నమో సునామి నమో నమామి
ఇప్పుడు దేశమంతటా మోడీ అనే రెండక్షరాలే మోగిపోతున్నాయి.
ఆయన్ని గురించిన కధనాలతో పత్రికలు నిండిపోతున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన
పనితీరు గురించి ఒక మిత్రుడు పంపిన సమాచారం. ఆయనకు అంటే నా మిత్రుడికి తెలుగు తెలియదు.
మోడీ గుజరాత్ సీతయ్య. కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి
మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే
చేస్తాడు.

ఉదాహరణకు రాష్ట్రంలో
చిన్నపిల్లల్ని స్కూళ్లకు పంపేలా వారి తలితండ్రులను ప్రోత్సహించడం యెలా అన్న ఆలోచన
వచ్చిందనుకోండి. వెంటనే సంబంధిత అధికారుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ల అభిప్రాయాలను
సావధానంగా వింటారు. తమ మనసులో మాట స్వేచ్చగా ధైర్యంగా చెప్పేలా అధికారులను
ప్రోత్సహిస్తారు. మధ్యలో భోజన సమయం అయితే పదిహేను నిమిషాల్లో ఆపని ముగించుకుని
మీటింగుకు హాజరు. అందరూ చెప్పింది జాగ్రత్తగా విని తాను ఒక అభిప్రాయానికి వచ్చి ఏం
చేయాలో ఆ ఆదేశాలు జారీచేస్తారు. ఆ తరహా చూసిన వారికి ఒక మిలిటరీ అధికారి తన
సైన్యానికి ఆదేశాలు జారీ చేసే విధానం గుర్తుకు రాకమానదు. ఇక అప్పటినుంచి ఆ
కార్యక్రమం పురోగతి గురించి వెంట వెంటనే
సమీక్షా సమావేశాలు. ఎప్పటికప్పుడు పరిస్తితిని బేరీజు వేసుకుని తదుపరి ఆదేశాలు.
వేసవి సెలవుల్లో మండుటెండలను లెక్కపెట్టకుండా అధికారులను వెంటేసుకుని ఒక నెలంతా పల్లెల్లో
పర్యటించి పిల్లల చదువు ప్రాధాన్యతను గురించి ప్రతి ఒక్కరికీ వివరించే ప్రయత్నం
మరోపక్క. ఫలితం గురించి చెప్పే పని ఏముంటుంది. రెండేళ్లలో స్కూళ్ళల్లో చేరే పిల్లల
సంఖ్య ఇరవయ్యారు శాతం నుంచి నూటికి నూరు శాతానికి పెరిగిపోయింది.
దటీజ్ మోడీ
మోటివేషన్ పవర్.