టీవీ చర్చలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
టీవీ చర్చలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మార్చి 2021, ఆదివారం

మీడియాలో సిత్రాలు


జనాలకు చిత్రవిచిత్రాలు చూపే మీడియాలో కూడా ‘సిత్రాలు’ వుంటాయి.
మామూలుగా ఎన్నికల ఫలితాలు వెలువడే రోజున మీడియా సందడి సందడి చేస్తుంది. బ్యాలెట్ పెట్టెల సీళ్లు విప్పినప్పటి నుంచి, బ్యాలెట్ పత్రాలను కట్టలుగా కట్టడం మొదలైనప్పటి నుంచి టీవీ స్టూడియోల్లో చర్చలు ప్రారంభిస్తారు.

ఇప్పుడు అంటే వ్యక్తిగత కారణాల వల్ల పోవడం లేదు కానీ గతంలో నాకీ హడావిడి ఎక్కువనే చెప్పాలి. ఉదయం మొదలుపెడితే రాత్రి పొద్దు పోయేవరకు ఈ టీవీ చర్చలు రోజంతా సాగుతూనే ఉండేవి. మధ్యాన్న భోజనం సమయానికి ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే ఏదో ఒక స్టూడియోకి వెడుతూ ఉండేవాడిని, ‘ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు’ అనే సామెతను నిజం చేస్తూ.

ఇంతకీ చెప్పాలని మొదలుపెట్టిన ‘సిత్రం’ ఏమిటంటారా!

2019లో ఎన్నికల ఫలితాల రోజున ఇలాగే అనేక టీవీ ఛానళ్లకు ముందుగానే ‘ఉభయం’ ఒప్పుకున్నాను. అదో పెద్ద టైం టేబుల్ లాగా వుండేది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పలానా టైంలో పలానా టీవీ అని.

అలాగే ఆరోజు ఉదయం నుంచి మిట్ట మధ్యాన్నం దాకా నాలుగయిదు ఛానళ్లలో చర్చాకార్యక్రమాల్లో పాల్గొని భోజనానికి వచ్చాను. తర్వాత ఎటూ కదలకుండా ఇంట్లో సోఫాలోనే పడుకుని టీవీ చూస్తుంటే మా ఆవిడ గమనించింది.

‘రాత్రిదాకా క్షణం తీరిక లేదన్నారు. మరి ఇప్పుడేమిటి ఈ వరదరాజస్వామి అవతారం అవటా! అని ఆరాలు మొదలు పెట్టింది.
అసలు విషయం ఆమెకు ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.

అప్పటిదాకా వెల్లడైన ఫలితాలు చూసిన తర్వాత చర్చలు పెట్టి ఇక లాభం లేదనుకున్నారో ఏమిటో, కొన్ని చానళ్ళ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ప్రోగ్రాములు కాన్సిల్ చేసుకున్నట్టు నా ఫోనుకు వర్తమానం పంపారు.

కానీ ఆవిడకి ఈ మీడియా ‘సిత్రాలు’ యేమని చెప్పను, ఎలా చెప్పను?
(14-03-2021)

6, ఫిబ్రవరి 2021, శనివారం

ఇంగువ కట్టిన గుడ్డ – భండారు శ్రీనివాసరావు

 

ఇంగువ కట్టిన గుడ్డకు ఎన్ని రోజులైనా ఆ వాసన దాన్ని అంటిపెట్టుకుని ఉంటుందంటారు. అది అనుభవంలోకి వచ్చింది.

హైదరాబాదులో రోడ్డు దాటటడం అంటే వైతరణి దాటినట్టే. ఉదయం బ్లడ్ టెస్ట్ కి వెళ్లి తిరిగివస్తూ, రోడ్డు దాటడం ఎల్లా అనే సమస్యతో అటూ ఇటూ చూస్తుంటే ఒకాయన నా చేయిపట్టి దాటించాడు. థాంక్స్ చెప్పబోతుంటే ఆయనే కల్పించుకుని ‘ఈ మధ్య మీరు టీవీ చర్చల్లో రావడం లేదేమిట’ని అడిగాడు. దాదాపు  ఏడాది పైమాటే, 2019 ఆగస్టులో  మా ఆవిడ మరణం తదాదిగా నేను  టీవీ చర్చలకు వెళ్ళడం పూర్తిగా తగ్గించాను. ఆ సంగతి ఈయన గారు ఎలా గమనించారబ్బా అనుకుంటుంటే ఆయనే చెప్పారు.

ఆయన పేరు విశ్వనాధ రెడ్డి. ఊరు చిత్తూరు జిల్లా పీలేరు. అమ్మాయి అల్లుడు హైదరాబాదులో కాపురం. వారిని చూడడానికి వచ్చారట.

రోజూ అన్ని టీవీ చర్చలు చూస్తూ వుంటాను. అందరూ అరుస్తూ మాట్లాడుతుంటుంటే మీరు మాత్రం అలా మౌనంగా వుండిపోతారు. అడిగితె కాని జవాబు చెప్పరు. మొదట్లో ఎలాగో అనిపించేది. ఈయనేమి విశ్లేషకుడని. కానీ తర్వాత తర్వాత అర్ధం అయింది. అలా కల్పించుకోకపోవడమే మీ ప్రత్యేకత అని”

చర్చల్లోనే కాదు ఇక్కడ కూడా నాకు మౌనమే శరణ్యం. ఏం చెప్పను?

ఆ విధంగా మీకు అభిమానిని అయ్యాను” అన్నారాయన.

పొద్దున్నే దొరికిన పెద్ద కాంప్లిమెంట్ అనుకోవాలి.

వాదనకు, వాదులాటకు తేడా తెలిసిన వాడే నిజమైన విశ్లేషకుడు అని ఎప్పుడో రాసుకున్న వాక్యం గుర్తుకు వచ్చింది.