దేవులపల్లి అమర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేవులపల్లి అమర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జూన్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (323) : భండారు శ్రీనివాసరావు

 

నేను కూడా చెప్పలేని నిజం
ఇది ఈ సిరీస్ లో 323 వ భాగం. గతంలో ఏనాడు రాయడానికి సంశయించని, తటపటాయించని కొన్ని సున్నితమైన అంశాలు ఇందులో వున్నాయి. ఇతరుల గౌరవానికి భంగం కలగకుండా, సత్యానికి దూరం జరగకుండా చాలా జాగ్రత్తగా ప్రస్తావించాల్సిన విషయం. రాత్రంతా ఆలోచించి, తెలతెలవారుతుండగా పూర్తి చేశాను. అయినా పోస్టు చేయడానికి ముందు ఎన్నో సందేహాలు. ఒక పదం ఎక్కువ రాకుండా, చిన్న అపార్దానికి కూడా చోటివ్వకుండా రాయడం నిజానికి కత్తి మీద సామే. జీవిత చరిత్రను, లేదా ఆత్మ కధను రాయడంలో ఈ అంశమే ప్రధానంగా రచయితను బాగా కలవర పరుస్తుంది. మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు చెప్పినట్టు ఆత్మ స్తుతి, పర నిందకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.. చదువరికి ఈ రెండు విషయాల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా ఇక ఆ రచన నిరర్ధకం.
పాత్రికేయ మిత్రుడు, చిన్న వయసులోనే పెద్ద పేరు, అదీ మంచి పేరు తెచ్చుకున్న Amar Devulapalli దేవులపల్లి అమర్ డెబ్బయి వసంతాల పండగను అమర్ కుటుంబ సభ్యులు చక్కటి కుటుంబ వాతావరణంలో, బంధు మిత్రుల సమక్షంలో గొప్ప వేడుకగా నిర్వహించారు. జర్నలిజంలో కాకలు తీరిన పెద్దలతో సహా, కేవీపీ రామచంద్రరావు గారి వంటి సీనియర్ రాజకీయ నాయకులను ఒక్కచోట కలుసుకునే అవకాశం కల్పించిన అమర్ కు ధన్యవాదాలు.
అమర్ ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. క్యాబినెట్ హోదా కలిగిన రెండు పదవులను అనేక సంవత్సరాల పాటు నిర్వహించాడు. జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన ఐ.జే. యు. అధ్యక్ష పదవి, సెక్రెటరీ జనరల్ పదవి పొందాడు. ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు. ఇక ప్రింట్ జర్నలిజంలో అనేక ప్రముఖ దిన పత్రికల్లో పెద్ద స్థాయి ఉద్యోగాలు చేశాడు. డేట్ లైన్ పేరుతో పలు దినపత్రికల్లో అమర్ నిర్వహించిన శీర్షిక పాత్రికేయుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులను ద్విగుణీకృతం, త్రిగుణీకృతం చేసింది. తదనంతర కాలంలో టీవీ మీడియా రంగ ప్రవేశం చేసి రాజకీయ చర్చలకు కొత్త సొగసు అద్దాడు. జర్నలిస్టుగా ఇన్ని అవతారాలు ఎత్తినా, ఆహార వ్యవహారాల్లో కానీ, ఆహార్యంలో కానీ, మాట తీరులో కానీ, హాయిగా, భోళాగా, నోరారా నవ్వే పద్దతిలో కానీ, ఇన్నేళ్ళుగా చూస్తూ వస్తున్నాను ఎలాంటి మార్పు ఇసుమంత కూడా లేదు.
ఈ సమావేశంలో ఆయనే చెప్పినట్టు పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళు కోరుకున్నట్టుగా చేశాడు. శృతి, రాహుల్ అమర్ కు కుడి ఎడమ భుజాలు. ముచ్చటగా మనుమడు, మనుమరాలు. కోడలు రిషిక కూడా జర్నలిష్టే. రాత్రి వేడుక నిర్వహణలో కుమార్తె, అల్లుడు, కొడుకు, కోడలు పూర్తి బాధ్యతను తమ భుజాలకు ఎత్తుకున్నారు.
అలనాటి అయోధ్య రాముడికి మాదిరిగా, అమర్ కు అండాదండాగా సదా కనిపెట్టుకుని వుండే తమ్ముళ్లు అజయ్, విజయ్, చెల్లెలు వీణ.
భార్య శ్రీమతి సులోచన గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చాలా కాలం అమర్ బరువు బాధ్యతలను పంచుకున్నారు. నిజానికి నిజమైన జర్నలిస్టును భరించేది అతడి భార్యే. కాబట్టి అమర్ ఉద్యోగ విజయాల్లో సులోచన గారికి సింహభాగం క్రెడిట్ దక్కి తీరాలి.
ఇంతకీ నేను కూడా గత మూడు దశాబ్దాలకు పైగా నోరు విప్పి చెప్పని ఆ నిజం ఏమిటంటారా?
కృతజ్ఞతను బాహాటంగా వ్యక్తం చేయడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి వ్యక్తిని నేను ఈనాడు, అంటే 10-06-2026 నాటి రాత్రి కళ్ళారా చూసాను.
ఒక పాత్రికేయుడి నోటంట వెలువడిన ఈ పలుకులకు నాతో పాటు ప్రముఖ సంపాదకులు, పాత్రికేయులు ప్రత్యక్ష సాక్షులు.
ఆయన నుడివిన మాటలు: (సరిగ్గా ఇలానే కాకపోయినా, భావం బోధపడడానికి కొంచెం మార్పులు చేర్పులు)
‘ఆ రోజుల్లో అంటే, 1990 వ దశకంలో నేను హైదరాబాదులో ఒక ప్రముఖ దినపత్రికకు న్యూస్ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నాను. అప్పటికే అనేక జిల్లాల్లో, జిల్లా కరస్పాండెంటుగా పనిచేసిన అనుభవం వుంది. ఆ రోజుల్లో జిల్లా అధికారులుగా పనిచేసిన అనేకమంది ఐ.ఎ.ఎస్, ఐ.పీ.ఎస్. అధికారులతో నాకు వృత్తిరీత్యా సన్నిహిత సంబంధాలు ఉండేవి. తదనంతర కాలంలో వాళ్ళు కూడా నా లాగే హైదరాబాదు చేరుకుని సచివాలయంలో అత్యంత కీలక స్థానాల్లో కుదురుకున్నారు. ఏ పని కావాలన్నా చిటికెలో చక్కదిద్దగల పరిచయాలు నావి.
‘అయితేనేమి, నా సొంత అవసరం విషయంలో అవి పనికి రాలేదు. పనికి రాలేదు అనడం కంటే వాటిని నేను ఉపయోగించుకోలేదు అనడం సముచితంగా వుంటుంది. నేను ఒక పాత్రికేయుడినే కాదు, నాకు మరో పాత్ర వుంది. జర్నలిస్టుల సంఘానికి నాయకత్వ బాధ్యత. కాబట్టి ఎంత చిన్న తప్పు చేసినా, పొరబాటున, ఏదైనా పొరపాటు పని చేసినా అది అగ్గిలా రాజుకుంటుంది. ఆ ఎరుకతోనే నా వృత్తి జీవితాన్ని కొనసాగించాను.
‘అవసరమా అప్పట్లో పెద్దది. నాకున్న పెద్ద పరిచయాలతో పోల్చుకుంటే చిన్నది. అయినా నా తటపటాయింపు నాది.
‘నాలో ఈ సందిగ్ధతను తోటి పాత్రికేయ మిత్రుడు ఒకరు గమనించాడు. అతడు అప్పటికే రేడియో విలేకరిగా నలుగురికి తెలిసిన వాడు. అతడి మాటకు విలువ వుంది. అతడే నన్ను కదిలించాడు.
‘మనం అడిగేది కేవలం మాట సాయం. ఎవరూ వేలెత్తి చూపలేరు. నాకా మంత్రి గారు బాగా తెలుసు. వెళ్లి అడుగుతాను. చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. పని జరిగితే మంచిది’ అంటూ నన్ను ప్రోత్సహించి, తన గిర్నారు స్కూటరు మీద మంత్రి ఇంటికి వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళాడు. ఆ రోజుల్లో నాకు స్కూటరు కూడా లేదు.
‘ఇదిగో! ఇప్పుడు మనం అందరం కూర్చొన్న ఈ ఎమ్మెల్యే కాలనీ రిక్రియేషన్ సెంటర్ కు దగ్గర లోనే ఆ మంత్రి గారి నివాసం. ఆ రోజుల్లో అక్కడా అక్కడా విసిరేసినట్టు ఒకటి రెండు ఇళ్లు తప్ప అన్నీ పొలాలే. కాలి బాట మీద ఎత్తుపల్లాలలో స్కూటరు నడుపుతుంటే మధ్యలో సైలెన్సర్ ఊడి కిందపడింది. దాన్ని జాగ్రత్తగా తీసి పట్టుకుని మంత్రి ఇంటికి చేరాము. ఇంట్లో పూజ ఏదో జరుగుతున్నట్టు వుంది. ఆయన సాదరంగా వెంటబెట్టుకుని లోపలకు తీసుకు వెళ్ళారు. భార్యను పరిచయం చేశారు. వచ్చిన పని చెబితే ‘ఇదెంత పని?’ అన్నట్టు మాట్లాడారు. దాన్నిబట్టే అర్ధం అయింది ఇది అయ్యే పని కాదని. పని కాదనుకునే వెళ్ళాము కనుక నిరాశ కలగలేదు.
‘ఇక్కడ చెప్పాల్సింది వేరే. మనం జర్నలిస్టులం అనేక ఎగుడు దిగుడ్లు దాటుకుంటూ ఒక స్థాయికి చేరతాము. నాకు ఈ రోజుతో డెబ్బయి నిండాయి. ఇరవై ఏళ్ళ కిందటే పిల్లలు సెటిల్ అయ్యారు. పెళ్ళిళ్ళు అయ్యాయి. బాధ్యతలు అన్నీ పూర్తయ్యాయి.
‘ఆ రోజు నేను అడగకుండానే తన స్కూటర్ మీద వెంట బెట్టుకు వెళ్ళిన మిత్రుడు కూడా ఇప్పుడు మన మధ్యలోనే వున్నారు. నా కంటే వయసులో పదేళ్లు పెద్ద. ఆయనే ఇంకా జీవితంలో పూర్తిగా సెటిల్ అయినట్టు లేదు’
తన పుట్టిన రోజు వేడుకకు హాజరైన పెద్దలు అందరూ తన గురించి చెప్పిన నాలుగు మంచి మాటలకు కృతజ్ఞతలు తెలుపుతూ అమర్ తన ప్రసంగం చివర్లో నా గురించి చెప్పిన మాటలు ఇవి.
థాంక్స్! అమర్! మూడు దశాబ్దాలు దాటిన తర్వాత జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన పిదప నన్నిలా గుర్తు చేసుకున్నందుకు.
YOU ONLY CAN SPEAK OPENLY LIKE THIS.
కింది ఫోటో:
దేవులపల్లి అమర్ డెబ్బయ్యవ పుట్టిన రోజు వేడుకలు.



(ఇంకా వుంది)

30, అక్టోబర్ 2019, బుధవారం

రేడియో రోజులు -1 -భండారు శ్రీనివాసరావు

(29-10-2019 తేదీ  మంగళవారం సూర్య దినపత్రికలో ప్రచురితం)

‘ఆకాశవాణి కేంద్రం, హైదరాబాదు’
(నిషిద్ధ ప్రదేశం, అనుమతిలేనిదే లోనికి రాకూడదు)
“ఒక్కసారయినా ఇందులోకి వెళ్ళొస్తే ఎంత బాగుంటుందో!”
ఇలా మనసులో అనుకుంది ఎవరో కాదు, ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారుడుగా వున్న మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కేవీ. రమణాచారి. ఆయన స్వయంగా ఒక సభలో ఈ విషయం చెప్పారు.
అలాంటి రేడియో స్టేషన్ లో మూడు దశాబ్దాలకు పైగా కొలువు చేసే అపూర్వ అవకాశం నాకు  లభించింది. ఇది పూర్వ జన్మ సుకృతం.
అలనాటి అనుభవాలను కొన్నింటిని సూర్య పాఠకులతో పంచుకోవాలనే సంకల్పానికి సుముఖత చూపిన  ఆ పత్రిక యాజమాన్యం, సంపాదక వర్గానికి కృతజ్ఞతలు.
ఇక చదవండి!


2004 జనవరి చివరి వారం లో ఒక రోజు.

ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి అప్పుడే ఇంటికి చేరాను, మా ఆవిడను అమెరికాలోనే పిల్లల దగ్గర  వొదిలేసి.
పేపర్లు వచ్చే సమయం కాలేదు కనుక టీవీ స్విచ్ ఆన్ చేసాను. హఠాత్తుగా టీవీ తెరపై వార్తలు చదువుతూ అమర్ కనిపించాడు. నాకు తెలిసినంతవరకు అతడికి ప్రింట్ మీడియా తప్ప విజువల్ మీడియాలో పనిచేసిన అనుభవం లేదు. అప్పుడెప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఒకసారి రేడియోలో ప్రాంతీయ వార్తలు చదివే కాజువల్ న్యూస్ రీడర్ పోస్ట్ కోసం వచ్చాడు. అదీ మా రిక్వెస్ట్ మీదనే. జర్నలిస్టులు అయితే భాష మీద పట్టు వుంటుందని మావాళ్ళు వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. నిజానికి ఇది రెగ్యులర్ ఉద్యోగం కాదు. వార్తలు చదివేవాళ్ళు సెలవు పెట్టినప్పుడు వీళ్ళని బుక్ చేసి ఆ రోజు వార్తలు చదివిస్తారు. అప్పట్లో రేడియోకు వున్న గ్లామర్ మూలాన చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఆసక్తి చూపేవారు. కాజువల్ న్యూస్ రీడర్ని సెలక్ట్ చేయడానికి చిన్న పరీక్ష వుండేది. ఇంగ్లీష్ నుంచి వార్తలను తెలుగులోకి అనువాదం చేయడం, ఒక నమూనా న్యూస్ బులెటిన్ చదివించి రికార్డ్ చేయడం అన్నమాట. వార్తాపత్రికల్లో పుష్కలంగా అనుభవం వున్న అమర్ కు అనువాదం కొట్టిన పిండి. అందువల్ల ఆ మెట్టును ఇట్టే దాటి బులెటిన్ చదివే ఘట్టానికి చేరుకున్నాడు. అది దాటితే సెలక్షన్ అయిపోయినట్టే. అయితే, అమర్ వాయిస్ లో తెలంగాణా స్లాంగ్ వుంది అని కామెంట్ చేసాడు అప్పటి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు. అతడు ఆంద్ర ప్రాంతం వాడయినా ప్రాంతీయ విద్వేషాలు లేని మనిషి. రేడియో బులెటిన్ తయారు చేయడం పట్ల ఆయనకు కొన్ని నిర్దిష్ట మయిన ఆలోచనలు వున్నాయి. అన్ని ప్రాంతాలవారు వింటారు కాబట్టి ఎలాటి రీజినల్ స్లాంగ్ లేకుండా వార్తలు చదవాలన్నది కేంద్ర ప్రభుత్వ అధికారిగా అతగాడి ఉద్దేశ్యం. కానీ ఈ సంగతి తెలిసిన అమర్ నిర్ద్వందంగా ఆ సెలెక్షన్ ప్రాసెస్ ను కాదని వెళ్ళిపోయాడు. అయితే ఆకాశవాణి ప్రాంతీయ విభాగంలో పనిచేస్తున్న మాడపాటి సత్యవతి, అమర్ చదివే విధానం నచ్చి ఆయన చేత వారానికి రెండుసార్లు ప్రసారం అయ్యే ‘వార్తావాహిని’ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అప్పుడు అక్కడే విలేకరిగా పనిచేస్తున్న నాకు, అమర్ తో అప్పటివరకు ఉన్న పరిచయం అంతంత మాత్రమే  అని చెప్పాలి. అది కూడా ప్రెస్ క్లబ్ కే పరిమితం. కాకపొతే తరవాతి రోజుల్లో మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నా విషయం వొదిలి పెడితే, అమర్ స్వతహాగా స్నేహశీలి. అందరితో చాలా కలుపుగోలుగా మెలిగే తత్వం అమర్ సొంతం. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన నాకు అమర్ టీవీ తెరపై కనబడడం యెంత ఆశ్చర్యాన్ని కలిగించిందో, అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం మరో సంగతి గమనించిన తరవాత కలిగింది. అమెరికాలో ఇరవై నాలుగుగంటల న్యూస్ ఛానళ్ళకు అలవాటు పడి రావడం చేత, తెలతెలవారే   ఆ సమయంలో వార్తలు ఎందుకు వస్తున్నాయో అన్న అనుమానం ముందు కలగలేదు. వేళకాని వేళలో  టీవీలో ఈ  వార్తలు ఏమిటి అన్న సందేహం పొటమరించిన తరవాత నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. ఇదేమిటి ఇది ఇండియాలో సాధ్యమా అనిపించింది. ముప్పయ్యేళ్ళకు పైగా  రేడియోలో పనిచేస్తున్న నాకు ఈ పరిణామం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒకే ఒక మూసలో పోసినట్టుగా కాకుండా నాలుగు కోణాలనుంచి జనం సమాచారం తెలుసుకునే వీలు కలిగినందుకు ఒక మీడియా మనిషిగా ఆనాడు సంతోషించాను. వెంటనే బయటకు వెళ్లి పబ్లిక్ కాల్ బూత్ నుంచి అమెరికాకు ఫోను చేసి నేను క్షేమంగా చేరిన సమాచారంతో పాటు, నేను దేశంలో లేని అయిదు మాసాల్లో సంభవించిన ఈ అద్భుతమయిన మార్పుని గురించి కూడా అక్కడి మా వాళ్లకు గొప్పగా వివరించాను.

ఆ రోజు టీవీలో చూసిన అమర్ ఎవరో కాదు తదనంతర కాలంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన దేవులపల్లి అమర్. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు. (ప్రస్తుతం క్యాబినెట్ హోదాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు). ఆ తెలతెలవారే సమయంలో నేను చూసిన ఆ న్యూస్ చానల్ టీవీ -9.
ముందు అడుగు వేసినవాడే మునుముందుకు పోగలుగుతాడని అనతి కాలంలోనే నిరూపించిన వ్యక్తి ఆ ఛానల్ సీయీఓ  రవి ప్రకాష్. అప్పటికే జెమినీ టీవీలో నిర్వహించిన కార్యక్రమాలు ఆయనకు ఎంతో పేరుతొ పాటు అసంఖ్యాకమయిన అభిమానులను సమకూర్చిపెట్టాయి. టీవీ ఇంటర్వ్యూ లు అంటే ఇలాగే వుండాలని అనుకున్నవాళ్ళలో నేను కూడా వున్నాను. (ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ను, అందులో తెలుగు టీవీని  దిగంతాలకు చేర్చగలిగిన సత్తా చూపిన రవిప్రకాష్ విషయంలో ఇటీవల వెలుగు చూసిన కొన్నిపరిణామాలు, ఆయన శక్తి సామర్ధ్యాలను మసకబారేలా చేయడం ఓ విషాదం)   

అదలా ఉంచితే, తదనంతర కాలంలో ఎస్. జైపాల్ రెడ్డి  మా మంత్రిగా పనిచేసిన కాలంలో, ఆకాశవాణి , దూరదర్శన్ లను ప్రభుత్వ పెత్తనం నుంచి తప్పించి ప్రసార భారతిని ఏర్పాటు చేసినప్పుడు కూడా మరింత ముచ్చట పడ్డాను. పలురకాల న్యూస్ చానల్స్ చూసే అవకాశం జనాలకు వుండాలన్నది నా ప్రగాఢమయిన కోరిక. అప్పటికే సోవియట్ యూనియన్ లో పరిస్తితి చూసివచ్చిన అనుభవం వుండడం వల్ల అలాటి మార్పును నేను మనసారా కోరుకున్నాను. అయితే, చాలా సంవత్సరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియాలో పని చేయడం వల్లనో ఏమో వార్తలను వార్తలుగా మాత్రమే ఇవ్వాలనే సిద్దాంతానికి అలవాటు పడ్డాను. వ్యాఖ్యను మరోరకంగా వీక్షకులకు అందచేయాలి తప్ప వార్తలో మిళితం చేసి ఏది వార్తో ఏది వ్యాఖ్యో తెలియకుండా వారిని గందరగోళపరిచే హక్కు వార్తా పత్రికలకు కానీ, మీడియాకు కానీ వుండకూడదన్నది నా నిశ్చితాభిప్రాయం.
 వార్తలను ఎలాటి అంటూ సొంటూ లేకుండా అందించి , సంచలనం కోసం ఇచ్చే వ్యాఖ్యలను మరోరకంగా ఇవ్వడం వల్ల ‘వార్తలపట్ల జనాలకు వుండాల్సిన నమ్మకం చెదరకుండా వుంటుంద’ని భావించే వారిలో నేనొకడిని. ఒక్కసారి కనుక మనం ఇచ్చే వార్తలపట్ల జనాలకు అపనమ్మకం కలిగిందంటే చాలు ఆతరవాత మనం ఏది చెప్పినా ఆ ఛానల్ అలానే చెబుతుందని జనంలో ఒక చెరపలేని అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఒకనాడు రేడియో, దూరదర్శన్ వార్తలకు ఇదే గతి పట్టింది. నిజాలు చెప్పినా నిర్ధారణ చేసుకోవడానికి బీబీసీ వినేవారు.

టీవీ –9 సాధించిన అపూర్వ విజయం పుణ్యమా అని తెలుగునాట మీడియా బూమ్ మొదలయింది. అనేక న్యూస్ ఛానళ్ళు రంగ ప్రవేశం చేసాయి. పెట్టుబడులు ప్రవహించాయి. తెలుగు మీడియాకు కనీవినీ ఎరుగని హంగులు సమకూరాయి.

ఒకప్పుడు దూరదర్శన్ ఓబీ వ్యాన్ (ప్రత్యక్ష ప్రసారాలకోసం వుపయోగించేది) బయటకు తీయాలంటే బ్రహ్మ ప్రళయం. సందులు గొందుల్లో మలుపులు తిరగలేని పెద్ద ట్రక్కులాటి భారీ వాహనం. ఇరవై మంది సిబ్బంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందస్తు అనుమతుల జంఝాటం.

ఇప్పుడో, ఒక చిన్న వ్యాన్ లోనే ఈ పరికరాలని అమర్చుకోగల సాంకేతిక సామర్ధ్యం పెరిగింది. చిన్న సంఘటనకు కూడా వెంటనే స్పందించి టీవీ ఛానళ్ల వారు, వీటిని తక్షణం పంపి ప్రత్యక్ష ప్రసారాలు చేయగలుగుతున్నారు. (ఇప్పుడు ఇంకా సులువయింది. చిన్న సెల్ ఫోన్ తోనే ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారు.)

పోటీ వున్న చోట ప్రతిభ పెరిగే అవకాశం వుంది. అలాగే ప్రమాణాలు పడిపోయే ప్రమాదం కూడా వుంది. మీడియాలో వస్తున్న పరిణామాలు ఆనందంతోపాటు ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. నాకే కాదు, ఈ రంగానికి సంబంధించిన చాలామందికి.

మా అన్నయ్య భండారు పర్వతాల రావు చెప్పేవారు. ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసు భవనం ఎక్కి రోడ్డు మీదికి  చూస్తే కళ్ళు తిరిగే ట్రాఫిక్కు. ఈ కార్లు, లారీలు, ఆటోలను దాటుకుని వెళ్ళగలమా అని భయం వేస్తుంది. వాటి నడుమ పోతూ వుంటే మాత్రం ఎలాటి జంకూ కలగదు. బహుశా, ఈ ఆందోళనలు కూడా అలాగే తొలగిపోయి ఆనందమే మిగలాలని కోరుకుందాం.
అన్నట్టు, ఆశ పడడం, ఆశగా ఎదురు చూడడం  మన దేశం మనకిచ్చిన జన్మహక్కు.

2, సెప్టెంబర్ 2010, గురువారం

రేడియో రోజులు -1 -భండారు శ్రీనివాసరావు

2004 జనవరి చివరి వారం లో ఒక రోజు.

ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

బేగం పేట్ ఎయిర్ పోర్ట్ నుంచి అప్పుడే ఇంటికి చేరాను, మా ఆవిడను అమెరికాలోనే వొదిలేసి.

శ్రీ దేవులపల్లి అమర్


పేపర్లు వచ్చే సమయం కాలేదు కనుక టీవీ స్విచ్ ఆన్ చేసాను. హఠాత్తుగా టీవీ తెరపై వార్తలు చదువుతూ అమర్ కనిపించాడు. నాకు తెలిసినంతవరకు అతడికి ప్రింట్ మీడియా తప్ప విజువల్ మీడియాలో పనిచేసిన అనుభవం లేదు. అప్పుడెప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఒకసారి రేడియోలో ప్రాంతీయ వార్తలు చదివే కాజువల్ న్యూస్ రీడర్ పోస్ట్ కోసం వచ్చాడు. అదీ మా రిక్వెస్ట్ మీదనే. జర్నలిస్టులు అయితే భాష మీద పట్టు వుంటుందనిమా వాళ్ళు వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. నిజానికి ఇది రెగ్యులర్ ఉద్యోగం కాదు. వార్తలు చదివేవాళ్ళు సెలవుపెట్టినప్పుడు వీళ్ళని బుక్ చేసి ఆ రోజు వార్తలు చదివిస్తారు. అప్పట్లో రేడియోకు వున్న గ్లామర్ మూలాన చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఆసక్తి చూపేవారు. కాజువల్ న్యూస్ రీడర్ని సెలక్ట్ చేయడానికి చిన్న పరీక్ష వుండేది. ఇంగ్లీష్ నుంచి వార్తలను తెలుగులోకి అనువాదం చేయడం, ఒక నమూనా న్యూస్ బులెటిన్ చదివించి రికార్డ్ చేయడం అన్నమాట. వార్తాపత్రికల్లో పుష్కలంగా అనుభవం వున్న అమర్ కు అనువాదం కొట్టిన పిండి. అందువల్ల ఆ మెట్టును ఇట్టే దాటి బులెటిన్ చదివే ఘట్టానికి చేరుకున్నాడు. అది దాటితే సెలక్షన్ అయిపోయినట్టే. అయితే, అమర్ వాయిస్ లో తెలంగాణా స్లాంగ్ వుంది అని కామెంట్ చేసాడు అప్పటి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు గారు. అతడు ఆంద్ర ప్రాంతం వాడయినా ప్రాంతీయ విద్వేషాలు లేని మనిషి. రేడియో బులెటిన్ తయారు చేయడం పట్ల ఆయనకు కొన్ని నిర్దిష్ట మయిన ఆలోచనలు వున్నాయి. అన్ని ప్రాంతాలవారు వింటారు కాబట్టి ఎలాటి రీజినల్ స్లాంగ్ లేకుండా వార్తలు చదవాలన్నది కేంద్ర ప్రభుత్వ అధికారిగా అతగాడి ఉద్దేశ్యం. కానీ ఈ సంగతి తెలిసిన అమర్ నిర్ద్వందంగా ఆ సెలెక్షన్ ప్రాసెస్ ను కాదని వెళ్ళిపోయాడు. అంతవరకూ నాకు అమర్ తో వున్న పరిచయం అంతంత మాత్రమె అని చెప్పాలి. అది కూడా ప్రెస్ క్లబ్ కే పరిమితం. కాకపొతే తరవాతి రోజుల్లో మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నా విషయం వొదిలి పెడితే, అమర్ స్వతహాగా స్నేహ శీలి. అందరితో చాలా కలుపుగోలుగా మెలిగే తత్వం అమర్ సొంతం.


అప్పుడే అమెరికా నుంచి వచ్చిన నాకు అమర్ టీవీ తెరపై కనబడడం యెంత ఆశ్చర్యాన్ని కలిగించిందో, అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం మరో సంగతి గమనించిన తరవాత కలిగింది. అమెరికాలో ఇరవై నాలుగుగంటల న్యూస్ చానళ్ళకు అలవాటు పడి రావడం చేత ఆ సమయంలో వార్తలు ఎందుకు వస్తున్నాయో అన్న అనుమానం ముందు కలగలేదు. వేళ కాని వేళలో ఈ వార్తలు ఏమిటి అన్న సందేహం పొటమరించిన తరవాత నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. ఇదేమిటి ఇది ఇండియాలో సాధ్యమా అనిపించింది. ముప్పయ్యేళ్ళుగా రేడియోలో పనిచేస్తున్న నాకు ఈ పరిణామం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒకే ఒక మూసలో పోసినట్టుగా కాకుండా నాలుగు కోణాలనుంచి జనం సమాచారం తెలుసుకునే వీలు కలిగినందుకు ఒక మీడియా మనిషిగా ఆ నాడు సంతోషించాను. వెంటనే బయటకు వెళ్లి పబ్లిక్ కాల్ బూత్ నుంచి అమెరికాకు ఫోను చేసి నేను క్షేమంగా చేరిన సమాచారంతో పాటు, నేను దేశంలో లేని అయిదు మాసాల్లో సంభవించిన ఈ అద్భుతమయిన మార్పుని గురించి కూడా మా వాళ్లకు గొప్పగా వివరించాను.

ఆ రోజు టీవీలో చూసిన అమర్ ఎవరో కాదు తదనంతర కాలంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన దేవులపల్లి అమర్. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు. ఆ తెలతెలవారే సమయంలో నేను చూసిన ఆ న్యూస్ చానల్ టీవీ -9.

తెలుగు మీడియాను మలుపుతిప్పిన శ్రీ రవిప్రకాష్

ముందు అడుగు మోపినవాడే మునుముందుకు పోగలుగుతాడని ఆనతి కాలంలోనే నిరూపించిన వ్యక్తి ఆ ఛానల్ సీయీఓ శ్రీ రవి ప్రకాష్. అప్పటికే జెమినీ టీవీలో నిర్వహించిన కార్యక్రమాలు ఆయనకు ఎంతో పేరుతొ పాటు అసంఖ్యాకమయిన అభిమానులను సమకూర్చిపెట్టాయి. టీవీ ఇంటర్వ్యూ లు అంటే ఇలాగే వుండాలని అనుకున్నవాళ్ళలో నేను కూడా వున్నాను.

తరవాత జైపాల్ రెడ్డి గారు మా మంత్రిగా వున్నప్పుడు – ఆకాశవాణి , దూరదర్శన్ లను ప్రభుత్వ పెత్తనం నుంచి తప్పించి ప్రసార భారతిని ఏర్పాటు చేసినప్పుడు కూడా మరింత ముచ్చట పడ్డాను. పలురకాల న్యూస్ చానల్స్ చూసే అవకాశం జనాలకు వుండాలన్నది నా ప్రగాఢమయిన కోరిక. అప్పటికే సోవియట్ యూనియన్ లో పరిస్తితి చూసివచ్చిన అనుభవం వుండడం వల్ల అలాటి మార్పును నేను మనసారా కోరుకున్నాను. అయితే, చాలాసంవత్సరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియాలో పని చేయడం వల్లనో ఏమో వార్తలను వార్తలుగా మాత్ర మే ఇవ్వాలనే సిద్దాంతానికి అలవాటు పడ్డాను. వ్యాఖ్యను మరోరకంగా వీక్షకులకు అందచేయాలి తప్ప వార్తలో మిళితం చేసి ఏది వార్తో ఏది వ్యాఖ్యో తెలియకుండా వారిని గందరగోళపరిచే హక్కు వార్తా పత్రికలకు కానీ, మీడియాకు కానీ వుండకూడదన్నది నా నిశ్చితాభిప్రాయం.

తెలుగు మీడియాపై 'ఏపీ మీడియా' కామెంట్

 వార్తలను ఎలాటి అంటూ సొంటూ లేకుండా అందించి , సంచలనం కోసం ఇచ్చే వ్యాఖ్యలను మరోరకంగా ఇవ్వడం వల్ల ‘వార్తలపట్ల జనాలకు వుండాల్సిన నమ్మకం చెదరకుండా వుంటుంద’ని భావించే వారిలో నేనొకడిని. ఒక్కసారి కనుక మనం ఇచ్చే వార్తలపట్ల జనాలకు అపనమ్మకం కలిగిందంటే చాలు ఆతరవాత మనం ఏది చెప్పినా ఆ ఛానల్ అలానే చెబుతుందని జనంలో ఒక చెరపలేని అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఒకనాడు రేడియో, దూరదర్శన్ వార్తలకు ఇదే గతి పట్టింది. నిజాలు చెప్పినా నిర్ధారణ చేసుకోవడానికి బీబీసీ వినేవారు.

టీవీ –9 సాధించిన అపూర్వ విజయం పుణ్యమా అని తెలుగునాట మీడియా బూమ్ మొదలయింది. అనేక న్యూస్ చానళ్ళు రంగ ప్రవేశం చేసాయి. పెట్టుబడులు ప్రవహించాయి. తెలుగు మీడియాకు కనీవినీ ఎరుగని హంగులు సమకూరాయి.

జగన్నాధ రధం లాటి ఓబీ వ్యాన్

ఒకప్పుడు దూరదర్శన్ ఓబీ వ్యాన్ (ప్రత్యక్ష ప్రసారాలకోసం వుపయోగించేది) బయటకు తీయాలంటే బ్రహ్మ ప్రళయం. సందులు గొందుల్లో మలుపులు తిరగలేని పెద్ద ట్రక్కులాటి భారీ వాహనం. ఇరవై మంది సిబ్బంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందస్తు అనుమతుల జంఝాటం.

ఇప్పుడో, ఒక చిన్న వ్యాన్ లోనే ఈ పరికరాలని అమర్చుకోగల సాంకేతిక సామర్ధ్యం పెరిగింది. చిన్న సంఘటనకు కూడా వెంటనే స్పందించి టీవీ ఛానళ్ల వారు, వీటిని తక్షణం పంపి ప్రత్యక్ష ప్రసారాలు చేయగలుగుతున్నారు.

పోటీ వున్న చోట ప్రతిభ పెరిగే అవకాశం వుంది. అలాగే ప్రమాణాలు పడిపోయే ప్రమాదం కూడా వుంది. మీడియాలో వస్తున్న పరిణామాలు ఆనందంతోపాటు ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. నాకే కాదు, ఈ రంగానికి సంబంధించిన చాలామందికి.

మా అన్నయ్య భండారు పర్వతాల రావు గారు  అనేవాడు. ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసు భవనం ఎక్కి చూస్తె కళ్ళు తిరిగే ట్రాఫిక్కు. ఈ కార్లు, లారీలు, ఆటోలను దాటుకుని వెళ్ళగలమా అని భయం వేస్తుంది. వాటి నడుమ పోతూ వుంటే మాత్రం ఎలాటి జంకూ కలగదు. బహుశా – ఈ ఆందోళనలు కూడా అలాగే తొలగిపోయి ఆనందమే మిగలాలని కోరుకుందాం. ఆశ పడడం మన దేశం మనకిచ్చిన జన్మ హక్కు. (02-09-2010)

NOTE: All images in the blog are copyrighted to respective owners