పార్టీ మార్పిళ్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పార్టీ మార్పిళ్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, నవంబర్ 2021, సోమవారం

ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి….భండారు శ్రీనివాసరావు


నిప్పు ఉప్పులాంటి ఇద్దరు రాజకీయ పార్టీల ప్రతినిధులు టీవీ తెరలపై చాలాకాలంగా ఒకరిపై ఒకరు, ఒకరి పార్టీపై మరొకరు నిప్పులు చెరుగుతూ విమర్శలు చేసుకునేవారు.
కొంతకాలం తర్వాత, సరైన సమయం చూసుకుని పార్టీలు కూడా మారిపోయారు. పైగా ఆయన ఈ పార్టీలో, ఈయన ఆ పార్టీలో.
ఇన్నేళ్ళుగా వినిపించిన వారి వాదనలు కూడా చిత్రంగా మారిపోయాయి. అప్పటివరకు తాము ప్రాతినిధ్యం వహించిన పార్టీని చీల్చి చెండాడం, తమ నోటితో దూషించిన పార్టీని నెత్తికెత్తుకుని నాలుక మడతేసి మాట్లాడడం చూస్తూ నివ్వెరపోయిన ఓ విశ్లేషకుడు తేనీటి విరామ సమయంలో తన సందేహాన్ని బయట పెట్టాడు, ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నారు అని.
దానికి వారు వేర్వేరుగా జవాబు ఇచ్చినప్పటికీ సారాంశం మాత్రం ఒక్కటే.
“ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సింది ఏముంది?
“మీరు ఎన్టీఆర్ సావిత్రి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలు చూశారా! వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళుగా నటించిన రక్త సంబంధం సినిమా కూడా చూసే వుంటారు. నాయకీ నాయకులుగా ప్రేమ సన్నివేశాల్లో ఎంత తాదాత్మ్యంగా నటించి ప్రేక్షకులను ఎలా మెప్పించారో, ఏకోదరులైన అన్నా చెల్లెళ్లుగా అదే స్థాయిలో అనురాగం, ఆత్మీయత కురిపించి, ప్రేక్షకులను ఒప్పించారు. అలాగే మేము. వాదించే విధానాన్ని బట్టే మాకు డిమాండ్ వుంటుంది. ఇంకా అర్ధం కాకపొతే ఎప్పటికీ మీకు అర్ధం కాదు”
ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక అర్ధం కాకుండా ఎలా వుంటుంది చెప్పండి!
(01-11-2021)

14, జూన్ 2017, బుధవారం

పక్షి కన్ను అధికారం


గురువు ద్రోణాచార్యుడు కురుపాండవ సోదరులకు విలు విద్యలో పోటీ పెడతాడు. ఒక వృక్షం కొమ్మల మధ్య పక్షి బొమ్మను పెట్టి దాని కన్నుకు గురిపెట్టి  బాణం కొట్టమని ఆదేశిస్తూ, ఒకొక్కరిని విడివిడిగా  ఆ చెట్టుపై ఏం కనబడుతున్నదో చెప్పమంటాడు.
“చెట్టు, కొమ్మలు, ఒక కొమ్మపై పక్షి, ఆ పక్షి కన్ను.”
“కొమ్మపై పక్షి, ఆ పక్షి కన్ను”
“పక్షి”
ఆఖరుకు అర్జునుడి వంతు.
“అర్జునా! ఏం కనబడుతోంది?” ద్రోణుడి ప్రశ్న.
“పక్షి కన్ను”
“ఇంకా ఏమీ కనబడడం లేదా”
“లేదు. పక్షి కన్ను మాత్రమే”
అదీ గురి చూసి కొట్టడం అంటే.  విలుకాడికి  లక్ష్యసిద్ధి వుండాలనేది ఈ భారత కధ పరమార్ధం.
ఆ కధనే ఇప్పటి రాజకీయాలకు వర్తింపచేస్తే వచ్చే సమాధానం.
పక్షి కన్ను కాదు, అధికారం.
అది గురిచూసి కొట్టగలిగిన వాళ్ళే నేటి రాజకీయ నాయకులు.
కాకపొతే, ఇప్పుడు వారందరూ అర్జునులే! అందరి గురీ అధికారం అనే పక్షి కన్ను మీదే!
వారికి ఏ పార్టీ పేరు పెట్టినా అతికినట్టు  సరిపోతుంది.