచించి పెట్టుకున్నారు. అప్పటికి వాక్సినేషన్ ఊసే లేదు.
‘మీరు అధైర్య పడకండి. మిమ్మల్ని ఏ పరిస్థితుల్లోను ఆసుపత్రిలో చేర్చము. కరోనా రాకుండా చేయాల్సింది చేద్దాము. కర్మ కాలి వచ్చినా దాన్ని మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేద్దాము. ఈ వ్యాధి గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలియక, టీవీలు చూసి జనం అనవసరంగా కంగారు పడుతున్నారు’
ఇదీ వాళ్ళ వాదన.
నాకప్పుడు అనిపించేది వాళ్ళు ముందు చూపుతో ఆలోచించడం లేదని.
అదే ఇప్పుడు అనిపిస్తోంది, నేనే అప్పుడు ముందు చూపు లేకుండా ఆలోచించానని.
మా చుట్టాల ఇంట్లో పెద్దవాళ్లు ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. పిల్లలు వెంటనే వారికి ఇంట్లోనే ఐ సొలేషన్ ఏర్పాటు చేశారు. మొదటి అయిదు రోజులు ఇవ్వాల్సిన మందులు, ఆహరం ఇచ్చారు. మరో పది రోజులు అలాగే ఉంచారు. ఏ మందుల అవసరం పడలేదు. కొన్ని రోజుల తర్వాత వారికి కరోనా లక్షణాలు తగ్గాయి. వారిలో పెరిగిన అనవసర భయం కూడా తగ్గింది.
భయానికి ఓ స్వభావం వుంది. దాన్ని చూసి బెదిరితే మరింత బెదరగొడుతుంది. మనం అదరగొడితే అది తోక ముడుస్తుంది.

తోకటపా:
కరోనాకు టీకా అందుబాటులోకి రాగానే హైదరాబాదులో కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్న మొదటి వరుస వారిలో నేనున్నాను. అలాగే రెండో డోసు కూడా సకాలంలోనే తీసుకున్నాను.
ఈ నేపధ్యంలో ఒకరోజు అంటే 2021 సెప్టెంబరులో ఎనిమిదో తేదీన నాకు రాపిడ్ కోవిడ్ టెస్ట్ చేశారు. అదీ రాజ్ భవన్ లో.
రాజ్ భవన్ నాకు కొత్త కాదు. జ్వాలా నరసింహా రావు రాజ్ భవన్ లో పనిచేసున్న రోజుల్లో అనేక సాయంత్రాలు నాకు అక్కడే గడిచేవి. రేడియో విలేకరిగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలకు పలుమార్లు వెళ్ళిన అనుభవం వుంది. ఇది కారణం కావచ్చు, అక్కడ పనిచేస్తున్న పాత సిబ్బందిలో అనేకమంది నన్ను గుర్తు పట్టి పలకరిస్తూ వుంటారు. అలాంటిది ఆ రోజు రాజ్ భవన్ ఆహ్వానం మేరకు నేను పదకొండు గంటల ప్రాంతంలో మెయిన్ గేటు దాటి లోపలకు వెళ్ళగానే అక్కడ వున్న సిబ్బందిలో ఒకరు, కొంచెం ముందుకు వెళ్ళమని చేత్తో సైగ చేశారు. అలానే వెడితే, అక్కడ రెండు తాత్కాలిక గుడారాలు వున్నాయి. నాకంటే ముందు చేరుకున్న కొందరు సీనియర్ జర్నలిష్టులు, శ్రీయుతులు దాసు కేశవరావు, గోవిందరాజు చక్రధర్, నందిరాజు రాధాకృష్ణ, ఉడయవర్లు మొదలైన వాళ్ళు అక్కడ క్యూలో నిలబడి వున్నారు. మా మొబైల్ నెంబర్లు తీసుకున్నారు. కోవిడ్ టీకా ఎన్ని డోసులు తీసుకున్నారు అనే విషయం ఆరా తీశారు. అక్కడ కుర్చీల్లో కూర్చోబెట్టి, ముక్కుల్లోకి ఏదో గొట్టం లాంటిది పెట్టి చూసారు. కాసేపటి తరువాత ఏమీ లేదు, ఇప్పుడు వెళ్ళండి అని మర్యాదగానే చెబుతూ రాజ్ భవన్ లోపలకి అనుమతించారు.
కోవిడ్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్న పద్దతి కొంచెం వింతగా అనిపించింది.
కింది ఫోటో:
రాపిడ్ కోవిడ్ టెస్ట్ కాపీ
(ఇంకా వుంది)
May be an image of text that says "RAJ BHAVAN HYDERABAD COVID TEST Name B.Sriniv B.SrinivasRao rnivarrao Reg RegNo:96 RegNo: No: 96 Result: Nugatine we"
All reactions:
1
Like
Comment
Share
Facebook

1, మే 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (154) – భండారు శ్రీనివాసరావు

 

మా ఆవిడతో మాట్లాడాలని వుంది

 

జీవితం అంతా ఒకటే హడావిడి. ఒక్క నిమిషం టైం లేదన్నట్టు రోజులు, సంవత్సరాలు  గడిచిపోయాయి. ఆఖరికి భార్యతో ఒక మాటా లేదు, ముచ్చటి లేదు.

జర్నలిస్టుల జీవితాలే అంతా. లేక నా బతుకే అంతా.

కరోనా అంటే ఏమిటో తెలియకుండా తను దాటి పోయింది. ఒక రకంగా అదృష్టవంతురాలు అన్నారు. అందరు చుట్టపక్కాలు, బంధు మిత్రుల నడుమ ఆమె అంత్యక్రియలు జరిగాయి. అదే కరోనా కాలం అయివుంటే. ఊహించడానికే  ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కరోనా బారిన పడి, మరీ ముఖ్యంగా రెండో వేవ్ లో  మా చుట్టపక్కాల్లో చాలా దగ్గరి వాళ్ళు చనిపోయారు. తదనంతర దృశ్యాలు తలచుకోవడానికి కూడా భయం వేస్తుంది.  మా కుటుంబం మొత్తాన్నీ కలచివేసిన ఆకస్మిక మరణం మా చిన్న మేనల్లుడిది.

కలం పేరు కొలనరావు. రాతకారుడు, గీత కారుడు కూడా. అసలు పేరు  కొలిపాక లక్శ్మీ నరసింహారావు. డిగ్రీ ఫలితాలు రాకముందే బ్యాంకు మేనేజర్ ఉద్యోగం వచ్చింది. అతి చిన్న వయసులోనే ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. ఇంట్లో బయటా అందరికీ తలలో నాలుకలా వుండేవాడు.  పిల్లలు ఎదిగివచ్చి తండ్రిని మించిన వాళ్ళు అయ్యారు. అన్యోన్యమైన దాంపత్యం. ఏ లోటు లేని సంసారం. అలా జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో కరోనా కాటు వేసింది. 2021 ఏప్రిల్ 29 న కన్నుమూశాడు.   అప్పటికి నా వయసు 75.  తిరగేస్తే వాడి వయసు 57.

 చిన్న  వయస్సులోనే వాడికి నూరేళ్లు నిండిపోతాయని ఏనాడూ అనుకోలేదు. కళ్ళముందు చిన్నవాళ్లు రాలిపోవడమే పెద్దవాళ్లు చేసుకున్న పాపం అని మా బామ్మ చెప్పేది.

ఇలాగే యావత్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన సందర్భం మరోటి.

2021 మే చివరివారంలో ఒక రోజు.

ఓ మిత్రుడు ఫోన్ చేసి ఎస్వీ ప్రసాద్ గారు కరోనాతో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి బాగాలేదు అంటున్నారు అని చెప్పాడు. పోలేని పరిస్థితి. నా దగ్గర వున్న ఫోన్ నెంబరుకు ఓ మెసేజ్ పెట్టాను, గెట్ వెల్ సూన్ అని. చూసి వుండరు. మూడో రోజు  ఉదయం కన్ను మూశారు అని వార్త. ఎప్పుడూ చెదరని నవ్వు మొహంతో వుండే ఎస్వీ ప్రసాద్ గారు ఇక లేరు అని తలచుకుంటే చాలా బాధ వేస్తుంది.

అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. ఒక్క మాట కూడా పడకుండా నెట్టుకు రావడం అంటే ఆషామాషీ కాదు. విజయభాస్కర రెడ్డి, ఎన్టీఆర్, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలా అందరి చేతా సెహబాష్ అనిపించుకున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత విజిలెన్స్ కమిషనర్ గా చాలా కాలం పనిచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో శ్రీ ఎస్వీ ప్రసాద్ ఏకబిగిన దాదాపు తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేశారు.

ఆ తర్వాత జరిగిన అంటే 2004 ఎన్నికల తర్వాత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు ముఖ్యంగా ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన అధికారులకి స్థానచలనం జరగడం ఆనవాయితీ.

ఎస్వీ ప్రసాద్ నిబద్దత, నిజాయితీల మీద వై.ఎస్.ఆర్. కి ఉన్న నమ్మకం చేత, ఆయన్ని పిలిచి ఆయన కోరుకున్న పోస్టు ఇవ్వాలని సంకల్పించారు. కానీ ప్రసాద్ గారు మాత్రం ముఖ్యమైన, కీలకమైన పోస్టులు కోరుకోలేదు. చాలా ఏళ్ళుగా విశ్రాంతి ఎరగకుండా పనిచేయడం వల్ల కావచ్చు, పనిభారం కొంత తేలికగా వుండే అప్రధాన పోస్టుని ఏరికోరి వేయించుకున్నారు. అదేమిటంటే – Environment Protection Training and Research Institute (EPTRI). అది హైదరాబాదులోనే వుంది కాని అలాంటి సంస్థ ఒకటి వుందని చాలా మందికి తెలియదు. అక్కడ డైరెక్టర్ గా ఆరు నెలలు కూడా పనిచేశారో లేదో తెలియదు, వై.ఎస్. ఆయన్ని అతి కీలకమైన పోస్టుకి ఎంపిక చేశారు. ఎస్వీ ప్రసాద్ గారిని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.

ఇదేమిటి అని సొంత పార్టీ వాళ్ళు అడిగితే  అది అంతే అని వై.ఎస్. జవాబు. తనకు అడ్మినిస్ట్రేషన్ కొత్త అయినా, రాజకీయాల్లో సుదీర్ఘ కాలం వుండడం చేత ఐ.ఏ.ఎస్. అధికారుల పనితీరు తనకు కరతలామలకం అని చెప్పేవారు. ఎవరో ఒకరిద్దరు తప్ప సాధారణంగా చాలా మంది ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లు Loyal to their duty అనేది ఆయన అభిప్రాయం. దీన్నే కొందరు Loyal to CM అని అన్వయించి చెబుతారు.

ఆయన సీఎం పేషీలో వుండడం వల్ల ఐ.ఏ.ఎస్. అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయంతో చక్కటి సమన్వయం ఉండేదని, ప్రభుత్వ నిర్ణయాలు సత్వరంగా అమలు జరగాలంటే ఇలాంటి సమన్వయాన్ని అధికారులు కోరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు అభిప్రాయ పడ్డారు.

అనేకమంది, అదీ పరస్పర విరుద్ధమైన పార్టీల ముఖ్యమంత్రుల వద్ద సన్నిహితంగా పనిచేసే అవకాశం ఎస్వీ ప్రసాద్ గారికి లభించింది. కత్తి మీది సాము లాంటి వ్యవహారాలను ముఖ్యమంత్రికి మాట రాకుండా, తను మాట పడకుండా చక్కబెట్టే చాణక్యం ఉంటేనే కాని ఇది సాధ్యపడదు.

కరోనా కారణంగా, అంత మంచి అధికారికి నూరేళ్లు నిండడం విషాదం.

ఈ విషయంలో మా ఆవిడ అదృష్టవంతురాలే అనుకోవాలి. కాకపోతే,  అసలు దురదృష్టవంతుడిని నేను. కాలికి బలపం కట్టుకుని తిరిగిన నేను, కరోనా కాలంలో  రెండేళ్లపాటు గడపదాటకుండా  ఇంటిపట్టునే పడివున్నాను. ఆమె ఎప్పుడూ కోరుకుని, పైకి చెప్పని కోరిక అది.

ఒకప్పుడు అది అసాధ్యం. ఎప్పుడూ ఎవరో ఒకరు. ఏదో ఒక ఫోను. పగలు లేదు, రాత్రి లేదు. ఎక్కడో ఒక చోట గంటలు గంటలు వుండిపోవడం. ఇంటికి వస్తే వెంట నలుగురు. కాఫీలు, టీలు, భోజనాలు. నాకు తీరిక లేదు. అంచేత ఆమెకు తీరిక వుండేది కాదు.

అంతా అయిన తర్వాత, అందర్నీ పంపించిన తర్వాత ఏమిటి ఈరోజు విశేషాలు అని అడిగేది. చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, రాజకీయాలు ... ఈ సంగతుల మీద ఆమెకు ఏమి ఆసక్తి.

రిటైర్ అయిన తర్వాత కూడా ఇదే తీరు. ఉదయం ఆరింటికి లేస్తే ఏదో ఒక టీవీ. తను నాకంటే ముందే లేచి కాఫీ పెట్టి ఇస్తే తాగి బయట పడితే మళ్ళీ ఎప్పుడో.

అత్తయ్య! చూస్తున్నావా మామయ్య టీవీలో మాట్లాడుతున్నాడు’

ఫోన్లో నా మేనకోడళ్ళు ఎవరో అడిగేవాళ్ళు.

ఏఛానల్లో’ అనేది తను నిరాసక్తంగా.

నేను ఏ ఛానల్ కు వెడుతున్నానో తనకి తెలియదు. తెలిసినా చూసేది కాదు.

ఏమిటండీ ఆ పోట్లాటలు. అంతోటి వాటిని పనికట్టుకుని చూడాలా’ అనేది.

 కరోనా కాలంలో తను ఉన్నట్టయితే ఎంత బాగుండేదో. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వుండేవాళ్ళం.

అది కూడా నేను బయటకు పోయే ఛాన్స్ లేదు కాబట్టి.

‘ఇప్పుడు రా! ఎంచక్కా కబుర్లు చెప్పుకుందాం అనాలనిపిస్తుంది.

మాస్క్ తో మా ఆవిడ

 కింది చిత్రంలో మాస్క్ తో వున్నది మా ఆవిడ నిర్మల. ఆమె చనిపోయిన ఆరేడు నెలల తర్వాత కానీ కరోనా మన దేశంలో అడుగుపెట్టలేదు. అప్పటికి ఇలా మాస్కులు పెట్టుకుని తిరగడం అలవాటు లేదు.

అంతకు ముందు సంవత్సరం అంటే 2018లో అనుకుంటామా అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్రబోస్, హైదరాబాదులోని మా కుటుంబాలను తీసుకుని మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని పుణ్యక్షేత్రాలుపర్యాటక ప్రదేశాలు చూపించాడు. ఆ క్రమంలో మా అందర్నీ ఇనుప చువ్వలు, కడ్డీలు  తయారు చేసే ఓ కర్మాగారానికి తీసుకువెళ్లాడు. అక్కడి నిబంధనల ప్రకారం మాస్కులు ధరించాలి. కాకపొతేఅవి వాళ్ళే ఇచ్చారు.

(ఇంకా వుంది)

కింది ఫోటో :