తిరుపతి అనుభవాలను గురించి కరకుగా రాయడాన్ని కొందరు
తప్పుపట్టారు. సరయిన ఏర్పాట్లు జరక్కపోవడం వల్ల అలా రాశానన్నది వారి అభిప్రాయంగా
తోచింది. అందుకే ఈ నాలుగు విషయాలు.
ముందే రాశాను తిరుపతి పోయింది తక్కువసార్లే కాని పెట్టిపుట్టుకున్న
వాళ్ల తరహాలో తేలిగ్గా దర్శనాలు చేసుకున్న సందర్భాలే ఎక్కువని. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని మార్పులు వచ్చాయి.
అందుకే ఎవరినీ ఏమీ అడగకుండా మామూలుగా వెళ్ళి రావడం జరిగింది. ప్రస్తుతం ఈవో గా
వున్న శ్రీ ఎమ్జీ గోపాల్, ఖమ్మం కాలేజీలో మా
హిందీ లెక్చరర్ శర్మ గారి కుమారుడు. అప్పటినుంచి తెలుసు. కెరియర్ రీత్యా సీనియర్
కాని వయసు రీత్యా జూనియర్. అందరికీ సాయపడాలనే తత్వం వున్నమనిషి. 'సమర్ధులైన అధికారులే ఈవోలు గా పనిచేశారు,
చేస్తున్నారు' అని కూడా రాయడం ఇందుకోసమే. అలాగే పాలకమండలి చైర్మన్ శ్రీ కనుమూరి
బాపిరాజు. హైదరాబాదులో మా బోటి వారందరికీ చిరపరిచితులు. ఆయన చైర్మన్ అయిన కొత్తలో
తిరుపతి వెడితే దూరం నుంచే గమనించి 'ఏం సీనూ బాగున్నావా' అని కావలించుకున్నారంటే ఆయనతో వున్న సాన్నిహిత్యాన్ని అర్ధం
చేసుకోవచ్చు. మనిషి భోలా శంకరుడు. ఆయన భార్య ఆయన కంటే నాలుగాకులు ఆధ్యాత్మికపరురాలు.
ఆ భార్యా భర్తలు ఇద్దరూ, వారి ఇంటికి వెళ్ళినప్పుడు వద్దని వారించినా మా ఆలుమగలకు కాళ్ళకు దణ్ణాలు పెట్టేవాళ్ళు. ఆవిడ నిమ్స్,
కేన్సర్ ఆసుపత్రులకు వారం వారం వెళ్ళి పళ్ళూ వగైరా పంచిపెడుతూ వుండడం మాకు తెలుసు.
వాళ్లింట్లో హోమాలు అవీ జరిగితే మేము వెళ్ళి వస్తుండేవాళ్ళం. ఇన్ని పరిచయాలు
వున్నప్పటికీ మామూలుగా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని రావాలన్న అభిలాష ఇంతపని
చేయించింది. అప్పుడు కళ్ళ బడ్డ సంగతులే పూసగుచ్చి రాశాను.
జర్నలిష్టులకు వర్తించే సామెత ఒకటుంది.
'ఎక్కడయినా బావ కాని
వంగతోట దగ్గర కాదు'