తెలుగు టీవీల్లో రాజకీయ చర్చలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు టీవీల్లో రాజకీయ చర్చలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, మార్చి 2014, సోమవారం

కుమ్మేసుకుందాం రండి


ఈరోజు మీదే. కుమ్మేసుకోండిఅన్నాడు గుర్నాధం.
గుర్నాధం నాకు రెండేళ్ళ నుంచి పరిచయం. వాళ్ల టీవీ ప్రోగ్రాం కు వెళ్ళినప్పుడల్లా మంచిగా ఆప్యాయంగా పలకరిస్తాడు. అతని నోట ఎప్పుడూ ఇలాటి అపభ్రంశపు మాటలు వినలేదు. ఇవ్వాలేమిటి ఇలా!  అందుకే ఆ మాట వినబడనట్టు నటిస్తూ స్టుడియో లోపలకు నడిచాను. ఆ వాతావరణం నాకు కొత్త కాదు. లైట్లూ, మూవింగ్ కెమెరాలు, కెమెరామన్లు(టింగ్లీష్) ఏదీ, ఎవరూ కొత్త కాదు. కాకపొతే ఆరోజు నేను నిర్వహించే పాత్రే కొత్తది.
ఆరోజు జర్నలిష్టుల దినం అట. అందుకని కొత్తగా వుంటుందని, కాస్త కొత్తదనం చూపించాలని  నాకీ కొత్త అవతారం ఇచ్చి ఆరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమం నిర్వహించమన్నారు. అంటే యాంఖరయ్యపాత్ర అన్నమాట. రోజూ కూర్చుండే ప్రదేశమే అయినా కుర్చీ మారింది. చెవులకు ఏవో తగిలించి కూర్చోబెట్టారు. రేడియోలో నాలుగయిదు స్టేషన్లు కలిసినట్టు ఏవేవో నానారకాల ధ్వనులు కలగాపులగంగా వినీవినబడనట్టు వినబడుతున్నాయి. మైక్ టెస్టులు అయి, పత్రికావార్తల పఠనం పూర్తయి మొదటి బ్రేకుపడినప్పుడు అతిధులు ఒక్కొక్కరుగా వచ్చి కూర్చున్నారు. నాలుగు పార్టీలకు చెందిన వాళ్లు వాళ్లు. కాకపోతే ఇటీవలి కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాల కారణంగా వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఈ మధ్యనే పార్టీలు మారడమే కాకుండా ఇన్నాళ్ళుగా కత్తులు దూస్తూ వచ్చిన పార్టీల్లోకే స్వగృహ ప్రవేశం చేశారు. ఇన్నాళ్ళుగా విశ్లేషక పాత్ర కాబట్టి వాళ్లు ఎన్ని పార్టీలు ఎన్నిసార్లు మారినా నాకొచ్చిన ఇబ్బంది ఏమీలేదు. ఎవరి పద్యాలు (వాదాలు) వాళ్లు పాడేవారు. పార్టీ మారిన వాళ్లు కాస్త జాగ్రత్తగా వొళ్ళు దగ్గరపెట్టుకుని కొత్త పార్టీ వాళ్లు రాసిచ్చిన పాత పాటల్నే ఆలపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కొత్త వేషంలో వున్న నేను,  వాళ్లు ఇప్పుడు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ముందు అర్ధం చేసుకుని ఆపైన వాళ్ళను ప్రశ్నలు అడగాలి. పార్టీ మారిన వాళ్ళను సరిగా గుర్తుపట్టలేకపోతే వాళ్లకు వచ్చే కొత్త నష్టం ఏమీ లేకపోవచ్చుకానీ నన్ను నమ్ముకుని పెట్టుకున్న ప్రోగ్రాం అభాసు పాలు అయ్యే అవకాశం వుంటుంది. కాబట్టి వొళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన మహత్తర బాధ్యత నా మీదకే వచ్చిపడింది. అంచేత, ముందు  వొళ్ళూ, ఆ తరువాత  గొంతూ సర్దుకుని,  కుర్చీలో కాస్త వొంగి కూర్చుని (లేకపోతే యాంఖర్ అనుకోరేమో అని లోపల అనుమానం) నంగిగా పలకరింపుల చిరునవ్వులు రువ్వాను.
చెవులో జోరీగలాగా లోపలనుంచి ప్రోగ్రాం వాళ్లు రొదచేస్తున్నా పట్టించుకోకుండా ఫలానా వాళ్లు ఫలానా ఫలానా పార్టీలవాళ్ళు అంటూ పరిచయం చేయబోయి తొట్రుపడి ఒక పేరుకు మరో పార్టీ పేరు చెప్పి  మరో పేరుకు ఇంకో  పార్టీ పేరు చెప్పి ఆ తరువాత తీరిగ్గా  నాలిక్కరుచుకున్నాను. వాళ్లకు నేను చేసిన తప్పేమిటో తెలిసింది. కాని, కన్నంలో తేలు కుట్టిన దొంగలల్లే మిన్నకుండిపోయారు.
సరే! ప్రోగ్రాం మొదలయింది.
మొన్న ఢిల్లీలో....మొదలు పెట్టాను.
తెదేపా ప్రతినిధి అడ్డుకున్నాడు.
ఏం జరిగింది ఢిల్లీలో. మా నాయకుడు అంత పెద్ద వయస్సులో కూడా అంత పెద్ద వయస్సును కూడా లెక్క చేయకుండా అంతమంది తెలుగువారి....
“అసలు తెలుగువారి గురించి మాట్లాడే నైతిక హక్కు ....వైకాపా ప్రతినిధి అందుకున్నాడు.
మీరు మాట్లాడుతుంటే నేను మారు మాట్లాడకుండా విన్నాను. అలాగే...
అసలు నేను మాట్లాడింది ఎక్కడ ? ...ముందు మీరే కదా మా నాయకుడు అంటూ మాలావు గింజుకున్నారు.
ఆ మాటకు వస్తే తెలుగువారి గురించి, మళ్ళీ అదే మాటకు మళ్ళీ వస్తే యావత్ ప్రజలు గురించి, వారి కష్టాలు గురించి వారి నష్టాలు గురించి మాట్లాడే ఏకైక హక్కు శ్రీమతి ఇందిరాగాంధి  కుటుంబానికి చెందిన వారి కోడలు శ్రీమతి సోనియా గాంధీ గారి మార్గ దర్శకత్వంలోనూ,  వారి కుమారుడు, భావి భారత ఆశాజ్యోతి, కాబోయే ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనూ  నిద్రాహారాలు లేకుండా, అహరహమూ  శ్రమిస్తున్న ఒక్క కాంగ్రెస్ పార్టీకే వున్నదని  నేను మనవిచేసుకుంటూ ఇంకా ఇంకా  చెప్పెదేమిటంటే ....కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం  ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మహిళా నాయకురాలు నోరువిప్పి మళ్ళీ మూయడం మరిచిపోయి మాట్లాడడం మొదలెట్టారు.
ఏమిటి మీకున్న హక్కు ?  ప్రజలపేరు చెబుతూ ఆ ప్రజాధనాన్ని కొల్లగొట్టడమా? స్కాముల్లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పడమా ? ఏమిటి మీకున్న హక్కు ?”
ఎవరో కొల్లగొట్టారని చెప్పే హక్కు మీకెక్కడిది? కొల్లగొట్టింది మీరందరూ. కొల్లగొట్టబడింది మేము. వుంటే గింటే, అయితే గియితే ఆ తరతరాల హక్కు,   ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక తరాలుగా పోరాటం చేసిన మాది”  టీ ఆర్ఎస్ ఆయన అందుకున్నాడు.   
చెవిలో ఏదో చెబుతున్నారు. ఎవరో శ్రోత లైన్లో వున్నారని.
పరిస్తితిని కాపాడడానికి ఇదే అదను.
ఒక్క నిమిషం  ఆగండి. కరీంనగర్ నుంచి వరహాలరావు గారు లైన్లో వున్నారుఅనేసి మానిటర్ వైపు చూసి అందులో నా మొహం కనబడడం లేదని నిర్ధారించుకుని ఎదురుగా పెట్టిన గ్లాసులోని నీళ్ళను చుక్క మిగలకుండా తాగేశాను.
ఇంతలో వరహాలరావు గారి కంఠం వినబడింది.
ముందాయనకు చెప్పండి. నాపేరు వరహాలరావు కాదు. రత్నాకరరాజు. మా వూరు కరీం నగర్ కాదు కాశీబుగ్గ
ఓహో! అలాగా ! నాకు కొత్త కదండీ . అందుకని కొత్తగా చెప్పాలనుకుని కొత్త పేరు కొత్త వూరు చెప్పాను. ఇంతకీ రావుగారు... అదే అదే రాజు గారు మీరు ఎవర్ని యేమని అడగాలనుకుంటున్నారు?”
నేను ఎవర్ని, యేమని అడగాలని అనుకుని లైన్లోకి రాలేదండి. అసలీ ప్రోగ్రాముల వల్ల ఏం సాధించాలని అనుకుంటున్నారో మీరు చెప్పండి.
ఒక్క రోజు భాగోతానికి మూతి మీసాలు పోయాయన్నట్టు ఈఒక్క రోజు యాంఖర్ వేషం యెందుకు కట్టానురా అనుకుంటు నాలో నేనే మధన పడుతుంటే చెవుల్లో బ్రేక్ చెప్పండి. ఆలస్యం అయితే ఎడ్వర్టైజ్ మెంటు వాళ్ళతో గోలఅని వినబడడంతో అమ్మయ్య అనుకుని ఇప్పుడొక చిన్న విరామంఅంటూ పెద్ద బ్రేక్ ఇచ్చేసాను.
ఆపేసిన తరువాత కూడా ఫ్యాన్ కాసేపు తిరిగినట్టు ఆ తరువాత కూడా వారి వాదప్రతివాదాలు కొనసాగుతూనే వున్నాయి.
ఈ మధ్యలో మా ఆవిడ గొంతు.
అదెలా. ఆవిడ ఎక్కడికయినా ఎప్పుడయినా రావచ్చుకాని చెప్పాపెట్టకుండా ఇలా వెంటపడి స్టుడియోలకి కూడా వస్తుంటే యెలా?
ఏమండీ ఏమైంది ఎందుకలా చెమటలు పట్టాయి. లేచి నీళ్ళు తాగండిఅంటోంది.
అయ్యో ఇదంతా కలా!

అయ్యో ఏమిటి అపభ్రంశంగా! అమ్మయ్య అనుకోవాలి కాని.  

27, జులై 2010, మంగళవారం

నేడే చూడండి - భండారు శ్రీనివాసరావు

నేడే చూడండి - భండారు శ్రీనివాసరావు



తప్పనిసరయి ఇక తప్పదురా అనుకున్నప్పుడు అనుభవించి ఆనందించమని ఇంగ్లీష్ లో ఓ సామెత వుంది.
మంచికో చెడుకో టీవీ అనేది ఇప్పుడు ‘నెసిసరీ ఈవిల్’ గా తయారయిందన్నది మాత్రం నిజం. తిట్టుకుంటూ అయినా చూడక తప్పని అవసరంగా మారిందన్నది మరో నిజం. కాదనలేని ఈ నిజాల దృష్ట్యా - తిట్టుకోవడం కూడా మానేసి టీవీని చూస్తూపోతూవుంటే నష్టపోయేదేమీ వుండదు కరెంటు ఖర్చు తప్ప – అన్నాడో టీవీ విప్లవకవి.

వెనుకటి రోజుల్లో, ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది అంటే ‘దూరదర్శన్ లో ‘ అనేవారు నవ్వుతాలుగా. కానీ ఇప్పడు యిరవై నాలుగ్గంటల న్యూస్ చానళ్ళు వచ్చేశాక మొదలయిన ఊకదంపుడు చర్చలు చూస్తునప్పుడు – ఆ పేడా పిడ కలే నయమనే వారు ఎక్కువయ్యారు. వార్తల అధారంగా వ్యాఖ్యలు, వ్యాఖ్యల ఆధారంగా వార్తలు, మళ్ళీ వీటి ఆధారంగా చర్చలు, వాటిపై తిరిగి ‘ఫోన్ ఇన్ లు’, మధ్యమధ్యలో విలేకరుల విరుపులు, యాంకర్ ల విన్యాసాలు, ‘లక్ష వొత్తుల నోములు’ లక్ష సార్లు నోచుకోవాల్సిన న్యూస్ ప్రేజెంటర్ల మూకుమ్మడి తెలుగు భాషా హత్యాప్రయత్నాలు, బుల్లి తెర నిండుగా ‘ఇప్పుడే అందిన ఎప్పటివో వార్తలు’, తాబేలు, కుందేలు మాదిరిగా డేకుతూ, పాకుతూ వెళ్ళే స్క్రోలింగులు, పంటికింది రాళ్ళలా ‘యాడ్ లు ‘ - ఒకటా రెండా యేమని చెప్పుదు ఆ టీవీల లీలలు. యేమని వర్ణింతునూ ఆ ఛానళ్ళ సొగసులు – అన్నాడో వికట కవి.

టీవీల్లో చూపించే చర్చలని చూస్తూ వాటిపై చర్చోపచర్చలు చేసేవాళ్ళని చూస్తూవుంటాము. బుల్లి తెరలపై కానవచ్చే విశ్లేషణ కర్తలే- భుజాలపై శంఖు చక్రాలు పొడిపించుకుని, ‘భుజకీర్తులు’ తగిలించుకున్న భజన బృందగాన బృందావన విహారులుగా చెలరేగిపోతున్నప్పుడు – మేము మాత్రం తీసిపోయామా అన్నట్టు చూసేవాళ్ళు కూడా సినీహీరోల వీరాభిమానుల మాదిరిగా చీలిపోయి ఆయా రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులను కూడా మించిపోయి శ్రుతి మించి ‘రాగాలు’ అందుకుంటున్న తీరుతెన్నులు గమనించేవారికి ‘బ్రోచే వారెవరురా ‘ అన్న కీర్తన జ్ఞాపకం వచ్చి- ప్రకటితమో అప్రకటితమో ‘కరెంటు కోత’ ఒక్కటే తమను కాపాడగలగలదని ‘గజేంద్ర మోక్షం’ పద్యాలను తిరగేసి అరగదీస్తుంటారంటూ - ’ఇవా ఈనాడు జనానికి కావలసినవి? ఇదా ఈ రోజు జనం కోరుకుంటున్నది?’అని ఆవేశపడిపోయాడో వికటాట్ట కవి.

కానీ, ఇక్కడే కరెక్టుగా పైన చెప్పిన సామెత అక్కరకు వస్తుంది. అన్ని వేలుపోసి టీవీలు కొనుక్కున్నదెందుకు? వున్న చీకాకులను మరచిపోయి హాయిగా కాలక్షేపం చేసేందుకు. అంతేకానీ, ఇలా అడ్డమయిన చర్చల్లో తలదూర్చి లేని తలనొప్పులు తెచ్చుకునేందుకు కాదుకదా. అందుకని తెలివయిన వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే –టీవీ రోట్లో పెట్టిన తలను రోట్లోనే వుంచేసి ‘రోకటి పోటు’ని ’ ఆహ్వానించి ఆస్వాదించడం – అంటూ సెలవిస్తున్నాడో ఉచిత సలహా కవి.
అందుకాయన ఇస్తున్న ఉదాహరణలను సోదాహరణంగా గమనించండి.
‘ముఖ్యమంత్రి రోశయ్య గారు ఈ సాయంత్రం డిల్లీ వెడతారా?
‘సోనియా గాంధీ ఆయనకు అప్పాయింట్మెంట్ ఇస్తారా ?
‘లేకపోతె అహ్మద్ పటేల్ లేదా అందుబాటులో వున్న మరో నాయకుడినో కల్సి సరిపెట్టుకుంటారా?
‘ఈ పరిణామాలను జగన్ వర్గం ఎలా గమనిస్తోంది?
‘జగన్ వర్గం వేయబోయే ఎత్తులపై కాంగ్రెస్ సీనియర్లు ఏమనుకుంటున్నారు?
‘రోశయ్య తదుపరి చర్యలు ఎలావుండబోతున్నాయి?
‘ఆయన వర్గం ఎలా భావిస్తోంది?
‘ఇంతకీ రోశయ్య గారికి ఒక వర్గమంటూ వుందా?
‘జగన్ వ్యతిరేక వర్గమే ఆయన వర్గమా?
‘ఇలా ఇన్ని రకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ లో రానున్న రోజుల్లో రాగల పరిణామాలెలా వుండబోతున్నాయి?
‘ఎంతో ఆసక్తిని రగిలిస్తున్న ఈ అంశాలపై మేము అంటే మా ఛానల్ మాత్రమే నిర్వహిస్తున్న చర్చను మా ఛానల్ లోనే - ఈ రోజే, ఇప్పుడే చూడండి.’

వంటా వార్పూ కార్యక్రమంలో ‘ఇలా చేసి మాడండి’ తరహాలో వెలువడే ఈ రకం ప్రకటనలు వింటుంటే నవ్వు రావడం లేదా? ఇంతటి హాస్యాన్ని ఇరవై నాలుగ్గంటలపాటు ఇంటింటికీ పంచుతున్న తెలుగు టీవీ చానళ్ళ నిర్విరామ, నిస్వార్ధ, నిర్వికార సేవా నిరతిని కొనియాడడానికి మీకు మాటలు రావడం లేదా? అయినచో – మీకు నిష్కృతి యెట్లు? మీబోటి బోంట్లకు అదే సరయిన మార్గం. తలను రోటిలోనే వుంచండి. రోకటి పోటుకు వెరవకండి. (26-07-2010)

NOTE: All images in this blog are copy righted to their respective owners.