రెండుపత్రికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రెండుపత్రికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అర్ధం కాని విషయం


అర్ధం కాని విషయం

అజ్ఞాని : మాకు తెలియని ఎన్నెన్నో ఊసులు చెబుతున్నారు. చాలా సంతోషం. వింటున్నకొద్దీ వినాలని వుంది గురూ గారూ.
విజ్ఞాని: విషయాలేవీ తెలియవంటున్నావు. కొంపతీసి వైయస్సార్ మాట విని ఆ రెండు పేపర్లు చదవడంలేదా! అందుకే కాబోలు ఇలా అజ్ఞానిగా వుండిపోయావు.
అ: ఇంతకీ జగన్ మోహన్ రెడ్డి చరిత్ర ముగిసిపోయిందంటారు.
వి: అవును శిష్యా. అతగాడికి భవిష్యత్తే కాదు వర్తమానం కూడా లేనట్లే.
అ: ఏం జరగబోతోందని మీ అంచనా?
వి: ఏముంది? అతడి చుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ఇవ్వాళో రేపో అరెస్ట్ చేస్తారు. బ్యాంకు అక్కౌంట్స్ సీజ్ చేస్తారు. పొట్లంలో బెల్లం లేదని తెలిసాక చుట్టూ చేరిన చీమలన్నీ తప్పుకుంటాయి. హీనపక్షం పదేళ్లన్నా జైల్లో వుండక తప్పదు. ఇక అలాటి వాడిని నమ్ముకుని ఎవరు వెనకాల వేళ్ళాడుతారు చెప్పు.
అ: ఇవన్నీ ఆ రెండు పేపర్లూ చాన్నాళ్ళ నుంచి రాస్తూనే వున్నాయి. ఇందులో కొత్తేమీ లేదు గురూ గారూ. ఏదయినా సరి కొత్త సంగతి చెప్పండి.
వి: ప్రతి రోజూ కొత్త విషయం ఎక్కడనుంచి వస్తుంది. పాత విషయాన్నే మార్చి మార్చి రాస్తుండాలి. చెబుతుండాలి. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా. జగన్ పోట్లాటెట్టుకుంది ఎవర్తో. సాక్షాత్తు కాంగ్రెస్ అధిష్టాన దేవతతో. ఢిల్లీ లో, గల్లీలో అధికారం చేతిలోవున్న కాంగ్రెస్ పార్టీ తో. ఎదురు తిరక్కుండా, నీ బాన్చెను అంటూ మోచేతినీళ్ళు తాగే ఎంతమందినయినా, వాళ్లు ఎంత లంచగొండులయినా సరే అధిష్టానం చూసీ చూడనట్టు వొదిలేస్తుంది కానీ ఎదురుతిరిగిన వాళ్ళను మాత్రం వూరికే వొదిలిపెట్టదు. పార్టీలో కింద నుంచి పైదాకా ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పిల్లోడు పార్టీకి కొత్తకదా. వాళ్ల నాయనలాగే ఉడుకు రక్తం. అందుకే అలా ఆవేశపడిపోయి ఢిల్లీ పెద్దలతో గిల్లికజ్జా పెట్టుకున్నాడు. గిల్లి వూరుకున్నా అదో సంగతి. ఏకంగా అధినేత్రి పైనే నోరు చేసుకున్నాడు. కాంగ్రెస్ వాళ్లు వాళ్ల పెళ్ళాలనన్నా ఎవరన్నా ఏమన్నా అంటే వూరుకుంటారేమోకానీ, సోనియాపై పల్లెత్తు మాట తూలినా చాలు వొంటి కాలు మీద లేస్తారు. తమ ఇంట్లో వోట్లు కూడా నమ్మకంగా తమకు వేయించుకోలేని కొందరు నాయకులు కేవలం ఈ ఒక్క లక్షణం కారణంగానే ఢిల్లీలో ఇన్నేళ్ళుగా నెగ్గుకువస్తున్నారు.
అ: కొత్త విషయం అంటూ మళ్ళీ ఆ పేపరోళ్లలాగానే పాతపాటే పాడుతున్నారు. మీరంటే ఆ రెండు పేపర్లు తెగ చదివేసి ఇలా విషయాలన్నీ ఇడమరచి చెబుతున్నారు. ఇన్ని ఇన్నాక కూడా ఓ సంగతి మాబోటోళ్లకు అర్ధం కావడం లేదు. మొన్న రేత్రి మా పక్కింటికి పోలీసోడు వచ్చి ఏవో రాసుకుపోయాడు. అంతే. ఉప్పుకీ, పప్పుకీ
పక్కింటి తలుపు తట్టే మా ఇంటిది కూడా మర్నాడు ఆ యింటి మొహం చూస్తే వొట్టు. పోలీసు బయం అంటే అల్లాగుంటది. అలాటిది జగన్ బాబు మీద అదేదో సెంటర్ పోలీసోళ్లు దిగిపోయారు. మీరన్నట్టు, ఆ రెండు పేపరోళ్ళు రాస్తున్నట్టు ఈ పొద్దో, రేపటిసందో ఆ బాబుని పట్టుకెళ్ళి చర్లపల్లి జెయిల్లో వేస్తారు. అల్లాగే,  బ్యాంకుల్లో ఆయన డబ్బు చెలామణీ కాకుండా చూస్తారు. మరి, ఆయనదగ్గర మరేటి వుంటాదని పాతికమందో, ముప్పయిమందో ఎమ్మెల్యేలు ఆయన వెంట వెడుతున్నట్టు. సీటు పోయిందని టీవీల్లో రాతలు వచ్చీ రాకముందే మన వెనకున్నోళ్లు అయిపు ఆజా లేకుండా పోయే రోజులివి. పోనీ, సొమ్ములకు కక్కుర్తి  పడ్డారనుకుంటే ఇవతల ఇంకా రెండేళ్ళ అధికారం వుందాయె. పదవిలో వుంటే పది పనులు చేసుకుని పది కాలాల పాటు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతకొచ్చు. అంకెల మీద రోజులు వెళ్ళదీసే సర్కారు తన అవసరానికి అందించే తాయిలాలకు ఆశ పడే వాళ్ళుంటారు కానీ, జగన్ ఎప్పుడో సీ ఏం అవుతాడని, అప్పుడు ఆదుకుంటాడని, వున్నదాన్ని వూడగొట్టుకునే వాళ్ళుంటారా ఎక్కడయినా. పదవిని వొదులుకుని, సర్కారు చేసే సాయాలు వొదులుకుని ఏం బావుకుందామని జగనెంట ఇంతమంది వెడుతున్నట్టు? మాకర్ధం కాని ఈ ఒక్క విషయం అర్ధం అయ్యేలా చెప్పండి గురువు గారూ. (02-09-2011)