ఏదో జరుగుతుంది. వెంటనే అప్పుడెప్పుడో ఇలాగే జరిగింది
అంటారు పెద్దవాళ్ళు, దానికీ దీనికీ పెద్దగా పోలికలేకపోయినా.
అలాగే ఇది. జరిగింది ఏమిటో మీకు తెలుసు, విడిగా అదేమిటో
చెప్పక్కర లేదు. పోలిక అంటారా! మాయాబజార్ సినిమాలో ప్రియదర్శిని పేటిక మాదిరే. అందులో ఎవరికి కావాల్సింది
వాళ్లకు కనబడుతుంది. అక్కరలేదు అనుకున్నది కనబడదు. మన రాజకీయాల సంగతి చెప్పేది
ఏముంది.
ఇక చిత్తగించండి!
ఈ వ్యాసం ఇండియా టుడే పత్రికలో 1993 అక్టోబర్ సంచికలో
వచ్చింది. రాసిన జర్నలిస్టు పేరు మనోజ్ మిత్తా. ఆ వ్యాసానికి ఇది స్వేచ్చానువాదం.
ఆ పత్రిక వారికి కృతజ్ఞతలు.
ఆ రోజుల్లో ఎన్నికల చీఫ్ కమిషనర్ టి.ఎన్. శేషన్ అంటే
జనాలకు ఎనలేని ఆదరణ అభిమానం. రాజకీయులకు సింహస్వప్నం.
అయితే ఎంతటి వారికి కూడా ఒక రోజు వస్తుందనేది నానుడి. అది
సెషన్ విషయంలో కూడా జరిగింది.
అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక
నిర్ణయం తీసుకుంది. అది ఆయన్ని ఇరకాటంలోనే కాదు ఆశ్చర్యంలో కూడా ముంచివేసింది.
ఎందుకంటే ఇలాటి రోజు ఒకటి వస్తుందని ఆయన కూడా ఎప్పుడూ ఊహించి వుండరు.
అప్పటివరకు ఎలెక్షన్ కమిషన్ అంటే శేషన్ ఒక్కరే. ఆయనే
దానికి కర్తా కర్మా క్రియా అన్నీను. అలాంటిది మరో ఇద్దరు ఎలెక్షన్ కమిషనర్లను
ప్రభుత్వం అదనంగా నియమించింది. అది ఎంతటి ఆకస్మిక నిర్ణయం అంటే కొత్తగా
నియమితులయిన ఇద్దరు కమిషనర్లు శ్రీ జీవీజీ కృష్ణమూర్తి, శ్రీ ఎం.ఎస్. గిల్ లకు
కూడా ఆ సమాచారం ఆఖరి నిమిషంలోనే తెలిసింది. అప్పుడు వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఉన్న
గిల్ అధికారిక పర్యటన నిమిత్తం ఆ రోజు ఉదయమే గ్వాలియర్ వెళ్ళారు. ఆయన్ని మళ్ళీ
ఢిల్లీ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విమానాన్ని పంపింది. పుణేలో సెలవులు గడపడానికి వెళ్ళిన శేషన్ కు ఈ
విషయం తెలిసింది. “ఇంకా నూటొక్క మంది కమిషనర్లను వేసుకోమనండి, నాకేమీ ఫరకు పడదు”
అన్నది ఆయన మొదటి స్పందన.
ఇక కృష్ణమూర్తి గారి విషయం తీసుకుంటే ఆయన కొన్నింటిలో
శేషన్ కు ఏ మాత్రం తీసిపోరు. ఆయన కేంద్రంలో న్యాయ శాఖ కార్యదర్శిగా పనిచేసారు. ఆయన
శేషన్ రక కోసం ఎదురు చూడకుండా ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో తనకంటూ ఒక గదిని ఏర్పాటు
చేసుకున్నారు. శేషన్ కు నమ్మకస్తుడిగా ఎలెక్షన్ కమిషన్ లో కోర్టు వ్యవహారాలు చూస్తున్న
మాజీ అటార్నీ జనరల్ జి. రామస్వామి, ఢిల్లీ
ఎన్నికలకు సంబంధించిన ఒక కేసులో కమిషన్ తరపున వాదించడానికి వీలులేకుండా ఆర్డరు
వేసారు. ఎందుకంటే అనదరి కంటే ముందు ఇలాముగ్గురు సభ్యులను నియమించడం రాజ్యాంగ
విరుద్ధం అని ప్రకటించింది ఆ రామస్వామి కాబట్టి.
“ఇక నుంచి
ఎలెక్షన్ కమిషన్ అంటే మేము ముగ్గురం.” అని ఇండియా టుడే తో తేల్చి చెప్పారు.
అయినా శేషన్ పట్టుబట్టి ఆ కేసును మళ్ళీ రామస్వామికే అప్పగించారు. అది వేరే విషయం. అప్పటి
నుంచి ఈ ఇరువురి నడుమ విబేధాలు పెరిగిపోయాయి. తనకు ఆఫీసులో తగిన గౌరవం లభించడం
లేదని ఒకసారి శ్రీ కృష్ణమూర్తి ఆఫీసు నుంచి బయటకు వెళ్ళిపోయారు కూడా. తను
కూర్చుండే గదికి తాళం వేసి వుండడం, ఫోను వైర్లు తెగిపోయి వుండడం గమనించిన శ్రీ
కృష్ణమూర్తి అవమానంగా భావించారు. భద్రతా హర్యాల కారణంగా ఒక రోజు ఆ గదికి తాళం
వేసినట్టు శేషన్ విలేకరులకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మెత్తపడని కృష్ణమూర్తి
ఆ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. అన్ని సదుపాయాలు కల్పించడం
జరుగుతుందని శేషన్ హామీ ఇచ్చిన తర్వాతనే ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టారు.
మూడో సభ్యుడైన గిల్ మాత్రం ఈ వ్యవహారాలను తేలిగ్గా
తీసుకున్నారు. ‘మనం ఏ కుర్చీలో కూర్చున్నాం, మన గదిలో ఎన్ని సోఫాలు వున్నాయి
అన్నది ప్రధానం కాదు. రాజ్యాంగం మనకు ఒప్పగించిన బాధ్యతలను ఎంతవరకు
నిర్వర్తిస్తున్నాం అన్నదే ప్రధానం’ అనేది ఆయన అభిప్రాయం.
ఇదిలా ఉండగానే ప్రభుత్వం మరో ఆర్డినెన్స్ తెచ్చింది. ముగ్గురు
కమిషనర్లలో ఒకరుఎక్కువా కాదు, మరొకరు
తక్కువా కాదు, హోదాలో, అధికారాల్లో అందరూ సమానమే” అన్నది దాని సారాంశం.
(ఇండియా టుడే సౌజన్యంతో)