17, మే 2024, శుక్రవారం
గతం గుర్తులు
16, మే 2024, గురువారం
ఏకాక్షర పద్యం
విలేకరిగా జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు
13, మే 2024, సోమవారం
నిమేషకాలంలో పూర్తయిన పౌరధర్మం పాటింపు - భండారు శ్రీనివాసరావు
ఈరోజు ఉదయం పోలింగు ప్రక్రియ ప్రారంభం అయినప్పటి
నుంచి టీవీలు ఓటర్ల ఉత్సాహం గురించి కధనాలు ప్రారంభించాయి. పోలింగు కేంద్రాల
ముందు బారులు తీరిన ఓటర్లు,
కిలోమీటర్ల మేర క్యూలు అంటూ బుల్లి తెరలపై
స్క్రోలింగులు బారులు తీరడం మొదలెట్టాయి. తయారై వెళ్ళబోయేవాడిని కాస్తా వాటిని
చూసి ఆగిపోయాను. మధ్యాన్నం వరకు సేం టు
సేం స్క్రోలింగులు. మార్పు లేకుండా, అక్షరం పొల్లుపోకుండా. బయలుదేరడం, మళ్ళీ
ఆగిపోవడం. ఇలా చాలా సార్లు జరిగిన తర్వాత, ఓ వాటర్ బాటిల్ చేత పట్టుకుని నడకకు ఎక్కువా, ఆటోకి
తక్కువా అయిన పోలింగు కేంద్రానికి మధ్యాన్నం మూడు గంటలకి మా కోడలు, నేనూ వెళ్ళాము. దారిలో ఇరుపక్కల దుకాణాలు అన్నీ మూసి వున్నాయి. పెద్ద క్యూలు ఉంటాయని అనుకుని పొతే, పోలింగు
కేంద్రం ఉన్న ప్రాంతం అంతా నిర్మానుష్యంగా వుంది. ఒక పోలీసు,
ఇద్దరు మహిళా సిబ్బంది కనబడ్డారు. మొబైల్ ఉందా అని అడిగి నా జవాబు కోసం ఎదురు చూడకుండా
ఆ బాటిల్ అక్కడ పెట్టి అల్లా వెళ్ళండి, అన్నారు. నన్ను చూసిన పోలింగు సిబ్బంది అమ్మయ్య ఎట్టకేలకు
ఒకడు వచ్చాడు అని గుసగుసలాడుకున్నట్టు అనిపించింది. తలకిందుల సంతకం ఒకటి
చేయించుకుని, ఎడమ చేతి చూపుడు వేలు మీద సిరా మరక అంటించి, పోయి ఓటు వేయండి
అన్నారు. పోలింగు ఛాంబరులో పొడవాటి ఈవీఎం లు రెండు కనిపించాయి. ఇంతమంది పోటీలో
వుంటే, ఇదేమిటి ఇక్కడ పరిస్థితి ఇలా వుంది అనుకున్నా. భారత పౌరుడిగా
నా ప్రధమ కర్తవ్యాన్ని పూర్తిచేసుకుని బయట పడ్డాను. మొత్తం ప్రక్రియ అంతా నిమిషం
కంటే తక్కువ వ్యవధిలో పూర్తయింది. ప్రత్యేక విమానంలో ప్రయాణించినట్టు, నా ఒక్కడి కోసమే ఈ కేంద్రం ఏర్పాటు చేశారేమో అనే
భావన కలిగింది. పక్కనే కొంచెం దూరంలో ఉన్న మరో కేంద్రంలో ఓటువేసి వచ్చిన మా కోడలు
అప్పటికే కారు దగ్గర నాకోసం ఎదురు
చూస్తోంది. అంటే అక్కడ పరిస్థితి కూడా డిటో అన్నమాట. ఇంటికి
వచ్చి టీవీ పెడితే మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల సమయంలో వేసిన అవే స్క్రోలింగులు, అక్షరం పొల్లుపోకుండా, బారులు తీరిన ఓటర్లు. మండుటెండను కూడా
లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తాపత్రయపడుతున్న ఓటర్లు అంటూ టీవీలు
ఊదరకొడుతున్నాయి. ఎందుకిలా ఓటర్లని నిరుత్సాహపరుస్తున్నారో తెలియదు.
తర్వాత గుర్తుకు వచ్చిన విషయం ఏమిటంటే, మన ఓటువున్నది
సికిందరాబాదు. హైదరాబాదు నగరంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ. ఓటు హక్కు గురించి
ఇతరులకి చెప్పేవాళ్ళ శాతం మరీ ఎక్కువ. కానీ, ఓటు వేసే వాళ్ళ శాతం మాత్రం అతి తక్కువ. ఇంకా నయం. ఈరోజు పగటిపూట ఐ పి ఎల్ మ్యాచ్ లేదు.
అందుకే ఈ మాత్రం అయినా.
ఇంకో విషయం ఏమిటంటే హైదరాబాదులో ప్రధాన కార్యాలయాలు వుండే ప్రధాన టీవీ చానళ్ళ
లోనే ఈ హడావిడి అంతా. ఇదంతా ఏపీ ఎన్నికలు గురించి అనుకోవాలేమో!
ఇతి వార్తాః !
(13-05-2024)
11, మే 2024, శనివారం
విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి
8, మే 2024, బుధవారం
అర్ధరాత్రి జ్ఞానోదయం - భండారు శ్రీనివాసరావు
ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!
1971 ఇండో
పాక్ యుద్ధ సమయంలో బ్లాకౌట్ అనే మాట వినపడేది. శత్రుదేశపు యుద్ధవిమానాలు ఆకాశవీధి
నుంచి, కింద భూతలంపై తమ లక్ష్యాలను
గుర్తించకుండా ఆ రోజుల్లో అధికారులు, రాత్రివేళల్లో అనేక నగరాల్లో బ్లాకౌట్ ప్రకటించి ప్రజలచేత స్వచ్చందంగా కరెంటు
దీపాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. వీధి దీపాలు వెలగకుండా చూసేవారు. ఆ యుద్ధసమయంలో
ప్రజలనుంచి కూడా స్వచ్చంద సహకారం లభించేది. అత్యవసరంగా దీపాలు వాడాల్సిన పరిస్థితి
వస్తే, ఆ
వెలుగు బయటకి ప్రసరించకుండా ఇంటి తలుపులు, కిటికీలు మూసివేసేవారు. అప్పుడు నేను
బెజవాడ ఆంధ్రజ్యోతిలో పని చేస్తుండేవాడిని. దేశం కోసం కాబట్టి ప్రజలు ఆ ఇబ్బందులని
కష్టంగా భావించేవారు. సర్దుకుపోయేవారు.
అందరికీ
సుపరిచితం అయిన దివి సీమ తుపానుకు ముందు, నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక తుపాను వచ్చింది. దానికి నేను ప్రత్యక్ష
సాక్షిని. ఆ తుపాను సృష్టించిన భీభత్సం కారణంగా వందలాది గ్రామాల్లో రోజుల తరబడి
కరెంటు సరఫరా నిలిచిపోయింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి ఇంతగా లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి చాలామందికి తెలియలేదు.
అప్పుడు
వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న
పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో
ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా
పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో హడావిడిగా వుంటే, వంటింట్లో మా అమ్మ కట్టెల
పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది.
ఒకరోజు
ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం
సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు.
మా అక్కయ్యలు ఇంట్లో ఓ మూలన పడేసిన
లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు
వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆ రాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు.
వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు.
సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు
గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి
వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! కొంత కిరసనాయిలు వాడి
పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో
కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు.
తుపాను
కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి.
పంచదార పరవాలేదు కానీ, కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు
మిగిలినవాళ్ళు, వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.
అలా
పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి
ఇచ్చింది.
వాన
వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన
వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి.
బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. అప్పటికి ఇప్పటిలా జంట
రైలు మార్గాలు లేవు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి.
రైలు ప్రయాణీకులకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు.
వాళ్ళంతా బిక్కచచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్టకాలంలో
వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన
తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.
మా
ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే
పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు.
తిట్టడానికి
గవర్నమెంటు ఒకటుందని అప్పుడు తెలవదు.
నిన్న
మళ్ళీ హైదరాబాదులో మేము ఉంటున్న ఎల్లారెడ్డిగూడా ప్రాంతంలో రాత్రి ఏడుగంటల సమయంలో
కరెంటు పోయింది,
భీకరంగా కురిసిన వర్షం కారణంగా. కరెంటు పోయినా ఊరు చల్లపడింది అదే పది వేలు
అనుకున్నాం. ఇంట్లో ఇన్వర్టర్ కారణంగా చాలాసేపటి వరకు కరెంటు లేదన్న సంగతి
తెలియలేదు. పుష్కర కాలంగా దాన్ని పట్టించుకోకుండా ఉన్నామన్న కసితో అది పగ
తీర్చుకుని ఉండేదే. ఎందుకో ఏమో తెలియదు, రెండు రోజుల కిందటే మా కోడలు నిషా,
ఎర్రటి ఎండలో బయట బాల్కనీలో వున్న ఇన్వర్టర్ లో
కొని తెచ్చిన డిస్టిల్ద్ వాటర్ నింపిన కారణంగా కలిగిన అల్ప సంతోషంతో అది
పనిచేసిన ఫలితంగా మేము కొన్ని గంటలు సుఖపడిన మాట వాస్తవం. ఈ లోపున తెలివి తెరిపిన
పడి, ఇన్వర్టర్ స్థాయి, స్థోమత గుర్తుకు వచ్చి, ఉన్న మూడు గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఆపేసి అందరం ముందు హాల్లో చేరి
ఒక లైటు, ఒక
ఫ్యానుతో కాలక్షేపం చేయడం మొదలు పెట్టాము. ముందు వాకిలి తెరిస్తే చల్లటి గాలి
వచ్చింది. దాంతో చంటి పిల్ల మా మనుమరాలు జీవిక భయపడకుండా లైటు ఒక్కటి వుంచి ఫ్యాను
ఆపేసాము. రైస్ కుక్కర్ కరెంటుది కావడంతో
అటక ఎక్కించిన ప్రేస్తీజ్ కుక్కరే దిక్కయింది. సరే ఏదో విధంగా భోజనాలు అయ్యాయి అనిపించాము.
రాత్రి పది గంటల ప్రాంతంలో ఒక్కసారి వరండాలో లైట్లు వెలిగి ఆరిపోయాయి. ఇలా జరిగితే
కరెంటు త్వరగా వస్తుందని సూతుడు శౌనకాది మునులతో చెప్పినట్టు చిన్నప్పుడు మా
వూళ్ళో కరెంటు డిపార్ట్ మెంట్ హెల్పర్ చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి, ఎవరి గదుల్లో
వాళ్ళం ఇన్వర్టర్ తో నడిచే ఫ్యాన్లు వేసుకుని ధీమాగా పడుకున్నాము. ఓ రెండు గంటలు
ఇన్వర్టర్ ముక్కుతూ మూలుగుతూ పనిచేసి సెలవు తీసుకుంది. అప్పటికి కరెంటు లేని
జీవితం కొంత అలవాటయి అలాగే పడుకున్నాము. తెల్లవారుఝామున మూడుగంటల సమయంలో హఠాత్తుగా
కరెంటోదయం అయింది. అదే సమయంలో జ్ఞానోదయం
కూడా అయింది.
ఇంట్లో
కరెంటు పోయినా మనం మన ఇంట్లోనే ఉన్నాము. కానీ ఆ కరెంటు వాళ్ళు ఇల్లు, సంసారాన్ని వదిలి, ఆ నిశీధిలో, వర్షంలో బద్దకించకుండా పనిచేయబట్టే
కదా మనకు మూడు గంటలకో , నాలుగు గంటలకో కరెంటు వచ్చింది. ఈ స్పృహ కలగగానే అంతవరకూ వాళ్ళమీద
పెంచుకున్న అసహనంతో పాటు, పడ్డ ఇబ్బందులు కూడా వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.
ముందే
చెప్పినట్టు సుఖదుఖాలు సాపేక్షాలు.
(08- 05-2024)
18, ఏప్రిల్ 2024, గురువారం
విన్ విజన్ – భండారు శ్రీనివాసరావు
“ ఆల్ ఓకే! ఇక రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూడండి” అంటున్నారు డాక్టర్ శ్రీ లక్ష్మి.
డాక్టర్ శ్రీ లక్ష్మి గారి ప్రత్యేకత ఏమిటంటే,
సర్జరీ చేస్తున్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు,
కబుర్లు చెబుతున్నారో సర్జరీ చేస్తున్నారో తెలవనంతగా. అంతమాటకారి.
అయిదేళ్ళ క్రితం ఒక కన్ను. ఇప్పుడు మళ్ళీ రెండో
కన్ను. నా రెండు కళ్ళకు కేటరాక్ట్ ఆపరేషన్
చేసింది ఆవిడే. మొదటిసారి చేసినప్పుడు అనుమానం వచ్చింది, అసలు
సర్జరీ చేసినట్టే లేదు. అదే అడిగాను. ఈసారి మరీ ముదరబెట్టుకుని వచ్చారు, అంచేత
అలా అనిపించివుంటుంది అన్నది డాక్టరు గారి జవాబు.
ఈ కేటరాక్ట్ ఆపరేషన్ తో ఉన్న సులువు ఏమిటంటే
పదిహేను, ఇరవై
నిమిషాల్లో పూర్ర్తవుతుంది. చేసిన చోట ఎలాంటి నొప్పి వుండదు, కంటి
వరకు ఎనస్తీషియా ఇస్తారు కాబట్టి. దాని ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఎలాంటి నొప్పి
అనిపించలేదు. అసలు చిక్కల్లా మూడు రకాల కంటి చుక్కల్ని రోజుకు ఆరుసార్లు,
నాలుగు సార్లు, మూడు
సార్లు చొప్పున నెల రోజులు టైం టేబుల్ ప్రకారం వేసుకోవాలి. ఇదొక చికాకైన,
తప్పనిసరి వ్యవహారం. ఈ ప్రక్రియ పూర్తి
అయిన తర్వాత మళ్ళీ పరీక్ష చేసి కంటి పవర్ కు తగిన కంటి అద్దాలను సిఫారసు చేస్తారు.
ఆ కళ్ళజోడు తగిలించుకుని డాక్టరుగారు చెప్పినట్టు రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూడాలి
అన్నమాట.
ఆసుపత్రిలోకి ప్రవేశించగానే నిలువెత్తు వినాయకుడి
విగ్రహం సాక్షాత్కరిస్తుంది. డాక్టర్ శ్రీలక్ష్మి కూడా లోనికి రాగానే ఆ
విఘ్ననాయకుడికి చేతులు జోడించి
నమస్కరించిన తర్వాతనే తన విధులు మొదలు
పెట్టడం గమనించాము. రిసెప్షన్ లో వున్న వ్యక్తికి మనం వచ్చిన పని లేదా అప్పాయింట్
మెంట్ గురించి చెప్పగానే ఒక సహాయకురాలు వచ్చి మనల్ని మొదటి అంతస్తుకి తీసుకువెళ్లి
అక్కడి రిసెప్షన్ హాలులో కూర్చోబెడతారు. ఈలోగా మరో సహాయకురాలు వేడి వేడి కాఫీ,
తేనీటి పానీయాలతో మర్యాదలు చేస్తారు. మనం వచ్చింది కంటి పరీక్షలకా, లేక
పెళ్లి రిసెప్షన్ కా అని ఆశ్చర్యపోయేలోగా మరో సహాయకురాలు వివరాలు కనుక్కుని
సంబంధిత విభాగానికి తీసుకు వెడతారు. అయితే ఇవన్నీ రిజిస్ట్రేషన్ చార్జీ వగైరాలు
చెల్లించిన తరువాతనే అనుకోండి. ఇక్కడ నాకు విశేషంగా అనిపించింది ఏమిటంటే ఈ
పనులన్నీ ఆడపిల్లలు చేస్తున్నారు. ఎయిర్ ఇండియా హోస్టెస్ ల మాదిరిగా వారి కట్టూ
బొట్టూ, మాటా మన్ననా ఒకే తీరున కుదుమట్టంగా వుంది. వారి పేర్లు కూడా ఆసుపత్రివారే
పెట్టారేమో అన్నట్టుగా ఒకే రకంగా వున్నాయి. నాకు గుర్తున్నంత వరకు,
వారిలో కొందరి పేర్లు: సంతోషిణి, సంగీత, శ్రీలత, అనిత, కవిత, నిఖిత, నవనీత. (మరునాడు
చెకప్/ రివ్యు కోసం పోయినప్పుడు
వారు వస్త్రధారణలో భాగంగా పెట్టుకున్న చిన్ని నేమ్ ప్లేట్ల మీది ఈ పేర్లు
చూశాను. ఇవి చదవగలిగాను. అంటే ఆపరేషన్
సక్సెస్ అయినట్టే కదా!)
కనుపాపలు పెద్దవి కావడానికి కంటిలో చుక్కలు వేసే
కార్యక్రమంతో ఓ గంట కాలక్షేపం అవుతుంది. ఆ తరువాత వరుసగా అనేక విభాగాలు
తిప్పుతారు. కంటి వైద్యంలో ఇన్ని అధునాతన పరికరాలు రంగప్రవేశం చేసాయనే సంగతి ఈ
టూరు వల్ల మనకు బోధపడుతుంది. ఒక్కొక్క
పరికరం లక్షల ఖరీదు చేస్తుంది అని వాటిని చూడగానే తెలిసిపోతుంది. పరవాలేదు, మనం
మంచి ఆసుపత్రికే వచ్చాము అనే ఎరుక కూడా కలుగుతుంది.
అసలు ఆపరేషన్ చేసే డాక్టర్ శ్రీ లక్ష్మి గారిని కలిసే లోగా ఈ పరీక్షల తతంగం పూర్తయి, ఫలితాలు అన్నీ డిజిటల్ రూపంలో అక్కడికి చేరిపోతాయి. వాటిని ఆకళింపు చేసుకున్న డాక్టరు గారు, పలానా రోజు, పలానా టైముకు రండి అంటారు. సరే అని పలానా రోజున పలానా టైముకు వెడతాము. పలానా రోజునే చేస్తారు కానీ, పలానా టైముకే జరగాలని లేదు. మరేదైనా జరూరు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ముందు నిర్ణయించిన షెడ్యూలు మారే అవకాశం వుంది. నాకు అర్ధం అయింది ఏమిటంటే ఈ కేటరాక్ట్ ఆపరేషన్ అనేది ఇటువంటి పెద్ద ఆసుపత్రులలో అతి సులువుగా చేసే అతి చిన్న సర్జరీ. అంచేత, వారి ప్రాధాన్యతాక్రమంలో ఇది చిట్ట చివరిది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత నాకూ అలానే అనిపించింది.
తోకటపా:
హైదరాబాదు బేగంపేట గ్రీన్ లాండ్స్ ప్రాంతంలో ఉన్న
ఈ విన్ విజన్ కంటి ఆసుపత్రిని 2015 నవంబరులో శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు
ప్రారంభించారు. మొదలు పెట్టడమే కార్పొరేట్ హంగులతో, అధునాతన చికిత్సా పరికరాలతో ఆవిర్భవించిన ఈ కంటి
ఆసుపత్రి ఇప్పుడు మరిన్ని హంగులను సమకూర్చుకుంది. అంచేత అక్కడి వైద్యం నాణ్యతకు
తగ్గట్టుగానే బిల్లులు చురుక్కుమనిపిస్తాయి. అయితే మంచి బీమా కంపెనీ నుంచి ఆరోగ్య
పాలసీ వున్నవారు దర్జాగా అందులోకి అడుగు పెట్టి అంతకంటే దర్జాగా చికిత్స
పూర్తిచేసుకుని బయట పడవచ్చు. రోబోటిక్ సర్జరీ వంటి అధునాతన విధానాలతో కూడా కంటి
ఆపరేషన్లు చేస్తున్నారు. కాకపొతే డాక్టర్ శ్రీ లక్ష్మి గారి హస్తవాసి పట్ల నాకు
గురి. అందుకే ఆమె చేతితో చేసే శస్త్రచికిత్సను ఎంచుకున్నాను.
అసలు తోక, అసలు టపా:
నాకు కేంద్ర ప్రభుత్వ
ఆరోగ్య భీమా కార్డు (CGHS) ఉన్నప్పటికీ చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ
భీమా అంటే అదోరకమైన చిన్నచూపు అనే అపోహ వుంది. అంచేత మా చిన్నకోడలు, నిషా తాను పనిచేసే పెద్ద కార్పొరేట్ కంపెనీ
హెల్త్ ఇన్సురెన్స్ కార్డు మీద ఈ ఆపరేషన్ చేయించింది. దాంతో
Cashless treatment with no questions asked.
దరిమిలా కలిగిన సందేహం.
మరి, కార్పొరేట్
ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భీమా పట్ల ఈ ‘చూపుల్లో’ తేడాను ఏ కంటిడాక్టరు సరిచేయాలి చెప్మా!
16-04-2024
16, ఏప్రిల్ 2024, మంగళవారం
ఎవరీ సాయి పద్మగారు - భండారు శ్రీనివాసరావు
రాత్రి పొద్దుపోయిన తర్వాత Sujatha Velpuri గారి పోస్టు చూశాను. అందులో ఒక వాక్యం నన్ను రాత్రంతా నిద్ర పోకుండా చేసింది. అదే ఇది.
“వెళ్ళిరండి పద్మా!
నొప్పి, బాధ, మోసం, దుర్మార్గం
లేని ప్రపంచంలోకి, వీల్ చైర్ విసిరేసి స్వేచ్ఛగా పరిగెత్తండి”
అప్పుడు మొదలయిన ఆలోచనలు
రాత్రంతా నిద్ర లేకుండా చేసాయి.
ఎవరీ పద్మ? ఫేస్ బుక్ మొత్తం
మితృలు పంచుకుంటున్న పద్మగారి జ్ఞాపకాలతో నిండిపోతోంది. ఎందుకు ఇలా అందరూ
అర్ధరాత్రి వేళ మౌనంగా రోదిస్తున్నారు? ఒకళ్ళా ఇద్దరా వందలమంది ఆమె గురించి రాస్తూనే వున్నారు.
నేను ఆవిడ గారి గురించి ఆలోచిస్తూనే వున్నాను. నాకున్న రెండువేల పై చిలుకు మిత్ర బృందంలో ఈ
సాయి పద్మ గారి పేరెందుకు లేదు? ఇంత గొప్ప
మనిషి ఇంతకాలం నాకు తెలియకుండా ఎందుకు వుండిపోయారు. పద్మగారిని తెలిసిన వారు, కేవలం ఫేస్ బుక్ ద్వారా మాత్రమే తెలుసుకున్న వారు, వారూ వీరని లేకుండా ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు అంటే
ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అయి వుండాలి.
చివరికి ఆమె గురించి
తెలుసుకునేసరికి దాదాపు తెల్లవారింది. అదీ పద్మగారు స్వయంగా రాసుకున్న ఒక పోస్టు
ద్వారానే. పద్మగారు రాసుకున్న అమ్మ కధల
ద్వారానే.
నా కంటపడ్డ ఆ పోస్టులో
పద్మగారు ఇలా రాసుకున్నారు.
“దేవుడు అంత చక్కటి మొహం అందం
ఇచ్చి ఇంత లోపం పెట్టడం ఎందుకు కనీసం ఒక కాలు అన్నా నడిచేందుకు వీలుగా ఉంటే
బాగుండు.... నా మొదటి సారి ఆపరేషన్ అప్పుడు అనుకుంటా అమ్మ అమ్మమ్మతో అన్నమాటలు..
ఆపరేషన్ థియేటర్ బయట ఇంకా నాకు మత్తు వీడలేదు బహుశా ఆరు ఏడేళ్లు ఉంటాయేమో
ఆ కొంచెం అన్న అవకరం ఎందుకు ఉండాలి? ఏంటో అంటూ నిట్టూర్చిన అమ్మమ్మ మాటలు. సరే ఓహో నేను అందంగా ఉంటానా అని
గొప్పగా ఫీల్ అయ్యాను రెండు కాళ్లు తొడల నుంచి పాదం చివర దాకా ప్లాస్టర్ ఆఫ్
ప్యారిస్ కట్లతో ఉన్నా కూడా..
అది మార్చి నెల పదో తారీకు. నా
పుట్టినరోజు నాడు కూడా ఒక ఆపరేషన్ చేయించారు. బహుశా నాకు గుర్తుండి అది మొదటి
ఆపరేషన్.. అంతకు ముందు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్లు అలాంటివి పెద్దగా గుర్తు లేవు.
అప్పటికి రెండు పాదాలు పూర్తిగా వాలిపోయి ఉండేవి
నడుము పట్టుకుని లేవదీస్తే పాదాలు మెలి పడిపోయేవి. టెండన్ ట్రాన్స్ ప్లాంటేషన్
లాంటి సర్జరీ ఏదో చేశారు. ఎడమ కాలు ఫీమర్ బోన్ బోన్ కట్ చేసి పాదం వాలిపోకుండా ఏడు
ముక్కలుగా పాదం చుట్టూ బోన్ కి జత చేశారంట.
డాక్టర్ కైలాస రావు గారు, డాక్టర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు గారి నేతృత్వం లో విశాఖపట్నం అమెరికన్
హాస్పిటల్లో చేశారు.
తను పుట్టినరోజు కదా ఒక రెండు రోజులు ఆగొచ్చు కదా అని
అమ్మ అన్నదని తర్వాత మళ్లీ డాక్టర్లు దొరకరు బోన్ ముదిరిపోతే పాదం మళ్ళీ హీల్
అవ్వదు అని నాన్నగారు పట్టుదలగా చేయించారు అని తర్వాత తెలిసింది.
ఆ సంవత్సరం సుమారు ఐదు నెలలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్
కట్లతో మంచం మీదే ఉన్నాను. విశాఖపట్నం విజయనగరం ఇలాంటి ప్రదేశాల్లో పీక్ సమ్మర్
భయంకరంగా ఉంటుంది. సర్జరీ చేయించుకోవడానికి ఒకసారి మళ్లీ కుట్లు విప్పించుకోడానికి
ఒకసారి అమెరికన్ హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చేది. ఆ కట్లు కట్టించుకొని విపరీతమైన
దురద, చమట నొప్పి బాధ ఎలా అనుభవించాను అన్నది ఈరోజున నాకు
ఊహకి కూడా అందదు.
షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏది దొరికిన ఆ ప్లాస్టర్ లోకి
నెమ్మదిగా దూర్పి గోక్కునేదాన్ని.అందుకని అమ్మ అమ్మమ్మ పిన్ని నాకు బలమైన ఆయుధాలు
ఏవి దగ్గరలో ఉంచేవారు కాదు. ప్లాస్టిక్ స్కేలు, పళ్ళు ఊడిపోయిన దువ్వెన, గట్టిగా వున్న చీపురు పుల్లలు ఇవి నా ఆయుధాలు.
అప్పట్లో సూచర్స్ బొంత కుట్లు లాగా కుట్టేవారు. ఫీల్
అవ్వడానికి నెలలు పట్టేది మధ్యలో మనం ఇలా గోక్కోవడం వల్ల లేదా చెమట పట్టి
అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ అయిపోయేవి. బోన్ ఇన్ఫెక్షన్స్, టిష్యూ ఇన్ఫెక్షన్స్ పరమ భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే అసలు ఆర్థోపెడిక్
అంటేనే ఎంతకీ హీల్ అవ్వదు అని అర్థం అలాంటిది పాదం చుట్టూ బోన్స్ అమర్చి అన్ని
కుట్లు వేస్తే నేను ఒక బొంతలా ఉండేదాన్ని.
సమ్మర్ స్నానం చేయకుండా ఉండలేను అని ఏడిస్తే అమ్మమ్మ
కార్పెంటర్ నీ పిలిపించి ఒక కుర్చీ చేయించింది. దానికి మధ్యలో ఒక
ప్లేట్ లా కట్ చేసి పెట్టుకొని తీసేటట్టు అదే స్నానానికి బాత్రూం కి.
తొడల దగ్గర నుండీ పాదం చివరి దాకా కట్లతొ స్నానం ఒక
గోల గా ఉండేది. అది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాబట్టి, కాస్త తడి తగిలినా మెత్తబడి
పోయేది. అమ్మమ్మ చాలా తెలివిగా నా ఎత్తులకు పై ఎత్తులు వేసేది ఒక వడియాలు
పెట్టుకునే పెద్ద ప్లాస్టిక్ కవర్ తెప్పించి దాన్ని చేసి పూర్తిగా తొడిగేది
స్టిక్కర్ టేప్ లాగా దాన్ని ఫుల్ గా అతికించేది. ఏంటీ కష్టంగా ఉందా అని
అడిగేది..అవును అమ్మమ్మా అంటే.. పర్లేదు అలవాటు అయిపోతుంది అనేది.
ఇదంతా దేనికి అంటే నీ పని మాత్రం నువ్వే చేసుకోవాలి
అది ఎంత కష్టమైనా బయట నుంచి సహాయం మాత్రమే తీసుకో అనేది.
చాలా సర్జరీలు అయిపోయిన తర్వాత కుట్లు విప్పడం మాత్రం
నాన్నగారు అమ్మ చేసేవారు. ఫలానా రోజు కుట్లు విప్పుతారంటే భయానికి నాకు జ్వరం
వచ్చేది. దాని బాధ చూడలేను అదేదో మీరే చేసేయండి అని అమ్మ అనేది, అయినా తప్పకుండా బెటాడిన్ టించర్ పట్టుకొని నిల్చునేది.
ఈ సర్జరీలలో నాకు రిలీఫ్ వేసవి సెలవులకు వచ్చి మా
కజిన్స్ అందరూ. వాళ్ళందరూ ఆడుకుంటుంటే డాబా మీద నేనా పక్కనే కూర్చునే దాన్ని.
వాళ్లు నన్ను మోయలేక మా తమ్ముళ్లు గోపి బుజ్జి రెండు కాళ్లు ఇద్దరు మోసేవారు, మా అక్కలు వెనకాల నుంచి పట్టుకుని వాళ్లే స్త్రెచర్ లాగా వాళ్ళు ఎక్కడికి
వెళ్తే అక్కడికి నన్ను మోసుకొని పోయేవారు. మా డాబా మధ్యలో మెట్లు ఉండేవి దాని
చుట్టూ ఒక గూడు లాగా సిమెంట్ తో కట్టిన కట్టడం ఉండేది,పక్కనే పెద్ద సిమెంట్ నీళ్ల ట్యాంక్ ఉండేది. అక్కడ నీడగా ఉండేది. ఒక చాప
వేసేసి నన్ను అక్కడ కూర్చోబెట్టేవారు. పక్కనే అమ్మమ్మ చేసిన జంతికలు చేగోడీలు. నా
పని ఏంటంటే వాళ్ళు ఆడుకుంటుంటే పాయింట్స్ లెక్కపెట్టడం. ఎవరికైనా ఆడడం బోర్ కొడితే
వాళ్ళు వచ్చి నాతో బ్యాంకాట గాని చైనీస్ చక్కర్ గానీ ఆడేవారు. వాళ్ళ ఆడుకుంటుంటే
నేను అలా చూస్తూ కూర్చోవడం నాకు అప్పుడప్పుడు తిక్క వచ్చేసేది. ఒకసారి అమ్మమ్మ తో
నేను డాబా మీదకి వెళ్ళను అంటే.. ఒకసారి కుట్లు అల్లికలు మరోసారి పుస్తకాలు.
శివరాత్రి నా పుట్టినరోజు చాలాసార్లు దగ్గరలో ఉండేవి ఒకసారి అపూర్వ సహస్ర శిరచ్చేద
చింతామణి పుస్తకాలు అన్ని భాగాలు, మరో పుట్టినరోజు నాడు మొగలాయి
చరిత్ర అన్ని భాగాలు చదివేసిన గుర్తు.
ఒకసారి ఫ్రాక్చర్ అయినప్పుడు మళ్లీ ప్లాస్టర్ ఆఫ్
ప్యారిస్ కట్టలో ఉన్నప్పుడు పొద్దున్నే నూనె రాసి కనీసం స్నానం కూడా
చేయించలేకపోయాను ఏమిటో దీనికి కష్టం అంటూ అమ్మమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకోవడం అమ్మ
మొహం తిప్పుకుంటూ వెళ్ళటం కూడా గుర్తు.
స్థలాలు కాలాలు మారుతాయి అన్నిటికంటే విచిత్రంగా
మనుషులు మారుతారు వాళ్ల చుట్టూ ఆహాలు పంతాలు.. నార్శిసిజం, మెంటల్ హెల్త్ ఇష్యూస్ లాంటి ఎన్నో పేరుకుంటాయి.
అమ్మమ్మ అనేది నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే
నీకు తగిలిన నొప్పులు బాధలు మంచి జ్ఞాపకాలుగా తలచుకొని
నవ్వుకునేంత అని.
ఇందులో నవ్వుకోడానికి ఏముంది అమ్మమ్మ నా బొంద
అనేదాన్ని..!
కానీ నిజమే.. ఇవాళ కుట్లు విప్పుతారు అంట అంటూ నిద్ర
లేచాను. ఏదైనా చేసేయగలవు అనే అమ్మమ్మ, దీన్ని బంగాళా ఖాతంలో పడేసినా
ఈదుకొని వచ్చేస్తుంది అనే తమ్ముడు, దాని మైండ్ బానే వుంది కదా శేషు
బాధపడకు అనే నాన్నగారూ, మాట్లాడని మల్లె మొగ్గ మా అమ్మ ఎవరూ లేరు కుట్లు
విప్పటానికి...!!
కొన్ని జ్వరాలు బావుంటాయి
ITS HARD TO TURN THE PAGE WHEN YOU KNOW SOMEONE
WON'T BE IN THE NEXT CHAPTER, BUT THE STORY MUST GO ON.
దైన్యం తెలియని మనిషి, ధైర్యం
ఒక్కటే తెలిసిన మనిషి పద్మగారు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి?
(16-04-2024)