మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన ఘట్టం చరిత్రలో చోటుచేసుకుంది.
చాలా ఏళ్ళుగా నలుగుతూ, సలుపుతూ వచ్చిన ఒక సమస్యకు 'ముగింపు' దొరికింది. పడింది
'శుభం' కార్డా, మరో సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం. దాన్ని కాలమే తేలుస్తుంది.
ఎందుకంటే 1956
లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 'ఆంధ్రప్రదేశ్' ఏర్పాటయినప్పుడు
ఇలాగే సంతసించినవాళ్ళు వున్నారు. సందేహించినవాళ్లు వున్నారు. ఆనాడు సంశయం వ్యక్తం
చేసిన వాళ్ల భయాలే నిజం అయ్యాయని ఈనాడు విభజనను గట్టిగా కోరుతున్నవారు ఎంతో గట్టిగా
వాదించిన సందర్భాలు వున్నాయి. అంచేత సందేహిస్తున్నవారి భయాలను తేలిగ్గా
కొట్టివేయడం కూడా తగదు. ఎవరు అవునన్నా ఎవరు
కాదన్నా తెలంగాణా ఆవిష్కృతం కాబోతోంది. ఈ సమయంలో గెలుపు వోటముల ప్రసక్తిని
పక్కనబెట్టాలి. యుద్దంలో, ఆటల్లో మాత్రమే ఈ మాటలు వినబడతాయి. ఇంతకాలం జరిగింది
యుద్ధమూ కాదు, ఆటా కాదు. ఉభయప్రాంతాల జనంలో వున్న ఆకాంక్షకు చక్కని అభివ్యక్తీకరణ మాత్రమే. కొందరు రాజకీయులు దీనికి అగ్గి రాజేసారు.
వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం ఎంతమాత్రం లేదు. ఇకనుంచయినా సరే, రెండు
ప్రాంతాల ప్రజలు రాజకీయుల చేతుల్లో పావులు
కాకుండా తమ ప్రాంతాల సత్వర అభివృద్ధిలో స్వయంగా భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్యంలో
ప్రజలే ప్రభువులు అన్న నగ్న సత్యాన్ని రాజకీయ నాయకులకు ఎరుకపరచాలి.
(ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లును ఈరోజు, 20-02-2014, మధ్యాహ్నం
3-10 కి
హోం మంత్రి శ్రీ షిండే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దాదాపు అయిదు గంటలకు పైగా చర్చ జరిగింది. తరువాత విపక్షాలు డివిజన్ కోరినా సభాపతి వొప్పుకోలేదు. మూజువాణీ వోటుతో రాత్రి
8- 08 నిమిషాలకు బిల్లును ఆమోదించింది)