8, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (31) - భండారు శ్రీనివాసరావు

 


బెజవాడ సీవీఆర్ హైస్కూల్లో నా సహాధ్యాయులందరూ మెరికలే. బహుశా పల్లెటూరి నేపధ్యం కారణంగా నేను వారి కంటే చదువులో కొంచెం వెనుకబడ్డానేమో తెలియదు. అలా అని వెనుక బెంచి బాపతు కాదు. ముందు బెంచీలోనే కూర్చొనే వాడిని.  ప్రతి క్లాసు పాసవుతూ వచ్చాను కానీ మంచి మార్కులతో మాత్రం కాదు. ప్రస్తుతం టచ్ లో ఉన్న స్కూలుమేట్స్ ఇద్దరు ముగ్గురే వున్నారు. నా మేనల్లుడు సాంబశివరావు (శాయిబాబు) ఇప్పుడు  లేడు. వుంటే నాకు రెడీ రికనర్) . దేనికీ తడుముకోవాల్సిన పని వుండేది కాదు.  ఇక వేమవరపు భీమేశ్వరరావు  హైదరాబాదులోనే వున్నాడు. అతడికి జ్ఞాపకశక్తి ఎక్కువ. పొతే, మరొక మిత్రుడు దేవరకొండ ప్రసాద్, దేశాల మధ్య, నగరాల మధ్య గాలిలో తిరుగుతుంటాడు. ధారణలో అతడూ  దిట్టే. మొన్నీమధ్య ఫోన్ చేసి  డిసెంబరు రెండో వారంలో ఒక పెళ్ళికోసం హైదరాబాదు వస్తున్నాను, తప్పకుండా కలవాలి అన్నాడు. నిజానికి అది నా అవసరం. ‘తప్పకుండా. భీమేశ్వరరావుని కూడా కలుద్దాం అన్నాను. వీళ్ళని కలిస్తే నా స్కూలు జీవితానికి సంబంధించిన విశేషాలు పోగుచేసుకోవచ్చు. అదీ నా తాపత్రయం. మతిమరపులో నాది  మొదటి ర్యాంకు కదా! అందుకు.  

దాదాపు నలభయ్ ఏళ్ల విరామం తర్వాత బీమేశ్వరరావుని పదిహేనేళ్ల క్రితం కలిసాను.

2009 డిసెంబరులో ఒకరోజు  ఉదయాన్నే ఫోను మోగింది. కాఫీ తాగుతూ పేపరు చదువుతున్ననేను ‘ఇంత పొద్దున్నే ఎవరబ్బా’ అనుకుంటూనే ఫోను తీశాను. లాండ్ లైన్ రోజులు. ‘శ్రీనివాసరావా!’ అంటూ అవతలనుంచి కాస్త వయసుమీద పడినట్టున్న గొంతు పలకరించింది. ‘అవును. మీరు....’ అన్నాను కొంచెం సందిగ్ధంగా . ‘గుర్తు పట్టు చూద్దాం’ అంది అవతలి గొంతు కవ్వింపుగా. ‘భీమేశ్వరరావు కదూ..’ అంటూ నలభయ్ ఏళ్ళ తరువాత విన్న ఆ స్వరాన్ని గుర్తుపట్టాను. మరో బాల్య మిత్రుడు సాంబశివరావుని కూడా పిలిచి మా ఇంట్లో కలవాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాం. అలాగే కలిశాం. నలభయ్ ఏళ్ళ తరవాత కలయిక. ముచ్చట్లకు లోటేమిటి?

స్కూలు చదువులు, పై చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు,  రిటైర్ మెంట్లు ఇలా అన్నీ పూర్తయ్యాక జరిగిన సంగమం ఇది. 

 

భీమేశ్వరరావు కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి హైదరాబాదు వచ్చాడు. వచ్చినప్పటి నుంచి కూడా తనతో కలిసి చదువుకున్న మా జాడకోసం తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నిస్తూనే వున్నాడు. తన దగ్గరకు హోమియో వైద్యం కోసం వచ్చిన ఒక మీడియా మిత్రుని ద్వారా నా  ఫోను నెంబరు పట్టుకున్నాడు. అదీ ఫోన్ కాల్ వెనుక కధ.  అప్పటికే ముగ్గురం మా వృత్తిపరమైన కొలువుల నుంచి రిటైర్ మెంటు పేరుతొ బయటపడ్డాము. భీమేశ్వర రావు తనకు తండ్రి గారి నుంచి సంక్రమించిన హోమియో వైద్యాన్ని అవసరమైన వారికి అందిస్తూ తృప్తిగా జీవనం గడుపుతున్నాడు. అతడో చెయ్యి తిరిగిన రచయిత అని ఫేస్ బుక్ ద్వారానే తెలిసింది. అతడు రాసిన తన జీవిత చరిత్ర అపూర్వం. అతడికి వున్న అసాధారణ ధారణ శక్తి ఆ పుస్తకం రాయడానికి బాగా ఉపకరించింది. రాసే రంగంలో వుండి  కూడా నేను అతగాడిలా అంత విస్తృతంగా, అంత బాగా రాయలేకపోయాను.  

మా జ్ఞాపకాలను, చిన్ననాటి అనుభూతులను నెమరు వేసుకోవడానికి అదృష్టవశాత్తు మా రిటైర్ మెంటు పనికి వచ్చింది.  ముందే కలిసివుంటే హోదాల గోదాలు అడ్డు వచ్చి వుండేవేమో. నేను ఆరోజుల్లో అలా  ఇలా అని చెప్పుకోవడానికే సమయం సరిపోయేదేమో మరి.

ముందు నుంచీ కూడా  భీమేశ్వరరావు చాలా క్రమశిక్షణతో వుండేవాడు. వాళ్ళ నాన్నగారి నుంచి అబ్బిన మంచి లక్షణం. మితభాషి కూడా. ఇప్పుడు ఇంతలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా వుంది. ఇన్నాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో వున్నాడు కదా! బహుశా అంచేత మాటకారిగా మారివుంటాడు’ అన్నాడు శాయిబాబు అనే  సాంబశివరావు, అన్నాడు ఆనాటి కలయికలో.

కానీ మేమిద్దరం అలా కాదు. కొంచెం ఆకతాయిలం. అప్పట్లో వాలీబాల్ లాంటి ఆటలను గంట ఆడుకోవడానికి రెండుగంటలు ప్రాక్టీసు చేసేవాళ్ళం. సెకండ్ షో సినిమాలు, నాటకాలు అబ్బో ..చాలా వేషాలు వేశాం” అని తుర్లపాటి చెబుతుంటే, “అవును. మా స్కూల్లో మాకు చక్కని వినోదాన్ని పంచేవాడు శ్రీనివాసరావు. పాటలు, పద్యాలు, కవితలు. అతడికి రాని కళలు లేవంటే నమ్మండి. మాయాబజార్ లో పాటలూ, పద్యాలు అన్నీ కంఠస్థ౦. నేనెప్పుడు మాయాబజార్ పాటలు విన్నా నాకు శ్రీనివాసరావు చాలా గుర్తుకు వచ్చేవాడు. అల్లరికి అల్లరి, చదువుకు చదువు అన్నీ చేసేవాళ్ళం’ అని మాటలు మొదలు పెట్టాడు, భీమేశ్వరరావు.

లోపల కాఫీ కలుపుతున్న మా ఆవిడ వింటున్నదన్న భావనలో కాస్త చాతీ పెంచుకుని నేనూ సంభాషణలో పాలుపంచుకున్నాను.

అంతేనా ఏ మాస్టారు తగిలినా ఆ మాస్టారు మీద కవిత్వం రాసేవాళ్ళం. అయితే వీళ్ళిద్దరూ చదువులో ఫాస్ట్. నేనేమో లాస్ట్ నుంచి ఫస్ట్. అయినా మా మీద ఇప్పటి పిల్లల మాదిరిగా ఒత్తిళ్ళు, లక్ష్యాలు లేవు. హాయిగా తిరిగాం, తిరుగుతూ పెరిగాం. బాల్యాన్ని చక్కగా ఆస్వాదించాం” అనేది నా మాట.

మొత్తానికి ఇన్నాళ్ళ తరువాత కలుసుకోవడం ఉద్విగ్నంగానే కాదు ఎంతో ఎమోషనల్ గా అనిపిస్తోంది.  చదువు పూర్తయిన తరువాత హైదరాబాదులోనే ఉద్యోగం సంపాదించుకుని అక్కడే స్థిరపడాలనే కోరిక నాకుండేది. అయితే దురదృష్టవశాత్తు నాకిక్కడ ఉద్యోగంచేసే అవకాశం రాలేదు. కానీ ఇక్కడ స్థిరపడే అదృష్టం మాత్రం దక్కింది. అయితే ఇప్పటి హైదరాబాదు అప్పటిలా లేదు. చాలా మారింది. అప్పట్లో విజయవాడ నుంచి హైదరాబాదు రావాలంటే ఎంతో సంబరపడేవాళ్ళం. మళ్ళీ ఇక్కడనుంచి బెజవాడ వెళ్ళాలంటే ఏడుపొచ్చేది” అని భీమేశ్వరరావు చెబుతుంటే, “అవును! ఇప్పుడున్న రామోజీ సిటీ ప్రాంతంలో రోడ్డుకు రెండు వైపులా ద్రాక్షతోటలు ఉండేవి. ఆ పొలిమేరల్లోకి బస్సు రాగానే వాతావరణం పూర్తిగా మారిపోయేది. బస్సు కిటికీ ఇనుప రాడు చల్లగా ఐసు కడ్డీలా అయిపోయేది. అలా రాడ్లు చల్లబడ్డాయంటే హైదరాబాదు వచ్చినట్టు లెక్కన్న మాట. అసలా హైదరాబాదుకు ఇప్పటి హైదరాబాదుకు పోలికే లేదు”  నా అనుభవం నాది.

ఇవన్నీ ఎలా గుర్తున్నాయి అంటారా. కారణం సరస్వతి రమ అనే జర్నలిస్టు. మా ముగ్గురి కలయిక గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో ‘నలభయ్ ఏళ్ల తర్వాత కలిసిన ముగ్గురు మితృలు’ అంటూ సంగమం  అనే  శీర్షిక కింద ఒక వ్యాసం రాసారు. అదీ కధ.

నాకు మొదటినుంచి మాటకారి అనే పేరు వుండేది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాట పడి పోయింది, కానీ నేను నా జీవితాన్ని మాటలతోనే నెట్టుకు వచ్చాను. శ్రీనివాసరావు ఎక్కడ వుంటే అక్కడ సందడే సందడి అనేవాళ్ళు. వ్చ్! అంతా ఇప్పుడు అందమైన గతం. ఓ కల. ఇప్పుడు గంటకో మాట మాట్లాడితే గొప్ప.

 

మాటల్లో మరచిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను. ఏం చెబుతున్నాను? నాకు మాట్లాడం అంటే వ్యసనం అని. మాటలు అంటే పోచికోలు కబుర్లు చెప్పడం అన్నమాట. రైల్లో రిజర్వేషన్ లేకుండా ఎక్కినా, నా మాటల మత్తులో పడి ‘ఎంతసేపు అలా నిలుచుంటారు మాస్టారు,  ఇదిగో ఇలా వచ్చి ఇక్కడ కూచోండి, నేను పడుకుని చాలాసేపు అయింది, మీరు కాళ్ళు చాపి పడుకోండి, నేనెలాగో అలా  సర్దుకు కూచుంటాను’ అని రిజర్వేషన్ వున్నవాళ్ళు పక్కకు తప్పుకుని ఒదిగి కూచున్న ఘట్టాలు నా జీవితంలో చాలా వున్నాయి. ఇవన్నీ చూసి నేనో మాటల పోటుగాడిని అని భ్రమించి ఎస్సారార్ కాలేజీ వాళ్ళు జగ్గయ్యపేటలో జరిగే అంతర్ కళాశాలల వక్తృత్వ పోటీలకు పంపారు. అణు బాంబులు ప్రపంచానికి అవసరమా అనేది టాపిక్. నన్ను పిలిస్తే వెళ్లి ప్రసంగం మొదలు పెట్టాను. అణ్వస్త్రాలు కావాలా ? అన్నవస్త్రాలు కావాలా?  అంటూ ప్రారంభించాను. సభలో చప్పట్లు. ఆ చప్పట్లకు చిన్న మెదడులో చిన్న కుదుపు వచ్చి తరవాత ఏం మాట్లాడాలో మరచిపోయాను. రెండు మూడు నిమిషాలు మైకు బాగు చేసేవాడిలా ఏమీ మాట్లాడకుండా నిలబడి పోయేసరికి మళ్ళీ చప్పట్లు. అయితే ఈసారి దిగిపొమ్మని. నేనేమో మాటల మనిషిని. సభలో ప్రసంగించమంటే ఎలా! అది కుదరని పని. పైగా మతిమరపు ఒకటి.

నా మతిమరపు గురించి ఇలాంటి కధలు చాలా వున్నాయి. చాలావరకు మరచిపోయాను. భీమేశ్వరరావు, ప్రసాద్ గుర్తుచేస్తారేమో చూడాలి.

కింది ఫోటో:





2009 లో జర్నలిస్టు సరస్వతి రమ ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం క్లిప్పింగ్

(ఇంకా వుంది)

7, డిసెంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (30) - భండారు శ్రీనివాసరావు

 

ముందు మాటలో ముందే చెప్పాను, ఇది నా ఒక్కడి కధ కాదని. నా చుట్టూ అల్లుకున్న చారిత్రిక, సామాజిక రాజకీయ అంశాల సమాహారం అని. రాజకీయ అంశాల ప్రస్తావనకు ఇప్పటికి, అంటే ఈ వ్యాస పరంపరలో  నేనింకా చిన్నపిల్లవాడినే, జర్నలిజం వృత్తిలోకి  ప్రవేశించడానికి ఇంకా బోలెడు వ్యవధానం వుంది. సమయం వచ్చినప్పుడు ఆ చిట్టా విప్పుతాను.

కృష్ణ నీళ్ళ ప్రభావం ఏమో తెలియదు కానీ, బెజవాడ వాసులకు బెజవాడ అంటే ప్రాణం. ఈ సరికి మీకూ విషయం అర్ధం అయివుండాలి. నా చిన్నతనం గడిచిన ఊరు ప్రస్తావన వచ్చినప్పుడు బెజవాడ అంటున్నాను. పెరిగి పెద్దయిన తర్వాత విజయవాడ అని పేర్కొంటున్నాను. రెండూ వేరు కాదు కానీ, నా దృష్టిలో రెండూ వేరే. అప్పుడు నేనున్నది బెజవాడ. ఇప్పుడు అది విజయవాడ.    

ఒకానొక రోజుల్లో బెజవాడ అంటే రెండు రోడ్ల నడుమ వెలిసిన ఒక పెద్ద బస్తీ. ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు వీటి మధ్య అడ్డం నిలువులు గీతల మాదిరిగా చిన్న చిన్న వీధులు ఒకమోస్తరు అడ్డ రోడ్లు. ఎటు వెళ్ళినా నడిచి తిరగొచ్చు. కొంచెం దూరం అయితే రిక్షాలు. మరీ దూరం అయితే సిటీ బస్సులు. గొల్లపూడి – గుణదల, గొల్లపూడి – పోరంకి, గుణదల- రైల్వే స్టేషన్, పోరంకి రైల్వే స్టేషన్. ఇలా వెళ్ళ మీద లెక్కపెట్టే సిటీ బస్సులు, అవీ ప్రైవేటు బస్సులు రయ్యిరయ్యిమని తిరుగుతుండేవి. పొట్టు బస్తాలో పొట్టు కూరినట్టు ప్రయాణీకులని బస్సులో కుక్కి కానీ బస్సు బయలుదేరతీసే వాళ్ళు కాదు. అప్పటిదాకా ఉక్కబోతతో జనం అల్లాడి పోయేవారు. ప్రతి బస్సుకి ముగ్గురు సిబ్బంది. డ్రైవరు, కండక్టరు, క్లీనరు. బస్సు మెట్టు మీద నిలబడి, క్లీనర్ కుర్రాడు గట్టిగా బస్సు మీద చరుస్తూ  రైట్ రైట్ అంటే బస్సు కదిలేది. అలాగే హోల్డాన్ అంటే ఆగేది. ఇక కండక్టర్ ప్రయాణీకుల మధ్య నుంచి అభిమన్యుడిలా దూసుకుపోతూ టిక్కెట్ టిక్కెట్ అంటూ టిక్కెట్లు కొట్టేవాడు. రోడ్డు మీద రిక్షాలు, లారీల రద్దీ ఎంతవున్నా కూడా డ్రైవర్ మాత్రం బీడీ తాగుతూ వేగం తగ్గించకుండా, చేతిలో స్టీరింగ్ విరిగి ఊడివస్తుందేమో అన్నట్టుగా భయంకరంగా అటూ ఇటూ తిప్పుతూ నడిపేవాడు. ఈలోగా టిక్కెట్టు, అర టిక్కెట్టు విషయంలో పేచీలు. కండక్టర్ వెంటనే హోల్డాన్ అంటూ కేకపెట్టి బస్సు ఆపించేవాడు. ఆ లడాయి తెగేదాకా బస్సు రోడ్డు మీదనే నిలిచేపోయేది. మిగిలిన ప్రయాణీకులు తమ తొందరలో కండక్టర్ పక్షాన నిలబడి బస్సు కదలడానికి తమ వంతు నోటి సాయం చేసేవారు.  మా చిన్నతనంలో  బస్సులకు  మూతులు ఉండేవి. అంటే ఇంజిన్ ముందు వుండేది, తరువాత మూతి కనబడని బస్సులు వచ్చాయి. మా పెద్దల కాలంలో బొగ్గు ఇంజిన్ల బస్సులు వుండేవిట. నైజాం నుంచి బెజవాడ పని మీద వచ్చిన వాళ్ళు ఇదెక్కడి గోల అనుకునే వాళ్ళు. ఎందుకంటే తెలంగాణా ప్రాంతంలో బస్సులు నిజాం సర్కారు ఆధ్వర్యంలో చిరకాలంగా నడుస్తూ వచ్చాయి. నైజాం సర్కారుకు ప్రత్యేకంగా రైళ్లు కూడా వుండేవి.  నైజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయిన తర్వాత  ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ  ఆధ్వర్యంలో బస్సులు  నడిచేవి. వాటిని ఎర్ర బస్సులు అనేవారు.    

ఆంధ్ర ప్రాంతంలో ప్రైవేటు రంగంలో వున్న బస్సు రూట్లను జాతీయం చేయాలనే డిమాండ్ జనంలో బాగా పెరిగిపోవడానికి ఆ బస్సు రూట్ల యజమానులు  వాళ్ళు అనుసరించిన  అమిత లాభాపేక్ష విధానాలే కారణం.  బెజవాడ వంటి పట్టణంలో ఒక్కో రూటును గుత్తకు తీసుకున్నవాళ్లు  కోటీశ్వరులయ్యారు అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ప్రబలింది. ఒక్క రూటు మీదనే ఇంత ఆదాయం వున్నప్పుడు, మొత్తం రూట్ల మీద పెత్తనాన్ని ప్రభుత్వమే తీసుకుంటే ఖజానాకు లభించే లాభాలను గురించి ప్రజల్లో చర్చ మొదలయింది. ఈ అంశం తీవ్రంగా మారి ఏస్థాయికి చేరిందంటే,  ఆ నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాజీనామా చేయాల్సిన పరిణామానికి పరోక్షంగా దారి తీసింది. కర్నూలు జిల్లాలో బస్సు రూట్ల జాతీయకరణకు సంబంధించిన ఒక కేసులో ( వివరాలకు : శ్రీ గుళ్ళపల్లి నాగేశ్వర రావు వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, https://www.advocatekhoj.com/library/judgments/index.php?go=1959/august/5.php)  ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ విషయంలో సుప్రీం కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలకు స్పందిస్తూ, నైతిక బాధ్యతగా సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయాల్లో విలువల ప్రాధాన్యతను నిరూపించింది.

సరే! కొన్నేళ్ళ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కూడా బస్సు రూట్లను జాతీయం చేయడం, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అనే పేరుతొ ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు కలిపి ఒకే కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం జరిగాయి. ఆ విధంగా ఆర్టీసీ వారి ఎర్ర బస్సులు తమ ఊరికి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతం ప్రజలు పండగ చేసుకున్నారు.

అప్పటికి నేను విజయవాడ వదిలేశాను.






(ఇంకా వుంది)   

6, డిసెంబర్ 2024, శుక్రవారం

వైస్ చాన్సలర్ గా ఘంటా చక్రపాణి

 

చక్రపాణి గారితో పరిచయం తెలంగాణా ఉద్యమ కాలంలో. అదీ టీవీ చర్చల్లో. తెలంగాణా వాదాన్ని ఆయన ఘంటా పదంగా వినిపించేవారు. నాది  మధ్యేమార్గం. అది మా స్నేహానికి ఏనాడు అడ్డురాలేదు. ఆయన వాదమే నిలబడింది. నెగ్గింది.  ఉద్యమం విజయం సాధించి తెలంగాణా కల సాకారమైంది. తదనంతర కాలంలో ఆయన కృషికి గుర్తింపుగా కేసీఆర్ ప్రభుత్వం చక్రపాణి గారిని రాజ్యాంగబద్ధమైన పదవిలో, పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ గా నియమించింది. తనకు అప్పగించిన బాధ్యతలను ఆయన సక్రమంగా నిర్వర్తించారు.

మళ్ళీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రాన్ని  పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన సమర్థతను గుర్తించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘంటా చక్రపాణి గారిని బాబా సాహెబ్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గా నియమిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. రెండు విభిన్న పార్టీలకు చెందిన ప్రభుత్వాలు, చక్రపాణి గారి చిత్తశుద్ధిని గుర్తించి తగిన పదవులతో సత్కరించడం ఒక విశేషం అయితే, తాను పనిచేస్తున్న విశ్వ విద్యాలయానికే అధిపతి కావడం మరో విశేషం.

ఘంటా చక్రపాణి గారికి అభినందనలు.

కింది ఫోటో:



ఎడమనుంచి కుడికి: నేను, ఘంటా చక్రపాణి, జ్వాలా నరసింహారావు, అల్లం నారాయణ 



 

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (29) - భండారు శ్రీనివాసరావు

 

ఇంటి నిండుగా పిల్లలు వుంటే సందడే సందడి. ఆటలే, ఆటలు. అదే ఆడపిల్లలు వుంటే ఆ తరహా వేరు. వారి ఆటలు వేరు. వారికోసం చేసే వేడుకలు వేరు. అయితే మగపిల్లలు వయసులో చిన్నవారయితే, అన్ని రకాల వేడుకల్లో కూడా వాళ్లకి ఎంట్రీ పాసు వుండేది. ఆ చేసే వేడుకలు ఎందుకు చేస్తున్నారో తెలియకపోయినా వాటిని చూసే అవకాశం మాకుండేది. మంచి నీళ్ళ పంపు దగ్గర పేచీలు పెట్టుకుని కీచులాడుకునే ఆవనంలోని ఆడవాళ్ళందరూ ఈ వేడుకల్లో మాత్రం పడుగూ పేకా మాదిరిగా కలిసిపోయేవారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా వుండేవాళ్ళు.

శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళ సంగతేమో కానీ పిల్లలకు ఆ నెల మొత్తం  పెద్ద పండగ. శ్రావణ గౌరీ పూజలు, పునస్కారాలు మా అక్కయ్య నిష్టగా చేసేది. శుక్రవారంనాడు మంగళగౌరీ వ్రతం కోసం తెల్లవారుఝామునే లేచి స్నానం చేసి, మడి బట్టలు కట్టుకుని,  ఒంటి చేత్తో నవకాయ పిండి వంటలు సిద్ధం చేసి పూజకు కూర్చునేది. పూజ చేసుకుని ఇంట్లో భోజనాలు పూర్తయ్యాయో లేదో, మళ్ళీ చీరె మార్చుకుని శుక్రవారం పేరంటాలకు సిద్ధం అయ్యేది. అలాగే తాను పిలిచిన ముత్తయిదువులు ఇంటికి వస్తే వాయనాలు ఇవ్వడానికి అన్నీ సిద్ధంగా పెట్టుకునేది. పేరంటాల విషయంలో ఆడవాళ్ళ టైం మేనేజిమెంట్ అపూర్వం, అనితరసాధ్యం.  

 

సందర్భాన్ని బట్టి, మా అక్కయ్య మంగళ హారతులతో పాటు వేరే వేరే పాటలు కూడా పాడుతుండేది.  అర్ధం కాకపోయినా వింటుండేవాళ్ళం.

మా అక్కయ్యకు బహుశా ఎనభై ఏళ్లప్పుడు కాబోలు వాళ్ళ అమ్మాయి దగ్గరికి హైదరాబాదు వచ్చింది. చుట్టూ చేరిన నలుగురు  బలవంత పెడితే ఒక పాట పాడింది. ఆడపిల్లలు పెద్దమనుషులు అయినప్పుడు పాడే సవర్త పాట. అమ్మాయిలు  ఉన్న ప్రతి ఇంట్లో ఎప్పుడో ఒకసారి పాడుకోవాల్సిన పాట. అంత పెద్ద వయస్సులో గుర్తుపెట్టుకుని ఆమె పాడిన ఈ పాటలో ఏదయినా పొరబాట్లు కనిపిస్తే/వినిపిస్తే, దాని వింటూ తిరిగిరాసుకోవడంలో జరిగిన  ఆ తప్పు అక్షరాలా నాదే కాని ఆమెది కాదు, నేను ఏకసంత (గంట) గ్రాహిని. విన్నది ఓ గంట లోపల కాగితం మీద పెట్టక పొతే, విన్నది మొత్తం బల్క్ ఎరేజ్ అయిపోతుంది.       

ఆరోజు సరసక్కయ్య పాడిన సవర్త పాట :

సువ్వియనుచు పాడరమ్మా

సుందరాంగిని చూడరమ్మా

నవ్వే మాట కాదె కొమ్మా

నాతి సవర్తలాడెనమ్మా

బువ్వదినుట నేరదమ్మా

పూబోణి ఎరుగదమ్మా

తల్లి చూచి చెప్పగానే

తలనువంచి నవ్వేనమ్మా

 విప్రవరుల పిలవరమ్మా

విప్పి పంచాంగం చూడగానే

యుక్తమైన నక్షత్రమమ్మా

సువ్వియనుచు పాడరమ్మా

సుందరాంగిని చూడరమ్మా

 

2013 లో  కొద్ది రోజుల తేడాతో  ఇద్దరు అక్కయ్యలు కన్ను మూయడం మొత్తం మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాదులో ఆరో అక్కయ్య ప్రేమక్కయ్య (74)  చనిపోయిన  వార్త తెలియగానే  మా మూడో అక్కయ్య సరస్వతి హుటాహుటిన కారులో తన వయస్సును కూడా (84) లెక్కపెట్టకుండా  ఆమెను చూడడానికి బెజవాడ నుంచి హైదరాబాదు వచ్చింది.  తన కళ్ళముందే చిన్నవాళ్ళు దాటిపోతున్నారని గొల్లుమంది.
 ఏమయిందో యేమో మూడో  రోజున ఆయాసంగా వుందంటే ఆస్పత్రిలో చేర్పించారు. అటునుంచి అటే ఐ.సీ.యూ, తరువాత వెంటిలేటర్. మర్నాడు ఉదయం కల్లా అంతా అయిపోయింది. ప్రేమక్కయ్య పన్నెండో రోజుకు వచ్చిన బంధుగణం అంతా సరసక్కయ్య అంతిమ ఘడియలను చూడాల్సివచ్చింది. ఎవరితో చేయించుకోకుండా పెద్ద ప్రాణం దాటిపోయింది. పెనిమిటి తుర్లపాటి హనుమంతరావు గారు చనిపోయిన నాటి నుంచి  రెండేళ్లుగా ఆమె ప్రాణం ఆయన కోసమే కొట్టుకుంది. ఆ రెండేళ్లు  ఆయన మాట తప్పిస్తే, ఆయన జ్ఞాపకాలు తప్పిస్తే  మరో ముచ్చట ఆమె నోటినుంచి వినలేదు.  దాదాపు డెబ్బయ్  ఏళ్ళ  దాంపత్య అనుబంధం. అందుకే ఆయనలేని లోకంలో ఎక్కువ కాలం మనలేకపోయింది. రోగం రొష్టు అంటూ పిల్లల్ని బాద పెట్టకుండా, తాను బాధ పడకుండా మా బావగారిని వెతుక్కుంటూ పైలోకాలకు వెళ్ళి పోయింది. ధన్యజీవి.

 

కింది ఫోటో:

మా మూడో అక్కయ్య తుర్లపాటి సరస్వతి




 

(ఇంకావుంది)

5, డిసెంబర్ 2024, గురువారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (28) - భండారు శ్రీనివాసరావు

 

వెనిస్ నగరం లాంటిది బెజవాడ. ఊరు మధ్యగా మూడు కాలువలు ప్రవహిస్తూ వుంటాయి. బందరు కాలువ, రైస్ కాలువ, ఏలూరు కాలువ. ఈ మూడు కాలువలకు ఆది పురుషుడు సర్ ఆర్థర్ కాటన్. కృష్ణా బరాజ్ కు ముందు వందేళ్ళ చరిత్ర కలిగిన ఆనకట్టను నిర్మించింది ఈయనే. ఆ కాలంలో భయంకరమైన కరవు కాటకాలతో కృష్ణా ప్రాంతం కకావికలమైంది. ఆకలితో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితులను గమనించిన కాటన్ దొర కృష్ణా ఆనకట్టకు రూపకల్పన చేశారు.  వందేళ్ళకు పైగా పంట పొలాలకు నీరందించని ఆ ఆనకట్టకు ఆకస్మికంగా వచ్చిన  పెను వరద కారణంగా గండి పడింది. తాత్కాలికంగా గండి పూడ్చినప్పటికీ తదనంతరం ఆనకట్ట స్థానంలో కృష్ణా బరాజ్ ను నిర్మించారు. ఈ బరాజ్ నుంచే ఈ మూడు కాలువలకు నీరు వదులుతారు.  

మరో అతి పెద్ద కాలువ బకింగ్ హాం కాలువ. ఇది బెజవాడ నుంచి మద్రాసు వరకు వుండేదని చెప్పేవారు. ఆ కాలువలో పడవల మీద ప్రయాణాలు చేసేవారు. సరకుల రవాణా  జరిగేది. ప్రస్తుతం అది చాలా చోట్ల పూడికలతో పనికి రాకుండా వుందని వింటున్నాము. ఇది కాక మరో మూడు కాలువలు కృష్ణా బ్యారేజ్ నుంచి సేద్యపు నీటిని కృష్ణా జిల్లాతో పాటు, పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లోని అనేక పంట పొలాలకు అందిస్తున్నాయి. గోదావరి డెల్టా పాడి పంటలతో తులతూగడానికి కాటన్ దొరవారి అమృత హస్తం వుందని ఆ ప్రాంతం వారు ఇప్పటికీ ఆయన్ని దేవుడిలా కొలుస్తుంటారు. మరి కృష్ణా జిల్లా వాసులు ఆయన్ని స్మరిస్తున్నట్టు కనబడదు.

వాడుకలో రైస్ కాలువ అని పిలుస్తారు, కానీ అసలు పేరు రైవిస్ కాలువ.  బ్రిటిష్ వారి హయాములో సర్ ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో నిర్మించిన కృష్ణా ఆనకట్ట నిర్మాణ సమయంలో పనిచేసిన బ్రిటిష్ ఇంజినీర్ కెప్టెన్ జోసెఫ్ గోరె రైవిస్ (Captain Joseph Gore Ryves) పేరు ఈ కాలువకు పెట్టారు. నగరం మధ్యనుండి పోయే ఈ కాలువపై అనేక చోట్ల వంతెనలు నిర్మించారు. గవర్నర్ పేటను గాంధీనగర్ ను విడదీసే రైవిస్ కాలువపై ఒక వంతెన వుంది. దానిపై  నుంచి చూస్తే, కృష్ణనీరు, వేగంగా సుళ్ళు తిరుగుతూ కళ్ళు తిరిగేలా జలజలా ప్రవహిస్తూ వుంటుంది. మా ఈడుకంటే చిన్న పిల్లలు కొందరు అమాంతం ఆ వంతెన మీద నుంచి కిందికి  దూకి,  మళ్ళీ ఈదుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ కాలువలోకి దూకుతూ ఈతలు కొడుతూ వుండేవారు.  ఈ దృశ్యాలు మాకు భయంగాను, వింతగాను అనిపించేవి. కానీ వాళ్లకు అదో ఆట. బ్రిటిష్ వారి హయాములో నిర్మించిన ఈ కాలువలు కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురై దుర్గంధ కాసారాలుగా తయారయ్యాయి. మా చిన్నతనంలోనే ఈ కాలువ వడ్లను బహిరంగ బహిర్భూములుగా ఉపయోగించేవారు. ఆ వంతెనల మీదుగా నడిచి వెళ్ళే వాళ్ళు, ముక్కులు, కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది. అప్పటికి ఇళ్ళల్లో మరుగు దొడ్ల సంస్కృతి అలవడలేదు.  కొందరి ఇళ్ళల్లో వున్నా కూడా వాటిని మనుషులే శుభ్రం చేయాల్సిన దుస్థితి. బతుకు బండి లాగడం కోసం కొందరు అలాంటి పనులు చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి. వరాహాలు విచ్చలవిడిగా వీధుల్లో సంచరించేవి. బెజవాడ పందులకు ప్రసిద్ధి అని చెప్పుకునే వాళ్ళు.       

రైస్ కాలవ వంతెనకు దగ్గరలో అన్నదాన సమాజం అనే ఒక స్వచ్ఛంద  సంస్థ వుండేది. ఈ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు కొందరు, రోజూ  భుజాన ఒక జోలిలాంటిది తగిలించుకుని ఇంటింటికీ తిరిగేవారు. అప్పుడు చిన్నపిల్లలుగా వున్న మేము, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. రాగానే మా చిన్ని చిన్ని గుప్పిళ్ళతో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళ జోలెలో వేసేవాళ్ళం. 'గుప్పెడు బియ్యం వెయ్యండి. ఆకలితో వున్నవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టండి' అనేది అన్నదాన సమాజం వారి నినాదం. అలా సేకరించిన బియ్యంతో అనాధ పిల్లలకు, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు అన్నం వొండిపెట్టేవారు. ఆ అన్నం తిన్న వాళ్ళు తప్ప, అన్నదాన సమాజం వారిని తలచుకునే ఇతరులు ఉంటారంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే చేసే పని మంచిదన్న ఒక్క ధ్యాస తప్ప,, చేసే పనికి ప్రచారం చేసుకోవాలన్న యావ లేనివాళ్ళు కదా ఆ సమాజం వాళ్ళు.

ఇప్పుడది లేదని చెప్పడానికి అక్కడికి వెళ్లి చూడనక్కరలేదు. ప్రభుత్వాల దయాధర్మం వల్ల ఎదిగే సంస్థలు అయితే నాలుగు కాలాలు వర్దిల్లేవి,  , ఏ మంచి పనీ చేయకుండా, ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ.
కానీ అన్నదాన సమాజం ఆ బాపతు కాదు కదా!

ఆ స్పూర్తితోనే మేము చాలా చిన్నతనంలోనే బాపు బాల సమాజం నడిపాం. ఆ పేరు మా పెద్దన్నయ్య పెట్టాడు. బెజవాడలో చెప్పుకోదగ్గ పనులేవీ చేయలేదు. నిజానికి ఆ వయసులో ఏం చెయ్యాలో కూడా తెలియదు. ఒకసారి ఒక చిన్న పిచ్చుక ఎగరలేక ఇంటి వరండాలో పడి వుండడం చూసి, జాలిపడి దాన్ని తీసుకుని వచ్చి మా బావగారి ప్లీడరు పుస్తకాల మధ్యలో ఉంచాము, అక్కడైతే భద్రంగా ఉంటుందని. అది తినడం కోసం కొన్ని బియ్యపు గింజలు దాని ముందు ఉంచాము. మరునాడు చూస్తే బియ్యపు గింజలు అలాగే వున్నాయి. పిచ్చుకపై చీమలు పాకుతున్నాయి. గుమస్తా శ్రీరాములు గారు చెప్పేవరకు అది చనిపోయిందని తెలియదు.  అసలు చావంటే ఏమిటో తెలియని  మాకు, ఆయన గారు విడమరచి చెప్పిన దాకా మాకూ విషయం అర్ధం కాలేదు. అయ్యో దాన్ని అనవసరంగా ఇంట్లోకి తెచ్చి దాని ప్రాణాలు తీశామే అని చాలా రోజులు బాధ పడ్డాము.

బావగారి ఇంటికి దగ్గరలో దివ్యజ్ఞాన సమాజం వుండేది. బాపూ బాల సమాజ్ లాగా అదో సమాజం అనుకున్నాము. కానీ ఒకసారి   సమాజానికి గవర్నర్ శ్రీ నగేష్ వచ్చారు. ఒక అంబాసిడర్ కారు, వెంట ఇద్దరు పోలీసులు. అంతే! పరివారం. కాకపొతే దివ్యజ్ఞాన సమాజం వారు,  స్థానిక  పెద్దలు ఆయన పట్ల ప్రదర్శించిన గౌరవ మర్యాదలు చూసి గవర్నర్ అంటే చాలా పెద్ద అధికారి  అయివుండాలని అనిపించింది. అప్పటివరకు మా స్కూలు హెడ్ మాస్టారుగారే మా దృష్టిలో పెద్దఅధికారి. ఆయన వస్తే క్లాసు క్లాసంతా లేచి నిలుచుండేది.

కింది ఫోటో: (గూగుల్ సౌజన్యం)

దుర్గంధ కాసారం రైస్ కాలువ, దానిపై వంతెన. 








(ఇంకా వుంది)

    

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (27) - భండారు శ్రీనివాసరావు

 

 

విజయవాడలో నా జీవితం మూడు రకాలుగా సాగింది. మరీ చిన్నతనంలో కొన్నేళ్ళు, ఒక వయసు వచ్చాక కొన్నాళ్ళు, ఉద్యోగపర్వంలో మరి కొన్నేళ్ళు ఇలా అన్నమాట. మధ్యలో కొంత విరామాలు. నాకెందుకో చిన్నతనం నాటి బెజవాడ మీదనే మక్కువ ఎక్కువ. అంతకు ముందు నేను చూడని, చూస్తాను అని అనుకోని బస్తీ జీవితాన్ని అది ప్రసాదించింది. రెండో దశలో అదో పట్టణం. అంతే! మూడో దశనాటికి పూర్తిగా మారిపోలేదు కానీ, ఊరు చాలా మారిపోయింది. ఇక ఇప్పుడా, నేను చూసిన, తచ్చాడిన, తిరిగిన, పెరిగిన ప్రదేశాలను నేనే గుర్తుపట్టలేను. ఒక నగరం రూపు సంతరించుకుంది.  నాటి కళాకాంతిలో కాంతి మిగిలింది. కళ కనుమరుగు అయింది.

బెజవాడలో రాజగోపాలచారి వీధిలో, మరీ  బావగారి ఇంటి ఎదురుగా కాదు కానీ ఐ మూలగా రోడ్డు (అప్పటికి రోడ్డు లేదు, అంచేత వీధి అందాము) దాని అవతల కామేశ్వర్ అండ్ కో అని స్టేషనరీ షాపు వుండేది. కిందా మీదా వారిదే కాని, మొదటి అంతస్తులో దుకాణం. అదొక దుకాణంలా వుండేది కాదు, బ్యాంకు కౌంటర్ మాదిరిగా వుండేది. ఆ కౌంటర్ కు రెండు వైపులా రెండు సింహపు బొమ్మలు.  పలకా బలపం పెన్సిల్, రబ్బర్, నోట్ బుక్ ఏది కావాలన్నా మెట్లెక్కి అక్కడికే పోయేవాళ్ళం. యజమాని కామేశ్వర శాస్త్రి గారి కొడుకు శివ (చిన్నా) మాకు స్నేహితుడు. పెద్దవాళ్లకు తెలియకుండా వెళ్లి సెకండ్ షో సినిమాలు చూసేంతగా వుండేది మా స్నేహం. వాళ్ళ మేడకు పక్కన మిత్రా ఏజెన్సీ షో రూమ్, దానికి పక్కనే లాయర్ చక్రవర్తి గారి కారు షెడ్డు, దానికి ఆనుకునే చక్రవర్తి గారి నివాసం వైట్ హౌస్, ఆ పక్కన చమ్రియా ఫిలిం డిస్త్రిబ్యూటర్స్ ఆఫీసు ఇలా వరుసగా ఉండేవి. వీటన్నిటిలోనే కాదు, బెజవాడ మొత్తంలో అందమైన మేడ చక్రవర్తి గారిది. నిజంగా శ్వేత సౌధం.  దానికి ఎదురు వీధిలో పదడుగులు వేస్తె, ఎడమపక్కన ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ (లక్ష్మి విలాస్ బ్యాంక్ అనుకుంటా) మరో నాలుగడుగులు వేస్తె, బీసెంట్ రోడ్డు. ఒక మూలలో దుర్గా కేప్ (ఇక్కడ ఇడ్లీలు , కొబ్బరి చట్నీ ఫేమస్, ఆ మాటకు వస్తే విజయవాడలో ప్రతి హోటల్లో టిఫిన్ బాగుండేది.  బీసెంటు రోడ్డులో నాడార్స్ కాఫీ పౌడర్ దుకాణం. చుట్టూ పచారీ సామాన్లు వున్న పెద్దపెద్ద స్టీలు డబ్బాల మధ్య ఒక లావు పాటి మనిషి కూర్చుని, కస్టమర్లు అడిగిన సరుకులు  కాటాలో తూకం వేసి పాత పేపర్లలో చుట్టి ఇస్తుండే వాడు. మరో లావు పాటి మనిషి వెనుక గల్లాపెట్టె ముందు చిన్న స్టూలు మీద కూర్చుని డబ్బులు తీసుకుంటూవుండేవాడు. ఇద్దరూ షాపు యజమానులే. లావుపాటి శరీరాలు, వొంటి ఛాయను బట్టి చూస్తే అన్నదమ్ములు అనిపిస్తుంది.   మరో పక్క పెద్ద పెద్ద గాజు సీసాల్లో రకరకాల న్యూట్రిన్ కంపెనీ  చాకొలెట్లు, తగరం రేపర్ చుట్టిన కొబ్బరి లౌజు వంటి చాకొలెట్లు వుండేవి. ఇక నాడార్స్ కాఫీ పౌడర్ ఘుమఘుమలు బయటకే ముక్కుపుటాలను తాకేవి. ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి. కాఫీ పొడుం, పంచదార పౌన్ల లెక్కన అమ్మేవాళ్లు. అప్పటికి కిలోల లెక్క రాలేదు. బెల్లం  వీసెల లెక్కన,, నూనెలు అవీ శేర్ల లెక్కన కొలిచేవాళ్ళు.

అదే రోడ్డులో ఒక పక్క మోడరన్ కేప్ వుండేది. అందులో బల్లలు, కుర్చీలు మరెక్కడా కనపడేవి కావు. అంత నాజూకుగా అదో రకం కలపతో  చేసిన కుర్చీలు. బహుశా మద్రాసో, బెంగుళూరో ప్రభావం అనుకుంటా. శుచీశుభ్రత గురించి చెప్పాలి అంటే  ఆ హోటల్ తర్వాతే. సర్వర్లు కూడా చెమటలు కక్కకుండా మంచి యూనిఫారాలతో వుండేవాళ్ళు. సాంబారు బక్కెట్లతో తెచ్చి సర్వ్ చేసేవాళ్ళు, అదీ విసుక్కోకుండా. భోజనాలకు నెలసరి టిక్కెట్లు అమ్మేవాళ్లు. రెండు పూటలకు కలిపి ముప్పయి రూపాయలు. మా బావగారు కొన్ని టిక్కెట్ల పుస్తకాలు కొని, బీద విద్యార్ద్జులకు ఇచ్చేవాళ్ళు. ఇది కాక  మరికొందరికి ఇంట్లోనే వారాలు. వారంలో ప్రతిరోజూ ఒక్కరికి ఒక  వారం. అంటే ఆ రోజు  భోజనం చేస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత అదే రోజున  భోజనానికి వచ్చేవాళ్ళు. మిగిలిన రోజులు మరికొందరు వదాన్యుల సాయంతో వారాలు చేసుకుంటూ చదువుకునేవారు. వీళ్ళని వారాలబ్బాయి అనేవాళ్ళు. ఈ పేరుతొ ఒక సినిమా కూడా వచ్చింది. హైదరాబాదులో నా ఉద్యోగ విరమణ తర్వాత నేనూ వారాలు చేసుకునే వాడిని.  ప్రతిరోజూ ఒక టీవీ చర్చకు వెళ్ళేవాడిని. సోమవారం ఒక టీవీకి వెడితే, మళ్ళీ సోమవారమే అక్కడికి వెళ్ళేది. వాళ్లకు కూడా ఇది నచ్చినట్టు వుంది. ప్రతిరోజూ ఈరోజు వస్తారా, వీలవుతుందా   అని అడిగే పని లేకుండా, నెల మొత్తం నా షెడ్యూలు ముందే ఖరారు చేసుకునే వెసులుబాటు లభించింది. నా తరహా గమనించిన ఒక టీవీ అమ్మడు నాకు వారాలబ్బాయి అని పేరు పెట్టింది కూడా.

ఇలా ఏ టు జెడ్ టీవీల్లో వారాలు చేసుకుంటున్న బంగారు కాలంలో, స్వర్ణయుగం అని ఎందుకు అంటున్నానంటే, ఆ రోజుల్లో టీవీ చర్చలు, వాటిల్లో  పాల్గొనే విశ్లేషకులకు సంబంధించి ఆహ్లాదకరంగా జరిగేవి. రాజకీయ పార్టీల ప్రతినిధులు పొట్టు పొట్టయినా మా జోలికి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి కాలం మళ్ళీ వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే విశ్లేషకుల రూపంలో కొందరు, ఆయా పార్టీల అధికార ప్రతినిధులను మించి మాట్లాడుతున్నారు. నేను సరైన సమయంలోనే కాడి కింద పారేశాను అనుకుంటున్నాను. సరే అలాంటి కాలంలో, ఒక టీవీ చర్చల విరామ సమయంలో టీడీపీ ప్రతినిధి (ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి, ఏపీ లో ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్) లంక దినకర్ గారు మోడరన్ కేప్ గురించిన ఓ ముచ్చట చెప్పారు.

మోడరన్ కేఫ్ కంటే ముందు అక్కడ నేతాజీ హోటల్ ఉండేదని, దాన్ని తమ తాతగారు లంక వెంకటేశ్వర రావు స్థాపించారని చెప్పారు. దినకర్ తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వరరావు గారు వీరవల్లి గ్రామంలో బడి పంతులుగా పనిచేసారు. తర్వాత బెజవాడ వచ్చి నేతాజీ హోటల్ పెట్టారు. బెజవాడలో అప్పటివరకు ట్యూబ్ లైట్లు లేవు. మొదటి ట్యూబు లైట్ ఆ హోటల్లోనే వెలిగిందని, అలాగే హోటల్లో రేడియో సెట్టు పెట్టి కార్యక్రమాలు వినిపించడం కూడా నేతాజీ హోటల్ తోనే మొదలయిందట. నేతాజీ హోటల్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవని భావించిన వెంకటేశ్వరరావు గారు, చౌక ధరలకు కాఫీ టిఫిన్లు అందించే ఉద్దేశ్యంతో ఏలూరు రోడ్డులో జనతా హోటల్ పేరుతొ మరో హోటల్ కూడా నడిపారట. నిజంగా ఇవి నాకు తెలియని విషయాలే.  

మోడరన్ కేప్ హోటల్లోనే ఒక ఏసీ రూమ్. దాని తలుపు ఎంత మందంగా వుండేది అంటే ఒక పట్టాన తెరుచుకునేది కాదు. లోపలకు వెళ్ళగానే చక్కటి సువాసనతో కూడిన చల్లటి  గాలి ఒంటిని చుట్టుముట్టేది. ఒక్క క్షణం స్వర్గంలో వున్నట్టు అనిపించేది. ఒక్క క్షణమే. మా వాళ్ళు ఎవరో అక్కడ వున్నట్టు వెళ్లి, మళ్ళీ  మరుక్షణం బయటకు వచ్చేవాళ్ళం. ఎందుకంటే అక్కడ పదార్ధాలు ఖరీదు. ఆ రోజుల్లో బెజవాడ మొత్తంలో  ఏసీ రూమ్ వున్న హోటళ్ళు రెండే. మరోటి గాంధీ నగర్లో వెల్కం హోటల్ కు అనుబంధంగా ఉన్న ఎస్కిమో. తరువాత ఎప్పుడో, మమతా, మనోరమా,   నటరాజ్ హోటళ్ళు వచ్చాయి.  

ఇక లాయర్ చక్రవర్తి గారి నివాసం వైట్ హౌస్ విషయానికి వస్తే, అదొక అద్భుతమైన కట్టడం. దసరా రోజుల్లో చక్రవర్తి గారి భార్య, ఇంట్లో  బొమ్మల కొలువు పెట్టి పేరంటానికి మా అక్కయ్యను పిలిచేవారు. పిల్లల కోడిలా మిమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళేది. ఆ విధంగా ఆ ఇంటి వైభోగం కళ్ళారా చూసే అవకాశం మాకు దొరికేది.   ఇంటి ముందు లాన్. రెండు తెల్లటి పప్పీలు (కుక్క పిల్లలు, అచ్చం బొమ్మల్లాగే వుండేవి. కుక్కల్లో అలాంటివి వుంటాయని, అంత అందమైన కుక్కలు ఉంటాయని  పల్లెటూరు నుంచి వచ్చిన నాకు మొదటిసారి తెలిసింది) పెద్ద మేడ. కిందా పైనా అనేక గదులు. ఒక పెద్ద హాలు. గోడలు, ఇంటి పైకప్పు తెల్లటి తెలుపు.

హాలు మధ్యలో సోఫాల నడుమ  మధ్యలో బొమ్మల కొలువు. సినిమా సెట్టింగులా వుండేది. దేవుళ్ల బొమ్మలు సరే. ఇవికాక కృష్ణా బ్యారేజి, కిందికి నీళ్ళు పారే ఏర్పాటు. అన్నన్ని బొమ్మలు మిగిలిన రోజుల్లో ఏమి చేసుకుంటారో. తలా ఒకటి ఇస్తే పోలా అనిపించేది.

ఇప్పుడా అందమైన భవంతి వున్నట్టు లేదు రాజగోపాలాచారి వీధిలో ఒకప్పుడు మొత్తం పట్టణానికి తలమానికంగా వున్న చక్రవర్తి గారి వైట్ హౌస్ స్థానంలో ఇప్పుడు ఏదో మాల్ వచ్చిందని వింటున్నాను.

జంధ్యాల శంకర్ గారు విజయవాడ మేయర్ గా వున్నప్పుడు ఒక ఆలోచన చేశారు. బెజవాడ అంటే ఇదీ అని, భావి తరాలకు గుర్తు చేసే కట్టడాలు, భవనాలు, నిర్మాణాల ఫోటోలు తీసి భద్రపరచాలని. ఆ దిశగా ఆయన కృషి చేశారు కూడా. అవి కంప్యూటర్ రోజులు కావు కదా శాశ్వతంగా పదిలపరచడానికి. ఆ ఫోటోల పరిస్థితి ఏమిటన్నది  ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు.    

కింది ఫోటోలు:


బీసెంటు రోడ్డులో మోడరన్ కేప్


నాడార్స్ కాఫీ అండ్ జనరల్ స్టోర్స్
 (గూగుల్ సౌజన్యం)






(ఇంకా వుంది)