31, ఆగస్టు 2017, గురువారం

పలుకే బంగారమాయెరా!... బాపూ...పలుకే...



(ఈరోజు ఆగస్టు  31,బాపూ గారివర్ధంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు)
Srinivasulu Bhattaram గారని నాకొక ఇంటర్ నెట్ మిత్రులు వున్నారు. చక్కని రాయసకాడు. సున్నితమైన హాస్యం ఆయన రచనల్లో చిప్పిల్లుతూ వుంటుంది. ఆయన నాలాగే ‘బాపూ రమణల’ వీరాభిమాని. బాపూ గారితో వ్యక్తిగత సన్నిహిత పరిచయం వున్న అదృష్టవంతులు కూడా. ఆయన ఇంటిపేరు తెలుగులో ఎలారాస్తే యేమో అని యధాతధంగా ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సివస్తోంది. బాపూ గారి గురించి ఆయన ఒక మెయిల్ పంపారు. బాపూ అభిమానులందరూ చదవాల్సిన విషయాలు అందులో వున్నాయి. కానీ శ్రీనివాసులు గారికి ఓ అలవాటు. ఆయన అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనే పంపుతారు. అంచేత మూడే మూడు పంక్తులు, వారి అనుమతి వుంటుందనే విశ్వాసంతో, కింద ఇస్తున్నాను.
“నిన్న (25-08-2013) మాటీవీలో ప్రసారమయిన ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వడం చూసాను. దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనకు అవార్డ్ అందచేసారు. అవార్డ్ ఇచ్చాక ...యాంకర్స్ ఆనవాయితీగా బాపుగారిని కొన్ని మాటలు చెప్పమన్నారు. ఆయన...అక్షరాలా ....
“కొన్ని మాటలు....” అని చెప్పి ఊరుకున్నారు.
బాపు మరణించిన రోజు... కుంచె కన్నీళ్లు కారుస్తూ వుండడం ఇంకా కళ్ళల్లో కదలాడుతూ వుంది. 
బాపు ఇక లేరు. ఇది జీర్ణించుకోవాల్సిన సత్యం. తెలుగువారి గుండెల్లో కొలువుతీరిన బాపు మరణంతో వారి గుండెలు కూడా బరువెక్కాయి. నిజానికి రమణగారి మరణంతోనే ఆయన సగం చనిపోయారు. మిగిలింది ఆయన మరణంతో పూర్తయింది.
బాపు లేకపోయినా బాపు అనే రెండక్షరాలు ఎన్నాళ్ళకూ చెరిగిపోవు. బాపు రాత ఏనాటికీ చెదిరిపోదు. బాపు బొమ్మ అందాలు ఎప్పటికీ మాసిపోవు. 
దటీజ్ బాపు...బాపు ఈజ్ గ్రేట్ 
ముళ్ళపూడివారి 'కోతికొమ్మ'చ్చికి ఆయన అభిమాన బృందం అభిమాన పురస్సర కొనసాగింపే 'కొసరు కొమ్మచ్చి' పుస్తకం. వెల కేవలం రెండువందలు. కేవలం ఎందుకంటున్నానంటే - ఇందులో అక్షరలక్షలు విలువ చేసే బాపూగారి 'రమణా నేనూ, మా సినిమాలు' అనే ముందుమాట వుంది.(ప్రతులకు నవోదయా) ఎదుటివాడిమీద జోకులేసి నవ్వుకోవడం కాదు, మన మీద మనమే జోకులేసుకుని నవ్వించే గుణం వుండాలి అనే బాపూ గారి మానసిక ఔన్నత్యానికి ఇదిగో ఒక మచ్చు తునక:
బాపూ గారి ఉవాచ:
"శంకరాభరణం ఎనభయ్ మూడోమాటు చూడ్డానికి దియేటర్ కు వెళ్ళినపుడు ఇంటర్ వెల్ లో ఇద్దరు కాన్వెంటు పాపలు పరుగునవచ్చి బుల్లి మఖమల్ అట్ట పుస్తకం ఇచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. 'పెన్ను లేదమ్మా' అన్నా. ఓ పాప బ్యాగ్ లోంచి కంపాస్ బాక్స్ తీసి అందులోనుంచి పెన్సిల్ తీసి ఇచ్చింది. నేను సంతకం పెడుతుంటే చూసి, 'మీరు విశ్వనాద్ గారు కారా' అనడిగింది. 'కాదమ్మా' అన్నా. ఆటోగ్రాఫ్ పుస్తకం లాక్కుని, ఫ్రెండుని 'ఒసే. బాక్సులో లబ్బరు వుంటుంది ఇలా తే' అంది"


దటీజ్ బాపు !

21, ఆగస్టు 2017, సోమవారం

శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ ఇక లేరు.


ఈ తెల్లవారుఝామున ఫోను మోగింది. పెద్దాయన దాటిపోయారు అని చెప్పారు వల్లీశ్వర్.  ఆదివారం రాత్రే  జ్వాలా, నేనూ కలిసి బంజారా కేర్ ఆసుపత్రికి వెళ్ళాము. ఐ.సి.యూ. లో ప్రసాద్ గారిని చూశాము. జీవితంలో ఎలాంటి బంధాలు లేకుండా బతికిన మనిషి ముక్కు, నోటికి బంధనాలతో చూస్తుంటే ఎంతో బాధ వేసింది. ఈ రాత్రి గడవడం కష్టం అనే భావన డాక్టర్ల అభిప్రాయంగా తోచింది. అయ్యో అనిపించింది. ప్రసాద్ గారి భార్య గోపిక, కొడుకు  సంజీవ్, కుమార్తె మాధవి అంతిమ ఘడియల్లో ఆయన చెంతనే వున్నారు. ఆయన వయస్సు  డెబ్బయి ఏడు సంవత్సరాలు.  ఒక్క రోజు గడిచి వుంటే డెబ్బయి ఎనిమిదిలో ప్రవేశించి వుండేవారు. ఈరోజులలో ఇదేమంత పెద్ద వయస్సేమీ కాదు. కానీ ఆయన నమ్ముకున్న తిరుపతి వెంకటేశ్వరుడికి ఆయన్ని తన దగ్గరకు పిలిపించుకోవాలనే కోరిక కలిగిందేమో. అందుకే శనివారం తెల్లవారుఝామున ఆస్పత్రిలో చేరిన ప్రసాద్ గారు ఎవరినీ కష్ట పెట్టకుండా, తనుమరీ కష్టపడకుండా దాటిపోయారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన చక్కటి రచనలను మిగిల్చిపోయారు. పుణ్యజీవితం గడిపిన ధన్యజీవి శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్.

Image may contain: 1 person, eyeglasses

నిజానికి ఆయనో ఆధ్యాత్మిక అధికారి.
ఒక ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్ కావచ్చు, సచివాలయంలో ఉప కార్యదర్శి కావచ్చు, ఎక్సైజ్ కమీషనర్ కావచ్చు, టీటీడీ ఈవో కావచ్చు, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కావచ్చు, ఏకంగా భారత ప్రధానమంత్రి సలహాదారు కావచ్చు, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ కావచ్చు, ధర్మ పరిరక్షణ సంస్థ గౌరవ అధ్యక్షులు కావచ్చు – అది ఏ ఉద్యోగం అయినా కానివ్వండి, ఏ హోదా వున్నదయినా కానివ్వండి, ఎంతటి బాధ్యత కలిగినదయినా కానివ్వండి దాన్ని ఒకే నిబద్ధతతో, ఒకే అంకితభావంతో, అంతే సమర్ధంగా నిర్వహించుకుని, నిభాయించుకుని సెహభాష్ అనిపించుకోగల అధికారులను వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఆ లెక్క తీసుకుంటే ఆ వరుసలో మొదట్లో కానవచ్చే వ్యక్తి  తన డెబ్బయి ఏడో ఏట స్వల్పకాల అస్వస్థత అనంతరం ఆగస్టు ఇరవై ఒకటో తేదీ తెల్లవారుఝామున కన్నుమూసిన పీ.వీ. ఆర్. కే. ప్రసాద్. (వారి పూర్తి పేరు పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్)    
నలుగురికే కాదు, ప్రపంచం నలుమూలల  తెలిసిన మనిషి ఆయన.  శనివారం తెల్లవారుఝామున ఆస్పత్రిలో చేరారు. అస్వస్వతకు గురయిన  సంగతి నలుగురికీ తెలిసేలోగానే, ఇరవైనాలుగు గంటలు గడిచీ గడవక ముందే, సోమవారం తెల్లవారుఝామున ఆయన  ఈ ప్రపంచాన్ని వీడిపోయారనే కబురు నేల నాలుగు చెరగులా తెలిసిపోయింది. మరణం అలా ముంచుకురావడం పుణ్యాత్ముల విషయంలోనే జరుగుతుందంటారు. అలాగే జరిగింది కూడా.
ఎన్నెన్నో బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసినా ఎలాటి మచ్చ పడకుండా నెగ్గుకువచ్చారు. తనపైవారికి కానీ, కింది సిబ్బందికి కానీ మాట రాకుండా నిప్పులాంటి నిజాయితీతో విధులను నిర్వహించారు. ఎన్ని గిరులు గీసుకున్నా,మరెన్నో బరులు తన చుట్టూ  బారులు తీరినా, ఏదైనా విషయం సమాజానికి మేలు చేసేది అని తను మనసారా నమ్మితే చాలు, అంతే! ఎలాంటి సంకోచాలు లేకుండా, ఎలాటి భేషజాలకు పోకుండా, అడ్డొచ్చే నిబంధనలను  తోసిరాజనికూడా ప్రజాక్షేమానికి పెద్దపీట వేసే గుండె ధైర్యం ఆయన సొంతం. ఇలాటి విషయాల్లో యువ ఐ.ఏ.ఎస్. అధికారులకు ఆయన చక్కని స్పూర్తి ప్రదాత. నిబంధనల పేరుతొ అధికారుల్లో వుండే చొరవను చిదిమేయవద్దని ప్రసాద్ గారు తరచుగా అంటుండేవారని ఆయన కింద పనిచేసిన ఓ అధికారి గుర్తు చేసుకున్నారు. యువ అధికారులు చొరవ తీసుకుని చక్కని ఫలితాలు రాబట్టే క్రమంలో కొన్ని కొన్ని పొరబాట్లు చేసినప్పుడు ఆయన పెద్ద మనసుతో సర్దిపుచ్చేవారు. నల్గొండ జిల్లాలో ఎస్.ఎఫ్.డి.ఏ. అధికారిగా పనిచేస్తున్నప్పుడు సన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించే ఒక పధకం అమల్లో ఆయన అలాంటి  చొరవనే తీసుకున్నారు. ఆ జిల్లాలో  అయన వేసిన కొత్త బాటకు దేశవ్యాప్త ప్రచారం లభించింది. ఢిల్లీలో  జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి స్వయంగా నల్గొండ ప్రయోగం గురించి ప్రస్తావించిన విషయాన్ని నాటి ముఖ్యమంత్రి శ్రీ పీ.వీ. నరసింహారావు గారు స్వయంగా పీవీఆర్కే చెవిన వేశారు. ఈ సంగతిని ఆయన తన అనుభవాల గ్రంధంలో రాసుకున్నారు కూడా.
“అకీర్తిం చాపి భూతాని కధయిష్యంతి తేవ్యయామ్
సంభావితస్యచా కీర్తిర్మరణా దతిరిచ్యతే”
“ప్రజలెప్పుడూ నీ అపకీర్తి గురించే చెప్పుకుంటారు. ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దుర్భరమైనది”
భగవద్గీతలో గీతాకారుడు చెప్పిన ఈ సూక్తిని శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ తన జీవిత పర్యంతం మనసా వాచా కర్మణా గుర్తుంచుకుని జీవన యానం సాగించారేమో అనిపిస్తుంది ఆయన జీవితాన్ని తరచిచూస్తే.
“నాహం కర్తా హరి:కర్తా”
(నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా శ్రీహరే!)
ఇదీ శ్రీ ప్రసాద్ గారి నమ్మకం. అందుకే కాబోలు తన తిరుపతి అనుభవాల గ్రంధానికి దీన్నే మకుటంగా పెట్టుకున్నారు.


16, ఆగస్టు 2017, బుధవారం

A proud father about his proud daughter:



"Today marks an important and exciting day for us. As I have informed you earlier, Sakhi got selected as the Fashion Ambassador for Nordstrom - a leading high end fashion retailer headquartered in Seattle.

"As fashion ambassador, she will learn the ropes of how the retail and fashion industries work - a non paid training for the remainder of her year.

"On her first day as fashion ambassador at Nordstrom, she talked to her trainer and asked if she can actually work in a paid capacity. She got a employment form home and filled it up herself, scheduled a phone interview the following week and then went for an in-person interview yesterday.

"Today, she was offered a job as a Sales associate at Nordstrom and she starts working from Aug 22.

"I can't believe that my young girls are already standing on their own legs and giving flight to their dreams. As parents we cannot but feel proud because we aspire for our kids to be better than us, go further than us, attain more success than us - and live better than us!

"Pls join me in wishing Sakhi the best of everything as she starts her first job! I am super happy because she is starting in sales (my career path) and I wish she not only learns the ropes but continues to live life to the fullest, fulfilling her dreams!⁠⁠⁠⁠"


(Sakhi Bhandaru, Seattle)



My wife and myself also feel proud of them because he is our  son Sandeep Bhandaru and she is our grand daughter Sakhi.    ⁠⁠⁠⁠

15, ఆగస్టు 2017, మంగళవారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(14)

భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన 


మా  బామ్మ రుక్మిణమ్మ గారికి ముగ్గురు కుమార్తెలు. ఆమె పెద్ద కుమార్తె అంటే మా పెద్ద మేనత్త రంగనాయకి భర్త, ఖమ్మం జిల్లాకు చెందిన కొలిపాక లక్ష్మీ నరసింహారావు గారు. నరసింహారావుగారి అన్నగారు కొలిపాక శ్రీరాం రావు గారు వరంగల్లులో పెద్ద వకీలు. ఈ అన్నదమ్ములకు ఇద్దరికీ ఖమ్మం, వరంగల్ జిల్లాలలో వందల ఎకరాల భూమి.  మా పెద్ద మేనత్త మొగుడు పెద్ద లాయరు కూడా. పిత్రార్జితంతో పాటు వకీలుగా మంచి పేరు, గట్టి ఆస్తులు సంపాదించారు. లక్ష్మీ నరసింహారావు గారి పెద్ద కుమారుడు రామచంద్ర రావు గారికి మా రెండో అక్కయ్య శారదను మేనరికం ఇచ్చారు. రెబ్బారంలో గ్రామంలో విద్యా సౌకర్యాలు విస్తరించడానికి ఆ గ్రామ సర్పంచుగా మంచి కృషి చేశారు. రెబ్బారం హైస్కూలు ఆవరణలో ఇటీవలే ఆయన స్మృత్యర్ధం శిలా విగ్రహం నెలకొల్పారు.
రెండో మేనత్త ఖమ్మం లో పెద్ద వకీలు, పెద్ద భూస్వామి అయిన పర్చా శ్రీనివాసరావు గారి భార్య. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఆయనకు పెద్ద బంగ్లా వుండేది. అది పాత తెలుగు సినిమాల్లో జమీందారుల భవనంలా కనిపించేది. ఎత్తయిన మెట్లెక్కి పైకి వెళ్ళగానే ఎదురుగా ఒక పెద్దహాలు, దానికి ఇరువైపులా వరండాలు, మళ్ళీ వెనకవైపు మరో హాలు, ఇరువైపులా గదులు ఇలా చాలా విశాలంగా వుండేది. ఆయన ఆఫీసు గదిలో ఒక సీలింగు ఫ్యాను వుండేది. సీలింగు ఎత్తుగా వుండడం వలన అవసరం అయినప్పుడు ఫ్యానును కిందికి దించుకునే ఏర్పాటు వుండేది. మా మేనత్త మొగుడు కూర్చునే వకీలు కుర్చీ, దానికి ఎదురుగా పెద్ద మేజా బల్ల, అటూ ఇటూ క్లయింట్లు కూచోవడానికి కుర్చీలు చాలా అట్టహాసంగా ఉండేవి. ఆయన ప్రాక్టీసు కూడా అలానే వుండేది. ఇది కాక ఖమ్మం జిల్లాలో వాళ్ళ స్వగ్రామంలో భారీ ఆస్తులు ఉండేవి. దానికి ఆనుకుని ఉన్న కృష్ణా జిల్లాలోని గ్రామాల్లో కూడా భూములు ఉండేవి. వాటిమీద వచ్చే అయివేజు కూడా భారీగానే వుండేది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. పీవీ నరసింహా రావు గారితో ఆయనకు మంచి సాన్నిహిత్యం వుండేది. ప్రధాని అయిన తరువాత కూడా పీవీని పేరుతొ సంబోధించే చనువు ఉన్న మనిషి శ్రీనివాసరావు గారు. ఆడపిల్లలకు విద్య ఆవశ్యకతను గుర్తించి ఆయన ఖమ్మంలో  బాలికల పాఠశాల ఏర్పాటుకు ఆయన దోహదపడ్డారు.
దాదాపు  తొంభై ఏళ్ళ వయస్సులో కూడా చెల్లమ్మగారు, మా బామ్మగారు పచ్చి మంచి నీళ్ళు సైతం ముట్టకుండా నిష్టగా ఉపవాసాలు చేసేవాళ్ళు. మళ్ళీ భారత భాగవతాలు చదవడం, యాత్రలు చేయడం అన్నీ ఉండేవి.  మా బామ్మ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ యాత్రలు అన్నీ చేసింది. చెల్లమ్మ గారు మాకు బుద్ధి తెలిసిన తరువాత ఎటూ వెళ్ళేది కాదు. ఎప్పుడూ కంభంపాడులోనే తావళం తిప్పుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూ, పిల్లలకు భారత, భాగవతాల్లోని పద్యాలు, కధలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేది. పొద్దుగూకేవేళకు  పిల్లలందరూ  ఆమె మంచం చుట్టూ మూగేవాళ్ళు. ఈ రోజు భండారు వంశంలో చాలామందికి పురాణాల మీద పట్టు చిక్కడానికి, సంస్కృతీ సంప్రదాయాలపట్ల అవగాహన కలగడానికి చెల్లమ్మగారి  ప్రవచనాలే కారణం. మా వూళ్ళో అప్పుడు పాతిక, ముప్పయిదాకా బ్రాహ్మణ గడప వుండేది. మూడు పంచాంగాలు మా వూరినుంచి వెలువడేవి. మా చిన తాతగార్లు ఇద్దరు సనాతన సంప్రదాయవాదులు. ఆ రోజుల్లో వైదికులు  చనిపోతే  వైదికులే మోయడం, నియోగులు పోతే నియోగులే మోయడం వుండేది. సామాన్యంగా ఒకరికొకరు శవవాహకులుగా వుండేవారు కాదు. అలాటిది చెల్లమ్మగారు పోయినప్పుడు వైదీకులు అయిన ఇంగువ వెంకటప్పయ్యగారు కూడా ముందుకు వచ్చి మోశారు. అప్పటికి మా నాన్నగారు పోయారు కాబట్టి నేనే (భండారు పర్వతాలరావు) అంత్యక్రియలు చేశాను. ఆమె ఎంతో పుణ్యాత్మురాలు. పరమ భాగవతోత్తమురాలు. సతతం రామనామ స్మరణలోనే జీవితం వెళ్ళతీసింది’ అని వెంకటప్పయ్య గారు అనేవారు.
ఇక మా అమ్మా నాన్నలు గురించి కొంత రాయాలి. మా నాన్న రాఘవరావు (వూళ్ళో అందరూ రాఘవయ్య గారు అని పిలిచేవాళ్ళు).
మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907  నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని  చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని   ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి  గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.
మా నాన్నగారు రాఘవరావుకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు, వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన  సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాదని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈనాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.
అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.

కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన  పూర్ణ జీవితం గడిపింది.”
(ఇంకావుంది)

14, ఆగస్టు 2017, సోమవారం

శభాష్ ప్రకాష్! – భండారు శ్రీనివాసరావు



"సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడుపడవోయ్‌" అన్న గురజాడ వారి మాటను ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు ఈ ప్రకాష్.
ఇంతకీ ఈ ప్రకాష్ ఎవరంటే!
ముందు ఓ కధ చెప్పుకోవాలి.
ఒకాయన ఒక రోజు స్కూటరు మీద వెడుతుంటే టైరులో గాలి తగ్గినట్టు అనిపించి రోడ్డుపక్కన ఓ టైర్ పంక్చర్ షాపు ముందు ఆగాడు. ఈ ఒకాయన్ని చూడగానే ఆ మెకానిక్కు లేచివచ్చి, ‘మీరలా ఆ స్టూలు మీద కూర్చోండి, నిమిషంలో మీ బండి పని నేను చూస్తాను’ అన్నాడు మర్యాదగా.
ఎందుకో ఏమిటో కానీ, నాలుగయిదు చిన్న రోడ్లు పెద్దరోడ్డులో కలిసే ఆ చౌరాస్తాలో వున్నట్టుండి ట్రాఫిక్ జామ్ అయింది. కార్లూ, స్కూటర్లూ, మోటారు సైకిళ్ళు, సిటీ బస్సులు నడిపేవాళ్ళు ఎవరికి వాళ్ళు ముందుకు పోవాలని తొందర పడడంతో అవన్నీ ఎక్కడికి అక్కడ అడ్డదిడ్డంగా  నిలిచి పోయి, ఆ ప్రాంతం అంతా హారన్లతో మారుమోగుతోంది. ఆ ఒకాయన అటు నుంచి ఇటు చూపు మరల్చి చూస్తే, ‘ఒక్క నిమిషం’ అన్న ఆ మెకానిక్కు పత్తాలేడు. ఆ ఒకాయనకు కోపం ముక్కు మీద  నుంచి నోటివరకు వచ్చి, ఆ నోరు ఆయొక్క  మెకానిక్కును  నానా మాటలు అనడానికి సిద్ధం అయ్యేలోగా ఒక దృశ్యం అతగాడి కంటబడింది. అది చూస్తూనే తెరుచుకోబోతున్న అతడి నోరు టక్కున మూసుకుంది. ఆ  వెంటనే ఆశ్చర్యంతో మళ్ళీ తెరుచుకుంది. ఇంతకీ ఆ దృశ్యం ఏమిటంటే ...
గాలి పంపు పక్కన పడేసి, చేతిలో ఒక బెత్తం  లాంటిది పట్టుకుని ఆ మెకానిక్కు, పద్మ వ్యూహంలో చొరపడ్డ అభిమన్యుడిలా, చిక్కుముడిలా చిక్కుపడ్డ ఆ వాహనాల మధ్యకు దూరిపోయి, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత భుజానికి ఎత్తుకున్నాడు. పది ట్రాఫిక్ సిగ్నల్స్, పదిమంది ట్రాఫిక్ పోలీసులు చేసే పని అతడు చిటికెలో చేసి, అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్  ను చక్కదిద్ది, మళ్ళీ వచ్చి తన పనిలో మునిగిపోయాడు.
తొందరగానే పని ముగిసినందుకు సంతోషపడుతూ ఆ ఒకాయన తనలో తను అనుకున్నాడు.
“ఇంకా నయం! తొందరపడి ఈ ‘పెద్దమనిషి’ పై మాట తూలాను కాదు.
చూసారా! మంచితనం మనుషుల్ని ఎలా పెద్దవాళ్ళను చేస్తుందో.


(నమస్తే తెలంగాణా  హైదరాబాదు, సిటీ  ఎడిషన్, 14-08-2017)


(నిన్న ‘నమస్తే! తెలంగాణా’లో ఈ ప్రకాష్ గురించి ‘శభాష్ ప్రకాష్’ అనే కధనం (పిల్ల పత్రికలో, సిటీ ఎడిషన్ కు తెలుగు అనువాదం అన్నమాట) వచ్చింది.
కాకపొతే ఇలా కాదు, వేరేగా. (ఇది నా  స్వకపోల వాస్తవం)
మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలాటివారితో పక్కన నిలబడి సెల్ఫీలు దిగడం అనే మోజు లేని నేను, ఈ ప్రకాష్ పక్కన ఒక ఫోటో తీయించుకుంటే ఎలా వుంటుంది అని మనసు పడ్డ మాట మాత్రం నిజం.
ఇలాటి రోడ్డు సైడు హీరోల గురించి రాసిన ‘నమస్తే! తెలంగాణా’ పత్రిక్కి ధన్యవాదాలు.
పొతే మనలో మాటగా ఇంకో మాట. కవులు, కళాకారులు, ఇలా అనేక రంగాల్లో వారిని గుర్తించి వారిలోని ప్రతిభకు గుర్తింపుగా పురస్కారాలు అందించే ప్రభుత్వాలు, ఇటువంటి వారిని కూడా ఏదో ఒక పేరుతొ పౌర పురస్కారం అందిస్తే యెంత బాగుంటుంది? 

అత్యాశ అయితే కాదు కదా! 

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(13)



భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన

మా కుటుంబం మొత్తంలో మా చిన్న తాతగారు   భండారు సుబ్బారావుగారి తరహానే  వేరు. సుబ్బయ్య తాతగారిది  ఆధ్యాత్మిక దృక్పధం. జాలిగుండె. ఎవరికి కష్టం వచ్చినా చూడలేడు. కాకపొతే ప్రధమ కోపం. కాని అది తాటాకు మంట లాటిది. ఇట్టే ప్రజ్వరిల్లినా మళ్ళీ అట్టే చల్లారిపోయేది. చిన్నతనంలో చాలా దుడుకు మనిషి అని పేరు కాని పెద్దయిన తరువాత  చాలా మారిపోయాడు.
 పిల్లలు లేని కారణంగా వూళ్ళో అందర్నీ పిల్లలుగా చూసుకునే వారు. కష్టసుఖాలు గమనించి సాయం చేస్తూ  వుండేవారు. తరచుగా సతీసమేతంగా తీర్ధయాత్రలు చేస్తుండేవారు. కాశీ రామేశ్వరాలు తిరిగివచ్చిన పుణ్యశాలి. ఆయన భార్య సీతమ్మ గారు  కందిబండ వారి ఆడపడుచు. భర్తకు జడియడమే సరిపోయేది. ఆ రోజుల్లో భార్యలపై చేయిచేసుకోవడం వుండేది. కాని మా తాతగారికీ, నాన్నగారికీ అది అలవడలేదు. అయితే మా చినతాతలిద్దరికీ ఆ అలవాటు వుండేది. సుబ్బయ్య తాతగారు మాత్రం ఆవేశంలో ఏదయినా తప్పుచేస్తే  వెంటనే పశ్చాత్తాపం చెందేవాడు. ఎవరిమీద అయినా చేయి చేసుకుంటే ముందు బావి దగ్గరకు వెళ్లి తలస్నానం చేసి జందెం మార్చుకునేవాడు. అంతేకాదు. ఆ కొట్టిన వాడిని పిలిపించి మానెడు జొన్నలు ఇచ్చి పంపేవాడు. బీదాబిక్కీ ఎవరికయినా పనిదొరక్కపోతే, ‘ఇవాళ సుబ్బయ్యగారితో నాలుగు దెబ్బలు తిన్నా బాగుండుఅనుకునేవారు. అంతేకాదు ఎవరయినా అప్పు అడగడమే తరువాయి, లేదనకుండా వెంటనే వందా రెండొందలు  ఇచ్చేవాడు. అసలు, వడ్డీ కలిపి ఎంతవుతుందో లెక్క కట్టి, ఎవరికెంత ఇచ్చిందీ వివరాలన్నీ పెన్సిల్ తో గోడమీద రాసేవాడు. ఒకసారి మరచిపోయి సున్నం కొట్టించాడు. అంతే!  మొత్తం పద్దులన్నీ మాఫీ. అప్పులు మాఫీ చేసే విషయంలో చరణ్ సింగుకు దోవ చూపించింది సుబ్బయ్య తాతయ్యే అనవచ్చు.


(సుబ్బయ్య తాతయ్య, సీతం బామ్మ దంపతులు, వారి నడుమ వాళ్ళు దత్తత తీసుకున్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు, పాత ఫోటో)



"ఒకసారి  మా చినతాత గారు భండారు సుబ్బారావు గారికి రైల్లో ఒక యువ సాధువు  కలిశాడు. ఆయన వర్చస్సు, పాండిత్యం చూసి మా చిన తాతగారు ముగ్ధుడై ఆయనను కంభంపాడు తీసుకు వచ్చారు. ఆ సన్యాసి పేరు శ్యాం ప్రకాష్ బ్రహ్మచారి. ఆయనను అంతా కాశీ స్వాములవారు అనేవారు.
ఆయన మా వూళ్ళో ఒక ఆశ్రమం స్థాపించారు. స్వామి  వారు హోమియో వైద్యం కూడా చేసేవారు. ఆయన బోధనలు విని మా తాతగార్లు తలా కొంత పొలం ఆయన గారి ఆశ్రమానికి దానంగా ఇచ్చారు. అందులో కొంత భాగంలో ఆయన తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే  ఒక వేద పాఠశాలను కూడా నిర్వహించారు. అదంతా బహుశా 1930-40 ప్రాంతాల్లో కావచ్చు. ఆ కార్యకలాపాలతో శ్రీ మండాలపాటి నరసింహారావుగారికీ, విజయవాడ న్యాయవాది శ్రీ  దంటు శ్రీనివాస శర్మ గారికీ సంబంధం వుండేది. మా సుబ్బయ్య తాతగారు సతీ సమేతంగా కొన్నాళ్ళు ఆశ్రమంలోనే కాపురం పెట్టారు.    స్వాములవారు కొన్నాళ్ళు మండాలపేటలోను ఆ తరువాత కొవ్వూరులోను వున్నారు. పూరీ గోవర్ధన మఠం పీఠాధిపతిగా కూడా వున్నారు. ఆయన అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించి కాశీ నుంచి తెచ్చిన శివ లింగాన్ని అక్కడ ప్రతిష్టించారు. అదిప్పుడు శిధిలావస్థకు చేరుకోవడంతో ఈ మధ్యనే మా రెండో తమ్ముడు భండారు రామచంద్రరావు పూనిక వహించి ఆ గుడిని  ఓ మేరకు అభివృద్ధి చేసి ఒక  పూజారిని నియమించి ఆ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా కొంత మొత్తం పంపుతున్నాడు. ఆశ్రమం మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ఆశ్రమానికి మా పూర్వీకులు ఇచ్చిన పొలం ప్రభుత్వం తీసుకుని ఆ  ప్రదేశంలో షెడ్యూల్డ్ కులాలవారికోసం ఒక పెద్ద కాలనీ నిర్మించింది. దానం చేసిన స్థలం అలా ఒక సత్కార్యానికి ఉపయోగపడడం సంతోషదాయకం. పునరుద్ధరించిన ఆలయానికి మా తమ్ముడు  రామచంద్ర రావు ట్రస్టీగా వున్నాడు.
మా నాన్నగారికీ, లక్ష్మయ్య తాతయ్య గారికీ నడుమ జరిగిన తగాదాల్లో సుబ్బయ్య తాతయ్య ఎప్పుడూ నాన్న పక్షానే నిలబడేవాడు. నాన్నగారికి సుస్తీ చేసిన సమయంలో ఆయన ఎంతో ఆదుకున్నాడు. అప్పులన్నీ తీర్చి వేసాడు. చికిత్స గురించి శ్రమ పడే వాడు. ఒకసారి, అప్పుడు నాకు (భండారు పర్వతాలరావు) పదిహేడు ఏళ్ళు ఉంటాయేమో. సందర్భం జ్ఞాపకం లేదు కాని అనవసరంగా ఆవేశపడి ఆయనతో మాట తూలాను. నా మాటల్లో తీవ్రత చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడే కాని కోపం తెచ్చుకోలేదు. తరువాత  నా తప్పు నేనే తెలుసుకున్నా.  ఆయన మనస్సు గాయపడింది అన్న విషయం కూడా నాకు బోధపడింది. చాలామందికి తెలియదు కాని, నాది కోపిష్టి  మనస్తత్వం. అనాలోచితంగా, అనుచితంగా ప్రవర్తించడం, పెద్దవారిని నొప్పించడం దురదృష్టవశాత్తు పరిపాటి అయిపోయింది. భోలాశంకరుడుగా పేరున్న సుబ్బయ్య తాతయ్య గారికి చివరి రోజుల్లో భగవంతుడు పరీక్షలు పెట్టాడు. ఆయన భార్య సీతమ్మగారు పక్షవాతంతో తీసుకుని మరణించింది. ఆయనకు  కూడా పెద్దతనంలో ఒక కాలూ చేయీ పడిపోయింది. ఆయన ఔదార్యం మళ్ళీ, ఆయన పెంపకానికి తీసుకున్న మా రెండో తమ్ముడు రామచంద్రరావుకు వచ్చింది. మొత్తం కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కనిపెట్టి చూసే మంచి బుద్ధిని దేవుడు వాడికి ప్రసాదించాడు. దత్తు పోవడంవల్ల అదనంగా వచ్చిన ఆస్తిపాస్తులను కూడా ఎప్పుడూ తన సొంతం అనుకోలేదు. ఈ సద్బుద్ధి మా తమ్ముడి పిల్లలకు కూడా వుండడం వల్ల ఆస్తుల విషయంలో, మా కుటుంబంలో ఎలాటి పొరపొచ్చాలు తలెత్తలేదు. మా నాన్నగారు, తాతగారు పోయి అనేక దశాబ్దాలు గడిచినా ఇంతవరకు మా మధ్య , మా పిల్లల  మధ్య ఆస్తి పంపకాలు జరగలేదు. కంభంపాడు ఇల్లు, పొలాలకు సంబంధించి ఈనాటి వరకు మాది ఉమ్మడి కుటుంబమే. తమ్ముడు రామచంద్రరావు భార్య విమల కూడా,  మంచానపడిన  మా సుబ్బయ్య తాతగారికి చివరి రోజుల్లో ఎంతో సేవచేసింది.

అదేమిటో ఖర్మ తెలియదు కాని, మా కుటుంబంలో మగవాళ్ళు చివరి రోజుల్లో మంచానపడి, అవస్థలు పడి తీసుకుని తీసుకుని  పోయారు. మా నాన్నగారు దాదాపు మూడునెలలు మంచంలో వున్నాడు. లక్ష్మయ్య  తాతగారి పరిస్తితి మరీ దయనీయం. చెట్టంత ఎదిగిన మనుమడు సత్యమూర్తి ఆయన కళ్ళముందే అకాల మరణం చెందడం దారుణం. అందరిలోకి అదృష్టవంతురాలు లక్ష్మయ్య తాతగారి భార్య వరమ్మగారు. చనిపోయేముందు మొగుడి కాళ్ళు తన దగ్గర పెట్టుకుని, అందరికీ అన్నీ అప్పగింతలు పెడుతూ, ఏదో రైలుకు వెళ్ళేదానిలా హాయిగా అనాయాసంగా దాటిపోయింది. (ఇంకా వుంది)

13, ఆగస్టు 2017, ఆదివారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(12)



భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన


“పర్వతాలయ్య గారి తమ్ముడు లక్ష్మీనారాయణ గారు వ్యవహార దక్షుడు. వూళ్ళో తగాదాలు వస్తే ఆయన దగ్గరకు వచ్చి పంచాయితీ పెట్టేవారు. సన్నగా,పొడుగ్గా, నిటారుగా ఉండేవాడు. ఎనభయ్ నాలుగేళ్ళకు పైగా జీవించాడు. ఆయనకు సంతానం కలగలేదు. మా పినతండ్రి రామప్రసాదరావు గారిని దత్తు తీసుకున్నారు. మా తాతగారు పర్వతాలయ్య గారు బండ్లు కట్టుకుని భద్రాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చారు. బహుశా ఆయనకు భద్రాద్రి రామునిపై వున్న భక్తి కారణంగా మా నాన్నగారికి రాఘవరావు అనీ, మా బాబాయికి రామప్రసాదం అనీ పేరిడి ఉండవచ్చు. ఆయనకు కనకమ్మగారని మేనత్త (రామయ్యగారి సోదరి) వుండేది. గోపినేనిపాలెం  రాజయ్యగారు ఆమె కొడుకే అనుకుంటా. వల్లభి వాస్తవ్యులు అయితరాజు గోపాలరావు గారి భార్య, భండారు కామేశ్వర రావు గారి అత్తగారు జగ్గమ్మక్కయ్య, కనకమ్మగారి సంతతికి చెందినదే. తాయమ్మ, లచ్చమ్మ గార్లు ఆయన తోబుట్టువులు. లచ్చమ్మగారు సుబ్బయ్య తాతయ్య రేకుల ఇంట్లో వొంటరిగా ఉంటూ వొండుకుని తింటూ అకస్మాత్తుగా చనిపోయింది. అంతా పురుగు చేష్ట (పాము కాటు వంటిది) అనుకున్నారు. ఆమెకు సంతానం లేదు. బాల వితంతువు. డాక్టర్ జమలాపురం రామారావు (అంతా రాములు మామయ్య అంటారు. గమ్మతేమిటంటే చిన్నా పెద్ద అందరికీ ఆయన రాములు మామయ్యే.) ఆయన తాయమ్మ గారి సంతానం. పర్వతాలయ్యగారు బతికుండగా లోలోపల రగులుతూ వచ్చిన విబేధాలు ఆయన పోగానే ఒక్కసారి భగ్గుమన్నాయి. మా తాతగారిలా మా నాన్నగారు సర్దుకుపోయే మనిషి కాదు. మా బామ్మగారిలాగే ఆయనకూడా ఒకరికి  లొంగి వుండే రకం కాదు. గ్రామానికి ఎవరు వచ్చినా మా ఇంటనే భోజనం చేసేవారు. హోటళ్ళు అవీ లేని రోజుల్లో అలాటి ఆదరణ ఎంతో ఆకట్టుకునేది. మా ఇంట్లో భోజనం చేసిన అధికారులందరూ మా నాన్న అన్నా, మా కుటుంబం అన్నా ఆదరాభిమానాలు చూపేవారు. మా నాన్నగారికి అధికారుల వద్ద ప్రాపకం అల్లా లభించిందే కాని ఒకరి సిఫారసు వల్ల కాదు. 
అప్పటిదాకా గ్రామంలో తిరుగులేని పెద్దరికం లక్ష్మీనారాయణ గారిది. అంటే మా రెండో తాతగారిది.

(కుటుంబ సభ్యులతో లక్ష్మయ్య తాతయ్య)

ఆయనది విచిత్రమైన మనస్తత్వం. మీరేఅని పెద్దపీట వేసి పిలిస్తే ప్రాణం ఇచ్చేమనిషి.  తన మాట కాదంటే, వాడి అంతు చూసే రకం. ఏది చేసినా కుటుంబంలో పెద్దవాడినయిన (పెద్దవాడు పర్వతాలయ్య కాలం చేసాడు కాబట్టి) తనని సంప్రదించి చేయాలన్నది ఆయన కోరిక. అయితే మా నాన్నగారికి తనకు తోచింది చేయడం అలవాటు. ఒకరిని సలహా అడగడం తక్కువ. ఇద్దరూ వ్యవహారదక్షులు, స్వతంత్రులు కావడంతో వాళ్ళ మధ్య సామరస్యం ఎక్కువకాలం సాగలేదు. పరిస్తితి మాట పట్టింపులతో మొదలయి, క్రమంగా మాటలు లేకపోవడం దాకా వచ్చింది. ఆ శతృత్వం  15,20 ఏళ్ళపాటు సాగింది. ఈ లోపల ఇద్దరి నడుమా ఓ అరవై డెబ్బయ్ కేసులు, దావాలు నడిచివుంటాయి. ఈ గ్రంధం  నడిచినన్నాళ్ళు వేమిరెడ్డి సోదరులు అయిదుగురూ మా నాన్నగారి  పక్షాన పెట్టని కోటలా నిలబడ్డారు. మునసబు వాసిరెడ్డి అక్కయ్య గారు కూడా మా నాన్నగారి వైపే వుండేవారు. మునసబు కరణాలు కలిసి వస్తుంటే మా రాములు మామయ్య సరదాగా అక్కయ్య, బావయ్య  వస్తున్నారని నవ్వేవాడు.
మగవాళ్ళ మధ్య ఇంతగా వైరాలు నడుస్తున్నా, పిల్లలు కలిసి ఆడుకోవడానికి కాని, ఆడవాళ్ళు కలిసి మంచి నీళ్ళ బావికి వెళ్ళడానికి కాని, మధ్యాహ్నం వేళల్లో కలిసి కూర్చుని కాలక్షేపానికి పచ్చీసు ఆడుకోవడానికి కాని మగవాళ్ళు అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. లక్ష్మయ్య తాతయ్య గారి భార్య వరలక్ష్మి ( అంతా వరమ్మగారనేవారు, మేమంతా వరం బామ్మ అనేవాళ్ళం) ఎంతో ఆప్యాయత, ఆపేక్ష కలిగిన  మనిషి. మమ్మల్నీ, వాళ్ళ పిల్లల్నీ సమంగా చూసేది. మా నాన్నగారికి మేము పదకొండుమందిమి. ఏడుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలం. మా ప్రసాదం బాబాయి గారికి ఒక్కడే కొడుకు సత్యమూర్తి. ఆడపిల్లలు ఇద్దరు, సుగుణ, మధుర. మేమంతా ఎంతో స్నేహంగా, కలివిడిగా వుండేవాళ్ళం. నేనూ (పర్వతాలరావు) సత్యమూర్తి అన్నయ్య  చాలా  స్నేహంగా వుండేవాళ్ళం. మా రెండిళ్ళ నడుమ తగాదాలను గురించి మేం కాలేజీలో చదివేటప్పుడు తరచూ చర్చించుకునేవాళ్ళం. మనం పెద్దవాళ్ళం అయిన తరువాత అలాటి గొడవలను ఇక ససేమిరా రానీయ వద్దుఅని దీక్ష పూనాం కూడా. ఆవిధంగానే, తగాదాలు, గొడవలు అన్నీ పెద్దవాళ్ళతోటే పోయాయి.


(సత్యమూర్తి అన్నయ్య) 


సత్యమూర్తి  అన్నయ్య మాకే కాక ఊరంతటికీ పెద్ద అండగా ఉండేవాడు. సహాయకారి. పైపెచ్చు ధైర్యశాలి కూడా. దేనికీ భయపడే తత్వం కాదు. రాజకీయాల్లో తిరిగినా, హింస, దౌర్జన్యాలకు తావులేకుండా సామరస్య పూర్వకంగా వ్యవహారాలు నడిపేవాడు.  మా వూరి పంచాయతీకి మొట్టమొదటి సర్పంచ్ గా పనిచేసాడు. గ్రామాభివృద్ధికి బాగా పాటుపడ్డాడు. కాకాని వెంకటరత్నం గారికి ఏకలవ్య శిష్యుడు. చదువుకోసం వెళ్ళిన నన్ను తప్పిస్తే ఆయనే మా వూరునుంచి  హైదరాబాదు వ్యవహారరీత్యా వెళ్లి వచ్చిన మొదటి వాడు. ఆయన హైదరాబాదులో బస్సు దిగి నేరుగా ఖైరతాబాదులో, కాకాని వెంకట రత్నం గారు మంత్రిగా వున్న ఇంటికి వెళ్ళిపోయేవాడు. వూరికి తిరిగి వచ్చిన తరువాత హైడ్రాడ్’ (ఆయన ఉచ్చారణ అలానే వుండేది) విశేషాలను వైన వైనాలుగా వివరంగా చెప్పేవాడు. ఊరివారందరు గుమికూడి ఆ సంగతులన్నీ ఆసక్తిగా వినేవారు. ఊళ్ళోకి కరెంటు తీసుకు రావడానికి, రోడ్డు పడడానికి ఎంతో శ్రమ పడ్డాడు. గుండె జబ్బుతో ఆయన అకాల మరణం చెందకపోతే, మా వూరికి ఆయన తిరుగులేని నాయకుడిగా ఉండేవాడు. వూళ్ళో కలిగిన వాళ్ళే కాకుండా బీదాబిక్కీ కూడా ఆయన్ని విపరీతంగా అభిమానించేవారు. ఆయన చనిపోయినప్పుడు వారంతా తాము దిక్కులేని వాళ్ళు అయిపోయినట్టు దుఖించారు. ఆయన మృత దేహాన్ని మోసే హక్కు  మీకే కాదు మాకూ వుందని ఇంటి వాళ్ళతో పోట్లాడి చివరకు అందరు కలసి స్మశానానికి తీసుకువెళ్ళి దహనం చేసారు. మేమందరం నిమిత్తమాత్రులుగా చూస్తూ ఉండిపోయాం. ఆరోజుల్లో స్మశానాలకు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కాని అదేమిటో ఆరోజు వూరు వూరంతా తరలివచ్చింది. అక్కడ కులబేధం అని కాని, చిన్నా పెద్దా అని కాని  లేకుండా అంతా ఆయన చితిలో కట్టెపుల్లలు వేయడానికి తొక్కిసలాడారు. మేమంతా ఆయన పిల్లలమేగా, ఆయన చితికి నిప్పంటించే కర్తవ్యం మాకు లేదాఅంటూ షెడ్యూల్డ్ కులాలవారు పెద్దగా ఏడుస్తూ  ఆయన చితిపై కొరవులు వేయడం అందరి హృదయాలను కదిలించింది. అంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న సత్యమూర్తి అన్నయ్య ధన్యజీవి. చిరంజీవి. ఇప్పటికీ గ్రామంలో ఏదయినా సమస్య తలెత్తితే సత్యమూర్తి గారు ఉంటేనా ..అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది. (ఇంకా వుంది)