'ధర్మము ధర్మమటంచు వితండ వితర్కము లాడెదీవు, ఆ
ధర్మము నేనెరుంగుదు .....'అంటాడు శ్రీరాముడు తన అనుంగు భక్తుడు ఆంజనేయుడితో,
కల్పిత పౌరాణిక నాటకం 'శ్రీరామాంజనేయ యుద్ధం'లో.
సీమాంధ్రలొ ఎన్నికల సమరం ముగిసింది. ప్రజాతీర్పు 'ఏవీఎం'లలో
నిక్షిప్తమై వుంది. మరో వారం రోజుల్లో అది యెలా వుందనేది వెల్లడి అవుతుంది.
ఈలోగా, ఆశలు, ఆశలకు తగ్గట్టుగా అంచనాలు, అంచనాలకు
తగ్గట్టుగా వూహాగానాలు ఇవన్నీ ఎలాగో
రాజకీయ పార్టీలకు తప్పవు.
ఆ తీర్పు యెలా వున్నా ఏవిధంగా వున్నా దాన్ని
గౌరవించడం ప్రజాస్వామ్యానికి మేలుచేస్తుంది. విజేతకు కావాల్సింది సంయమనం,
పరాజితులకు అవసరమైంది హుందాతనం.
అరవయ్యవ దశకంలో పత్రికలు చదవడం అలవాటు
చేసుకుంటున్న దశలో, నాటి ఆంధ్ర పత్రిక మొదటి పుట పతాకశీర్షిక నాకింకా గుర్తుంది.
"అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాన్ ఫిట్జరాల్ద్
కెనెడీ అద్భుత విజయం. ఓటమిని అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన"
పోటీ అన్నాక విజేతలు పలువురు వుండరు. వోడినవారికి
అదే తుది పోరు కాదు. ప్రజల విజ్ఞత మీద విశ్వాసం వుంచండి. నచ్చిన వారిని యెలా
ఎన్నుకుంటున్నారో, నచ్చకపోతే అలాగే 'వోటు ఆయుధం' ప్రయోగించి దించేసిన సందర్భాలు కోకొల్లలు.
ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఇరువురికీ అభినందనలు.
ప్రజలకు చేరువ కావడానికి అన్ని పక్షాలు విశ్వప్రయత్నం చేసాయి. అన్ని రకాలుగా శ్రమించాయి.
అయితే విజయం ఒకరినే వరిస్తుంది. వారు ప్రజల విశ్వాసాన్ని నిలుపుకునే ప్రయత్నం
చేయాలి. ఓడిన వారు కూడా అనవసర ఆరోపణలు, విమర్శలకు దిగకుండా ప్రజాస్వామ్య
స్పూర్తిని గౌరవించాలి. మరో పోరాటానికి సిద్ధంగా వుండాలి.
ఇదేమీ తుది సమరం కాదు. ఈ
ఎరుక అందరికీ మేలు చేస్తుంది.