వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జులై 2014, బుధవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9                   
ఆ తరువాత ముఖ్యమంత్రులయిన శ్రీయుతులు అంజయ్య, భవనం వెంకట్రాం, విజయభాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు - తమ పేషీల్లో వ్యక్తిగత సిబ్బందిని తమకు ఇష్టం వున్నవారితో మార్పులు చేసుకున్నప్పటికీ పీ ఆర్ వొ గా మాత్రం, చెన్నా(రెడ్డి) నుంచి అన్నా(ఎన్టీయార్) వరకు మా అన్నయ్య పర్వతాలరావుగారే కొనసాగారు. ముఖ్యమంత్రులు, ఆఖరికి పాలించే పార్టీలు మారినా పీ ఆర్ వొ గా ఆయన కొనసాగడం అనేది ఇప్పటికీ ఒక రికార్డు.


తన అనుభవాలను ఏర్చి కూర్చి 'చెన్నా టు అన్నా' అనే గ్రంధాన్ని రాయాలనే తలంపు వున్నట్టు ఆయన అనేకసార్లు అనుకున్నారు. మా అన్నయ్య అని చెప్పడం కాదు కాని, పర్వతాలరావు గారు మంచి ధారణ కలిగిన వ్యక్తి. ఆంధ్ర ఆంగ్ల భాషల్లో మంచి ప్రవీణుడు. చక్కని రాయసకాడు. గేయం రాసినా, వ్యాసం రాసినా సుబోధకంగా వుండేది. ప్రసంగ వ్యాసాలు  రాయడంలో దిట్ట. 'ఈ చీకటి గొందులలో, లేఖినీలాస్యం,చెప్పు తెగింది' అనే గేయ సంపుటాలు, ప్రకాశం గాధాశతి, జై భీమ్ కధలు, పరమాచార్య పావన గాధలు, Charaka - Redactor, par excellence, Veena, Mrudangam, Leather Puppets, Dwakra Crafts అనే రచనలు చేశారు.
పర్వతాలరావు గారు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర  అయిదేళ్లపాటు పనిచేసి, సమాచారశాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి,  పదవీ విరమణ చేశారు. మొదటి ఉద్యోగం నుంచి చివరి ఉద్యోగం వరకు ప్రభుత్వ వాహనం, డ్రైవర్ సదుపాయాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలపాటు అనుభవించి  రిటైర్ అయిన తరువాత హాయిగా సిటీ బస్సులు, ఆటోల్లో తిరగడం చూసి మాకే చిత్రమనిపించేది. రిటైర్ అయిన కొద్ది మాసాలకే నారసింహతత్వం అధ్యయనం నిమిత్తం దక్షిణ, ఉత్తర భారతంలోని అనేక నరసింహ దేవాలయాలను దర్శించి పరిశోధన చేసి 'నమో! నారసింహాయ!' అనే పేరుతొ ఆరు సంపుటాలను వెలువరించారు. చాప మీద కూర్చుని, తొడమీద కాగితాల బొత్తి పెట్టుకుని వేల పేజీలు వెనక్కి తిరిగి చూసుకోకుండా, ఎవరి సాయం తీసుకోకుండా ఆయన రాసిన తీరు అమోఘం. అలా ఆధ్యాత్మిక రచనా వ్యాసంగంలో తుచ్చ రాజకీయ రచనల వాసన ఆయనకు రుచించినట్టు లేదు. అందుకే కాబోలు 'చెన్నా టు అన్నా' వెలుగు చూడలేదు.

జీవిత చరమాంకంలో పుట్టపర్తిలో మా వొదినె సరోజినీదేవి  గారితో కలిసి ఓ చిన్నగదిలో వుంటూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, 2006 ఆగస్టు 21 వ తేదీన, తను ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా  ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు.  మనిషి అనేవాడు మనీషిగా యెలా జీవించవచ్చో నిజం చేసి చూపాడు కాబట్టే ఆ సర్వేశ్వరుడు ఆయనకు అలాటి ఆనాయాస మరణం అనే వరాన్ని అనుగ్రహించాడు.         

29, జులై 2014, మంగళవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9



మొత్తం మీద అసమ్మతి సెగలు పనిచేసో, లేక దాన్ని అడ్డం పెట్టుకుని చెన్నారెడ్డి అడ్డు  తొలగించుకోవాలని శ్రీమతి గాంధీ భావించారో,  కారణం ఏదయినా, 1980  అక్టోబర్ 10 న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జీ.వెంకటరామారావు ఆ వుదంతం గురించి  చేసిన వ్యాఖ్యానం ఇక్కడ పేర్కొనడం సముచితంగా వుంటుంది.  

    
"పరువుగా, హుందాగా, ఆత్మ సంతృప్తితో, పదవీ విరమణ చేసే అవకాశం కాంగ్రెస్(ఐ) అధిస్థానం ముఖ్యమంత్రులకు ఏనాడు ఇవ్వలేదు. మర్రి చెన్నారెడ్డిని మూడు  నెలలు ముప్పుతిప్పలు పెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతివాదులను ప్రోత్సహించారు. గవర్నరుకు రాజీనామా లేఖ పంపమన్నారు. అంతలోనే ఇప్పుడు వద్దు అన్నారు"            
చెన్నారెడ్డి 1989 లో రెండోమారు ముఖ్యమంత్రి అయ్యారు కాని, నేను అప్పుడు మాస్కోలో వున్నాను. అప్పుడు కూడా ఇదే సీను రిపీట్ అయింది. పీసీసీ అధ్యక్షుడిగా వుండి, ఎన్నికల్లో ఎన్టీయార్ నాయకత్వంలోని  అధికార తెలుగుదేశం పార్టీని వోడించి కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదే . కానీ ఏడాదిలో చెన్నారెడ్డిని తిరిగి మాజీ ముఖ్యమంత్రిని చేసింది కూడా అదే అసమ్మతి. అదే అధిష్టానం.
చెన్నారెడ్డి గురించిన అధ్యాయం ముగించేముందు ఆయనతో నా సొంత అనుభవం ఒకటి చెప్పాలి.

ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆకాశవాణి ఏర్పాటుచేసిన ఒక శిక్షణ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పట్లా జర్నలిష్టులకు ఢిల్లీ ఏపీ భవన్ గెస్ట్ హౌస్ లో ప్రత్యేక కేటగిరీ వుండేది కాదు. గెస్ట్ హౌస్ కూడా ప్రస్తుతం వున్న విలాసవంతమైన పలు అంతస్తుల భవనం కాదు. పక్కనే ఆనుకుని వున్న అశోకా రోడ్లో మొదటి నెంబరు భవనం. పాతదే అయినా చాలా వసతిగా వుండేది. రోజు కిరాయి కూడా తక్కువే. అయితే, శిక్షణ కోసం వెళ్లడం వల్ల ఎక్కువ రోజులు వుండాల్సి వచ్చింది. హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత ప్రైవేట్ అతిధుల జాబితాలో పెట్టి బిల్లు పంపించారు. వందల్లోనే వున్నా అప్పటి ప్రమాణాల ప్రకారం భారమే అనిపించి,  సీ.ఎం. చెన్నారెడ్డి గారి  దృష్టికి తీసుకు వెళ్లాను. ఆయన ఓ ధరఖాస్తు ఇమ్మన్నారు. వెంటనే ఓ జీవో జారీ అయింది. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిష్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమానంగా పరిగణిస్తూ ఇచ్చిన జీవో అది. దాని కాపీ మా ఆఫేసు చిరునామాతో నాకు కూడా పంపారు. చాలాకాలం వుంది కానీ, మేము మాస్కో వెళ్ళినప్పుడు ఎక్కడో కాగితాల్లో మరుగునపడి,  ఇప్పుడు కానరావడం లేదు. జర్నలిష్టులు ఎవరి వద్ద అన్నా వుంటే చూడండి.  ఆ జీవోలో  నా పేరు కూడా వుంది. 'పలానా శ్రీనివాసరావు ఇచ్చిన ధరకాస్తు పరిశీలించిన మీదట ప్రభుత్వం .....' అని వుంటుంది.       (ఇంకా వుంది)