ఆ సమయంలో కరెంటు వుండడం వల్ల నేను ఆసాంతం కేసీయార్
ప్రసంగాన్ని టీవీ తెరపై చూడగలిగాను. మాటల మాంత్రికుడని, మాటలతో ఎదుటి వారిని
బురిడీ కొట్టిస్తారని ఆయనకు పేరుంది. అయితే ఈరోజు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల
అభివృద్ధి సంస్థలో నవ తెలంగాణా లక్ష్యాలు
వివరిస్తూ ఆయన చేసిన ప్రసంగానికి
శ్రోతలుగా వున్నది అంత ఆషామాషీ వ్యక్తులు కాదు. మొత్తం తెలంగాణా అధికారయంత్రాంగం
ఆయన మాటల్ని ఆలకించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు, ముఖ్య
కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
బహుశా వారిలో చాలామందికి తాము ఎరిగివున్న కేసీయార్
కు బదులు కొత్త కేసీయార్ కనబడివుంటాడని టీవీలో చూస్తున్న నాకు అనిపించింది. నవ
తెలంగాణా యెలా వుండాలి అనే దానిపై ఆయన అభిప్రాయాలు యెలా వుంటాయి అనేదానిపై నాకు
అవగాహన వుంది. ఎందుకంటే ఎన్నికలకు చాలా పూర్వమే తెలంగాణా జర్నలిస్టులు
ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో ఆయన అంతరంగ ఆవిష్కరణకు నేను ప్రత్యక్ష శ్రోతను. ఇవాల్టి
సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏమి మాట్లాడింది రేపటి పత్రికల్లో వివరంగా
వస్తుంది. అంచేత ఆ వివరాల జోలికి పోవడం లేదు. కానీ ఒక్కటి మాత్రం గట్టిగా
చెప్పగలను. చెప్పదలచుకున్న అంశాలను సంగ్రహంగా, సూటిగా, అరటి పండు వొలిచి చేతిలో
పెట్టిన చందంగా చెప్పగలిగే చతురత కేసీయార్ కు వున్నట్టు వర్తమాన రాష్ట్ర రాజకీయ
నాయకుల్లో ఎవరికీ వున్నట్టు లేదు. తెలంగాణా సమస్యలపట్ల తనకు అవగాహన హెచ్చు అని
చెప్పుకుంటూనే, కొన్ని కొన్ని గణాంకాల ప్రస్తావన వచ్చినప్పుడు ఎలాటి భేషజాలకు పోకుండా పక్కనే
కూర్చున్న సేద్యపు నీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారిని అడిగి తెలుసుకుని సరిదిద్దుకున్న
విధానం గమనించినప్పుడు ఆయనలోని నిజాయితీ అధికారులకు తెలిసివచ్చింది. 'కింది
అధికారులతో, సిబ్బందితో తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ లో అడిగి బెదరగొట్టకండి'
అంటూ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసిన పద్దతి కూడా బాగుంది. 'అందర్నీ కలుపుకు
పోవడం ద్వారా మాత్రమే కన్న కలలు నిజం చేసుకోగలుగుతామని ఓ పక్క సుతిమెత్తగా
చెబుతూనే, ప్రతి విషయంలో ఆలోచన, ఆచరణ కేవలం తెలంగాణాను దృష్టిలో పెట్టుకుని
సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన తీరు పరికించినప్పుడు రానున్న రోజుల్లో ఆయన
అనుసరించబోయే ఎత్తుగడలు యెంత కఠినంగా వుండబోతున్నాయో కూడా అవగతమైంది.